Thursday, 16 April 2026
మయి సర్వాణి కర్మాణి
మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాఽధ్యాత్మ చేతసా।
నిరాశీ ర్నిర్మమోభూత్వా యుధ్యస్వ విగతజ్వరః॥30॥3॥శ్రీమద్భగవద్గీత..।కర్మ యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్యం బోథిస్తున్నాడు.అర్జునా!నా,నీ అనే మమకారం వదిలెయ్యాలని చెప్పాను కదా!అసలు ఏ పనీ నీ కోసం అనుకుని చేయకు.నీవు చేసే సమస్త కర్మలూ నా కోసం చెయ్యి.నాకే సమర్పించు.అది నాది,ఇది నీది.నా కది కావాలి.ఇది వద్దు.ఇలాంటి కోరికలు మానెయ్యి.అంతా నాదే,అంతా నాకే అనే అహంకారం,అహంభావము మానెయ్యి.ఏదో తప్పు చేస్తున్నాను.నాకేమీ మంచి జరగడం లేదు అనే దుఃఖాన్ని ప్రక్కన పెట్టు.మోహం నుంచి బయట పడు.వివేకవంతుడివి కా!యుద్ధం చెయ్యి.నీ కోసం చేయనక్కరలేదు.నా కోసం చెయ్యి.దాని ఫలితం..।మంచైనా,చెడు అయినా నాకే వదిలెయ్యి.
ప్రకృతే ర్గుణ సమ్మూఢాః
ప్రకృతే ర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు।
తానకృత్స్న విదో మన్దాన్కృత్స్న విన్న విచాలయేత్॥29॥3॥
శ్రీమద్భగవద్గీత..।కర్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి సగటు మనిషి ఎలా ఉంటాడో వివరిస్తున్నాడు.అర్జునా!పార్థా!మామూలుగా మనుష్యులు అందరూ మాయామోహితులు.ఒక భ్రమలో ఉంటారు.వాళ్ళు ఎప్పుడూ గుణకర్మల యందే ఆసక్తి చూపుతుంటారు.జ్ఞాని అనేవాడు వాళ్ళ బలహీనతలను అర్థం చేసుకోవాలి.ఊరికినే ఊదర కొట్టి,వాళ్ళను అయోమయంలో పడేయకూడదు.వారిని వారి మార్గాలనుంచి మరల్చ కూడదు.ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టి భయభ్రాంతులను చేయకూడదు.వాళ్ళను చిన్నగా సన్మార్గంలో పెట్టి సత్కర్మలు చేసేలా ప్రోత్సహించాలి.
Wednesday, 15 April 2026
తత్త్వ విత్తు మహాబాహో
తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః।
గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే॥28॥3॥
శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి అన్యాపదేశంగా చెబుతున్నాడు.కండబలమే కాదు,మనోబలం కూడా ముఖ్యమే అని.అందుకే ఇలా సంబోథిస్తున్నాడు.హే అర్జునా!హే మహాబాహూ!మనం కర్మల పైన ప్రేమలు పెంచుకోకూడదు.గుణకర్మల గురించి తెలిసినవాడు చలించడు.ఎందుకంటే సర్వకర్మలూ విషయాసక్తాలైన ఇంద్రియాల చర్యలు అని కనుక్కుంటాడు.కాబట్టి వారు నిరాపేక్షగా ఆ కర్మలను ఆచరిస్తారు.ఎలాంటి బంథాలూ,అనుబంథాలూ పెంచుకోరు.నిర్వికారంగా తాము చేయవలసిన కర్మలను ఆచరిస్తారు.
Tuesday, 14 April 2026
ప్రకృతేః క్రియమాణాని
ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః।
అహంకార విమూఢాత్మా కర్తాఽహమితి మన్యతే॥27॥3॥
శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి అజ్ఞానులు ఎలాంటి భ్రమలలో బ్రతుకుతుంటారో చెబుతున్నాడు.అర్జునా!హే కిరీటీ!నీకు ఇప్పుటికి అర్థం అయింది కదా ప్రకృతి యొక్క గుణాల వల్లనే సమస్తమయిన కర్మలూ నిర్వహింపబడతాయి అనే విషయం.కానీ అజ్ఞాని అలా అర్థం చేసుకోడు.అజ్ఞానికి అహంకారం,అదే బలుపు ఎక్కువ కదా!నేనే తోపు,నేనే తురుపు ముక్కను.అంతా నా వల్లనే జరుగుతుంది,అంతా నేనే చేస్తున్నాను అని భావిస్తూ ఉంటాడు.నిజంగా మూర్ఖుడు అందామా ?లేక అమాయకుడు అని అందామా?
