Monday, 23 February 2026

జాతస్య హి ధ్రువో మృత్యుః

జాతస్య హి ధ్రువో మృత్యు ర్ధ్రువం జన్మ మృతస్య చ। తస్మా దపరిహార్యేఽర్థే న త్వ వం శోచితు మర్హసి॥27॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... చెట్టును ఒక తట్టు నుంచి నరక లేక పోతే ఇంకో తట్టు నుంచి నరుక్కోని రావాలి అంటాము కదా!కృష్ణుడు తను అర్జునుడికి చెప్పాల్సింది చెప్పాడు.కానీ అతనిలో ఏమీ మార్పు కనిపిస్తున్నట్లు లేదు.అందుకని అర్జునుడి మార్గంలోనే పోయి,అర్జునుడు సత్యం గ్రహించేలా చెయ్యాలని నడుము బిగించాడు. ఇలా చెబుతున్నాడు.అర్జునా!నీవు ఆత్మకు మనకులాగే చావు పుట్టుకలు ఉన్నాయి అని గాఢంగా నమ్ముతున్నావు కదా!సరే!అప్పుడు కూడా ఏమవుతుంది?ఒకసారి ఆలోచించు.పుట్టినది గిట్టక మానదు కదా!ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవీ చావును తప్పించుకోలేదు కదా!మరణం తరువాత మళ్ళీ పుట్టడం అనేది అంతే సహజం కదా!ఈ రెండింటిలో ఏ ఒక్కదానినీ మనం ఆపలేము కదా!మన చేతుల్లో లేని ప్రక్రియ కదా.మరి మన చేతులలో లేని,మన నియంత్రణలో లేని దాని కోసరము మనము ఇంత దుఃఖిచడం అవసరమా?నువ్వే చెప్పు.

అథ చైనం నిత్యజాతం

అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్। తథాపి త్వం మహాబాహో నైవం శోచితు మర్హసి॥26॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు.అర్జునా! బామ్మర్దీ!ముందర ముఖం పైన కనిపించే ఆ దిగులు,విచారమూ తుడిచేయి.నీకు అసలు వాటి అవసరము లేదు. నేను ఆత్మ గురించి చెప్పే మాటలు నమ్మ బుద్ధి కావటం లేదా?అయినా పరవాలేదు.నువ్వు ఆత్మకు అంత విషయం లేదు.దానికీ చావు పుట్టుకలు ఉన్నాయి,ఉంటాయి కూడానూ అని అనుకుంటున్నావా?సరే!అట్లానే అనుకుందాము.అప్పుడు కూడా నీవు ఇంత దిగులు పడి,దుఃఖ పడి,యాగీ చేయాల్సిన అవసరము లేదు.ముందు స్థిమిత పడు.

Saturday, 21 February 2026

అవ్యక్తోఽయ మచింత్యో

అవ్యక్తోఽయ మచింత్యోఽయ మవికార్యో య ముచ్యతే తస్మాదేవం విది త్వైనం నాను శోచితు మర్హసి॥25॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మ గురించి ఇంకా చెబుతున్నాడు. అర్జునా!ప్రియ సఖా!ఆత్మని కాల్చలేము,తడపలేము,ఎండబెట్టలేము,చంపలేము అని చెప్పాను కదా! అది మన పంచేంద్రియాలకు కూడా కానరాదు.అంటే మనము తాకలేము,వినలేము,వాసన గ్రహించలేము,రుచి చూడలేము,చూడలేము,మాటలాడలేము.ఈ ఆత్మ ఇలా ఉంటుంది!అలా ఉంటుంది అని చెప్పలేము.అసలు ఎలా ఉంటుంది అని ఊహించను కూడా ఊహించలేము.దీనికి ఆకారం లేదు,ఆహార్యం అసలే లేదు.అంటే నూటికి నూరు పాళ్ళూ నిర్వికారి. ఇది ఇప్పుడు నేను నీకు చెప్పడం కాదు.అనాది నుంచీ ఆత్మ గురించి చెప్పబడే విషయాలే.ముందర ఈ ఆత్మ తత్త్వాన్ని నువ్వు తెలుసుకో,అర్థం చేసుకో.ఇంతకు మించి ఇంకొక మార్గం లేదు.ఈ విషయం నువ్వు ఆకళింపు చేసుకుంటే దుఃఖం అనేది నీ చుట్టు ప్రక్కలకు కూడా రాదు.ఆమడ దూరంలో ఎక్కడో బ్రతుకు జీవుడా అంటూ నిట్టూరుస్తూ,వణుకుతూ ఉంటుంది.నన్ను నమ్ము.

