Monday, 27 July 2026

ప్రశాంతాత్మా విగతభీః

ప్రశాంతాత్మా విగతభీ ర్బ్రహ్మచారి వ్రతే స్థితః। మన స్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః॥14॥6॥ శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రతి చిన్న వివరము కూడా చెబుతున్నాడు.ఇక్కడ మనము అర్జునుడి గొప్పదనం గురించి కూడా మాట్లాడుకోవాలి.జ్ఞానభిక్ష ఇచ్చేవారు భగవంతుడితో సమానం.అందుకనే మనము గురువును భగవంతుడు కంటే గొప్పగా,ముందర వరుసలో పెడతాము.ఆయనే కదా మనలను భగవంతుడికి చేరువ చేసేది.ఇక్కడ గురువు,భగవంతుడూ ఇద్దరూ ఒకరే!గురువుకి చెప్పాలని ఉన్నా శిష్యుడు ఆ జ్ఞానబోధను స్వీకరించే పరిస్థితిలో ఉండాలి కదా!ఏంది స్వామీ!యుద్ధమూ వద్దూ,నీ సుద్దులూ,బుద్ధులూ వద్దు.అని వెళ్ళిపోలేదు.రణరంగంలో బాసింపట్టు వేయించి,ఈ బలవంతపు ముక్తాయింపులు ఏంది అని విసుక్కోలేదు.ఇవన్నీ కృష్ణుడుతో అనగలిగే చనువు,స్నేహమూ ఉంది.కానీ మంచి ఎవరు చెప్పినా,కొత్త విషయాలు చెప్పినా,మన మంచి కోరి చెప్పినా...వారికి మనం గురువు హోదా ఇవ్వాలి.అది అర్జునుడు కృష్ణుడికి ఇచ్చాడు.అతను చెప్పే ప్రతి ఒక్క అక్షరాన్ని అమృత బిందువులాగా ఆస్వాదించాడు.జుర్రుకున్నాడు.సరైన మార్గంలో ప్రవర్తించాడు.ఇక్కడ శ్రీకృష్ణుడి శ్రమ వృథా కాలేదు.చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు వ్యర్థం కాలేదు.అనుకున్న ఫలితం దక్కింది. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!ఓ భరత శ్రేష్ఠా!మనము ముందర మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.భయపడకూడదు.బ్రహ్మచర్యం పాటించాలి.మనసును అదుపులో పెట్టుకోవాలి.ధ్యాస నా పైనే పెట్టాలి.ఆ స్థితిలో యోగాభ్యాసం చేయాలి.

Sunday, 26 July 2026

సమం కాయశిరోగ్రీవం

సమం కాయశిరోగ్రీవం ధారయ న్నచలం స్థిరః। సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్॥13॥6॥ శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్దునుడికి యోగాభ్యాసం చేయడానికి ఎలా కూర్చోవాలి,చూపు దేనిపైన నిలపాలి అనే వివరాలు కూడా చెబుతున్నాడు.అంటే ఒక విషయం ఎంచుకుంటే...కూలంకషంగా దాని పూర్వాపరాలు అన్నీ తెలియచేయాలి అన్నమాట.సగం ఇక్కడ,సగం మింగేసి,సగం మనకే తెలియక,ఇంకొంచెం మర్చిపోయి,మరింకొంచెం...ఆ ఇది కూడా మనమే చెప్పాలా?ఆ మాత్రం ఇంగితం లేకపోతే ఎలా?మనషి అన్నాక!ఇలా ఆలోచించి మనం ఏదీ సంపూర్ణంగా చెప్పము.కానీ దేవదేవుడైనా ఎంత ఓపికగా చెబుతున్నాడు చూడు,అర్జునుడికి.అర్జునుడు ఏమీ అడ్డబాల కాదు.కానీ నేర్పించాలి అనుకున్నప్పుడు సంపూర్ణంగా తెలియచేయాలి.అది ధర్మం! అర్జునా!కిరీటీ!శుభ్రమయిన ప్రదేశంలో,సముచిత ఆసనం ఏర్పరుచుకుని కూర్చోవాలి అని చెప్పాను కదా!అప్పుడు శరీరం,మెడ,శిరస్సు ఒకే లంబంలో ఉంచాలి.నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే...కొంచెం మంది గూని లాగా ముందరకు వంగుతారు.లేకపోతే జారగిల పడతారు.అసలు పద్మాసనం వేసుకుంటారో,లేదో?కూర్చున్న తరువాత పక్కన ఏముంది?వెనక ఏమి జరుగుతుంది అని యావకు అటూ ఇచూ చూస్తుంటారు.అట్లా అంతా వేషాలు వేయకూడదు.కదలకుండా,చలన రహితంగా ఉండాలి.దిక్కులు చూడకుండా,చూపును ముక్కు కొన...అదే నాసికాగ్రం పైనే కేంద్రీకరించాలి.అర్థమయిందా?

