Thursday, 16 October 2025
త్రయోదశి అధ్యాయము…ఫలము
భగవద్గీతలోని పదమూడవ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము.
శ్లోకము....
గీతా త్రయోదశాధ్యాయ ముద్గిరన్తమనారతమ్।
తతస్తచ్ఛ్రవణాదేవ ముక్తా శ్వపచవిగ్రహాత్॥
పూర్వము ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది.ఆమె ఎప్పుడూ తప్పుదోవలో నడుస్తూ,దురాచారిణిగా వ్వవహరించేది.దాని పర్యవసానంగా,మరుజన్మ లో ఛండాల స్త్రీగా పుట్టింది.అప్పట్లో జృంభకా దేవాలయము ఉండేది.అదేవాలయంలో వాసుదేవుడు అనే అతను నిత్యమూ భగవద్గీతలోని పదమూడవ అధ్యాయము పారాయణ చేస్తుండేవాడు.ఈ ఛండాలి నిత్యమూ అతనినోట ఆ అధ్యాయము వింటూ ఉండేది.దాని ప్రభావము వలన ఆ జన్మలోనే సద్గతి పొందగలిగింది.
Wednesday, 15 October 2025
ద్వాదశ అధ్యాయము…ఫలము
భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయము భక్తి యోగము.దీని పారాయణ ఫలము రహోజ్ఞానము మరియు దివ్య శక్తులు.
పూర్వము ఒక రాజు ఉండేవాడు.అతని కుమారుడు లక్ష్మీ దేవి ఆదేశానుసారం ఒక వ్యక్తిని ఆశ్రయించాడు.అతని పేరు సిద్థ సమాథి.అతనిని రాకుమారుడు ఒక ఉపకారము కోరాడు.అయ్యా!నా తండ్రి ఒకమారు అశ్వమేథయాగము తల పెట్టాడు.యాగము మథ్యలో అశ్వము తప్పిపోయింది.ఎక్కడ వెతికినా కనిపించలేదు.కాలక్రమేణా మా తండ్రి కూడా మరణించాడు.స్వామీ!గుర్రము దొరకక పోతే అశ్వమేథ యాగము పూర్తికాదు.అది సుసంపన్నము కాకపోతే మా తండ్రికి సద్గతులు ప్రాప్తించవు.కాబట్టి ఆ గుర్రము విషయము కనుక్కుని చెప్పేది.నాకు దక్కేలా చేసేది.
అప్పుడు అతను తన శక్తి చేత దేవతలను పిలిపించాడు.ఆ అశ్వమును ఇంద్రుడు అపహరించి,దాచి ఉంచాడు.కాబట్టి ఆ దేవతలను ఆ అశ్వము తీసుకు రమ్మని పురమాయించాడు.వారి చేత ఆ రాజకుమారుడికి ఆ అశ్వాన్ని ఇప్పించాడు.
రాజ కుమారుడికి భలే ఆశ్చర్యము వేసింది.ఇంత దివ్యశక్తి మీకు ఎలా చేకూరింది అని అడిగాడు.దానికి సిద్థసమాథి ఇలా జవాబిచ్చాడు.
శ్లోకము......
గీతానాం ద్వాదశాధ్యాయం జపామ్యహతన్ద్రితః।
తేన శక్తిరియం రాజన్ మయాప్రాప్తాస్తి జీవితమ్॥
ఓ రాజా!నేను భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయాన్ని అనునిత్యమూ పారాయణ చేస్తుంటాను.దాని ప్రభావము వలననే నాకు ఈ శక్తి సమకూరింది.
Tuesday, 14 October 2025
ఏకాదశ అధ్యాయము….ఫలము
భగవద్గీతలోని పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము.ఈ అధ్యాయము పారాయణము చేస్తే రాక్షస పీడా నివారణము కలుగుతుంది.
శ్లోకము....
