Saturday, 21 March 2026

రాగద్వేష వియుక్తైస్తు

రాగద్వేష వియుక్తైస్తు విషయా నింద్రియై శ్చరన్। ఆత్మవశ్యై ర్విధేయాత్మా ప్రసాద మధిగచ్ఛతి॥64॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓపికగా చిలకకి చెప్పినట్లు చెబుతున్నాడు.అర్జునా!మన వ్యవహారం ఎలా ఉండాలో చెప్పేదా?తామరాకు పైన నీటిబొట్టులాగ ఉండాలి.అంటే నీటి బొట్టు తామరాకు పైన ఉన్నా దానిని నిజంగా అతుక్కుని ఉండదు.సన్నని,పల్చని మైనపు పొర ఆకు పైన ఉంటుంది.దాని వలన నీటి బిందువు స్వేచ్ఛగా,స్వచ్ఛంగా ఆకు మీద ఎలా అయినా కదులుతుంది.అలానే మనం కూడా విషయాలను అనుభవిస్తున్నా,కర్మలను ఆచరిస్తున్నా రాగద్వేషాలకు అతీతంగా మసలుకోవాలి.ఇంద్రియ నిగ్రహం ఎప్పుడూ కోల్పోకుండా ఉండాలి.అప్పుడే మనము మన మనసును మన ఆధీనంలో ఉంచుకోగలము.మన మనసు ఎప్పుడు మన స్వాధీనంలో ఉంటుందో,అప్పుడే మనము నిర్మల మనస్కులము కాగలము.లేక పోతే పట్టుకోండి చూద్దాం అన్నట్లు ఎండమావుల వెంట పరుగులు తీస్తూ ఉంటాము.

క్రోధా ద్భవతి సమ్మోహః

క్రోధా ద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః। స్మృతిభ్రంశా ద్బుద్ధినాశో బుద్ధినాశా త్ప్రణశ్యతి॥63॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు తన చెలికాడు అయిన అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!చెలికాడా!నీకు శృంఖల చర్య,అదే గొలుసు కట్టు చర్య అంటే తెలుసు కదా!ఒక పని మొదలు పెడితే అక్కడితో ఆగకుండా,మన ప్రమేయం లేకుండానే,మనకు ఊపిరి పీల్చుకునే అవథి కూడా ఇవ్వకుండా వెనువెంటనే జరిగి పోతుంటాయి కొన్ని పనులు.మనము నిర్ఘాంతపడి చూస్తూ ఉండాల్సిందే.ఎందుకంటే ఆ పరిణామాలను మనము ఆపలేము.ఇక్కడ నేను చెప్పబోయేది అదే.మనకు కోపం వస్తుంది.దాంట్లో ఆశ్చర్యం ఏముంది?మామూలే కదా!మనిషి అన్నాక ఆ మాత్రం కోపతాపాలు ఉండవా?అని మనలని మనం సమర్థించుకుంటాము.ఇదే మనము చేసే మొదటి తప్పు.ఎందుకంటే కోపం వస్తే మనము విచక్షణాజ్ఞానాన్ని కోల్పోతాము.విచక్షణ లేదు అంటే ముచ్చటగా అవివేకమనే కదా అర్థం!ఒకటి కొంటే ఒకటి ఉచితం కాదు.ఒకటి కొంటే పది ఉచితం లాగా కలుపుకుని వస్తాయి ఇక్కడ.ఎందుకంటే అవివేకంతో పాటు స్మృతిభ్రంశం అంటుకుంటుంది.అంటే మతి మరుపు.ఇంతకు ముందు మనము నేర్చుకున్న మంచి చెడ్డా,పెద్దా చిన్నా,తప్పూ ఒప్పూ అన్నీ చిటికెలో మాయమవుతాయి.దీని పర్యవశానం ఏందంటే బుద్ది చెడుతుంది.చెడ్డ ఆలోచనలు,చెడ్జ తలపులు,చెడ్డ పనులకు మొగ్గు చూపుతాము.ఒకసారి సద్బుద్ధిని కోపమనే చెదపురుగు తొలిచిందనుకో,ఇంకేముంది?సర్వం నాశనమే!పురుషుడు అథోగతికి జారిపోతాడు.

Friday, 20 March 2026

ధ్యాయతో విషయాన్ పుంసః

ధ్యాయతో విషయాన్ పుంస స్సంగస్తేషూప జాయతే। సంగా త్సంజాయతే కామః కామాత్ క్రోధోఽభి జాయతే॥62॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి విడమరిచి చెబుతున్నాడు.కౌంతేయా!కిటుకు అంతా ఇంద్రియ నిగ్రహంలోనే ఉంది.ఎందుకంటవా?మామూలుగా మనిషి ఇంద్రియాల సహాయంతోటే అన్ని విషయాల పైన ఆసక్తి,అనురాగం,మోహం,కామం పెంచుకుంటాడు.మనము కోరుకున్నది దక్కకపోతే అసహనం,అసంతృప్తి,చివరకు కోపం,క్రోథం ...వీటికి లోనయి,బానిసలం అవుతాము.ఆ చిక్కుముడి నుంచి బయట పడలేము.అక్కడక్కడే గింగిరాలు తిరుగుతుంటాము.

