Friday, 20 February 2026

అచ్ఛేద్యోఽయ మదాహ్యోఽయ

అచ్ఛేద్యోఽయ మదాహ్యోఽయ మక్లేద్యోఽశోష్య ఏవ చ। నిత్యస్సర్వగత స్స్థాణు రచలోఽయం సనాతనః॥24॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... మన పెద్దవాళ్ళు ఏమి చెబుతారు?ఏదైనా ఒకటికి పదిసార్లు అధ్యయనము చేయాలి అని.అందుకే కదా పలక పైన అక్షరాలు అన్ని సార్లు దిద్దిస్తారు!గాఢనిద్రలో లేపి అడిగినా తప్పులు చెప్పకూడదు,వ్రాయకూడదు. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి ఆత్మ తత్త్వం గురించి పదే పదే విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నాడు. హే అర్జునా!నా ప్రియ మిత్రమా!ఈ ఆత్మ అనేది ఉందే!అది మామూలు కాదు మనం రోజూ చూసే విషయం లాగ.దీనిని మనం ఛేదించలేము,భేదించలేము.అంతేనా?అంటే అదీ కాదు.దహిస్తామా అంటే అట్లానూ కాల్చి బూడిద చేయలేము.సరేలే కనీసం తడుపుదాము అనుకుంటే దానికీ మళ్ళబడుతుంది.కించిత్ కూడా తడవదు.ఇంక ఎట్లా ఏగాలి,చెప్పు.తడపలేము,పోనీలే ఎండ కడతాము అని నిర్ణయించుకున్నాము అనుకో.ఆ విషయంలో కూడా మనది తప్పటడుగు అవుతుంది.ఊహూ!ఆ విషయంలో కూడా మనము విజయము సాథించలేము. దీనికంతటికీ కారణం ఏందో తెలుసా,అర్జునా!ఈ ఆత్మ అనేది నిత్యమయినది.నిన్నా మొన్న పుట్టింది కాదు...రేపో ఎల్లుండో పోతుందిలే అనుకునేదానికి!,మన పప్పులు ఏమీ దాని దగ్గర ఉడకవు.అది సనాతనమయినది.అది నిజము.అది ఎవరి ఆధీనములో లేదు.ఎవరూ దానిని గుప్పెట్లో దాచిపెట్టలేరు.

Thursday, 19 February 2026

నైనం ఛిందంతి శస్త్రాణి

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః। న చైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః॥23॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆత్మ అనేది ఉందే.దీనిని ఎవరూ ఏమీ చేయలేరు.ఎలాంటి అస్త్ర శస్త్రాలూ దీనిని ఛేదించలేవు,భేదించ లేవు.ఎంతటి అగ్ని కూడా దీనిని దహించలేదు.ఎక్కడి నుంచి ఎన్ని సముద్రాల నీరు తెచ్చి పోసినా తడపలేము.అది తడవదు.ఎలాంటి భీకరమయిన గాలులు కూడా దానిని ఆరబెట్టలేవు.ఎండబెట్టలేవు.మనము దానిని ఏమీ చేయలేము.అన్నిటికీ అతీతము.

Tuesday, 17 February 2026

వాసాంసి జీర్ణాని

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి। తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ॥22॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... బుజ్జోడి బుల్లి బొజ్జలోకి బజ్జి బువ్వ పోవాలంటే అమ్మ బహు ప్రయాస పడుతుంది కదా!ఇక్కడ మన కన్నయ్య కూడా అర్జునుడి బుర్రలోకి కూసింత జ్ఞానం ఎక్కించేదానికి కడు కటకటలు పడుతున్నాడు. అర్జునా!మనము మన బట్టలు చినిగి పోతే ఏమి చేస్తాము?అట్లనే చీలికలు,పేలికలు వేసుకుని తిరగము కదా!వాటిని తీసి పారేస్తాము కదా!మంచిగా క్రొత్త బట్టలు వేసుకుని టింగురంగా అంటూ తిరుగుతాము కదా! ఆత్మ కూడా అచ్ఛం అలానే ఆలోచిస్తుంది,చేస్తుంది.ఈ శరీరం నిరుపయోగమవుతుందనుకో!ఈ పనికిరాని పాత శరీరం విడిచి పెడుతుంది మొహమాటం లేకుండా!ఎంచక్కా క్రొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది ఎంతో సహజంగా,సునాయాసంగా!

