Sunday, 22 March 2026

నాస్తి బుద్ధి రయుక్తస్య

నాస్తి బుద్ధి రయుక్తస్య న చా యుక్తస్య భావనా। న చా భావయత శ్శాంతి రశాంతస్య కుత స్సుఖమ్॥66॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు చెట్టును ఇంకో తట్టునుంచి నరుక్కొస్తున్నాడు.అర్జునా!ఇప్పుడు నేను చెప్పింది ఏమైనా అర్థమైందా?నేను దానినే ఇంకో రకంగా చెబుతాను విను.మనిషిని బలహీన పరిచేవి ఇంద్రియాలు కదా!కనిపించిందంతా కావాలంటాయి.ఇష్టం లేకపోతే వాటి ఉనికి,ఊసూ మన ముందరకు రాకూడదు అనిపిస్తుంది.కాబట్టి ముందుగా ఇంద్రియాలను మన గుప్పెట్లో పెట్టుకోవాలి.ఇష్టమయినవి దక్కాయి అని భాంగ్రా నృత్యం చేయకూడదు.ఇష్టం లేని వాటిని భరించలేమని అఘాయిత్యం చేయకూడదు.అలా మనలను మనం నియంత్రించుకోలేక పోతే స్థిర బుద్ధి ఎక్కడ నుంచి వస్తుంది చెప్పు?స్థిర బుద్ధి లేకపోతే ఆత్మ వివేకము ఎక్కడ నుంచి వస్తుంది?పరమార్థ చింతన,అదే భగవంతుడి పైన ధ్యాస,ఎక్కడ నుంచి వస్తాయి మనకు?ఈ రెండూ లేని వాడికి శాంతి అనేది అందని ద్రాక్ష పండులాగే కదా!శాంతి అనే పదానికే దిక్కూ దివాణం లేకపోతే సుఖమెలా దక్కుతుంది?సుఖం అనే పదము సుదూర తీరాలకు ప్రయాణమై పోతుంది.

ప్రసాదే సర్వదుఃఖానాం

ప్రసాదే సర్వదుఃఖానాం హాని రస్యో పజాయతే। ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతి॥65॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!సఖా!సూక్ష్మంలో మోక్షం అంటారు కదా!ఇది అదే!మనము మన మనసును నిర్మలంగా పెట్టుకోగలిగితే చాలు.చిక్కు ముడి విప్పినట్లు అన్ని సమస్యలూ వాటంతట అవే సర్దుకుంటాయి.మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది చెప్పు?కోపాలూ,కాపాలూ లేనప్పుడు.ఆశలూ,అసహనాలూ,అసంతృప్తులూ లేనప్పుడు.అంతే కదా!మనసు నిర్మలంగా ఉంటే సుఖదుఃఖాలు ఉండవు.నశిస్తాయి.ఎగిరెగిరీ పడబళ్ళేదు.అథఃపాతాళానికీ కృంగిపోబళ్ళేదు కనుక.అలాంటి వాడి బుద్ధి త్వరగా నిశ్చలత్త్వాన్ని పొందుతుంది.దీనికి ఢోకా లేదు.

Saturday, 21 March 2026

రాగద్వేష వియుక్తైస్తు

రాగద్వేష వియుక్తైస్తు విషయా నింద్రియై శ్చరన్। ఆత్మవశ్యై ర్విధేయాత్మా ప్రసాద మధిగచ్ఛతి॥64॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓపికగా చిలకకి చెప్పినట్లు చెబుతున్నాడు.అర్జునా!మన వ్యవహారం ఎలా ఉండాలో చెప్పేదా?తామరాకు పైన నీటిబొట్టులాగ ఉండాలి.అంటే నీటి బొట్టు తామరాకు పైన ఉన్నా దానిని నిజంగా అతుక్కుని ఉండదు.సన్నని,పల్చని మైనపు పొర ఆకు పైన ఉంటుంది.దాని వలన నీటి బిందువు స్వేచ్ఛగా,స్వచ్ఛంగా ఆకు మీద ఎలా అయినా కదులుతుంది.అలానే మనం కూడా విషయాలను అనుభవిస్తున్నా,కర్మలను ఆచరిస్తున్నా రాగద్వేషాలకు అతీతంగా మసలుకోవాలి.ఇంద్రియ నిగ్రహం ఎప్పుడూ కోల్పోకుండా ఉండాలి.అప్పుడే మనము మన మనసును మన ఆధీనంలో ఉంచుకోగలము.మన మనసు ఎప్పుడు మన స్వాధీనంలో ఉంటుందో,అప్పుడే మనము నిర్మల మనస్కులము కాగలము.లేక పోతే పట్టుకోండి చూద్దాం అన్నట్లు ఎండమావుల వెంట పరుగులు తీస్తూ ఉంటాము.

