Friday, 31 July 2026

యదా వినియతం చిత్తం

యదా వినియతం చిత్త మాత్మన్యే వావతిష్ఠతే। నిస్స్పృహ స్సర్వ కామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా॥18॥6॥ శ్రీమద్భగవద్గీత.।..ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి మమేకం గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ భరత శ్రేష్ఠా!యోగాభ్యాసం ఎలా చేయాలి,ఎలా చేయకూడదు అని చెప్పాను కదా!మనసును అటలంగా పెట్టుకోవాలి.ధ్యాస నాపై నుంచి చెదరకూడదు.నాపై భక్తి శ్రద్ధలతో మమేకం అయిపోవాలి.ఎప్పుడూ మనసును ఆత్మయందే నిలపగలగాలి.కోరికలకు తిలోదకాలు ఇవ్వాలి.అలాంటి స్థితి చేరిన యోగి యోగముక్తిని పొందుతాడు.

Thursday, 30 July 2026

యుక్తాహార విహారస్య

యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు। యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా॥17॥6॥ శ్రీ మద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!ఇప్పుడే అనుకున్నాము కదా,అతి వద్దు అని.కాబట్టి ఏమి చేద్దాము?మితంగా ఆహారం తీసుకోవాలి.మట్టసంగా నిద్ర విహారాలు పోవాలి. అలాగే మితంగా నియత కర్మలు ఆచరించాలి.మితమైన మెలకువ కలిగి ఉండాలి.ఇలా అన్నీ మితంగా చేస్తూ,యోగాభ్యాసం చేసేవాడికి సర్వ దుఃఖాలూ నాశనమవుతాయి.యోగము సిద్ధిస్తుంది.

Wednesday, 29 July 2026

నాత్యశ్నతస్తు యోగోఽస్తి

నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చై కాంత మనశ్నతః। న చాతి స్వప్న శీలస్య జాగ్రతో నైవ చార్జున॥16॥6॥ శ్రీ మద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓపికగా ఏమేమి చేయాలో,ఏమేమి చేయకూడదో చెబుతున్నాడు.అర్జునా!అతి సర్వత్ర వర్జయేత్ అనే నానుడి ఉంది కదా!అది ఇక్కడ కూడా వర్తిస్తుంది.ఏదీ అతిగా చేయకూడదు.ప్రతిదీ మితంగా ఉండాలి.ఎక్కువగా తినకూడదు.తింటే ఏమవుతుంది అంటావా?తొందరగా అరగదు.అజీర్ణం చేస్తుంది.భుక్తాయసంతో మన్ను తిన్న పాములాగ పడి ఉంటాము.చలాకీదనం పోతుంది.భారీకాయం మన సొంతం అవుతుంది.అట్లా అని కటిక ఉపవాసాలు ఉండ కూడదు.లేచి,తిరుగుతూ మన పనులు మనం చేసుకునే శక్తి కూడా ఉండదు.దోగాడాలి.ఎక్కువగా నిద్ర పోకూడదు.పొద్దస్తమానం గురకలు పెట్టి నిద్రలు పోతుంటే పనులు ఎట్లా జరుగుతాయి?అట్లా అని జాగారాలు చేయకూడదు.మనిషికి,బుర్రకు విశ్రాంతి ఇవ్వాలి.అప్పుడే మళ్ళీ నూతనంగా రోజు ప్రారంభమవుతుంది.లేకపోతే అటు నిద్రా పోక,ఇటు మంచిగా మేల్కొనలేక తూగుతూ ఉంటాము.చలాకీదనం శూన్యమవుతుంది.కాబట్టీ ఏదీ అతిగా పోకుండా,మితంగా ఎక్కడ ఆగాలో,ఆపాలో తెలుసుకోవాలి,ఆచరించాలి.

