Tuesday, 14 April 2026

ప్రకృతేః క్రియమాణాని

ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః। అహంకార విమూఢాత్మా కర్తాఽహమితి మన్యతే॥27॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి అజ్ఞానులు ఎలాంటి భ్రమలలో బ్రతుకుతుంటారో చెబుతున్నాడు.అర్జునా!హే కిరీటీ!నీకు ఇప్పుటికి అర్థం అయింది కదా ప్రకృతి యొక్క గుణాల వల్లనే సమస్తమయిన కర్మలూ నిర్వహింపబడతాయి అనే విషయం.కానీ అజ్ఞాని అలా అర్థం చేసుకోడు.అజ్ఞానికి అహంకారం,అదే బలుపు ఎక్కువ కదా!నేనే తోపు,నేనే తురుపు ముక్కను.అంతా నా వల్లనే జరుగుతుంది,అంతా నేనే చేస్తున్నాను అని భావిస్తూ ఉంటాడు.నిజంగా మూర్ఖుడు అందామా ?లేక అమాయకుడు అని అందామా?

Monday, 13 April 2026

న బుద్ధిభేదం జనయేత్

న బుద్ధిభేదం జనయే దజ్ఞానాం కర్మసంగినామ్। జోషయే త్సర్వకర్మాణి విద్వాన్ యుక్త స్సమాచరన్॥26॥3॥ శ్రీమద్భగవద్గీత..కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞాని ఎలా ఉండాలో చెబుతున్నాడు.హే అర్జునా!జ్ఞాని అనేవాడు చాలా జాగ్రత్తగా నడచుకోవాలి.కర్మలు ఆచరించే మామూలు ప్రజానీకాన్ని గందరగోళానికి గురి చేయకూడదు.వారు కర్మల ఎడ విముఖులు కాకుండా చూసుకోవాలి.తాను కర్మలను అనుసరించి,ఆచరిస్తూ మామూలు ప్రజానీకం తప్పుదారి పట్టకుండా,మంచిగా సమన్వయం చేసుకుంటూ,వారంతా కూడా సత్ కర్మల యెడ అనురక్తిని కలిగించేలా ప్రవర్తించాలి.

సక్తాః కర్మణ్య విద్వాంసో

సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత। కుర్యా ద్విద్వాం స్తథా సక్త శ్చికీర్షు ర్లోకసంగ్రహమ్॥25॥3॥ శ్రీమద్భగవద్గీత...।కర్మ యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు...ఏ రకంగా ఆలోచించినా కర్మలు చేయడం తప్పదు,తప్పించుకోలేము అని.హే అర్జునా!ఏ భరతశ్రేష్టా!కర్మలను చేయడం ఎవరికీ తప్పదు.ఏ రకంగా ఆలోచించినా చేయాల్సిందే! అజ్ఞానులు ఫలాపేక్ష కోసం కర్మలను చేస్తారు.జ్ఞానులు స్వలాభంకోసం చేయరు.ఆసక్తిరహితంగా చేస్తారు అంటే ఎలాంటి కోరికలు,ఇచ్ఛ లేకుండా చేస్తారు.కానీ లోకసంగ్రహణం కోసరము చేయవలసిన పనులు అన్నీ చేస్తూ ఉంటారు.

Sunday, 12 April 2026

ఉత్సీదేయు రిమే లోకా

ఉత్సీదేయు రిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్। సంకరస్య చ కర్తా స్యా ముపహన్యా మిమాః ప్రజాః॥24॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి తాను కర్మలు ఆచరించకపోతే జరిగే అనర్థాలను వివరిస్తున్నాడు.అర్జునా!మిత్రమా!నేను లోక కళ్యాణం కోసం కర్మలను ఆచరిస్తున్నానని చెప్పాను కదా!నేను అలా చేయకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చెబుతాను విను.నేను నాకెందుకు?నాకు ఏమీ అవసరం లేదు.నాకు ఏదీ అక్కరలేదు అనుకుంటే లోక వ్యవహారాలన్నీ స్తంభిస్తాయి.వ్యవస్థలు అన్నీ శిథిలమవుతాయి.అప్పుడు ఏమవుతుందో తెలుసా?ఆలోచించగలవా?సంకరము,కర్మభ్రష్టత్వము కలుగుతాయి.ప్రజలయొక్క ఆ దిగజారుడుకు నేనే కారణభూతుడిని అవుతాను.నేను సృష్టించిన ఈ లోకాలు,ప్రాణులు నా వల్లనే భ్రష్టు పడతారు.అంతదానికి ఈ సృజన అంతా దేనికి?ఎవరి కోసం చెప్పు. తల్లి కనగానే నా పని అయిపోయింది అని వదిలేస్తే ఏమవుతుంది ఆ బిడ్డ?ఎందుకూ పనికి రాకుండా పోతుంది.అయితే గియితే వ్యవస్థకు హానికరంగా మారుతుంది.కానీ ఆ తల్లి తన స్తన్యం ఇచ్చి,ప్రేమించి,మంచి మార్గంలో నడిపితే ఆ బిడ్డ సంఘానికి తురుపుముక్క అవుతుంది.అందుకే నేను కర్మలను ఆచరిస్తాను.నా బిడ్డలకు మార్గదర్శకం అవుతాను.

