Thursday, 30 October 2025

గీతా మే పరమావిద్యా

గీతా మే పరమావిద్యా బ్రహ్మరూపా న సంశయః। అర్థమాత్రా క్షరా నిత్యా స్వనిర్వాచ్య పదాత్మికా॥8॥ శ్రీకృష్ణ పరమాత్ముడు అయిన భగవంతుడు అంటున్నాడు.ఓ భూదేవీ!భగవద్గీత పరమపదాన్ని బోధించే విద్యను మానవాళికి సమకూర్చుతుంది.ఇదే పరబ్రహ్మ స్వరూపము.ఇదే అర్థమాత్ర.గీతా సారము నాశనము లేనిది.శాశ్వతమయినది.స్వయంగా ప్రకాశించేది.స్వబోధం అయినది.స్వకీయం అయినది.భగవద్గీత అంటే నిర్దిష్టంగా ఇది అని ఎవ్వరూ ప్రకటించలేరు.ఎందుకంటే ఇది విశ్వ వ్యాపకము.ఇది స్పృశించని గుణం,భావము,భావన,విషయ సంగ్రహణ అంటూ ఏమీ మిగిలి లేవు.ఇది ఉత్తమోత్తమ మయిన గ్రంథ రాజము. అర్థమాత్ర అనేది ఓం కార రూపంలోని సూక్ష్మ భాగము.ఇది బిందువు,నాదముల కలయికతో అ,ఉ,మ తర్వాత నాలుగో భాగంగా గుర్తించ బడింది.

Wednesday, 29 October 2025

గీతాశ్రయోఽహం తిష్ఠామి

గీతాశ్రయోఽహం తిష్టామి గీతా మే చోత్తమం గృహమ్। గీతా జ్ఞాన ముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహమ్॥7॥ భగవంతుడు చెబుతున్నాడు.ఓ భూదేవీ!ఈ భగవద్గీత వలననే నేను స్థిరుడుగా ఉన్నాను.దానిలోనే నివసిస్తున్నాను.దాని ప్రకారంగానే నేను ముల్లోకాలనూ పాలిస్తున్నాను.

యత్ర గీతా విచారశ్చ

యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతమ్। తత్రాహం నిశ్చితం పృథ్వి నివసామి సదైవహి॥6॥ శ్రీ మహా విష్ణువు భూదేవికి దిలాసా ఇస్తున్నాడు.ఓ భూదేవీ!ఎక్కడ ఈ భగవద్గీతా పారాయణము చేయబడుతుందో,చేయించబడుతుందో,చెవులకు శ్రావ్యంగా వినబడుతుందో,అది భూతల స్వర్గము అనుకో!ఎందుకంటావా?ఎందుకంటే,అక్కడ సర్వ దేవతలూ,సర్వ తీర్థాలే కాదు....నేను కూడా అక్కడే ఉండి తీరతాను!

Tuesday, 28 October 2025

సర్వే దేవాశ్చ ఋషయో

సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చయే। గోపాలా గోపికా వాఽపి నారదో ద్థవ పార్షదాః। సహాయా జాయతే శీఘ్రం,యత్ర గీతా ప్రవర్తతే॥5॥ నారాయణుడు భూమాతతో చెబుతున్నాడు.భగవద్గీత ప్రాశస్త్యము చెప్పనలవి కానిది.ఎందుకంటే ముప్పై మూడుకోట్ల దేవతలు,మునులు,యోగులు,పన్నగులు,గోపాలకులు,గోపికలు,నారదుడు,ఉధ్ధవుడు,వైకుంఠద్వారపాలకులు...ఇలా ఒకరేంది?అందరూ అన్ని వేళలా గీతా పారాయణము చేసేవారికి సహాయ సహకారాలు అందించేదానికి సన్నిద్ధంగా ఉంటారు.

గీతాయాః పుస్తకం

గీతాయాః పుస్తకం యత్ర,యత్ర పాఠః ప్రవర్తతే। తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్రవై॥4॥ భగవద్గీత సన్మార్గానికి నిఘంటువు.ఈ పవిత్ర గ్రంథం ఎక్కడెక్కడ ఉంటుందో,ఎక్కడక్కడ దాని పారాయణం జరగుతుంటుందో అది ఒక పుణ్యక్షేత్రము అవుతుంది.అక్కడ ప్రయాగ మున్నగు నిఖిల తీర్థాలూ ఉంటాయి.అందులో అనుమానమే లేదు.

Monday, 27 October 2025

మహా పాపాది పాపాని

మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్। క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీ దళ మంభసా॥3॥ తామరాకు మీద నీటి బొట్టు అనే నానుడి ఉంది కదా!నీరు తామరాకు పైన ఉన్నా తడి తామరాకుకు అంటదు.పాదరసంలాగా జారి పోతుంటుంది.ఇక్కడ విష్ణుమూర్తి కూడా ఇదే చెబుతున్నాడు.గీతా పారాయణం చేసేవాళ్ళను ఎటువంటి మహాపాపాలూ అంటవు.అంటలేవు!

Sunday, 26 October 2025

ప్రారబ్థం భుజ్యమానోఽపి

విష్ణురువాచ.... ప్రారబ్థం భుజ్యమానోఽపి,గీతాభ్యాసర తస్సదా। సముక్తస్ససుఖీ లోకే కర్మణా నోపలిప్యతే॥2॥ విష్ణువు భూదేవితో చెబుతున్నాడు.ఓ భూదేవీ!మనిషి జన్మ ఎత్తిన ప్రతివాడూ ప్రారబ్థాన్ని అనుభవించాలి.అది అందరికీ తెలిసిందే!కానీ భగవద్గీతను పారాయణ చేసేవాడికి ఎలాంటి కర్మలు అంటవు.అతడు జీవన్ముక్తుడు అవుతాడు.నిరంతరమూ సుఖంగా ఉంటాడు.

శ్రీమద్భగవద్గీతా మాహాత్మ్యము…భగవాన్ పరమేశాన

ధరో ఉవాచ... భగవన్ పరమేశాన భక్తి రవ్యభిచారిణీ। ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో॥॥1॥ భగవద్గీత యొక్క మహత్యము అంతా ఇంతా కాదు.అది ఇక్కడ ప్రస్ఫుటమవుతుంది. ధరా అంటే భూమి.భూమి భగవంతుడిని అడుగుతున్నది ఓ భగవంతుడా!మనుష్యులు ప్రారబ్ధ కర్మలలో మునిగి తేలుతున్నారు.తత్ కారణంగా పాపభారాన్ని మోస్తూ పాపులు అవుతున్నారు.వారందరూ చలించని భక్తి, చెరగని ముక్తి లభించాలంటే ఏమి చేయాలి?

Saturday, 25 October 2025

మంగళ శ్లోకాలు

వాగార్ధ వివసంపృక్తౌ నాగార్థ ప్రతిపాదితౌ। జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ॥ జయత్వతి బలోరామో లక్ష్మణశ్చ మహాబలః। రాజా జయతు సుగ్రీవో రాఘవే ణాభి పాలితః॥ ఆపదా మపహర్తారం- దాతారం సర్వ సంపదామ్। లోకాభిరామం శ్రీరామం -భూయో భూయో నమామ్యహమ్॥ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే। చక్రవర్తి తనూజాయ సార్వభూమాయ మంగళమ్॥ శ్రీవాగ్దేవీం మహాకాళీం -మహాలక్ష్మీం సరస్వతీమ్। త్రిశక్తి రూపిణీ మంబాం -దుర్గాం చండీం నమామ్యహమ్॥ యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా। శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే॥ నారాయణం నమస్కృత్వ నరంచైవ నరోత్తమమ్। దేవీ సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్॥

శ్రీ గీతా ధ్యానము

పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయమ్। వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహా భారతమ్॥ అద్వైతామృతవర్షిణీం భగవతీ మష్టాదశాధ్యాయినీమ్। అమ్బత్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్॥ గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితమ్। వేదవ్యాస వివర్జితం శ్రుతిశిరోబీజం ప్రబోధాంకురమ్॥ నానాశాస్త్ర రహస్య శాఖ మరతిక్షాంతి ప్రవాలాంకితమ్। కృష్ణాంఘ్రిద్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినామ్॥ సంసార సాగరం ఘోరం తర్తుమిచ్ఛతి యో నరః। గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సః॥ సర్వోపనిషదో గావో దోగ్థా గోపాల నందనః। పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్థం గీతామృతం మహత్॥ ఇలా ధ్యానం చేసుకోవాలి.మనసును కుదురుగా ఉంచుకోవాలి.రోజుకు ఒక అధ్యాయము లెక్కన చదివినా మంచిదే!పారాయణ అనంతరము గీతా మహాత్మ్యము లోని మొదటి మూడు శ్లోకాలు చదువుకోవాలి.