Tuesday, 28 July 2026

యుంజన్నేవం సదాత్మానం

యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః। శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థా మధిగచ్ఛతి॥15॥6॥ శ్రీమద్భగవద్గీత..।।ఆత్మ సంయమ యోగము. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఓ కుంతీపుత్రా!నేను చెప్పాను కదా ఇప్పుడు.మనసు ప్రశాంతంగా ఉంచుకుని,బ్రహ్మచర్యం పాటిస్తూ,నా ధ్యాసనుంచి పక్కకు మరలకుండా యోగాభ్యాసం చెయ్యాలి అని.ఎంత సేపు అని చెప్పలేదు కదా!మాములుగా అట్లా చెప్పక పోతే మనం ఏమి చేస్తాము?ఓం,ఓం,ఓం అను గట్టిగా ఐదు నిముషాలు అంటాము.తరువాత నుంచి చిన్నగా ఒక కన్ను తెరిచి చుట్టు పక్కల ఏమి జరుగుతుంది గమనిస్తాము.మళ్ళీ కళ్ళు మూసుకుంటాము.ఇంకో ఐదు నిముషాలు ధ్యానం చేస్తాము.ఓ యమ్మో!ఈ రోజుకు చాలానే కష్టపడిపోయాము అని మనకు మనమే దిష్టి పెట్టుకుంటాము.రేపు చూసుకుందాములే అని లేచేస్తాము.కానీ,అర్జునా!అలా కాదు చేయాల్సింది.అనునిత్యమూ మనోనిగ్రహంతో అభ్యాసం చేయాలి.ధ్యానం చేసే సమయం పెంచుకుంటూ పోవాలి.ఒక నిబద్ధత రావాలి.ఒక నిష్ట ఉండాలి.ఒక ధ్యేయం ఉండాలి.చెయ్యమన్నారు కదా అని బలవంతంగా,ముక్కు మూసుకుని చేయటం కాదు.దానివల్ల ఫలితం ఉండదు.మనకు మనమే ప్రేరణ పొందాలి.ఆ యోగాభ్యాస స్థితిలో మనశ్శాంతి,మనోనిర్మలం పొందాలి.అప్పుడు ఆ భక్తుడు నా స్థితిని,నన్నూ,మోక్షాన్నీ పొందగలుగుతాడు.

Monday, 27 July 2026

ప్రశాంతాత్మా విగతభీః

ప్రశాంతాత్మా విగతభీ ర్బ్రహ్మచారి వ్రతే స్థితః। మన స్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః॥14॥6॥ శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రతి చిన్న వివరము కూడా చెబుతున్నాడు.ఇక్కడ మనము అర్జునుడి గొప్పదనం గురించి కూడా మాట్లాడుకోవాలి.జ్ఞానభిక్ష ఇచ్చేవారు భగవంతుడితో సమానం.అందుకనే మనము గురువును భగవంతుడు కంటే గొప్పగా,ముందర వరుసలో పెడతాము.ఆయనే కదా మనలను భగవంతుడికి చేరువ చేసేది.ఇక్కడ గురువు,భగవంతుడూ ఇద్దరూ ఒకరే!గురువుకి చెప్పాలని ఉన్నా శిష్యుడు ఆ జ్ఞానబోధను స్వీకరించే పరిస్థితిలో ఉండాలి కదా!ఏంది స్వామీ!యుద్ధమూ వద్దూ,నీ సుద్దులూ,బుద్ధులూ వద్దు.అని వెళ్ళిపోలేదు.రణరంగంలో బాసింపట్టు వేయించి,ఈ బలవంతపు ముక్తాయింపులు ఏంది అని విసుక్కోలేదు.ఇవన్నీ కృష్ణుడుతో అనగలిగే చనువు,స్నేహమూ ఉంది.కానీ మంచి ఎవరు చెప్పినా,కొత్త విషయాలు చెప్పినా,మన మంచి కోరి చెప్పినా...వారికి మనం గురువు హోదా ఇవ్వాలి.అది అర్జునుడు కృష్ణుడికి ఇచ్చాడు.అతను చెప్పే ప్రతి ఒక్క అక్షరాన్ని అమృత బిందువులాగా ఆస్వాదించాడు.జుర్రుకున్నాడు.సరైన మార్గంలో ప్రవర్తించాడు.ఇక్కడ శ్రీకృష్ణుడి శ్రమ వృథా కాలేదు.చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు వ్యర్థం కాలేదు.అనుకున్న ఫలితం దక్కింది. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!ఓ భరత శ్రేష్ఠా!మనము ముందర మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.భయపడకూడదు.బ్రహ్మచర్యం పాటించాలి.మనసును అదుపులో పెట్టుకోవాలి.ధ్యాస నా పైనే పెట్టాలి.ఆ స్థితిలో యోగాభ్యాసం చేయాలి.

