Saturday, 28 February 2026

భయా ద్రణా దుపరతం

భయా ద్రణా దుపరతం మంస్యన్తే త్వాం మహారథాః। యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్॥35॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి అద్దం చూపిస్తున్నాడు.అతను యుద్థం చేయక పోతే పరిస్థితి ఎంత దీనంగా ఉండబోతుందో కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్నాడు.అయ్యో అర్జునా!జరగబోయేది నీకు అర్థం కావడం లేదు.నీవు ఇప్పుడు యుద్థం చేయకపోతే ఏమవుతుందో నేను చెబుతాను విను.ఇప్పుడు రథులు,అర్థ రథులు,మహారథులు అందరూ నిన్ను ఒక పెద్ద వీరశిరోమణి అని భావిస్తున్నారు.అది కూడా నిజమే అనుకో!కానీ నీవు యుద్థరంగం నుంచి,క్షత్రియ ధర్మం నుంచి మొహం చాటేసిన మరు క్షణం నుంచీ నీ విలువ,గౌరవము అథః పాతాళానికి త్రొక్కి వేయబడతాయి.నీకంటే బలహీనులు కూడా నిన్ను గేలి చేస్తారు,అపహాస్యం చేస్తారు.నిన్ను పిరికివాడిగా చిన్నచూపు చూస్తారు.చులకన చేస్తారు.ఆ అవమానభారం నువ్వు మోయలేవు.తట్టుకోలేవు.నిన్ను గౌరవించి మర్యాద చేసేవాళ్ళు కనుచూపు మేరలో కానరారు.ఇది నిజం.నమ్ము.

అకీర్తిం చాపి భూతాని

అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేఽవ్యయామ్। సంభావితస్య చాకీర్తిః మరణా దతిరిచ్యతే॥34॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడిని కొంచెం బెదిరించి,ఇంకొంచెం నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.సన్నిహితుడి హితము కోరినపుడు సహేతుకమయిన మార్గాలు అన్నీ వెదకాలికదా!ప్రయోగించాలి కదా! అర్జునా!నీవు పెద్ద వీరుడివి.అలాంటిది చేతులు ముడుచుకుని యుద్ధం చేయకుండా మొహం చాటేస్తే లోకం ఏమనుకుంటుంది?నీవు చెప్పే కాకమ్మ కబుర్లు,శాంతి సూత్రాలు అసలు కారణం అని నమ్ముతుంది అని ఆశ పడుతున్నావా?ముమ్మాటికీ లోకం అలా ఆలోచించదు.నీవు పిరికి పందవి అని ముద్ర వేస్తుంది.ఓటమికి భయపడి అస్త్ర సన్యాసం చేసావు అంటుంది.ఈ అపకీర్తి నీవు పోయినా పోదు.ప్రజలు కథలు కథలుగా నీ చేతకానితనం అని అభివర్ణిస్తారు.నీవు అభిమాన ధనుడివి.అలాంటి నీకు ఇలాంటి అపకీర్తి శరాఘాతం కాదా?ఆత్మహత్యాసదృశం కాదా?దానికంటే మరణమే వెయ్యి రెట్టు మేలు కాదా?ఆ అవమానభారం నీవు తట్టుకోగలవా?ఛీత్కారంగా,తుస్కారంగా నీవైపు చూసే చూపులు నీవు నిలువరించగలవా?నీవే తేల్చుకో!

Friday, 27 February 2026

అథచే త్త్వమిమం ధర్మ్యం

అధచేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి। తత స్స్వధర్మం కీర్తిం చ హిత్వా పాప మవాప్స్యసి॥33॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి హితవు చెబుతున్నాడు.అర్జునా!నా ప్రియ నేస్తమా!నేను నీకు చెప్పాను యుద్థం అనేది క్షత్రియ ధర్మము అని.నీవు ఈ ధర్మ బద్ధమయిన యుద్థం చేయలేదు అనుకో చాలా నష్టపోతావు.అవి ఏందంటావా?చెబుతా విను.నీకు ఎంత మంచి పేరు,యశస్సు ఉంది!అదంతా క్షణంలో మటుమాయమవుతుంది.ధర్మాన్ని అనుసరించని వాడిని ఏమంటరు?ధర్మ భ్రష్టుడు అని అంటారు.అట్లాంటి పేరు తెచ్చుకోవాలని ఉందా నీకు?చెప్పు?మౌనం అర్థంగీకారం అని అంటారు కదా!కౌరవులు తప్పు త్రోవలో పోతున్నారు.ఆ విషయం తెలిసీ,వారిని అరికట్టగలిగే శక్తి ఉండి కూడా మిన్నకుంటే ఏమవుతుంది?అసలు తప్పు చేసినవాడికంటే ఎక్కువ పాపాత్ముడివి అవుతావు.అలా అథోగతి పాలు కావడం అంత అవసరమా ఇప్పుడు నీకు.చెప్పు.మాట్లాడు.సమాథానం ఇయ్యి.దుష్టులను ఉపేక్షించడం చాలా పెద్ద నేరము.

