Wednesday, 18 March 2026
యదా సంహరతే చాయం
యదా సంహరతే చాయం కుర్మోఽంగానీవ సర్వశః।
ఇంద్రియా ణీంద్రియార్థేభ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥58॥2॥
శ్రీమద్భగవద్గీత..సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడికి ఏమూలనో కొంచెం అనుమానంగా ఉంది.తను చెప్పేది అర్జునుడికి సరిగ్గా అర్థం కావడం లేదేమో అని.అందుకని సోదాహరణంగా చెప్పాలని తీర్మానించుకున్నట్లు ఉన్నాడు.అర్జునా!నీకు తెలుసు కదా!తాబేలు ఎట్లుంటుంది?అస్తమానమూ ఏమి చేస్తుంది?తన శరీర అవయవాలన్నిటినీ తన లోపలకు ముడుచుకుని కూర్చుని ఉంటుంది కదా!మనము కూడా ఇంచుమించుగా అలాగే ఉండేదానికి ప్రయత్నించాలి.ఎందుకు?ఏమిటి?ఎలా?అని అంటావా?చెబుతాను విను.మనము మన ఇంద్రియాలను విషయాలనుంచి మరల్చాలి.వాటిని మన ఆథీనంలో ఉంచుకోవాలి.ఈ ఇంద్రియాలను పకడ్బందీగా మన వశంలో ఉంచుకోకపోతే వ్యవహారం అంతా తీన్ తార్ అవుతుంది.మన బుద్ధి స్ధిరంగా ఉండాలంటే ఇవన్నీ తప్పని సరి.దగ్గరి మార్గాలు ఎప్పుడూ సత్ఫలితాలు ఇవ్వవు ఎక్కవ కాలం.మనము ప్రతిదీ క్షుణ్ణంగా అభ్యసించాలి.వేరే దారి లేదు.
య స్సర్వత్రానభిస్నేహః
య స్సర్వత్రానభిస్నేహస్తత్త త్ప్రాప్య శుభాశుభమ్।
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥57॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి స్థిత ప్రజ్ఞత గురించి ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!మనకు దేని పైనా కోరికలు ఉండకూడదు.మనకు జరిగే మంచి చెడులను సమానంగా స్వీకరించాలి.తేడా చూపించకూడదు.ఎందుకంటావా?కర్తవ్యం మటుకే మనము చేయాల్సినది.దాని ఫలితం మనకు అనవసరము.అక్కరలేదు.ఆనందం దుఃఖం అనే భావాలకూ,భావనలకు అతీతంగా ఉండాలి.ఎవ్వడు అయితే పైన పేర్కొన్న విథంగా ఉంటాడో వాడి బుద్ధియే సుప్రతిష్టమయినది.ఆస్థితికి మనము చేరుకోగలిగితే మనలను తలదన్నేవాడు ఉండడు.మనము ఉత్కృష్టమయిన స్థానంలో ఉన్నట్లు లెక్క.
దుఃఖే ష్వనుద్విగ్నమనాః
దుఃఖే ష్వనుద్విగ్నమనా స్సుఖేషు విగతస్పృహః।
వీతరాగ భయక్రోధః స్థితధీ ర్ముని రుచ్యతే॥56॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడికి తన సఖుడి స్థితి,దుస్థితి చూస్తుంటే చాలా బాథగా ఉంది.తన సాయశక్తులా పోరాడుతున్నాడు అర్జునుడిని ఆ పరిస్థితి నుంచి బయటపడేసేదానికి.అర్జునా!స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అనే కదా నీ ప్రశ్న?నేను చెబుతున్నాను,విను.దుఃఖాలకు,కష్టాలకూ దిగులు పడకూడదు.కలత పడకూడదు.సుఖాలు తలుపు తడితే పరవశం పొందకూడదు.రెండింటినీ సమానంగా స్వీకరించగలగటం నేర్చుకోవాలి.తెలుసుకోవాలి.ఈ ప్రేమలు,ద్వేషాలూ,భయాలూ,బరువులు,కోపాలూ,తాపాలూ ..వీటన్నిటినీ ప్రక్కకు పెట్టేయాలి.అహాఁ!అసలు టోకుగా వదిలేయాలి.ఝంఝాటకాలు అస్సలు ఉండకూడదు.ఈ ప్రలోభాలన్నిటికీ ప్రభావితం కానివాడే స్థిత ప్రజ్ఞుడు అని అంటారు.ఇదంతా నేను చెప్పటం కాదు.గొప్ప గొప్ప మహనీయులు,మునులు చెప్పే మాట.
Monday, 16 March 2026
ప్రజహాతి యదా కామాన్
శ్రీ భగవానువాచ....
ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్।
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞ స్తదోచ్యతే॥54॥2॥
శ్రీమద్భగవద్గీత..సాంఖ్య యోగము...
మనల్ని ఎవరైనా ఏమన్నా అడిగితే వెంటనే సమాథానం చెప్పేస్తాము.తప్పో ఒప్పో,తరువాతి విషయం.అందులో శ్రీకృష్ణుడు భగవంతుడు,సర్వాంతర్యామి.అతనికి ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలకు సమాథానం చెప్పడం ఒక లెఖ్ఖా?మనం అడగాలి గానీ.శ్రీకృష్ణుడికి ఒకటి అర్థం అయింది.అర్జునుడికి జిజ్ఞాస పెరిగింది.తను చెప్పింది అర్థం చేసుకోవాలనే తపన మొదలు అయింది.అదే జ్ఞానోపాసనకు అంకురార్పణ అని కృష్ణుడు చాలా సంతోషించాడు.చెప్పడం మొదలు పెట్టాడు.అర్జునా!పార్థా!ఈ రోజు నీ అనుమానాలు అన్నీ ఓపికగా తీరుస్తాను.స్థిత ప్రజ్ఞుడు ఎవరు అని కదా నీ మీమాంస?మొదట సర్వవాంఛలనూ విసర్జించాలి.అంటే కోరికలనన్నిటినీ వదలి పెట్టాలి.ఆత్మయందే తాను ఆనందిస్తూ ఉండాలి.
