Sunday, 24 May 2026

దైవమే వాపరే యజ్ఞం

దైవమే వాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే। బ్రహ్మగ్నా వపరే యజ్ఞం యజ్ఞేనై వోపజుహ్వతి॥25॥4॥ శ్రీమద్భగవద్గీత....జ్ఞాన యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి సమర్పణ గురించి చెబుతున్నాడు.అర్జునా!మనలో కొంత మంది దేవతలను తృప్తి పరిచేదానికి యజ్ఞాలు చేస్తారు.సామాన్యంగా అలాంటివి అన్నీ ఆయా దేవతలను సంతృప్తి పరచి,వాళ్ళ ద్వారా లాభం పొందాలనుకునే ప్రక్రియలు.కానీ అసలు సిసలు సమర్పణ అంటే ఏందో చెబుతాను,విను.ఇందాక నేను చెప్పాను కదా ఈ సృష్ఠి అంతా బ్రహ్మమయము అని.ఆ బ్రహ్మైక భావనతో కొందరు ఉంటారు.వారికి యజ్ఞశాలలు అఖ్ఖరలేదు.యజ్ఞ గుండాలు,సామగ్రి అఖ్ఖరలేదు.మంత్ర పఠనానికి తోడు ఋత్విక్కులు అక్కరలేదు.వారు నిత్యము,సత్యము అయిన సర్వవ్యాపకుడిని బ్రహ్మైక భావంతో ఆత్మను ఆత్మయందే హవిస్సులాగ ఉపయోగించి హోమం చేసి,ఆత్మార్పణం చేసుకుంటారు. అసలు అక్కడ నువ్వే నేను,నేనే నువ్వు అనే భావన.నేనే నేను కానప్పుడు నువ్వు నేను ఎలా అవుతాను?అంటే అంతా మిథ్యే కదా!అంటే నీ,నా అంటూ ఏమీ లేదు.అంతా శూన్యమే!అంతా ఫలభరితమే!అంతా కలిసిపోయింది.దేనినుంచీ దేనినీ విడదీయలేము.

Saturday, 23 May 2026

బ్రహ్మార్పణం బ్రహ్మహవిః

బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్। బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా॥24॥4॥ శ్రీమద్భగవద్గీత..।।జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి అంతా బ్రహ్మమయం అని చెబుతున్నాడు.అర్జునా!బ్రహ్మము అంటే అత్యున్నతమయిన శక్తి.దానికి ఒక శరీరం అంటూ ఏమీలేదు.ఈ సర్వజగత్తునీ కమ్ముకుని,నిర్దేశిస్తూ ఉంటుంది.దానినుంచి మనము దేనినీ విడదీయలేను.ఒకరకంగా చెప్పాలంటే అదే అద్వైతము .అది నిజము.అది శాశ్వతము.అది సృష్టికి మూలాథారం.అది లేని చోటు అంటూ ఏమీలేదు. అందుకే చెబుతున్నాను.సృక్ సువాదులు బ్రహ్మ.అంటే యజ్ఞ గుండంలో నెయ్యి వేసేదానికి వాడే గరిటలు,మిగిలిన సామానులు అని అర్థం.హోమంలో వేసేదానికి వాడే ద్రవ్యాలు బ్రహ్మ.అగ్ని బ్రహ్మ.ఆహుతి ఇచ్చేవాడు బ్రహ్మ.మనం అంత సమర్పించేదీ బ్రహ్మకే.అంటే ఇచ్చే వస్తువులు,వాడే వస్తువులు,ఇచ్చేవాడు,పుచ్చుకునేవాడు అందరూ బ్రహ్మలే!అంటే సర్వం బ్రహ్మమయం.ఈ విషయం తెలుసుకున్నవాడు బ్రహ్మత్వాన్ని పొందకుండా ఎలా ఉంటాడు చెప్పు. అంటే ఆత్మ,పరమాత్మ ఒక్కటే అనే అవగాహన అనివార్యం,అవసరం!

