Monday, 2 February 2026

అశోచ్యా నన్వశోచస్త్వం

శ్రీ భగవానువాచ... అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే। గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః॥11॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు నవ్వు ఆపుకోలేకపోయాడు.ఇంక బలవంతంగా ఆపుకుని అర్జునుడి తట్టు మళ్ళి మాట్లాడాడు. అర్జునా!ఏందో అనర్గళంగా భాషణలు ఇచ్తేస్తున్నావు.జీవితం అంతా ఔపోసన పట్టిన జ్ఞానిలాగా మాట్లాడేస్తున్నావు. నిజం చెప్పేదా?అది ఎప్పుడూ కటువుగా ఉంటుంది.మానవుడు దేని కోసం దుఃఖించకూడదో,దాని కోసం దుఃఖిస్తూ ఉన్నావు.అంతేనా?మళ్ళీ ఇదేమీ చాలనట్లు పెద్ద ఆరిందలాగా సూక్తుల,ముక్తాయింపులు చెబుతున్నావు. నీకు అసలు ఈ విషయం తెలుసా?నిజంగా పండితులు అయినవాళ్ళు సజీవుల గురించి ఆలోచించరు.పైగా గత జీవుల గురించి దిగులు పడరు.అసలు నువ్వు ఏ ఏ విషయాలకు అయితే దిగులు పడి,దుఃఖ పడుతున్నావో వాటిగురించి లేశ మాత్రం కూడా సమయం వృథా చేయరు.దుఃఖం అనే దానిని దరిదాపులకుకూడా రానివ్వరు.

Sunday, 1 February 2026

తమూవాచ హృషీకేశః

తమూవాచ హృషీకేశః ప్రహసన్నివ భారత। సేనయో రుభయో ర్మధ్యే విషీదంత మిదం వచః॥10॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు ఈ విథంగా వివరిస్తున్నాడు.ఓ ధృతరాష్ట్ర మహారాజా!అర్జునుడు చాలా దీనంగా కనిపిస్తున్నాడు.రెండు సైన్యాల మధ్య అతను విషణ్ణ వదనంతో చాలా వ్యాకులంగా,నిశ్చేష్టుడు అయి రధం పైన పడిఉన్నాడు.చూసేవారికి అంతా చాలా హృదయవిదారకంగా ఉంది అతని స్థితి,పరిస్థితి.కానీ అతని బాల్య మిత్రుడు శ్రీకృష్ణుడుకు మటుకు పట్టలేనంత నవ్వుగా ఉంది.పగలబడి పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు.నవ్వుతూనే ఇలా అన్నాడు.

Saturday, 31 January 2026

ఏవ ముక్త్వా హృషీకేశం

సంజయ ఉవాచ... ఏవ ముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః। న యోత్స్య ఇది గోవింద ముక్త్వా తూష్ణీం బభూవ హ॥9॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చారు కదా సంగ్రామం వివరాలు అన్నిటినీ ధృతరాష్ట్రుడికి చెప్పేందుకు గానూ. సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు.ఓ రాజా!అర్జునుడు పై విధంగా కృష్ణునితో తన మనోదౌర్బల్యాన్ని విశదపరిచాడు.ఆఖరుకు కృష్ణా నేను ఈ యుద్ధం చేయను,చేయలేను,చేయబోను అని ఖరాఖండిగా చెప్పేసాడు.శక్తి విహీనుడై అర్జునుడు రథంలో చతికిల పడ్డాడు.

Thursday, 29 January 2026

న హి ప్రపశ్యామి

న హి ప్రపశ్యామి మమాప నుద్యా ద్యచ్ఛోక ముచ్ఛోషణ మింద్రియాణాం। అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యమ్॥8॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... అర్జునుడు తన మిత్రుడు అయిన శ్రీకృష్ణుడికి తన మనస్సు ఉండే పరిస్థితి వివరిస్తున్నాడు.కృష్ణా!నేను దుఃఖంలో కూరుకుని పోయి ఉన్నాను.ఈ లోకంలోని ఏ విషయం కూడా నన్ను ఈ ద్వంద్వం నుంచి విముక్తి కల్పించే రకంగా కనిపించడం లేదు.నాకు ఈలోకంపైన ఏకచ్ఛత్రాధిపత్యం దక్కినా తుచ్ఛం అనిపిస్తుంది.స్వర్గాధిపత్యం దక్కినా తృణప్రాయం అనిపిస్తుంది.ఈ దుఃఖం నన్ను పీల్చి పిప్పి చేసేస్తున్నది.ఎండగట్టేస్తున్నది.ఊపిరి ఆనటం లేదు.గొంతు పిడచ కట్టుకుపోతుంది.కిం కర్తవ్యం కృష్ణా!!!????

