Wednesday, 24 December 2025

న కాంక్షే విజయం కృష్ణ

న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ। కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితే న వా॥32॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... అర్జునుడికి ఊపూ ఉత్సాహము అంతా అథఃపాతాళానికి పడిపోయాయి.మనసంతా నిర్వేదం ఆవరించింది.తన కష్టం సుఖం చెప్పుకునేదానికి,తన మనసులో తిరుగుతున్న సుడిగుండాల గురించి చెప్పేదానికి,చెప్పుకునేదానికి అతనికి కృష్ణుడి కంటే ఆత్మీయుడు,అయినవాడు,తనను సరిగ్గా అర్థం చేసుకోగలిగినవాడు ఇంకెవరూ లేరనిపించింది.అందుకే శ్రీకృష్ణుడితో నిరాసక్తంగా ఇలా అంటున్నాడు. కృష్ణా!సఖా!నాకు ఈ క్షణం ఏమీ వద్దు అనిపిస్తుంది.నాకు ఎవరిపైనా విజయం సాథించాలనే తలంపు లేదు.నాకు రాజ్యం కోరాలని లేదు.సుఖసంతోషాలలో మునిగి తేలాలని లేదు.యుద్ధం అంటే ఏంది?ఎదుట నున్న ప్రతి ఒక్కరినీ చంపుకుంటూ పోవటమే కదా!ఆ తట్టు అంతా నా వాళ్ళే ఉన్నారు.మరి నా బంథువులనంతా చంపేసుకుని నేను ఏమి బావుకుంటాను?నా అనే వాళ్ళు ఎవరూ లేని ఈ రాజ్యం నా కెందుకు?ఈ భోగభాగ్యాలు ఇంకెందుకు?అసలు ఈ జీవితమే వ్యర్థం కదా?కృష్ణా!నా కంతా అగమ్యగోచరంగా ఉంది.దిక్కుతోచడం లేదు.దిక్కులేని వాడికి దేవుడే దిక్కు కదా!నా దిక్కు నువ్వే!నాకు దిశా నిర్దేశం నీవే చేయాలి.

Tuesday, 23 December 2025

నిమిత్తాని చ పశ్యామి

నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ। న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజన మాహవే॥31॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము.. మనము మనోధైర్యం కోల్పోతే లేని పోని అనుమానాలు వస్తాయి.భయం..భయం..భయం!నిస్సత్తువ నేనున్నానంటూ మన ఒళ్ళోనే కూర్చుంటుంది.నిరాసక్తత మన తల చుట్టూ ముళ్ళ కిరీటం లాగా నిలబడిపోతుంది.కాళ్ళూ చేతులు ఆడవు.ఎదురుగా ఉండేవి సజావుగా కనిపించవు.లేనివి ఖచ్చితంగా ఉన్నట్లు భ్రమలు కలుగుతుంటాయి.కాబట్టి ఎప్పుడూ అధైర్యపడకూడదు. ఇక్కడ అర్జునుడు పైన చెప్పిన దీనావస్థలోనే ఉన్నాడు.శ్రీకృష్ణుడితో అంటున్నాడు.కేశవా!నారాయణా!హరీ!ఏతట్టు చూసినా నాకు దుశ్శకునాలే కనిపిస్తున్నాయి.దివిటీ పెట్టి వెతికినా ఒక్కటంటే ఒక్క మంచి శకునం కనిపించడం లేదు.ఇప్పుడు నేను ఈ యుద్ధంలో నా వాళ్ళని చంపుకోవాలి.అంతే కదా!నా వాళ్ళే లేనప్పుడు నేను ఎందుకు?ఒంటి కట్టు రామలింగం లాగా ఏమి సాథించాలి?ఏమి అనుభవించాలి?ఇదంతా అనవసరం కదా!ఎవరికీ ఏ మంచీ ఒరగదు కదా!అంతా నిష్ప్రయోజనం కదా!మన శక్తి యుక్తులు అన్నీ నిరుపయోగం కదా!కథ సుఖాంతం కాకపోతే!