Thursday, 26 February 2026

యదృచ్ఛయా చోపపన్నం

యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వార మపావృతమ్। సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధ మీదృశమ్॥32॥2॥ శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి తాయిలం చూపిస్తున్నాడు.అర్జునా!అందగాడా!నీవు కలలో కూడా ఊహించని అదృష్టం నీ తలుపు తడితే ఏమి చేస్తావు?ఊహలకు కూడా అందని అదృష్టం నా చెంతకు నీజంగా ఎందుకు వస్తుంది అని అనుమానంతో,భయంతో తలుపులు మూసుకునే కూర్చుంటావా?లేక ఎగిరి గంతేసి,నాకు సుడి తిరిగిందోచ్,అనుకుంటూ పరుగెత్తి తలుపు తెరిచి స్వాగతం పలుకుతావా?ఏమి చేస్తావు?ఖచ్చితంగా రెండోదే కదా!ఆ నమ్మకం నీ మీద నాకు కూడా ఉంది. ఇప్పుడు యుద్ధం కూడా అలా అయాచితంగా,మన ప్రమేయం లేకుండా,తెరుచుకున్న స్వర్గ ద్వారాలు అనుకో!ప్రతి ఒక్క రాజుకు ధర్మ సంస్థాపన కొరకు యుద్థం చేసే అవకాశం రాదు.అది నీకు దక్కింది.అడగకనే దేవుడు నీకు వరమిచ్చాడు అనుకో!ఇంతటి అదృష్టం ఎంత మంది రాజులకు దక్కుతుంది చెప్పు?వచ్చిన బంగారం లాంటి అవకాశం జారవిడుచుకోకు.సద్వినియోగం చేసుకుని కీర్తి పతాకం ఎగురవెయ్యి.ఇదే నా సలహా నీకు.నీ మంచి కోరి చెబుతున్నాను.

స్వధర్మమపి చావేక్ష్య

స్వధర్మ మపి చావేక్ష్య న వికంపితు మర్హసి। ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోఽన్యత్ క్షత్రియస్య న విద్యతే॥31॥2॥ శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి తన ధర్మంగురించి చెబుతున్నాడు.అర్జునా!ఆప్తమిత్రా!ఇవన్నీ వదిలేసెయ్యి.నేను చెప్పేది ఈ ఒక్కటి విను.ఈ ఆత్మలు,జీవులు అన్నీ మరచిపో.మనకంటూ ఒక ధర్మం ఉంటుంది కదా!అది నీకూ తెలుసు కదా!అది ఆచరించు.క్రొత్తగా ఏమీ చేయనక్కరలేదు.గందరగోళం,గలభా అవసరమే లేదు.నీవు క్షత్రియుడివి కదా.క్షత్రియ ధర్మం ఏంది?నువ్వే చెప్పు.యుద్ధం కదా!అదే పాటించు.ఎలాంటి అపోహలు అక్కరలేదు,అనుమానాలు అక్కర లేదు.అవగాహనా రాహిత్యం అసలు అవసరం లేదు.తలలు బద్దలు కొట్టుకో బళ్ళేదు.తల పట్టుకోనక్కరలేదు.మన ధర్మాన్ని తు చ తప్పకుండా పాటిస్తే చాలు.సంశయానికి తావు ఉండదు.ఆత్మ తృప్తి కలుగుతుంది.

Wednesday, 25 February 2026

దేహీ నిత్య మవధ్యోఽయం

దేహీ నిత్య మవధ్యోఽయం దేహే సర్వస్య భారత। తస్మా త్సర్వాణి భూతాని న త్వం శోచితు మర్హసి॥30॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి మంచిగా చెబుతున్నాడు.అర్జునా!అన్ని దేహాలలోనూ ఉన్నది ఆత్మే.అది చంపదు,చంపబడదు.అది నిత్యము.అది సత్యము.కాబట్టి అర్జునా!అర్థం చేసుకునేదానికి ప్రయత్నించు.ఈ జీవుల కోసం శోకించడం అనేది తగని పని.అసలు అవసరము లేదు.