Friday, 24 October 2025

శ్రీ కృష్ణ ధ్యానము

ఓం ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైక పాణయే। జ్ఞాన ముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమః॥ వసుదేవసుతం దేవం కంస చాణూర మర్దనమ్। దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్॥ భీష్మ ద్రోణ తటా జయద్రథ జలా గాంధార నీలోత్పలా। శల్య గ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా॥ అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధనా వర్తినీ। సోత్తీర్ణా ఖలు పాణ్డవై రణనదీ కైవర్తకః కేశవః॥ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిమ్। యత్కృపా తమహం వందే పరమానంద మాధవమ్॥ యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వన్తి దివ్యైః స్తవైః। వేదైస్సాంగ పదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః॥ ధ్యానా వస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో। యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః॥ శ్రీ వ్యాస ధ్యానము ............... నమోఽస్తుతే వ్యాస విశాలబుద్ధే ఫుల్లార విందాయ త పత్రనేత్ర। యేన స్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః॥

Wednesday, 22 October 2025

శ్రీ భగవద్గీతా పారాయణ క్రమము

ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్। ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే॥ ఓం అఖండ మండలాకారం వ్యాప్తంయేన చరాచరమ్। తత్పదం దర్శితంయేన తస్మై శ్రీ గురవే నమః॥ ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్య శ్రవణ కీర్తనమ్। వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిమ్॥ ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్। దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్॥ ఓం వ్యాసం వశిష్ట నప్తారం శక్తేః పౌత్ర మకల్మషమ్। పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్॥ మనసును ఏకాగ్రము చేసి మనకు మనము అర్జునుడు లాగా ఊహించుకోవాలి.ఆ భగవంతుడే స్వయముగా మనకు భగవద్గీత ఉపదేశిస్తున్నట్లుగా భావించాలి. వినియోగాదిః .......... ఓం అస్య శ్రీ మద్భగవద్గీతా శాస్త్ర మహామన్త్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ కృష్ణ పరమాత్మా దేవతా, అశోచానన్వ శోచస్త్వమితి బీజమ్॥ సర్వధర్మా న్పరిత్యజ్య మామేకం శరణం వ్రజేతి శక్తిః। అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ ఇతి కీలకమ్। మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరీష్యః ఇతి కవచమ్। కిరీటినం గదినం చక్రహస్తమ్ ఇతి అస్త్రమ్। అనాది మధ్యాంత మనంతవీర్యం ఇతి ధ్యానమ్। జ్ఞాన యజ్ఞేన భగవదారాధనార్దే। శ్రీకృష్ణ పరమాత్మ ప్రీత్యర్థే జపే వినియోగః॥ కరన్యాసము ........ నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః....ఇత్యంగుష్ఠాభ్యాం నమః (రెండు చేతులు బొటన వ్రేళ్ళను రెండు చూపుడు వ్రేళ్ళతో తాకవలెను.) నచైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః...ఇతి తర్జనీభ్యాం నమః (చూపుడు వ్రేళ్ళను బొటన వ్రేళ్ళతో తాకవలెను.) అచ్చేద్యోయమదాహ్యోఽయమక్లేద్యోఽశోష్య ఏవచ...ఇతి మధ్యమాభ్యాం నమః (నడిమి వ్రేళ్ళను బొటన వ్రేళ్ళతో తాకవలెను.) నిత్యః సర్వగతః స్థాణురచలోఽయం సనాతనః....ఇత్యనామికాభ్యాం నమః। (ఉంగరపు వ్రేళ్ళను బొటన వ్రేళ్ళతో తాకవలెను.) పశ్య మే పార్థ రూపాణి శతశోఽథ సహస్రసః...ఇతి కనిష్ఠికాభ్యాం నమః। (చిటికెన వ్రేళ్ళను బొటన వ్రేళ్ళతో తాకవలెను.) నానా విధాని దివ్యాని నానావర్ణకృతీని చ...ఇతి కరతల పృష్ఠాభ్యాం నమః। (రెండు అరచేతుల వెనకవైపులను క్రమముగా స్పృశించ వలెను.) అంగన్యాసము ............ నైనం ఛిందంతి శస్త్రాణి-నైనం దహతి పావకః....ఇతి హృదయాయ నమః। (కుడి చేతితో హృదయమును స్పృశించుకోవలెను.) న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః... ఇతి శిరసే స్వాహా। (కుడి తేతితో హృదయము స్పృశించుకోవలెను.) అచ్ఛేద్యోఽయ మదాహేయోఽయ మక్లేద్యోఽశోష్య ఏవ చ...।ఇతి శిఖాయై వషట్। (శిఖను తాకవలెను.) నిత్య స్సర్వగతః స్థాణురచలోఽయం సనాతనః...ఇతి కవచాయ హుం। (కుడి చేత ఎడమ భుజమును,ఎడమ చేత కుడి భుజమును తాకవలెను.) పశ్య మే పార్థ రూపాణి శతశోఽథ సహస్రశః....ఇతి నేత్ర త్రయాయ వౌషట్। (కుడి చేత నేత్రములను తాకవలెను.) నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతీని చ...ఇత్యస్త్రాయ ఫట్। (కుడి చేయి తలచుట్టూ త్రిప్పుకుని నడి వ్రేలుతో ఎడమ చేత చప్పట్లు కొట్టవలెను.) పిమ్మట ధ్యానము చేయవలెను. మహా భారత ధ్యానము ................. పారాశర్య వచః సరోజ మమలం గీతార్థ గంధోత్కటమ్। నానాఖ్యానక కేసరం హరికథా సంబోధనా బోధితమ్॥ లోకే సజ్జన షట్పదైరహరహః పేపాయమానం ముదా। భూయాద్భారత పంకజం కలిమల ప్రథ్వంసినః శ్రేయసే॥

Tuesday, 21 October 2025

శ్రీ భగవద్గీతా పూజా విధాన క్రమము

భగవద్గీతను భక్తి విశ్వాసముతో పూజించుకొననవచ్చును.అవినాశనము,అద్భుతమయిన కర్మకర్తృత్వము,విభూతి,అధికారము,సర్వజ్ఞత,అఖండ శక్తి...ఈ ఆరింటినీ భగము అని అంటారు.ఈ ఆరు గుణాలూ కలిగిన వారిని భగవంతుడు అని అంటారు లేక భగవతీ అని అంటారు.మనము శ్రీకృష్ణుడిని భగవంతుడుగా నమ్మాము.అతని చేత చెప్పబడినది కాబట్టి భగవద్గీత అనే నామం సార్థకమయినది.అంతేకాదు.అది భగవద్వాణి కాబట్టి గీతను భగవతీ అని,అద్వైతామృతవర్షిణి అని,అంబ అని,భవద్వేషిణి అని అందరూ నమ్మి కీర్తిస్తారు. కాబట్టి భగవద్గీతను పూజించడమంటే భగవదారాథన చేసినట్లే!మార్గశిర శుద్ధ ఏకాదశి గీతాదయంతి.ఆ రోజు పూజించికోవచ్చు.మంచి పని చేసేదానికి ప్రతిరోజూ మంచిరోజే కాబట్టి ఎప్పుడైనా పూజించుకోవచ్చు. మామూలుగా ఆచమనం,ప్రాణాయామం,ఘంటారావం,సంకల్పం చెప్పుకోవాలి.ముందుగా గణపతి పూజ చేసుకోవాలి.కృష్ణ అష్టోత్తర శతనామావళి,గీతా అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. వక్త్రాణి పంచజానీహి పంచాధ్యాయాననుక్రమాత్। దశాధ్యాయాః భుజాశ్చైక ముదరంద్వే పదాంబుజే॥ ఏవమష్టాదశాధ్యాయీ వాంగ్మయీ మూర్తిరీశ్వరీ। జానీహి జ్ఞానమాత్రేణ మహాపాతకనాశినీ॥ ఓం గీతాయై నమః ధ్యానం సమర్పయామి సర్వతీర్థ మయై నమః ఆవాహయామి అక్షరాయై నమః ఆసనం సమర్పయామి మల నిర్మోచిన్యై నమః పాద్యం సమర్పయామి సత్యాయై నమః అర్ఘ్యం సమర్పయామి విష్ణోర్వక్త్రా ద్వినిసృతాయై నమః ఆచమనం సమర్పయామి వంద్యాయై నమః పంచామృత స్నానం సమర్పయామి తదుపరి శుద్ధోదక స్నానం సమర్పయామి విశ్వ మంగళ కారిణ్యై నమః వస్త్ర యుగ్మం సమర్పయామి సర్వ శాస్త్రమయై నమః యజ్ఞోపవీతం తదుపరి ఆభరణాని సమర్పయామి సర్వైశ్వర్య ప్రదాయిన్యై నమః శ్రీ గంధం సమర్పయామి భారతామృత సర్వస్యాయై నమః పుష్పాక్షతాన్ సమర్పయామి. ।।।।।।।।।।।।।।॥॥॥।।।।। ఓం ఇతి శ్రీ భగవద్గీతా అష్టోత్తర శతనామావళి పుష్పాంజలి పూజాం కరిష్యామి ఓం అష్టాదశాధ్యాయిన్యై నమః నానావిథ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి ఓం భవ ద్వేషిణ్యై నమః ధూపమాఘ్రాపయామి ఓం సర్వోపనిషత్సార రూపిణ్యై నమః దీపం దర్శయామి ఓం అద్వైతామృత వర్షిణ్యై నమః నైవేద్యం సమర్పయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి,ఉత్తరాపోశనం సమర్పయామి ఓం వ్యాసేన గ్రథితాయై నమః తాంబూలం సమర్పయామి ఓం భారత పంకజ స్వరూపాయై నమః కర్పూర నీరాజనం సమర్పయామి ఓం భయ శోకాది వివర్జితాయై నమః మంత్ర పుష్పం సమర్పయామి ఓం లోక త్రయోప కారిణ్యై నమః ప్రదక్షిణం సమర్పయామి ఓం సర్వజ్ఞాన మయ్యై నమః సర్వోపచార పూజాం కరిష్యామి అనయా మయాకృత ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవతీ శ్రీ గీతా దేవతా సుప్రీతా భవతు,సుప్రసన్నా భవతు,వరదా భవతు. ఇతి శ్రీ మద్భగవద్గీతా పూజా స్సమాప్తా.....

అష్టాదశ అధ్యాయము…ఫలము

భగవద్గీత లోని పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్న్యాస యోగము.దీని పారాయణ ఫలము వలన సర్వపుణ్యాలు దక్కుతాయి.అలానే సిద్ధిప్రదము అవుతుంది. పూర్వము విష్ణుదూతలు ఒక పురుషుడిని ఇంద్రలోకానికి తీసుకుని వచ్చారు.రావటం రావటం అతనిని ఇంద్ర సింహాసనము పైన కూర్చోబెట్టారు.అంతటితో ఆగలేదు.కొన్నాళ్ళు ఇతడే ఇంద్రాధిపత్యము కొనసాగిస్తాడు అని శాసించారు. ఇంద్రుడికి వెన్నులో జ్వరము వచ్చింది,ఈ పరిణామానికి.నేరుగా వైకుంఠం పోయాడు.నారాయణా!మాథవా!ఏంది ఈ విడ్డూరము?నా సింహాసనము ఎక్కే అర్హత సామాన్య మానవుడు ఎలా సాథించాడు?దానితో ఆగకుండా కొన్నాళ్ళు ఇంద్ర పదవి దక్కేటంత పుణ్యము ఏమి చేసాడు?అని అడిగాడు. దానికి శ్రీమహా విష్ణువు తన చెరగని చిరునవ్వుతో ఇలా సమాథానం చెప్పాడు.ఇంద్రా!ఆ మానవుడు భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయము లోని అయిదు శ్లోకాలు నిత్యమూ జపించేవాడు.దాని ఫలమూ,ఫలితమే ఈ ఇంద్ర పదవి. శ్లోకము ...... జపత్యష్టాదశాధ్యాయే గీతానాం శ్లోక పంచకమ్। యత్పుణ్యేన చ సంప్రాప్తం తవ సామ్రాజ్యముత్తమమ్॥ విష్ణువు మాటలకు అందరికీ తలలు గిర్రున తిరిగాయి.అది మొదలు ముక్కోటి దేవతలూ నిత్యమూ భగవద్గీతలోనిపద్దెనిమిదవ అధ్యాయము పారాయణ చేయటం మొదలు పెట్టారు,వారి వారి పదవులు నిలబెట్టుకునేదానికి.