Wednesday, 28 January 2026

కార్పణ్య దోషోప హత స్వభావః

కార్పణ్య దోషోప హత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః। యచ్ఛ్రేయ స్స్యా న్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్॥7॥2॥ శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము... అర్జునుడు ఝంఝాటకం నుంచి బయట పడాలనుకుంటున్నాడు.అందుకని కృష్ణుడిని ఒక రకంగా అర్థిస్తున్నాడు.కృష్ణా!నేను ఈ పనికి మాలిన రాజ్యలోభం,బంధులోభాలతో సతమతమవుతున్నాను.నా మనసుకు దారీ తెన్నూ..।ఏమీ గోచరించడం లేదు.ధర్మనిర్ణయం చేసుకోలేకుండా,అవస్థ పడుతున్నాను.నిన్ను అడుగుతున్నాను.నేను నీకు శిష్యుడిని.నన్ను గట్టుకు చేర్చే బాధ్యత నీదే!నా హితంకోరేవాడివి నీవు.నాకు ఏది మంచిదో నువ్వే తేల్చు.నాకు ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుపోతున్నాను అని భయమేస్తుంది.నాకు నీ ఆపన్న హస్తంకావాలి.దాని సహాయంతో నేను గట్టుకు సురక్షితంగా చేరాలి.నాకు చేయి అందించే వాళ్ళు నువ్వు తప్ప ఇంకెవ్వరూ కానరావటం లేదు.ఉన్నా నాకు అఖ్ఖర లేదు.నువ్వే కావాలి.

Tuesday, 27 January 2026

న చైతద్విద్మః

న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వాజయేమ యదివానో జయేయుః। యానేవ హత్వా న జిజీవిషామ స్తేవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః॥6॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... అర్జునుడు కృష్ణుడికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.కృష్ణా!ఒకటి ఆలోచించు.పోరు సల్పినపుడు విజయం ఎవరిని వరిస్తుందో తెలియదు.యుద్ధం చేసినా మనమే గెలుస్తామనే ధీమా లేదు.అంతోసి దానికి వారిని ఎందుకు చంపాలి?ఎవరిని చంపడం వలన మనకు జీవించాలనే ఇచ్ఛే అడుగంటి పోతుందో ....అటువంటి ధార్తరాష్ట్రులే కదా మన ఎదుట శత్రు పక్షాన ఉన్నది!ఇంక ఏమని అడుగు ముందుకు వేస్తాము?

Monday, 26 January 2026

గురూ న హత్వా హి

గురూ న హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్య మపీహలోకే। హత్వార్థ కామాంస్తు గురూ నిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్దాన్।।5॥2॥ శ్రీమద్భగవద్గీత..।।సాంఖ్య యోగము... అర్జునుడు తన భావాలనూ,బాథలను కృష్ణుని ముందు ఏకరువు పెడుతున్నాడు.సఖా!కృష్ణా!నేను ఏమి చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థం అవుతుంది కదా!మహానుభావులూ,వృద్ధులు అయిన భీష్ముడు,ద్రోణుడు,ఇతరులనందరినీ చంపడం ఎంత పాపం కదా!వారి తప్పులు ఎన్ని ఉన్నా కూడా!దానికంటే బిక్షమెత్తుకుంటూ నాలుగు ఇండ్లు తిరిగి కడుపు నింపుకోవడం ఎంతో ఉత్తమం కదా! అయినాకూడా అర్థకామములకోసరం గురువులను చంపడం,ఆ రక్తపుకూడు తినటం..।రామ!రామ!ఎంత ఘాతుకం! అలా సంపాదించే భోగభాగ్యాలను నేను ఎలా జీర్ణించుకోగలను?ఎలా సుఖపడుతూ అనుభవించగలను?నువ్వే చెప్పు కృష్ణా?అది సాధ్యమా?అసలు అవసరమా?