ఆశ్చర్యవ త్పశ్యతి

ఆశ్చర్య వత్పశ్యతి కశ్చిదేన మాశ్చర్యవ ద్వదతి తథైవ చాన్యః। ఆశ్చర్యవచ్చైన మన్య శ్శృణోతి శ్రుత్వా ప్యేనం వేద న చైవ కశ్చిత్॥29॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడికి అందరూ ఆత్మ గురించి ఏమనుకుంటారో బాగా తెలుసు.అదే అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!నువ్వు ఒక్కడివే కాదు ఆత్మ గురించి గందరగోళంలో ఉండేది. ఒకడేమో ఆత్మను ఆశ్చర్యంగా చూస్తాడు.ఇంకొకడేమో ఆత్మ గురించి ఆశ్చర్యంగా పలుకుతున్నాడు.మరి ఇంకొకడు నోరెళ్ళ బెట్టుకుని ఆశ్చర్యంగా ఆత్మ గురించి వింటున్నాడు. ఇట్లా ఒక సరైన అవగాహన లేకుండా చూడడం ద్వారా,చెప్పడం ద్వారా,వినడం ద్వారా ఏమీ ఒరగదు.అంటే లాభం లేదు.ఆత్మను అంత సులభంగా తెలుసుకోలేము,అర్థం చేసుకోలేము.

Tuesday, 24 February 2026

అవ్యక్తాదీని భూతాని

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత। అవ్యక్త నిధనా న్యేవ తత్ర కా పరిదేవనా॥28॥2॥ శ్రీమద్భగనద్గీత....సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చావు పుట్టుకల గురించి వివరిస్తున్నాడు.ఓ అర్జునా!భరత శ్రేష్టా!నువ్వు నిశితంగా గమనించు.ఈ సృష్టిలోని సకల భూతాలూ పుట్టకముందు మనకు కనిపిస్తున్నాయా?లేదు కదా!కానీ ఆ జీవులు అన్నీ పుట్టిన తరువాత కనిపిస్తున్నాయి కదా!ఎందుకంటావు?ఆలోచించు ఒక్క క్షణం. ఎందుకంటే కిందటి జన్మలో ఏ రూపంలో ఉన్నారో మనకు తెలియదు.చనిపోయిన పిమ్మట మరు జన్మలో ఎవరు ఏ రూపం పొందుతారో మనకెవరికీ తెలియదు గనక.అలాంటి బంధుకోటి గురించి నీవు తల పగలగొట్టుకోవడం ఎందుకు?ఈ దిగులు,విచారం,ఈ నిర్వీర్యం,నిస్సత్తువ,నిర్వికారం ఎందుకు?మనసును ప్రశాంతంగా పెట్టుకో!

Monday, 23 February 2026

జాతస్య హి ధ్రువో మృత్యుః

జాతస్య హి ధ్రువో మృత్యు ర్ధ్రువం జన్మ మృతస్య చ। తస్మా దపరిహార్యేఽర్థే న త్వ వం శోచితు మర్హసి॥27॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... చెట్టును ఒక తట్టు నుంచి నరక లేక పోతే ఇంకో తట్టు నుంచి నరుక్కోని రావాలి అంటాము కదా!కృష్ణుడు తను అర్జునుడికి చెప్పాల్సింది చెప్పాడు.కానీ అతనిలో ఏమీ మార్పు కనిపిస్తున్నట్లు లేదు.అందుకని అర్జునుడి మార్గంలోనే పోయి,అర్జునుడు సత్యం గ్రహించేలా చెయ్యాలని నడుము బిగించాడు. ఇలా చెబుతున్నాడు.అర్జునా!నీవు ఆత్మకు మనకులాగే చావు పుట్టుకలు ఉన్నాయి అని గాఢంగా నమ్ముతున్నావు కదా!సరే!అప్పుడు కూడా ఏమవుతుంది?ఒకసారి ఆలోచించు.పుట్టినది గిట్టక మానదు కదా!ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవీ చావును తప్పించుకోలేదు కదా!మరణం తరువాత మళ్ళీ పుట్టడం అనేది అంతే సహజం కదా!ఈ రెండింటిలో ఏ ఒక్కదానినీ మనం ఆపలేము కదా!మన చేతుల్లో లేని ప్రక్రియ కదా.మరి మన చేతులలో లేని,మన నియంత్రణలో లేని దాని కోసరము మనము ఇంత దుఃఖిచడం అవసరమా?నువ్వే చెప్పు.