Monday, 13 April 2026
న బుద్ధిభేదం జనయేత్
న బుద్ధిభేదం జనయే దజ్ఞానాం కర్మసంగినామ్।
జోషయే త్సర్వకర్మాణి విద్వాన్ యుక్త స్సమాచరన్॥26॥3॥
శ్రీమద్భగవద్గీత..కర్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞాని ఎలా ఉండాలో చెబుతున్నాడు.హే అర్జునా!జ్ఞాని అనేవాడు చాలా జాగ్రత్తగా నడచుకోవాలి.కర్మలు ఆచరించే మామూలు ప్రజానీకాన్ని గందరగోళానికి గురి చేయకూడదు.వారు కర్మల ఎడ విముఖులు కాకుండా చూసుకోవాలి.తాను కర్మలను అనుసరించి,ఆచరిస్తూ మామూలు ప్రజానీకం తప్పుదారి పట్టకుండా,మంచిగా సమన్వయం చేసుకుంటూ,వారంతా కూడా సత్ కర్మల యెడ అనురక్తిని కలిగించేలా ప్రవర్తించాలి.
సక్తాః కర్మణ్య విద్వాంసో
సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత।
కుర్యా ద్విద్వాం స్తథా సక్త శ్చికీర్షు ర్లోకసంగ్రహమ్॥25॥3॥
శ్రీమద్భగవద్గీత...।కర్మ యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు...ఏ రకంగా ఆలోచించినా కర్మలు చేయడం తప్పదు,తప్పించుకోలేము అని.హే అర్జునా!ఏ భరతశ్రేష్టా!కర్మలను చేయడం ఎవరికీ తప్పదు.ఏ రకంగా ఆలోచించినా చేయాల్సిందే!
అజ్ఞానులు ఫలాపేక్ష కోసం కర్మలను చేస్తారు.జ్ఞానులు స్వలాభంకోసం చేయరు.ఆసక్తిరహితంగా చేస్తారు అంటే ఎలాంటి కోరికలు,ఇచ్ఛ లేకుండా చేస్తారు.కానీ లోకసంగ్రహణం కోసరము చేయవలసిన పనులు అన్నీ చేస్తూ ఉంటారు.
Sunday, 12 April 2026
ఉత్సీదేయు రిమే లోకా
ఉత్సీదేయు రిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్।
సంకరస్య చ కర్తా స్యా ముపహన్యా మిమాః ప్రజాః॥24॥3॥
శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి తాను కర్మలు ఆచరించకపోతే జరిగే అనర్థాలను వివరిస్తున్నాడు.అర్జునా!మిత్రమా!నేను లోక కళ్యాణం కోసం కర్మలను ఆచరిస్తున్నానని చెప్పాను కదా!నేను అలా చేయకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చెబుతాను విను.నేను నాకెందుకు?నాకు ఏమీ అవసరం లేదు.నాకు ఏదీ అక్కరలేదు అనుకుంటే లోక వ్యవహారాలన్నీ స్తంభిస్తాయి.వ్యవస్థలు అన్నీ శిథిలమవుతాయి.అప్పుడు ఏమవుతుందో తెలుసా?ఆలోచించగలవా?సంకరము,కర్మభ్రష్టత్వము కలుగుతాయి.ప్రజలయొక్క ఆ దిగజారుడుకు నేనే కారణభూతుడిని అవుతాను.నేను సృష్టించిన ఈ లోకాలు,ప్రాణులు నా వల్లనే భ్రష్టు పడతారు.అంతదానికి ఈ సృజన అంతా దేనికి?ఎవరి కోసం చెప్పు.
తల్లి కనగానే నా పని అయిపోయింది అని వదిలేస్తే ఏమవుతుంది ఆ బిడ్డ?ఎందుకూ పనికి రాకుండా పోతుంది.అయితే గియితే వ్యవస్థకు హానికరంగా మారుతుంది.కానీ ఆ తల్లి తన స్తన్యం ఇచ్చి,ప్రేమించి,మంచి మార్గంలో నడిపితే ఆ బిడ్డ సంఘానికి తురుపుముక్క అవుతుంది.అందుకే నేను కర్మలను ఆచరిస్తాను.నా బిడ్డలకు మార్గదర్శకం అవుతాను.
Subscribe to:
Comments (Atom)