Saturday, 27 June 2026

జ్ఞానేన తు తదజ్ఞానం

జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశిత మాత్మనః। తేషా మాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్॥16॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఓ భరతశ్రేష్టా!జీవులు స్వతహాగా ఏమీ చేయరు.కానీ వారి వారి జ్ఞానాన్ని అజ్ఞానం అనే నల్ల దుప్పటి కప్పేస్తుంది.దానిలోనుంచి చూస్తే ఏమవుతుంది?జ్ఞానమనే స్వచ్ఛమయిన తెల్లటి వెలుగు అంతా నల్లనల్లగా,అస్పష్టంగా బూజర బూజరగా కనిపిస్తుంది.అమాయకుడైన ప్రాణి అదే నిత్యమూ,సత్యమూ అనుకుంటాడు.కానీ ఆ దుప్పటి పక్కకి తీసి చూద్దాము అనే స్పృహ ఉండదు. కానీ ఆత్మజ్ఞానము పొందాలంటే ముందర అజ్ఞానము పటాపంచలు కావాలి.పూర్తిగా నాశనము కావాలి.అప్పుడు మాత్రమే మానవుడికి సూర్యసదృశమూ,అనంతకోటి వెలుగుల సమాహారము అయిన పరమాత్మ దర్శనం లభ్యమవుతుంది.

Friday, 26 June 2026

నా దత్తే కస్య చి త్పాపం

నా దత్తే కస్య చిత్పాపం న చైవ సుకృతం విభుః। అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యన్తి జంతవః॥15॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము. శ్రీకృష్ణుడు అర్జునుడికి అనుమానాలకు తావు లేకుండా ఉండేదానికోసరం శత విథాలా ప్రయత్నిస్తున్నాడు.అర్జునా!ఓ కిరీటా!ఇప్పుడే నీకు చెప్పాను కదా!కర్మ,కర్తృత్వం,తత్ఫలం అనేవి ఆత్మ ప్రేరేపణలు కావని.వాటినన్నిటినీ మాయ చేయిస్తుందని. ఇది నేను ఎందుకు చెప్పానో,ఆలోచించు.ఎందుకంటే ఆత్మ నిర్వికారమయినది.నిర్మోహం కలది.దానికి ఎలాంటి పాపాలతో కానీ,ఇంకెలాంటి పుణ్యాలతో కానీ సంబంధం ఉండదు.మరి మెలిక ఎక్కడ వస్తుందో చెబుతాను,చూడు.జీవులు యొక్క మస్తిష్కం జ్ఞానం,అజ్ఞానం అనే మాయలో కప్పబడి ఉంటాయి.కాబట్టి వారు భ్రమలో,భ్రమలలో బతుకులు సాగదీస్తుంటారు.మన పూర్వ జన్మల వాసనలు బట్టి మన ఆలోచనలు,ఆచరణలు ఉంటాయి.మనము మంచి దారిలో ముందుకు పోవాలంటే ఆ దిశగా కష్టపడాలి.చెడిపోవాలంటే ఒక్క క్షణం కూడా పట్టదు.జారుడు బండల పైన కాలు పెట్టినట్లే!చాలా సులువు.

Thursday, 25 June 2026

న కర్తృత్వం న కర్మాణి

న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః। న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే॥14॥ శ్రీమద్భగవద్గీత..కర్మ సన్న్యాస యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!చీటికీ,మాటికీ ఆ భగవంతుడు కారణం అని నింద తగదు.అయిన దానికీ,కాని దానికీ,చిన్న విషయానికి,పెద్ద విషయానికీ మాములుగా మనుష్యులు ఆ దేవుడు మీద తప్పంతా వేస్తుంటారు.కానీ అన్ని సమయాలలో అది సత్యం కాదు.ఎందుకంటావా?చెబుతాను,విను. మనము కర్మ,కర్తృత్వం,కర్మఫలం అనే మాటలు చెప్పుకున్నాము కదా ఇందాకటి దాకా.అవి అన్నీ పరమాత్మ ప్రమేయంతో జరగడం లేదు.అవన్నీ జీవుల స్వభావము,ప్రకృతి గుణాల వలన జరుగుతుంటాయి.అంటే ప్రధానంగా మాయయే ఆ పని చేస్తుంటుంది.ఉదాహరణకు సాత్త్వికుడు సాత్త్వికంగా ఆలోచించి,మంచి పనులు చేస్తాడు.అలానే రజోగుణము,తామస ప్రవృత్తి గలిగిన వారు వారి వారి స్వభావం ప్రకారం ప్రవర్తిస్తారు.ఈ మాయ సృష్టి కర్త ఆ భగవంతుడే!కానీ అతను వాటన్నిటికీ దూరంగా,అంటనట్లు ఉంటాడు.

Wednesday, 24 June 2026

సర్వ కర్మాణి మనసా

సర్వ కర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ। నవ ద్వారే పురే దేహే నైవ కుర్వ న్న కారయన్॥13॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్కాస యోగము. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!మన శరీరంలో తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి కదా!చెప్పు చూద్దాం!నేనే చెబుతాలే,విను.అవి రెండు కళ్ళు,రెండు చెవులు,రెండు ముక్కు రంధ్రాలు,నోరు,మల,మూత్ర విసర్జన ద్వారాలు.సరేనా!మన శరీరమే ఒక నగరం అనుకో!అప్పుడు తనను తాను మానసికంగా నిగ్రహించుకున్న యోగి ఆ నగరంలోనే సుఖ శాంతులతో జీవనం గడుపుతాడు.శ్రీరామా అంటూ తాను ఏ కర్మల జోలికీ పోడు.వేరే వాళ్ళనీ పొమ్మని చెప్పడు.ఇలాంటి క్రియలకు అంతా ఆత్మనిష్ఠ,నియమము,నియంత్రణ,నిగ్రహము కావాలి.