అథ చైనం నిత్యజాతం

అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్। తథాపి త్వం మహాబాహో నైవం శోచితు మర్హసి॥26॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు.అర్జునా! బామ్మర్దీ!ముందర ముఖం పైన కనిపించే ఆ దిగులు,విచారమూ తుడిచేయి.నీకు అసలు వాటి అవసరము లేదు. నేను ఆత్మ గురించి చెప్పే మాటలు నమ్మ బుద్ధి కావటం లేదా?అయినా పరవాలేదు.నువ్వు ఆత్మకు అంత విషయం లేదు.దానికీ చావు పుట్టుకలు ఉన్నాయి,ఉంటాయి కూడానూ అని అనుకుంటున్నావా?సరే!అట్లానే అనుకుందాము.అప్పుడు కూడా నీవు ఇంత దిగులు పడి,దుఃఖ పడి,యాగీ చేయాల్సిన అవసరము లేదు.ముందు స్థిమిత పడు.

Saturday, 21 February 2026

అవ్యక్తోఽయ మచింత్యో

అవ్యక్తోఽయ మచింత్యోఽయ మవికార్యో య ముచ్యతే తస్మాదేవం విది త్వైనం నాను శోచితు మర్హసి॥25॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మ గురించి ఇంకా చెబుతున్నాడు. అర్జునా!ప్రియ సఖా!ఆత్మని కాల్చలేము,తడపలేము,ఎండబెట్టలేము,చంపలేము అని చెప్పాను కదా! అది మన పంచేంద్రియాలకు కూడా కానరాదు.అంటే మనము తాకలేము,వినలేము,వాసన గ్రహించలేము,రుచి చూడలేము,చూడలేము,మాటలాడలేము.ఈ ఆత్మ ఇలా ఉంటుంది!అలా ఉంటుంది అని చెప్పలేము.అసలు ఎలా ఉంటుంది అని ఊహించను కూడా ఊహించలేము.దీనికి ఆకారం లేదు,ఆహార్యం అసలే లేదు.అంటే నూటికి నూరు పాళ్ళూ నిర్వికారి. ఇది ఇప్పుడు నేను నీకు చెప్పడం కాదు.అనాది నుంచీ ఆత్మ గురించి చెప్పబడే విషయాలే.ముందర ఈ ఆత్మ తత్త్వాన్ని నువ్వు తెలుసుకో,అర్థం చేసుకో.ఇంతకు మించి ఇంకొక మార్గం లేదు.ఈ విషయం నువ్వు ఆకళింపు చేసుకుంటే దుఃఖం అనేది నీ చుట్టు ప్రక్కలకు కూడా రాదు.ఆమడ దూరంలో ఎక్కడో బ్రతుకు జీవుడా అంటూ నిట్టూరుస్తూ,వణుకుతూ ఉంటుంది.నన్ను నమ్ము.

Friday, 20 February 2026

అచ్ఛేద్యోఽయ మదాహ్యోఽయ

అచ్ఛేద్యోఽయ మదాహ్యోఽయ మక్లేద్యోఽశోష్య ఏవ చ। నిత్యస్సర్వగత స్స్థాణు రచలోఽయం సనాతనః॥24॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... మన పెద్దవాళ్ళు ఏమి చెబుతారు?ఏదైనా ఒకటికి పదిసార్లు అధ్యయనము చేయాలి అని.అందుకే కదా పలక పైన అక్షరాలు అన్ని సార్లు దిద్దిస్తారు!గాఢనిద్రలో లేపి అడిగినా తప్పులు చెప్పకూడదు,వ్రాయకూడదు. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి ఆత్మ తత్త్వం గురించి పదే పదే విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నాడు. హే అర్జునా!నా ప్రియ మిత్రమా!ఈ ఆత్మ అనేది ఉందే!అది మామూలు కాదు మనం రోజూ చూసే విషయం లాగ.దీనిని మనం ఛేదించలేము,భేదించలేము.అంతేనా?అంటే అదీ కాదు.దహిస్తామా అంటే అట్లానూ కాల్చి బూడిద చేయలేము.సరేలే కనీసం తడుపుదాము అనుకుంటే దానికీ మళ్ళబడుతుంది.కించిత్ కూడా తడవదు.ఇంక ఎట్లా ఏగాలి,చెప్పు.తడపలేము,పోనీలే ఎండ కడతాము అని నిర్ణయించుకున్నాము అనుకో.ఆ విషయంలో కూడా మనది తప్పటడుగు అవుతుంది.ఊహూ!ఆ విషయంలో కూడా మనము విజయము సాథించలేము. దీనికంతటికీ కారణం ఏందో తెలుసా,అర్జునా!ఈ ఆత్మ అనేది నిత్యమయినది.నిన్నా మొన్న పుట్టింది కాదు...రేపో ఎల్లుండో పోతుందిలే అనుకునేదానికి!,మన పప్పులు ఏమీ దాని దగ్గర ఉడకవు.అది సనాతనమయినది.అది నిజము.అది ఎవరి ఆధీనములో లేదు.ఎవరూ దానిని గుప్పెట్లో దాచిపెట్టలేరు.

