Thursday, 9 October 2025
పంచమ అధ్యాయము…ఫలము
భగవద్గీతలోని ఐదవ అధ్యాయము కర్మ సన్యాస యోగము.దీని ఫలితము అమోఘము.జ్ఞానశూన్యులు అయిన పశుపక్ష్యాదులు కూడా తరిస్తాయి.
ఆ కథ ఏందో విందాము.పూర్వము అరుణ,పింగళుడు అని భార్యా భర్తలు ఉండేవారు.ఎప్పుడూ అడ్డూ ఆపూ లేకుండా గొడవలు,తగవులూ పడుతూ కాపురము చేస్తూ ఉండేవారు.ఆ తరువాత జన్మలో వారు చిలుక,గ్రద్దలాగా పుట్టారు.పూర్వ జన్మ విరోధము కారణంగా,వారికి తెలియకుండానే మళ్ళీ ఈ జన్మలోకూడా ఎప్పుడూ ఘర్షణ పడుతుండే వాళ్ళు.ఒకసారి ఇలా కొట్టుకుంటూ ఒక నర కపాలంలో పడి మరణించాయి.ప్రాణాలు పోగానే విష్ణుపాలకులు వచ్చి వారిని వైకుంఠం తీసుకుని పోయేదానికి ప్రయత్నించారు.అప్పుడు ఆ చిలుక,గ్రద్ద వాళ్ళను ఇలా అడిగారు.స్వామీ!పొద్దున లేస్తే తన్నుకోవటమూ,కొట్టుకోవటము తప్ప ఇంకోటి చెయ్యలేదు మేము.ఎంత సేపూ పాపపు ఆలోచనలు,పాపపు పనులులోనే జీవితాలు గడచిపోయాయి.అలాంటి మాకు ఈ వైభోగము ఏంది?ఈ అదృష్టం ఎందుకు?
అప్పుడు ఆ వైష్ణవులు చిరునవ్వుతో ఇలా సమాథానం ఇచ్చారు.అమాయకులు మీరు.పాప పుణ్యాలు అనేవి మీ దేహాలకే కానీ,మీ ఆత్మలకు లేదు.అదీ కాకుండా,మీ శరీరాలు ఒక నరుడు పుర్రెలో పడ్డాయి కదా!ఆ పుర్రె ఎవరిది అనుకుంటున్నారు?అతను నిత్యమూ భగవద్గీతలోని పంచమ అధ్యాయము పారాయణము చేసిన పుణ్యాత్ముడు.అతను సంపాదించిన పుణ్యములో ఒక ఇసుక రేణువు అంత పుణ్యము మీకు దక్కింది అతని పుర్రెలో పడిన కారణంగా.అందుకే మీకు ఈ వైకుంఠవాసభోగము.ఇలా చెప్పి వారిని ఆకాశమార్గంలో వైకుంఠానికి తీసుకెళ్ళారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment