Tuesday, 23 June 2026

యుక్తః కర్మఫలం త్యక్త్వా

యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్ఠికీమ్। అయిక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే॥12॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి కొత్త కొత్త పదాలు ఆవిష్కరిస్తున్నాడు.అర్జునా!పార్థా!నేను నీకు ఇప్పుడు నైష్ఠికుడు గురించి చెబుతాను.ఒక మనిషి అచంచల దీక్ష,నియమము,నిబద్ధతతో తను పెట్టుకున్న వ్రతాలు,సిద్థాంతాలు,నియమాలు ఆచరించాలి.ఎక్కడా తడబడకూడదు.వేరేవాటిపైన దృష్టి పెట్టకూడదు.ధర్మశాస్త్రాలు,ఆశ్రమ ధర్మాలు తూచా తప్పకుండా ఆచరించాలి.అలాంటివారిని నైష్ఠికులు అని అంటారు. నైష్ఠికులు ఫలాపేక్ష లేకుండా కఠినమయిన నియమ నిబద్థతలతో,జీవిత ప్రామాణాలతో జీవనం కొనసాగిస్తారు.అలాంటి మానసిక,శారీరిక పట్టుదలతో కర్మలను ఆచరిస్తారు.కాబట్టే శాంతి పొందుతారు.అదే ఎక్కడ మోహం,కోపం,తాపం,తామసం కూడుతాయో,అక్కడ మానవుడు ఫలాపేక్షకు బందీ అవుతాడు.ఇంకేమి ఉంది?గానుగకు కట్టిన ఎద్దులాగ అక్కడక్కడే తనుచేసే కర్మలకు,కర్మఫలాలకు బద్ధుడు అవుతాడు.సంసార బంథాలకు బానిస అవుతాడు,బాథితుడు అవుతాడు,తనను తానే బంథించుకుంటాడు.

Monday, 22 June 2026

కాయేన మనసా బుద్ధ్వా

కాయేన మనసా బుద్ధ్వా కేవలై రింద్రియైరపి। యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా త్మశుద్ధయే॥11॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.బావా!అర్జునా!నేను చెప్పాను కదా యోగి అనేవాడు సంసారములో ఉన్నా చిత్తశుద్ధికోసమే కర్మలు చేస్తాడు అని.చిన్ని నా పొట్టకు శ్రీరామ రక్ష అన్నట్లు ఉండడు అని.మళ్ళీ మళ్ళీ అదే చెబుతున్నాను.యోగులు ఫలాపేక్షను వదలి పెడతారు.కర్తృత్వాహంకారాన్ని దరిదాపులకు కూడా రానివ్వరు.వారి మనసు,బుద్ధి,ఇంద్రియాల నన్నిటినీ మనసు పవిత్రంగా,నిర్మలంగా,సంతృప్తిగా ఉండడం కోసరమే కర్మలు చేస్తారు.

Sunday, 21 June 2026

బ్రహ్మణ్యాధాయ కర్మాణి

బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః। లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా॥10॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉదాహరణలు కూడా చెబుతున్నాడు...బాగా అర్థం కావాలని.ఆయన తపనకు జోహార్లు!అర్జునా!నాకు ఏమీ వద్దు,నాకేమీ అఖ్ఖర లేదు అనే స్థితికి మనము ఎప్పుడు వస్తాము?మనము సంతృప్తిగా ఉన్నప్పుడే కదా!ఆ సంతృప్తి మనకు ఇంద్రియ లాలస ఉన్నంత కాలము దక్కదు.మనము ప్రక్కవాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తాము?వారికి మన దగ్గర ఉండేది ఎప్పుడు పంచుతాము?మన దగ్గర మనకు కావాలసిన దానికంటే ఎక్కువ ఉంటేనే కదా!మనకు అసలు ఏమీ అఖ్ఖర లేదు అంటే మనకున్నదంతా సంఘానికే కదా! మనకై మనమే మనకున్నది ఇచ్చేస్తే,పంచేస్తే...మనము వాటి పైన మోహము వదులు కున్న వారము అవుతాము.ఎదుటి వారు అడగ కుండానే ఇస్తున్నాము కాబట్టి మనమేదో గొప్పవారము,ఏదేదో సహాయము చేస్తున్నాము అనే అపోహలకు,భావనలకు దూరం అవుతాము.మనస్పూర్తిగా,ప్రతి ఫలాపేక్ష లేకుండా చేస్తాము కాబట్టి సంతృప్తిగా ఉంటాము.వారు తిరిగి మనకు సహాయం చెయ్యాలని ఆశించము,ఆరాటపడము. కాబట్టి ఓ పార్థా!అప్పుడు మనము తామరాకు పైన నీటి బొట్టులాగ అంటీ అంటనట్లు ఉంటాము.మనలను ఏ కర్మలూ బంథించలేవు.ప్రతిదీ ఈశ్వరుడికి నైవేద్యం చేస్తున్నాము అనుకుంటూ చేస్తూ పోతే ఏ పాపాలూ మనకు దరి చేరవు.

