Friday, 20 March 2026
ధ్యాయతో విషయాన్ పుంసః
ధ్యాయతో విషయాన్ పుంస స్సంగస్తేషూప జాయతే।
సంగా త్సంజాయతే కామః కామాత్ క్రోధోఽభి జాయతే॥62॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి విడమరిచి చెబుతున్నాడు.కౌంతేయా!కిటుకు అంతా ఇంద్రియ నిగ్రహంలోనే ఉంది.ఎందుకంటవా?మామూలుగా మనిషి ఇంద్రియాల సహాయంతోటే అన్ని విషయాల పైన ఆసక్తి,అనురాగం,మోహం,కామం పెంచుకుంటాడు.మనము కోరుకున్నది దక్కకపోతే అసహనం,అసంతృప్తి,చివరకు కోపం,క్రోథం ...వీటికి లోనయి,బానిసలం అవుతాము.ఆ చిక్కుముడి నుంచి బయట పడలేము.అక్కడక్కడే గింగిరాలు తిరుగుతుంటాము.
తాని సర్వాణి సంయమ్య
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీతమత్పరః।
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥61॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!మనము చెయ్యాల్సిన పని ఏందో చెప్పనా?మనము ముందర ఈ ఇంద్రియాలను మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి.అవి ఆడమన్నట్లు మనం ఆడకూడదు.అలుసు అయిపోతాము.ఎల్లప్పుడూ మన ఆసక్తి అంతా ఆత్మ పైనే ఉండాలి.అట్లా ఎవరు అయితే వాళ్ళ ఇంద్రియాలను తమ గుప్పెట్లో పెట్టుకుంటారో,వారి బుద్ధి మాత్రమే స్థిరంగా ఉంటుంది.అసలు నిగ్రహమే లేని వారికి స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తుంది?గాలి ఎటు మళ్ళితే అటు పోతుంటారు.
Thursday, 19 March 2026
యతతో హ్యపి కౌంతేయ
యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః।
ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః॥60॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ ప్రక్రియ ఎంత కష్టమో చెపుతున్నాడు.అర్జునా!హే కుంతీపుత్రా!నేను చెప్పేది ఆచరణలో పెట్టడం అనేది అంత సులువు కాదు.నిజం చెప్పాలంటే చాలా కష్టమే!ఎంత ప్రజ్ఞా పాటవాలు ఉన్నా,ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి పప్పులో కాలేస్తాము.ఎందుకంటే మనసును నియంత్రించడం మన చేతిలో లేదు.మెదడు వద్దన్నా మనసు కావాలంటుంది.ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అనేది చాలా కష్టతరమయిన క్రియ.మన మనసును చంచల పరచి,వ్యాకుల పరుస్తాయి.మన మనశ్శాంతిని హరించేస్తాయి.తప్పు అని తెలిసినా నియంత్రించలేము.ఆ కర్మలు తప్పు అనే అవగాహనే లేని వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకో!ఈ కోరికలు మనల్ని ఒకచోట కుదురుగా నిలబడనీయవు,కూర్చోనీయవు.
విషయా వినివర్తంతే
విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః।
రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే॥59॥2॥
శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!మానవుడు వాంఛలకు దూరంగా ఉండాలి అని అన్నాను కదా!దాని వలన సగము పనే అవుతుంది.అంటే కోరికలను ఆపుకోవడము,వాటిని త్రుంచివేయడము,దూరంగా ఉండడం అనే ప్రక్రియల వలన విషయదూరుడవుతాడు,అంతే.కానీ ఆ వాసనాబలం అంత తొందరగా పోదు.బాహ్యంగా లేక బాహాటంగా ఆ కర్మలు లేక విషయాల జోలికి పోకపోయినా మనసులోనుంచి పూర్తిగా చెరిగిపోవు.వాటి ఆలోచనలు,వాటిపైన ఇచ్ఛ అనేది తొలుస్తూ ఉంటుంది,కనీసం అప్పుడప్పుడైనా.ఆ ముద్రలు అంత సులభంగా చెరగిపోవు.వీటినే వాసనలు అంటారు.మనము ఆ పరమాత్మను వీక్షించ గలిగినపుడు మటుకే ఈ వాసనాబలం పూర్తిగా తొలగిపోతుంది.మనము స్వచ్ఛముగా తయారు అవుతాము.ఆ పరాత్పరుడిని చూడగలగాలంటే నమ్మకము,దీక్ష,భక్తి,అంకితభావము...అన్నీ నిండుగా,మెండుగా ఉండాలి మనలో.