Thursday, 19 February 2026

నైనం ఛిందంతి శస్త్రాణి

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః। న చైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః॥23॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆత్మ అనేది ఉందే.దీనిని ఎవరూ ఏమీ చేయలేరు.ఎలాంటి అస్త్ర శస్త్రాలూ దీనిని ఛేదించలేవు,భేదించ లేవు.ఎంతటి అగ్ని కూడా దీనిని దహించలేదు.ఎక్కడి నుంచి ఎన్ని సముద్రాల నీరు తెచ్చి పోసినా తడపలేము.అది తడవదు.ఎలాంటి భీకరమయిన గాలులు కూడా దానిని ఆరబెట్టలేవు.ఎండబెట్టలేవు.మనము దానిని ఏమీ చేయలేము.అన్నిటికీ అతీతము.

Tuesday, 17 February 2026

వాసాంసి జీర్ణాని

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి। తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ॥22॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... బుజ్జోడి బుల్లి బొజ్జలోకి బజ్జి బువ్వ పోవాలంటే అమ్మ బహు ప్రయాస పడుతుంది కదా!ఇక్కడ మన కన్నయ్య కూడా అర్జునుడి బుర్రలోకి కూసింత జ్ఞానం ఎక్కించేదానికి కడు కటకటలు పడుతున్నాడు. అర్జునా!మనము మన బట్టలు చినిగి పోతే ఏమి చేస్తాము?అట్లనే చీలికలు,పేలికలు వేసుకుని తిరగము కదా!వాటిని తీసి పారేస్తాము కదా!మంచిగా క్రొత్త బట్టలు వేసుకుని టింగురంగా అంటూ తిరుగుతాము కదా! ఆత్మ కూడా అచ్ఛం అలానే ఆలోచిస్తుంది,చేస్తుంది.ఈ శరీరం నిరుపయోగమవుతుందనుకో!ఈ పనికిరాని పాత శరీరం విడిచి పెడుతుంది మొహమాటం లేకుండా!ఎంచక్కా క్రొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది ఎంతో సహజంగా,సునాయాసంగా!

వేదావినాశినం నిత్యం

వేదావినాశినం నిత్యం య ఏన మజ మవ్యయమ్। కథం స పురుషః పార్థ కం ఘాతయతి హన్తి కమ్॥21॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు పరి పరివిథాలా తపిస్తున్నాడు... అర్జునుడు తను చెప్పేది అర్థం చేసుకోవాలని.అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత పని చేస్తున్నాడు.ఇంక అర్జునుడు నమిలి,మింగితే చాలు! అర్జునా!నేను చెప్పాను కదా...ఆత్మ నాశనం లేనిదని.అలాగే నిత్యము అయినది అని.ఇంకా ఇంకా దాని గురించి ఇలా చెప్పాను కదా.ఆత్మకు వృద్థి,క్షయములు లేవు.అంటే పెరగదు,తరగదు.వ్యము కానిది కూడా!ఇవన్నీ తెలిసిన నేను కానీ ఇంకొకరు కానీ వేరొకరిని చంపడానికి ఎందుకు ప్రేరేపిస్తారు అసలు?తాము మటుకు ఎందుకు,ఎవరినైనా చంపుతారు చెప్పు?ఆలోచించు నిదానంగా.

