Sunday, 18 January 2026

సాంఖ్య యోగము…తం తథా కృపయా విష్ట

సంజయ ఉవాచ... తం తథా కృపయా విష్ట మశ్రుపూర్ణాకులేక్షణమ్। విషీదంత మిదం వాక్య మువాచ మధుసూదనః॥1॥2॥ సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు.రాజా!శ్రీకృష్ణుడు అర్జునుడు బాధ పడటం అంతా ఓపికగా విన్నాడు.అతని ముఖంలో,మస్తిష్కంలో మార్పులను గమనించాడు. అర్జునుడు అందరూ అయ్యో పాపం!అనేలా ఉన్నాడు.అర్జునుడి హృదయం అంతా జాలి నిండి పోయి ఉంది.కళ్ళనిండా నీరు సుడులు తిరుగుతున్నాయి.హృదయవిదారకంగా రోదిస్తున్నాడు.అలాంటి స్థితిలో ఉన్న అర్జునుడిని ఉద్దేశించి శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు.

Saturday, 17 January 2026

ఏవ ముక్త్వార్జున స్సంఖ్యే

సంజయ ఉవాచ.... ఏవ ముక్త్వార్జున స్సంఖ్యే రథోపస్థ ఉపావిశత్। విసృజ్య సశరం చాపం శోక సంవిగ్న మానసః॥47॥1॥ ఇతి శ్రీమద్భగవద్గీతా వసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోఽధ్యాయః.... సంజయుడు ధృతరాష్రుడికి చూసినది చూసినట్లు చెబుతున్నాడు. ధృతరాష్ట్రా!అర్జునుడు తన మీమాంసను ఇలా మాటల రూపంలో బయట పెట్టాడు.శోకగ్రస్తుడు అయినాడు.కలత బారిన మనసుతో తన అస్త్రశస్త్రాలను ప్రక్కన పడేసాడు.శక్తిలేని వాడై రథం మీద అలాగే చతికిల పడ్డాడు. ఇట్లు బ్రహ్మవిద్య,ఉపనిషత్తు,యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమయిన భగవద్గీతలో అర్జున విషాద యోగమను మొదటి అధ్యాయము సమాప్తము.

Friday, 9 January 2026

యది మా మప్రతీకార

యది మా మప్రతీకార మశస్త్రం శస్త్రపాణయః। ధార్త రాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్॥46॥1॥ శ్రీమద్భగవద్గీత..।అర్జున విషాద యోగము... అర్జునుడు బహు గట్టి నిర్ణయము తీసుకున్నాడు.పెద్దల సలహాలు,అన్నదమ్ముళ్ళ సలహాలు అవసరం లేదనుకున్నాడు.తన బావ,తన ఆప్తమిత్రుడు,తన శ్రేయోభిలాషి ఒప్పుకుంటే చాలనుకున్నాడు.అందుకే శ్రీకృష్ణుడి ఆమోదం కోసరం తహతహలాడుతున్నాడు.ఒకరకంగా చెప్పాలంటే బ్రతిమలాడుతున్నాడు. కృష్ణా!నేను చెప్పేది నీకు అర్థం అవుతుంది కదా!నేను ఎలాంటి ప్రతీకారమూ తీసుకోను.శస్త్ర సన్యాసం చేస్తాను.ఆ ధార్తరాష్ట్రులు నా పైకి మూకుమ్మడిగా వచ్చినా నేను చలించను.వారంతా శస్త్ర ధారులై నన్ను హింసించడానికి వచ్చినా కిమ్మనకుండా ఉంటాను.నాకు మంచి జరుగుతుందనే అనుకుంటాను.ఆ పాపపు పనులు వాళ్ళు చేస్తే చెయ్యనీ!నేనుగా ఆ పాపపంకిలంలోకి అడుగుపెట్టను,అటుగా చూడను.నువ్వేమంటావు?నేను సరిగ్గానే ఆలోచిస్తున్నాను కదా!