Wednesday, 18 March 2026
యదా సంహరతే చాయం
యదా సంహరతే చాయం కుర్మోఽంగానీవ సర్వశః।
ఇంద్రియా ణీంద్రియార్థేభ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥58॥2॥
శ్రీమద్భగవద్గీత..సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడికి ఏమూలనో కొంచెం అనుమానంగా ఉంది.తను చెప్పేది అర్జునుడికి సరిగ్గా అర్థం కావడం లేదేమో అని.అందుకని సోదాహరణంగా చెప్పాలని తీర్మానించుకున్నట్లు ఉన్నాడు.అర్జునా!నీకు తెలుసు కదా!తాబేలు ఎట్లుంటుంది?అస్తమానమూ ఏమి చేస్తుంది?తన శరీర అవయవాలన్నిటినీ తన లోపలకు ముడుచుకుని కూర్చుని ఉంటుంది కదా!మనము కూడా ఇంచుమించుగా అలాగే ఉండేదానికి ప్రయత్నించాలి.ఎందుకు?ఏమిటి?ఎలా?అని అంటావా?చెబుతాను విను.మనము మన ఇంద్రియాలను విషయాలనుంచి మరల్చాలి.వాటిని మన ఆథీనంలో ఉంచుకోవాలి.ఈ ఇంద్రియాలను పకడ్బందీగా మన వశంలో ఉంచుకోకపోతే వ్యవహారం అంతా తీన్ తార్ అవుతుంది.మన బుద్ధి స్ధిరంగా ఉండాలంటే ఇవన్నీ తప్పని సరి.దగ్గరి మార్గాలు ఎప్పుడూ సత్ఫలితాలు ఇవ్వవు ఎక్కవ కాలం.మనము ప్రతిదీ క్షుణ్ణంగా అభ్యసించాలి.వేరే దారి లేదు.
య స్సర్వత్రానభిస్నేహః
య స్సర్వత్రానభిస్నేహస్తత్త త్ప్రాప్య శుభాశుభమ్।
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥57॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి స్థిత ప్రజ్ఞత గురించి ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!మనకు దేని పైనా కోరికలు ఉండకూడదు.మనకు జరిగే మంచి చెడులను సమానంగా స్వీకరించాలి.తేడా చూపించకూడదు.ఎందుకంటావా?కర్తవ్యం మటుకే మనము చేయాల్సినది.దాని ఫలితం మనకు అనవసరము.అక్కరలేదు.ఆనందం దుఃఖం అనే భావాలకూ,భావనలకు అతీతంగా ఉండాలి.ఎవ్వడు అయితే పైన పేర్కొన్న విథంగా ఉంటాడో వాడి బుద్ధియే సుప్రతిష్టమయినది.ఆస్థితికి మనము చేరుకోగలిగితే మనలను తలదన్నేవాడు ఉండడు.మనము ఉత్కృష్టమయిన స్థానంలో ఉన్నట్లు లెక్క.
దుఃఖే ష్వనుద్విగ్నమనాః
దుఃఖే ష్వనుద్విగ్నమనా స్సుఖేషు విగతస్పృహః।
వీతరాగ భయక్రోధః స్థితధీ ర్ముని రుచ్యతే॥56॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడికి తన సఖుడి స్థితి,దుస్థితి చూస్తుంటే చాలా బాథగా ఉంది.తన సాయశక్తులా పోరాడుతున్నాడు అర్జునుడిని ఆ పరిస్థితి నుంచి బయటపడేసేదానికి.అర్జునా!స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అనే కదా నీ ప్రశ్న?నేను చెబుతున్నాను,విను.దుఃఖాలకు,కష్టాలకూ దిగులు పడకూడదు.కలత పడకూడదు.సుఖాలు తలుపు తడితే పరవశం పొందకూడదు.రెండింటినీ సమానంగా స్వీకరించగలగటం నేర్చుకోవాలి.తెలుసుకోవాలి.ఈ ప్రేమలు,ద్వేషాలూ,భయాలూ,బరువులు,కోపాలూ,తాపాలూ ..వీటన్నిటినీ ప్రక్కకు పెట్టేయాలి.అహాఁ!అసలు టోకుగా వదిలేయాలి.ఝంఝాటకాలు అస్సలు ఉండకూడదు.ఈ ప్రలోభాలన్నిటికీ ప్రభావితం కానివాడే స్థిత ప్రజ్ఞుడు అని అంటారు.ఇదంతా నేను చెప్పటం కాదు.గొప్ప గొప్ప మహనీయులు,మునులు చెప్పే మాట.
Subscribe to:
Comments (Atom)