Monday, 16 February 2026

న జాయతే మ్రియతే

న జాయతే మ్రియతే వా కదాచి న్నాయం భూత్వా భవితా వా న భూయః। అజో నిత్య శ్శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే॥20॥2॥ శ్రమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడికి అర్జునుడిని చూస్తే జాలి,దయ కలగటం లేదు.కోపం వస్తుంది.అయినా అన్నీ దిగమ్రింగుకోని ఇలా అంటున్నాడు. నేస్తమా!నేల చూపులు ఏంది?ఈ నీరసం,నిస్సత్తువ ఏంది?కాళ్ళూ,చేతులు వ్రేలాడేసుకుని ఈ బేల చూపులు ఏంది?ఈ చతికిలబడటం ఏంది? ముందర లెయ్యి అసలు.మనలను చూసి నలుగురు ఉత్తేజితులు కావాలి.పదిమందికి మనం ప్రామాణికంగా నిలవాలి.బెబ్బెబ్బే అంటూ ఈ దీనాలాపనలు,బొబ్బెబ్బో అంటూ ఏడుపులు ఏంది?చలనం తెచ్చుకో!నా కళ్ళలోకి చూడు.నేను చెప్పేది మనసు పెట్టి విని,ఆకళింపు చేసుకో! ఆత్మ పుట్టేది కాదు.దానికి చావు అనేది లేదు.అట్లా అని ఒకప్పుడు ఉండి,ఇంకోకప్పుడు లేకుండా ఉండదు.ఆత్మ జనితమయినది కాదు.దానికి మార్పులు,చేర్పులు,తక్కువలు,ఎక్కువలు అంటూ ఏమీ ఉండవు.దానికి నాశనం అనేది లేదు.అది సనాతనమయినది.అది చంపదు.చావదు,చావబడదు.అది ధరించిన శరీరం నశిస్తుంది, దానికి చావు ఉంది కానీ ఈ ఆత్మకు మటుకు చావు లేదు,నాశనం అవదు.

య ఏవం వేత్తి హంతారం

య ఏవం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్। ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే॥19॥2॥ శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మ తత్త్వం గురించి చెబుతున్నాడు.మిత్రమా!అర్జునా!నీకు ఈ విషయం తెలుసా?ఈ ఆత్మ అనేది ఉందే!అది దేనిని చంపదు.దేని చేత చంపబడదు.ఎవరైనా ఆత్మ చంపుతుంది,లేకపోతే చంపబడుతుంది అనుకుంటే...వారంత అజ్ఞానులు ఇంకొకరు ఉండరు.ఎందుకంటే ఆత్మ వీటన్నిటికీ అతీతమయినది.ఏదీ దానిని మలినం చేయలేదు.నాశనము చేయలేదు.అది స్వచ్ఛమయినది.నిత్యమయినది.నిరామయము.

Sunday, 15 February 2026

అంత వంత ఇమే దేహా

అంత వంత ఇమే దేహానిత్యస్యోక్తా శ్శరీరిణః। అనాశినోఽప్రమేయస్య తల్మా ద్యుధ్యస్వభారత॥18॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడిని బుజ్జగిస్తున్నాడు.అర్జునా!ధరించబడిన దేహాలు నశిస్తాయి.దానిని ధరించిన జీవుడు,అదే ఆత్మ నాశనం కాదు.అది నిత్యమయినది.సత్యమయినది.ముందు నువ్వు ఆ విషయం తెలుసుకుని,గుర్తు పెట్టుకో.ఈ అనవసరమయిన దుఃఖాన్ని మానివెయ్యి.యుద్ధానికి నడుము బిగించి విజయమో,వీరస్వర్గమో తేల్చుకో!వెనకకు తగ్గొద్దు.

Saturday, 14 February 2026

అవినాశి తు తద్విద్ధి

అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్। వినాశ మవ్యయస్యాస్య న కశ్చి త్కర్తు మర్హతి॥17॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.సఖా!అర్జునా!ఈ ఆత్మ అనేది ఉందే!అది ఈ జగత్తు అంతా పరివ్యాప్తమయి ఉంది.అంటే వ్యాపించి ఉంది.దానికి నాశనము లేదు అని తెలుసుకో.ఈ ఆత్మ అవ్యయము.దీనిని నాశనం చేసేది,చేయగలిగేది ముల్లోకాలలో ఏదీ లేదని అర్థం చేసుకో! అసలు అవ్యయము అంటేనే నాశనము లేనిది.సర్వకాల సర్వావస్థల యందు మార్పులు,చేర్పులు లేకుండా ఉండేది.అది నిత్యమూ,సత్యమూ కూడాను.

Friday, 13 February 2026

నాసతో విద్యతే భావో

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః। ఉభయోరపి దృష్టోఽన్త స్త్వనయో స్తత్త్వదర్శిభిః॥16॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడి బుర్రలోకి తాను చెప్పేది ఎక్కాలని చాలా తాపత్రయపడుతున్నాడు.ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఇటు చూడు.దేహం కలిగిన వారు అందరూ అశాశ్వతులు.ఆత్మ శాశ్వతము.దానికి లేమి అనేది లేనే లేదు.దేహాదులు అంతా మాయ,అశాశ్వతము.అదే ఆత్మ అనేది నిత్యమూ,సత్యమూ అయినది.ఇది అర్థం చేసుకో ముందు. ఈ విషయాన్ని తత్త్వజ్ఞులందరూ ఎప్పుడో తెలుసుకున్నారు.ఇది నిశ్చలమయిన,నిశ్చితమయిన సత్యము.దీనినుంచి ఎవరూ మొహం చాటు వేయలేరు.ఒప్పుకోవాలసిందే!