Friday, 19 December 2025

గాండీవం స్రంసతే హస్తాత్

గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే। న చ శక్నో మ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః॥30॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... అర్జునుడికి దిక్కుతోచడం లేదు.శ్రీకృష్ణుడితో తన ఘోష వెళ్ళగ్రక్కుతున్నాడు.బావా!ఏమీ అర్థం కావటం లేదు.మనసంతా అతలాకుతలమైపోతుంది.దానికి పర్యవసానంగా చేతిలోంచి గాండీవం జారిపోతుంది.పొయ్యి పైన పెనం కాగినట్లు ఒళ్ళంతా సెగలు,పొగలు!సల సల కాగిపోతుంది శరీరం!పిక్కలు జావగారి పోతున్నాయి.రెండు కాళ్ళ మీద నిటారుగా నిలబడలేక పోతున్నాడు.మనసు పరి పరి విథాల పోతుంది.

Thursday, 18 December 2025

సీదంతి మమ గాత్రాణి

సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి। వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే॥29॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... అర్జునుడు గద్గద స్వరంతో శ్రీకృష్ణుడితో అంటున్నాడు.కృష్ణా!నా అవయవాలన్నీ బండబారిపోతున్నాయి.చలనంలేక శిథిలాలు లాగా ఉన్నాయి.నోరు ఉన్నట్టుండి పిడచ కట్టుకుని పోతుంది.శరీరం నా ప్రమేయంలేకుండా కంపిస్తుంది.ఒళ్ళు గగుర్పాటుకులోనవుతుంది.నాకు అంతా అయోమయంగా ఉంది.బుర్ర అస్సలు పని చేయడం లేదు.ఈ వణుకుడు,ఈ రోమాలు నిక్కబొడుచుకోవడం...ఇవంతా నాకేమీ అర్థం కావడం లేదు.

Wednesday, 17 December 2025

కృపయా పరయాఽవిష్టో

కృపయా పరయాఽవిష్టో విషీద న్నిద మబ్రవీత్। అర్జున ఉవాచ.... దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్॥28॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... అర్జునుడి మనసు అంతా దిగులు అయిపోయింది.అటు చూసినా,ఇటు చూసినా...ఇంకెటు చూసినా అంతా తన వాళ్ళే కనిపిస్తున్నారు.తనపైన తనకే జాలి వేస్తుంది.కదిలిస్తే కళ్ళనీళ్ళు వచ్చేలా ఉన్నాయి ఏ క్షణమైనా! గద్గదమైన గొంతుతో శ్రీకృష్ణుడిని ఉద్దేశించి అంటున్నాడు.కృష్ణా!మాథవా!మథుసూదనా!నీవు కూడా చూస్తున్నావు కదా!యుద్థభూమికి సన్నద్ధమై వచ్చినవాళ్ళందరూ మనవాళ్ళే!మన బంథుజనమే!

తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః

తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితృూనథ పితామహాన్। ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృూన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం స్తథా॥26॥1॥ శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయో రుభయోరపి। తాన్ సమీక్షస కౌంతేయ స్సర్వాన్ బంధూ నవస్థితాన్॥27॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... సంజయుడు ధృతరాష్రుడికి అర్జునుడి మానసిక పరిస్థితి వివరిస్తున్నాడు.రాజా!అర్జునుడికి తెలియక కాదు.కానీ అర్జునుడు ఖంగుతినినట్లు కనిపించాడు.దానికి కారణం చెపుతాను,విను. అర్జునుడు రెండు సేనల మధ్యకు తన రథాన్ని నిలపమని శ్రీకృష్ణుడిని కోరాడు.శ్రీకృష్ణుడు అలాగే చేసాడు కూడా.అర్జునుడు తల తిప్పి చుట్టూరా చూసాడు.రెండు సేనలలోనూ ఉన్నది వీరులు,శూరులే!కానీ వాళ్ళంతా తన తండ్రులు,తాతలు,గురువులు,మేనమామలు,సోదరులు,కుమారులు,మనుమలు,స్నేహితులు,హితులు,బావలు,బావమరుదులు...।ఇలా అందరూ తన వాళ్ళే. అర్జునుడికి ఒక్కసారిగా తల తిరిగి పోయింది.శత్రు పక్షం,తన పక్షంలోనూ అందరూ తనవాళ్ళే,తనకు కావలసిన వాళ్ళే!ఇలాంటి దుస్థితి పగవాడికి కూడా రాకూడదు. శత్రువులతో ఎంతైనా పోరాడవచ్చు.మనవాళ్ళే శత్రువులు అయితే..।।ఆ బాథ వర్ణనాతీతం!