Monday, 20 October 2025

సప్తదశ అధ్యాయము…ఫలము

భగవద్గీత లోని పదహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము.ఈ అధ్యాయము పారాయణ వలన సర్వ వ్యాధి నివారణ కలుగుతుంది. శ్లోకము ....... గీతాసప్తదశాధ్యాయ జాపకం ద్విజమానయ। తేనాయం మామకోరోగశ్శామ్యత్యత్ర న సంశయః॥ దీనికి సంబంధించిన కథ తెలుసుకుందాము.పూర్వము ఒక రాజు ఉండేవాడు.ఆయనగారి ఏనుగు ఒకసారి జబ్బున పడింది.ఎంత మంది వైద్యులకు చూపించినా స్వస్థత చేకూరలేదు.ఇక వీళ్ళ పైన వదిలేస్తే లాభం లేదని ఆ ఏనుగుకు కూడా అర్థమయిపోయింది.ఆ ఏనుగు హీనస్వరముతో రాజుకు చెప్పింది.హే రాజా!భగవద్గీత యొక్క పదహేడవ అధ్యాయము చేసే వానిని పిలిపించండి.అతని చేత నా ముంగిట ఆ అధ్యాయము పారాయణ చేయించండి.అప్పుడు నా వ్యాధి నయమవుతుంది. రాజుకు ఆ సలహా బాగా నచ్చింది.సరే అని అలాగే బ్రాహ్మణులచేత భగవద్గీతలోని పదహేడవ అధ్యాయము పారాయణ చేయించాడు.ఏనుగుకు జబ్బు నయమయింది.

Sunday, 19 October 2025

షోడశ అధ్యాయము…ఫలము

భగవద్గీతలోని పదహారవ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము.ఈ అధ్యాయము పారాయణ ఫలము వలన ధైర్య సాహసాలు,జంతు వశీకరణము ప్రాప్తిస్తాయి. ఒకప్పుడు ఒకరాజు దగ్గర ఒక ఏనుగు ఉండేది.అది ఒకసారి కట్లు తెంచుకుని,అదుపు తప్పి గందర గోళంచేయసాగింది.దానిని ఎవరూ ఆపలేక పోయారు.అలాంటి సమయంలో ఒక సాథారణ పౌరుడు వచ్చి దానిని నిమిరాడు.అది మంత్రము వేసినట్లు చప్పబడిపోయింది.శాంతంగా తయారయింది.మంచిగా అదుపు ఆజ్ఞల్లోకి వచ్చింది.అందరూ ఆశ్చర్య చకితులు అయ్యారు.ఇదంతా చిటికెలో ఎలా సాథ్యమయింది నీకు అని అడిగారు.ఆ శక్తి ఏంది?నీకు ఎలా వచ్చింది?మేమంతా తెలుసుకునే దానికి ఉబలాట పడుతున్నాము అని అన్నారు. అంతట అతను చెరగని చిరునవ్వుతో ఇలా అన్నాడు. శ్లోకము ........ గీతాయాః షోడశాధ్యాయ శ్లోకాన్కతిపయానహమ్। జపామి ప్రత్యహం భూపతేనైతా స్సర్వసిద్ధయః॥ అయ్యా!నేను నిత్యమూ భగవద్గీత లోని పదహారవ అధ్యాయము పారాయణ చేస్తాను.ఆ పారాయణ వల్ల కలిగే పుణ్య ఫలమే ఇదంతా!

Saturday, 18 October 2025

పంచదశ అధ్యాయము…ఫలము

భగవద్గీత లోని పదహైదవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము. శ్లోకము ........ అథ పంచదశాధ్యాయ శ్లోకార్థం లిఖితం క్వచిత్। తతోవాచయతః శ్రుత్వానిరగాత్తుర గోదివమ్॥ దీనికి సంబంధించిన కథ విందాము.పూర్వము ఒకరాజు ఉండేవాడు.అతను ఒకరోజు వేటకు వెళ్ళాడు.వేటాడి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు.గాలికి ఎగిరి ఒక తాళపత్రము అతని దగ్గరలో పడింది.ఆ తాళ పత్ర గ్రంథములో ఉన్నది పైకి చదివాడు.అది రాజు గారి గుర్రము వినింది.వెను వెంటనే దివ్య రూపము సంతరించుకుని,ఆకాశ మార్గములో ఎగసి పోయింది. రాజు కి అశ్చర్యము వేసింది.దగ్గరలో ఒక ఆశ్రమము కనిపించింది.అక్కడకు వెళ్ళి ఋషులకు జరిగిన విషయము చెప్పాడు.వాళ్ళు తాళపత్రము తమదే అని చెప్పారు.అందులో భగవద్గీతలోని పదహైదవ అధ్యాయములోని సగము శ్లోకము ఒకటి లిఖించబడి ఉంది అని చెప్పారు.ఆ సగము శ్లోకము విన్నందుకు దక్కిన పుణ్యము వలన ఆ గుర్రమునకు పరమ పథం లభించింది అని చెప్పారు. అప్పుడు ఆ రాజు ఋషుల దగ్గర భగవద్గీత యొక్క పదహైదవ అధ్యాయము పారాయణానుష్ఠానాదులు తెలుసుకున్నాడు.అప్పటి నుండి నిత్యపారాయణ చేసుకుంటూ తానుకూడా తరించాడు.

Friday, 17 October 2025

చతుర్దశ అధ్యాయము…ఫలము

భగవద్గీతలోని పదునాల్గవ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము.ఈ అధ్యాయము పారాయణ చేస్తే ఆత్మస్మృతి,శత్రుజయము కలుగుతాయి. పూర్వము ఒకరాజు ఉండేవాడు.అతను ఒకరోజు వేటకు బయలుదేరాడు.అడవిలో వేటకుక్క కుందేలును తరుమసాగింది.అవి రెండూ ఒకదాని వెంట ఇంకొకటి పరుగులు తీస్తూ ఒక ఆశ్రమము దగ్గర ఉన్న బురద ప్రదేశము దగ్గరకు వచ్చాయి.అక్కడకు చేరగానే వైరం మానేసి,చెట్టా పట్టాలేసుకును మంచి మిత్రులు లాగా ఆటలాడుకోసాగాయి.ఇదంతా రాజుకు చాలా ఆశ్చర్యమనిపించింది. ఆ ఆశ్రమములో వత్సుడు అనే ముని ఉన్నాడు.రాజు అతనిని వేటకుక్క,కుందేలు యొక్క విచిత్రమయిన ప్రవర్తనకు కారణము అడిగాడు.దానికి చిరునవ్వుతో ఆ వత్సుడు ఇలా సమాథానం ఇచ్చాడు. శ్లోకము... చతుర్దశంతు అధ్యాయం జపామి ప్రత్యహం నృప। మదీయ చరణాం భోజ ప్రక్షాళణ జలే లుఠన్॥ శ్లోకము.... శశస్త్రి దివమాపన్న శ్శునకాస్యహభూపతే। ఓ రాజా!నేను దినం దినం,ప్రతిదినం భగవద్గీతలోని పదునాల్గవ అధ్యాయము పారాయణ చేస్తాను.నేను ప్రతిదినం కాళ్ళుకడుగుకునే ప్రదేశము ఆ బురద ఉండే స్థలము.కాబట్టి కుక్క,కుందేలు అక్కడకు రాగానే వాటి వాటి జాతివైరము మరచిపోయాయి.అలానే వాటికి ఆత్మ స్మృతి కలిగింది.అందుకే అవి అంత ఆలాజాలంగా మసలుతున్నాయి.ఇదంతా ఆ పదునాల్గవ అధ్యాయ పారాయణ ఫలము,ఫలితము.

Thursday, 16 October 2025

త్రయోదశ అధ్యాయము…ఫలము

భగవద్గీతలోని పదమూడవ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము. శ్లోకము.... గీతా త్రయోదశాధ్యాయ ముద్గిరన్తమనారతమ్। తతస్తచ్ఛ్రవణాదేవ ముక్తా శ్వపచవిగ్రహాత్॥ పూర్వము ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది.ఆమె ఎప్పుడూ తప్పుదోవలో నడుస్తూ,దురాచారిణిగా వ్వవహరించేది.దాని పర్యవసానంగా,మరుజన్మ లో ఛండాల స్త్రీగా పుట్టింది.అప్పట్లో జృంభకా దేవాలయము ఉండేది.అదేవాలయంలో వాసుదేవుడు అనే అతను నిత్యమూ భగవద్గీతలోని పదమూడవ అధ్యాయము పారాయణ చేస్తుండేవాడు.ఈ ఛండాలి నిత్యమూ అతనినోట ఆ అధ్యాయము వింటూ ఉండేది.దాని ప్రభావము వలన ఆ జన్మలోనే సద్గతి పొందగలిగింది.