నిష్కర్మతయా ప్రాపుస్తే పరమం పదమ్।
ఏకాదశస్య సామర్ధ్యా దధ్యాయస్య భవిష్యతి॥
పూర్వము ఒక ఊరిలో ఒక రాక్షసుడు ఉండేవాడు.వాడి దురాగతాలకు అంతూ పొంతు ఉండేదే కాదు.ఊరి ప్రజలు విసుగెత్తి పోయారు.గ్రామాధికారులు ఆ రాక్షసుడితో ఒక ఒప్పందానికి వచ్చారు.వీధులలో పడుకునేవారిని భక్షించవచ్చు.కానీ ఇండ్లలోకి వచ్చి హింసించి చంపకూడదు.ఈ విషయము తెలియని వారు ఆరుబయట పడుకుని ఆ రాక్షసుడికి బలి అవుతూ ఉండేవారు.ఒకరోజు సునందనుడు అనేవాడు ఆ ఊరి మీదుగా తీర్థయాత్రలకని పోతుండినాడు.ఆ రాత్రికి అక్కడే ఆగి విశ్రాంతి తీసుకుని,తెల్లవారు ఝామున బయలుదేరాలి అనుకున్నాడు.ఆ రాత్రి కూడా రాక్షసుడు వచ్చాడు.సునందనుడిని తప్ప మిగిలిన అందరినీ చంపి,తినిపోయాడు.
పొద్దున్నే ఆ ఊరిలో వాళ్ళు,హాయిగా అరుగు పైన పడుకుని నిద్ర పోతున్న సునందనుడిని చూసారు.చాలా ఆశ్చర్యపోయారు.అతనిని మంచిగా సాగనంపారు.ఆ గ్రామ పెద్దలు రాక్షసుడి దగ్గరకు వెళ్ళారు.ఇలా అడిగారు.రాత్రి నువ్వు వచ్చావు.మన ఒప్పందం ప్రకారము ఆరుబయట నిద్ర పోయేవాళ్ళని చంపి తిన్నావు.సునందనుడిని మాత్రము ఎందుకు వదలి పెట్టావు?
దానికి ఆ రాక్షసుడు ఇలా జవాబు చెప్పాడు.వాడెవడో ఎప్పుడూ భగవద్గీతలోని పదకొండవ అధ్యాయము చదువుతూ ఉంటాడట!వాడి దరిదాపుల్లోకి వెళ్ళగలిగే దానికి కూడా నా శక్తి సామర్ధ్యాలు చాలలేదు.నా శక్తి యుక్తులు వాడి దగ్గర పని చేయలేదు.
ప్రజలకు ఇంక కిటుకు అర్ధమయింది,వాళ్ళను వాళ్ళు కాపాడుకునేదానికి.ఆ గ్రామంలో అందరూ క్రమం తప్పకుండా రోజూ భగవద్గీతలోని పదకొండవ అధ్యాయము పారాయణము చేయటం మొదలుపెట్టారు.ఇంక రాక్షసుడు చేసేది ఏమీ లేక తట్టా బుట్టా సర్దుకుని,అక్కడినుంచి పలాయనము చిత్తగించాడు.
Monday, 13 October 2025
భాగవత రచన
సూతుడు చెప్పిన విషయాలు అన్నీ శౌనకాది మునులు అందరూ శ్రద్థగా విన్నారు.వారందరూ ముక్త కంఠంతో అడిగారు.నారదుడి మాటలు విన్న తరువాత వ్యాస మహర్షి ఏమి చేశాడు అని.
సూతుడు వారికి ఇలా సమాథానం ఇచ్చాడు.పరమ పవిత్ర మయిన సరస్వతీ నది ఉంది కదా!దానికి పడమటి దిక్కున ప్రశాంత వాతావరణంలో,బదరీ వృక్ష సముదాయముతో కూడిన వనము ఉంది.ఆ వనంలో శమ్యాప్రాసమనే ఆశ్రమము ఉన్నది.అది చాలా ప్రసిద్ధమయినది.వ్యాసుడు ఆ ఆశ్రమము ఎంచుకున్నాడు.భక్తి ప్రపత్తులు కలిగిన మనసుతో,మనసును ఈశ్వరుని ఆధీనంలో ఉంచాడు.తనకు తెలియకుండానే నిర్మల మనస్కుడు అయ్యాడు. ఇంక సమస్త ధర్మాలకూ,భక్తిప్రపత్తులకు నిలయము అయిన భాగవత రచనకు ఉపక్రమించాడు.దానిని దీక్షతో రచించాడు.తన ఈ రచనను తన కుమారుడు అయిన శుకమహర్షి చేత చదివించాడు.