Tuesday, 16 December 2025

భీష్మ ద్రోణ ప్రముఖతః

భీష్మ ద్రోణ ప్రముఖత స్సర్వేషాం చ మహీక్షితామ్। ఉవాచ పార్థ పశైతాన్ సమవేతాన్ కురూనితి॥25॥1॥ శ్రీమద్భగవద్గీత....అర్జున విషాద యోగము... సంజయుడు ధృతరాష్ట్రుడికి కృష్ణార్జునుల వ్యవహారం వివరిస్తున్నాడు.రాజా!శ్రీకృష్ణుడు అర్జునుడి కోరిక మేర రథాన్ని రెండు సేనల మధ్యకు తీసుకుని వచ్చి నిలబెట్టాడు.అదీ ఎలా అంటే భీష్మ పితామహుడు,ద్రోణుడు మొదలైన మహావీరులు,యోథులకు అభిముఖంగా!శ్రీకృష్ణుడు తన సహచరుడు అయిన అర్జునుడిని ఉద్దేశించి అంటున్నాడు. అర్జునా!నీవు చెప్పినచ్లే నేను మన రథాన్ని రెండు సేనల మధ్య నిలిపాను.నీవు కౌరవ వీరులు ఎవరెవరు ఉన్నారో చూడాలి,గమనించాలి,వాళ్ళ బలాబలాలు బేరీజు వేయాలి అన్నావు కదా!కౌరవ కూటమిలో ఉండే అందరినీ పరికించి,పరిశీలించు,ఒక లెక్క వేసుకో ఎవరెవరి సత్తా ఎంతో అని.

Monday, 15 December 2025

ఏవ ముక్తో హృషీకేశో

సంజయ ఉవాచ.... ఏవ ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత। సేనయో రుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్॥24॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము.... సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధభూమిలో జరిగేది కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తున్నాడు.ఓ రాజా!అర్జునుడు శ్రీ కృష్ణుడిని చిన్న కోరిక అడిగాడు.ఎంతైనా బావమరిది కదా!చెల్లెలును ఇచ్చి చేశా!తప్పుతుందా!చిన్ని చిన్ని కోర్కెలు కూడా తీర్చక పోతే ఎలా? శ్రీకృష్ణుడు అర్జునుడు అడగగానే సరే బావా అంటూ గుర్రాలను ముందుకు పోనిచ్చాడు.వాళ్ళ రథాన్ని రెండు సేనల మథ్యకు తీసుకుని వచ్చి,నిలబెట్టాడు.

Sunday, 14 December 2025

హృషీకేశం తదా వాక్యం

హృషీకేశం తదా వాక్యం ఇదమహ మహీపతే। అర్జున ఉవాచ.... సేనయో రుభయో ర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత॥21॥1॥ యవదేతా న్నిరీక్షేఽహం యోద్ధుకామా నవస్థితాన్। కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణ సముద్యమే॥22॥ యోత్సమానా నవేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః। ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే ర్యుద్థే ప్రియచికీర్షవః॥23॥1॥ అర్జునుడికి ఆదుర్దాగా ఉంది.పెద్ద యోథుడు కదా!అతనికి ఇవంతా కొత్త కాదు.కానీ చెప్పలేని ఏదో అలజడి. అర్జునుడు ఒక రకంగా సమయాన్ని కొనాలనుకుంటున్నాడు.అంటే జాప్యం చేయాలని అనుకుంటున్నాడు.అందుకనే శ్రీకృష్ణుడితో ఇలా మాట్లాడు తున్నాడు. హే యాదవా!హే కృష్ణా!మన రథాన్ని రెండు సేనల మథ్య నిలబెట్టు.దుర్యోధనుడు అసలే దుష్టబుద్ధి.అతని మాటలు నమ్మి,అతనికి సహాయంగా యుద్ధంలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేదానికి సంసిద్ధత చూపించిన వీరులను చూడాలని ఉంది,దగ్గరగా!వారంతా యుద్ధం కోసం ఉవ్విళ్ళూరుతున్నట్టుగా ఉంది. మనము ఒక ప్రణాళిక వేసుకోవాలి కదా!మనలోని ఏ ఏ వీరులు,వారి పక్షం లోని ఏ ఏ వీరులతో యుద్ధం చేయాలిఅనే విషయంగా.కాబట్టి వాళ్ళందరినీ ఒక్కసారి దగ్గరగా చూడాలని ఉంది.అది మనం రెండు సేనల మథ్యలోకి వెళితేనే కదా సాథ్యం అయ్యేది.