Tuesday, 23 June 2026

యుక్తః కర్మఫలం త్యక్త్వా

యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్ఠికీమ్। అయిక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే॥12॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి కొత్త కొత్త పదాలు ఆవిష్కరిస్తున్నాడు.అర్జునా!పార్థా!నేను నీకు ఇప్పుడు నైష్ఠికుడు గురించి చెబుతాను.ఒక మనిషి అచంచల దీక్ష,నియమము,నిబద్ధతతో తను పెట్టుకున్న వ్రతాలు,సిద్థాంతాలు,నియమాలు ఆచరించాలి.ఎక్కడా తడబడకూడదు.వేరేవాటిపైన దృష్టి పెట్టకూడదు.ధర్మశాస్త్రాలు,ఆశ్రమ ధర్మాలు తూచా తప్పకుండా ఆచరించాలి.అలాంటివారిని నైష్ఠికులు అని అంటారు. నైష్ఠికులు ఫలాపేక్ష లేకుండా కఠినమయిన నియమ నిబద్థతలతో,జీవిత ప్రామాణాలతో జీవనం కొనసాగిస్తారు.అలాంటి మానసిక,శారీరిక పట్టుదలతో కర్మలను ఆచరిస్తారు.కాబట్టే శాంతి పొందుతారు.అదే ఎక్కడ మోహం,కోపం,తాపం,తామసం కూడుతాయో,అక్కడ మానవుడు ఫలాపేక్షకు బందీ అవుతాడు.ఇంకేమి ఉంది?గానుగకు కట్టిన ఎద్దులాగ అక్కడక్కడే తనుచేసే కర్మలకు,కర్మఫలాలకు బద్ధుడు అవుతాడు.సంసార బంథాలకు బానిస అవుతాడు,బాథితుడు అవుతాడు,తనను తానే బంథించుకుంటాడు.

Monday, 22 June 2026

కాయేన మనసా బుద్ధ్వా

కాయేన మనసా బుద్ధ్వా కేవలై రింద్రియైరపి। యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా త్మశుద్ధయే॥11॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.బావా!అర్జునా!నేను చెప్పాను కదా యోగి అనేవాడు సంసారములో ఉన్నా చిత్తశుద్ధికోసమే కర్మలు చేస్తాడు అని.చిన్ని నా పొట్టకు శ్రీరామ రక్ష అన్నట్లు ఉండడు అని.మళ్ళీ మళ్ళీ అదే చెబుతున్నాను.యోగులు ఫలాపేక్షను వదలి పెడతారు.కర్తృత్వాహంకారాన్ని దరిదాపులకు కూడా రానివ్వరు.వారి మనసు,బుద్ధి,ఇంద్రియాల నన్నిటినీ మనసు పవిత్రంగా,నిర్మలంగా,సంతృప్తిగా ఉండడం కోసరమే కర్మలు చేస్తారు.

Sunday, 21 June 2026

బ్రహ్మణ్యాధాయ కర్మాణి

బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః। లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా॥10॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉదాహరణలు కూడా చెబుతున్నాడు...బాగా అర్థం కావాలని.ఆయన తపనకు జోహార్లు!అర్జునా!నాకు ఏమీ వద్దు,నాకేమీ అఖ్ఖర లేదు అనే స్థితికి మనము ఎప్పుడు వస్తాము?మనము సంతృప్తిగా ఉన్నప్పుడే కదా!ఆ సంతృప్తి మనకు ఇంద్రియ లాలస ఉన్నంత కాలము దక్కదు.మనము ప్రక్కవాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తాము?వారికి మన దగ్గర ఉండేది ఎప్పుడు పంచుతాము?మన దగ్గర మనకు కావాలసిన దానికంటే ఎక్కువ ఉంటేనే కదా!మనకు అసలు ఏమీ అఖ్ఖర లేదు అంటే మనకున్నదంతా సంఘానికే కదా! మనకై మనమే మనకున్నది ఇచ్చేస్తే,పంచేస్తే...మనము వాటి పైన మోహము వదులు కున్న వారము అవుతాము.ఎదుటి వారు అడగ కుండానే ఇస్తున్నాము కాబట్టి మనమేదో గొప్పవారము,ఏదేదో సహాయము చేస్తున్నాము అనే అపోహలకు,భావనలకు దూరం అవుతాము.మనస్పూర్తిగా,ప్రతి ఫలాపేక్ష లేకుండా చేస్తాము కాబట్టి సంతృప్తిగా ఉంటాము.వారు తిరిగి మనకు సహాయం చెయ్యాలని ఆశించము,ఆరాటపడము. కాబట్టి ఓ పార్థా!అప్పుడు మనము తామరాకు పైన నీటి బొట్టులాగ అంటీ అంటనట్లు ఉంటాము.మనలను ఏ కర్మలూ బంథించలేవు.ప్రతిదీ ఈశ్వరుడికి నైవేద్యం చేస్తున్నాము అనుకుంటూ చేస్తూ పోతే ఏ పాపాలూ మనకు దరి చేరవు.