geethaasaaramu
Monday, 6 July 2026
యోన్త స్సుఖోఽంతరారామ
యోన్తస్సుఖోఽంతరారామ స్తథాంతర్జ్యోతి రేవ యః।
స యోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోఽధి గచ్ఛతి॥24॥5॥
శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము....
శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మ తత్త్వం పొందగలిగే మార్గం చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!మనము బాహ్య ప్రపంచం,బాహ్య సుఖాలకు అతీతంగా ఉండగలగాలి.ఆత్మ యందే సుఖించాలి.అంతరారామః అంటే ఆత్మ యందే రమించడం,అంటే విలీనమయిపోగలగాలి.అంతర్జ్యోతి అనగా స్వచ్ఛంగా మన మనసులను ఉంచుకోగలిగినపుడు ఆత్మ జ్ఞానంతో స్వయంప్రకాశం చెందుతుంది.అలాంటి యోగము సాథన చేసిన యోగి బ్రహ్మకు ప్రియుడు అవుతాడు.అలాగే బ్రహ్మ తత్త్వాన్ని,మోక్షాన్ని పొందుతున్నాడు.
శక్నోతీహైవ యస్సోఢుం
శక్నోతీహైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్।
కామక్రోధోద్భవం వేగం స యుక్త స్స సుఖీ నరః॥23॥5॥
శ్రీకృష్ణుడు అర్జునుడికి విశదీకరిస్తున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!పండితుడు కావడం,బ్రహ్మవేత్త కావడం అనేది అనుకోగానే అయిపోము.చిటికేస్తే అయిపోము.దానికి నిరంతర సాథన కావాలి.ప్రణాళిక కావాలి.నిబద్ధత కావాలి.చాలా సార్లు ఆ పయనంలో ఒక జన్మ సరిపోదు.దీక్ష,దక్షత,సమత్త్వం,అకుంఠిత సాథన అవసరము.కాబట్టి నేను నీకు చెబుతున్నాను.ఎవడైతే తన నిర్యాణం ఆసన్నం అయ్యేలోపల కామక్రోథాలను పగ్గాలు వేసి నియంత్రణలో పెట్టుకుంటాడో వాడే యోగి.మనఃచాంచల్యాన్ని అరికట్టగలవాడే అసలు సిసలైన యోగి.అతనే ఆత్మానందంతో సర్వసుఖాలూ పొందుతాడు.ఆత్మజ్ఞానము,ఆత్మతృప్తి మోక్షానికి మొదటి మెట్లు.
Sunday, 5 July 2026
యే హి సంస్పర్శజా
యే హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే।
ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః॥22॥5॥
శ్రీమద్భగవద్గీత..।కర్మ సన్న్యాస యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!ఓ కుంతీపుత్రా!అజ్ఞాని అంటే ఎవడు చెప్పు?జ్ఞానము లేని వాడు కదా!జ్ఞానము అంటే ఏంది?జ్ఞానము అంటే ముందు వెనక తెలిసి ఉండడము.పూర్వాపరాలు ఎరిగి ఉండము.తొందరపాటు లేకుండా ఉండడము.స్థిత ప్రజ్ఞత కలిగి ఉండడము.బాహ్య సుఖాలకు కాక ఆత్మ సంతృప్తికి పెద్దపీట వేయగలగడము.
ఇంద్రియ సుఖాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే మబ్బులు లాంటివి.మన జీవితం లోకి వచ్చి,అలానే కలకాలం తిష్ఠ వేసుకుని కూర్చోవు.ఉన్నప్పుడు ఎగిరెగిరి పడడం మామూలే!అవి లేనప్పుడు కుమిలి కుమిలి ఏడవడం ఇంకా మామూలే!దీని అర్థం ఏమిటి?ఇంద్రియ సుఖాలు తాత్కాలికమయినవి.చివరకు వచ్చేటప్పటికి దుఃఖ కారకాలుగా పరివర్తన చెందుతాయి.కాబట్టి జ్ఞాని అనేవాడు ఏమి చేస్తాడు?ఈ ఒడిదుడుకులు,ఎత్తుపల్లాలు నాకు అఖ్ఖరలేదు అనే నిర్ణయానికి వస్తాడు.ఈ చంచలమయిన సుఖాలూ వద్దు..।తదుపరి వెన్నంటి వచ్చే దుఃఖాలూ వద్దనే వద్దు అనుకుంటాడు.నిజమే కదా!
Saturday, 4 July 2026
బాహ్య స్పర్శే ష్వసక్తాత్మా
బాహ్య స్పర్శే ష్వసక్తాత్మా విందత్యాత్మని య స్సుఖమ్।
స బ్రహ్మ యోగ యుక్తాత్మా సుఖమక్షయ మశ్నుతే॥21॥5॥
శ్రీమద్భగవద్గీత..।కర్మ సన్న్యాస యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మతృప్తి గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ భరతశ్రేష్టా!ఇప్పుడే మనము బ్రహ్మవేత్త,పండితుడు గురించి తెలుసుకున్నాము కదా!అలాంటివాడికి బాహ్య ప్రపంచంతో సంబంథం లేదు.ప్రతిదీ ఆత్మ సాక్షిగానే స్వీకరిస్తాడు.అతను అలౌకికమయిన ఆనందాన్ని,బ్రహ్మాన్ని ఆత్మలోనే దర్శిస్తాడు.మోక్షము అంటే దుఃఖానికి తావు లేనిది.అదే కదా ఆనంద నిలయం అంటే.ఇలాంటి బ్రహ్మవేత్తలు శాశ్వత ఆనందాన్ని,బాహ్య ప్రపంచంతో సంబంథం లేకుండా పొందగలతారు.ఆస్వాదించగలతారు.