Wednesday, 15 October 2025

ద్వాదశ అధ్యాయము…ఫలము

భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయము భక్తి యోగము.దీని పారాయణ ఫలము రహోజ్ఞానము మరియు దివ్య శక్తులు. పూర్వము ఒక రాజు ఉండేవాడు.అతని కుమారుడు లక్ష్మీ దేవి ఆదేశానుసారం ఒక వ్యక్తిని ఆశ్రయించాడు.అతని పేరు సిద్థ సమాథి.అతనిని రాకుమారుడు ఒక ఉపకారము కోరాడు.అయ్యా!నా తండ్రి ఒకమారు అశ్వమేథయాగము తల పెట్టాడు.యాగము మథ్యలో అశ్వము తప్పిపోయింది.ఎక్కడ వెతికినా కనిపించలేదు.కాలక్రమేణా మా తండ్రి కూడా మరణించాడు.స్వామీ!గుర్రము దొరకక పోతే అశ్వమేథ యాగము పూర్తికాదు.అది సుసంపన్నము కాకపోతే మా తండ్రికి సద్గతులు ప్రాప్తించవు.కాబట్టి ఆ గుర్రము విషయము కనుక్కుని చెప్పేది.నాకు దక్కేలా చేసేది. అప్పుడు అతను తన శక్తి చేత దేవతలను పిలిపించాడు.ఆ అశ్వమును ఇంద్రుడు అపహరించి,దాచి ఉంచాడు.కాబట్టి ఆ దేవతలను ఆ అశ్వము తీసుకు రమ్మని పురమాయించాడు.వారి చేత ఆ రాజకుమారుడికి ఆ అశ్వాన్ని ఇప్పించాడు. రాజ కుమారుడికి భలే ఆశ్చర్యము వేసింది.ఇంత దివ్యశక్తి మీకు ఎలా చేకూరింది అని అడిగాడు.దానికి సిద్థసమాథి ఇలా జవాబిచ్చాడు. శ్లోకము...... గీతానాం ద్వాదశాధ్యాయం జపామ్యహతన్ద్రితః। తేన శక్తిరియం రాజన్ మయాప్రాప్తాస్తి జీవితమ్॥ ఓ రాజా!నేను భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయాన్ని అనునిత్యమూ పారాయణ చేస్తుంటాను.దాని ప్రభావము వలననే నాకు ఈ శక్తి సమకూరింది.

Tuesday, 14 October 2025

ఏకాదశ అధ్యాయము….ఫలము

భగవద్గీతలోని పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము.ఈ అధ్యాయము పారాయణము చేస్తే రాక్షస పీడా నివారణము కలుగుతుంది. శ్లోకము.... నిష్కర్మతయా ప్రాపుస్తే పరమం పదమ్। ఏకాదశస్య సామర్ధ్యా దధ్యాయస్య భవిష్యతి॥ పూర్వము ఒక ఊరిలో ఒక రాక్షసుడు ఉండేవాడు.వాడి దురాగతాలకు అంతూ పొంతు ఉండేదే కాదు.ఊరి ప్రజలు విసుగెత్తి పోయారు.గ్రామాధికారులు ఆ రాక్షసుడితో ఒక ఒప్పందానికి వచ్చారు.వీధులలో పడుకునేవారిని భక్షించవచ్చు.కానీ ఇండ్లలోకి వచ్చి హింసించి చంపకూడదు.ఈ విషయము తెలియని వారు ఆరుబయట పడుకుని ఆ రాక్షసుడికి బలి అవుతూ ఉండేవారు.ఒకరోజు సునందనుడు అనేవాడు ఆ ఊరి మీదుగా తీర్థయాత్రలకని పోతుండినాడు.ఆ రాత్రికి అక్కడే ఆగి విశ్రాంతి తీసుకుని,తెల్లవారు ఝామున బయలుదేరాలి అనుకున్నాడు.ఆ రాత్రి కూడా రాక్షసుడు వచ్చాడు.సునందనుడిని తప్ప మిగిలిన అందరినీ చంపి,తినిపోయాడు. పొద్దున్నే ఆ ఊరిలో వాళ్ళు,హాయిగా అరుగు పైన పడుకుని నిద్ర పోతున్న సునందనుడిని చూసారు.చాలా ఆశ్చర్యపోయారు.అతనిని మంచిగా సాగనంపారు.ఆ గ్రామ పెద్దలు రాక్షసుడి దగ్గరకు వెళ్ళారు.ఇలా అడిగారు.రాత్రి నువ్వు వచ్చావు.మన ఒప్పందం ప్రకారము ఆరుబయట నిద్ర పోయేవాళ్ళని చంపి తిన్నావు.సునందనుడిని మాత్రము ఎందుకు వదలి పెట్టావు? దానికి ఆ రాక్షసుడు ఇలా జవాబు చెప్పాడు.వాడెవడో ఎప్పుడూ భగవద్గీతలోని పదకొండవ అధ్యాయము చదువుతూ ఉంటాడట!వాడి దరిదాపుల్లోకి వెళ్ళగలిగే దానికి కూడా నా శక్తి సామర్ధ్యాలు చాలలేదు.నా శక్తి యుక్తులు వాడి దగ్గర పని చేయలేదు. ప్రజలకు ఇంక కిటుకు అర్ధమయింది,వాళ్ళను వాళ్ళు కాపాడుకునేదానికి.ఆ గ్రామంలో అందరూ క్రమం తప్పకుండా రోజూ భగవద్గీతలోని పదకొండవ అధ్యాయము పారాయణము చేయటం మొదలుపెట్టారు.ఇంక రాక్షసుడు చేసేది ఏమీ లేక తట్టా బుట్టా సర్దుకుని,అక్కడినుంచి పలాయనము చిత్తగించాడు.

Monday, 13 October 2025

భాగవత రచన

సూతుడు చెప్పిన విషయాలు అన్నీ శౌనకాది మునులు అందరూ శ్రద్థగా విన్నారు.వారందరూ ముక్త కంఠంతో అడిగారు.నారదుడి మాటలు విన్న తరువాత వ్యాస మహర్షి ఏమి చేశాడు అని. సూతుడు వారికి ఇలా సమాథానం ఇచ్చాడు.పరమ పవిత్ర మయిన సరస్వతీ నది ఉంది కదా!దానికి పడమటి దిక్కున ప్రశాంత వాతావరణంలో,బదరీ వృక్ష సముదాయముతో కూడిన వనము ఉంది.ఆ వనంలో శమ్యాప్రాసమనే ఆశ్రమము ఉన్నది.అది చాలా ప్రసిద్ధమయినది.వ్యాసుడు ఆ ఆశ్రమము ఎంచుకున్నాడు.భక్తి ప్రపత్తులు కలిగిన మనసుతో,మనసును ఈశ్వరుని ఆధీనంలో ఉంచాడు.తనకు తెలియకుండానే నిర్మల మనస్కుడు అయ్యాడు. ఇంక సమస్త ధర్మాలకూ,భక్తిప్రపత్తులకు నిలయము అయిన భాగవత రచనకు ఉపక్రమించాడు.దానిని దీక్షతో రచించాడు.తన ఈ రచనను తన కుమారుడు అయిన శుకమహర్షి చేత చదివించాడు. ఆ మాటలకు శౌనకుడు అడిగాడు.శుకుడు నిర్వాణ తత్పరుడు.అతడు సమస్త విషయములయందు ఉపేక్ష కలిగిన వాడు.అతడు భాగవతము ఎందుకు నేర్చుకున్నాడు?సూతుడు ఈ ప్రశ్నకు ఇలా సమాథానం చెప్పాడు.మహర్షీ!నిరపేక్షులు అయిన మునులు కూడా విష్ణువును కీర్తిస్తూ ఉంటారు.ఎందుకంటే ఏమి చెపుతాము?విష్ణుదేవుని మహిమ అంటే ఆషామాషీ కాదు.అదీ కాకుండా శుకమహర్షికి శ్రీహరి గుణాల వర్ణన యందు ఆసక్తి,అనురక్తి ఉన్నాయి.కాబట్టి భాగవతాన్ని చదివాడు.ఇంకో విషయము కూడా చెబుతాను.వేదాల కంటే కూడా భాగవతమే ముక్తి మార్గాన్ని సులువుగా నేర్పిస్తుంది. వీటన్నిటికీ తోడు పరీక్షిత్తు మహారాజు శుక మహర్షిని ముక్తి మార్గము బోథింపమని ప్రార్ధించాడు.ఒక రాజర్షి నిస్సిగ్గుగా అలా బతిమలాడేటప్పటికి,మనసు కరగి భాగవతము చెప్పాడు.

దశమ అధ్యాయము….ఫలము

భగవద్గీతలోని పదవ అధ్యాయము విభూతి యోగము.ఈ అధ్యాయము పారాయణ చేస్తే అనంత మయిన భగవంతుడి కృపా కటాక్షాలు దక్కుతాయి.ఆ దేవదేవుడి సహాయ సహకారాలు లభ్యమవుతాయి. దశమాధ్యాయ మాహాత్మ్యాత్తత్వజ్ఞానం సుదుర్లభమ్। లబ్ధమే తేన మునినా జీవన్ముక్తిరియం తథా॥ పూర్వ కాలంలో ఒకప్పుడు బ్రహ్మ దేవుని వాహన జాతికి చెందిన హంస ఒకటి ఉండేది.ఒకసారి ఒక పద్మలత ద్వారా భగవద్గీత యొక్క పదవ అధ్యాయము వినింది.ఇంక ఎప్పుడూ దాని గురించే ఆలోచించేది.మరు జన్మలో అది ఒక బ్రాహ్మణుడి లాగా పుట్టింది.పూర్వ జన్మ జ్ఞానము కలిగి ఉండింది.దాని ప్రభావము చేత ఎప్పుడూ భగవద్గీతలోని పదవ అధ్యాయము స్మరించుకుంటూ ఉండేవాడు.దాని ప్రభావము వలన శివుడు ఎప్పుడూ అతని వెన్నంటే ఉండేవాడు. ఈ విషయం వాళ్ళూ వీళ్ళూ చెప్పడం కాదు.స్వయానా శివుడే భృంగీశ్వరుడితో చెప్పాడు.

