Friday, 27 February 2026
అథచే త్త్వమిమం ధర్మ్యం
అధచేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి।
తత స్స్వధర్మం కీర్తిం చ హిత్వా పాప మవాప్స్యసి॥33॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము....
శ్రీకృష్ణుడు అర్జునుడికి హితవు చెబుతున్నాడు.అర్జునా!నా ప్రియ నేస్తమా!నేను నీకు చెప్పాను యుద్థం అనేది క్షత్రియ ధర్మము అని.నీవు ఈ ధర్మ బద్ధమయిన యుద్థం చేయలేదు అనుకో చాలా నష్టపోతావు.అవి ఏందంటావా?చెబుతా విను.నీకు ఎంత మంచి పేరు,యశస్సు ఉంది!అదంతా క్షణంలో మటుమాయమవుతుంది.ధర్మాన్ని అనుసరించని వాడిని ఏమంటరు?ధర్మ భ్రష్టుడు అని అంటారు.అట్లాంటి పేరు తెచ్చుకోవాలని ఉందా నీకు?చెప్పు?మౌనం అర్థంగీకారం అని అంటారు కదా!కౌరవులు తప్పు త్రోవలో పోతున్నారు.ఆ విషయం తెలిసీ,వారిని అరికట్టగలిగే శక్తి ఉండి కూడా మిన్నకుంటే ఏమవుతుంది?అసలు తప్పు చేసినవాడికంటే ఎక్కువ పాపాత్ముడివి అవుతావు.అలా అథోగతి పాలు కావడం అంత అవసరమా ఇప్పుడు నీకు.చెప్పు.మాట్లాడు.సమాథానం ఇయ్యి.దుష్టులను ఉపేక్షించడం చాలా పెద్ద నేరము.
Thursday, 26 February 2026
యదృచ్ఛయా చోపపన్నం
యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వార మపావృతమ్।
సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధ మీదృశమ్॥32॥2॥
శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి తాయిలం చూపిస్తున్నాడు.అర్జునా!అందగాడా!నీవు కలలో కూడా ఊహించని అదృష్టం నీ తలుపు తడితే ఏమి చేస్తావు?ఊహలకు కూడా అందని అదృష్టం నా చెంతకు నీజంగా ఎందుకు వస్తుంది అని అనుమానంతో,భయంతో తలుపులు మూసుకునే కూర్చుంటావా?లేక ఎగిరి గంతేసి,నాకు సుడి తిరిగిందోచ్,అనుకుంటూ పరుగెత్తి తలుపు తెరిచి స్వాగతం పలుకుతావా?ఏమి చేస్తావు?ఖచ్చితంగా రెండోదే కదా!ఆ నమ్మకం నీ మీద నాకు కూడా ఉంది.
ఇప్పుడు యుద్ధం కూడా అలా అయాచితంగా,మన ప్రమేయం లేకుండా,తెరుచుకున్న స్వర్గ ద్వారాలు అనుకో!ప్రతి ఒక్క రాజుకు ధర్మ సంస్థాపన కొరకు యుద్థం చేసే అవకాశం రాదు.అది నీకు దక్కింది.అడగకనే దేవుడు నీకు వరమిచ్చాడు అనుకో!ఇంతటి అదృష్టం ఎంత మంది రాజులకు దక్కుతుంది చెప్పు?వచ్చిన బంగారం లాంటి అవకాశం జారవిడుచుకోకు.సద్వినియోగం చేసుకుని కీర్తి పతాకం ఎగురవెయ్యి.ఇదే నా సలహా నీకు.నీ మంచి కోరి చెబుతున్నాను.
స్వధర్మమపి చావేక్ష్య
స్వధర్మ మపి చావేక్ష్య న వికంపితు మర్హసి।
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోఽన్యత్ క్షత్రియస్య న విద్యతే॥31॥2॥
శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి తన ధర్మంగురించి చెబుతున్నాడు.అర్జునా!ఆప్తమిత్రా!ఇవన్నీ వదిలేసెయ్యి.నేను చెప్పేది ఈ ఒక్కటి విను.ఈ ఆత్మలు,జీవులు అన్నీ మరచిపో.మనకంటూ ఒక ధర్మం ఉంటుంది కదా!అది నీకూ తెలుసు కదా!అది ఆచరించు.క్రొత్తగా ఏమీ చేయనక్కరలేదు.గందరగోళం,గలభా అవసరమే లేదు.నీవు క్షత్రియుడివి కదా.క్షత్రియ ధర్మం ఏంది?నువ్వే చెప్పు.యుద్ధం కదా!అదే పాటించు.ఎలాంటి అపోహలు అక్కరలేదు,అనుమానాలు అక్కర లేదు.అవగాహనా రాహిత్యం అసలు అవసరం లేదు.తలలు బద్దలు కొట్టుకో బళ్ళేదు.తల పట్టుకోనక్కరలేదు.మన ధర్మాన్ని తు చ తప్పకుండా పాటిస్తే చాలు.సంశయానికి తావు ఉండదు.ఆత్మ తృప్తి కలుగుతుంది.
