Saturday, 28 February 2026
భయా ద్రణా దుపరతం
భయా ద్రణా దుపరతం మంస్యన్తే త్వాం మహారథాః।
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్॥35॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి అద్దం చూపిస్తున్నాడు.అతను యుద్థం చేయక పోతే పరిస్థితి ఎంత దీనంగా ఉండబోతుందో కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్నాడు.అయ్యో అర్జునా!జరగబోయేది నీకు అర్థం కావడం లేదు.నీవు ఇప్పుడు యుద్థం చేయకపోతే ఏమవుతుందో నేను చెబుతాను విను.ఇప్పుడు రథులు,అర్థ రథులు,మహారథులు అందరూ నిన్ను ఒక పెద్ద వీరశిరోమణి అని భావిస్తున్నారు.అది కూడా నిజమే అనుకో!కానీ నీవు యుద్థరంగం నుంచి,క్షత్రియ ధర్మం నుంచి మొహం చాటేసిన మరు క్షణం నుంచీ నీ విలువ,గౌరవము అథః పాతాళానికి త్రొక్కి వేయబడతాయి.నీకంటే బలహీనులు కూడా నిన్ను గేలి చేస్తారు,అపహాస్యం చేస్తారు.నిన్ను పిరికివాడిగా చిన్నచూపు చూస్తారు.చులకన చేస్తారు.ఆ అవమానభారం నువ్వు మోయలేవు.తట్టుకోలేవు.నిన్ను గౌరవించి మర్యాద చేసేవాళ్ళు కనుచూపు మేరలో కానరారు.ఇది నిజం.నమ్ము.
అకీర్తిం చాపి భూతాని
అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేఽవ్యయామ్।
సంభావితస్య చాకీర్తిః మరణా దతిరిచ్యతే॥34॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము....
శ్రీకృష్ణుడు అర్జునుడిని కొంచెం బెదిరించి,ఇంకొంచెం నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.సన్నిహితుడి హితము కోరినపుడు సహేతుకమయిన మార్గాలు అన్నీ వెదకాలికదా!ప్రయోగించాలి కదా!
అర్జునా!నీవు పెద్ద వీరుడివి.అలాంటిది చేతులు ముడుచుకుని యుద్ధం చేయకుండా మొహం చాటేస్తే లోకం ఏమనుకుంటుంది?నీవు చెప్పే కాకమ్మ కబుర్లు,శాంతి సూత్రాలు అసలు కారణం అని నమ్ముతుంది అని ఆశ పడుతున్నావా?ముమ్మాటికీ లోకం అలా ఆలోచించదు.నీవు పిరికి పందవి అని ముద్ర వేస్తుంది.ఓటమికి భయపడి అస్త్ర సన్యాసం చేసావు అంటుంది.ఈ అపకీర్తి నీవు పోయినా పోదు.ప్రజలు కథలు కథలుగా నీ చేతకానితనం అని అభివర్ణిస్తారు.నీవు అభిమాన ధనుడివి.అలాంటి నీకు ఇలాంటి అపకీర్తి శరాఘాతం కాదా?ఆత్మహత్యాసదృశం కాదా?దానికంటే మరణమే వెయ్యి రెట్టు మేలు కాదా?ఆ అవమానభారం నీవు తట్టుకోగలవా?ఛీత్కారంగా,తుస్కారంగా నీవైపు చూసే చూపులు నీవు నిలువరించగలవా?నీవే తేల్చుకో!
Friday, 27 February 2026
అథచే త్త్వమిమం ధర్మ్యం
అధచేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి।
తత స్స్వధర్మం కీర్తిం చ హిత్వా పాప మవాప్స్యసి॥33॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము....
శ్రీకృష్ణుడు అర్జునుడికి హితవు చెబుతున్నాడు.అర్జునా!నా ప్రియ నేస్తమా!నేను నీకు చెప్పాను యుద్థం అనేది క్షత్రియ ధర్మము అని.నీవు ఈ ధర్మ బద్ధమయిన యుద్థం చేయలేదు అనుకో చాలా నష్టపోతావు.అవి ఏందంటావా?చెబుతా విను.నీకు ఎంత మంచి పేరు,యశస్సు ఉంది!అదంతా క్షణంలో మటుమాయమవుతుంది.ధర్మాన్ని అనుసరించని వాడిని ఏమంటరు?ధర్మ భ్రష్టుడు అని అంటారు.అట్లాంటి పేరు తెచ్చుకోవాలని ఉందా నీకు?చెప్పు?మౌనం అర్థంగీకారం అని అంటారు కదా!కౌరవులు తప్పు త్రోవలో పోతున్నారు.ఆ విషయం తెలిసీ,వారిని అరికట్టగలిగే శక్తి ఉండి కూడా మిన్నకుంటే ఏమవుతుంది?అసలు తప్పు చేసినవాడికంటే ఎక్కువ పాపాత్ముడివి అవుతావు.అలా అథోగతి పాలు కావడం అంత అవసరమా ఇప్పుడు నీకు.చెప్పు.మాట్లాడు.సమాథానం ఇయ్యి.దుష్టులను ఉపేక్షించడం చాలా పెద్ద నేరము.