Friday, 24 July 2026

త త్త్రైకాగ్రం మనః కృత్వా

తత్త్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియః। ఉప విశ్వాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్థయే॥12॥6॥ శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి సముచిత ఆసనం ఎలా తయారు చేసుకోవాలో చెప్పాడు కదా!ఇప్పుడు ఇంక అసలు వ్యవహారం గురించి చెబుతున్నాడు.అర్జునా!బావా!ఇప్పుడు నీకు యోగము చేసుకునేదానికి ఆసనం ఎలా ఉండాలి అని వివరించాను కదా!ఇప్పుడు అసలు కథ లోకి వస్తాము.యోగాసక్తుడు ఆ ఆసనం మీద స్థిరంగా కూర్చోవాలి.ఇంద్రియ కర్మలను నిరోథించాలి.మనసును ఏకాగ్ర చిత్తంతో నిలపాలి.అంటే భగవంతుడు తప్ప ఇంకో ధ్యాస ఉండకూడదు.చిత్తవృత్తి నిరోధాసక్తడు కావాలి.అంటే ఏమీ లేదు బావా!మనం గమ్మున కూర్చుని ఉంటే ఏమి చేస్తాము?ఇప్పుడేదైనా మంచిగా తింటే బాగుండు.లేక పోతే బాగా మంచి నిద్ర వేస్తాము.అదీ లేకపోతే ప్రక్కన వాళ్ళతో పనికిరాని మాటలు,యవ్వారాలు చేద్దాము అనిపిస్తుంది కదా!అట్లా మనసు చంచలం కాకుండా,ఏ కర్మల జోలికి పోకుండా ఉండాలి.ఒకరకంగా చెప్పాలంటే నిర్వికారంగా ఉండడం అభ్యాసం చేసుకోవాలి.అప్పుడు ఇంక యోగాభ్యాసానికి ఓంకారాలు,శ్రీకారాలు చుట్టాలి.

Thursday, 23 July 2026

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిర మాసన మాత్మనః। నాత్యుచ్ఛ్రితం నాతినీచం చేలాజిన కుశోత్తరమ్॥11॥6॥ శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి చిన్న చిన్న మెళకువలు,పాటించాల్సిన విషయాలు కూడా ఓపికగా,విసుగు లేకుండా చెబుతున్నాడు.అర్జునా!ఓ కౌంతేయా!నేను నీకు యోగాభ్యాసం చేయాలి అని చెప్పాను కదా!దానికి ఎలా అన్నీ సరి చూసుకోవాలో కూడా చెబుతాను,విను.మంచి శుభ్రమయిన ప్రదేశం ఎంచుకోవాలి.మరీ అంత ఎత్తు,మరీ అంత కురచగా లేని పీఠం ఎన్నుకోవాలి.దాని పైన దర్భలు వేయాలి.ఆ పైన జింక లేక పులి చర్మము పరవాలి.దాని పైన శుభ్రమయిన వస్త్రము పరవాలి.ఆసనమును ఇలా ఏర్పరుచుకోవాలి.

Tuesday, 21 July 2026

యోగీ యుంజీత సతతం

యోగీ యుంజీత సతత మాత్మానం రహసి స్థితః। ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీ రపరిగ్రహః॥10॥6॥ శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగాభ్యాసం అనేది ఎలా చేయాలో చెబుతున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!యోగాభ్యాసం అనేది ఎలా చేయాలో చెబుతాను,విను. కళ్ళకు ఇంపుగా కనిపించిందంతా ఇంటికి తెచ్చేసుకుందాము అనిపిస్తుంది కదా!ముందర అది వదులుకోవాలి.ఆశలను వదులుకోవాలి.ఇంద్రియాలను,మనస్సునూ మన స్వాథీనంలో ఉంచుకోవాలి.అవి చెప్పిన వాటికంతా గంగిరెద్దులాగ తల ఊపి,ముందూ వెనకా చూసుకోకుండా దూకడం కాదు.మనసును నిశ్చలంగా ఉంచుకోవాలి.మనం పది మందిలో కూర్చుంటే ఏమవుతుంది?లోకాభిరామాయణం వినాల్సి వస్తుంది.మనసు చంచలం కదా!వాటన్నిటి పైకి మరలుతుంటుంది.ఈ ఝంఝాటకం అంతా లేకుండా,ఏకాంత వాసంలో యోగాభ్యాసం చెయ్యాలి.అప్పుడు మనసు ప్రలోభాలకు దూరంగా ఉండి,మనం అనుకున్న మార్గంలో పయనించగలతాము.