ఆ మాటలకు శౌనకుడు అడిగాడు.శుకుడు నిర్వాణ తత్పరుడు.అతడు సమస్త విషయములయందు ఉపేక్ష కలిగిన వాడు.అతడు భాగవతము ఎందుకు నేర్చుకున్నాడు?సూతుడు ఈ ప్రశ్నకు ఇలా సమాథానం చెప్పాడు.మహర్షీ!నిరపేక్షులు అయిన మునులు కూడా విష్ణువును కీర్తిస్తూ ఉంటారు.ఎందుకంటే ఏమి చెపుతాము?విష్ణుదేవుని మహిమ అంటే ఆషామాషీ కాదు.అదీ కాకుండా శుకమహర్షికి శ్రీహరి గుణాల వర్ణన యందు ఆసక్తి,అనురక్తి ఉన్నాయి.కాబట్టి భాగవతాన్ని చదివాడు.ఇంకో విషయము కూడా చెబుతాను.వేదాల కంటే కూడా భాగవతమే ముక్తి మార్గాన్ని సులువుగా నేర్పిస్తుంది.
వీటన్నిటికీ తోడు పరీక్షిత్తు మహారాజు శుక మహర్షిని ముక్తి మార్గము బోథింపమని ప్రార్ధించాడు.ఒక రాజర్షి నిస్సిగ్గుగా అలా బతిమలాడేటప్పటికి,మనసు కరగి భాగవతము చెప్పాడు.
దశమ అధ్యాయము….ఫలము
భగవద్గీతలోని పదవ అధ్యాయము విభూతి యోగము.ఈ అధ్యాయము పారాయణ చేస్తే అనంత మయిన భగవంతుడి కృపా కటాక్షాలు దక్కుతాయి.ఆ దేవదేవుడి సహాయ సహకారాలు లభ్యమవుతాయి.
దశమాధ్యాయ మాహాత్మ్యాత్తత్వజ్ఞానం సుదుర్లభమ్।
లబ్ధమే తేన మునినా జీవన్ముక్తిరియం తథా॥
పూర్వ కాలంలో ఒకప్పుడు బ్రహ్మ దేవుని వాహన జాతికి చెందిన హంస ఒకటి ఉండేది.ఒకసారి ఒక పద్మలత ద్వారా భగవద్గీత యొక్క పదవ అధ్యాయము వినింది.ఇంక ఎప్పుడూ దాని గురించే ఆలోచించేది.మరు జన్మలో అది ఒక బ్రాహ్మణుడి లాగా పుట్టింది.పూర్వ జన్మ జ్ఞానము కలిగి ఉండింది.దాని ప్రభావము చేత ఎప్పుడూ భగవద్గీతలోని పదవ అధ్యాయము స్మరించుకుంటూ ఉండేవాడు.దాని ప్రభావము వలన శివుడు ఎప్పుడూ అతని వెన్నంటే ఉండేవాడు.
ఈ విషయం వాళ్ళూ వీళ్ళూ చెప్పడం కాదు.స్వయానా శివుడే భృంగీశ్వరుడితో చెప్పాడు.
నవమ అధ్యాయము…ఫలము
భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్య యోగము.ఈ అధ్యాయము పారాయణ చేస్తే ప్రతిగ్రహణ పాప నాశనము దక్కుతుంది.
పూర్వము ఒకరాజు ఉన్నాడు.అతను ఒకసారి ఒక విప్రుడికి కాలపురుషుడి దానము చేసాడు.ఆ విగ్రహము నుంచి చండాల దంపతులు ఆవిర్భవించారు.వారు ఆ బ్రాహ్మణుడిని బాధించడం మొదలు పెట్టారు.తక్షణమే విష్ణు పార్షదులు అక్కడికి వచ్చారు.వచ్చీరాగానే ఆ చండాల దంపతులను తరిమి కొట్టి,బ్రాహ్మణుడిని కాపాడారు.రాజు దీనినంతా గమనించాడు.స్వామీ!ఏమి ఈ మాయ! అని బ్రాహ్మణోత్తముడిని అడిగాడు.
అప్పుడు అతను నవ్వుతూ ఇలా అన్నాడు.
