Thursday 12 September 2024

యచ్చాపహాసార్థ మసత్కృతోఽసి

యచ్చాపహాసార్థ మసత్కృతోఽసి విహార శయ్యాసన భోజనేషు ఏకోఽథవాప్యచ్యుత తత్సమక్షం తత్ క్షామయే త్వామహ మప్రమేయమ్॥42-11 విశ్వరూప సందర్శన యోగము మనం మన మిత్రులతో ఎలా వుంటాము?సరదా సరదాగా వుంటాము.తమాషాలు పడుతూ వుంటాము.తన్ను కుంటాము,మళ్ళీ అంతలోనే క్షమాపణలు చెప్పుకుంటాము.మళ్ళీ ఒకటై పోతాము.స్నేహితుల మథ్యలో ఎవరైనా దూరితే వాళ్ళు వెర్రి వెంగళప్పలు అయి పోతారు. కృష్ణార్జునులు కూడా అంతే.మంచి స్నేహితులు.దానికి తోడు బావా బావమరుదుల సంబంథం.ఇక చెప్పాలనా వాళ్ళ అన్యోన్యత! ఇప్పుడు అర్జునుడు అదే అంటున్నాడు కృష్ణుడితో.కృష్ణా!నేను నీ తోటి బోజనాలు చేసే సమయంలో,విహారానికి వెళ్ళినప్పుడు,నిద్రకు ఉపక్రమించేటప్పుడు,ఇలా చాలా సార్లు చాలా సందర్భాలలో తమాషాలు పడ్డాను.నీతో పరిహాసాలాడాను.మనం పదిమందిలో వున్నప్పుడూ ఎక్కిరించాను.ఒంటరిగా మనం మటుకే వుండేటప్పుడూ ఎకచకాలాడాను.నీవు ఇంత గొప్ప మహాత్ముడివని అప్పట్లో నాకు తెలియదు.కాబట్టి నా ఈ నోటి తుత్తరకు,నోటిదూలకు క్షమించు.

Wednesday 11 September 2024

సఖేతి మత్వా ప్రసభం యదుక్తం

సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమదాత్ప్రణయేన వాపి॥41-21 విశ్వరూప సందర్శన యోగము మనము స్నేహితులతో చాలా చనువుగా వుంటాము.ఒరేయ్,రేయ్ అనుకుంటాము.ఏమే,మేయ్ అనుకుంటాము.పేర్లు,ముద్దు పేర్లు పిలుచుకుంటాము.కులాలతో పిలుచుకుంటాము.పొట్టి,పొడుగు,తెలుపు,నలుపు ...ఇలా ఎలాగైనా పిలుచుకుంటాము.అది ఎదుటి వాళ్ళను తక్కువ చేయటం కాదు.అతి చనువు మీద చేస్తాము.ఉన్నట్టుండి ఆ స్నేహితులు మనకంటే చాలా గొప్ప వాళ్ళు,చాలా ఎత్తులో వున్నారు అని తెలుస్తే ఒక్క సారిగా ఖంగు తింటాము.వాళ్ళను ఎలా పలకరించాలో అర్థంకాదు.ఇప్పుడు అర్జునుడి పరిస్థితి కూడా అలాగే వుంది.ఇన్ని రోజులు కృష్ణుడిని ప్రేమ వల్లనో,పొరపాటు వల్లనో,అతి చనువుతోనో ఎట్లంటే అట్లా పిలిచేవాడు.ఒక సారి కృష్ణా అని పిలిస్తే,ఇంకోసారి యాదవా అని పిలిచేవాడు.మరొకసారి సఖా అని సంబోధించేవాడు.ఇట్లా చాలా మాములుగా నోటికి ఎలా పిలవాలనిపిస్తే అట్లా పిలిచాడు.అప్పుడంతా అతనికి కృష్ణుడి గొప్పతనం తెలీదు.ఇప్పుడు అతనికి తన మునుపటి చర్యలు ఇబ్బందికరంగా వున్నాయి.