నవమ అధ్యాయము…ఫలము

భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్య యోగము.ఈ అధ్యాయము పారాయణ చేస్తే ప్రతిగ్రహణ పాప నాశనము దక్కుతుంది. పూర్వము ఒకరాజు ఉన్నాడు.అతను ఒకసారి ఒక విప్రుడికి కాలపురుషుడి దానము చేసాడు.ఆ విగ్రహము నుంచి చండాల దంపతులు ఆవిర్భవించారు.వారు ఆ బ్రాహ్మణుడిని బాధించడం మొదలు పెట్టారు.తక్షణమే విష్ణు పార్షదులు అక్కడికి వచ్చారు.వచ్చీరాగానే ఆ చండాల దంపతులను తరిమి కొట్టి,బ్రాహ్మణుడిని కాపాడారు.రాజు దీనినంతా గమనించాడు.స్వామీ!ఏమి ఈ మాయ! అని బ్రాహ్మణోత్తముడిని అడిగాడు. అప్పుడు అతను నవ్వుతూ ఇలా అన్నాడు. గీతాయానవమాధ్యాయం జపామి ప్రత్యహం నృప। నిస్తీర్ణాశ్చా పదస్తేన కుప్రతి గ్రహ సంభవాః॥ గీతాయానవమాధ్యాయ మంత్రమాలా మయాస్మృతా। తన్మాహాత్మ్య మిదం సర్వం త్వమవేహి మహీపతే॥ అంటే ఇలా చెప్పాడు.ఓ రాజా!నేను రోజూ క్రమం తప్పకుండా భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయము పారాయణ చేస్తాను.దాని మహాత్మ్యం నీకు కూడా అర్ధం అయింది కదా!నేను తీసుకునే ఇలాంటి దానాల వలన కలిగే పాపం ఆ పుణ్యం వలన సమసిపోతుంది.

Sunday, 12 October 2025

అష్టమ అధ్యాయము…ఫలము

భగవద్గీతలోని అష్టమ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము.దీని పారాయణ ఫలము సర్వ విధ దుర్గతి నాశనము. శ్లోకము ...... జపన్ గీతాష్టమాధ్యాయ శ్లోకార్థం నియతేంద్రియః। సంతుష్ఠ వా నహందేవి తదీయ తపసా భృశమ్॥ పూర్వము భావశర్మ అని ఒకడు ఉన్నాడు.వాడు పరమ భ్రష్టాచారుడు.అందుకని వాడు తరువాత జన్మలో తాటి మాను అయి పుట్టాడు.అచ్చం వీడి లాగే ఇంకో జంట ఉన్నారు.వారు కుమతి-కుశీవలుడు.వీళ్ళు చేయని పాప కర్మలు అంటూ ఏమీ మిగలలేదు.అంతటి దుష్కర్ములు.వాళ్ళు మరు జన్మలో బ్రహ్మ రాక్షసులుగా పుట్టారు.ఒక రోజు వాళ్ళు ఇద్దరూ తాడి చెట్టు కింద కూర్చుని సేద తీరుతున్నారు.వాళ్ళకు ఆ జన్మ అంటే విసుగు వచ్చింది.అప్పుడు భార్య భర్తని అడిగింది.ఏమయ్యా!ఎప్పటికీ మన బతుకులు ఇంక ఇంతేనా?మనకు ఈ బ్రహ్మ రాక్షసత్వము ఎప్పుడు పోతుంది? దానికి అతను చిన్నగా నవ్వుతూ ఇలా అన్నాడు.ఓయీ!ఇదంతా అంత సులభం కాదు.మనము కర్మ వీడి,ఆధ్యాత్మ బుద్ధితో నడచుకోవాలి.బ్రహ్మము గురించి తెలుసుకోవాలి.అప్పుడు మనకు ఈ దుర్దశ వీడుతుంది.మనము అనుకునేటట్లే ఆమెకు తన భర్త చెప్పిన దాంట్లో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు.సహజమే కదా ఆ జన్మకు.మళ్ళీ ఇలా అడిగింది.కిం తత్ బ్రహ్మ?కిమధ్యాత్మం?కిం కర్మ పురుషోత్తమ? బ్రహ్మ ఏంది?అధ్యాత్మం ఏంది?ఏం పనులు గురించి మాట్లాడు తున్నావు?ఆమె ఈ మాటలు మామూలుగానే అడిగింది తన భర్తను.కానీ అవి భగవద్గీతలోని ఎనిమిదవ అథ్యాయములోని మొదటి శ్లోకములోని అర్జునుడు శ్రీకృష్ణుని ఉద్దేశించి పలికిన పలుకులు.ఆ శ్లోకము లోని మొదటి పాదము ఉచ్ఛరించినట్లు అయింది.అది పలకగానే వారి బ్రహ్మరాక్షసత్వము పోయి మామూలుగా అయ్యారు.వారు తాటి చెట్టు క్రింద కూర్చుని ఉన్న కారణంగా తాటి చెట్టుకు కూడా ముక్తి లభించింది.ఇలా ముగ్గురికీ ఉత్తమ గతి ప్రాప్తించింది. ఆ మొదటి శ్లోకము.... అర్జున ఉవాచ.... కిం తద్బ్రహ్మ కి మధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ। అధిభూతం చ కిం ప్రోక్త మధిదైవం కిముచ్యతే॥8-1

Saturday, 11 October 2025

సప్తమ అధ్యాయము….ఫలము

భగవద్గీతలోని ఏడవ అధ్యాయము విజ్ఞాన యోగము.దీని పారాయణము వలన సమస్త జీవజాత సంసార తరణము సంప్రాప్తిస్తుంది. పూర్వము శంకు కర్ణుడు అని ఒకడు ఉండేవాడు.అతను ఒకరోజు పని మీద ప్రక్క ఊరికి వెళ్ళాడు.ఎంతకీ తిరిగి రాడే!అతని కొడుకులకు తండ్రి గురించి ఆదుర్దా అయిపోయింది.వాళ్ళు ఒక సిద్ధుడి దగ్గరకు వెళ్ళారు.తమ తండ్రి జాడ చెప్పమని బతిమలాడారు.ఆ సిద్ధుడు తన దివ్యదృష్టితో అంతా కనుక్కున్నాడు.ఇలా చెప్పనారంభించాడు.నాయనా!మీ తండ్రి మరణించి చాలా రోజులు అయింది.అతను బతికి ఉన్నప్పుడు చాలా సంపాదించాడు.సంపాదించినది మొత్తం ఒక చోట భద్రపరిచాడు.ప్రాణం పోయినా,డబ్బు మీద మమకారం,మోహము వదులుకోలేక పోయాడు.అందుకని తరువాత జన్మలో పాముగా పుట్టాడు.పాముగా ఇప్పుడు ఆ నిథికి కాపలా కాస్తున్నాడు.మీకు చూపిస్తా రండి అని చెప్పి వాళ్ళను అక్కడకు తీసుకెళ్ళాడు.వాళ్ళు ఆ దృశ్యం చూసి చాలా బాథ పడ్డారు.మా తండ్రికి ఏంది ఈ నికృష్టపు జన్మ అని.మా తండ్రిని ఈ దీనమయిన,హేయమయిన దుస్థితి నుంచి ఉద్ధరించే మార్గము ఉంటే చెప్పమని వేడుకున్నారు. అప్పుడు ఆ సిద్ధుడు ఇలా చెప్పాడు. శ్లోకము.... గీతానాం సప్తమాధ్యాయ మంతరేణ సుధామయమ్। జన్తోర్జరామృత్యు దుఃఖ నిరాకరణ కారణమ్॥ శ్లోకము... సప్తమాధ్యాయ జపతో ముక్తిభాజోఽభవంస్తతః। దేవమిష్ట తమం జ్ఞాత్వా నిర్వాహణార్పిత బుద్ధయః॥ పురాణాలలో ఇలా చెప్పబడి ఉంది.కాబట్టి అనుష్ఠాన పూర్వకంగా మీరు గీతలోని ఏడవ అధ్యాయము పారాయణ చేయండి.ఆ ఫలమును మీ తండ్రికి ధారపోయండి. ఈ మాటలు విన్న వారు ఆ సిద్ధుడికి నమస్కరించి ఇండ్లకు వెళ్ళారు.పద్ధతిగా సిద్ధుడు చెప్పినట్లు చేసారు.వాళ్ళ తండ్రికి పరమపదము ప్రాప్తించేదానికి దోహద పడ్డారు.

Friday, 10 October 2025

షష్టాధ్యాయము…ఫలము

భగవద్గీతలోని ఆరవ అధ్యాయము ఆత్మ సంయమ యోగము.పేరుకు తగినట్లే ఈ అధ్యాయము పారాయణ చేస్తే దివ్య తేజఃప్రాప్తి సిద్ధిస్తుంది. పూర్వము జనశ్రుతుడు అనే రాజు ఉండేవాడు.అతడు మంచి ధర్మాత్ముడు.ఒకరోజు ఆరాజు డాబా పైన పండుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు.ఆ సమయంలో ఆకాశంలో ఒక హంసల గుంపు అటు మీదగా పోతూ ఉండింది.ఆగుంపులో ఒక హంస దుందుడుకుగా ప్రవర్తించింది.అది గమనించిన ముసలి హంస ఇలా మందలించింది.ఓ కుర్ర హంసా!ఏంది నీ వ్యవహారం?మనము ధర్మాత్ముడు అయిన రాజు దరిదాపుల్లో వెళుతున్నాము.అంత దుడుకుతనం పనికిరాదు.మట్టూ మర్యాద కొంచెం నేర్చుకో! ఈ హంస మాటలకు కుర్ర హంస నసుగుతూ,గునుస్తూ ఈ మాటలు అనింది.ఓ యబ్బో!ఈ రాజు ఏమైనా రైక్వుడా?ఆయనకంటే ఎక్కవ తేజోవంతుడాయే!ఇంక ఒంగి ఒంగి నమస్కారాలు పెట్టాలి మనమందరమూ!ఇలా ఎగతాళి,అవహేళన,అపహాస్యం చేసింది. రాజు ఆ మాటలన్నీ విన్నాడు.ఒకింత ఆశ్చర్యము కూడా వేసింది.చారులను పిలిపించాడు.రైక్వుడు అనే వాడిని కనుక్కుని తీసుకు రమ్మన్నాడు.చారులు అన్ని చోట్లా వెతికారు.ఉత్త చేతులకో తిరిగి వచ్చారు.వారు రాజుకు ఇలా విన్నవించుకున్నారు.హే రాజా!మేము బాగా వెతికాము.ఆ పేరుతో ఎవరూ మాకు దొరకలేదు.కానీ కాశీ దేశం లోని శ్రీ మాణిక్యేశ్వరాలయము దగ్గర ఒక మహాతేజస్సు ఉండే అతను కనిపించాడు.అతని పేరు రైక్వుడు అని వాళ్ళూ వీళ్ళూ అంటే విన్నాము.అతనిని వెంట పెట్టుకుని వచ్చే ధైర్యము చేయలేక పోయాము. రాజు ఈ మాటలు వినగానే మందీ మార్బలముతో,కానుకలు పట్టుకుని ఆ తేజస్వి దగ్గరకు బయలుదేరాడు.అతనిని దర్శించుకున్నాడు.అంతట ఇలా విన్నవించుకున్నాడు.ఓ మహానుభావా!నీవు దేనినీ ప్రాశించవూ,మరి ఇంక దేనినీ ఆశించవూ!నీవు ఇంత తేజోవంతుడివి ఎలా అయ్యావు?ఆ కథా కమామిషు నాకు వివపరించేది. దానికి చిరునవ్వుతో రైక్వుడు ఇలా సమాథానం ఇచ్చాడు.రాజా!నీవు అంటున్న ఆ తేజస్సో,ఓజస్సో,నాకు ఏమీ తెలియదు.అవి ఎట్లా వచ్చాయో,ఎందుకు వచ్చాయో అస్సలు తెలియదు.నాలో ఏమైనా విశిష్టంగా కనిపించింది అంటే నేను అనుకునే కారణం బహుశ ఇది అయి ఉండవచ్చు.నేను నిత్యమూ భగవద్గీతలోని ఆరవ అధ్యాయమ క్రమం తప్పకుండా పారాయణము చేస్తాను.అంతే!ఇదంతా బహుశ దాని మహాత్మ్యమే ఉండి ఉంటుంది.అతను ఇలా అన్నాడు. శ్లోకము.... గీతానాం షష్ఠమధ్యాం జపామిప్రత్యహం నృపయమ్। తేనైవ తేజోరాశి ర్మేసురాణామపి దుస్సహః॥

