Tuesday, 7 October 2025
ద్వితీయ అధ్యాయము…ఫలము
శ్లోకము..
శిక్షిత స్తేన పూతాత్మా పఠన్నధ్యాత్మ మాదరాత్।
ద్వితీయమాససాదోచ్చైః నిరవద్యం పరంపదమ్॥
ద్వితీయ అధ్యాయము అంటే సాంఖ్య యోగము.దీని పారాయణ ఫలం ఆత్మజ్ఞానము.
పూర్వము దేవశర్మ అని సదాచార సంపన్నుడు ఉన్నాడు.అతనికి ఆత్మజ్ఞానము సమకూర్చుకోవాలి అనే తపన ఉండేది.అతను ఒక సాథువును ఆశ్రయించాడు.ఆ సాధువు దేవశర్మను మిత్రవంతుడు అనే మేకలను కాచుకునే మేకల కాపరి వద్దకు పంపాడు.దేవశర్మ సరే అని ఆ మేకలకాపరి దగ్గరకు వెళ్ళి విషయము చెప్పాడు.అప్పుడు మిత్రవంతుడు ఇలా చెప్పసాగాడు.అయ్యా!ఒకరోజు అలవాటుగా మేకలను కాచుకుంటూ ఉన్నాను.ఇంతలో ఒక పులి అక్కడకు వచ్చింది.దానికి భయపడి కాపరులము తలా ఒక దిక్కుకు పరుగులు తీసాము.మేకలు కూడా చెల్లా చెదురుగా పరిగెత్తాయి.కానీ దిక్కుతోచని కొన్ని మేకలు అక్కడక్కడే పరుగులు తీస్తూ ఆ పులికి చిక్కాయి.ఆశ్చర్యం!ఆ పులి ఆ మేకలను చంపి తినలేదు.మేకలు కూడా దానితో సఖ్యంగా వ్యవహరించాయి.నాకు చాలా ఆశ్చర్యమేసింది.అది ప్రకృతి విరుద్థంకదా!ఎంత ఆలోచించినా బుర్రకు ఏమీ అర్థం కాలేదు.ఇక లాభం లేదనుకుని అక్కడే ఉన్న వృద్థ మర్కటాన్ని అడిగాను.అప్పుడు ఆ ముసలి కోతి ఇలా జవాబు ఇచ్చింది.ఓ మిత్రవంతుడా!విను.పూర్వము యోగీంద్రుడు ఒకడు ఉన్నాడు.అతను శిలా ఫలకాల పైన గీత రెండవ అధ్యాయము చెక్కించాడు.అ ఫలకాలను సుకర్మ అనే అతనికి ఇచ్చాడు.సుకర్మ ఇక్కడే,ఈ ప్రదేశం లోనే ఆ రెండవ అధ్యాయాన్ని పారాయణము చేసేవాడు.అలా అతను ఆత్మజ్ఞానాన్ని పొందాడు.అంతటి గొప్ప సిద్థ పురుషుడు నడయాడిన స్థలంలో పులిమేకలు కలసి మెలసి ఉండటంలో ఆశ్చర్యము ఏముంది?
మిత్రవంతుడు ఇంకా ఇలా చెప్పుకొచ్చాడు.ఆ వానరము సూచనలు సలహాలు విని నేను కూడా నిత్యం ఈ శిలా ఫలకాల పైన ఉండే ద్వితీయ అధ్యాయాన్ని పారాయణ చేస్తున్నాను.ఈ మాటలకు దేవశర్మ కూడా ఆనంద భరితుడు అయ్యాడు.అతను కూడా అక్కడే ఉంటూ రెండవ అధ్యాయము పారాయణము చేసుకునేవాడు.కాలక్రమేణ అతను ఆత్మజ్ఞానాన్ని పొందాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment