Saturday, 5 September 2026

అపరేయ మితస్త్వన్యాం

అపరేయ మితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్। జీవ భూతాం మహాబాహో య యేదం ధార్యతే జగత్॥5॥7॥ శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి పర అపర ప్రకృతుల గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ మహాబాహో!ప్రకృతి రెండు రకాలు.అవే పర మరియు అపర.అపర ప్రకృతి అంటే పంచ భూతాలు మరియు మనసు,బుద్ధి,అహంకారము కలగలిసినది.పర ప్రకృతి అంటే శరీరము తన ప్రాణము తెలుసుకో గలిగిన,నడిపించే సూక్ష్మమయిన శ్రేష్టమయిన,సత్యమయిన,శాశ్వతమయిన చైతన్యము. మనిషి అపర ప్రకృతి కంటే ఉన్నతమయినది పర ప్రకృతి అని తెలుసుకోవాలి.ఎందుకంటే పర ప్రకృతి ఈ సమస్త విశ్వాన్నీ ధరించింది.నా ప్రకృతినే పరా ప్రకృతి అని అంటారు.

Friday, 4 September 2026

భూమి రాపోఽనలో వాయుః

భూమి రాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధి రేవచ। అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టదా॥4॥7॥ శ్రీమద్భగవద్గీత..।విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి తను సృజించిన ప్రకృతి గురించి వివరణ ఇస్తున్నాడు.అర్జునా!ఓ పార్థా!నీవు నీ చుట్టూ చూస్తున్న ప్రకృతి ఎక్కడ నుంచి పుట్టింది అనుకుంటున్నావు?ఇదంతా నా సృజనే!నా ఈ ప్రకృతి ఎనిమిది భాగాలుగా విభజింప బడి ఉన్నది.భూమి,నీరు,అగ్ని,వాయువు,ఆకాశం,మనస్సు,బుద్ది మరియు అహంకారాలే ఆ ఎనిమిది విభాగాలు.

Thursday, 3 September 2026

మనుష్యాణాం సహస్రేషు

మనుష్యాణాం సహస్రేషు కశ్చి ద్యతతి సిద్ధయే। యతతా మపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః॥3॥7॥ శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగము,సాథన,జ్ఞానము ఊరికినే సులభంగా సంప్రాప్తించవు.ఖఠినమయిన దీక్ష,సాథన,జిజ్ఞాసలు అవసరము అని చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!నేను చెప్పేది వింటుంటే అంతా చాలా సులభమూ,సునాయాసమూ అనిపిస్తుంది కదా!అంత లేదు.నిజానికి ఏ వేయి మందిలో ఏ ఒక్కడికో మోక్షానికి ప్రయత్నించాలి అని అనిపిస్తుంది.అలాగ నిజంగా ప్రయత్నించే వేయి మంది యతులలో,ఏ ఒక్కడో నన్ను నిజంగా తెలుసుకో గలుగుతున్నాడు.కాబట్టి నిర్దిష్టమయిన ప్రణాళికతో ఇవి సాథన చేయాలి.

Wednesday, 2 September 2026

జ్ఞానం తేఽహం సవిజ్ఞానం

జ్ఞానం తేఽహం సవిజ్ఞాన మిదం వక్ష్యా మ్య శేషతః। యజ్ఞాత్వా నేహ భూయోఽన్యత్ జ్ఞాతవ్య మవశిష్యతే॥2॥7॥ శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి భరోసా ఇస్తున్నాడు.దేనికి?అత్యుత్తమమయిన జ్ఞానము బోథిస్తాను అని.అంతకంటే ఇంకేమి కావాలి,ఎవరికైనా? అర్జునా!హే పార్థా!సంశయానికి తావు లేకుండా సంపూర్ణంగా నన్ను ఎలా తెలుసుకోవాలో చెబుతాను,అన్నాను కదా!ఆ మాట పైన నిలబడి ఉంటాను.అసలు ఏది తెలుసుకుంటే,ఇంక ఏమీ వేరే తెలుసుకోవాలసిన పని లేదో,ఆ జ్ఞానం నీకు ఉపదేశిస్తాను.అది కూడా ఆషామాషీగా చెప్పాను అంటే చెప్పాను లా కాదు.ఈ లోకములో ఉండే జ్ఞానము అంతా ఔపోసన పట్టినట్లు ఉండే అనుభవ పూర్వకమయిన జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తాను.

Tuesday, 1 September 2026

మయ్యా సక్త మనాః పార్థ

శ్రీమద్భగవద్గీత... సప్తమోఽధ్యాయః...విజ్ఞాన యోగః... శ్రీ భగవానువాచ... మయ్యా సక్త మనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః। అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు॥1॥ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇందాక చెప్పిన మాటే మళ్ళీ నొక్కి నొక్కి చెబుతున్నాడు.ఈ ప్రయత్నం అంతా తను చెప్పేది బుర్రలోకి గట్టిగా పాతుకు పోవాలనే!అర్జునా!ఓ పార్థా!ఇందాకటి మాటే మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నాను.నా యందే మనస్సు నిలుపు.నన్నే ఆశ్రయించు.యోగరతుడవు కా!అంటే యోగమును ప్రీతితో ఆశ్రయించి,దానిలోనే మునిగి తేలడము.ఇలా చేస్తే నువ్వే కాదు ఎవరైనా సరే సరి అయిన మార్గములోకి వచ్చినట్లు లెక్క.అలాంటివాడు నిశ్శంకగానూ,సంపూర్ణంగానూ నవ్ను ఎలా తెలుసుకోవాలో చెబుతాను విను.

Monday, 31 August 2026

యోగినామపి సర్వేషాం

యోగినా మరి సర్వేషాం మద్గతే నాంతరాత్మనా। శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్తతమే మతః॥47॥6॥ ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్ఠోఽధ్యాయః... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలాంటి మానవుడు గొప్పవాడు అని చెప్పబడతాడో వివరిస్తున్నాడు.అర్జునా!ఓ మిత్రమా!నా యందే మనస్సు నిలుపు.శ్రద్ధతో నన్నే సేవించు.ఇది ఎందుకు చెబుతున్నానో తెలుసా?ఎందుకంటే అలా నన్నే శ్రద్ధగా సేవిస్తూ,మనసు నిండా నన్నే నింపుకునేవాడు యోగులందరిలోనూ గొప్పవాడు.ఈ విషయంలో అనుమానాలే అఖ్ఖరలేదు.నీవు నిస్సంశయంగా నమ్మవచ్చు. ఇట్లు ఉపనిషత్తులు,యోగశాస్త్రముగా పేరొందిన శ్రీ కృష్ణార్జున సంవాద రూపమయిన శ్రీమద్భగవద్గీతలో ఆత్మ సంయమ యోగము అను ఆరవ అధ్యాయము సమాప్తము...

Sunday, 30 August 2026

తపస్వి భ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి

తపస్వి భ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః। కర్మిభ్య శ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున॥46॥6॥ శ్రీమద్భగవద్గీత...।ఆత్మ సంయమ యోగము..... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలాంటి మానవుడు ఉత్తముడో వివరిస్తున్నాడు.అర్జునా!ఓ సఖా!కొంత మంది వేదోక్త కర్మలు అనుసరిస్తారు.ఇంకొందరు లోకములో ఉండే జ్ఞానాన్ని మొత్తమూ ఔపోసన పడతారు.ఇంకొక వర్గము ఘోరమయిన తపస్సులు చేస్తారు.వీళ్ళంతా ఒక ఎత్తు,యోగి ఇంకొక ఎత్తు.ఎందుకంటావా?యోగి అనేవాడు యోగ లేక ధ్యాన మార్గములో మనసును,శరీరాన్నీ తన అదుపులో ఉంచుకుంటాడు.నిస్స్వార్థంగా లోక హితము కోరుకుంటాడు. క్రమశిక్షణ,సమభావానికి పెద్ద పీట వేస్తాడు.కాబట్టి బావా!నీవు యోగివి కావాలి అని నా అభిలాష.ఎందుకంటే తాపసుల కన్నా,జ్ఞానుల కన్నా,వేదోక్తకర్మకుల కన్నా యోగియే సర్వ శ్రేష్టుడు.