Wednesday, 7 January 2026

అహోబత మహత్పాపం

అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్। యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజన ముద్యతాః॥45॥1॥ శ్రీమద్భగవద్గీత..।అర్జున విషాద యోగము... అర్జునుడి దుఃఖానికి అంతం లేకుండా పోతుంది.తిరిగి తిరిగి తనను తానే నిందించుకుంటున్నాడు.దీనమైన గొంతుకతో కృష్ణుడితో ఇలా అంటున్నాడు.హే కృష్ణా!హే సఖా!మనము ఎంత హ్రస్వ దృష్టి కలవాళ్ళమో కదా!ఏదీ నిశితంగా,విస్త్రుతంగా ఆలోచించము కదా!అనుకుంటేనే ఒళ్ళంతా వణుకు పుడుతుంది.ఎంత పాపానికి ఒడి కట్టబోయాము?అదీ తుచ్ఛమయిన ఐహిక సుఖాలకోసరము.కులాచార భ్రష్టత్వానికి నాంది పలకబోయాము.ఎంత పాపం?ఎంత ఘోరం?అసలు ఇలాంటి పాపాలకు నిష్కృతి ఉంటుందా?ఎన్ని జన్మలెత్తినా ఈ పాపాలనుంచి విముక్తి ఉండదు. రాజ్యకాంక్షతో అయిన వాళ్ళని అందరినీ మట్టుబెట్టాలనుకున్నాము.హవ్వ!ఎంత పాపానికి ఒడి గట్టబోయాము?

Tuesday, 6 January 2026

ఉత్సన్న కులధర్మాణాం

ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన। నరకే నియతం వాసో భవతీ త్యనుశుశ్రుమ॥44॥1॥ శ్రీమద్భగవద్గీత..అర్జున విషాద యోగము... అర్జునుడు ఒక ముగింపుకు వచ్చేశాడు.అది తన చెలికాడు అయిన కృష్ణుడితో చెబుతున్నాడు.ఇక ఏమని మాట్లాడుదాము,ఎంతని మాట్లాడుదాము కృష్ణా!నాకు ఖరాఖండిగా ఇదే తడుతుంది.కులాచార భృష్టులకు నరకమే శాశ్వత నివాసం.బావా!ఇది నా సొంత తెలివితో చెప్పడం లేదు.పెద్దలు పలుమార్లు అంటుంటే విన్నాను.ఇప్పుడు రూఢిగా నమ్ముతున్నాను.

Monday, 5 January 2026

దోషై రేత్తైః కులఘ్నానాం

దోషై రేతైః కులఘ్నానాం వర్ణసంకర కారకైః। ఉత్సాద్యన్తే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః॥43॥1॥ శ్రీమద్భగవద్గీత....అర్జున విషాద యోగము... అర్జునుడు ఇంకా ఇలా వాపోతున్నాడు.కృష్ణా!నేను ఏమి చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థం అవుతుంది కదా!వర్ణ సంకరానికి పాల్పడేవారు,వారొక్కరే చెడిపోవటం లేదు.వారితోటివారి కులం మొత్తాన్నీ అథఃపాతాళానికి తీసుకెళుతారు.ఎలాగంటావా,కృష్ణా? ఎవరైనా సుడిగుండంలో చిక్కుకున్నారు అనుకో,సహాయం అర్థిస్తారు.మనము ఎగురుకుంటూ పోతాము సహాయం చేసేదానికి.కానీ ఆ సుడిగుండంలోకి మనము కూడా పీల్చివేయబడతాము కదా! ఇక్కడ కూడా అలానే జరుగుతుంది.ఈ వర్ణ సంకరానికి పాల్పడే కర్తలు ఉంటారు కదా!వారు చేసే పాపకార్యాల వలన అనాదిగా వచ్చే కుల,జాతి ధర్మాలకు పాతర వేయబడుతుంది.ఆ ధర్మాలు అన్నీ కూకటి వ్రేళ్ళతో సహా పెకిలించవేయబడతయి.ఇదే అన్నిటికంటే వినాశకారి.

Sunday, 4 January 2026

సంకరో నరకాయైవ

సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ। పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియాః॥42॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... అర్జునుడికి దుఃఖం,విచారమూ క్షణ క్షణానికీ ఎక్కువ అవుతున్నాయి.ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుని పోతున్నాడు.శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు.కృష్ణా!వర్ణసంకరం వలన ఎవరికి లాభం చెప్పు?అటు కర్తకూ,ఇటు కులానికీ...రెంటికీ నరకమే కదా దక్కేది.వీళ్ళు చేసే పాపపు పనుల వలన పితృదేవతలు కూడా క్షోభిస్తారు.ఎందుకంటే వారికి పిండోదకాలు పెట్టేవాళ్ళూ,తర్పణాలు వదిలేవారూ ఎవరూ మిగిలి ఉండరు కదా!చివరికి ఉండేవాళ్ళు,పుట్టబోయే వాళ్ళు,ఆఖరికీ ఎప్పుడో పోయిన పితృదేవతలు,వారి ఆత్మలు...అందరూ అధోగతులపాలవుతారు. ఇంత ఘోష,ఇంత పాపం చేయటం మనకు అవసరమా?

