Saturday, 11 April 2026

యది హ్యహం నవర్తేయం

యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్య తంద్రితః। మమ వర్త్మాను వర్తం తే మనుష్యాః పార్థ సర్వశః॥23॥3॥ శ్రీమద్భగవద్గీత..కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.హే పార్థా!హే కిరీటీ!నేను ఎప్పుడూ కర్మలను ఆచరిస్తాను అని చెప్పాను కదా!ఎందుకని అంటావు?యథా రాజాః తథా ప్రజాః అని నానుడి ఉంది కదా!రాజు ఎట్లా ఉంటే రాజ్యం లోని ప్రజానీకం అంతా అలానే ఉంటుంది.రాజు మంచిగా కార్య నిర్వహణ చేస్తుంటే ప్రజలు కూడా అలానే ఉంటారు.రాజు పనిదొంగ అయితే ప్రజలూ అలానే ఉంటారు.ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టరు. అందుకే నేను కర్మలను ఆచరిస్తాను.నేను గానీ కర్మలను విడిచి పెడితే ప్రతి ఒక్కడూ నన్నే అనుసరిస్తాడు.అంతా తిని తొంగుండే ముఠాలాగ తయారవుతారు.కాబట్టి ఒక నాయకుడు తన వారికి మార్గ దర్శకంగా ఉండాలి.అభాసు పాలు అయ్యేలా ఉండకూడదు.

న మే పార్థాస్తి కర్తవ్యం

న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన। నా నవాప్త మనాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి॥22॥3॥ శ్రీమద్భగవద్గీత..।కర్మ యోగము.. అర్జునుడికి శ్రీకృష్ణుడు తన ఉదాహరణే ఇస్తున్నాడు.అర్జునా!పార్థా!ప్రజానీకం గొప్పవాళ్ళనే ప్రామాణికంగా తీసుకుంటుంది.వాళ్ళ అడుగు జాడల్లోనే నడచేదానికి ఇష్టపడుతుంది అని చెప్పాను కదా!నన్నే ఉదాహరణగా తీసుకో.నిజానికి ఈ మూడులోకాల్లో నేను చేయవలసిన పని అంటూ ఏమీలేదు.నాది కానిది,నాకు దక్కనిది అంటూ కూడా ఏమీ మిగిలి లేదు.నాకు అంటూ ఎలాంటి ఆశలు,అసంతృప్తులు,అసహనాలు,అభీష్టాలూ ఏమీ లేవు.అయినా కూడా నేను ఎప్పుడూ కర్మలను ఆచరిస్తున్నాను.దీనివలన నీకు ఏమి అవగతమవుతుంది?నాకోసం కాకపోయినా,ఈ సృష్టి మొత్తానికీ మార్గ దర్శకంగా నిలవడం కోసరం నేను కర్మలను ఆచరిస్తున్నాను.సర్వే జనాః సుఖినో భవంతు అనే ధర్మం కోసం పాటుపడపతున్నాను.ఇప్పుడన్నా ఏమైనా అర్థం అవుతుంది అనిపిస్తుందా?

Friday, 10 April 2026

యద్య దాచరతి శ్రేష్టః

యద్య దాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరో జనః। స యత్ ప్రమాణం కురుతే లోక స్త దనువర్తతే॥21॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి మంచిగా వివరిస్తున్నాడు.అర్జునా!నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా?మామూలు ప్రజానీకం ఉంది కదా!గొప్పవాళ్ళు ఏమి చేస్తారో అదే ఆచరించేదానికి ఇష్టపడతారు.ఎందుకంటే గొప్ప వాళ్ళ పద్థతులే కదా వాళ్ళకు ప్రామాణికం! కాబట్టి మనం అందరికీ మంచి దారి చూపించాలంటే ముందుగా ఆ మంచి దారిలో మనం నడవాలి కదా!అవునా,కాదా?

కర్మణైవ హి సంసిద్ధి

కర్మణైవ హి సిద్ధి మాస్థితా జనకాదయః। లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తు మర్హసి॥20/3॥ శ్రీమద్భగవద్గీత..।కర్మ యోగము... శ్రీకృష్ణుడు మానవుడి పరమావధి ఏందో చెబుతున్నాడు అర్జునుడికి.అర్జునా!సఖా!ఇప్పటి విషయమే కాదు నేను చెప్పేది.ఇంతకు ముందు జనక మహారాజు,తదితర రాజ ప్రభృతులు కూడా కర్మల ద్వారానే సిద్ధిని పొందారు.అసలు కొంచెం సేపు ఇవన్నీ ప్రక్కన పెట్టేసి మాటలాడుకుందాము.మానవులగా మన కర్తవ్యం ఏంది చెప్పు?లోకకళ్యాణమే కదా!కాబట్టి ఈ యోగాలూ,మోక్షాలూ,కర్మలూ,జ్ఞానాలూ ప్రక్కన పెట్టేసి లోకసంగ్రహణార్థం మనము ఏదైనా చేయగలిగితే అంతకంటే ఉత్తమం ఇంకేముంటుంది చెప్పు.కాబట్టి అర్జునా!క్షత్రియ ధర్మం ప్రకారం నీవు లోకులను,ప్రజలను రక్షించేదానికి నడుము బిగించాలి.సమరం చేయాలి దుష్ట శక్తులతో.ఇక్కడ వాడితో చేస్తున్నామా,వీడితో చేస్తున్నామా అని కాదు.మనం సుసంపన్నమయిన,సుభిక్షమయిన పరిపాలన ప్రజలకు అందించాలంటే,ఇక్కడ పాతుకుపోయిన చెడుని నిర్మూలించాలి.కౌరవులే ఆ దుష్టశక్తులు.కాబట్టి వారిని తుదముట్టించడమే నీ విథి ఇప్పుడు.

