Wednesday, 25 February 2026
దేహీ నిత్య మవధ్యోఽయం
దేహీ నిత్య మవధ్యోఽయం దేహే సర్వస్య భారత।
తస్మా త్సర్వాణి భూతాని న త్వం శోచితు మర్హసి॥30॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి మంచిగా చెబుతున్నాడు.అర్జునా!అన్ని దేహాలలోనూ ఉన్నది ఆత్మే.అది చంపదు,చంపబడదు.అది నిత్యము.అది సత్యము.కాబట్టి అర్జునా!అర్థం చేసుకునేదానికి ప్రయత్నించు.ఈ జీవుల కోసం శోకించడం అనేది తగని పని.అసలు అవసరము లేదు.
ఆశ్చర్యవ త్పశ్యతి
ఆశ్చర్య వత్పశ్యతి కశ్చిదేన
మాశ్చర్యవ ద్వదతి తథైవ చాన్యః।
ఆశ్చర్యవచ్చైన మన్య శ్శృణోతి
శ్రుత్వా ప్యేనం వేద న చైవ కశ్చిత్॥29॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడికి అందరూ ఆత్మ గురించి ఏమనుకుంటారో బాగా తెలుసు.అదే అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!నువ్వు ఒక్కడివే కాదు ఆత్మ గురించి గందరగోళంలో ఉండేది.
ఒకడేమో ఆత్మను ఆశ్చర్యంగా చూస్తాడు.ఇంకొకడేమో ఆత్మ గురించి ఆశ్చర్యంగా పలుకుతున్నాడు.మరి ఇంకొకడు నోరెళ్ళ బెట్టుకుని ఆశ్చర్యంగా ఆత్మ గురించి వింటున్నాడు.
ఇట్లా ఒక సరైన అవగాహన లేకుండా చూడడం ద్వారా,చెప్పడం ద్వారా,వినడం ద్వారా ఏమీ ఒరగదు.అంటే లాభం లేదు.ఆత్మను అంత సులభంగా తెలుసుకోలేము,అర్థం చేసుకోలేము.
Tuesday, 24 February 2026
అవ్యక్తాదీని భూతాని
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత।
అవ్యక్త నిధనా న్యేవ తత్ర కా పరిదేవనా॥28॥2॥
శ్రీమద్భగనద్గీత....సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి చావు పుట్టుకల గురించి వివరిస్తున్నాడు.ఓ అర్జునా!భరత శ్రేష్టా!నువ్వు నిశితంగా గమనించు.ఈ సృష్టిలోని సకల భూతాలూ పుట్టకముందు మనకు కనిపిస్తున్నాయా?లేదు కదా!కానీ ఆ జీవులు అన్నీ పుట్టిన తరువాత కనిపిస్తున్నాయి కదా!ఎందుకంటావు?ఆలోచించు ఒక్క క్షణం.
ఎందుకంటే కిందటి జన్మలో ఏ రూపంలో ఉన్నారో మనకు తెలియదు.చనిపోయిన పిమ్మట మరు జన్మలో ఎవరు ఏ రూపం పొందుతారో మనకెవరికీ తెలియదు గనక.అలాంటి బంధుకోటి గురించి నీవు తల పగలగొట్టుకోవడం ఎందుకు?ఈ దిగులు,విచారం,ఈ నిర్వీర్యం,నిస్సత్తువ,నిర్వికారం ఎందుకు?మనసును ప్రశాంతంగా పెట్టుకో!
Monday, 23 February 2026
జాతస్య హి ధ్రువో మృత్యుః
జాతస్య హి ధ్రువో మృత్యు ర్ధ్రువం జన్మ మృతస్య చ।
తస్మా దపరిహార్యేఽర్థే న త్వ వం శోచితు మర్హసి॥27॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
చెట్టును ఒక తట్టు నుంచి నరక లేక పోతే ఇంకో తట్టు నుంచి నరుక్కోని రావాలి అంటాము కదా!కృష్ణుడు తను అర్జునుడికి చెప్పాల్సింది చెప్పాడు.కానీ అతనిలో ఏమీ మార్పు కనిపిస్తున్నట్లు లేదు.అందుకని అర్జునుడి మార్గంలోనే పోయి,అర్జునుడు సత్యం గ్రహించేలా చెయ్యాలని నడుము బిగించాడు.
ఇలా చెబుతున్నాడు.అర్జునా!నీవు ఆత్మకు మనకులాగే చావు పుట్టుకలు ఉన్నాయి అని గాఢంగా నమ్ముతున్నావు కదా!సరే!అప్పుడు కూడా ఏమవుతుంది?ఒకసారి ఆలోచించు.పుట్టినది గిట్టక మానదు కదా!ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవీ చావును తప్పించుకోలేదు కదా!మరణం తరువాత మళ్ళీ పుట్టడం అనేది అంతే సహజం కదా!ఈ రెండింటిలో ఏ ఒక్కదానినీ మనం ఆపలేము కదా!మన చేతుల్లో లేని ప్రక్రియ కదా.మరి మన చేతులలో లేని,మన నియంత్రణలో లేని దాని కోసరము మనము ఇంత దుఃఖిచడం అవసరమా?నువ్వే చెప్పు.
