Thursday, 9 April 2026

తస్మా దసక్త స్సతతం

తస్మాదసక్తస్సతతం కార్యం కర్మ సమాచర। అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః॥19॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి అసలు విషయం చెబుతున్నాడు.అమ్మ బిడ్డ అన్నం తినకపోతే ఏమి చేస్తుంది?అదిగో చందమామ!ఇదుగో బూచి!అని నాలుగు మంచి మాటలు చెబుతూ బిడ్డ నోట్లోకి నాలుగు ముద్దలు పోయేటట్లు చేస్తుంది కదా!అచ్చం అలానే శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రతి విషయం విడమరిచి,నయాన,భయానా,బుజ్జగించి నాలుగు మంచి మాటలు బుర్రలోకి చేరేలా ప్రయత్నిస్తున్నాడు. అర్జునా!కౌంతేయా!ఆత్మతృప్తుడు గురించి చెప్పాను కదా!ఎలాంటి దోషాలూ అతనికి అంటవు అని కూడా చెప్పాను కదా!నీవుకూడా అలా ఎందుకు కాకూడదు చెప్పు.ఖచ్చితంగా నిష్కాముడవు అయి నీ కర్మలను ఆచరించగలవు.ఆ నమ్మకం నాకుంది.ఆపేక్షారహితమయిన కర్మాచరణ అంటే తెలుసు కదా!అదే!మోహము,కోరికలు,కాంక్ష లేకుండా తన ధర్మాన్ని అనుసరించి కర్మలను ఆచరించడం.అప్పుడు మోక్షము కలుగుతుంది.అప్పుడు మనము మోక్షము వెనక పరుగులు తీయడం కాదు,అదే మనల్ని వెతుకుకుంటూ వచ్చి వరిస్తుంది.

Wednesday, 8 April 2026

నైవ తస్య కృతే నార్థో

నైవ తస్య కృతే నార్థో నాకృతే నేహ కశ్చన। న చాస్య సర్వభూతేషు కశ్చి దర్థ వ్యపాశ్రయః॥18॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మరతుడు,ఆత్మతృప్తుడు,ఆత్మసంతుష్టుడు అయిన మనిషి గురించి చెబుతున్నాడు.అర్జునా!పైన చెప్పిన గుణాలు ఉన్న మానవుడు ఏమీ చేయాల్సిన పని లేదని చెప్పాను కదా!ఎందుకని అంటావ్?ఎందుకంటే అతను ఈ సృష్టిలో దేనిపైనా ఆథారపడడు.దేనియందూ ఆశ్రితుడు కాడు.అతని దృష్టిలో కర్మ చేయటం వలన ఎలాంటి లాభం లేదు.చేయకపోతే నష్టం లేదు.అతనికి ఎలాంటి దోషాలు అంటవు.ఎందుకంటే అతను నిర్వికారుడు కాబట్టి.ఆ స్థితికి చేరడం ఆషామాషీ వ్యవహారమూ కాదు.

యస్త్వాత్మరతి రేవ స్యాత్

యస్త్వాత్మరతి రేవ స్యా దాత్మ తృప్తశ్చ మానవః। ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే॥17॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము.. శ్రీకృష్ణుడు ఎవరైతే ఏ కర్మలూ చేయ పనిలేదో కూడా చెబుతున్నాడు అర్జునుడికి.అర్జునా!సత్కర్మలు చేయాలి అని చెప్పాను కదా మానవుడై పుట్టిన ప్రతివాడూ!దీనికి కూడా ఒక మినహాయింపు ఉంది. ఎవడైతే ఆత్మరతుడో,ఆత్మతృప్తుడో,ఆత్మ సంతుష్టుడో...అతను పరమావథికి పరాకాష్ట లాగా అన్నమాట.ఇంక అతను చేయవలసిన కర్మలు అంటూ ఏమీ ఉండవు.ఆత్మతృప్తుడు అంటే తన ఆత్మలోనే తృప్తి పొందేవాడు.ఆత్మరతుడు అంటే ఆత్మానందంలో మునిగి తేలే జ్ఞాని లేక యోగి అని అర్థము.ఆత్మ సంతుష్టుడు అంటే ఆత్మ పరంగా సంతోషంగా,సంతృప్తిగా,సంతుష్టంగా ఉండేవాడు.అతనికి కర్మఫలం గురించి ఎలాంటి ఆలోచన,ఆదుర్దా,అసహనం,అసంతృప్తి ఉండవు.నిశ్చింతగా,ప్రసన్నంగా ఉంటాడు.

Tuesday, 7 April 2026

ఏవం ప్రవర్తితం చక్రం

ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయ తీహ యః। అఘాయు రింద్రియారామో మోఘం పార్థ స జీవతి॥16॥3॥ శ్రీమద్భగవద్గీత..।కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మలను వేదాలలో ఘోషించినట్లు ఆచరించాలి అని చెబుతున్నాడు.అర్జునా!పార్థా!మనము ఈ కర్మ చట్రంలోనే ఉండాలి.దానిని ఎప్పుడూ అతిక్రమించకూడదు.అట్లా అని ఏమీ లేదు.అంతా నా ఇష్టం అని ఈ కర్మలను ఆచరించడం మానకూడదు.దానికి కారణం చెబుతాను,విను.ఈ సత్ కర్మలను ఆచరించనివాడు ఇంద్రియలోలుడు అవుతాడు.ఇంద్రియాలపైన నిగ్రహం లేనివాడు ఏమి చేస్తాడో నీకు తెలియదా?సులభంగా దారి తప్పుతాడు.తప్పులు చేస్తాడు.అవే అలవాటై పాపాలకు పూనుకుంటాడు.ఇంక దాంట్లోనే మగ్గి,మాడి, మసి అయిపోతాడు.పాపి అనే బిరుదు మూటకట్టుకుంటాడు.

