Thursday, 18 June 2026

సన్న్యాసస్తు మహాబాహో

సన్న్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగతః। యోగయుక్తో మునిర్బ్రహ్మ న్నచిరేణాధి గచ్ఛతి॥6॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగి,సన్న్యాసి గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ మహాబాహో!నేను ఇందాకటి నుంచీ యోగము,సన్న్యాసము అనే పదాలు వాడుతున్నాను కదా!నీకు వాటి అర్థము,వాటి మధ్య తేడా తెలుసా?చెబుతాను,విను.యోగి అనేవాడు తన గృహస్తు ఆశ్రమాన్ని విడిచి పెట్టడు.అతను ధ్యానము,యోగాభ్యాసము,ప్రాణాయమం ద్వారా మనసును,ఇంద్రియాలను నిగ్రహిస్తాడు.ద్వంద్వాలకు తావు ఇవ్వడు.ఆత్మ జ్ఞానము,మోక్షప్రాప్తి అతని లక్ష్యము. అదే సన్న్యాసి విషయానికి వస్తాము.అతను సంసారాన్నీ,భౌతిక పరమయిన ఆకర్షణలను పూర్తిగా వదలి పెడతాడు.కాషాయం ధరిస్తాడు.వీరు సంసారంతో సంబంధం పెట్టుకోరు.దూరంగా అడవులలోనో,ఆశ్రమాలలోనో నిరాడంబరమయిన జీవితం గడుపుతారు.వీరు కర్మ త్యాగం చేస్తారు.కర్మ ఫలాన్నీ త్యాగం చేస్తారు.వీరికి ఒక్కటే లక్ష్యం.అదే మోక్షప్రాప్తి! ఇప్పుడు చెప్పు,నీకు ఏమి అర్థం అయింది?నేను సులభంగా చెబుతాను.ఎవరూ యోగి కాకుండా సన్న్యాసి కాలేరు.ఒక రకంగా చెప్పాలంటే అసాథ్యమే సుమా!ఇంకో కిటుకు కూడా చెబుతాను.ముందర యోగి అయి,తరువాత సన్న్యసించిన వాడే సులభంగా బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించగలడు.అంటే ఇది అంతా అంచెలంచెల మోక్షము.ముందర మనము ఇంద్రియ నిగ్రహణ నేర్చుకోవాలి.సుఖదుఃఖాలను సమానంగా తీసుకోవాలి.మనసును ఆత్మజ్ఞానం వైపు పరుగులు తీయనివ్వాలి.ఆ తరువాత నిజమయిన సన్న్యాసం జోలికి పోవాలి.

No comments:

Post a Comment