Saturday, 20 June 2026

నైవ కించిత్ కరోమీతి

నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేతత్త్వవిత్। పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్॥8॥ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిష న్నిమిషన్నపి। ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తన్త ఇతి ధారయన్॥9॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి మర్మం చెబుతున్నాడు.అర్జునా!మహాబాహో!ఇందాక నేను నిష్కామ కర్మ యోగి అని చెప్పాను కదా!అతను ఏమి చేసినా చేయనట్లే!ఆయన లెఖ్ఖలో కూడికలు,తీసివేతలు ఏమీ ఉండవు.అంటే ఈ మంచి పనులకు పుణ్యం సంపాదించాడు.ఈ చెడ్డ పనులకు ఇంత పాప భారం మోస్తాడు అని.ఎందుకంటే కార్యాచరణ కంటే ముందరే అతను నిర్ణయించుకుంటాడు.నేను ఆచరించే ప్రతి పనీ ఆ యా ఇంద్రియాలు నిర్వర్తిస్తాయి.నేను మనఃపూర్వకంగా ఏమీ చేయడం లేదు.వాటి ఫలితం నాకు అఖ్ఖర లేదు...మంచి అయినా,చెడు అయినా. ఉదాహరణకు ఆ కర్మ యోగి కనినా,వినినా,తాకినా,వాసన చూసినా,నిద్రించినా,శ్వాసించినా,మాట్లాడినా...అలా ఏ పని అయినా!దీంట్లో గొప్ప ఏముంది?ప్రతి జీవి చేసేది కదా!దాంట్లో పాపాలు,పుణ్యాలు ఏంది?మళ్ళా ఆ ఫలితాలు వద్దనుకోవడం ఏంది?అని నీకనిపిస్తుంది కదా? చెబుతాను,విను. చూడడం మామూలే.కానీ ఎదుటి వాళ్ళు ఏమి చేస్తున్నారు?ఎందుకు చేస్తున్నారు?దాని వల్ల వాళ్ళకు ఏమైనా లాభం ఉందా?మనకు ఏమైనా నష్టం ఉందా అని లెఖ్ఖలు వేస్తారు కదా,చాలామంది.అంటే దత్తి,యావ,లాభనష్టాల బేరీజులు,కోపతాపాల ప్రళయాలు,సుఖదుఃఖాల సమ్మేళనాలు...వీటన్నిటికీ దూరంగా ఉండడమే కర్మ యోగి చేసేది.

Friday, 19 June 2026

యోగయుక్తో విశుద్థాత్మా

యోగయుక్తో విశుద్థాత్మా విజితాత్మా జితేంద్రియః। సర్వ భూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే॥7॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి బుజ్జగించినట్లు చెబుతున్నాడు.అర్జునా!సమవర్తిగా ఉండడం చాలా ముఖ్యము.సమస్త ప్రాణికోటిని ఒకే లాగ చూడగలగాలి.ఒకరు ఎక్కవ,ఒకరు తక్కువ కాదు.ప్రతి ఒక్క జీవిలో ఉండేది ఆ పరమాత్మ అంశమే!మనము ఎవరికంటే ఎక్కువ కాము,ఎవరి కంటే తక్కువ కాదు.కానీ నిష్కామంగా కర్మలు ఆచరించగలగాలి.శుద్థమయిన మనసు,ఆత్మ కలిగి ఉండాలి.ఇంద్రియాలను జయించి జితేంద్రియుడు కాగలగాలి.అలాంటి జ్ఞానము,జ్ఞానోదయము మనకు కలిగితే,అప్పుడు మనము ఆచరించే ఏ కర్మలూ మనలను కట్టి పడేయ లేవు.మనమూ,మన ఆత్మ స్వతంత్రులము అవుతాము.మోక్షానికి సోపానాలు వేసుకోవచ్చు,భేషుగ్గా!