న ప్రహృష్యే త్ప్రియం ప్రాప్య
న ప్రహృష్యే త్ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చాప్రియమ్।
స్థిరబుద్థి రసమ్మూఢో బ్రహ్మవి ద్బ్రహ్మణి స్థితః॥20॥5॥
శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!పండితుడు అనేవాడు అన్నింటినీ సమదృష్టితో చూస్తాడు అని చెప్పాను కదా,ఇప్పుడే!ఇప్పుడు బ్రహ్మవేత్త,బ్రాహ్మణుడు గురించి చెబుతాను.సుఖాలకు ఎగిరెగిరి పడడం మన ఆనవాయితీ కదా!అదే కష్టం వస్తే..నాకే ఎందుకు ఇలా అంటూ విల విల లాడి పోవడం మన పోకడ,నైజం.కానీ స్థిర బుద్ధి కలవాడు ఎలా ఉంటాడో చెబుతాను ,విను.అతను సుఖమయినా,దుఃఖమయినా ఒకేలాగ స్పందిస్తాడు.ఒక మాటలో చెప్పాలంటే నిర్వికారంగా ఉంటాడు.అంటే గండ పెండేరం తొడిగినా ఒకేలాగ ఉంటాడు.గంజి నీళ్ళు ముఖాన కొట్టినా అలాగే ఉంటాడు.అంటే అతిశయమయినా,అవమానమయినా,ఆనందమయినా..ఆవేదన అయినా ఒకేలాగ స్వీకరిస్తాడు.అంతా భగవంతుడి ప్రసాదమే అనుకుంటాడు.అతడినే బ్రహ్మవేత్త..బ్రాహ్మణుడు అని అంటారు.
Tuesday, 30 June 2026
ఇహైవ తైర్జిత స్సర్గో
ఇహైవ తైర్జిత స్సర్గో యేషాం సామ్యే స్థితం మనః।
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మా ద్బ్రహ్మణి తే స్థితాః॥19॥5॥
శ్రీమద్భగవద్గీత...।కర్మ సన్న్యాస యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!పార్థా!నేను నీకు పండితుడు అనే వాడు ఎలా ఉండాలి అని చెప్పాను?పండితుడు అనేవాడు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు,చండాలుడు,ఆవు,కుక్క,ఏనుగు,ఇలా ఎంత తారతమ్యము ఉన్న ప్రాణి అయినా...అన్నిటి యందు,అందరినీ సమదృష్టితో చూస్తాడు,ప్రవర్తిస్తాడు అని కదా!
అలాంటి పండితుడు ఈ జన్మలోనే సంసరాన్ని జయించిన వాడు అవుతాడు.అందరినీ,అంతటినీ సమంగా చూసేవాడు ఖచ్చితంగా సర్వ సమమయిన పరబ్రహ్మాన్ని చేరుకుంటాడు.అంటే కైవల్యం పొందుతాడు.ఇంతకంటే ఇంకేమి కావాలి,ఈ మానవ జన్మకు?
Monday, 29 June 2026
విద్యా వినయ సంపన్నే
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని।
శుని చైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః॥18॥5॥
శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి సమానత్వం గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!చీమనైనా,దోమనైనా..।మనిషినైనా,మృగాన్ని అయినా సృష్టించేది ఆ పరమాత్మే కదా!మనష్యులలో తేడాలు ఆయన కల్పించిన మాయ ద్వారానే కదా!అలాంటప్పుడు అందరూ సమానమే కదా!అమ్మ మనస్తత్త్వం ఎలా ఉంటుంది?పది మంది పిల్లలు ఉంటే అందరూ ఒకేలాగ ఉండరు కదా!కానీ అమ్మ అందరినీ సమానంగా చూస్తుంది కదా!ఒకడికి చీమిడి ముక్కులు కారుతున్నాయి అని అసహ్యించుకోదు.తన పమిటతోనే తుడుస్తుంది దగ్గరకు తీసుకుని.మెతకగా ఉండే బిడ్డకు ధైర్యం చెప్పి ముందుకు పంపిస్తుంది.తులవగా ఉండే బిడ్డను గదమాయించి,ఆపుతుంది.ఏ బిడ్డకు,ఎప్పుడు ఏమి కావాలో,ఏమి ఇవ్వాలో అమ్మకు తెలుసు.
ఎక్కడో ఉండే దేముడు,ఇక్కడే ఉండే అమ్మ బిడ్డలను సమానంగా చూస్తున్నారు కదా!మనకేమి అంత బాథ అందరినీ సమానంగా చూసేదానికి?
అలా అందరినీ,అంతటినీ సమానంగా చూడగలిగే వాడే పండితుడు.అర్జునా!ఉదాహరణకు చెబుతున్నాను.విద్యా వినయాలు గల బ్రాహ్మణుడు,చండాలుడు,ఆవు,కుక్క,ఏనుగు...ఈ సృష్టిలో ఉండే ప్రతి జీవినీ సమదృష్టితో చూస్తాడు పండితుడు.మనమూ అలా ఎందుకు ఉండకూడదు?
Subscribe to:
Posts (Atom)