Monday, 16 February 2026

న జాయతే మ్రియతే

న జాయతే మ్రియతే వా కదాచి న్నాయం భూత్వా భవితా వా న భూయః। అజో నిత్య శ్శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే॥20॥2॥ శ్రమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడికి అర్జునుడిని చూస్తే జాలి,దయ కలగటం లేదు.కోపం వస్తుంది.అయినా అన్నీ దిగమ్రింగుకోని ఇలా అంటున్నాడు. నేస్తమా!నేల చూపులు ఏంది?ఈ నీరసం,నిస్సత్తువ ఏంది?కాళ్ళూ,చేతులు వ్రేలాడేసుకుని ఈ బేల చూపులు ఏంది?ఈ చతికిలబడటం ఏంది? ముందర లెయ్యి అసలు.మనలను చూసి నలుగురు ఉత్తేజితులు కావాలి.పదిమందికి మనం ప్రామాణికంగా నిలవాలి.బెబ్బెబ్బే అంటూ ఈ దీనాలాపనలు,బొబ్బెబ్బో అంటూ ఏడుపులు ఏంది?చలనం తెచ్చుకో!నా కళ్ళలోకి చూడు.నేను చెప్పేది మనసు పెట్టి విని,ఆకళింపు చేసుకో! ఆత్మ పుట్టేది కాదు.దానికి చావు అనేది లేదు.అట్లా అని ఒకప్పుడు ఉండి,ఇంకోకప్పుడు లేకుండా ఉండదు.ఆత్మ జనితమయినది కాదు.దానికి మార్పులు,చేర్పులు,తక్కువలు,ఎక్కువలు అంటూ ఏమీ ఉండవు.దానికి నాశనం అనేది లేదు.అది సనాతనమయినది.అది చంపదు.చావదు,చావబడదు.అది ధరించిన శరీరం నశిస్తుంది, దానికి చావు ఉంది కానీ ఈ ఆత్మకు మటుకు చావు లేదు,నాశనం అవదు.

య ఏవం వేత్తి హంతారం

య ఏవం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్। ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే॥19॥2॥ శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మ తత్త్వం గురించి చెబుతున్నాడు.మిత్రమా!అర్జునా!నీకు ఈ విషయం తెలుసా?ఈ ఆత్మ అనేది ఉందే!అది దేనిని చంపదు.దేని చేత చంపబడదు.ఎవరైనా ఆత్మ చంపుతుంది,లేకపోతే చంపబడుతుంది అనుకుంటే...వారంత అజ్ఞానులు ఇంకొకరు ఉండరు.ఎందుకంటే ఆత్మ వీటన్నిటికీ అతీతమయినది.ఏదీ దానిని మలినం చేయలేదు.నాశనము చేయలేదు.అది స్వచ్ఛమయినది.నిత్యమయినది.నిరామయము.

Sunday, 15 February 2026

అంత వంత ఇమే దేహా

అంత వంత ఇమే దేహానిత్యస్యోక్తా శ్శరీరిణః। అనాశినోఽప్రమేయస్య తల్మా ద్యుధ్యస్వభారత॥18॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడిని బుజ్జగిస్తున్నాడు.అర్జునా!ధరించబడిన దేహాలు నశిస్తాయి.దానిని ధరించిన జీవుడు,అదే ఆత్మ నాశనం కాదు.అది నిత్యమయినది.సత్యమయినది.ముందు నువ్వు ఆ విషయం తెలుసుకుని,గుర్తు పెట్టుకో.ఈ అనవసరమయిన దుఃఖాన్ని మానివెయ్యి.యుద్ధానికి నడుము బిగించి విజయమో,వీరస్వర్గమో తేల్చుకో!వెనకకు తగ్గొద్దు.

Saturday, 14 February 2026

అవినాశి తు తద్విద్ధి

అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్। వినాశ మవ్యయస్యాస్య న కశ్చి త్కర్తు మర్హతి॥17॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.సఖా!అర్జునా!ఈ ఆత్మ అనేది ఉందే!అది ఈ జగత్తు అంతా పరివ్యాప్తమయి ఉంది.అంటే వ్యాపించి ఉంది.దానికి నాశనము లేదు అని తెలుసుకో.ఈ ఆత్మ అవ్యయము.దీనిని నాశనం చేసేది,చేయగలిగేది ముల్లోకాలలో ఏదీ లేదని అర్థం చేసుకో! అసలు అవ్యయము అంటేనే నాశనము లేనిది.సర్వకాల సర్వావస్థల యందు మార్పులు,చేర్పులు లేకుండా ఉండేది.అది నిత్యమూ,సత్యమూ కూడాను.

Friday, 13 February 2026

నాసతో విద్యతే భావో

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః। ఉభయోరపి దృష్టోఽన్త స్త్వనయో స్తత్త్వదర్శిభిః॥16॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడి బుర్రలోకి తాను చెప్పేది ఎక్కాలని చాలా తాపత్రయపడుతున్నాడు.ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఇటు చూడు.దేహం కలిగిన వారు అందరూ అశాశ్వతులు.ఆత్మ శాశ్వతము.దానికి లేమి అనేది లేనే లేదు.దేహాదులు అంతా మాయ,అశాశ్వతము.అదే ఆత్మ అనేది నిత్యమూ,సత్యమూ అయినది.ఇది అర్థం చేసుకో ముందు. ఈ విషయాన్ని తత్త్వజ్ఞులందరూ ఎప్పుడో తెలుసుకున్నారు.ఇది నిశ్చలమయిన,నిశ్చితమయిన సత్యము.దీనినుంచి ఎవరూ మొహం చాటు వేయలేరు.ఒప్పుకోవాలసిందే!

Thursday, 12 February 2026

యం హి న వ్యథయం త్యేతే

యం హి న వ్యథయం త్యేతే పురుషం పురుషర్షభ। సమ దుఃఖ సుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే॥15॥2॥ శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.ఇవన్నీ వదిలేసెయ్యి.సుఖాలూ,దుఃఖాలూ ప్రతి ఒకేరి జీవితంలో సర్వ సాథారణము కదా!వాటికి మనము చలించడం మానేయాలి.అవి బాథ పెట్టాయని ఏడవడం,సుఖ పెట్టాయని గెంతులు వేయడం ముందు మానుకోవాలి.అవి మనలను ఏ రకంగానూ ప్రభావితం చేయకూడదు.ఆ స్థితికి మనము చేరాలి.ఇవన్నీ దాటుకుని పోతేకానీ మనకు మోక్షానికి అర్హత సంపాదించలేము. సుఖాలనూ దుఃఖాలనూ సమానంగా స్వీకరించగలిగే స్థితికి చేరుకున్నవారే మోక్షానికి అర్హులు అవుతున్నారు.

Wednesday, 11 February 2026

మాత్రా స్పర్శాస్తు కౌంతేయ

మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః। ఆగమాపాయినోఽనిత్యాః తాం స్తితిక్షస్వ భారత॥14॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడి ఓపికకి నిజంగా జోహార్లు!మాములుగా మన ప్రక్క వాడి కంటే మనము కొంచెము ఎక్కవ అనే భావము రాగానే మనకు కళ్ళు నెత్తికి ఎక్కుతాయి.ఎక్కువ తెలివి అనేది నిజమయినా,నిజం కాకపోయినా!అలాంటిది భగవంతుడు అయి కూడా అంత ఓపికగా,సులభంగా అర్థం అయ్యేలాగా చెబుతున్నాడు అంటే మనమంతా ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలి అని కొంచెం ఆలోచించాలి. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!మనము చలి అయినా,వేడి అయినా ఎట్లా తెలుసుకుంటాము?మన ఇంద్రియాల వలనే కదా!సుఖ దుఃఖాలు కూడా అంతే.ఇంద్రియాల వలనే కలుగుతాయి.ఆకాశంలో కదిలే మేఘాలలాగానే.ఈ క్షణం కనిపిస్తాయి.ప్రక్క క్షణం మాయమవుతూ ఉంటాయి.అవి అక్కడే పాతుకు పెట్టుకుని కూర్చోవు కదా!అవి శాశ్వతం కాదు.చంచలం.వస్తుంటాయి,పోతుంటాయి. ఇట్లా మనము ప్రతి చిన్న విషయానికి భావోద్వేగాలకు లోనయితే ఎలాగా?నీవే చెప్పు.