Sunday, 26 July 2026

సమం కాయశిరోగ్రీవం

సమం కాయశిరోగ్రీవం ధారయ న్నచలం స్థిరః। సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్॥13॥6॥ శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్దునుడికి యోగాభ్యాసం చేయడానికి ఎలా కూర్చోవాలి,చూపు దేనిపైన నిలపాలి అనే వివరాలు కూడా చెబుతున్నాడు.అంటే ఒక విషయం ఎంచుకుంటే...కూలంకషంగా దాని పూర్వాపరాలు అన్నీ తెలియచేయాలి అన్నమాట.సగం ఇక్కడ,సగం మింగేసి,సగం మనకే తెలియక,ఇంకొంచెం మర్చిపోయి,మరింకొంచెం...ఆ ఇది కూడా మనమే చెప్పాలా?ఆ మాత్రం ఇంగితం లేకపోతే ఎలా?మనషి అన్నాక!ఇలా ఆలోచించి మనం ఏదీ సంపూర్ణంగా చెప్పము.కానీ దేవదేవుడైనా ఎంత ఓపికగా చెబుతున్నాడు చూడు,అర్జునుడికి.అర్జునుడు ఏమీ అడ్డబాల కాదు.కానీ నేర్పించాలి అనుకున్నప్పుడు సంపూర్ణంగా తెలియచేయాలి.అది ధర్మం! అర్జునా!కిరీటీ!శుభ్రమయిన ప్రదేశంలో,సముచిత ఆసనం ఏర్పరుచుకుని కూర్చోవాలి అని చెప్పాను కదా!అప్పుడు శరీరం,మెడ,శిరస్సు ఒకే లంబంలో ఉంచాలి.నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే...కొంచెం మంది గూని లాగా ముందరకు వంగుతారు.లేకపోతే జారగిల పడతారు.అసలు పద్మాసనం వేసుకుంటారో,లేదో?కూర్చున్న తరువాత పక్కన ఏముంది?వెనక ఏమి జరుగుతుంది అని యావకు అటూ ఇచూ చూస్తుంటారు.అట్లా అంతా వేషాలు వేయకూడదు.కదలకుండా,చలన రహితంగా ఉండాలి.దిక్కులు చూడకుండా,చూపును ముక్కు కొన...అదే నాసికాగ్రం పైనే కేంద్రీకరించాలి.అర్థమయిందా?

Friday, 24 July 2026

త త్త్రైకాగ్రం మనః కృత్వా

తత్త్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియః। ఉప విశ్వాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్థయే॥12॥6॥ శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి సముచిత ఆసనం ఎలా తయారు చేసుకోవాలో చెప్పాడు కదా!ఇప్పుడు ఇంక అసలు వ్యవహారం గురించి చెబుతున్నాడు.అర్జునా!బావా!ఇప్పుడు నీకు యోగము చేసుకునేదానికి ఆసనం ఎలా ఉండాలి అని వివరించాను కదా!ఇప్పుడు అసలు కథ లోకి వస్తాము.యోగాసక్తుడు ఆ ఆసనం మీద స్థిరంగా కూర్చోవాలి.ఇంద్రియ కర్మలను నిరోథించాలి.మనసును ఏకాగ్ర చిత్తంతో నిలపాలి.అంటే భగవంతుడు తప్ప ఇంకో ధ్యాస ఉండకూడదు.చిత్తవృత్తి నిరోధాసక్తడు కావాలి.అంటే ఏమీ లేదు బావా!మనం గమ్మున కూర్చుని ఉంటే ఏమి చేస్తాము?ఇప్పుడేదైనా మంచిగా తింటే బాగుండు.లేక పోతే బాగా మంచి నిద్ర వేస్తాము.అదీ లేకపోతే ప్రక్కన వాళ్ళతో పనికిరాని మాటలు,యవ్వారాలు చేద్దాము అనిపిస్తుంది కదా!అట్లా మనసు చంచలం కాకుండా,ఏ కర్మల జోలికి పోకుండా ఉండాలి.ఒకరకంగా చెప్పాలంటే నిర్వికారంగా ఉండడం అభ్యాసం చేసుకోవాలి.అప్పుడు ఇంక యోగాభ్యాసానికి ఓంకారాలు,శ్రీకారాలు చుట్టాలి.