Tuesday, 24 March 2026
విహాయ కామాన్ యస్సర్వాన్
విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాం శ్చరతి నిస్పృహః।
నిర్మమో నిరహంకారః స శాంతి మధిగచ్ఛతి॥71॥2॥
శ్రీమద్భగవద్గీత..సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు.అర్జునా!మనము మొట్టమొదటగా కోరికలకు స్వస్తి చెప్పాలి.అన్ని అరిష్టాలకూ అవే కదా మూల హేతువు.అహంకారం అనేది ఇంకో పెద్ద గుదిబండ.దానిని తీసి ప్రక్కన పెట్టాలి.ఈ రెంటినీ వదలి మోహానికీ,మమకారానికీ స్వస్తి వచనాలు చెప్పాలి.ఇలా ఉండగలిగిన పురుషుడే శాంతిని,మనశ్శాంతినీ పొందగలడు.
అపూర్యమాణ మచల ప్రతిష్ఠం
అపూర్యమాణ మచల ప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశంతి యద్వత్।
తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే
స శాంతి మాప్నోతి న కామకామీ॥70॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!పాండవమధ్యమా!సముద్రం చూడు!ఎంత గంభీరంగా ఉంటుంది కదా!నదీ జలాలు అన్నీ చివరకు చేరేది సముద్రమే కదా!ఓ యమ్మ!ఇన్ని నీళ్ళు నాలోకి వచ్చి కలిస్తే ఎట్లా?అని దిగులు పడుతుందా?లేదు కదా!నిబ్బరంగా ఉంటుంది కదా!చెలియలి కట్ట దాటకుండా గంభీరంగా ఉంటుంది కదా!స్థితప్రజ్ఞుడు అయినవాడు కూడా అలాగే ఉంటాడు.ఎన్ని కోర్కెలు కలిగినా గీత దాటడు.కలత చెందడు.చపలత్వంతో చంచల మనస్కుడు కాడు.భోగలాలస దరి చేరనివ్వడు.నిశ్చలంగా ఉంటాడు.అంటే సముద్రంలాగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తన ధర్మం తప్పడు.మంచికి చెడుకి మథ్య లక్ష్మణగీత గీచుకుంటాడు.
యా నిశా సర్వభూతానాం
యా నిశా సర్వ భూతానాం తస్యాం జాగర్తి సంయమీ।
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః॥69॥2॥
శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము....
శ్రీకృష్ణుడు అర్జునుడికి క్రొత్త విషయము చెబుతున్నాడు.అర్జునా!నీకు ఇది తెలుసా?చీకటి,వెలుగు ఉన్నాయి కదా!మాములుగా మనం ఏమి చేస్తాము?వెలుగు,పగలు ఉన్నప్పుడు మనం మెలకువగా ఉంటాము.చీకటి,రాత్రి సమయాలలో నిద్రావస్థలో ఉంటాము.కానీ జ్ఞాని అలా చేయడు.ఏది చీకటో దాని యందు జ్ఞాని మెలకువగా ఉంటాడు.సామాన్యులు మెలకువగా ఉండే సమయం యోగులకు రాత్రితో సమానము.
Monday, 23 March 2026
తస్మా ద్యస్య మహాబాహో
తస్మా ద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః।
ఇంద్రియా ణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥68॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ముక్కు సూటిగా చెబుతున్నాడు.అర్జునా!ఈ ముసుగులో గుద్దులాటలు అక్కరలేదు.సూటిగా చెబుతాను.విషయాలనుంచి అదే విషయ లాలస నుంచి ఇంద్రియాలను మరలించడం నేర్చుకోవాలి.అలాంటి నిగ్రహ శక్తి కలవాడే స్థిత ప్రజ్ఞుడు కాగలడు.
