geethaasaaramu
Friday, 22 May 2026
గత సంగస్య ముక్తస్య
గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః।
యజ్ఞా యా చరతః కర్మసమగ్రం ప్రవిలీయతే॥23॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు తిప్పి తిప్పి ఒకటే విషయం చెబుతున్నాడు.అది అవసరము కూడా!ఎందుకంటే మనవి బుర్రలు బాగానే పని చేస్తాయి.కానీ నిజంగా బుర్రలోకి,నరనరాల్లోకి ఒక విషయం జీర్ణించుకుని పోవాలంటే ఒక సారి కని,ఒక సారి విని,ఇంకొక సారి ఒప్పచెబితే సరిపోదు.పదే పదే వినాలి.పదే పదే మననం చేసుకోవాలి.పదే పదే అర్థం చేసుకోవాలి.సమన్వయం చేసుకోవాలి.అప్పుడు ఆచరణలోకి వస్తుంది.ఎప్పుడు కూడా ఇట్టా వచ్చేది అట్టానే పోతుంది.గల గల పారే నీరు భూమి లోకి పూర్తిగా,లోతుగా ఇంకదు.చుక్క, చుక్క,చుక్కకు చుక్క చిన్నగా పడుతుంటే నేల బాగా,లోతుగా తడుస్తుంది.ఆ తడి ఎక్కువ సేపు కూడా నిలుస్తుంది.పై పై పొరల్లో ఉండేది తొందరగా ఆవిరి అయిపోతుంది.
అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!మిత్రమా!మానవుడు ఫలాపేక్షను విడవాలి.బ్రహ్మ జ్ఞాన నిష్ఠాపరుడు కావాలి.ఈశ్వరుని తృప్తికి,ప్రీతికి మటుకే యజ్ఞాలు,యాగాది కర్మానుష్ఠాలు చేయాలి.ఏ కోశానా మమ,అహం అనే భావన ఇసుమంతైనా ఉండకూడదు.అట్లా కర్మలు చేస్తే పూర్వ కర్మలు కూడా నశిస్తాయి.అట్లాంటిది ప్రస్తుత కర్మలు అతనిని బంథించలేవు.అతను కడిగిన ముత్యంలాగ స్వచ్ఛం అయి తీరతాడు.
యదృచ్ఛా లాభ సంతుష్టో
యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః।
సమ సిద్థావ సిద్థౌచ కృత్వాపి న నిబధ్యతే॥22॥4॥
శ్రీమద్భగవగ్గీత...జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి మనము ఎలా ఉండాలో చెబుతున్నాడు.అర్జునా!ఇందాకటి నుంచి నేను నీకు మనిషి ఎలా ఉండాలో చెబుతున్నాను.అదే ఇంకొంచెం వివరంగా చెబుతాను.మనము మనకున్న దానితో తృప్తి పడడం నేర్చుకోవాలి.ప్రతి దానికీ అసంతృప్తి,అనుమానం,అసహనం ఉండకుండా ఉండాలి.మనము అసూయ,ఈర్ష్య,పగ,ప్రతీకారాలను మరిచిపోవాలి.మనసులో కూడా మననం చేసుకోకూడదు.ఎందుకంటే ఈ మాత్సర్యంకి మూల కారణం అసంతృప్తి.మనకేదో అన్యాయం జరుగుతుందేమో అనే అనుమానం.మనకంటే ఎదుటివాడు మనకంటే ఎక్కువ సత్తా లేక పోయినా,మనకంటే బాగా వృద్ధిలోకి వస్తున్నాడేమో అనే శంక.వాడిని ఎలాగైనా పడగొట్టాలి,మనమే ముందుకు పోవాలి అనే పగ,ప్రతీకార్య చర్యలు,ఆబ,అత్యాశ.వీటన్నిటినీ తుడిచి పెట్టేయాలి.మనము మనము చేపట్టిన కార్యము,కర్మ సిద్ధించినా,సిద్ధించకపోయినా మనసు సమతుల్యంగా ఉండేలా సాథన చెయ్యాలి.