క్రోధా ద్భవతి సమ్మోహః

క్రోధా ద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః। స్మృతిభ్రంశా ద్బుద్ధినాశో బుద్ధినాశా త్ప్రణశ్యతి॥63॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు తన చెలికాడు అయిన అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!చెలికాడా!నీకు శృంఖల చర్య,అదే గొలుసు కట్టు చర్య అంటే తెలుసు కదా!ఒక పని మొదలు పెడితే అక్కడితో ఆగకుండా,మన ప్రమేయం లేకుండానే,మనకు ఊపిరి పీల్చుకునే అవథి కూడా ఇవ్వకుండా వెనువెంటనే జరిగి పోతుంటాయి కొన్ని పనులు.మనము నిర్ఘాంతపడి చూస్తూ ఉండాల్సిందే.ఎందుకంటే ఆ పరిణామాలను మనము ఆపలేము.ఇక్కడ నేను చెప్పబోయేది అదే.మనకు కోపం వస్తుంది.దాంట్లో ఆశ్చర్యం ఏముంది?మామూలే కదా!మనిషి అన్నాక ఆ మాత్రం కోపతాపాలు ఉండవా?అని మనలని మనం సమర్థించుకుంటాము.ఇదే మనము చేసే మొదటి తప్పు.ఎందుకంటే కోపం వస్తే మనము విచక్షణాజ్ఞానాన్ని కోల్పోతాము.విచక్షణ లేదు అంటే ముచ్చటగా అవివేకమనే కదా అర్థం!ఒకటి కొంటే ఒకటి ఉచితం కాదు.ఒకటి కొంటే పది ఉచితం లాగా కలుపుకుని వస్తాయి ఇక్కడ.ఎందుకంటే అవివేకంతో పాటు స్మృతిభ్రంశం అంటుకుంటుంది.అంటే మతి మరుపు.ఇంతకు ముందు మనము నేర్చుకున్న మంచి చెడ్డా,పెద్దా చిన్నా,తప్పూ ఒప్పూ అన్నీ చిటికెలో మాయమవుతాయి.దీని పర్యవశానం ఏందంటే బుద్ది చెడుతుంది.చెడ్డ ఆలోచనలు,చెడ్జ తలపులు,చెడ్డ పనులకు మొగ్గు చూపుతాము.ఒకసారి సద్బుద్ధిని కోపమనే చెదపురుగు తొలిచిందనుకో,ఇంకేముంది?సర్వం నాశనమే!పురుషుడు అథోగతికి జారిపోతాడు.

Friday, 20 March 2026

ధ్యాయతో విషయాన్ పుంసః

ధ్యాయతో విషయాన్ పుంస స్సంగస్తేషూప జాయతే। సంగా త్సంజాయతే కామః కామాత్ క్రోధోఽభి జాయతే॥62॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి విడమరిచి చెబుతున్నాడు.కౌంతేయా!కిటుకు అంతా ఇంద్రియ నిగ్రహంలోనే ఉంది.ఎందుకంటవా?మామూలుగా మనిషి ఇంద్రియాల సహాయంతోటే అన్ని విషయాల పైన ఆసక్తి,అనురాగం,మోహం,కామం పెంచుకుంటాడు.మనము కోరుకున్నది దక్కకపోతే అసహనం,అసంతృప్తి,చివరకు కోపం,క్రోథం ...వీటికి లోనయి,బానిసలం అవుతాము.ఆ చిక్కుముడి నుంచి బయట పడలేము.అక్కడక్కడే గింగిరాలు తిరుగుతుంటాము.

తాని సర్వాణి సంయమ్య

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీతమత్పరః। వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥61॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!మనము చెయ్యాల్సిన పని ఏందో చెప్పనా?మనము ముందర ఈ ఇంద్రియాలను మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి.అవి ఆడమన్నట్లు మనం ఆడకూడదు.అలుసు అయిపోతాము.ఎల్లప్పుడూ మన ఆసక్తి అంతా ఆత్మ పైనే ఉండాలి.అట్లా ఎవరు అయితే వాళ్ళ ఇంద్రియాలను తమ గుప్పెట్లో పెట్టుకుంటారో,వారి బుద్ధి మాత్రమే స్థిరంగా ఉంటుంది.అసలు నిగ్రహమే లేని వారికి స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తుంది?గాలి ఎటు మళ్ళితే అటు పోతుంటారు.

Thursday, 19 March 2026

యతతో హ్యపి కౌంతేయ

యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః। ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః॥60॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ ప్రక్రియ ఎంత కష్టమో చెపుతున్నాడు.అర్జునా!హే కుంతీపుత్రా!నేను చెప్పేది ఆచరణలో పెట్టడం అనేది అంత సులువు కాదు.నిజం చెప్పాలంటే చాలా కష్టమే!ఎంత ప్రజ్ఞా పాటవాలు ఉన్నా,ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి పప్పులో కాలేస్తాము.ఎందుకంటే మనసును నియంత్రించడం మన చేతిలో లేదు.మెదడు వద్దన్నా మనసు కావాలంటుంది.ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అనేది చాలా కష్టతరమయిన క్రియ.మన మనసును చంచల పరచి,వ్యాకుల పరుస్తాయి.మన మనశ్శాంతిని హరించేస్తాయి.తప్పు అని తెలిసినా నియంత్రించలేము.ఆ కర్మలు తప్పు అనే అవగాహనే లేని వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకో!ఈ కోరికలు మనల్ని ఒకచోట కుదురుగా నిలబడనీయవు,కూర్చోనీయవు.

విషయా వినివర్తంతే

విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః। రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే॥59॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!మానవుడు వాంఛలకు దూరంగా ఉండాలి అని అన్నాను కదా!దాని వలన సగము పనే అవుతుంది.అంటే కోరికలను ఆపుకోవడము,వాటిని త్రుంచివేయడము,దూరంగా ఉండడం అనే ప్రక్రియల వలన విషయదూరుడవుతాడు,అంతే.కానీ ఆ వాసనాబలం అంత తొందరగా పోదు.బాహ్యంగా లేక బాహాటంగా ఆ కర్మలు లేక విషయాల జోలికి పోకపోయినా మనసులోనుంచి పూర్తిగా చెరిగిపోవు.వాటి ఆలోచనలు,వాటిపైన ఇచ్ఛ అనేది తొలుస్తూ ఉంటుంది,కనీసం అప్పుడప్పుడైనా.ఆ ముద్రలు అంత సులభంగా చెరగిపోవు.వీటినే వాసనలు అంటారు.మనము ఆ పరమాత్మను వీక్షించ గలిగినపుడు మటుకే ఈ వాసనాబలం పూర్తిగా తొలగిపోతుంది.మనము స్వచ్ఛముగా తయారు అవుతాము.ఆ పరాత్పరుడిని చూడగలగాలంటే నమ్మకము,దీక్ష,భక్తి,అంకితభావము...అన్నీ నిండుగా,మెండుగా ఉండాలి మనలో.

