Monday, 9 March 2026

యోగస్థః కురు కర్మాణి

యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ। సిద్ధ్య సిద్ధ్యో స్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే॥48॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము... కృష్ణుడు లాంటి స్నేహితుడు మన అందరికీ ఉంటే ఎంత బాగుంటుందో కదా!అర్జునుడికి సరి అయిన సమయంలో కర్తవ్యం బోథిస్తున్నాడు.ఏది ఒప్పు,ఏది తప్పు చెబుతున్నాడు.భయం పోగొట్టి ధైర్యం చెబుతున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.హే ధనంజయా!హే పార్థా!మనము ముందర ద్వంద్వ వైఖరి మానుకోవాలి.లాభం,నష్టం...ఈ రెండింటినీ ఒకేలాగా చూడగలగాలి.ఏ విషయమైనా మోహము,లాలస ఉండకూడదు.యోగబద్థుడుగా అవాలి.మనము అనుకున్న పనులు అనుకూలంగా పూర్తి అయినా,ఏ కారణం చేత అయినా సఫలం కాలేక పోయినా మనము విచారించకుండా ఉండగలగాలి.సమబుద్ధి ప్రదర్శించాలి.నియమిత కర్మలు ఆచరించాలి.నియమిత కర్మలు అంటే నిత్య కర్మలు.మన మనసు తామరాకు మీద నీటి బొట్టులాగా వ్యవహరించాలి.నిష్టగా,చిత్తశుద్ధితో మనము చేయాల్సిన కర్మలు ఆచరించాలి,కానీ ప్రతిఫలాపేక్ష లేకుండా!

కర్మణ్యే వాధికారస్తే

కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన। మా కర్మ ఫల హేతుర్భూః మాతే సంగో స్త్వ కర్మణిః॥47॥2॥ శ్రీమద్భగవద్గీత..సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ధర్మ సూత్రం చెబుతున్నాడు.హే పార్థా!ఓ అర్జునా!కర్మ చేయడం వరకే నీ వంతు.కర్మఫలం ఆశించడం నీ పని కాదు.నేను చేసే పనికి ఫలితం నాకే దక్కాలి అని ఆశించకు.నీకు హక్కులేదు.ఏ పని ఎప్పుడు,ఎలా,ఎంతలా,ఎక్కడ చేస్తే నాకు కావాల్సిన ఫలితం దక్కుతుంది అనే కోరికతో ఏ పనీ చేయవద్దు.నాకు లాభం లేనప్పుడు నేను ఎందుకు చెయ్యాలి ఏదైనా అని మానుకోవద్దు.ఎందుకంటే కర్మలు చేయడమే మన ధర్మము.వాటి ఫలాలకు మనము అధికారులు కాదు.

Sunday, 8 March 2026

యావానర్థ ఉదపానే

యావానర్థ ఉదపానే సర్వత స్సంప్లుతోదకే। తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః॥46॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము..। శ్రీకృష్ణుడు అర్జునుడికి సూక్ష్మంలో మోక్షం గురించి చెబుతున్నాడు.అర్జునా!నా తట్టు చూడు.నేను చెప్పేది అర్థం చేసుకునేదానికి ప్రయత్నించు.నీరు ఎక్కడ ఉన్నా నీరే కదా!అలాగే జ్ఞానము కూడా.ఒక ఉదాహరణ చెబుతాను విను.నూతులు,చెరువులలో తక్కువ నీళ్ళు ఉంటాయి కదా,సముద్రంతో పోలిస్తే.కానీ వీటితో ఎంత ప్రయోజనము ఉందో వాటితో కూడా అంతే కదా!వేదాలలో చెప్పిన చాలా,అహాఁ,సమస్త కర్మల వలనా శాంతి దొరుకుతుంది కదా మానవుడికి.అదే శాంతి తత్త్వవేత్త అయినవాడికి తనకున్న జ్ఞానంలోనే ఇమిడి ఉంటుంది.సూక్షమా లేక స్థూలమా అనేకంటే వాటిలో ఉండే సారమునకే ఎక్కువ విలువ అని అర్థం చేసుకో.కాబట్టి అపోహలు,అనుమానాలు,అలజడులకు ఔషథం జ్ఞానము.కాబట్టి మానవుడికి జ్ఞానసముపార్జన అత్యంత కీలకం,అత్యవసరమూను.