Thursday, 9 April 2026

తస్మా దసక్త స్సతతం

తస్మాదసక్తస్సతతం కార్యం కర్మ సమాచర। అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః॥19॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి అసలు విషయం చెబుతున్నాడు.అమ్మ బిడ్డ అన్నం తినకపోతే ఏమి చేస్తుంది?అదిగో చందమామ!ఇదుగో బూచి!అని నాలుగు మంచి మాటలు చెబుతూ బిడ్డ నోట్లోకి నాలుగు ముద్దలు పోయేటట్లు చేస్తుంది కదా!అచ్చం అలానే శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రతి విషయం విడమరిచి,నయాన,భయానా,బుజ్జగించి నాలుగు మంచి మాటలు బుర్రలోకి చేరేలా ప్రయత్నిస్తున్నాడు. అర్జునా!కౌంతేయా!ఆత్మతృప్తుడు గురించి చెప్పాను కదా!ఎలాంటి దోషాలూ అతనికి అంటవు అని కూడా చెప్పాను కదా!నీవుకూడా అలా ఎందుకు కాకూడదు చెప్పు.ఖచ్చితంగా నిష్కాముడవు అయి నీ కర్మలను ఆచరించగలవు.ఆ నమ్మకం నాకుంది.ఆపేక్షారహితమయిన కర్మాచరణ అంటే తెలుసు కదా!అదే!మోహము,కోరికలు,కాంక్ష లేకుండా తన ధర్మాన్ని అనుసరించి కర్మలను ఆచరించడం.అప్పుడు మోక్షము కలుగుతుంది.అప్పుడు మనము మోక్షము వెనక పరుగులు తీయడం కాదు,అదే మనల్ని వెతుకుకుంటూ వచ్చి వరిస్తుంది.

Wednesday, 8 April 2026

నైవ తస్య కృతే నార్థో

నైవ తస్య కృతే నార్థో నాకృతే నేహ కశ్చన। న చాస్య సర్వభూతేషు కశ్చి దర్థ వ్యపాశ్రయః॥18॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మరతుడు,ఆత్మతృప్తుడు,ఆత్మసంతుష్టుడు అయిన మనిషి గురించి చెబుతున్నాడు.అర్జునా!పైన చెప్పిన గుణాలు ఉన్న మానవుడు ఏమీ చేయాల్సిన పని లేదని చెప్పాను కదా!ఎందుకని అంటావ్?ఎందుకంటే అతను ఈ సృష్టిలో దేనిపైనా ఆథారపడడు.దేనియందూ ఆశ్రితుడు కాడు.అతని దృష్టిలో కర్మ చేయటం వలన ఎలాంటి లాభం లేదు.చేయకపోతే నష్టం లేదు.అతనికి ఎలాంటి దోషాలు అంటవు.ఎందుకంటే అతను నిర్వికారుడు కాబట్టి.ఆ స్థితికి చేరడం ఆషామాషీ వ్యవహారమూ కాదు.

యస్త్వాత్మరతి రేవ స్యాత్

యస్త్వాత్మరతి రేవ స్యా దాత్మ తృప్తశ్చ మానవః। ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే॥17॥3॥ శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము.. శ్రీకృష్ణుడు ఎవరైతే ఏ కర్మలూ చేయ పనిలేదో కూడా చెబుతున్నాడు అర్జునుడికి.అర్జునా!సత్కర్మలు చేయాలి అని చెప్పాను కదా మానవుడై పుట్టిన ప్రతివాడూ!దీనికి కూడా ఒక మినహాయింపు ఉంది. ఎవడైతే ఆత్మరతుడో,ఆత్మతృప్తుడో,ఆత్మ సంతుష్టుడో...అతను పరమావథికి పరాకాష్ట లాగా అన్నమాట.ఇంక అతను చేయవలసిన కర్మలు అంటూ ఏమీ ఉండవు.ఆత్మతృప్తుడు అంటే తన ఆత్మలోనే తృప్తి పొందేవాడు.ఆత్మరతుడు అంటే ఆత్మానందంలో మునిగి తేలే జ్ఞాని లేక యోగి అని అర్థము.ఆత్మ సంతుష్టుడు అంటే ఆత్మ పరంగా సంతోషంగా,సంతృప్తిగా,సంతుష్టంగా ఉండేవాడు.అతనికి కర్మఫలం గురించి ఎలాంటి ఆలోచన,ఆదుర్దా,అసహనం,అసంతృప్తి ఉండవు.నిశ్చింతగా,ప్రసన్నంగా ఉంటాడు.