Wednesday, 25 February 2026
దేహీ నిత్య మవధ్యోఽయం
దేహీ నిత్య మవధ్యోఽయం దేహే సర్వస్య భారత।
తస్మా త్సర్వాణి భూతాని న త్వం శోచితు మర్హసి॥30॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి మంచిగా చెబుతున్నాడు.అర్జునా!అన్ని దేహాలలోనూ ఉన్నది ఆత్మే.అది చంపదు,చంపబడదు.అది నిత్యము.అది సత్యము.కాబట్టి అర్జునా!అర్థం చేసుకునేదానికి ప్రయత్నించు.ఈ జీవుల కోసం శోకించడం అనేది తగని పని.అసలు అవసరము లేదు.
ఆశ్చర్యవ త్పశ్యతి
ఆశ్చర్య వత్పశ్యతి కశ్చిదేన
మాశ్చర్యవ ద్వదతి తథైవ చాన్యః।
ఆశ్చర్యవచ్చైన మన్య శ్శృణోతి
శ్రుత్వా ప్యేనం వేద న చైవ కశ్చిత్॥29॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడికి అందరూ ఆత్మ గురించి ఏమనుకుంటారో బాగా తెలుసు.అదే అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!నువ్వు ఒక్కడివే కాదు ఆత్మ గురించి గందరగోళంలో ఉండేది.
ఒకడేమో ఆత్మను ఆశ్చర్యంగా చూస్తాడు.ఇంకొకడేమో ఆత్మ గురించి ఆశ్చర్యంగా పలుకుతున్నాడు.మరి ఇంకొకడు నోరెళ్ళ బెట్టుకుని ఆశ్చర్యంగా ఆత్మ గురించి వింటున్నాడు.
ఇట్లా ఒక సరైన అవగాహన లేకుండా చూడడం ద్వారా,చెప్పడం ద్వారా,వినడం ద్వారా ఏమీ ఒరగదు.అంటే లాభం లేదు.ఆత్మను అంత సులభంగా తెలుసుకోలేము,అర్థం చేసుకోలేము.
Tuesday, 24 February 2026
అవ్యక్తాదీని భూతాని
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత।
అవ్యక్త నిధనా న్యేవ తత్ర కా పరిదేవనా॥28॥2॥
శ్రీమద్భగనద్గీత....సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి చావు పుట్టుకల గురించి వివరిస్తున్నాడు.ఓ అర్జునా!భరత శ్రేష్టా!నువ్వు నిశితంగా గమనించు.ఈ సృష్టిలోని సకల భూతాలూ పుట్టకముందు మనకు కనిపిస్తున్నాయా?లేదు కదా!కానీ ఆ జీవులు అన్నీ పుట్టిన తరువాత కనిపిస్తున్నాయి కదా!ఎందుకంటావు?ఆలోచించు ఒక్క క్షణం.
ఎందుకంటే కిందటి జన్మలో ఏ రూపంలో ఉన్నారో మనకు తెలియదు.చనిపోయిన పిమ్మట మరు జన్మలో ఎవరు ఏ రూపం పొందుతారో మనకెవరికీ తెలియదు గనక.అలాంటి బంధుకోటి గురించి నీవు తల పగలగొట్టుకోవడం ఎందుకు?ఈ దిగులు,విచారం,ఈ నిర్వీర్యం,నిస్సత్తువ,నిర్వికారం ఎందుకు?మనసును ప్రశాంతంగా పెట్టుకో!
Monday, 23 February 2026
జాతస్య హి ధ్రువో మృత్యుః
జాతస్య హి ధ్రువో మృత్యు ర్ధ్రువం జన్మ మృతస్య చ।
తస్మా దపరిహార్యేఽర్థే న త్వ వం శోచితు మర్హసి॥27॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
చెట్టును ఒక తట్టు నుంచి నరక లేక పోతే ఇంకో తట్టు నుంచి నరుక్కోని రావాలి అంటాము కదా!కృష్ణుడు తను అర్జునుడికి చెప్పాల్సింది చెప్పాడు.కానీ అతనిలో ఏమీ మార్పు కనిపిస్తున్నట్లు లేదు.అందుకని అర్జునుడి మార్గంలోనే పోయి,అర్జునుడు సత్యం గ్రహించేలా చెయ్యాలని నడుము బిగించాడు.
ఇలా చెబుతున్నాడు.అర్జునా!నీవు ఆత్మకు మనకులాగే చావు పుట్టుకలు ఉన్నాయి అని గాఢంగా నమ్ముతున్నావు కదా!సరే!అప్పుడు కూడా ఏమవుతుంది?ఒకసారి ఆలోచించు.పుట్టినది గిట్టక మానదు కదా!ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవీ చావును తప్పించుకోలేదు కదా!మరణం తరువాత మళ్ళీ పుట్టడం అనేది అంతే సహజం కదా!ఈ రెండింటిలో ఏ ఒక్కదానినీ మనం ఆపలేము కదా!మన చేతుల్లో లేని ప్రక్రియ కదా.మరి మన చేతులలో లేని,మన నియంత్రణలో లేని దాని కోసరము మనము ఇంత దుఃఖిచడం అవసరమా?నువ్వే చెప్పు.
Subscribe to:
Comments (Atom)