Friday, 22 May 2026

గత సంగస్య ముక్తస్య

గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః। యజ్ఞా యా చరతః కర్మసమగ్రం ప్రవిలీయతే॥23॥4॥ శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు తిప్పి తిప్పి ఒకటే విషయం చెబుతున్నాడు.అది అవసరము కూడా!ఎందుకంటే మనవి బుర్రలు బాగానే పని చేస్తాయి.కానీ నిజంగా బుర్రలోకి,నరనరాల్లోకి ఒక విషయం జీర్ణించుకుని పోవాలంటే ఒక సారి కని,ఒక సారి విని,ఇంకొక సారి ఒప్పచెబితే సరిపోదు.పదే పదే వినాలి.పదే పదే మననం చేసుకోవాలి.పదే పదే అర్థం చేసుకోవాలి.సమన్వయం చేసుకోవాలి.అప్పుడు ఆచరణలోకి వస్తుంది.ఎప్పుడు కూడా ఇట్టా వచ్చేది అట్టానే పోతుంది.గల గల పారే నీరు భూమి లోకి పూర్తిగా,లోతుగా ఇంకదు.చుక్క, చుక్క,చుక్కకు చుక్క చిన్నగా పడుతుంటే నేల బాగా,లోతుగా తడుస్తుంది.ఆ తడి ఎక్కువ సేపు కూడా నిలుస్తుంది.పై పై పొరల్లో ఉండేది తొందరగా ఆవిరి అయిపోతుంది. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!మిత్రమా!మానవుడు ఫలాపేక్షను విడవాలి.బ్రహ్మ జ్ఞాన నిష్ఠాపరుడు కావాలి.ఈశ్వరుని తృప్తికి,ప్రీతికి మటుకే యజ్ఞాలు,యాగాది కర్మానుష్ఠాలు చేయాలి.ఏ కోశానా మమ,అహం అనే భావన ఇసుమంతైనా ఉండకూడదు.అట్లా కర్మలు చేస్తే పూర్వ కర్మలు కూడా నశిస్తాయి.అట్లాంటిది ప్రస్తుత కర్మలు అతనిని బంథించలేవు.అతను కడిగిన ముత్యంలాగ స్వచ్ఛం అయి తీరతాడు.

యదృచ్ఛా లాభ సంతుష్టో

యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః। సమ సిద్థావ సిద్థౌచ కృత్వాపి న నిబధ్యతే॥22॥4॥ శ్రీమద్భగవగ్గీత...జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి మనము ఎలా ఉండాలో చెబుతున్నాడు.అర్జునా!ఇందాకటి నుంచి నేను నీకు మనిషి ఎలా ఉండాలో చెబుతున్నాను.అదే ఇంకొంచెం వివరంగా చెబుతాను.మనము మనకున్న దానితో తృప్తి పడడం నేర్చుకోవాలి.ప్రతి దానికీ అసంతృప్తి,అనుమానం,అసహనం ఉండకుండా ఉండాలి.మనము అసూయ,ఈర్ష్య,పగ,ప్రతీకారాలను మరిచిపోవాలి.మనసులో కూడా మననం చేసుకోకూడదు.ఎందుకంటే ఈ మాత్సర్యంకి మూల కారణం అసంతృప్తి.మనకేదో అన్యాయం జరుగుతుందేమో అనే అనుమానం.మనకంటే ఎదుటివాడు మనకంటే ఎక్కువ సత్తా లేక పోయినా,మనకంటే బాగా వృద్ధిలోకి వస్తున్నాడేమో అనే శంక.వాడిని ఎలాగైనా పడగొట్టాలి,మనమే ముందుకు పోవాలి అనే పగ,ప్రతీకార్య చర్యలు,ఆబ,అత్యాశ.వీటన్నిటినీ తుడిచి పెట్టేయాలి.మనము మనము చేపట్టిన కార్యము,కర్మ సిద్ధించినా,సిద్ధించకపోయినా మనసు సమతుల్యంగా ఉండేలా సాథన చెయ్యాలి. అంటే,తనకు లభించిన దానితో తృప్తి పడేవాడు,శంకారహితుడు,మాత్సర్యం లేనివాడు,కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా సమాన బుద్ధి కలవాడు...ఏ కర్మలు చేసినా బంధాలు అనే చట్రంలో చిక్కుకోడు.తామరాకు మీద నీటి బొట్టు చందాన వెలిగిపోతుంటాడు.