ఇంద్రియాణాం హి చరతాం
ఇంద్రియాణాం హి చరతాం యన్మనోఽను విధీయతే।
త దస్య హరతి ప్రజ్ఞాం వాయు ర్నావ మివాంభసి॥67॥2॥
శ్రీమగ్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరం చెబుతున్నాడు.అర్జునా!మనం చేసే పనులు,మన కోరికలు సామాన్యమయినవా,చెప్పు?ప్రతి ఒక్కటీ అంతకు మించి అన్నట్లు ఉంటుంది.విషయాలలో ఇంద్రియాలు ఎట్లా ప్రవర్తిస్తాయి,చెప్పు?అవి చెప్పినట్లు మనసు జీ హుజూర్ అంటూ అనుసరించింది అనుకో,ఇంక అంతే సంగతులు,చిత్తగించవలెను అన్నట్లు తయారవుతుంది.నీకు ఒక ఉదాహరణ చెబుతాను.మనము నావలో ప్రయాణం చేస్తున్నాము.ఉన్నట్లుండి హోరుగాలి వీస్తుంది.అప్పుడు ఏమవుతుంది?పడవ మన చెప్పు చేతల్లో ఉండదు.గాలి ఎటు మళ్ళిస్తే అటు ఊగిపోతుంది.దారి తప్పి పోతుంది.తీరం సజావుగా చేరదు.మన నియంత్రణలో ఏమీ ఉండదు.చంచల మయిన మనసు యతుల బుద్ధిని కూడా హరించేస్తుంది.కాబట్టి మనము ఇంద్రియాలను మన చెప్పుచేతల్లో పెట్టుకోవటం శ్రేయస్కరం అన్ని వేళలా!
Sunday, 22 March 2026
నాస్తి బుద్ధి రయుక్తస్య
నాస్తి బుద్ధి రయుక్తస్య న చా యుక్తస్య భావనా।
న చా భావయత శ్శాంతి రశాంతస్య కుత స్సుఖమ్॥66॥2॥
శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు చెట్టును ఇంకో తట్టునుంచి నరుక్కొస్తున్నాడు.అర్జునా!ఇప్పుడు నేను చెప్పింది ఏమైనా అర్థమైందా?నేను దానినే ఇంకో రకంగా చెబుతాను విను.మనిషిని బలహీన పరిచేవి ఇంద్రియాలు కదా!కనిపించిందంతా కావాలంటాయి.ఇష్టం లేకపోతే వాటి ఉనికి,ఊసూ మన ముందరకు రాకూడదు అనిపిస్తుంది.కాబట్టి ముందుగా ఇంద్రియాలను మన గుప్పెట్లో పెట్టుకోవాలి.ఇష్టమయినవి దక్కాయి అని భాంగ్రా నృత్యం చేయకూడదు.ఇష్టం లేని వాటిని భరించలేమని అఘాయిత్యం చేయకూడదు.అలా మనలను మనం నియంత్రించుకోలేక పోతే స్థిర బుద్ధి ఎక్కడ నుంచి వస్తుంది చెప్పు?స్థిర బుద్ధి లేకపోతే ఆత్మ వివేకము ఎక్కడ నుంచి వస్తుంది?పరమార్థ చింతన,అదే భగవంతుడి పైన ధ్యాస,ఎక్కడ నుంచి వస్తాయి మనకు?ఈ రెండూ లేని వాడికి శాంతి అనేది అందని ద్రాక్ష పండులాగే కదా!శాంతి అనే పదానికే దిక్కూ దివాణం లేకపోతే సుఖమెలా దక్కుతుంది?సుఖం అనే పదము సుదూర తీరాలకు ప్రయాణమై పోతుంది.
ప్రసాదే సర్వదుఃఖానాం
ప్రసాదే సర్వదుఃఖానాం హాని రస్యో పజాయతే।
ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతి॥65॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!సఖా!సూక్ష్మంలో మోక్షం అంటారు కదా!ఇది అదే!మనము మన మనసును నిర్మలంగా పెట్టుకోగలిగితే చాలు.చిక్కు ముడి విప్పినట్లు అన్ని సమస్యలూ వాటంతట అవే సర్దుకుంటాయి.మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది చెప్పు?కోపాలూ,కాపాలూ లేనప్పుడు.ఆశలూ,అసహనాలూ,అసంతృప్తులూ లేనప్పుడు.అంతే కదా!మనసు నిర్మలంగా ఉంటే సుఖదుఃఖాలు ఉండవు.నశిస్తాయి.ఎగిరెగిరీ పడబళ్ళేదు.అథఃపాతాళానికీ కృంగిపోబళ్ళేదు కనుక.అలాంటి వాడి బుద్ధి త్వరగా నిశ్చలత్త్వాన్ని పొందుతుంది.దీనికి ఢోకా లేదు.
Subscribe to:
Comments (Atom)