Tuesday 10 September 2024

వాయుర్యమోఽగ్నిర్వరుణ శ్శశాంకః

వాయుర్యమోఽగ్నిర్వరుణ శ్శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేఽస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోఽపి నమో నమస్తే॥39-11 విశ్వరూప సందర్శన యోగము మన ఇంట్లో మనమే గొప్ప.వీధి లో పెద్ద మనిషి వెనక పది ఇరవై మంది వుంటారు.చిన్న పాటి నాయకుడి వెనక వందల్లో వుంటారు.రాష్ట్ర స్థాయి వాళ్ళకు లక్షల్లో,అంచర్జాతీయ స్థాయి వాళ్ళకు కోట్లలో వుంటారు. మరి విశ్వవ్యాపకుడిని నమ్ముకుని ఇంకెంత మంది వుండాలి?!!! ఇక్కడ అర్జునుడు అదే అంటున్నాడు.హే కృష్ణా!ఈ ప్రపంచం మొత్తం నీ తోనే వుంది.నీ లోనే వుంది.నువ్వుఅంతా తెలిసినవాడవు.అందరూ తెలుసుకోవలసిన వాడవు.అందరికీ కావాలసినవాడవు.నువ్వు ఆదిదేవుడవు!పురాణపురుషుడవు!జగదాధారుడవు!పరంధాముడవు! యముడు,వాయువు,అగ్ని,వరుణుడు,బ్రహ్మ,సూర్యుడు,చంద్రుడు...అందరూ నువ్వే!బ్రహ్మను కన్న తండ్రివి కూడా నువ్వే! అటువంటి నీకు సాష్టాంగ దండ ప్రమాణాలు.నీకు అనేకానేక నమస్కారాలు.తిరిగి తిరిగి నమస్కారాలు సమర్పిస్తున్నాను.స్వామీ!దయయుంచి స్వీకరించు.

Saturday 7 September 2024

కస్మాచ్చ తే న నమేరన్ మహాత్మన్

కస్మాచ్చ తే నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోఽప్యాదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస! త్వమక్షరం సదసత్తత్పరం యత్॥37-11 విశ్వరూప సందర్శన యోగము అర్జునుడు కృష్ణుడిని పొగుడుతున్నాడు.అతని గొప్పదనంతెలిసింది.తనకు దిశా నిర్దేశం చేసేది అతనే అని అర్ధం అయింది. మహాత్మా!నీవు సృష్టికర్త అయిన బ్రహ్మకే మూలపురుషుడవు.నీకు నమస్కరించని వాళ్ళు ఎవరు వుంటారు?హే అనంతా!హే జగన్నివాసా!సత్తువు,అసత్తువు రెండింటికీ మూల కారణం నీవే.నిశ్చల మైనది,శాశ్వతనైనది సత్తు.మార్పునకు లోనయ్యేది,అశాశ్వతనైనది అసత్తు.

తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్య

తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్య జిత్వా శత్రూన్ భుంక్ష్య రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్॥33-11 విశ్వరూప సందర్శన యోగము కృష్ణుడు ఇంకా ఇలా చెపుతున్నాడు.అర్జునా! నేను చెప్పేది అర్థం అవుతుందా?యుద్ధానికి సమాయత్తం కా!శత్రు సంహారం చెయ్యి.ఈ అఖండ భూమండలాన్ని అనుభవించు.కౌరవ సైన్యం,వారి తట్టు వాళ్ళందరూ ఇంతకు ముందే నా చేత చంప బడ్డారు అని భావించు.నీవు నిమిత్తమాత్రుడివి అని అర్థం చేసుకో.అలానే భావించు.నీ కర్తవ్యం నీవు పూర్తి చెయ్యి.అఖండ కీర్తిని,విజయలక్ష్మిని చేజిక్కించుకో!

కాలోఽస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో

కాలోఽస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః ఋతేఽపి త్వాం న భవిష్యంతి సర్వే యేఽవస్థితాః ప్రత్యనీకేషు యోధాః॥32-11 విశ్వరూప సందర్శన యోగము మనకు కోపం వస్తే ఏమి చేస్తాము?ఊగి పోతాము.అందులో ఎదుటి వాడు తప్పు చేస్తున్నాడు,దాని వలన మనం నష్ట పోతున్నాము అంటే ఇంక చెప్పనక్కరలేదు.ఒక రాగాన మామూలు కాలేము.నరసింహావతారంలో కూడా హిరణ్యకశిపుడిని చంపగానే,ఆ దేవుడే వెంటనే మామూలు కాలేక పోయాడు కదా! ఇక్కడ కూడా అంతే.మంచి వాళ్ళైన పాండవులకు అన్యాయం జరుగుతుంది.ధర్మం కుంటుపడుతుంది.అధర్మం రెక్కలు విచ్చుకుని స్వైరవిహారం చేస్తుంది.మరి భగవంతుడికి కోపంరాదా!ధర్మరక్షణ చెయ్యాల్సిన సమయంరాలేదా?కాలేదా? అందుకే కృష్ణుడు అర్జునుడికి సమాధానం ఇస్తున్నాడు.ఈ సర్వస్వాన్నీ లయింప చేసే కాల స్వరూపుడిని నేను.ప్రస్తుతం దుష్ట సంహారానికి పూనుకువ్నాను.నువ్వు ఇప్పుడు యుద్ధం చేస్తే సరే!చెయ్యక పోయినా సరే.నువ్వు తప్ప మీ ఉభయ పక్షాలలో ఏ ఒక్కరూ మిగులుతారనేది మిథ్య.అసంభవం.ఈ దుష్టులనందరినీ సంహరించేదాకా నేను నిద్రపోను.

