Saturday, 4 April 2026
యజ్ఞ శిష్టాశిన స్సంతో
యజ్ఞ శిష్టాశిన స్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః।
తే త్వఘం భుంజతే పాపా యే పచం త్యాత్మకారణాత్॥13॥3॥
శ్రీనద్భగవద్గీత..।కర్మ యోగము..।
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏ పని అయినా స్వచ్ఛందంగా,మనసు పెట్టి చేయాలని చెబుతువ్నాడు.హే సఖా!హే అర్జునా!మానవులు యజ్ఞాలు చేసి దేవతలను తృప్తి పరచాలి,వారికి నివేదించాలి అని చెప్పాను కదా!ఎందుకంటే యజ్ఞశేషాన్ని భుజించేవారు సమస్త పాపాలనుంచీ విముక్తి చెందుతారు.అట్లా కాకుండా చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష అనుకుంటూ వాళ్ళకోసరమే వండుకుని తినేవాళ్ళు పాపాల పాలు అవుతారు.ఇది శపించడమో,చెడ్డగా మాట్లాడటమో కాదు.మనము బ్రతకాలి,మనతోటే మన ప్రక్కవారు కూడా సుఖసంతోషాలుతో ఉండాలని ఆపేక్షించగలగాలి.ఎందుకంటే మనము చేసే నైవేద్యాలు నిజంగా దేవుడో,దేవతో వచ్చి తినరు.వారికంటూ చేసినవి మనం నలుగురితో పంచుకుంటాము.ఇదంతా శ్రీకృష్ణుడు ఎందుకు చెబుతున్నాడో తెలుసా?ఎంగిలి చేత్తో కాకిని కూడా తరమని వాళ్ళు ఉంటారు.చేయి విదిలించినపుడు రెండు మెతుకులు క్రిందపడి,వాటిని కాకి తీసుకెళుతుందేమో అనే భయానికి.అట్లా ఉండొద్దు.సర్వే జనాః సుఖినో భవంతు అనుకోవాలని ఆయన ఆశ.
ఇష్టాన్ భోగాన్ హి వో దేవా
ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః।
తైర్దత్తా న ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః॥12॥3॥
శ్రీమద్భగవద్గీత..।కర్మయోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మ ప్రజలకు ఏమి చెప్పాడో చెబుతున్నాడు.అర్జునా!పార్థా!కిరీటీ!బ్రహ్మ ప్రజలను సృష్టించాడు అని చెప్పాను కదా!ఆ తరువాత ప్రజలకు నాలుగు మంచి మాటలు కూడా చెప్పాడు.యజ్ఞాలు చేయమన్నాడు.చేస్తే మంచిది అని చెప్పాడు.ఎందుకంటే యజ్ఞాలు చేస్తే దేవతలు తృప్తి పడతారు.అప్పుడు ప్రసన్నంగా ఉంటారు కాబట్టి మన కోరికలు తీరుస్తారు.అంటే వరుణ దేవుడు వానలు ఇస్తాడు.సూర్యుడు పగలు,వెలుతురు ఇస్తాడు.చంద్రుడు చల్లదనాన్ని ఇస్తాడు.అగ్ని దేవుడు నిప్పును ఇస్తాడు.వారి వలన,వారిచ్చే ద్రవ్యాల వలన మనము లాభం పొందుతున్నట్లే కదా!మరి మనం కృతజ్ఞత వ్యక్తపరచాలి కదా!వారి వల్ల దక్కిన ఫలాన్ని వారికి నివేదించాలి కదా!కాబట్టి వారికి నివేదించకుండా భోగించేవాడు చోరుడు అవుతాడు.
Wednesday, 1 April 2026
దేవాన్ భావయతాఽనేన
దేవాన్ భావయతాఽనేన తే దేవా భావయంతు వః।
పరస్పరం భావయంతః శ్రేయః పర మవాప్స్యథ॥11॥3॥
శ్రీమద్భగవద్గీత ...కర్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి మందల వివరిస్తున్నాడు.అర్జునా!నేను చెప్పాను కదా బ్రహ్మ ప్రజలను సృష్టించినప్పుడే యజ్ఞాలను కూడా ప్రజా శ్రేయస్సు కోసం సృష్టించాడు అని.బ్రహ్మ ప్రజలకు ఇలా చెప్పాడు.మీరు యజ్ఞాలు చేయండి.వాటి ద్వారా దేవతలు తృప్తి చెందుతారు.వారు తృప్తి పొందితే మీకు తృప్తి కలిగిస్తారు.అంటే ఇచ్చుకుంటినమ్మా వాయనం అంటే పుచ్చుకుంటినమ్మా వాయనం లాగా అన్నమాట.మనం మంచి చేస్తే ఎదుటివాళ్ళుకూడా మనకు మంచి చేస్తారు.ఇలా సుహృద్భావంతో అన్యోన్యాచరణల ద్వారా శ్రేయస్సు పొందండి అని బ్రహ్మ ప్రజలను ఆశీర్వదించాడు.