వేదావినాశినం నిత్యం

వేదావినాశినం నిత్యం య ఏన మజ మవ్యయమ్। కథం స పురుషః పార్థ కం ఘాతయతి హన్తి కమ్॥21॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు పరి పరివిథాలా తపిస్తున్నాడు... అర్జునుడు తను చెప్పేది అర్థం చేసుకోవాలని.అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత పని చేస్తున్నాడు.ఇంక అర్జునుడు నమిలి,మింగితే చాలు! అర్జునా!నేను చెప్పాను కదా...ఆత్మ నాశనం లేనిదని.అలాగే నిత్యము అయినది అని.ఇంకా ఇంకా దాని గురించి ఇలా చెప్పాను కదా.ఆత్మకు వృద్థి,క్షయములు లేవు.అంటే పెరగదు,తరగదు.వ్యము కానిది కూడా!ఇవన్నీ తెలిసిన నేను కానీ ఇంకొకరు కానీ వేరొకరిని చంపడానికి ఎందుకు ప్రేరేపిస్తారు అసలు?తాము మటుకు ఎందుకు,ఎవరినైనా చంపుతారు చెప్పు?ఆలోచించు నిదానంగా.

Monday, 16 February 2026

న జాయతే మ్రియతే

న జాయతే మ్రియతే వా కదాచి న్నాయం భూత్వా భవితా వా న భూయః। అజో నిత్య శ్శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే॥20॥2॥ శ్రమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడికి అర్జునుడిని చూస్తే జాలి,దయ కలగటం లేదు.కోపం వస్తుంది.అయినా అన్నీ దిగమ్రింగుకోని ఇలా అంటున్నాడు. నేస్తమా!నేల చూపులు ఏంది?ఈ నీరసం,నిస్సత్తువ ఏంది?కాళ్ళూ,చేతులు వ్రేలాడేసుకుని ఈ బేల చూపులు ఏంది?ఈ చతికిలబడటం ఏంది? ముందర లెయ్యి అసలు.మనలను చూసి నలుగురు ఉత్తేజితులు కావాలి.పదిమందికి మనం ప్రామాణికంగా నిలవాలి.బెబ్బెబ్బే అంటూ ఈ దీనాలాపనలు,బొబ్బెబ్బో అంటూ ఏడుపులు ఏంది?చలనం తెచ్చుకో!నా కళ్ళలోకి చూడు.నేను చెప్పేది మనసు పెట్టి విని,ఆకళింపు చేసుకో! ఆత్మ పుట్టేది కాదు.దానికి చావు అనేది లేదు.అట్లా అని ఒకప్పుడు ఉండి,ఇంకోకప్పుడు లేకుండా ఉండదు.ఆత్మ జనితమయినది కాదు.దానికి మార్పులు,చేర్పులు,తక్కువలు,ఎక్కువలు అంటూ ఏమీ ఉండవు.దానికి నాశనం అనేది లేదు.అది సనాతనమయినది.అది చంపదు.చావదు,చావబడదు.అది ధరించిన శరీరం నశిస్తుంది, దానికి చావు ఉంది కానీ ఈ ఆత్మకు మటుకు చావు లేదు,నాశనం అవదు.

య ఏవం వేత్తి హంతారం

య ఏవం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్। ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే॥19॥2॥ శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మ తత్త్వం గురించి చెబుతున్నాడు.మిత్రమా!అర్జునా!నీకు ఈ విషయం తెలుసా?ఈ ఆత్మ అనేది ఉందే!అది దేనిని చంపదు.దేని చేత చంపబడదు.ఎవరైనా ఆత్మ చంపుతుంది,లేకపోతే చంపబడుతుంది అనుకుంటే...వారంత అజ్ఞానులు ఇంకొకరు ఉండరు.ఎందుకంటే ఆత్మ వీటన్నిటికీ అతీతమయినది.ఏదీ దానిని మలినం చేయలేదు.నాశనము చేయలేదు.అది స్వచ్ఛమయినది.నిత్యమయినది.నిరామయము.

Sunday, 15 February 2026

అంత వంత ఇమే దేహా

అంత వంత ఇమే దేహానిత్యస్యోక్తా శ్శరీరిణః। అనాశినోఽప్రమేయస్య తల్మా ద్యుధ్యస్వభారత॥18॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడిని బుజ్జగిస్తున్నాడు.అర్జునా!ధరించబడిన దేహాలు నశిస్తాయి.దానిని ధరించిన జీవుడు,అదే ఆత్మ నాశనం కాదు.అది నిత్యమయినది.సత్యమయినది.ముందు నువ్వు ఆ విషయం తెలుసుకుని,గుర్తు పెట్టుకో.ఈ అనవసరమయిన దుఃఖాన్ని మానివెయ్యి.యుద్ధానికి నడుము బిగించి విజయమో,వీరస్వర్గమో తేల్చుకో!వెనకకు తగ్గొద్దు.