Saturday, 7 March 2026

త్రైగుణ్య విషయా వేదా

త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున। నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్॥45॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడు మంచిగా పేరు తెచ్చుకోవాలి అని ఆశిస్తున్నాడు.అందుకని ప్రతిదీ ఓపికగా,విపులంగా వివరిస్తున్నాడు.అర్జునా!వేదాలు ప్రకృతి యొక్క మూడు గుణాలను వివరించాయి.నువ్వు ఆ త్రిగుణాలకు అతీతంగా నిలబడాలి.ద్వంద్వ భావాలకు స్వస్తి చెప్పాలి.ఏదైనా సాధించాలి,సాధించిన వాటిని నిలుపుకోవాలి,అదే యోగక్షేమాలు,అనే ఆదుర్దా,దుగ్థ,అపేక్ష నిర్ద్వంద్వంగా వదులుకోవాలి.శుద్థ సత్వాన్ని అవలంబించాలి.అంటే రజోగుణము,తమోగుణము మరకలు అంటని పవిత్రమయిన సత్త్వగుణ మార్గాన్ని ఎంచుకోవాలి.బాహ్య బంధాలను విడిచి పెట్టి ఆత్మ జ్ఞానివి కావాలి.ఇదే నా కోరిక!

భోగైశ్వర్య ప్రసక్తానాం

భోగైశ్వర్య ప్రసక్తానాం తయాఽపహృత చేతసామ్। వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే॥44॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి స్వర్గ ప్రాప్తి ఆషామాషీ వ్యవహారం కాదు అని చెబుతున్నాడు.అర్జునా!మనిషికి విషయలాలస,భోగలాలస ఎక్కువ.ఆ భోగైశ్వర్యాలను ఆశించడం మొదలు పెడితే వాటికి అంతం అంటూ ఉండదు.మొదట కోరిక మొదలవుతుంది.ఇంక వాటికోసం అనేక కర్మకాండలలో మునిగిపోతాడు మానవుడు.అన్ని కోరికలు ఉన్నవాడు ఇంక ప్రశాంతంగా,నిశ్చలమయిన మనసుతో ఏమి ధ్యానం చేయగలడు?బుద్ది నిలకడగా ఉంటుందా,ఎక్కడైనా?ఓం ఓం అంటూ మొదలు పెడతాడు.గబుక్కున పక్కింటివాడి దగ్గరనుంచి రాబట్టాల్సిన బాకీ గుర్తొస్తుంది.మళ్ళీ ఓం ఓం అని మొదలు పెడతాడు,ఏవరిని మభ్యపెట్టి తన పనులు సానుకూలం చేసుకోవాలో ఆలోచిస్తాడు.ఇంక చిత్త శుద్ధి ఎక్కడ నుంచి వస్తుంధి?

Friday, 6 March 2026

కామాత్మానః స్వర్గపరా

కామాత్మానః స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదామ్। క్రియా విశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి॥43॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!చాలా మందికి స్వర్గం దక్కాలి అనే లాలస ఎక్కువ ఉంటుంది అని చెప్పాను కదా!ఆ కోరిక,కామన ఎక్కువై లెక్కకు మిక్కిలి కర్మకాండలలో మునిగి తేలుతుంటారు.ఎవరు ఏమి చెప్పినా స్వర్గ ప్రాప్తి విషయంగా,ముందు వెనకా చూసుకోకుండా,సరైన ఆలోచన,వితరణ లేకుండా చేసేస్తుంటారు.అక్కడ మనసు భగవంతుడి పైన లగ్నం చేయడం,నిబద్ధత ఉండడం ఉండవు.ఎట్లో ఒకట్ల సంపాదించేసెయ్యాలి అనే ఆరాటమూ,కోరిక తప్ప.దానికి పర్యవసానం ఏందే చెప్పమంటావా?వాళ్ళందరూ కూడా జనన మరణ ప్రవాహంలో కొట్టుకు పోతారు తప్ప,స్వర్గము,మోక్షము అనే తీరం చేరరు.

Thursday, 5 March 2026

యామిమాం పుష్పితాం వాచం

యామిమాం పుష్పితాం వాచం ప్రవద న్త్యవిపశ్చితః। వేద వాదరతాః పార్థ నాన్య దస్తీతి వాదినః॥42॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు ఎలాంటి మొహమాటం లేకుండా మానవుడి బుద్ధి ఎలా ఉంటుందో అర్జునుడికి చెబుతున్నాడు.హే అర్జునా!హే పార్థా!వివేకం లేని జ్ఞానం వలన ఎలాంటి ఉపయోగము ఉండదు.కొందరు వేదాలు చదివేస్తారు,ఏమి చేస్తే స్వర్గం దక్కుతుంది అని.స్వర్గ ప్రాప్తి సాథన లాలసలో పడి లేస్తుంటారు.లేచేది ఏంది?ఘాటుగా మునుగుతుంటారు.దానికి మించినది లేదని తెగ వాదిస్తుంటారు.మాటలు,చేతలు తప్ప మనస్పూర్తిగా,మనసా వాచా కర్మణా పాటించరు.