Friday, 20 February 2026

అచ్ఛేద్యోఽయ మదాహ్యోఽయ

అచ్ఛేద్యోఽయ మదాహ్యోఽయ మక్లేద్యోఽశోష్య ఏవ చ। నిత్యస్సర్వగత స్స్థాణు రచలోఽయం సనాతనః॥24॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... మన పెద్దవాళ్ళు ఏమి చెబుతారు?ఏదైనా ఒకటికి పదిసార్లు అధ్యయనము చేయాలి అని.అందుకే కదా పలక పైన అక్షరాలు అన్ని సార్లు దిద్దిస్తారు!గాఢనిద్రలో లేపి అడిగినా తప్పులు చెప్పకూడదు,వ్రాయకూడదు. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి ఆత్మ తత్త్వం గురించి పదే పదే విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నాడు. హే అర్జునా!నా ప్రియ మిత్రమా!ఈ ఆత్మ అనేది ఉందే!అది మామూలు కాదు మనం రోజూ చూసే విషయం లాగ.దీనిని మనం ఛేదించలేము,భేదించలేము.అంతేనా?అంటే అదీ కాదు.దహిస్తామా అంటే అట్లానూ కాల్చి బూడిద చేయలేము.సరేలే కనీసం తడుపుదాము అనుకుంటే దానికీ మళ్ళబడుతుంది.కించిత్ కూడా తడవదు.ఇంక ఎట్లా ఏగాలి,చెప్పు.తడపలేము,పోనీలే ఎండ కడతాము అని నిర్ణయించుకున్నాము అనుకో.ఆ విషయంలో కూడా మనది తప్పటడుగు అవుతుంది.ఊహూ!ఆ విషయంలో కూడా మనము విజయము సాథించలేము. దీనికంతటికీ కారణం ఏందో తెలుసా,అర్జునా!ఈ ఆత్మ అనేది నిత్యమయినది.నిన్నా మొన్న పుట్టింది కాదు...రేపో ఎల్లుండో పోతుందిలే అనుకునేదానికి!,మన పప్పులు ఏమీ దాని దగ్గర ఉడకవు.అది సనాతనమయినది.అది నిజము.అది ఎవరి ఆధీనములో లేదు.ఎవరూ దానిని గుప్పెట్లో దాచిపెట్టలేరు.

Thursday, 19 February 2026

నైనం ఛిందంతి శస్త్రాణి

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః। న చైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః॥23॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆత్మ అనేది ఉందే.దీనిని ఎవరూ ఏమీ చేయలేరు.ఎలాంటి అస్త్ర శస్త్రాలూ దీనిని ఛేదించలేవు,భేదించ లేవు.ఎంతటి అగ్ని కూడా దీనిని దహించలేదు.ఎక్కడి నుంచి ఎన్ని సముద్రాల నీరు తెచ్చి పోసినా తడపలేము.అది తడవదు.ఎలాంటి భీకరమయిన గాలులు కూడా దానిని ఆరబెట్టలేవు.ఎండబెట్టలేవు.మనము దానిని ఏమీ చేయలేము.అన్నిటికీ అతీతము.

Tuesday, 17 February 2026

వాసాంసి జీర్ణాని

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి। తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ॥22॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... బుజ్జోడి బుల్లి బొజ్జలోకి బజ్జి బువ్వ పోవాలంటే అమ్మ బహు ప్రయాస పడుతుంది కదా!ఇక్కడ మన కన్నయ్య కూడా అర్జునుడి బుర్రలోకి కూసింత జ్ఞానం ఎక్కించేదానికి కడు కటకటలు పడుతున్నాడు. అర్జునా!మనము మన బట్టలు చినిగి పోతే ఏమి చేస్తాము?అట్లనే చీలికలు,పేలికలు వేసుకుని తిరగము కదా!వాటిని తీసి పారేస్తాము కదా!మంచిగా క్రొత్త బట్టలు వేసుకుని టింగురంగా అంటూ తిరుగుతాము కదా! ఆత్మ కూడా అచ్ఛం అలానే ఆలోచిస్తుంది,చేస్తుంది.ఈ శరీరం నిరుపయోగమవుతుందనుకో!ఈ పనికిరాని పాత శరీరం విడిచి పెడుతుంది మొహమాటం లేకుండా!ఎంచక్కా క్రొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది ఎంతో సహజంగా,సునాయాసంగా!

వేదావినాశినం నిత్యం

వేదావినాశినం నిత్యం య ఏన మజ మవ్యయమ్। కథం స పురుషః పార్థ కం ఘాతయతి హన్తి కమ్॥21॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు పరి పరివిథాలా తపిస్తున్నాడు... అర్జునుడు తను చెప్పేది అర్థం చేసుకోవాలని.అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత పని చేస్తున్నాడు.ఇంక అర్జునుడు నమిలి,మింగితే చాలు! అర్జునా!నేను చెప్పాను కదా...ఆత్మ నాశనం లేనిదని.అలాగే నిత్యము అయినది అని.ఇంకా ఇంకా దాని గురించి ఇలా చెప్పాను కదా.ఆత్మకు వృద్థి,క్షయములు లేవు.అంటే పెరగదు,తరగదు.వ్యము కానిది కూడా!ఇవన్నీ తెలిసిన నేను కానీ ఇంకొకరు కానీ వేరొకరిని చంపడానికి ఎందుకు ప్రేరేపిస్తారు అసలు?తాము మటుకు ఎందుకు,ఎవరినైనా చంపుతారు చెప్పు?ఆలోచించు నిదానంగా.