geethaasaaramu
Sunday, 16 August 2026
ఆత్మౌపమ్యేన సర్వత్ర
ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున।
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః॥32॥6॥
శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి మనిషి భావజాలము ఏ రీతిలో ఉండాలి అనే విషయము చెబుతున్నాడు.అర్జునా!ఓ కుంతీపుత్రా!నన్ను కొడితే నాకు నొప్పి అనిపిస్తుంది కదా!మరి నిన్ను కొడితే వింజామరలు వీచినట్లు ఉంటుందా?ఉండదు కదా!నీకు కూడా నొప్పే అనిపిస్తుంది కదా!ముందర మనము అది గ్రహించాలి.ప్రతి ప్రాణి స్పందన ఒక విషయానికి ఒకేలాగ ఉంటుంది అని.కాబట్టి ఎదుటి వారి సుఖ దుఃఖాలను మనవి లాగ మనము స్పందించగలగాలి.అందరి కష్టము మన కష్టము,అందరి సుఖము మన సుఖము.ఈ సత్యము మనం తెలుసుకున్న నాడు మనమే యోగులము,యోగిశ్రేష్టులము అవుతాము.ఎందుకంటావా?అందరి నొప్పి మనకు నొప్పి అంటే ఎదుటి వారికి ఆ నొప్పి కలుగకుండా జాగ్రత్త పడతాము.అందరి ఆనందము మన ఆనందము అనుకుంటే సాంఘిక న్యాయము,ప్రశాంతతలకు పాటుపడతాము.
Saturday, 15 August 2026
సర్వభూతస్థితం యో మాం
సర్వభూతస్థితం యో మాం భజత్యే కత్వమాస్థితః।
సర్వథా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే॥31॥6॥
శ్రీమద్భగవద్గీత..।।ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి సమదృష్టి ఉండడం ఎంత ముఖ్యమయిన ప్రక్రియో చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!ఇందాకటి నుంచీ నీకు చెబుతున్నాను కదా నేను సర్వాంతర్యామిని అని.నేను నీలో ఉంటాను,నీ చుట్టూ ఉంటాను.అలానే సర్వభూతాలలోను ఉపస్థితమై ఉంటాను.ఆ విషయం మనకు అర్థం అయింది అనుకో,అప్పుడు ఎవరినీ చులకన భావంతో చూడము.అందరికీ గౌరవము ఇస్తాము.ఎందుకంటే నేను నేను కాదు,నాలో పరమాత్మ ఉన్నాడు.నీవు నీవు కాదు.ఎందుకంటే నీలోనూ పరమాత్మ ఉన్నాడు.అంటే అర్థం ఏంది?మన ఇద్దరమూ ఒకటే,సమానమే అని కదా అర్థము.అందుకే చెబుతున్నాను మిత్రమా.భేదభావం లేకుండా అన్ని ప్రాణులలో అంతర్హితంగా ఉన్న నన్ను ధ్యానించాలి.అప్పుడు ఆ ధ్యాని ఎవరైనా,ఏ స్థితిలో ఉన్నా నా యందే ఉంటాడు.
Friday, 14 August 2026
యో మాం పశ్యతి సర్వత్ర
యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి।
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి॥30॥6॥
శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇప్పుడే చెప్పాడు కదా యోగి తనలో అందరినీ,అందరిలో తనను చూసుకుంటాడు అని.ఆఁ!చూస్తే ఏమవుతుంది?అని కదా మనందరి అనుమానం.దానికి సమాథానం భగవంతుడే చెబుతున్నాడు.శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!ఓ మిత్రమా!నీకు ఇప్పుడు అసలు రహస్యం చెబుతాను.ఎవడైతే అన్ని ప్రాణుల యందు నన్నూ,నా యందు సమస్త ప్రాణులనూ చూస్తాడో వాడే యోగి.ఎందుకంటే యోగి తనలో ఉన్న దైవాన్నీ,పరమాత్మనీ చూడగలుగుతాడు.అలాగే అన్ని ప్రాణులలోనూ అదే దైవాన్ని చూడగలుగుతాడు.అందుకే అతనికి అందరూ సమానమే అనిపిస్తుంది.అంతే కాదు,సఖా.అలాంటి వాడి యందే నా దృష్టి అన్ని వేళలా ఉంటుంది.వాడి దృష్టీ నా యందే సతతం ఉంటుంది.అంత కంటే మోక్షం,పరమార్థం ఇంక ఏమి ఉంటుంది చెప్పు,మానవుడికి?
Thursday, 13 August 2026
సర్వభూతస్థ మాత్మానం
సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని।
ఈక్షతే యోగ యుక్తాత్మా సర్వత్ర సమదర్శనః॥29॥6॥
శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగాభ్యాసము వలన లాభాలు చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!యోగము అభ్యసించడం,మన జీవితంలో ఒక భాగం చేసుకోవడం వలన చాలా లాభాలు ఉన్నాయి,తెలుసా?అతనికి సమతా భావము ఉంటుంది.మళ్ళీ అదేంది అంటావా?అంటే అన్ని ప్రాణులనూ సమదృష్టితో చూడగలుగుతాడు.నీవే నేను,నేనే నీవు లాగ అనుకో!అన్ని జీవాల యందు తనను చూసుకుంటాడు.తన యందు సర్వభూతాలనూ దర్శిస్తాడు.అంతే కదా!మనము ఎవరిని సమ ఉజ్జీలు అనుకుంటాము?మనకు ఉన్న శక్తియుక్తులు ఎదుటి వాడిలో ఉన్నప్పుడే కదా!సర్వ ప్రాణులను సమంగా చూడడమంటే?చిన్న అయినా పెద్ద అయినా,బలవంతుడు అయినా బలహీనుడు అయినా..।అలా ప్రతి ప్రవృత్తిలో మనలను మనం ఎదుటి జీవిలో చూసుకోగలగాలి.