Thursday, 26 February 2026
యదృచ్ఛయా చోపపన్నం
యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వార మపావృతమ్।
సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధ మీదృశమ్॥32॥2॥
శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి తాయిలం చూపిస్తున్నాడు.అర్జునా!అందగాడా!నీవు కలలో కూడా ఊహించని అదృష్టం నీ తలుపు తడితే ఏమి చేస్తావు?ఊహలకు కూడా అందని అదృష్టం నా చెంతకు నీజంగా ఎందుకు వస్తుంది అని అనుమానంతో,భయంతో తలుపులు మూసుకునే కూర్చుంటావా?లేక ఎగిరి గంతేసి,నాకు సుడి తిరిగిందోచ్,అనుకుంటూ పరుగెత్తి తలుపు తెరిచి స్వాగతం పలుకుతావా?ఏమి చేస్తావు?ఖచ్చితంగా రెండోదే కదా!ఆ నమ్మకం నీ మీద నాకు కూడా ఉంది.
ఇప్పుడు యుద్ధం కూడా అలా అయాచితంగా,మన ప్రమేయం లేకుండా,తెరుచుకున్న స్వర్గ ద్వారాలు అనుకో!ప్రతి ఒక్క రాజుకు ధర్మ సంస్థాపన కొరకు యుద్థం చేసే అవకాశం రాదు.అది నీకు దక్కింది.అడగకనే దేవుడు నీకు వరమిచ్చాడు అనుకో!ఇంతటి అదృష్టం ఎంత మంది రాజులకు దక్కుతుంది చెప్పు?వచ్చిన బంగారం లాంటి అవకాశం జారవిడుచుకోకు.సద్వినియోగం చేసుకుని కీర్తి పతాకం ఎగురవెయ్యి.ఇదే నా సలహా నీకు.నీ మంచి కోరి చెబుతున్నాను.
స్వధర్మమపి చావేక్ష్య
స్వధర్మ మపి చావేక్ష్య న వికంపితు మర్హసి।
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోఽన్యత్ క్షత్రియస్య న విద్యతే॥31॥2॥
శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి తన ధర్మంగురించి చెబుతున్నాడు.అర్జునా!ఆప్తమిత్రా!ఇవన్నీ వదిలేసెయ్యి.నేను చెప్పేది ఈ ఒక్కటి విను.ఈ ఆత్మలు,జీవులు అన్నీ మరచిపో.మనకంటూ ఒక ధర్మం ఉంటుంది కదా!అది నీకూ తెలుసు కదా!అది ఆచరించు.క్రొత్తగా ఏమీ చేయనక్కరలేదు.గందరగోళం,గలభా అవసరమే లేదు.నీవు క్షత్రియుడివి కదా.క్షత్రియ ధర్మం ఏంది?నువ్వే చెప్పు.యుద్ధం కదా!అదే పాటించు.ఎలాంటి అపోహలు అక్కరలేదు,అనుమానాలు అక్కర లేదు.అవగాహనా రాహిత్యం అసలు అవసరం లేదు.తలలు బద్దలు కొట్టుకో బళ్ళేదు.తల పట్టుకోనక్కరలేదు.మన ధర్మాన్ని తు చ తప్పకుండా పాటిస్తే చాలు.సంశయానికి తావు ఉండదు.ఆత్మ తృప్తి కలుగుతుంది.
Wednesday, 25 February 2026
దేహీ నిత్య మవధ్యోఽయం
దేహీ నిత్య మవధ్యోఽయం దేహే సర్వస్య భారత।
తస్మా త్సర్వాణి భూతాని న త్వం శోచితు మర్హసి॥30॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి మంచిగా చెబుతున్నాడు.అర్జునా!అన్ని దేహాలలోనూ ఉన్నది ఆత్మే.అది చంపదు,చంపబడదు.అది నిత్యము.అది సత్యము.కాబట్టి అర్జునా!అర్థం చేసుకునేదానికి ప్రయత్నించు.ఈ జీవుల కోసం శోకించడం అనేది తగని పని.అసలు అవసరము లేదు.
ఆశ్చర్యవ త్పశ్యతి
ఆశ్చర్య వత్పశ్యతి కశ్చిదేన
మాశ్చర్యవ ద్వదతి తథైవ చాన్యః।
ఆశ్చర్యవచ్చైన మన్య శ్శృణోతి
శ్రుత్వా ప్యేనం వేద న చైవ కశ్చిత్॥29॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడికి అందరూ ఆత్మ గురించి ఏమనుకుంటారో బాగా తెలుసు.అదే అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!నువ్వు ఒక్కడివే కాదు ఆత్మ గురించి గందరగోళంలో ఉండేది.
ఒకడేమో ఆత్మను ఆశ్చర్యంగా చూస్తాడు.ఇంకొకడేమో ఆత్మ గురించి ఆశ్చర్యంగా పలుకుతున్నాడు.మరి ఇంకొకడు నోరెళ్ళ బెట్టుకుని ఆశ్చర్యంగా ఆత్మ గురించి వింటున్నాడు.
ఇట్లా ఒక సరైన అవగాహన లేకుండా చూడడం ద్వారా,చెప్పడం ద్వారా,వినడం ద్వారా ఏమీ ఒరగదు.అంటే లాభం లేదు.ఆత్మను అంత సులభంగా తెలుసుకోలేము,అర్థం చేసుకోలేము.
Subscribe to:
Comments (Atom)