Thursday, 18 June 2026

సన్న్యాసస్తు మహాబాహో

సన్న్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగతః। యోగయుక్తో మునిర్బ్రహ్మ న్నచిరేణాధి గచ్ఛతి॥6॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగి,సన్న్యాసి గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ మహాబాహో!నేను ఇందాకటి నుంచీ యోగము,సన్న్యాసము అనే పదాలు వాడుతున్నాను కదా!నీకు వాటి అర్థము,వాటి మధ్య తేడా తెలుసా?చెబుతాను,విను.యోగి అనేవాడు తన గృహస్తు ఆశ్రమాన్ని విడిచి పెట్టడు.అతను ధ్యానము,యోగాభ్యాసము,ప్రాణాయమం ద్వారా మనసును,ఇంద్రియాలను నిగ్రహిస్తాడు.ద్వంద్వాలకు తావు ఇవ్వడు.ఆత్మ జ్ఞానము,మోక్షప్రాప్తి అతని లక్ష్యము. అదే సన్న్యాసి విషయానికి వస్తాము.అతను సంసారాన్నీ,భౌతిక పరమయిన ఆకర్షణలను పూర్తిగా వదలి పెడతాడు.కాషాయం ధరిస్తాడు.వీరు సంసారంతో సంబంధం పెట్టుకోరు.దూరంగా అడవులలోనో,ఆశ్రమాలలోనో నిరాడంబరమయిన జీవితం గడుపుతారు.వీరు కర్మ త్యాగం చేస్తారు.కర్మ ఫలాన్నీ త్యాగం చేస్తారు.వీరికి ఒక్కటే లక్ష్యం.అదే మోక్షప్రాప్తి! ఇప్పుడు చెప్పు,నీకు ఏమి అర్థం అయింది?నేను సులభంగా చెబుతాను.ఎవరూ యోగి కాకుండా సన్న్యాసి కాలేరు.ఒక రకంగా చెప్పాలంటే అసాథ్యమే సుమా!ఇంకో కిటుకు కూడా చెబుతాను.ముందర యోగి అయి,తరువాత సన్న్యసించిన వాడే సులభంగా బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించగలడు.అంటే ఇది అంతా అంచెలంచెల మోక్షము.ముందర మనము ఇంద్రియ నిగ్రహణ నేర్చుకోవాలి.సుఖదుఃఖాలను సమానంగా తీసుకోవాలి.మనసును ఆత్మజ్ఞానం వైపు పరుగులు తీయనివ్వాలి.ఆ తరువాత నిజమయిన సన్న్యాసం జోలికి పోవాలి.

Wednesday, 17 June 2026

యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం

యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం త ద్యోగైరపి గమ్యతే। ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి॥5॥5॥ శ్రీమద్భగవద్గీత....కర్మ సవ్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన విషయమే ఇంకో రకంగా చెబుతున్నాడు.ఆయన తపనంతా అర్జునుడు సరిగ్గా విషయం బుర్రలోకి ఎక్కించుకోవాలనే!ఇంకొకటి కాదు!అర్జునా!ఇప్పుడే మనం అనుకున్నాము కదా జ్ఞానయోగము,కర్మ యోగము అని.ఏ మార్గము ఎంచుకున్నా ఒకటే అని.ఎందుకంటే,జ్ఞానయోగులు పొందే ఫలాన్నే కర్మ యోగులూ పొందుతారు.మార్గాలు వేరు కానీ ఫలితం ఒక్కటే!అసలు ఈ రెంటికీ భేదం లేదు అని మనం గుర్తించాలి.అలా గ్రహించిన తదుపరి మనము దార్శనికులము అవుతాము.ఇదంతా సత్యాన్వేషణ,సత్యశోథన.ఏమైనా కొంచెం అర్థం అవుతున్నదా,బావా?