Thursday, 9 October 2025

పంచమ అధ్యాయము…ఫలము

భగవద్గీతలోని ఐదవ అధ్యాయము కర్మ సన్యాస యోగము.దీని ఫలితము అమోఘము.జ్ఞానశూన్యులు అయిన పశుపక్ష్యాదులు కూడా తరిస్తాయి. ఆ కథ ఏందో విందాము.పూర్వము అరుణ,పింగళుడు అని భార్యా భర్తలు ఉండేవారు.ఎప్పుడూ అడ్డూ ఆపూ లేకుండా గొడవలు,తగవులూ పడుతూ కాపురము చేస్తూ ఉండేవారు.ఆ తరువాత జన్మలో వారు చిలుక,గ్రద్దలాగా పుట్టారు.పూర్వ జన్మ విరోధము కారణంగా,వారికి తెలియకుండానే మళ్ళీ ఈ జన్మలోకూడా ఎప్పుడూ ఘర్షణ పడుతుండే వాళ్ళు.ఒకసారి ఇలా కొట్టుకుంటూ ఒక నర కపాలంలో పడి మరణించాయి.ప్రాణాలు పోగానే విష్ణుపాలకులు వచ్చి వారిని వైకుంఠం తీసుకుని పోయేదానికి ప్రయత్నించారు.అప్పుడు ఆ చిలుక,గ్రద్ద వాళ్ళను ఇలా అడిగారు.స్వామీ!పొద్దున లేస్తే తన్నుకోవటమూ,కొట్టుకోవటము తప్ప ఇంకోటి చెయ్యలేదు మేము.ఎంత సేపూ పాపపు ఆలోచనలు,పాపపు పనులులోనే జీవితాలు గడచిపోయాయి.అలాంటి మాకు ఈ వైభోగము ఏంది?ఈ అదృష్టం ఎందుకు? అప్పుడు ఆ వైష్ణవులు చిరునవ్వుతో ఇలా సమాథానం ఇచ్చారు.అమాయకులు మీరు.పాప పుణ్యాలు అనేవి మీ దేహాలకే కానీ,మీ ఆత్మలకు లేదు.అదీ కాకుండా,మీ శరీరాలు ఒక నరుడు పుర్రెలో పడ్డాయి కదా!ఆ పుర్రె ఎవరిది అనుకుంటున్నారు?అతను నిత్యమూ భగవద్గీతలోని పంచమ అధ్యాయము పారాయణము చేసిన పుణ్యాత్ముడు.అతను సంపాదించిన పుణ్యములో ఒక ఇసుక రేణువు అంత పుణ్యము మీకు దక్కింది అతని పుర్రెలో పడిన కారణంగా.అందుకే మీకు ఈ వైకుంఠవాసభోగము.ఇలా చెప్పి వారిని ఆకాశమార్గంలో వైకుంఠానికి తీసుకెళ్ళారు.

చతుర్థ అధ్యాయము…ఫలము

భగవద్గీతలోని చతుర్ధ అధ్యాయము జ్ఞాన యోగము.ఈ అధ్యాయము పారాయణ చేస్తే చెడు ఆలోచనలు మనలను చుట్టు ముట్టడం ఆగిపోతుంది.ఏమైనా శాపాలు పూర్వజన్మలోనో,ఈ జన్మలోనో తగిలి ఉంటే వాటికి విరుగుడు అయి శాప విమోచనము కలుగుతుంది. శ్లోకము.... నిత్యమాత్మరతస్తుర్యం జపత్యధ్యాయమాదరాత్। తదభ్యాసాదదుష్టాత్మా నద్వంద్వైరభిభూయతే॥ పూర్వము సత్యతపుడని ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు.ఇంద్రుడు అతని తపస్సును చెరపాలని అనుకున్నాడు.అనుకున్నదే తడవుగా తన దగ్గర ఉండే అప్సరసలను పంపించాడు ఆ ఋషి దగ్గరకు.పాపం ఆ అప్సరసలు ఇంద్రుడి ఆజ్ఞ మేరకు వెళ్ళి ఋషికి తపోభంగం కలిగించారు.ఇంకేముంది?సత్యతపుడు కోపంగా వాళ్ళను అక్కడే రేగి చెట్లుగా పడి ఉండండి అని శపించాడు.ముని ఇచ్చిన కారణంగా ఆ అప్సరసలు అక్కడే బదరీవృక్షాలుగా మారి,నిలబడి పోయారు. కొన్నాళ్ళకు ఆ జమిలి,రేగుచెట్ల నీడకోసం భరతుడు అనేవాడు వచ్చాడు.అతను ప్రశాంతంగా ఉంది అనుకుని భగవద్గీత నాలుగో అధ్యాయము,అదే జ్ఞాన యోగము పారాయణము చేసుకున్నాడు.ఆ మహిమ కారణంగా అప్సరసలు తమ పూర్వ స్థితికి వచ్చారు.వారికి శాపవిముక్తి కలిగింది.వాళ్ళు భరతుడికి ధన్యవాదాలు చెప్పారు.గీతా మహిమను కొనియాడారు.అలా వారు తిరిగి దేవలోకం బయలుదేరారు.

Wednesday, 8 October 2025

తృతీయ అధ్యాయము..ఫలము

తత్రాధ్యాయం సగీతాయాస్తృతీయం సంజజాపహ॥ భగవద్గీతలోని తృతీయ అధ్యాయము కర్మ యోగము.ఈ అధ్యాయము పారాయణ చేస్తే పాపనాశనముఅవుతుంది.దానితో బాటు ప్రేతత్వ విముక్తి కూడా కలుగుతుంది. పూర్వము జడుడు అనేవాడు ఒకడు ఉన్నాడు.వాడి కులాచారము అస్సలంటే అసలు పాటించేవాడు కాదు.దురాచారాలకు పాలపడుతుండేవాడు.ఇలాగే అడ్డూ ఆపూ లేకుండా తిరుగుతూ ఉండేవాడు.డబ్బులకు కక్కుర్తి పడిన దొంగలు కొందరు అతనిని దోచుకుని,ఒక చెట్టు క్రింద హతమార్చారు.జడుడు పాపాల పుట్టగా ఉన్నాడు కదా బతికినన్ని రోజులు!అందుకని ప్రేతాత్మ అయి ఆ చెట్టుపైనే ఉంటూ వచ్చాడు.కొంతకాలము తరువాత అతని కొడుకు కాశీకి బయలుదేరాడు.మార్గమధ్యంలో అలసిపోయి,ఆ చెట్టిక్రిందనే సేదతీరాడు.యధాలాపంగా భగవద్గీత తెరచి మూడవ అధ్యాయము పఠించాడు.అలా పారాయణము పూర్తికాగానే జడుడికి ప్రేతరూపము పోయింది.దివ్యరూపముతో విమానము ఎక్కి స్వర్గానికి పయనమయ్యాడు.అలా పోతూ పోతూ తన కొడుకుని ఉద్దేశించి ఇలా అన్నాడు.నాయనా!కుమారా!నీవు భగవద్గీత మూడవ అధ్యాయము చదవటం వలన నా ప్రేతత్వము పోయి,దివ్యరూపము చేకూరింది.స్వర్గానికి కూడా పోతున్నాను.ఇది చాలా శక్తివంతమయిన అధ్యాయము.కాబట్టి నీవు క్రమం తప్పకుండా అనునిత్యం పారాయణ చెయ్యి.నీ జీవితము ధన్యమవుతుంది.జడుడు ఇలా తన కొడుకును ఆశీర్వదించి,స్వర్గానికి పయనమయినాడు.