Thursday, 21 May 2026

నిరాశీ ర్యత చిత్తాత్మా

నిరాశీ ర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః। శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్॥21॥4॥ శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలా మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలో చెబుతున్నాడు.అర్జునా!సఖా!మనలో ఎవరైనా పాపకూపంలో ఇరుక్కోవాలి అనుకుంటామా?మన జీవితాలు భ్రష్టు పట్టి,నాశనం అయిపోవాలని కోరుకుంటామా?లేదు కదా!మరి అలాంటప్పుడు మనం ఏమి చెయ్యాలి?ఆ చెడు,దీన స్ధితికి రాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అనే ప్రణాళిక,అవగాహన ఉండాలి కదా!నేను చెబుతాను,విను. మనము తృష్ణ,అదే కోరికలు లేకుండా ఉండాలి.మనసునూ,ఇంద్రియాలను మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలి.అంటే ఇంద్రియ నిగ్రహం కావాలి.దత్తికి పోయి కనిపించిందంతా చేజిక్కించుకోవటం కాదు,అతి తక్కువలో మన జీవనం కొనసాగించగల్గేటంత సమకూర్చుకుంటే చాలు.ఈ మూడు సూత్రాలూ తు.చ.తప్పకుండా పాటిస్తే మనిషి పాప కూపంలో చిక్కుకోడు.లేకపోతే అథఃపాతాళానికి జారిపోతాడు.ఇది నేను భయపెట్టేదానికి నీకు చెప్పడం లేదు.మంచి మాటలు విని,ఆచరణలో పెట్టకపోతే ఏమి జరుగుతుందో హెచ్చరిస్తున్నాను.అంతే!

Wednesday, 20 May 2026

త్యక్త్వా కర్మఫలాసంగం

త్యక్త్వా కర్మఫలాసంగం నిత్య తృప్తో నిరాశ్రయః। కర్మ ణ్యభి ప్రవృత్తోఽపి నైవ కించిత్ కరోతి సః॥20॥4॥ శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడితో కర్మలు ఎలా చెయ్యాలో చెబుతున్నాడు.అర్జునా!మనము ముందర కర్మలను ఎలాంటి ఫలితం ఆశించకుండా చేయాలి.ఎప్పుడూ అసంతృప్తిని దరిదాపుల్లోనికి రానివ్వకూడదు.మనము దేనికోసమూ ఒకరి పైన ఆథార పడకూడదు.అంటే ఉన్నదాంతో తృప్తి పడాలి.ఇలాంటి మనో వికాసంతో ఉన్నవాడు కర్మలు చేసినా,చేయనట్లే లెఖ్ఖ.అంటే కర్మల మంచి చెడ్డలు తనకు అంటవు.వాటన్నిటికీ అతీతం అతను.కాబట్టి మనము ఫలాపేక్షలేని నిత్యతృప్తుడు,నిరాశ్రయుడు లాగ ఉండాలి.

Tuesday, 19 May 2026

యస్య సర్వే సమారంభాః

యస్య సర్వే సమారంభాః కామసంకల్ప వర్జితాః। జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః॥19॥4॥ శ్రీమద్భగవద్గీత..।జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు చిన్నగా పండితుడు అంటే ఎవడు అనే విషయానికి వచ్చాడు.శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు. అర్జునా!నేను ఇప్పుడే నీకు చెప్పాను కదా,కర్మ,అకర్మ,వికర్మలగురించి తెలుసుకోవాలని.ఇక్కడ సరిగ్గా అసలు సిసలు పండితుడు ఎవరో తెలుస్తుంది.మనము ఫలాపేక్ష రహితంగా ఉండాలి.నేను,అంతా నేనే,అంతా నాదే,నేనే కర్తను అనే అహంకారాన్ని వదులుకోవాలి.ఈ కర్తృత్వాహంకారం చాలా చెడ్డది.కాళ్ళు నేల మీద నిలువనీయదు.కళ్ళు నేలవైపు కాకుండా ఆకాశం వైపు చూసేలా చేస్తుంది.మన పతనానికి అదే బీజము.ఈ అహంకారాలన్నిటినీ భస్మం చేసే ఆయుథం ఒకటి ఉంది.అదే జ్ఞానాగ్ని.అలాంటి జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడూ ప్రక్క దోవలు పట్టడు.అతడే అసలైన పండితుడు.