Thursday, 12 February 2026

యం హి న వ్యథయం త్యేతే

యం హి న వ్యథయం త్యేతే పురుషం పురుషర్షభ। సమ దుఃఖ సుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే॥15॥2॥ శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.ఇవన్నీ వదిలేసెయ్యి.సుఖాలూ,దుఃఖాలూ ప్రతి ఒకేరి జీవితంలో సర్వ సాథారణము కదా!వాటికి మనము చలించడం మానేయాలి.అవి బాథ పెట్టాయని ఏడవడం,సుఖ పెట్టాయని గెంతులు వేయడం ముందు మానుకోవాలి.అవి మనలను ఏ రకంగానూ ప్రభావితం చేయకూడదు.ఆ స్థితికి మనము చేరాలి.ఇవన్నీ దాటుకుని పోతేకానీ మనకు మోక్షానికి అర్హత సంపాదించలేము. సుఖాలనూ దుఃఖాలనూ సమానంగా స్వీకరించగలిగే స్థితికి చేరుకున్నవారే మోక్షానికి అర్హులు అవుతున్నారు.

Wednesday, 11 February 2026

మాత్రా స్పర్శాస్తు కౌంతేయ

మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః। ఆగమాపాయినోఽనిత్యాః తాం స్తితిక్షస్వ భారత॥14॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడి ఓపికకి నిజంగా జోహార్లు!మాములుగా మన ప్రక్క వాడి కంటే మనము కొంచెము ఎక్కవ అనే భావము రాగానే మనకు కళ్ళు నెత్తికి ఎక్కుతాయి.ఎక్కువ తెలివి అనేది నిజమయినా,నిజం కాకపోయినా!అలాంటిది భగవంతుడు అయి కూడా అంత ఓపికగా,సులభంగా అర్థం అయ్యేలాగా చెబుతున్నాడు అంటే మనమంతా ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలి అని కొంచెం ఆలోచించాలి. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!మనము చలి అయినా,వేడి అయినా ఎట్లా తెలుసుకుంటాము?మన ఇంద్రియాల వలనే కదా!సుఖ దుఃఖాలు కూడా అంతే.ఇంద్రియాల వలనే కలుగుతాయి.ఆకాశంలో కదిలే మేఘాలలాగానే.ఈ క్షణం కనిపిస్తాయి.ప్రక్క క్షణం మాయమవుతూ ఉంటాయి.అవి అక్కడే పాతుకు పెట్టుకుని కూర్చోవు కదా!అవి శాశ్వతం కాదు.చంచలం.వస్తుంటాయి,పోతుంటాయి. ఇట్లా మనము ప్రతి చిన్న విషయానికి భావోద్వేగాలకు లోనయితే ఎలాగా?నీవే చెప్పు.

Monday, 9 February 2026

దేహినోఽస్మిన్ యథాదేహే

దేహినోఽస్మిన్ యథాదేహే కౌమారం యౌవనం జరా। తథా దేహాంతర ప్రాప్తిః ధీర స్తత్ర న ముహ్యతి॥13॥2॥ శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు ముందర అర్జునుడిని స్వాంతపరుస్తున్నాడు.చిన్నగా,అనునయంగా,ప్రేమగా చెబుతున్నాడు. అర్జునా!నేను ఎందుకు అందరమూ అన్ని కాలాలోనూ ఉంటాము అని చెబుతున్నానో గ్రహించేదానికి ప్రయత్నం చెయ్యి.మనకు ఈ శరీరం ఉంది కదా!దానివలన సహజంగా ఈ దేహానికి బాల్యం,యవ్వనము,ముసలితనము కలుగుతాయి కదా!అది నువ్వుకూడా ఒప్పుకుంటావు కదా!ఇలాగే మరో దేహాన్ని పొందడం కూడా ఇంతే సహజం.బుద్దిమంతులు సులువుగా ఈ విషయాన్ని గుర్తిస్తారు.కలవరపడరు.మోహితులు అస్సలేకారు.స్థితప్రజ్ఞత కనబరుస్తారు.నువ్వుకూడా అర్థం చేసుకుని,సమన్వయం చూపించు.