Tuesday, 7 October 2025

ద్వితీయ అధ్యాయము…ఫలము

శ్లోకము.. శిక్షిత స్తేన పూతాత్మా పఠన్నధ్యాత్మ మాదరాత్। ద్వితీయమాససాదోచ్చైః నిరవద్యం పరంపదమ్॥ ద్వితీయ అధ్యాయము అంటే సాంఖ్య యోగము.దీని పారాయణ ఫలం ఆత్మజ్ఞానము. పూర్వము దేవశర్మ అని సదాచార సంపన్నుడు ఉన్నాడు.అతనికి ఆత్మజ్ఞానము సమకూర్చుకోవాలి అనే తపన ఉండేది.అతను ఒక సాథువును ఆశ్రయించాడు.ఆ సాధువు దేవశర్మను మిత్రవంతుడు అనే మేకలను కాచుకునే మేకల కాపరి వద్దకు పంపాడు.దేవశర్మ సరే అని ఆ మేకలకాపరి దగ్గరకు వెళ్ళి విషయము చెప్పాడు.అప్పుడు మిత్రవంతుడు ఇలా చెప్పసాగాడు.అయ్యా!ఒకరోజు అలవాటుగా మేకలను కాచుకుంటూ ఉన్నాను.ఇంతలో ఒక పులి అక్కడకు వచ్చింది.దానికి భయపడి కాపరులము తలా ఒక దిక్కుకు పరుగులు తీసాము.మేకలు కూడా చెల్లా చెదురుగా పరిగెత్తాయి.కానీ దిక్కుతోచని కొన్ని మేకలు అక్కడక్కడే పరుగులు తీస్తూ ఆ పులికి చిక్కాయి.ఆశ్చర్యం!ఆ పులి ఆ మేకలను చంపి తినలేదు.మేకలు కూడా దానితో సఖ్యంగా వ్యవహరించాయి.నాకు చాలా ఆశ్చర్యమేసింది.అది ప్రకృతి విరుద్థంకదా!ఎంత ఆలోచించినా బుర్రకు ఏమీ అర్థం కాలేదు.ఇక లాభం లేదనుకుని అక్కడే ఉన్న వృద్థ మర్కటాన్ని అడిగాను.అప్పుడు ఆ ముసలి కోతి ఇలా జవాబు ఇచ్చింది.ఓ మిత్రవంతుడా!విను.పూర్వము యోగీంద్రుడు ఒకడు ఉన్నాడు.అతను శిలా ఫలకాల పైన గీత రెండవ అధ్యాయము చెక్కించాడు.అ ఫలకాలను సుకర్మ అనే అతనికి ఇచ్చాడు.సుకర్మ ఇక్కడే,ఈ ప్రదేశం లోనే ఆ రెండవ అధ్యాయాన్ని పారాయణము చేసేవాడు.అలా అతను ఆత్మజ్ఞానాన్ని పొందాడు.అంతటి గొప్ప సిద్థ పురుషుడు నడయాడిన స్థలంలో పులిమేకలు కలసి మెలసి ఉండటంలో ఆశ్చర్యము ఏముంది? మిత్రవంతుడు ఇంకా ఇలా చెప్పుకొచ్చాడు.ఆ వానరము సూచనలు సలహాలు విని నేను కూడా నిత్యం ఈ శిలా ఫలకాల పైన ఉండే ద్వితీయ అధ్యాయాన్ని పారాయణ చేస్తున్నాను.ఈ మాటలకు దేవశర్మ కూడా ఆనంద భరితుడు అయ్యాడు.అతను కూడా అక్కడే ఉంటూ రెండవ అధ్యాయము పారాయణము చేసుకునేవాడు.కాలక్రమేణ అతను ఆత్మజ్ఞానాన్ని పొందాడు.

Monday, 6 October 2025

ప్రధమ అధ్యాయము …ఫలము

పద్మ పురాణంలో అంతర్గతంగా భగవద్గీత పారాయణం చేస్తే చేకూరే ఫలము,ఫలితము గురించి ప్రస్తావన ఉంది. ప్రధమ అధ్యాయము పారాయణం చేస్తే పూర్వ జన్మ స్మృతులు,పాపనాశనము,తదుపరి మంచి జన్మ దక్కుతాయి. శ్లోకము.... తస్మాదధ్యాయమాద్యం యఃపఠేత్ శ్రుణుతే స్మరేత్। అభ్యసేత్తస్యనభవేత్ భవాంభోధిర్దురుత్తరః॥ పూర్వము సుశర్మ అని ఒకడు ఉండేవాడు.వాడు చెయ్యని భ్రష్టు పని అంటూ ఏదీ ఈ భూమి మీద మిగల లేదు.మరణించిన తరువాత మళ్ళీ ఎద్దుగా పుట్టాడు.ఒకానొక రోజు ఆ ఎద్దు పర్వత ప్రాంతాలలో బరువులు మోస్తూ,నేలకూలింది.భయంకరమయిన మరణ యాతన అనుభవిస్తూ ఉండింది.ఆ దారిలో వస్తూ పోతూ ఉండే వాళ్ళందరూ దాని కష్టం చూసి కళ్ళనీళ్ళ పర్యంతం అవుతున్నారు.కానీ నిస్సహాయంగా ఉన్నారు.వాళ్ళలో ఒక వేశ్య ఉండింది.దాని బాధ చూసి,చలించిపోయింది.మనస్పూర్తిగా దేవుడికి ఇలా దణ్ణం పెట్టుకుంది.హే భగవంతుడా!నా జన్మలో నేను ఏదైనా పుణ్యం చేసి ఉంటే ఆ ఫలం అంతా ఈ ఎద్దుకు సంక్రమించేలా చేయి.దానికి సద్గతి కలిగేలా చూడు స్వామీ! ఆమె ద్వారా చేకూరిన పుణ్యం వలన ఆ ఎద్దు మరు జన్మలో బ్రహ్మజ్ఞానిగా పుట్టాడు.పూర్వ జన్మ స్మృతి వలన ఆ వేశ్య ఇంటికి పోయాడు.నీ వలన నాకు ఇంత ఉత్కృష్టమయిన జన్మ దక్కింది.నీవు నాకు ధారబోసిన పుణ్యం ఏంది అని ఆమెను అడిగాడు. ఆమె నాకు తెలియదు అనింది. ఆమె దగ్గర ఒక పెంపుడు చిలక ఉంది.అది బ్రహ్మ జ్ఞానిని చూసి ఇలా చెప్పడం మొదలు పెట్టింది.అయ్యా!మొదట్లో నేను ఒక ముని ఆశ్రమములో తిరుగుతూ ఉండేదానిని.ఆ ఋషి క్రమము తప్పకుండా రోజూ భగవద్గీత మొదటి అధ్యాయము పారాయణము చేసేవాడు.అది విని విని నాకు కూడా వచ్చేసింది.ఇంతలో విథి నన్ను ఈమె దగ్గరికి తీసుకుని వచ్చింది.నా అలవాటుకొద్దీ నేను రోజూ భగవద్గీత పారాయణము చేసుకునేదాన్ని.నా మీద ఉండే అలవిమాలిన ప్రేమవలన ఈమె శ్రద్థగా రోజూ వినేది.దాని వలన వచ్చిన పుణ్యమే ఆమె నీకు థారపోసింది. బ్రహ్మజ్ఞాని ఆ చిలుక మాటలకు అవాక్కయ్యాడు.తనలో తాను ఇలా అనుకున్నాడు.ఔరా!భగవద్గీతలోని ప్రధమ అథ్యాయము వింటేనే ఇంత పుణ్యం దక్కేటట్లయితే,పూర్తి భగవద్గీతా పారాయణం అనునిత్యం చేస్తే ఇంకెంత పుణ్యం దక్కుతుంది!!!???ఆమెకూడా ఈ విషయం తెలుసుకొని తబ్బిబ్బయింది.ఆ ఇద్దరూ అప్పటినుంచి అనునిత్యమూ ప్రథమ అథ్యాయము,అర్జున విషాద యోగము పఠిస్తూ,పారాయణ చేస్తూ ఉన్నారు.జన్మాంతరమున కైవల్యం పొందారు.

Saturday, 4 October 2025

సప్త శ్లోకీ గీత

ఓమిత్యే కాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్। యః ప్రయాతి త్యజన్దేహం సయాతి పరమాం గతిమ్॥8-13 స్థానే హృషీకేశ తనప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్య తేచ। రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః॥11-36 సర్వతః పాణి పాదం తత్సర్వతోఽక్షి శిరోముఖమ్। సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి॥13-14 కవిం పురాణ మనుశాసితారమణోరణీయాంస మనుస్మ రేద్యః। సర్వస్య ధాతార మతిన్త్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్॥8-9 ఊర్ధ్వమూల మధశ్శాఖ మశ్వత్థం ప్రాహురవ్యయమ్। ఛంధాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్॥15-1 సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ। వేదైశ్త సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేదవిదేవ చాహమ్॥15-15 మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు। మామేవైష్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణః॥9-34 హే అర్జునా!ఇంద్రియ నిగ్రహంతో బ్రహ్మపరమైన ఓం అనే మహా మంత్రాన్ని ధ్యానించాలి.సదా నన్నే స్మరిస్తూ ఉండాలి.అలాంటి అవస్థలో దేహత్యాగం చేసేవాడు పరమ పదాన్ని సునాయాసంగా పొందుతాడు.8-13 అర్జునుడు భగవంతుని విశ్వరూపం చూసి ఇలా అంటున్నాడు.హే కృష్ణా!హే హృషీకేశా!నీ గుణగణాల కీర్తనలతో ప్రపంచం అంతా ఆనందిస్తుంది.రాక్షసులు ఏమో భయంతో వణికి పోతున్నారు.ఎటు పోవాలో తెలియక నలుదిక్కులకూ పరుగులు తీస్తున్నారు.మునులు,సిద్థులు అవథులు దాటిన ఆనందంతో నీకు నమస్సుమాంజలులు అర్పిస్తున్నారు.11-36 అత్యుత్తమమయిన జ్ఞానమే పరబ్రహ్మము.ఎటు చూసినా కాళ్ళు,చేతులు ,ముఖాలు,చెవులూ కలిగి అది ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది.13-14 భగవంతుడు అనేవాడు కవి,పురాణపురుషుడు.అతను ఈ జగత్తును అంతా నియమించిన వాడు.అణువు కంటే సూక్ష్మం అయినవాడు.అయినా సర్వ జగత్తునూ పాలించేవాడు.ఈసృష్టి మొత్తం అతని పైనే ఆథారపడి ఉంది.వేయి సూర్యులకంటే ఎక్కవ వెలుగునిచ్చేవాడు.అజ్ఞానపు అంథకారాన్ని తొలగించేవాడు.ఆపరమాత్మను మనము ఆరాధించాలి.అప్పుడు ఖచ్చితంగా ఆ పరమాత్మనే పొందగలుగుతాము.8-9 శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!ఒక అశ్వత్థ వృక్షము ఉంది.దానికి వ్రేళ్ళు పైకి ఉంటాయి.కొమ్మలేమో క్రిందికి ఉంచాయి.వేదాను వాకాలను ఆకులుగా కలిగి ఉంటుంది.దానికి నాశనము అనేది లేదు.ఆ వృక్షము గురించి తెలుసుకున్నవాడే వేదవిదుడు.15-1 శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటున్నాడు.అర్జునా!అందరిలో నేనే ఉన్నాను.ఎలా అనుకున్నావు?వారి అంతరాత్మలాగా నిబిడీకృతమై ఉంటాను.మనషిలో కనిపించే జ్ఞాపకం,జ్ఞానము,మరపు...ఇలా ప్రతి ఒక్క గుణము నా వల్లనే కలుగుతున్నాయి.నేను ఎవరనుకున్నావు?నేనే వేదవేద్యుడను.నేనే వేదాంత కర్తను.వేదవేత్తను కూడా నేనే.సమగ్రంగా చెప్పాలంటే కర్త,కర్మ,క్రియలు నేనే.నన్ను మించి ఇంకేమీ లేదు.15-15 శ్రీకృష్ణుడు ముక్తాయింపుగా ఈ సూచన,సలహా ఇస్తున్నాడు.అర్జునా!నీకు ఒక చిన్న చిట్కా చెబుతాను.నువ్వు నాయందే మనసు నిలిచేటట్లు చేసుకో.నా భక్తుడివి అయ్యేదానికి నడుము బిగించునన్నే సేవించి తరించు.నన్నే నమ్ముకో!నాకే నమస్కారము చెయ్యి.నాయందే నీ దృష్టి నిలిచేలా చేసుకో!అంటే ఒక రకంగా నాతోటి మమేకం అవ్వాలి అని చెబుతున్నాడు.ఇలా చేస్తేనే నన్ను పొందగలవు.పరమపదమూ పొందగలవు.