యుంజన్నేవం సదాత్మానం
యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః।
సుఖేన బ్రహ్మ సంస్పర్శ మత్యంతం సుఖ మశ్నుతే॥28॥6॥
శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఓ మిత్రమా!నేను నీకు చెప్పే ప్రతి విషయమూ ఆచరించడము చాలా కష్టము.కానీ నీవు ఒకటి అర్థం చేసుకో.అది నిజంగా సులభతరమయితే నీవు అసలు నా దగ్గర ఇంత సేపు చెప్పించుకోవు కదా!అది కష్టతరము కానీ అనుభవయోగ్యము కాబట్టి నేను నీకు చెప్పే ప్రయత్నము చేస్తున్నాను,నీవు అర్థం చేసుకోవాలని తాపత్రయ పడుతున్నావు.
బావా!మనము ఎటువంటి దోషభావాలు లేకుండా మనసును యోగమందు నిమగ్నం చేయాలి.అట్లా చేయగలిగితే ఆ యోగి బ్రహ్మ జ్ఞానం పొందగలుగుతాడు.శాశ్వత ఆనందం అదే కైవల్యం పొందుతాడు.ఇందులో ఎలాంటి అనుమానమే లేదు.
Monday, 10 August 2026
ప్రశాంత మనసం హ్యేనం
ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖ ముత్తమమ్।
ఉపైతి శాంతరజసం బ్రహ్మభూత మకల్మషమ్॥27॥6॥
శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!నేను ఇందాకటి నుంచీ ఇంద్రియ నిగ్రహము గురించి చెబుతున్నాను కదా!అంతే ముఖ్యమయినది ఇంకొకటి ఉంది.అది ఏందో నువ్వు చెప్పగలతావా?ఆలోచించు.సరే!నేనే చెబుతాను,విను.మనసును నిష్కల్మషంగా,ప్రశాంతంగా పెట్టుకోగలగడం.ఎందుకంటావా?మనము ఏదో సాధించాము అనే భావన వచ్చింది,అనుకో.మనకు తెలియకుండానే గర్వం పొడచూపుతుంది.ఆ విషయం మనకు కూడా తెలియదు.మిగిలిన విషయాలు చాలా తృణప్రాయంగా,లెఖ్ఖలోనికి రానివిగా తీసేస్తాము.ఆ చులకన భావము,ఆ విసుగు,ఆ ఛీదర,ఆ ఛీత్కారము మనము పక్కన పెట్టాలి.ఎదుటి వారి మనసు నొప్పించ కూడదు...తెలిసి గానీ,తెలియక గానీ.ఆ స్పృహ మనకు ఖచ్ఛితంగా ఉండాలి.అది ఉండాలంటే మొదట మన మనసు ప్రశాంతంగా ఉండాలి,ఉంచుకోగలగాలి.మనిషికి తెలివి తేటలు ,జ్ఞానము ఎంత ముఖ్యమో..।మంచి మనసు,సమభావము,దయ,దాక్షిణ్యం కూడా అంతే ముఖ్యము.అలా ఉన్నప్పుడే బ్రహ్మానందానుభూతి తనకు తానై వచ్చి మన ఒడిలో వాలుతుంది.మన కైవసము అవుతుంది.
Sunday, 9 August 2026
యతో యతో నిశ్చరతి
యతో యతో నిశ్చరతి మన శ్చంచల మస్థిరమ్।
తత స్తతో నియమ్యైత దాత్మన్యేవ వశం నయేత్॥26॥6॥
శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక విషయం పదే పదే చెబుతున్నాడు.అంటే దాని అర్థం ఏంటి?అది మన జీవిత విథానానికి చాలా ముఖ్యం అని కదా!ఆయనకు ఇంక వేరే పని పాటలు లేక కాదు కదా!అర్జునా!ఓ బావా!మనసు చంచలమయినది అని నాకు తెలుసు,నీకు కూడా తెలుసు.అలాగని అది చెప్పినట్లల్లా మనం ఆడకూడదు.ఒక నియంత్రణ,నియమం అంటూ పెట్టుకోవాలి.లేకుంటే అది మన చేత కథాకళి ఆడిస్తుంది.అలాంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయాలో నువ్వు చెప్పు?జ్వరం వస్తే మనం ఏమి చేస్తాము?లంఖణాలు ఉంటాము.పత్యం పాటిస్తాము.మందులు వేసుకుంటాము.ఇవన్నీ మనం ఇష్టమయి చేయము కదా!మళ్ళీ బండి మామూలు కావాలి కాబట్టి చేస్తాము.అలానే మనసు చంచలమయినదని అది ఆడించినట్లంతా ఆడకూడదు.విషయాల వైపుకు పోకుండా నిగ్రహించాలి.మనసును ప్రశాంతమయిన ఆత్మ వైపుకు తిప్పుకోవాలి.పరమాత్మ వైపుకు మళ్ళించి,అతని వశంలోకి మనం వెళ్ళాలి.
Subscribe to:
Posts (Atom)