సముద్రము తీరం దగ్గర అలలు వస్తుంటాయి ఎప్పుడూ.అదే లోపలికి,ముందుకు పోయేకొద్దీ నిర్మలంగా ఉంటుంది.ఆటూ పోట్లూ కనిపించవు.అలా మనసును ప్రశాంతంగా పెట్టుకోగలగాలి.అలా ఉండగలిగిన వాడినే స్థిత ప్రజ్ఞుడు అను అంటారు.
స్థితప్రజ్ఞస్య కా భాషా
అర్జున ఉవాచ...
స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ।
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్॥54॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి చాలా చాలా క్రొత్త క్రొత్త విషయాలు ఒక్కసారే చెపుతున్నాడు కదా!అర్జునుడికి దిమ్మ తిరిగిపోతుంది.ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు.శ్రేయోభిలాషి కదా ఎంతైనా!చెప్పింది విందాము లే అనుకున్నాడు.కానీ మరీ ఇంతనా?ఒకసారి యోగము అంటాడు.వెంటనే మోక్షము అంటాడు.ఊపిరి పీల్చుకునే లోపల సమన్వయం అంటాడు.కర్మ సిద్ధాంతం అంటాడు.పిచ్చి పట్టి పోతుంది.జుట్టు పీక్కోవటం మటుకే మిగిలింది.ఇట్లా అయ్యేది కాదు అని అర్జునుడు గొంతు సవరించుకుని చిన్నగా అడగడం మొదలుపెట్టాడు.
హే కృష్ణా!హే సఖా!నీవు ఏందేందో చెబుతున్నావు.ఒక్క ముక్క కూడా అవగతం కావటంలేదు.ఈ స్థిత ప్రజ్ఞుడు ఎవరు?ఎక్కడినుంచి వచ్చాడు?అతడు ఎట్లా మాట్లాడతాడు?అతని గుణగణాలేంది?లక్షణాలు ఏంది?అతని స్థితిగతులు ఏంటి?అతను ఏమి చేస్తాడు?ఎట్లా కూర్చుంటాడు?ఎట్లా నిలుచుంటాడు?ఎలా ఉంటాడు?కొంచెం నాకు అర్థం అయ్యేలా చెప్పు స్వామీ!
Sunday, 15 March 2026
శ్రుతి విప్రతి పన్నాతే
శ్రుతి విప్రతి పన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా।
సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి॥53॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!పొద్దున లేచి మనం ఏదో ఒకటి వింటుంటాము.అందులో కొన్నిటికి తీవ్రంగా స్పందిస్తాము.కొన్నిటికి ఒక మోస్తరుగా!కానీ స్పందించక మానము.దాని వలన మన మనసు చపలత పొందితుంది.ఇది కావాలి,అది వద్దు.దీనికి దగ్గర కావాలి,దానికి దూరం కావాలి.ఇంకో విషయం గురించి పలాయనం చిత్తగించాలి అనుకుంటాము.కానీ మన మనసు,బుద్ధి వీటన్నిటికంటే ఉన్నతంగా ఆలోచించాలి.స్థిత ప్రజ్ఞత ప్రదర్శించగలగాలి.స్థిరంగా,దేనికీ చలించకుండా,చిత్త చాంచల్యం చూపకుండా ఉండగలగాలి.అప్పుడే యోగాన్ని పొందగలతావు.యోగము అంటే ఓయమ్మో అని భయపడపనిలేదు.మనసును నిర్మలంగా ఉంచుకోగలగటమే,ఆటూపోటూ అనుకోకుండా.
యదా తే మోహకలిలం
యదా తే మోహ కలిలం బుద్ధి ర్వ్యతి తరిష్యతి।
తదా గన్తాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ॥53॥2॥
శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి బుద్ధి కుశలత కొంచెం పెంచుకుంటే అన్ని విథాలా మంచిది అని సలహా ఇస్తున్నాడు.ఎంతైనా మిత్రుడు కదా!ఆ మాత్రం మంచీ చెడ్డా చెప్పకపోతే ఎలా?
అర్జునా!నేను చెప్పినట్లు విను.ముందర ఈ మోహ పంకిలం,పాప పంకిలం నుంచి బయటపడు.అప్పుడుగానీ ఏదీ సరిగ్గా అర్థంకాదు నీకు.అసలైన దారి గోచరించదు.దాని నుంచి విడిపడినప్పుడే నీ బుద్ధిని పరిశుద్థం చేసుకోగలవు.ఇంక వేరే దగ్గర మార్గాలు లేవు.ఇప్పటికే విన్న విషయాలూ,ఇంక తదుపరి వినవలసిన విషయాలూ నుండీ బయటపడగలతావు.వైరాగ్యమనేది ఊరికే ఆషామాషీగా దక్కదు.మనకు గట్టిగా కావాలనుకున్నది ఒక్కటి దక్కకపోతేనే తీన్తార్ అవుతాము.అలాంటిది సర్వసంగ పరిత్యాగం అంటే మాటలు కాదు కదా!సతతం అభ్యాసం చేయాల్సిందే!దక్కేదాకా ఒక యజ్ఞం,దక్కిన తరువాత నిలబెట్టుకునే యత్నం.అర్థం అయిందా?
Subscribe to:
Comments (Atom)