Thursday, 2 October 2025

గీతతో నా స్నేహం

నేను చిన్నప్పుడు మా బాబు(నాన్న)రోజూ స్నానంచేసి వచ్చి దేవుడి ముందర భగవద్గీత చదవడం చూసేదాన్ని.నేను మొట్ట మొదటి సారి నా తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు దానిని పట్టుకుని ఒక్క శ్లోకం కూడుకుంటూ చదివాను ఒక్కొక్క పదం.తరువాత చిన్నగా అలవాటు అయి ఇప్పుడు రోజూ గీత మొత్తం చదివే స్థితికి వచ్చాను.నాకు గీత ఏమనిపిస్తుందో చెబుతాను. తప్పు ఎవరు చేసినా తప్పే.ఒప్పు ఎవరు చేసినా ఒప్పే.మన బిడ్డ చేసాడని తప్పు ఒప్పు కాదు.ఇష్టం లేని వారు చేస్తే ఒప్పు తప్పుకాదు.ధర్మానికి తన మన అని ఉండదు.దాని దారిలోకి మనము రావాలి కానీ మన దారిలోకి అది రాదు.భగవద్గీత మొత్తమూ మనుష్య సంబంధాలు...అదే తల్లిదండ్రులు,భార్యాబిడ్డలు,తోడబుట్టినవాళ్ళు,బంధుజనం గురించి చెప్పదు.మానవుడు సమస్త ప్రాణికోటితో ఎలా నడచుకోవాలో చెబుతుంది.సంయమనం పాటించమంటుంది.పిరికితనం,భయం వద్దంటుంది.తప్పు చేస్తే భయపడాలి.కాబట్టి ఆ తట్టే వెళ్ళ వద్దు అంటుంది.ఫలాపేక్ష లేకుండా సమాజహితం కోసం పాటుపడమంటుంది.కామక్రోధలోభమదమాత్సర్యాలకు దూరంగా ఉండమంటుంది.

గొప్పవాళ్ళ మాటల్లో గీత

గొప్ప గొప్ప వాళ్ళు గీతను తమ జీవితాలలో భాగం చేసుకున్నారు.గీతను తమ జీవితగమనంలో అడుగడుగునా అన్వయించుకుంటూ ముందుకు సాగారు.జీవిత సమరంలో సఫలీకృతులు అయ్యారు. మహాత్మా గాంధీ ఇలా చెప్పుకొచ్చాడు.ఎన్ని ఒడుదుడుకులు జీవితంలో ఎదురైనా ఒక్కసారి భగవద్గీత చదివితే చాలు.ముఖం పైకి చిరునవ్వు మనకు తెలియకుండానే వస్తుంది.అనేకానేక కష్టాల నుండి,సమస్యల నుంచీ,సందేహాల నుంచీ ఈ భగవద్గీతే నన్ను కాపాడి,ఉద్ధరించింది. వినోబా భావే అయితే ఇలా అంటారు.పుట్టిన బిడ్డకు తల్లి పాలు ఎంత ముఖ్యం?అవి బిడ్డ ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి.అట్లాంటి తల్లి చనుబాలకంటే కూడా భగవద్గీత మనిషి ఎదుగుదలకు సహాయకారి.సంపూర్ణమయిన ఎదుగుదల...బుద్ధికీ,మనోవికాసానికీ,సంయమనము పాటించేదానికి ఉపయోగ పడుతుంది. మదన్ మోహన్ మాళవ్యగారు అయితే ఇది అసలు మత గ్రంధము కానే కాదు.విశ్వమానవాళికి పనికి వచ్చే ధర్మభాండాగారము.ఇప్పటిదాకా ప్రపంచవాజ్మయంలో ఇంతకంటే గొప్పగ్రంధం ఇంకొకటి పుట్టలేదు అని అన్నారు. మథుసూదన సరస్వతి అయితే ఇంకా బాగా విశ్లేషణ చేసారు.గీ అనగా త్యాగము.త అనగా తత్త్వము.అంటే భగవద్గీత మనకు త్యాగివై తత్త్వజ్ఞుడివి కావాలని బోధిస్తుంది.మనకు త్యాగము...కర్మఫలత్యాగము,తత్త్వము...ఆత్మస్పృహ..ఆత్మజ్ఞానము,పరిపక్వత వేర్పిస్తుంది. లోకమాన్య తిలక్ ఈ మహా గ్రంధం గురించి ఈ విధంగా నొక్కి వక్కాణించారు.మనిషిగా జన్మ నెత్తినవాడు ఏమి చెయ్యాలి,ఏమేమి చేయకూడదో తాత్విక దృష్టితో విశ్లేషణ చేస్తూ,బోధించే గ్రంథము.కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితకాలంలో తప్పనిసరిగా చదవాల్సిన గ్రంధము. స్వామి వివేకానంద శ్రీకృష్ణుడి పలుకులు,భగవద్గీత ద్వారా,మనకు ఏమి చెప్పాడో విందాము.పిరికి తనం నరకంకన్నా హీనమయినది,హేయమయినది.జీవితం రణరంగం లాంటిది.ధైర్యంగా సాగాలి ముందుకు. గీత అనేది ఏరి,కూర్చిన పుష్ప గుచ్ఛం లాంటిది.చక్కగా,సుందరంగా,సమన్వయంగా అల్లిన పూలమాల లాంటిది.ఈ గీత అత్యంత నైపుణ్యంతో కూర్చిన ధర్మసూక్ష్మాల సముచ్చయము.జీవితంలో ఉన్నత శిఖరాలు అథిరోహించాలి అనే తపన ఉండే ప్రతివాడూ తప్పకుండా గీతోపదేశాన్ని అధ్యయనము చేయాలి.ఇంతకంటే మంచి సాధనము ఇంకొకటి లేదు.

గీతా గంగా చ గాయత్రీ

గీతా గంగా చ గాయత్రీ గోవిందేతి హృదిస్థితే। చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే॥ గీత యొక్క గొప్పదనం మహాభారత గ్రంథంలో కూడా ఉటంకించారు.గీత,గంగ,గాయత్రీ,గోవింద అనే ఈ నామాలు మనకు పరమ పవిత్రమయినవి.భగవద్గీత మహాత్మ్యము మనము చెప్పుకున్నాము కదా!అన్ని నదీ జలాలలోకి గంగ పవిత్రమయినది.నేరుగా శివుడి జటాజూటం నుంచి భూమిపైకి ఉరకలేస్తూ సాగే జీవనది.గాయత్రీ మంత్రము ఎంత పవిత్రమయిన మంత్రమో అందరికీ తెలుసు.అలాగే గోవింద నామము.ప్రముఖంగా ఈ కలియుగంలో గోవింద గోవింద అనే నామము యొక్క ప్రాశస్త్యము మనందరికీ తెలుసు.గ కారముతో మొదలు అయే ఈ నాలుగు నామాలను విడవకుండా సతతమూ తలుస్తూ ఉండాలి.అలాంటి వారికి పునర్జన్మ అనేది ఉండదు అని ప్రగాఢ నమ్మకము.పునర్జన్మ లేదంటే పరమపదము మనకు దక్కినట్లే కదా!

Wednesday, 1 October 2025

భగవద్గీతా కించి దధీతా

భగవద్గీతా కించి దధీతా గంగాజలలవ కణికాపీతా। సకృదపి యేనమురారి సమర్చా తస్య కరోతి యమోపినచర్చా॥ నువ్వు నేనూ కాదు,జగద్గురు శంకరాచార్యులవారు కూడా తను రచించిన భజగోవిందమ్ లో భగవద్గీత యొక్క గొప్పదనం చెప్పారు.ఆయన ఇదే చెప్పారు.మనము జీవితంలో ఒక్కసారైనా ఆ శ్రీకృష్ణుడిని,ఆ మురారిని ధ్యానం చేసుకోవాలి.ఒక్క చుక్క అయినా పవిత్రమయిన గంగాజలాన్ని తాగాలి.ఒక్కసారి అయినా కళ్ళ కద్దుకుని భగవద్గీతలోని ఒక్క శ్లోకమయినా శ్రద్ధగా చదవాలి.పైన చెప్పిన ఈ పనులు క్షణకాలమయినా మనస్పూర్తిగా చేస్తే మనము పుణ్యాత్ములకోవలోకి చేరిపోతాము.అప్పుడు యముడు కూడా మన దరిదాపుల్లోకి తచ్చాడేదానికి భయపడతాడు.