Wednesday, 18 March 2026

యదా సంహరతే చాయం

యదా సంహరతే చాయం కుర్మోఽంగానీవ సర్వశః। ఇంద్రియా ణీంద్రియార్థేభ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥58॥2॥ శ్రీమద్భగవద్గీత..సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడికి ఏమూలనో కొంచెం అనుమానంగా ఉంది.తను చెప్పేది అర్జునుడికి సరిగ్గా అర్థం కావడం లేదేమో అని.అందుకని సోదాహరణంగా చెప్పాలని తీర్మానించుకున్నట్లు ఉన్నాడు.అర్జునా!నీకు తెలుసు కదా!తాబేలు ఎట్లుంటుంది?అస్తమానమూ ఏమి చేస్తుంది?తన శరీర అవయవాలన్నిటినీ తన లోపలకు ముడుచుకుని కూర్చుని ఉంటుంది కదా!మనము కూడా ఇంచుమించుగా అలాగే ఉండేదానికి ప్రయత్నించాలి.ఎందుకు?ఏమిటి?ఎలా?అని అంటావా?చెబుతాను విను.మనము మన ఇంద్రియాలను విషయాలనుంచి మరల్చాలి.వాటిని మన ఆథీనంలో ఉంచుకోవాలి.ఈ ఇంద్రియాలను పకడ్బందీగా మన వశంలో ఉంచుకోకపోతే వ్యవహారం అంతా తీన్ తార్ అవుతుంది.మన బుద్ధి స్ధిరంగా ఉండాలంటే ఇవన్నీ తప్పని సరి.దగ్గరి మార్గాలు ఎప్పుడూ సత్ఫలితాలు ఇవ్వవు ఎక్కవ కాలం.మనము ప్రతిదీ క్షుణ్ణంగా అభ్యసించాలి.వేరే దారి లేదు.

య స్సర్వత్రానభిస్నేహః

య స్సర్వత్రానభిస్నేహస్తత్త త్ప్రాప్య శుభాశుభమ్। నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా॥57॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి స్థిత ప్రజ్ఞత గురించి ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!మనకు దేని పైనా కోరికలు ఉండకూడదు.మనకు జరిగే మంచి చెడులను సమానంగా స్వీకరించాలి.తేడా చూపించకూడదు.ఎందుకంటావా?కర్తవ్యం మటుకే మనము చేయాల్సినది.దాని ఫలితం మనకు అనవసరము.అక్కరలేదు.ఆనందం దుఃఖం అనే భావాలకూ,భావనలకు అతీతంగా ఉండాలి.ఎవ్వడు అయితే పైన పేర్కొన్న విథంగా ఉంటాడో వాడి బుద్ధియే సుప్రతిష్టమయినది.ఆస్థితికి మనము చేరుకోగలిగితే మనలను తలదన్నేవాడు ఉండడు.మనము ఉత్కృష్టమయిన స్థానంలో ఉన్నట్లు లెక్క.

దుఃఖే ష్వనుద్విగ్నమనాః

దుఃఖే ష్వనుద్విగ్నమనా స్సుఖేషు విగతస్పృహః। వీతరాగ భయక్రోధః స్థితధీ ర్ముని రుచ్యతే॥56॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడికి తన సఖుడి స్థితి,దుస్థితి చూస్తుంటే చాలా బాథగా ఉంది.తన సాయశక్తులా పోరాడుతున్నాడు అర్జునుడిని ఆ పరిస్థితి నుంచి బయటపడేసేదానికి.అర్జునా!స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అనే కదా నీ ప్రశ్న?నేను చెబుతున్నాను,విను.దుఃఖాలకు,కష్టాలకూ దిగులు పడకూడదు.కలత పడకూడదు.సుఖాలు తలుపు తడితే పరవశం పొందకూడదు.రెండింటినీ సమానంగా స్వీకరించగలగటం నేర్చుకోవాలి.తెలుసుకోవాలి.ఈ ప్రేమలు,ద్వేషాలూ,భయాలూ,బరువులు,కోపాలూ,తాపాలూ ..వీటన్నిటినీ ప్రక్కకు పెట్టేయాలి.అహాఁ!అసలు టోకుగా వదిలేయాలి.ఝంఝాటకాలు అస్సలు ఉండకూడదు.ఈ ప్రలోభాలన్నిటికీ ప్రభావితం కానివాడే స్థిత ప్రజ్ఞుడు అని అంటారు.ఇదంతా నేను చెప్పటం కాదు.గొప్ప గొప్ప మహనీయులు,మునులు చెప్పే మాట.

