Monday, 16 March 2026

ప్రజహాతి యదా కామాన్

శ్రీ భగవానువాచ.... ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్। ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞ స్తదోచ్యతే॥54॥2॥ శ్రీమద్భగవద్గీత..సాంఖ్య యోగము... మనల్ని ఎవరైనా ఏమన్నా అడిగితే వెంటనే సమాథానం చెప్పేస్తాము.తప్పో ఒప్పో,తరువాతి విషయం.అందులో శ్రీకృష్ణుడు భగవంతుడు,సర్వాంతర్యామి.అతనికి ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలకు సమాథానం చెప్పడం ఒక లెఖ్ఖా?మనం అడగాలి గానీ.శ్రీకృష్ణుడికి ఒకటి అర్థం అయింది.అర్జునుడికి జిజ్ఞాస పెరిగింది.తను చెప్పింది అర్థం చేసుకోవాలనే తపన మొదలు అయింది.అదే జ్ఞానోపాసనకు అంకురార్పణ అని కృష్ణుడు చాలా సంతోషించాడు.చెప్పడం మొదలు పెట్టాడు.అర్జునా!పార్థా!ఈ రోజు నీ అనుమానాలు అన్నీ ఓపికగా తీరుస్తాను.స్థిత ప్రజ్ఞుడు ఎవరు అని కదా నీ మీమాంస?మొదట సర్వవాంఛలనూ విసర్జించాలి.అంటే కోరికలనన్నిటినీ వదలి పెట్టాలి.ఆత్మయందే తాను ఆనందిస్తూ ఉండాలి. సముద్రము తీరం దగ్గర అలలు వస్తుంటాయి ఎప్పుడూ.అదే లోపలికి,ముందుకు పోయేకొద్దీ నిర్మలంగా ఉంటుంది.ఆటూ పోట్లూ కనిపించవు.అలా మనసును ప్రశాంతంగా పెట్టుకోగలగాలి.అలా ఉండగలిగిన వాడినే స్థిత ప్రజ్ఞుడు అను అంటారు.

స్థితప్రజ్ఞస్య కా భాషా

అర్జున ఉవాచ... స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ। స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్॥54॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి చాలా చాలా క్రొత్త క్రొత్త విషయాలు ఒక్కసారే చెపుతున్నాడు కదా!అర్జునుడికి దిమ్మ తిరిగిపోతుంది.ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు.శ్రేయోభిలాషి కదా ఎంతైనా!చెప్పింది విందాము లే అనుకున్నాడు.కానీ మరీ ఇంతనా?ఒకసారి యోగము అంటాడు.వెంటనే మోక్షము అంటాడు.ఊపిరి పీల్చుకునే లోపల సమన్వయం అంటాడు.కర్మ సిద్ధాంతం అంటాడు.పిచ్చి పట్టి పోతుంది.జుట్టు పీక్కోవటం మటుకే మిగిలింది.ఇట్లా అయ్యేది కాదు అని అర్జునుడు గొంతు సవరించుకుని చిన్నగా అడగడం మొదలుపెట్టాడు. హే కృష్ణా!హే సఖా!నీవు ఏందేందో చెబుతున్నావు.ఒక్క ముక్క కూడా అవగతం కావటంలేదు.ఈ స్థిత ప్రజ్ఞుడు ఎవరు?ఎక్కడినుంచి వచ్చాడు?అతడు ఎట్లా మాట్లాడతాడు?అతని గుణగణాలేంది?లక్షణాలు ఏంది?అతని స్థితిగతులు ఏంటి?అతను ఏమి చేస్తాడు?ఎట్లా కూర్చుంటాడు?ఎట్లా నిలుచుంటాడు?ఎలా ఉంటాడు?కొంచెం నాకు అర్థం అయ్యేలా చెప్పు స్వామీ!

Sunday, 15 March 2026

శ్రుతి విప్రతి పన్నాతే

శ్రుతి విప్రతి పన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా। సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి॥53॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!పొద్దున లేచి మనం ఏదో ఒకటి వింటుంటాము.అందులో కొన్నిటికి తీవ్రంగా స్పందిస్తాము.కొన్నిటికి ఒక మోస్తరుగా!కానీ స్పందించక మానము.దాని వలన మన మనసు చపలత పొందితుంది.ఇది కావాలి,అది వద్దు.దీనికి దగ్గర కావాలి,దానికి దూరం కావాలి.ఇంకో విషయం గురించి పలాయనం చిత్తగించాలి అనుకుంటాము.కానీ మన మనసు,బుద్ధి వీటన్నిటికంటే ఉన్నతంగా ఆలోచించాలి.స్థిత ప్రజ్ఞత ప్రదర్శించగలగాలి.స్థిరంగా,దేనికీ చలించకుండా,చిత్త చాంచల్యం చూపకుండా ఉండగలగాలి.అప్పుడే యోగాన్ని పొందగలతావు.యోగము అంటే ఓయమ్మో అని భయపడపనిలేదు.మనసును నిర్మలంగా ఉంచుకోగలగటమే,ఆటూపోటూ అనుకోకుండా.