గీతాయానవమాధ్యాయం జపామి ప్రత్యహం నృప।
నిస్తీర్ణాశ్చా పదస్తేన కుప్రతి గ్రహ సంభవాః॥
గీతాయానవమాధ్యాయ మంత్రమాలా మయాస్మృతా।
తన్మాహాత్మ్య మిదం సర్వం త్వమవేహి మహీపతే॥
అంటే ఇలా చెప్పాడు.ఓ రాజా!నేను రోజూ క్రమం తప్పకుండా భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయము పారాయణ చేస్తాను.దాని మహాత్మ్యం నీకు కూడా అర్ధం అయింది కదా!నేను తీసుకునే ఇలాంటి దానాల వలన కలిగే పాపం ఆ పుణ్యం వలన సమసిపోతుంది.
Sunday, 12 October 2025
అష్టమ అధ్యాయము…ఫలము
భగవద్గీతలోని అష్టమ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము.దీని పారాయణ ఫలము సర్వ విధ దుర్గతి నాశనము.
శ్లోకము
......
జపన్ గీతాష్టమాధ్యాయ శ్లోకార్థం నియతేంద్రియః।
సంతుష్ఠ వా నహందేవి తదీయ తపసా భృశమ్॥
పూర్వము భావశర్మ అని ఒకడు ఉన్నాడు.వాడు పరమ భ్రష్టాచారుడు.అందుకని వాడు తరువాత జన్మలో తాటి మాను అయి పుట్టాడు.అచ్చం వీడి లాగే ఇంకో జంట ఉన్నారు.వారు కుమతి-కుశీవలుడు.వీళ్ళు చేయని పాప కర్మలు అంటూ ఏమీ మిగలలేదు.అంతటి దుష్కర్ములు.వాళ్ళు మరు జన్మలో బ్రహ్మ రాక్షసులుగా పుట్టారు.ఒక రోజు వాళ్ళు ఇద్దరూ తాడి చెట్టు కింద కూర్చుని సేద తీరుతున్నారు.వాళ్ళకు ఆ జన్మ అంటే విసుగు వచ్చింది.అప్పుడు భార్య భర్తని అడిగింది.ఏమయ్యా!ఎప్పటికీ మన బతుకులు ఇంక ఇంతేనా?మనకు ఈ బ్రహ్మ రాక్షసత్వము ఎప్పుడు పోతుంది?
దానికి అతను చిన్నగా నవ్వుతూ ఇలా అన్నాడు.ఓయీ!ఇదంతా అంత సులభం కాదు.మనము కర్మ వీడి,ఆధ్యాత్మ బుద్ధితో నడచుకోవాలి.బ్రహ్మము గురించి తెలుసుకోవాలి.అప్పుడు మనకు ఈ దుర్దశ వీడుతుంది.మనము అనుకునేటట్లే ఆమెకు తన భర్త చెప్పిన దాంట్లో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు.సహజమే కదా ఆ జన్మకు.మళ్ళీ ఇలా అడిగింది.కిం తత్ బ్రహ్మ?కిమధ్యాత్మం?కిం కర్మ పురుషోత్తమ?
బ్రహ్మ ఏంది?అధ్యాత్మం ఏంది?ఏం పనులు గురించి మాట్లాడు తున్నావు?ఆమె ఈ మాటలు మామూలుగానే అడిగింది తన భర్తను.కానీ అవి భగవద్గీతలోని ఎనిమిదవ అథ్యాయములోని మొదటి శ్లోకములోని అర్జునుడు శ్రీకృష్ణుని ఉద్దేశించి పలికిన పలుకులు.ఆ శ్లోకము లోని మొదటి పాదము ఉచ్ఛరించినట్లు అయింది.అది పలకగానే వారి బ్రహ్మరాక్షసత్వము పోయి మామూలుగా అయ్యారు.వారు తాటి చెట్టు క్రింద కూర్చుని ఉన్న కారణంగా తాటి చెట్టుకు కూడా ముక్తి లభించింది.ఇలా ముగ్గురికీ ఉత్తమ గతి ప్రాప్తించింది.
ఆ మొదటి శ్లోకము....
అర్జున ఉవాచ....
కిం తద్బ్రహ్మ కి మధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ।
అధిభూతం చ కిం ప్రోక్త మధిదైవం కిముచ్యతే॥8-1
Subscribe to:
Comments (Atom)