Monday, 16 March 2026

ప్రజహాతి యదా కామాన్

శ్రీ భగవానువాచ.... ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్। ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞ స్తదోచ్యతే॥54॥2॥ శ్రీమద్భగవద్గీత..సాంఖ్య యోగము... మనల్ని ఎవరైనా ఏమన్నా అడిగితే వెంటనే సమాథానం చెప్పేస్తాము.తప్పో ఒప్పో,తరువాతి విషయం.అందులో శ్రీకృష్ణుడు భగవంతుడు,సర్వాంతర్యామి.అతనికి ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలకు సమాథానం చెప్పడం ఒక లెఖ్ఖా?మనం అడగాలి గానీ.శ్రీకృష్ణుడికి ఒకటి అర్థం అయింది.అర్జునుడికి జిజ్ఞాస పెరిగింది.తను చెప్పింది అర్థం చేసుకోవాలనే తపన మొదలు అయింది.అదే జ్ఞానోపాసనకు అంకురార్పణ అని కృష్ణుడు చాలా సంతోషించాడు.చెప్పడం మొదలు పెట్టాడు.అర్జునా!పార్థా!ఈ రోజు నీ అనుమానాలు అన్నీ ఓపికగా తీరుస్తాను.స్థిత ప్రజ్ఞుడు ఎవరు అని కదా నీ మీమాంస?మొదట సర్వవాంఛలనూ విసర్జించాలి.అంటే కోరికలనన్నిటినీ వదలి పెట్టాలి.ఆత్మయందే తాను ఆనందిస్తూ ఉండాలి. సముద్రము తీరం దగ్గర అలలు వస్తుంటాయి ఎప్పుడూ.అదే లోపలికి,ముందుకు పోయేకొద్దీ నిర్మలంగా ఉంటుంది.ఆటూ పోట్లూ కనిపించవు.అలా మనసును ప్రశాంతంగా పెట్టుకోగలగాలి.అలా ఉండగలిగిన వాడినే స్థిత ప్రజ్ఞుడు అను అంటారు.

స్థితప్రజ్ఞస్య కా భాషా

అర్జున ఉవాచ... స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ। స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్॥54॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి చాలా చాలా క్రొత్త క్రొత్త విషయాలు ఒక్కసారే చెపుతున్నాడు కదా!అర్జునుడికి దిమ్మ తిరిగిపోతుంది.ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు.శ్రేయోభిలాషి కదా ఎంతైనా!చెప్పింది విందాము లే అనుకున్నాడు.కానీ మరీ ఇంతనా?ఒకసారి యోగము అంటాడు.వెంటనే మోక్షము అంటాడు.ఊపిరి పీల్చుకునే లోపల సమన్వయం అంటాడు.కర్మ సిద్ధాంతం అంటాడు.పిచ్చి పట్టి పోతుంది.జుట్టు పీక్కోవటం మటుకే మిగిలింది.ఇట్లా అయ్యేది కాదు అని అర్జునుడు గొంతు సవరించుకుని చిన్నగా అడగడం మొదలుపెట్టాడు. హే కృష్ణా!హే సఖా!నీవు ఏందేందో చెబుతున్నావు.ఒక్క ముక్క కూడా అవగతం కావటంలేదు.ఈ స్థిత ప్రజ్ఞుడు ఎవరు?ఎక్కడినుంచి వచ్చాడు?అతడు ఎట్లా మాట్లాడతాడు?అతని గుణగణాలేంది?లక్షణాలు ఏంది?అతని స్థితిగతులు ఏంటి?అతను ఏమి చేస్తాడు?ఎట్లా కూర్చుంటాడు?ఎట్లా నిలుచుంటాడు?ఎలా ఉంటాడు?కొంచెం నాకు అర్థం అయ్యేలా చెప్పు స్వామీ!

Sunday, 15 March 2026

శ్రుతి విప్రతి పన్నాతే

శ్రుతి విప్రతి పన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా। సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి॥53॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!పొద్దున లేచి మనం ఏదో ఒకటి వింటుంటాము.అందులో కొన్నిటికి తీవ్రంగా స్పందిస్తాము.కొన్నిటికి ఒక మోస్తరుగా!కానీ స్పందించక మానము.దాని వలన మన మనసు చపలత పొందితుంది.ఇది కావాలి,అది వద్దు.దీనికి దగ్గర కావాలి,దానికి దూరం కావాలి.ఇంకో విషయం గురించి పలాయనం చిత్తగించాలి అనుకుంటాము.కానీ మన మనసు,బుద్ధి వీటన్నిటికంటే ఉన్నతంగా ఆలోచించాలి.స్థిత ప్రజ్ఞత ప్రదర్శించగలగాలి.స్థిరంగా,దేనికీ చలించకుండా,చిత్త చాంచల్యం చూపకుండా ఉండగలగాలి.అప్పుడే యోగాన్ని పొందగలతావు.యోగము అంటే ఓయమ్మో అని భయపడపనిలేదు.మనసును నిర్మలంగా ఉంచుకోగలగటమే,ఆటూపోటూ అనుకోకుండా.

యదా తే మోహకలిలం

యదా తే మోహ కలిలం బుద్ధి ర్వ్యతి తరిష్యతి। తదా గన్తాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ॥53॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి బుద్ధి కుశలత కొంచెం పెంచుకుంటే అన్ని విథాలా మంచిది అని సలహా ఇస్తున్నాడు.ఎంతైనా మిత్రుడు కదా!ఆ మాత్రం మంచీ చెడ్డా చెప్పకపోతే ఎలా? అర్జునా!నేను చెప్పినట్లు విను.ముందర ఈ మోహ పంకిలం,పాప పంకిలం నుంచి బయటపడు.అప్పుడుగానీ ఏదీ సరిగ్గా అర్థంకాదు నీకు.అసలైన దారి గోచరించదు.దాని నుంచి విడిపడినప్పుడే నీ బుద్ధిని పరిశుద్థం చేసుకోగలవు.ఇంక వేరే దగ్గర మార్గాలు లేవు.ఇప్పటికే విన్న విషయాలూ,ఇంక తదుపరి వినవలసిన విషయాలూ నుండీ బయటపడగలతావు.వైరాగ్యమనేది ఊరికే ఆషామాషీగా దక్కదు.మనకు గట్టిగా కావాలనుకున్నది ఒక్కటి దక్కకపోతేనే తీన్తార్ అవుతాము.అలాంటిది సర్వసంగ పరిత్యాగం అంటే మాటలు కాదు కదా!సతతం అభ్యాసం చేయాల్సిందే!దక్కేదాకా ఒక యజ్ఞం,దక్కిన తరువాత నిలబెట్టుకునే యత్నం.అర్థం అయిందా?