Monday, 20 July 2026

సుహృన్మిత్రా ర్యుదాసీన

సుహృన్మిత్రా ర్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు। సాధుష్వపి చ పాపేషు సమబుద్ధి ర్విశిష్యతే॥9॥6॥ శ్రీమద్భగవద్గీత...।ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి సమతుల్యము,సమదృష్టి,సమబుద్ధి యొక్క ప్రాముఖ్యత మళ్ళీ,మళ్ళీ చెబుతున్నాడు.మన జీవిత విథానంలో దాని అవసరము నొక్కి వక్కాణిస్తున్నాడు.అర్జునా!ఓ కుంతీ పుత్రా!ఏంది?మా బావ ఊరికినే ఊదర గొడుతున్నాడు ఒకే విషయాన్ని అని అనుకోకు.మనిషి జీవితంలో సమతుల్యత,సమదృష్టి,సమబుద్ధి అనేవి లేకపోతే ఎంత ప్రమాదకరమో నీకు అర్థం కావాలని నా తపన.అవి లేక పోతే మన జీవితాలు అతలాకుతలం అవుతాయి.దుఃఖభాజనాలు అవుతాయి.మనిషిని మనిషిగానే చూద్దాము.వాడు శత్రువా,మిత్రుడా,రెంటికీ చెందని వాడా?ఎప్పుడూ ఉదాసీనంగా,దేనికీ స్పందించని రకమా?సహృదయంతో మనలను అర్థం చేసుకునేవాడా?బంధువా?సాథువా?లేక దుర్మార్గుడా?దుష్టుడా?ధూర్తుడా?ఎదుటి వాడు ఎవరైనా ఒకేరకంగా చూద్దాము.చూడడం నేర్చుకుందాము.అలా అందరి యందూ సమబుద్ధి గలవాడే యోగిశ్రేష్టుడు అనబడతాడు.శ్లాఘింపబడతాడు.

Sunday, 19 July 2026

జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా

జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః। యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనః॥8॥7॥ శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగి శ్రేష్ఠుడు ఎలా ఉండాలో చెబుతున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!ఇప్పుడే నీకు పరమత్మానుభవము అనేది ఎలా పొందవచ్చో చెప్పాను కదా!ఇప్పుడు మనం యోగి శ్రేష్ఠుడు ఎలా ఉండాలో చెప్పుకుందాము.అందరినీ,అంతటినీ సమాన దృష్టి తో చూసేవాడు,చూడగలవాడే యోగి అని నా అభిప్రాయము.ఉదాహరణకు కొన్ని చెప్పుకుందాము.మనము మాములుగా ఏమి చేస్తాము?మనకు తెలిసిన వాళ్ళు,మనకు ఇష్టమయిన వాళ్ళు,మనమంటే ఇష్షమయిన వాళ్ళు కనిపిస్తే?ఎగిరి గంతేసి,వాళ్ళ చంకన ఎక్కినంత పని చేస్తాము.అదే మనకు శత్రువులు,మనమంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు,మనకు ఎవళ్ళని చూస్తే కోపం,విసుగు,చీదర నషాళం అంటుతుందో..అలాంటి వాళ్ళు ఎదురైతే ఏమి చేస్తాడు?పొద్దున లేయగానే ఎవరి మొఖం చూసామో...ఈ చండాలం అంతా ఎదురుపడుతుంది అని అనుకుంటాము కదా!ఇక్కడే మనకు,యోగికి తేడా కొట్టొచ్చినట్లు కనపడేది.యోగి శత్రువు,మిత్రుడు,తటస్థంగా ఉండేవాళ్ళు,ఉదాసీనంగా ఉండేవారు,మంచి మనసు ఉండేవారు,బంధువులు,సాథువులు,దుర్మార్గులు,దుష్టులు...ఇలా ఎవరైనా సరే...అందరి విషయంలోనూ ఒకేరకమైన భావముతో ఉంటారు.అతి ప్రేమలు,అతి శత్రుత్వాలు మనసుకు అనుకోరు,స్పందించరు.అలాంటి వారినే శ్రేష్ఠమయిన యోగి అని అంటారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తాము.జ్ఞానము,విజ్ఞానము యొక్క సహాయముతో మనిషి యోగి కావాలి.మట్టిని అయినా,రాయిని అయినా,బంగారాన్ని అయినా సమదృష్టితో చూడగలగాలి.స్థిరంగా అనగా కూటస్థంగా ఉండాలి.ఇంద్రియాలను జయించి,భగవద్భక్తిలో తరించిన వాడిని యుక్తుడు అని అంటారు.