Saturday, 3 January 2026

అధర్మాభి భవాత్ కృష్ణ

అధర్మాభి భవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః। స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః॥41॥1॥ శ్రీమద్భగవద్గీత..।అర్జున విషాద యోగము... మామూలుగా అన్నీ బాగుంటే మనమూ బాగుంటాము.పరిస్థితులు తారుమారు అయితే మనమూ అతలాకుతలము అవుతాము.అప్పుడు జీవనం ఎలా సాగించాలి?ఎలా బ్రతకాలి అనేదే ముఖ్యం అవుతుంది.అప్పుడే మనలో ఉండే అసలు మనిషి,అసలు వ్యక్తిత్వం బయట పడతాయి.చాలా మందికి కష్టాలూ,కడగళ్ళు అంటే భయం.అందుకనే ఎవరైనా కష్టాలలో ఉంటే వారి దరిదాపుల్లోకి కూడా ఎవరూ పోరు.అది అంటు వ్యాధి కాదు.కానీ అందరూ భయపడతారు. మన పని కావటం ముఖ్యం అనుకుంటారు.అనుసరించే మార్గం ఏదైనా పరవాలేదు అనుకుంటారు. అర్జునుడు అదే కృష్ణుడికి చెబుతున్నాడు. హే కృష్ణా!అధర్మం పెరిగితే ఏమవుతుంది?ఎవరూ మంచి బాటలో నడవాలని అనుకోరు.కులస్త్రీలు దుష్టులుగా పరిణమిస్తారు.వారు సక్రమమయిన మార్గంలో నడవక పోతే ఏమవుతుంది?వర్ణ సంకరమేగా!కులం భ్రష్టు పట్టిపోతుంది.ఆచార వ్యవహారలకు పాతర వేస్తారు.

Thursday, 1 January 2026

కులక్షయే ప్రణశ్యంతి

కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా స్సనాతనాః। ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోఽభి భవత్యుత॥49॥1॥ శ్రీమద్భగవద్గీత..।అర్జున విషాద యోగము... అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గర ఇలా వాపోతున్నాడు.కృష్ణా!నీకు కూడా తెలుసు కదా,కులక్షయం వలన కులాచారాలు నాశనమవుతాయి అని.కులాచారాలు భ్రష్టుపడితే కులం మొత్తం పాపపంకిలం అయిపోతుంది కదా!అధర్మం పేట్రేగిపోతుంది కదా!మంచి చెడ్డ అనే విచక్షణ కూకటి వ్రేళ్ళతో పీకివేయబడుతుంది కదా!కులము అనేది నాశనము అవుతుంది,లేక అంతరించి పోతుంది అంటే ఇక ప్రత్యామ్నాయము ఏమి ఉంది? ఈ వినాశనాన్ని ఆపేదెలా?

కథం న జ్ఞేయ మస్మాభిః

కథం న జ్ఞేయ మస్మాభిః పాపా దస్మా న్నివర్తితుమ్। కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన॥39॥1॥ శ్రీమద్భగవద్గీత..అర్జున విషాద యోగము... అర్జునుడు చెబుతున్నాడు.కృష్ణా!ఇప్పుడు ఇంక తెలిసిపోయింది కదా,వాళ్ళ నుంచి ఏ రకమైన మంచీ మనం ఆశించలేమని.కనీసం మనమైనా ఏదో ఒకటి ఆలోచించాలి కదా!ఎందుకంటే కులక్షయం చేయడం వలన వచ్చే పాపం మనకు అవగతమవుతుంది.దానిని అరికట్టేదానికి మనం ఆలోచించాలి.లేదా కనీసం ఆప్రక్రియకు దూరంగా అన్నా ఉండాలి.ఇది మన కనీస ధర్మం కదా!