Saturday, 13 December 2025

అథ వ్యవస్థితాన్ దృష్ట్వా

అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః। ప్రవృత్తే శస్త్ర సంపాతే ధను రుద్యమ్య పాండవః॥29॥1॥ శ్రీమద్భగవద్గీత..।అర్జున విషాద యోగము... సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు.ఓ రాజా!పాండవులు పూరించిన శంఖనాదాలు భూమి ఆకాశాలు ప్రకంపించేలా చేసాయి.అప్పుడు అర్జునుడు కౌరవులను చూసాడు.అర్జునుడి ధ్వజము పైన హనుమంతుడు విరాజిల్లుతూ ఉన్నాడు.హనుమంతుడు అపారమయిన శక్తికి ,ధైర్యానికి,భయ విచ్ఛేదనకు ప్రతీక కదా!అర్జునుడు తన శస్త్రాలనూ,ధనుస్సునూ ధరించాడు.శ్రీకృష్ణుని తట్టు మళ్ళి ఇలా అన్నాడు.

స ఘోషో ధార్తరాష్ట్రాణాం

స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్। నభశ్చ పృథివీం చైవ తుములో ప్యనునాదయన్॥19॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము.... సంజయుడు వర్ణిస్తున్నాడు.ఆ వర్ణనకు ధృతరాష్ట్రుడికి చెమటలు పడుతున్నాయి. రాజా!చెప్పాను కదా పాండవులు,వారి తరఫు యోథులు అందరూ తమ తమ శంఖాలను దిక్కులు పిక్కటిల్లేలా పూరించారు అని.ఆ ఘోష,ఆ శబ్దం కౌరవులను,వారి సేనల గుండెలను చీలుస్తున్నట్లు ఉంది.కౌరవ పక్షం వారందరూ లోలోపల భీతి చెందారు.ఆ శబ్దం భూమ్యాకాశాలను నిండిపోయింది.అంతేనా!ప్రతిధ్వనించింది కూడా! యుద్ధంలో శత్రువుని భయపెట్టడం ఒక ప్రక్రియ.దానిలో పాండవులు ఉత్తీర్ణులు అయ్యారు.పదాతిదళాలను భయపెడితే సగం యుద్ధం గెలిచినట్లే!వాళ్ళ మనోధైర్యానికి బీటలు వారితే ఇంక మనకు తిరుగు ఉండదు.

Thursday, 11 December 2025

ద్రుపదో ద్రౌపదేయాశ్చ

ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే। సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్॥18॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు.ద్రుపదుడు,ద్రౌపది కొడుకులు అయిన అయిదుగురు ఉపపాండవులు,మిగిలిన చాలా మంది రాజులు ఉన్నారు యుద్ధ భూమిలో.యోధాగ్రేసరుడు అయిన సుభద్ర కొడుకు అభిమన్యుడు, పైన చెప్పిన రాజులు,వీరులు అందరూ తమ తమ శంఖాలను మళ్ళీ మళ్ళీ చాల సార్లు పూరించారు.యుద్ధం ఏ క్షణం అయినా మొదలు కావచ్చు.కాబట్టీ యుద్ధ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరూ తమను తమను తాము ఉత్తేజ పరుచుకుంటూ,తమ వారిని అందరినీ ఊపూ,ఉత్సాహంతో ముందుకు ఉరికేలా ప్రేరేపించుకుంటూ ఉన్నారు.

Tuesday, 9 December 2025

కాశ్యశ్చ పరమేష్వాస

కాశ్యశ్చ పరమేష్వాస శ్శిఖండీ చ మహారథః। ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకి శ్చాపరాజితః॥17॥1॥ శ్రీమద్భగవద్గీత....అర్జున విషాద యోగము పాండవ పక్షాన పాండవులు ఒక్కరే కాదు,ఇంకా చాలా మంది మహారథులు ఉన్నారు.వారిలో మేటి విలుకాడు అయిన కాశీరాజు ఉన్నాడు.మహారధి అయిన శిఖండి ఉన్నాడు.ఓడి పోవడము అనే పదానికి కూడా అర్థం తెలియని మహావీరులు ధృష్టద్యుమ్నుడు,విరాటరాజు మిసు సాత్యకి ఉన్నారు.వీరందరూ మిగిలిన వీరులతో కలసి తమ శంఖాలను పూరించారు.