Tuesday, 31 March 2026
సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా
సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః।
అనేన ప్రసవిష్యధ్వ మేషవోఽస్త్విష్ట కామధుక్॥10॥3॥
శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము..।
అర్జునుడికి శ్రీకృష్ణుడు కొత్త కొత్త విషయాలు చెబుతున్నాడు.అర్జునా!పూర్వం ప్రజాపతి యజ్ఞాలను చేసేవాడు.యజ్ఞాలతో బాటుగానే ప్రజలను కూడా సృష్టించాడు.తను సృష్టించిన ప్రజలకు మంచి మాటలు నాలుగు చెప్పాడు.వాటిల్లో మచ్చు తునక ఇది.మీరందరూ యజ్ఞం చేయండి.దాని వలన మీరు వృద్ధి పొందుతారు.యజ్ఞాల వలన మీ కోరికలు అన్నీ సఫలమవుతాయి.యజ్ఞము అంటే సరైన అర్థం చెబుతాను.భగవంతుడికి సంబంధించిన పనులు,ఇతరులకు మేలు చేసే పనులు,ఆత్మధ్యానం...ఈ మూడింటినీ యజ్ఞము అని అంటారు.
యజ్ఞార్థాత్కర్మణోఽన్యత్ర
యజ్ఞార్థాత్కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబంధనః।
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగ స్సమాచరః॥9॥3॥
శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!కౌంతేయా!యజ్ఞ సంబంధమయిన కర్మలు మంచివి.అవి తప్పిచ్చి మిగిలిన కర్మలన్నీ బంధన హేతువులే!అంటే ప్రతి కర్మ ఏదో ఒక రకంగా బంధాలను కూర్చడానికో,కూల్చడానికో కారణం అవుతుంది.కాబట్టి నేను చెప్పేది విను.ఫలాపేక్షను వదలిపెట్టు.పవిత్రమయిన యజ్ఞవిధిగా కర్మలను ఆచరించు.ఒక యజ్ఞం లోకకళ్యాణం కోసరం చేస్తున్నాను అనుకో.దాని వలన నీకు,నీ వాళ్ళకూ ఎంత నష్టం,ఇంకెంత లాభం అని బేరీజు వేసుకుని చేయకు.
Monday, 30 March 2026
నియతం కురు కర్మత్వం
నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః।
శరీర యాత్రాపి చ తే న ప్రసిద్ధ్యే దకర్మణః॥8॥3॥
శ్రీమద్భగవద్గీత..।కర్మ యోగము...
శ్రీకృష్ణుడు చిన్నగా అర్జునుడిని దారిలోకి తెచ్చేదానికి ప్రయత్నిస్తున్నాడు.అర్జునా!ఇప్పుడే చెప్పాను కదా ఉత్తముడు ఎలా ఉంటాడు అని.నీకేమనిపిస్తుంది?అలా చేయగలను అనే నమ్మకం పుడుతుందా?నీవు ఇంక ఇప్పుడు ఏమి చేయాలో చెబుతాను విను.నీవు నీకు నిర్ణయించబడిన నియమిత కర్మలను ఆచరించు.వాటి వలన లాభమా,నష్టమా?ఇష్టమా?కష్టమా?ఇవన్నీ ప్రక్కన పెట్టు.నీ ధర్మాన్ని పాటించు.క్షత్రియ ధర్మం ఏంది?ప్రజలను కాపాడటం !అవసరమైతే కరవాలమెత్తి దుష్టులను సంహరించడం!నేను ఏమీ చేయను.ముసుగేసుకుని మూలన కూర్చుంటాను.అది పాపం.ఇది పుణ్యం.వీళ్ళు మనవాళ్ళు,వాళ్ళు పరాయి వాళ్ళు.ఈ ఝంఝాటకాలు మానేసెయ్యి.
ఎందుకో చెప్పేదా.ఏ పనీ చేయకపోవడం వలన దేహయాత్ర చాలా దుర్భరమవుతుంది.నీకు అర్థం కావటం లేదు.
య స్త్వింద్రియాణి మనసా
యస్త్వింద్రియాణి మనసా నియ మ్యారభతేఽర్జున।
కర్మేంద్రియైః కర్మయోగ మసక్త స్స విశిష్యతే॥7॥3॥
శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎవరిని ఉత్తముడు అని అంటారో చెబుతున్నాడు.అర్జునా!పార్థ!ఇంద్రియ నిగ్రహం కావాలి.కానీ అదొక్కటే చాలదు.మనసు చేత ఇంద్రియాలను మన వశం చేసుకోవాలి.వాటిని లోబరుచుకోవాలి.లేక పోతే కళ్ళాలు లేని గుర్రాల లాగా కోర్కెలు పరుగులు తీస్తాయి.మనము మన కర్మలను ప్రతిఫలాక్ష లేకుండా చేయగలగాలి.ఇప్పుడు అర్థమయిందా?ఎవడిని ఉత్తముడు అంటారో?ఉత్తముడు సదా సర్వదా మనసు చేత ఇంద్రియాలను లోబరచుకుని,ప్రతిఫలాక్షలేకుండా తను నిరివర్తించాల్సిన కార్యాలను,కర్మలను ఆచరిస్తుంటాడు.
Subscribe to:
Comments (Atom)