Thursday, 12 March 2026

కర్మజం బుద్ధియుక్తా హి

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః। జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్ఛ న్త్యనామయమ్॥51॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చిలకకు చెప్పినట్లు చెబుతున్నాడు ఓపిక నశించకుండా.రామ చిలకకు రెండు పలుకులు నేర్పించాలంటే ఎంత ఓపిక కావాలి?ఎంత ప్రేమ,సున్నితత్త్వంకావాలి?ఓర్పు,సహనం కావాలి.అవి అన్నీ కృష్ణుడు తనలో రంగరించుకుని అర్జునుడికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు. అర్జునా!నేను నీకు సమబుద్ధి అలవరించుకోమని చెప్పాను కదా?ఎందుకనుకుంటున్నావు?ఎందుకంటే సమబుద్ధి కలవాడు మొట్ట మొదటగా కర్మ ఫలాన్ని ముమ్మాటికీ ఆశించడు.దానికి ప్రతిఫలంగా జన్మబంధ విముక్తుడు అవుతాడు.చూసావా?ఏమీ కోరుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతే,వాటి సత్ఫలితాలు మన ముంగిట్లో వాలుతాయి.అట్లా కాకుండా ప్రతి కర్మకూ ఫలితం ఆశిస్తూ పరుగులు తీస్తే ఆయాసం,అలసట తప్ప ఇంకేమీ దక్కదు.ఒకసారి మనము జన్మ బంధ విముక్తులము అయ్యామంటే మోక్ష ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి.మనకు స్వాగత వచనాలు చెబుతాయి,ఆశీర్వాదాలు ఇస్తాయి.నా మాట నమ్ము.

Tuesday, 10 March 2026

బుద్ధి యుక్తో జహా తీహ

బుద్ధి యుక్తో జహా తీహ ఉభౌసుకృత దుష్కృతే। తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్॥50॥2॥ శ్రీమద్భగవద్గీత.।।సాంఖ్య యోగము... అర్జునుడికి కిటుకు చెబుతున్నాడు శ్రీకృష్ణుడు.అర్జునా!తెలివి గలవాడు ఏం చేస్తాడో నీకు తెలుసా?లెక్కలన్నీ ఎప్పటికప్పుడు చూసుకుని సమంచేసుకుంటాడు.సమబుద్ధి కలవాడు తన పాపపుణ్యాల లెక్కలను కూడా ఈ జన్మలోనే నశింపచేసుకుని జీవితమనే పలకను శుభ్రం చేసుకుంటాడు.ఎలాంటి అర్థం పర్థంలేని గీతలు ఉండకుండా.నా దృష్టిలో నువ్వు కూడా అలాంటి యోగాన్ని ఆశ్రయించి,అనుసరించి కర్మలను ఆచరిస్తే మంచిది అని నా అభిప్రాయం.నువ్వేమంటావు?

దూరేణ హ్యవరం కర్మ

దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ద్ధనంజయ। బుద్ధౌ శరణ మన్విచ్ఛ కృపణా ఫలహేతవః॥49॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి పదే పదే చెబుతున్నాడు.అర్జునా!నిష్కామ కర్మ,అనగా ప్రతి ఫలాపేక్ష లేకుండా చేసే పనులు,ఎప్పుడూ మంచివే!అదే ప్రతిఫలంకోరి చేసే పనులు హీనమయినవి.అట్లా ప్రతిఫలం కోరి కర్మలు చేసేవాళ్ళు అథములు అవుతారు.నీవు ఆ పనులకు దూరంగా ఉండు.నువ్వు ఆ వర్గంలో చేరకు.సమన్వయం పాటించు.సమబుద్ధి అవలంబించు.నీవు ఆధ్యాత్మిక జ్ఞానానికి పెద్ద పీట వెయ్యి.

Monday, 9 March 2026

యోగస్థః కురు కర్మాణి

యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ। సిద్ధ్య సిద్ధ్యో స్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే॥48॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము... కృష్ణుడు లాంటి స్నేహితుడు మన అందరికీ ఉంటే ఎంత బాగుంటుందో కదా!అర్జునుడికి సరి అయిన సమయంలో కర్తవ్యం బోథిస్తున్నాడు.ఏది ఒప్పు,ఏది తప్పు చెబుతున్నాడు.భయం పోగొట్టి ధైర్యం చెబుతున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.హే ధనంజయా!హే పార్థా!మనము ముందర ద్వంద్వ వైఖరి మానుకోవాలి.లాభం,నష్టం...ఈ రెండింటినీ ఒకేలాగా చూడగలగాలి.ఏ విషయమైనా మోహము,లాలస ఉండకూడదు.యోగబద్థుడుగా అవాలి.మనము అనుకున్న పనులు అనుకూలంగా పూర్తి అయినా,ఏ కారణం చేత అయినా సఫలం కాలేక పోయినా మనము విచారించకుండా ఉండగలగాలి.సమబుద్ధి ప్రదర్శించాలి.నియమిత కర్మలు ఆచరించాలి.నియమిత కర్మలు అంటే నిత్య కర్మలు.మన మనసు తామరాకు మీద నీటి బొట్టులాగా వ్యవహరించాలి.నిష్టగా,చిత్తశుద్ధితో మనము చేయాల్సిన కర్మలు ఆచరించాలి,కానీ ప్రతిఫలాపేక్ష లేకుండా!