Saturday, 11 April 2026

యది హ్యహం నవర్తేయం

యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్య తంద్రితః। మమ వర్త్మాను వర్తం తే మనుష్యాః పార్థ సర్వశః॥23॥3॥ శ్రీమద్భగవద్గీత..కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.హే పార్థా!హే కిరీటీ!నేను ఎప్పుడూ కర్మలను ఆచరిస్తాను అని చెప్పాను కదా!ఎందుకని అంటావు?యథా రాజాః తథా ప్రజాః అని నానుడి ఉంది కదా!రాజు ఎట్లా ఉంటే రాజ్యం లోని ప్రజానీకం అంతా అలానే ఉంటుంది.రాజు మంచిగా కార్య నిర్వహణ చేస్తుంటే ప్రజలు కూడా అలానే ఉంటారు.రాజు పనిదొంగ అయితే ప్రజలూ అలానే ఉంటారు.ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టరు. అందుకే నేను కర్మలను ఆచరిస్తాను.నేను గానీ కర్మలను విడిచి పెడితే ప్రతి ఒక్కడూ నన్నే అనుసరిస్తాడు.అంతా తిని తొంగుండే ముఠాలాగ తయారవుతారు.కాబట్టి ఒక నాయకుడు తన వారికి మార్గ దర్శకంగా ఉండాలి.అభాసు పాలు అయ్యేలా ఉండకూడదు.

న మే పార్థాస్తి కర్తవ్యం

న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన। నా నవాప్త మనాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి॥22॥3॥ శ్రీమద్భగవద్గీత..।కర్మ యోగము.. అర్జునుడికి శ్రీకృష్ణుడు తన ఉదాహరణే ఇస్తున్నాడు.అర్జునా!పార్థా!ప్రజానీకం గొప్పవాళ్ళనే ప్రామాణికంగా తీసుకుంటుంది.వాళ్ళ అడుగు జాడల్లోనే నడచేదానికి ఇష్టపడుతుంది అని చెప్పాను కదా!నన్నే ఉదాహరణగా తీసుకో.నిజానికి ఈ మూడులోకాల్లో నేను చేయవలసిన పని అంటూ ఏమీలేదు.నాది కానిది,నాకు దక్కనిది అంటూ కూడా ఏమీ మిగిలి లేదు.నాకు అంటూ ఎలాంటి ఆశలు,అసంతృప్తులు,అసహనాలు,అభీష్టాలూ ఏమీ లేవు.అయినా కూడా నేను ఎప్పుడూ కర్మలను ఆచరిస్తున్నాను.దీనివలన నీకు ఏమి అవగతమవుతుంది?నాకోసం కాకపోయినా,ఈ సృష్టి మొత్తానికీ మార్గ దర్శకంగా నిలవడం కోసరం నేను కర్మలను ఆచరిస్తున్నాను.సర్వే జనాః సుఖినో భవంతు అనే ధర్మం కోసం పాటుపడపతున్నాను.ఇప్పుడన్నా ఏమైనా అర్థం అవుతుంది అనిపిస్తుందా?

Friday, 10 April 2026

యద్య దాచరతి శ్రేష్టః

యద్య దాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరో జనః। స యత్ ప్రమాణం కురుతే లోక స్త దనువర్తతే॥21॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి మంచిగా వివరిస్తున్నాడు.అర్జునా!నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా?మామూలు ప్రజానీకం ఉంది కదా!గొప్పవాళ్ళు ఏమి చేస్తారో అదే ఆచరించేదానికి ఇష్టపడతారు.ఎందుకంటే గొప్ప వాళ్ళ పద్థతులే కదా వాళ్ళకు ప్రామాణికం! కాబట్టి మనం అందరికీ మంచి దారి చూపించాలంటే ముందుగా ఆ మంచి దారిలో మనం నడవాలి కదా!అవునా,కాదా?