Sunday, 8 February 2026

న త్వేవాహం జాతు నాసం

న త్వేవాహం జాతునాసం న త్వం నేమే జనాధిపాః। న చైవ న భవిష్యామ స్సర్వే వయ మతః పరమ్॥11॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... చిన్న పిల్లోడికి ఏమైనా అర్ధం కాకపోతే వేరేవాళ్ళు విసుక్కోవచ్చు.కానీ అమ్మ ఏం చేస్తుంది?పిల్లవాడిని భయపెట్టకుండా,మంచిగా,చిన్నగా,సులభంగా అర్థం అయ్యేలాగా,వాడి బుర్రకు తగినట్లు మంచిగా ప్రేమగా చెబుతుంది కదా!కృష్ణుడు కూడా ఇక్కడ అర్జునుడిని భయపెట్టడం లేదు.ఇంకా సందిగ్ధంలోకి నెట్టడం లేదు.ప్రశాంత చిత్తంతో,ఓపికగా,అర్ధం అయ్యేలా చెబుతున్నాడు. అర్జునా!సఖా!నీవు ఏదో గందరగోళంలో గాబరా పడుతున్నావు.నీవు అనుకునేది ఏమీ లేదు.అంతా చాలా సునాయసంగా అర్ధం అయ్యేదే!నా మాట నమ్ముతావా? నేను,నువ్వు,నీవు చెప్పే ఈ మహారాజులు అందరూ గతంలో లేకుండా లేము.అట్లాగా అని భవిష్యత్తులో ఉండకుండా పోము.ఇప్పుడు ఉన్నాము అనే విషయం లో నీకు ఎలాంటి అనుమానం లేదు కదా! అంటే ఇది అంతా కాలచక్రం.పుడుతుంటాము,గిట్టుతుంటాము.ఎప్పుడూ ఇలానే కాలం సాగిపోతుంది.

Monday, 2 February 2026

అశోచ్యా నన్వశోచస్త్వం

శ్రీ భగవానువాచ... అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే। గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః॥11॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు నవ్వు ఆపుకోలేకపోయాడు.ఇంక బలవంతంగా ఆపుకుని అర్జునుడి తట్టు మళ్ళి మాట్లాడాడు. అర్జునా!ఏందో అనర్గళంగా భాషణలు ఇచ్తేస్తున్నావు.జీవితం అంతా ఔపోసన పట్టిన జ్ఞానిలాగా మాట్లాడేస్తున్నావు. నిజం చెప్పేదా?అది ఎప్పుడూ కటువుగా ఉంటుంది.మానవుడు దేని కోసం దుఃఖించకూడదో,దాని కోసం దుఃఖిస్తూ ఉన్నావు.అంతేనా?మళ్ళీ ఇదేమీ చాలనట్లు పెద్ద ఆరిందలాగా సూక్తుల,ముక్తాయింపులు చెబుతున్నావు. నీకు అసలు ఈ విషయం తెలుసా?నిజంగా పండితులు అయినవాళ్ళు సజీవుల గురించి ఆలోచించరు.పైగా గత జీవుల గురించి దిగులు పడరు.అసలు నువ్వు ఏ ఏ విషయాలకు అయితే దిగులు పడి,దుఃఖ పడుతున్నావో వాటిగురించి లేశ మాత్రం కూడా సమయం వృథా చేయరు.దుఃఖం అనే దానిని దరిదాపులకుకూడా రానివ్వరు.

Sunday, 1 February 2026

తమూవాచ హృషీకేశః

తమూవాచ హృషీకేశః ప్రహసన్నివ భారత। సేనయో రుభయో ర్మధ్యే విషీదంత మిదం వచః॥10॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు ఈ విథంగా వివరిస్తున్నాడు.ఓ ధృతరాష్ట్ర మహారాజా!అర్జునుడు చాలా దీనంగా కనిపిస్తున్నాడు.రెండు సైన్యాల మధ్య అతను విషణ్ణ వదనంతో చాలా వ్యాకులంగా,నిశ్చేష్టుడు అయి రధం పైన పడిఉన్నాడు.చూసేవారికి అంతా చాలా హృదయవిదారకంగా ఉంది అతని స్థితి,పరిస్థితి.కానీ అతని బాల్య మిత్రుడు శ్రీకృష్ణుడుకు మటుకు పట్టలేనంత నవ్వుగా ఉంది.పగలబడి పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు.నవ్వుతూనే ఇలా అన్నాడు.