కర్మణ్యే వాధికారస్తే

కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన। మా కర్మ ఫల హేతుర్భూః మాతే సంగో స్త్వ కర్మణిః॥47॥2॥ శ్రీమద్భగవద్గీత..సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ధర్మ సూత్రం చెబుతున్నాడు.హే పార్థా!ఓ అర్జునా!కర్మ చేయడం వరకే నీ వంతు.కర్మఫలం ఆశించడం నీ పని కాదు.నేను చేసే పనికి ఫలితం నాకే దక్కాలి అని ఆశించకు.నీకు హక్కులేదు.ఏ పని ఎప్పుడు,ఎలా,ఎంతలా,ఎక్కడ చేస్తే నాకు కావాల్సిన ఫలితం దక్కుతుంది అనే కోరికతో ఏ పనీ చేయవద్దు.నాకు లాభం లేనప్పుడు నేను ఎందుకు చెయ్యాలి ఏదైనా అని మానుకోవద్దు.ఎందుకంటే కర్మలు చేయడమే మన ధర్మము.వాటి ఫలాలకు మనము అధికారులు కాదు.

Sunday, 8 March 2026

యావానర్థ ఉదపానే

యావానర్థ ఉదపానే సర్వత స్సంప్లుతోదకే। తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః॥46॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము..। శ్రీకృష్ణుడు అర్జునుడికి సూక్ష్మంలో మోక్షం గురించి చెబుతున్నాడు.అర్జునా!నా తట్టు చూడు.నేను చెప్పేది అర్థం చేసుకునేదానికి ప్రయత్నించు.నీరు ఎక్కడ ఉన్నా నీరే కదా!అలాగే జ్ఞానము కూడా.ఒక ఉదాహరణ చెబుతాను విను.నూతులు,చెరువులలో తక్కువ నీళ్ళు ఉంటాయి కదా,సముద్రంతో పోలిస్తే.కానీ వీటితో ఎంత ప్రయోజనము ఉందో వాటితో కూడా అంతే కదా!వేదాలలో చెప్పిన చాలా,అహాఁ,సమస్త కర్మల వలనా శాంతి దొరుకుతుంది కదా మానవుడికి.అదే శాంతి తత్త్వవేత్త అయినవాడికి తనకున్న జ్ఞానంలోనే ఇమిడి ఉంటుంది.సూక్షమా లేక స్థూలమా అనేకంటే వాటిలో ఉండే సారమునకే ఎక్కువ విలువ అని అర్థం చేసుకో.కాబట్టి అపోహలు,అనుమానాలు,అలజడులకు ఔషథం జ్ఞానము.కాబట్టి మానవుడికి జ్ఞానసముపార్జన అత్యంత కీలకం,అత్యవసరమూను.

Saturday, 7 March 2026

త్రైగుణ్య విషయా వేదా

త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున। నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్॥45॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడు మంచిగా పేరు తెచ్చుకోవాలి అని ఆశిస్తున్నాడు.అందుకని ప్రతిదీ ఓపికగా,విపులంగా వివరిస్తున్నాడు.అర్జునా!వేదాలు ప్రకృతి యొక్క మూడు గుణాలను వివరించాయి.నువ్వు ఆ త్రిగుణాలకు అతీతంగా నిలబడాలి.ద్వంద్వ భావాలకు స్వస్తి చెప్పాలి.ఏదైనా సాధించాలి,సాధించిన వాటిని నిలుపుకోవాలి,అదే యోగక్షేమాలు,అనే ఆదుర్దా,దుగ్థ,అపేక్ష నిర్ద్వంద్వంగా వదులుకోవాలి.శుద్థ సత్వాన్ని అవలంబించాలి.అంటే రజోగుణము,తమోగుణము మరకలు అంటని పవిత్రమయిన సత్త్వగుణ మార్గాన్ని ఎంచుకోవాలి.బాహ్య బంధాలను విడిచి పెట్టి ఆత్మ జ్ఞానివి కావాలి.ఇదే నా కోరిక!

భోగైశ్వర్య ప్రసక్తానాం

భోగైశ్వర్య ప్రసక్తానాం తయాఽపహృత చేతసామ్। వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే॥44॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి స్వర్గ ప్రాప్తి ఆషామాషీ వ్యవహారం కాదు అని చెబుతున్నాడు.అర్జునా!మనిషికి విషయలాలస,భోగలాలస ఎక్కువ.ఆ భోగైశ్వర్యాలను ఆశించడం మొదలు పెడితే వాటికి అంతం అంటూ ఉండదు.మొదట కోరిక మొదలవుతుంది.ఇంక వాటికోసం అనేక కర్మకాండలలో మునిగిపోతాడు మానవుడు.అన్ని కోరికలు ఉన్నవాడు ఇంక ప్రశాంతంగా,నిశ్చలమయిన మనసుతో ఏమి ధ్యానం చేయగలడు?బుద్ది నిలకడగా ఉంటుందా,ఎక్కడైనా?ఓం ఓం అంటూ మొదలు పెడతాడు.గబుక్కున పక్కింటివాడి దగ్గరనుంచి రాబట్టాల్సిన బాకీ గుర్తొస్తుంది.మళ్ళీ ఓం ఓం అని మొదలు పెడతాడు,ఏవరిని మభ్యపెట్టి తన పనులు సానుకూలం చేసుకోవాలో ఆలోచిస్తాడు.ఇంక చిత్త శుద్ధి ఎక్కడ నుంచి వస్తుంధి?