Monday, 6 April 2026

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాఽక్షర సముద్భవమ్। తస్మాత్సర్వ గతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్॥15॥3॥ శ్రీమద్భగవద్గీత..కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా?కర్మలు వేదాల వలన సంభవించాయి.వేదాల పుట్టుక ఎక్కడ నుంచో చెప్పు?వేదాలు పరమాత్మ వలన పుట్టాయి.దీని వలన నీకు ఏమి అర్థం అయింది?బ్రహ్మము అనేది విశ్వం మొత్తమూ వ్యాపించి ఉంది.ఈ సర్వత్రా వ్యాపించిన బ్రహ్మాన్ సతతా,సర్వదా యాగాలలో నిక్షేపమై,ప్రతిష్ఠింపబడి ఉంటుంది.

అన్నా ద్భవంతి భూతాని

అన్నాద్భవంతి భూతాని పర్జన్యా దన్న సంభవః। యజ్ఞా ద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః॥14॥3॥ శ్రీమద్భగవద్గీత.।।కర్మ యోగము... శ్రీకృష్ణుడి యొక్క ఓపికకు జోహార్లు.మనం చెప్పేది సరిగ్గా ఎదుటి వాడు వినకపోయినా,విన్నా అర్థంకానట్లు మొహం పెట్టినా మనకు కోపం చిర్రెత్తుకుని వస్తుంది కదా!చట్!వీడికి ఇంక జన్మలో ఏమీ చెప్పకూడదు.సమయం అంతా శుద్ధ దండగ అని నిర్ణయించేసుకుంటాము కదా!కానీ ఇక్కడ చూడు.ఎంత ఓపికగా,అరటి పండు ఒలిచి నోట్లో పెడుతున్నట్లు అర్జునుడికి వివరిస్తున్నాడో! అర్జునా!మనం బ్రతికే దానికి ఏమి చేస్తాము?అన్నం తింటాము కదా!ప్రతి జీవికి తను బ్రతికే దానికి,తన వంశాభివృద్ధికి ఆహారం కావాలి కదా!ఆ ఆహారం మనకు ఎక్కడనుంచి వస్తుంది అనుకుంటున్నావు?వర్షాలు పడితేనే కదా పంటలు పండేది.పంటలు సజావుగా పండితేనే కదా గింజలు ఇంటికి,ఆ తరువాత మన నోటికి వచ్చేది.మనము యజ్ఞం చేయటం వలన వరుణ దేవుడు కనికరించి వానలు తెప్పిస్తున్నాడు.అందువల్లే మన ఇంటిలో పుట్టి నిండుతున్నది.మనము కర్మలు చేస్తేనే కదా యజ్ఞం సుసంపన్నమయేది.

Saturday, 4 April 2026

యజ్ఞ శిష్టాశిన స్సంతో

యజ్ఞ శిష్టాశిన స్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః। తే త్వఘం భుంజతే పాపా యే పచం త్యాత్మకారణాత్॥13॥3॥ శ్రీనద్భగవద్గీత..।కర్మ యోగము..। శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏ పని అయినా స్వచ్ఛందంగా,మనసు పెట్టి చేయాలని చెబుతువ్నాడు.హే సఖా!హే అర్జునా!మానవులు యజ్ఞాలు చేసి దేవతలను తృప్తి పరచాలి,వారికి నివేదించాలి అని చెప్పాను కదా!ఎందుకంటే యజ్ఞశేషాన్ని భుజించేవారు సమస్త పాపాలనుంచీ విముక్తి చెందుతారు.అట్లా కాకుండా చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష అనుకుంటూ వాళ్ళకోసరమే వండుకుని తినేవాళ్ళు పాపాల పాలు అవుతారు.ఇది శపించడమో,చెడ్డగా మాట్లాడటమో కాదు.మనము బ్రతకాలి,మనతోటే మన ప్రక్కవారు కూడా సుఖసంతోషాలుతో ఉండాలని ఆపేక్షించగలగాలి.ఎందుకంటే మనము చేసే నైవేద్యాలు నిజంగా దేవుడో,దేవతో వచ్చి తినరు.వారికంటూ చేసినవి మనం నలుగురితో పంచుకుంటాము.ఇదంతా శ్రీకృష్ణుడు ఎందుకు చెబుతున్నాడో తెలుసా?ఎంగిలి చేత్తో కాకిని కూడా తరమని వాళ్ళు ఉంటారు.చేయి విదిలించినపుడు రెండు మెతుకులు క్రిందపడి,వాటిని కాకి తీసుకెళుతుందేమో అనే భయానికి.అట్లా ఉండొద్దు.సర్వే జనాః సుఖినో భవంతు అనుకోవాలని ఆయన ఆశ.