అంటే,తనకు లభించిన దానితో తృప్తి పడేవాడు,శంకారహితుడు,మాత్సర్యం లేనివాడు,కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా సమాన బుద్ధి కలవాడు...ఏ కర్మలు చేసినా బంధాలు అనే చట్రంలో చిక్కుకోడు.తామరాకు మీద నీటి బొట్టు చందాన వెలిగిపోతుంటాడు.
Thursday, 21 May 2026
నిరాశీ ర్యత చిత్తాత్మా
నిరాశీ ర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః।
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్॥21॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలా మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలో చెబుతున్నాడు.అర్జునా!సఖా!మనలో ఎవరైనా పాపకూపంలో ఇరుక్కోవాలి అనుకుంటామా?మన జీవితాలు భ్రష్టు పట్టి,నాశనం అయిపోవాలని కోరుకుంటామా?లేదు కదా!మరి అలాంటప్పుడు మనం ఏమి చెయ్యాలి?ఆ చెడు,దీన స్ధితికి రాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అనే ప్రణాళిక,అవగాహన ఉండాలి కదా!నేను చెబుతాను,విను.
మనము తృష్ణ,అదే కోరికలు లేకుండా ఉండాలి.మనసునూ,ఇంద్రియాలను మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలి.అంటే ఇంద్రియ నిగ్రహం కావాలి.దత్తికి పోయి కనిపించిందంతా చేజిక్కించుకోవటం కాదు,అతి తక్కువలో మన జీవనం కొనసాగించగల్గేటంత సమకూర్చుకుంటే చాలు.ఈ మూడు సూత్రాలూ తు.చ.తప్పకుండా పాటిస్తే మనిషి పాప కూపంలో చిక్కుకోడు.లేకపోతే అథఃపాతాళానికి జారిపోతాడు.ఇది నేను భయపెట్టేదానికి నీకు చెప్పడం లేదు.మంచి మాటలు విని,ఆచరణలో పెట్టకపోతే ఏమి జరుగుతుందో హెచ్చరిస్తున్నాను.అంతే!
Wednesday, 20 May 2026
త్యక్త్వా కర్మఫలాసంగం
త్యక్త్వా కర్మఫలాసంగం నిత్య తృప్తో నిరాశ్రయః।
కర్మ ణ్యభి ప్రవృత్తోఽపి నైవ కించిత్ కరోతి సః॥20॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడితో కర్మలు ఎలా చెయ్యాలో చెబుతున్నాడు.అర్జునా!మనము ముందర కర్మలను ఎలాంటి ఫలితం ఆశించకుండా చేయాలి.ఎప్పుడూ అసంతృప్తిని దరిదాపుల్లోనికి రానివ్వకూడదు.మనము దేనికోసమూ ఒకరి పైన ఆథార పడకూడదు.అంటే ఉన్నదాంతో తృప్తి పడాలి.ఇలాంటి మనో వికాసంతో ఉన్నవాడు కర్మలు చేసినా,చేయనట్లే లెఖ్ఖ.అంటే కర్మల మంచి చెడ్డలు తనకు అంటవు.వాటన్నిటికీ అతీతం అతను.కాబట్టి మనము ఫలాపేక్షలేని నిత్యతృప్తుడు,నిరాశ్రయుడు లాగ ఉండాలి.