Friday, 6 March 2026

కామాత్మానః స్వర్గపరా

కామాత్మానః స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదామ్। క్రియా విశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి॥43॥2॥ శ్రీమద్భగవద్గీత..।సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!చాలా మందికి స్వర్గం దక్కాలి అనే లాలస ఎక్కువ ఉంటుంది అని చెప్పాను కదా!ఆ కోరిక,కామన ఎక్కువై లెక్కకు మిక్కిలి కర్మకాండలలో మునిగి తేలుతుంటారు.ఎవరు ఏమి చెప్పినా స్వర్గ ప్రాప్తి విషయంగా,ముందు వెనకా చూసుకోకుండా,సరైన ఆలోచన,వితరణ లేకుండా చేసేస్తుంటారు.అక్కడ మనసు భగవంతుడి పైన లగ్నం చేయడం,నిబద్ధత ఉండడం ఉండవు.ఎట్లో ఒకట్ల సంపాదించేసెయ్యాలి అనే ఆరాటమూ,కోరిక తప్ప.దానికి పర్యవసానం ఏందే చెప్పమంటావా?వాళ్ళందరూ కూడా జనన మరణ ప్రవాహంలో కొట్టుకు పోతారు తప్ప,స్వర్గము,మోక్షము అనే తీరం చేరరు.

Thursday, 5 March 2026

యామిమాం పుష్పితాం వాచం

యామిమాం పుష్పితాం వాచం ప్రవద న్త్యవిపశ్చితః। వేద వాదరతాః పార్థ నాన్య దస్తీతి వాదినః॥42॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు ఎలాంటి మొహమాటం లేకుండా మానవుడి బుద్ధి ఎలా ఉంటుందో అర్జునుడికి చెబుతున్నాడు.హే అర్జునా!హే పార్థా!వివేకం లేని జ్ఞానం వలన ఎలాంటి ఉపయోగము ఉండదు.కొందరు వేదాలు చదివేస్తారు,ఏమి చేస్తే స్వర్గం దక్కుతుంది అని.స్వర్గ ప్రాప్తి సాథన లాలసలో పడి లేస్తుంటారు.లేచేది ఏంది?ఘాటుగా మునుగుతుంటారు.దానికి మించినది లేదని తెగ వాదిస్తుంటారు.మాటలు,చేతలు తప్ప మనస్పూర్తిగా,మనసా వాచా కర్మణా పాటించరు.

Wednesday, 4 March 2026

వ్యవసాయాత్మికా బుద్ధి

వ్యవసాయాత్మికా బుద్ధి రేకేహ కురునందన। బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్వయసాయినామ్॥41॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... అర్జునుడికి శ్రీకృష్ణుడు విపులంగా వివరిస్తున్నాడు.ఓ అర్జునా!కురునందనా!ఈ యోగంలో అన్నిటికంటే నిశ్చలమయిన బుద్ధి ఉండడం చాలా ముఖ్యం.ఎందుకంటే అది ఒక్కటే ఏక కారణంగా ప్రకాశిస్తుంది.అంటే మనసు నిశ్చలమయితే మనము సరిగ్గా ఒకే విషయం పైన దృష్టి సాధించగలము.అనుకున్నది అనుకున్నట్లు సాథించగలము.అదే నిశ్చయత్వము లేదనుకో,ఏమవుతుంది.కనిపించనివన్నీ కావాలనిపిస్తుంది.ప్రతిదీ చేయాలనిపిస్తుంది.మనసుకు నిగ్రహం ఉండదు.అన్నిటి వెనకా వెంపర్లాడుతుంటుంది.ఏది కావాలి,ఏది వదులుకోవాలి అనే ఖచ్ఛితత్వం ఉండదు.ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏందంటే నిశ్చయ వివేకం లేని వారి జ్ఞానము అనేక భేదాలతో,అనంత ముఖాలుగా ఉంటుంది.

Tuesday, 3 March 2026

నేహాభిక్రమ నాశోఽస్తి ప్రత్య వాయో

నేహాభిక్రమ నాశోఽస్తి ప్రత్యవాయో న విద్యతే। స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్॥40॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి ముందర భయం పోగొడుతున్నాడు.ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నాడు.అర్జునా!ఈ యోగంలో అభిక్రమ నాశం లేదు.ప్రత్యవాయ దోషం కూడా అసలే లేదు.అభిక్రమము అంటే మొదలు పెట్టిన పని అని అర్థము.అంటే మనము మొదలు పెట్టే పని వృథా కాదు అని అర్థము.అలాగే ప్రత్యవాయము అంటే అసంపూర్తిగా వదలి వేయడం అని అర్థము.అంటే ఏదైనా పొరపాటు,తప్పుల వలన చేయవలసిన పని అసంపూర్తిగా ఆగి పోయింది అనుకో,అయినా కూడా ఏ పాపమూ అంటదు అని అర్థము. అంటే ఈ కర్మ యోగము ప్రకారము ఏ పని అయినా కొంచెమే చేసినా,ఆచరించినా,ఫలితము చాలా గొప్పగా ఉంటుంది.సంసార భయము నుంచి మానవుడిని ఒడ్డుకు చేరుస్తుంది.ఇక్కట్ల నుండి తప్పిస్తుంది.