Monday, 8 December 2025

అనంత విజయం రాజా

అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠరః। నకులః సహదేవశ్చ సుఘోష మణి పుష్పకౌ॥16॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము.. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు.అతను పక్షపాతం లేకుండా ఇరు సైన్యాల గురించి,అక్కడ జరిగే కథా,కమామిషు గురించి సవివరంగా తెలియ చేసేదానికే కదా నియమించబడింది. పాండవుల పక్షాన రాజు,కుంతీ పుత్రుడు అయిన యుధిష్ఠరుడు దివ్యమయిన తన అనంత విజయము అనే శంఖాన్ని పూరించాడు.వెను వెంటనే నకులుడు సుఘోషము అనే శంఖాన్ని,సహదేవుడు మణిపుష్పకము అనే శంఖాన్ని పూరించారు మంగళప్రదంగా,

Sunday, 7 December 2025

పాంచజన్యం హృషీకేశో

పాంచజన్యం హృషీ కేశో దేవదత్తం ధనంజయః। పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః॥15॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... శ్రీకృష్ణార్జునులు తమ తమ దివ్య శంఖాలను పూరించారు.ఆ శంఖాలకు కూడా పేర్లు ఉన్నాయి.అవి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు.శ్రీకృష్ణుడు తన పాంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు. అలాగే అర్జునుడు తన దేవదత్తమనే శంఖాన్ని పూరించాడు.భీముడికి వృకోదరుడు అనే ఇంకో పేరు కూడా ఉంది.వృకోదరుడు అంటే తోడేలు లాంటి పొట్టగలవాడు అని అర్థం.తోడేలుకు ఆకలి ఎక్కువ.ఎంత తిన్నా క్షణంలో అరుగుతుంది.పొట్టకూడా పల్చగా ఉంటుంది.ఇది మంచి శక్తిని సూచిస్తుంది. భీముడు తనది అయిన పౌండ్రం అనే శంఖాన్ని భయంకరమైన శబ్దం వచ్చేలా పూరించాడు.ఆ ఘోషకు నలుదిక్కులూ వణకాల్సిందే,ఖచ్చితంగా!

Friday, 5 December 2025

తతః శ్శ్వేతైర్హయైర్యుక్తే

తతః శ్శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ। మాథవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః॥14॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... కౌరవులు తమ తమ శంఖాలను పూరించిన తరవాత పాండవ పక్షంలో మొదలు అయింది.శ్రీకృష్ణార్జునులు తెల్లటి అశ్వాలను పూన్చిన రథం మీద ఉన్నారు.ఆ బావా బావమరుదులు ఇద్దరూ ఒకే సారి తమ దివ్యమయిన శంఖాలను పూరించారు.ఒళ్ళు పులకరించే దృశ్యం కదా!ఎవరికైనా వాళ్ళిదరినీ జంటగా అలా చూడటం,చూడగలగటం!

తతః శ్శంఖాశ్చ భేరశ్చ

తతః శ్శంఖాశ్చ భేరశ్చ పణవానక గోముఖాః। సహసై వా భ్యహన్యంత స శబ్ద స్తుములోఽభవత్॥13॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... భీష్ముడు దుర్యోధనుడిని సంతోష పెట్టేదానికే కాదు,తమ సైన్యాన్ని ఉత్తేజ పరిచేదానికి కూడా సింహనాదం చేసి,తన శంఖాన్ని పూరించాడు. ఎప్పుడూ ఒక సమూహంలో నాయకుడు ఏ భావాన్ని ప్రకటిస్తాడో,అతనిని అనుసరించేవాళ్ళు అందరూ అదే భావప్రకటనలోకి వెళ్ళిపోతారు.ఎవరికివారు ఆలోచించుకోరు,ఆలోచించలేరు,ఆలోచించనివ్వరు,అంత సమయం,సందర్భం,స్వేచ్ఛ కూడా ఇవ్వరు,ఉండదు.అందుకనే గొర్రెదాటు అంటారు.మన ముందు వాళ్ళు చేస్తున్నారని మనము స్పందిస్తాము.మనలని చూసి మన చుట్టు పక్కల వాళ్ళు ఇంకో పది మంది మనలాగే చేస్తారు,ప్రభావితులు అవుతారు.ఇలాగే గొలుసు ప్రభావంలాగా సాగిపోతుంది. ఇక్కడ కూడా అది వినిన కౌరవ వీరులందరూ తమ తమ శంఖాలను పూరించారు.భేరీ,పణవానక,గోముఖాదులను మ్రోగించారు.ఆ శబ్దం,ఆ హోరుతో నాలుగు దిక్కులూ నిండిపోయాయి.ఇలా ఒకరినొకరుగా అందరూ ఉత్తేజం నింపుకున్నారు.