అథ చైనం నిత్యజాతం
అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్।
తథాపి త్వం మహాబాహో నైవం శోచితు మర్హసి॥26॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము....
శ్రీకృష్ణుడు అర్జునుడికి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు.అర్జునా! బామ్మర్దీ!ముందర ముఖం పైన కనిపించే ఆ దిగులు,విచారమూ తుడిచేయి.నీకు అసలు వాటి అవసరము లేదు.
నేను ఆత్మ గురించి చెప్పే మాటలు నమ్మ బుద్ధి కావటం లేదా?అయినా పరవాలేదు.నువ్వు ఆత్మకు అంత విషయం లేదు.దానికీ చావు పుట్టుకలు ఉన్నాయి,ఉంటాయి కూడానూ అని అనుకుంటున్నావా?సరే!అట్లానే అనుకుందాము.అప్పుడు కూడా నీవు ఇంత దిగులు పడి,దుఃఖ పడి,యాగీ చేయాల్సిన అవసరము లేదు.ముందు స్థిమిత పడు.
Saturday, 21 February 2026
అవ్యక్తోఽయ మచింత్యో
అవ్యక్తోఽయ మచింత్యోఽయ మవికార్యో య ముచ్యతే
తస్మాదేవం విది త్వైనం నాను శోచితు మర్హసి॥25॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము....
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మ గురించి ఇంకా చెబుతున్నాడు.
అర్జునా!ప్రియ సఖా!ఆత్మని కాల్చలేము,తడపలేము,ఎండబెట్టలేము,చంపలేము అని చెప్పాను కదా!
అది మన పంచేంద్రియాలకు కూడా కానరాదు.అంటే మనము తాకలేము,వినలేము,వాసన గ్రహించలేము,రుచి చూడలేము,చూడలేము,మాటలాడలేము.ఈ ఆత్మ ఇలా ఉంటుంది!అలా ఉంటుంది అని చెప్పలేము.అసలు ఎలా ఉంటుంది అని ఊహించను కూడా ఊహించలేము.దీనికి ఆకారం లేదు,ఆహార్యం అసలే లేదు.అంటే నూటికి నూరు పాళ్ళూ నిర్వికారి.
ఇది ఇప్పుడు నేను నీకు చెప్పడం కాదు.అనాది నుంచీ ఆత్మ గురించి చెప్పబడే విషయాలే.ముందర ఈ ఆత్మ తత్త్వాన్ని నువ్వు తెలుసుకో,అర్థం చేసుకో.ఇంతకు మించి ఇంకొక మార్గం లేదు.ఈ విషయం నువ్వు ఆకళింపు చేసుకుంటే దుఃఖం అనేది నీ చుట్టు ప్రక్కలకు కూడా రాదు.ఆమడ దూరంలో ఎక్కడో బ్రతుకు జీవుడా అంటూ నిట్టూరుస్తూ,వణుకుతూ ఉంటుంది.నన్ను నమ్ము.
Friday, 20 February 2026
అచ్ఛేద్యోఽయ మదాహ్యోఽయ
అచ్ఛేద్యోఽయ మదాహ్యోఽయ మక్లేద్యోఽశోష్య ఏవ చ।
నిత్యస్సర్వగత స్స్థాణు రచలోఽయం సనాతనః॥24॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము....
మన పెద్దవాళ్ళు ఏమి చెబుతారు?ఏదైనా ఒకటికి పదిసార్లు అధ్యయనము చేయాలి అని.అందుకే కదా పలక పైన అక్షరాలు అన్ని సార్లు దిద్దిస్తారు!గాఢనిద్రలో లేపి అడిగినా తప్పులు చెప్పకూడదు,వ్రాయకూడదు.
శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి ఆత్మ తత్త్వం గురించి పదే పదే విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నాడు.
హే అర్జునా!నా ప్రియ మిత్రమా!ఈ ఆత్మ అనేది ఉందే!అది మామూలు కాదు మనం రోజూ చూసే విషయం లాగ.దీనిని మనం ఛేదించలేము,భేదించలేము.అంతేనా?అంటే అదీ కాదు.దహిస్తామా అంటే అట్లానూ కాల్చి బూడిద చేయలేము.సరేలే కనీసం తడుపుదాము అనుకుంటే దానికీ మళ్ళబడుతుంది.కించిత్ కూడా తడవదు.ఇంక ఎట్లా ఏగాలి,చెప్పు.తడపలేము,పోనీలే ఎండ కడతాము అని నిర్ణయించుకున్నాము అనుకో.ఆ విషయంలో కూడా మనది తప్పటడుగు అవుతుంది.ఊహూ!ఆ విషయంలో కూడా మనము విజయము సాథించలేము.
దీనికంతటికీ కారణం ఏందో తెలుసా,అర్జునా!ఈ ఆత్మ అనేది నిత్యమయినది.నిన్నా మొన్న పుట్టింది కాదు...రేపో ఎల్లుండో పోతుందిలే అనుకునేదానికి!,మన పప్పులు ఏమీ దాని దగ్గర ఉడకవు.అది సనాతనమయినది.అది నిజము.అది ఎవరి ఆధీనములో లేదు.ఎవరూ దానిని గుప్పెట్లో దాచిపెట్టలేరు.
Subscribe to:
Comments (Atom)