ఏషా తేఽభిహితా సాంఖ్యే

ఏషా తేఽభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు। బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి॥39॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడితో అనునయంగా చెబుతున్నాడు.పార్థా!కిరీటీ!ఇప్పటి దాకా నేను నీకు ఆత్మ తత్త్వం గురించి చెప్పాను.అది నీకు అర్థం అయిందనే ఆశ పడుతున్నాను.ఇప్పుడు ఇంక నీకు కర్మయోగము గురించి చెబుతాను.సాంఖ్య యోగము అంటే జ్ఞాన యోగము.ఏ యోగ జ్ఞానం వలన నువ్వు కర్మ బంధాలలో ఇరుక్కోవో,ఆ విశిష్టమయిన కర్మ యోగాన్ని నీకు పరిచయం చేస్తాను.మనసు లగ్నం చేసి మంచిగా విను.

Monday, 2 March 2026

సుఖ దుఃఖే సమే కృత్వా

సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ। తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాప మవాప్స్యసి॥38॥2॥ శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి సహేతుకమయిన మాటలు చెబుతున్నాడు.అర్జునా!నీ భయం ఏంది,ఇప్పుడు?అయిన వాళ్ళను,పెద్దవాళ్ళను చంపడం పాపం అని కదా!కానీ నీకు తెలుసా?అన్నిటినీ సమానంగా తీసుకోవడం నేర్చుకోవాలి.నీవు సుఖ దుఃఖాలనూ,లాభాలాభాలనూ,జయాపజయాలనూ సమానంగా స్వీకరించు.ఆ మనోస్థైర్యంతో యుద్ధం చెయ్యి.దేనికీ చలించకుండా,ఎలాంటి ప్పతిఫలమూ ఆశించకుండా నీ కర్మలను నీవు నిర్వర్తించావంటే ఎలాంటి పాపమూ నిన్ను అంటదు.కడిగిన ముత్యంలాగా మెరిసిపోతావు.

Sunday, 1 March 2026

హతో వా ప్రాప్స్యసే స్వర్గం

హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్। తస్మా దుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః॥37//2/ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి మంచి మాటలు చెబుతున్నాడు.అర్జునా!పాండవ మథ్యమా!ఎందుకు ఈ గందరగోళం,గలభా గలభా!ప్రశాంతంగా ఆలోచించు.నీకే అర్థమవుతుంది.యుద్ధం చేస్తూ చేస్తూ మరణించావనుకో వీరమరణం పొందావని అందరూ నిన్ను శ్లాఘిస్తారు.అంతేనా?స్వర్గం పొందుతావు.అక్కడ స్వర్గ సుఖాలూ పొందుతావు.చెడుగా ఎందుకు అనుకోవడం.యుద్ధం చేసి గెలిచావనుకో!ఈ భూలోకంలో రాజ్యాన్నీ పొందుతావు,సకల సౌభాగ్యాలూ అనుభవిస్తావు.అంటే ఎటుపోయి ఎటొచ్చినా నువ్వు సుఖపడటం ఖాయం! మరి అట్లాంటప్పుడు ఈ పనికిమాలిన తర్జన భర్జనలు ఎందుకు?యుద్థం చేస్తాను,చెయ్యాలి,గెలవాలి అని ధృఢ సంకల్పంతో లేచి నడుము బిగించు.కదన రంగంలో కదం తొక్కు.నీకు తిరుగు లేదు.విజయం నీ ముందర వచ్చి వాలుతుంది.సానుకూల ధృక్పథంతో శంఖం పూరించు.

అవాచ్య వాదాంశ్చ బహూన్

అవాచ్య వాదాంశ్చ బహూన్వదిష్యంతి తవాహితాః। నిందంత స్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్॥36॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి కఠోర సత్యం వివరిస్తున్నాడు.అర్జునా!మిత్రమా!ప్రతిదీ నీవు అనుకున్నంత సరళం కాదు.నీవు అయిన వాళ్ళను చేజేతులా చంపుకుని పాపం మూటగట్టుకోలేను.దానికంటే అస్త్ర సన్న్యాసం ఎంతో ఉత్తమం అనుకుంటున్నావు.కానీ ప్రపంచం ఏమనుకుంటుందో?ఆ చర్యను ఎలా స్వీకరిస్తుందో నేను నీకు విపులంగా వివరిస్తాను.విను. నీ శత్రువులు నిన్ను అనరాని మాటల తూటాలతో గాయపరుస్తారు.నీవు పౌరుషం లేని వాడివని ఎద్దేవా చేస్తారు.నీ పరాక్రమాన్ని శంకిస్తారు.చావ లేని వాడు,చావలేనివాడు అని ఎకచకాలాడతారు.గేలి చేస్తారు.చిన్నచూపు చూస్తారు.అవన్నీ నీవు తమాయించుకోలేవు.అంతకంటే దుఃఖ భూయిష్టం,దుఃఖ జనకం ఇంకేమి ఉంటుంది చెప్పు?ఎంత మందికి నీవు వివరణ ఇస్తూ పోతావు?నేను వీరుడు,శూరుడు,విక్రమార్కుడినే!కానీ ఆ సమయంలో శాంతంగా ,సమన్వయంతో,పాపభీతితో,అయినవాళ్ళని పోగొట్టుకోకూడదు అనే సదుద్దేశంతో యుద్ధంనుంచి నిష్క్రమించాను అని.చెప్పినా ఎంత మంది నమ్ముతారు నీ మాటలు?ఆలోచించు బాగా.