Tuesday, 19 May 2026
యస్య సర్వే సమారంభాః
యస్య సర్వే సమారంభాః కామసంకల్ప వర్జితాః।
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః॥19॥4॥
శ్రీమద్భగవద్గీత..।జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు చిన్నగా పండితుడు అంటే ఎవడు అనే విషయానికి వచ్చాడు.శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు. అర్జునా!నేను ఇప్పుడే నీకు చెప్పాను కదా,కర్మ,అకర్మ,వికర్మలగురించి తెలుసుకోవాలని.ఇక్కడ సరిగ్గా అసలు సిసలు పండితుడు ఎవరో తెలుస్తుంది.మనము ఫలాపేక్ష రహితంగా ఉండాలి.నేను,అంతా నేనే,అంతా నాదే,నేనే కర్తను అనే అహంకారాన్ని వదులుకోవాలి.ఈ కర్తృత్వాహంకారం చాలా చెడ్డది.కాళ్ళు నేల మీద నిలువనీయదు.కళ్ళు నేలవైపు కాకుండా ఆకాశం వైపు చూసేలా చేస్తుంది.మన పతనానికి అదే బీజము.ఈ అహంకారాలన్నిటినీ భస్మం చేసే ఆయుథం ఒకటి ఉంది.అదే జ్ఞానాగ్ని.అలాంటి జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడూ ప్రక్క దోవలు పట్టడు.అతడే అసలైన పండితుడు.
కర్మణ్య కర్మ యః పశ్యేత్
కర్మణ్య కర్మ యః పశ్యే దకర్మణి చ కర్మ యః।
స బుద్థిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్॥18॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి సారం బోథిస్తున్నాడు.అర్జునా!పార్థా!ఈ ప్రకృతి ఎలా చూస్తే అలా కనిపిస్తుంది.ఎలా చూడాలో అనేది మనము తెలుసుకోవాలి.నేను చెప్పే కర్మ,అకర్మ,వికర్మలను అన్నిటినీ ఒకేసారి కూలంకషంగా అధ్యయనం చేస్తే ఒక విషయం బయట పడుతుంది.ఎవడైతే కర్మలలో అకర్మలను చూస్తాడో,అకర్మలలో కర్మలను చూస్తాడో వాడే బుద్ధిమంతుడు.వాడు సర్వ కర్మలనూ ఆచరించినట్లు లెఖ్ఖ.శూన్యంలోనుంచి పుట్టింది మళ్ళీ శూన్యంలోకి చేరుతుంది.అంత మాత్రానికి ఇదంతా తెలుసుకోవడం ఎందుకు అనుకుంటున్నావా?కొలిమిలో కాల్చి సమ్మెటతో కొడితేగానీ ఇనుము సాగదు.బంగారం సుందరమయిన ఆభూషణం కాదు.మన ఆత్మలో మథనం మొదలుకావాలి.అంతా మాయ అని తెలుసుకునేదానికి ముందర అన్నిటిలో నుంచీ ప్రయాణం కొనసాగించాలి కదా!
కర్మణో హ్యపి బోద్ధవ్యం
కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః।
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః॥17॥4॥
శ్రీమద్భగవద్గీత...।జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు చిన్న చిన్నగా లోతుకు పోతున్నాడు.అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!నేను నీకు ఇప్పుడే చెప్పాను కదా ఏ కర్మలు చేయాలో,ఏ కర్మలు చేయకూడదో అనే విషయంగా పెద్ద పెద్ద తలకాయలే మీమాంసలో పడుతుంటారు చాలా సార్లు అని.కాబట్టి ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి?కర్మ అంటే ఏంది?అకర్మ అంటే ఏంది?వికర్మ కథా కమామిషు ఏంది?ఈ మూడు రకాల కర్మల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి.మనమెప్పుడూ క్రొత్త క్రొత్త విషయాలను తెలుసుకునేదానికి అప్రమత్తంగా ఉండాలి.ఓయమ్మా!చాలా నేర్చేసుకున్నాము.ఇంక చాలులే అనుకోకూడదు.ఇదంతా నేను నీకు ఎందుకు చెబుతున్నాను అంటే కర్మగతి అనేది ఆషామాషీ విషయం కాదు.చాలా గాఢమయినది.ఓపికగా,క్షణ్ణంగా తెలుసుకోవాలి.తొందరపడి,పై పైన తెలుసుకుంటే చాలులే అనే మనస్తత్త్వంతో ఉండకూడదు.
Subscribe to:
Posts (Atom)