Wednesday, 3 December 2025

తస్య సంజనయన్ హర్షం

తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః। సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్॥12॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము పొగడ్తలకు లొంగని వాళ్ళు,పొంగని వాళ్ళు ఈ భూప్రపంచంలో ఎవరూ ఉండరు.దానికి ఎవరం అతీతులం కాదు. దుర్యోధనుడు భీష్ముడు మన నాయకుడు,అందరం కలసి ఆయనను రక్షించుకోవాలి అనగానే మనసు హాయిగా అయింది.ఎప్పుడైనా ఇచ్చుకోమ్మా వాయనం అంటే పుచ్చుకోమ్మా వాయనం అంటారు కదా! అట్లాగే దుర్యోధనుడు తనను సంతోషపెట్టాడు కాబట్టి తను కూడా దుర్యోధనుడికి సంతోషం కలుగచేయాలనుకున్నాడు.అందుకని సింహనాదం చేసాడు.నలు దిక్కులు పిక్కటిల్లేలాగా భీష్ముడు తన శంఖాన్ని పూరించాడు.

Tuesday, 2 December 2025

అయనేషు చ సర్వేషు

అయనేషు చ సర్వేషు యథాభాగ మవస్థితాః। భీష్మ మేవాభి రక్షంతు భవంత స్సర్వ ఏవ హి॥11॥1॥ శ్రీమద్భగవద్గీత....అర్జున విషాద యోగము... దుర్యోధనుడు ముక్తాయింపుగా తమ వైపు వారు అందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు.ఇప్పుడు అందరికీ విషయం అర్థం అయింది కదా!మనవైపు వీరులు ఎక్కువ మంది ఉన్నారు.మనవైపు ఎక్కువ అక్షోహిణుల సైన్యం ఉంది.కాబట్టి మనకే గెలుపు అవకాశాలు ఎక్కువ.అలా అని ప్రత్యర్థి బలాలు మనము తక్కువ అంచనా వేయకూడదు. కాబట్టి మన పక్షాన ఉన్న మీరందరూ కూడా మీ మీ నిర్ణీత స్థానాలలో అప్రమత్తంగా ఉండండి.అసలు మీకు కేటాయించబడిన ప్రదేశాలను విడవకుండా జాగరూకతతో ఉండండి.మనకందరికీ నాయకుడు వృద్ధ పితామహుడు భీష్ముడు.అతనికి అన్ని వైపుల నుంచి రక్షణ కవచంలా ఉండి కాపాడటం మీ ధర్మం!

అపర్యాప్తం తదస్మాకం

అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం। పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్॥10॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము.. దుర్యోధనుడు ధైర్యంగా చెబుతున్నాడు.గురుపుంగవా!మన సైన్యం భీష్ముడుచే రక్షింపబడుతూ ఉంది.మన సైన్యం అపరిమితంగా ఉంది.పాండవ సైన్యం భీముడి సంరక్షణలో ఉంది.వారిది పరిమితమైన సైన్యము. నిజమే!కౌరవుల దగ్గర పదకొండు అక్షౌహిణుల సైన్యం ఉంది.పాండవుల తట్టు ఏడు అక్షౌహిణుల సైన్యం ఉంది.

Monday, 1 December 2025

అన్యేచ బహవశ్శూరాః

అన్యే చ బహవ శ్శూరాః మదర్థే త్యక్త జీవితాః। నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః॥9॥1॥ శ్రీమద్భగవద్గీత..అర్జున విషాద యోగము... దుర్యోధనుడు తన తరఫున యుద్ధానికి సన్నధులు అయిన వీరుల గురించి ఇంకా ఇలా చెబుతున్నాడు.మహనీయులైన ద్రోణాచార్యా!నేను ఉటంకించిన వారు ఒక్క వీరులే కాదు.నా కోసరము తమ తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టగల సమర్థులు.అందరూ అస్త్ర శస్త్ర విద్యలలో నిష్ణాతులు.వీరే కాకుండా ఇంకా చాలా మంది శూరులు యుద్ధ విద్యా విశారదులు మన తరఫున మన వైపు ఉన్నారు.