తాని సర్వాణి సంయమ్య

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీతమత్పరః। వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥61॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!మనము చెయ్యాల్సిన పని ఏందో చెప్పనా?మనము ముందర ఈ ఇంద్రియాలను మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి.అవి ఆడమన్నట్లు మనం ఆడకూడదు.అలుసు అయిపోతాము.ఎల్లప్పుడూ మన ఆసక్తి అంతా ఆత్మ పైనే ఉండాలి.అట్లా ఎవరు అయితే వాళ్ళ ఇంద్రియాలను తమ గుప్పెట్లో పెట్టుకుంటారో,వారి బుద్ధి మాత్రమే స్థిరంగా ఉంటుంది.అసలు నిగ్రహమే లేని వారికి స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తుంది?గాలి ఎటు మళ్ళితే అటు పోతుంటారు.

Thursday, 19 March 2026

యతతో హ్యపి కౌంతేయ

యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః। ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః॥60॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ ప్రక్రియ ఎంత కష్టమో చెపుతున్నాడు.అర్జునా!హే కుంతీపుత్రా!నేను చెప్పేది ఆచరణలో పెట్టడం అనేది అంత సులువు కాదు.నిజం చెప్పాలంటే చాలా కష్టమే!ఎంత ప్రజ్ఞా పాటవాలు ఉన్నా,ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి పప్పులో కాలేస్తాము.ఎందుకంటే మనసును నియంత్రించడం మన చేతిలో లేదు.మెదడు వద్దన్నా మనసు కావాలంటుంది.ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అనేది చాలా కష్టతరమయిన క్రియ.మన మనసును చంచల పరచి,వ్యాకుల పరుస్తాయి.మన మనశ్శాంతిని హరించేస్తాయి.తప్పు అని తెలిసినా నియంత్రించలేము.ఆ కర్మలు తప్పు అనే అవగాహనే లేని వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకో!ఈ కోరికలు మనల్ని ఒకచోట కుదురుగా నిలబడనీయవు,కూర్చోనీయవు.

విషయా వినివర్తంతే

విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః। రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే॥59॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!మానవుడు వాంఛలకు దూరంగా ఉండాలి అని అన్నాను కదా!దాని వలన సగము పనే అవుతుంది.అంటే కోరికలను ఆపుకోవడము,వాటిని త్రుంచివేయడము,దూరంగా ఉండడం అనే ప్రక్రియల వలన విషయదూరుడవుతాడు,అంతే.కానీ ఆ వాసనాబలం అంత తొందరగా పోదు.బాహ్యంగా లేక బాహాటంగా ఆ కర్మలు లేక విషయాల జోలికి పోకపోయినా మనసులోనుంచి పూర్తిగా చెరిగిపోవు.వాటి ఆలోచనలు,వాటిపైన ఇచ్ఛ అనేది తొలుస్తూ ఉంటుంది,కనీసం అప్పుడప్పుడైనా.ఆ ముద్రలు అంత సులభంగా చెరగిపోవు.వీటినే వాసనలు అంటారు.మనము ఆ పరమాత్మను వీక్షించ గలిగినపుడు మటుకే ఈ వాసనాబలం పూర్తిగా తొలగిపోతుంది.మనము స్వచ్ఛముగా తయారు అవుతాము.ఆ పరాత్పరుడిని చూడగలగాలంటే నమ్మకము,దీక్ష,భక్తి,అంకితభావము...అన్నీ నిండుగా,మెండుగా ఉండాలి మనలో.

Wednesday, 18 March 2026

యదా సంహరతే చాయం

యదా సంహరతే చాయం కుర్మోఽంగానీవ సర్వశః। ఇంద్రియా ణీంద్రియార్థేభ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥58॥2॥ శ్రీమద్భగవద్గీత..సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడికి ఏమూలనో కొంచెం అనుమానంగా ఉంది.తను చెప్పేది అర్జునుడికి సరిగ్గా అర్థం కావడం లేదేమో అని.అందుకని సోదాహరణంగా చెప్పాలని తీర్మానించుకున్నట్లు ఉన్నాడు.అర్జునా!నీకు తెలుసు కదా!తాబేలు ఎట్లుంటుంది?అస్తమానమూ ఏమి చేస్తుంది?తన శరీర అవయవాలన్నిటినీ తన లోపలకు ముడుచుకుని కూర్చుని ఉంటుంది కదా!మనము కూడా ఇంచుమించుగా అలాగే ఉండేదానికి ప్రయత్నించాలి.ఎందుకు?ఏమిటి?ఎలా?అని అంటావా?చెబుతాను విను.మనము మన ఇంద్రియాలను విషయాలనుంచి మరల్చాలి.వాటిని మన ఆథీనంలో ఉంచుకోవాలి.ఈ ఇంద్రియాలను పకడ్బందీగా మన వశంలో ఉంచుకోకపోతే వ్యవహారం అంతా తీన్ తార్ అవుతుంది.మన బుద్ధి స్ధిరంగా ఉండాలంటే ఇవన్నీ తప్పని సరి.దగ్గరి మార్గాలు ఎప్పుడూ సత్ఫలితాలు ఇవ్వవు ఎక్కవ కాలం.మనము ప్రతిదీ క్షుణ్ణంగా అభ్యసించాలి.వేరే దారి లేదు.