యదా తే మోహకలిలం

యదా తే మోహ కలిలం బుద్ధి ర్వ్యతి తరిష్యతి। తదా గన్తాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ॥53॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి బుద్ధి కుశలత కొంచెం పెంచుకుంటే అన్ని విథాలా మంచిది అని సలహా ఇస్తున్నాడు.ఎంతైనా మిత్రుడు కదా!ఆ మాత్రం మంచీ చెడ్డా చెప్పకపోతే ఎలా? అర్జునా!నేను చెప్పినట్లు విను.ముందర ఈ మోహ పంకిలం,పాప పంకిలం నుంచి బయటపడు.అప్పుడుగానీ ఏదీ సరిగ్గా అర్థంకాదు నీకు.అసలైన దారి గోచరించదు.దాని నుంచి విడిపడినప్పుడే నీ బుద్ధిని పరిశుద్థం చేసుకోగలవు.ఇంక వేరే దగ్గర మార్గాలు లేవు.ఇప్పటికే విన్న విషయాలూ,ఇంక తదుపరి వినవలసిన విషయాలూ నుండీ బయటపడగలతావు.వైరాగ్యమనేది ఊరికే ఆషామాషీగా దక్కదు.మనకు గట్టిగా కావాలనుకున్నది ఒక్కటి దక్కకపోతేనే తీన్తార్ అవుతాము.అలాంటిది సర్వసంగ పరిత్యాగం అంటే మాటలు కాదు కదా!సతతం అభ్యాసం చేయాల్సిందే!దక్కేదాకా ఒక యజ్ఞం,దక్కిన తరువాత నిలబెట్టుకునే యత్నం.అర్థం అయిందా?

Thursday, 12 March 2026

కర్మజం బుద్ధియుక్తా హి

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః। జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్ఛ న్త్యనామయమ్॥51॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చిలకకు చెప్పినట్లు చెబుతున్నాడు ఓపిక నశించకుండా.రామ చిలకకు రెండు పలుకులు నేర్పించాలంటే ఎంత ఓపిక కావాలి?ఎంత ప్రేమ,సున్నితత్త్వంకావాలి?ఓర్పు,సహనం కావాలి.అవి అన్నీ కృష్ణుడు తనలో రంగరించుకుని అర్జునుడికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు. అర్జునా!నేను నీకు సమబుద్ధి అలవరించుకోమని చెప్పాను కదా?ఎందుకనుకుంటున్నావు?ఎందుకంటే సమబుద్ధి కలవాడు మొట్ట మొదటగా కర్మ ఫలాన్ని ముమ్మాటికీ ఆశించడు.దానికి ప్రతిఫలంగా జన్మబంధ విముక్తుడు అవుతాడు.చూసావా?ఏమీ కోరుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతే,వాటి సత్ఫలితాలు మన ముంగిట్లో వాలుతాయి.అట్లా కాకుండా ప్రతి కర్మకూ ఫలితం ఆశిస్తూ పరుగులు తీస్తే ఆయాసం,అలసట తప్ప ఇంకేమీ దక్కదు.ఒకసారి మనము జన్మ బంధ విముక్తులము అయ్యామంటే మోక్ష ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి.మనకు స్వాగత వచనాలు చెబుతాయి,ఆశీర్వాదాలు ఇస్తాయి.నా మాట నమ్ము.

Tuesday, 10 March 2026

బుద్ధి యుక్తో జహా తీహ

బుద్ధి యుక్తో జహా తీహ ఉభౌసుకృత దుష్కృతే। తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్॥50॥2॥ శ్రీమద్భగవద్గీత.।।సాంఖ్య యోగము... అర్జునుడికి కిటుకు చెబుతున్నాడు శ్రీకృష్ణుడు.అర్జునా!తెలివి గలవాడు ఏం చేస్తాడో నీకు తెలుసా?లెక్కలన్నీ ఎప్పటికప్పుడు చూసుకుని సమంచేసుకుంటాడు.సమబుద్ధి కలవాడు తన పాపపుణ్యాల లెక్కలను కూడా ఈ జన్మలోనే నశింపచేసుకుని జీవితమనే పలకను శుభ్రం చేసుకుంటాడు.ఎలాంటి అర్థం పర్థంలేని గీతలు ఉండకుండా.నా దృష్టిలో నువ్వు కూడా అలాంటి యోగాన్ని ఆశ్రయించి,అనుసరించి కర్మలను ఆచరిస్తే మంచిది అని నా అభిప్రాయం.నువ్వేమంటావు?

దూరేణ హ్యవరం కర్మ

దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ద్ధనంజయ। బుద్ధౌ శరణ మన్విచ్ఛ కృపణా ఫలహేతవః॥49॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి పదే పదే చెబుతున్నాడు.అర్జునా!నిష్కామ కర్మ,అనగా ప్రతి ఫలాపేక్ష లేకుండా చేసే పనులు,ఎప్పుడూ మంచివే!అదే ప్రతిఫలంకోరి చేసే పనులు హీనమయినవి.అట్లా ప్రతిఫలం కోరి కర్మలు చేసేవాళ్ళు అథములు అవుతారు.నీవు ఆ పనులకు దూరంగా ఉండు.నువ్వు ఆ వర్గంలో చేరకు.సమన్వయం పాటించు.సమబుద్ధి అవలంబించు.నీవు ఆధ్యాత్మిక జ్ఞానానికి పెద్ద పీట వెయ్యి.