Friday 6 September 2024

అఖ్యాహి మే కో భవానుగ్రరూపో

అఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోఽస్తుతే దేవవర!ప్రసీద విజ్ఞాతు మిచ్ఛామి భవంత మాద్యం న హి ప్రజానామి తవ ప్రవత్తిమ్॥31-11 విశ్వరూప సందర్శన యోగము అర్జునుడికి దిక్కు తోచడంలేదు.మంటలలోకి దూకే మిడతల దండులా సమస్త రాజవంశం లోని వీరులందరూ విశ్వరూపం యొక్క అనంత ముఖాలలోకి దూసుకు పోతున్నారు.ఆయన యొక్క భీకరమయిన రూపం చూసి జగత్తు అంతా తపించి పోతుంది.సర్వ లోకాలనూ మింగేస్తున్నాడు.అర్జునుడు వేడుకుంటున్నాడు. ఓ దేవదేవా!నీకు దండ ప్రమాణాలు చేస్తున్నాను.నీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను.ఇంత భయంకర స్వరూపుడవు అయిన నువ్వు ఎవరివి?దయచేసి నువ్వెవరో చెప్పు.నీ వివరాలన్నీ చెప్పు.ఇంత కోపం దేనికి?ఇంతటి ఉగ్రరూపం దాల్చేదానికి కారణాలు ఏంది?ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు?నీ ఈ ప్రవర్తనకు అర్ధం,పరమార్ధం నా బుర్ర గ్రహించలేక పోతున్నది.

Thursday 5 September 2024

యథా నదీనాం బహవోఽంబువేగాః

యథా నదీనాం బహవోఽంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామీ నరలోక వీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి॥28-11 విశ్వరూప సందర్శన యోగము పిల్ల కాలువలు నదిలో కలుస్తాయి.నదులన్నీ సముద్రం లో ఏకమవుతాయి.ఇది వాటి సహజ గుణం.అలానే మనమందరమూ ఆపరబ్రహ్మ నుండే పుట్టాము.మళ్ళీ ఆ విశ్వేశ్వరుడిలోకే లయమవుతాము. ఇక్కడ అర్జునుడు చూస్తుంటే,సమస్త రాజలోకమూ ఆ విశ్వకర్మ యొక్క భయంకరమయిన ముఖాగ్ని లోపలికి పొర్లి పోతుంది.దాంట్లో అనేక మంది రాజులు వున్నారు.కౌరవులుఅందరూ వున్నారు.భీష్ముడు,ద్రోణుడు,కర్ణుడు,ఇంకా చాలా మంది యోధులూ వున్నారు.ఆఖరికి పాండవుల పక్షంలోని వీరులుకూడా చాలా మంది కనిపించారు.

Wednesday 4 September 2024

దంష్ట్రా కరాళాని చ తే ముఖాని

దంష్ట్రా కరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస॥25-11 విశ్వరూప సందర్శన యోగము మాములుగా చాలా మందికి చీకటి అంటే భయం. కొన్ని సార్లు నిశబ్దంగా వున్నప్పుడు వంటింట్లో పళ్ళెం చెయ్యి జారి కింద పడినా గుండె ఝల్లు మంటుంది మనకు.ఇలా చాలా మందికి చాలా రకాల భయాలు వుంటాయి.కొన్ని సార్లు ఎదుటి వాళ్ళ భయాలు చాలా చిన్నవిగా కనిపిస్తుంటాయి.ఇక్కడ అర్జునుడు విశ్వరూపం చూసి భయపడకుండా వుంటాడా,ఎంత వీరుడు,శూరుడు,విక్రమార్కుడైనా!! ఆ విశ్వరూపానికి భయంకరమైన కోరలు,దంతాలు వున్నాయి.ఆ ముఖాలు అన్నీ కాలాగ్నిలా,అగ్ని గోళాలు లాగా వెలిగి పోతున్నాయి.అన్నేసి వున్న ఆ ముఖాలు,కాళ్ళు,చేతులు,ఉదరాలు,ఆయుధాలు,భగ భగ మండే నేత్రాలు..... వీటన్నిటినీ ఒక్కసారిగా చూసేటప్పటికి అర్జునుడు ఖంగు తిన్నాడు,భయపడి పోయాడు. భగవంతుడా,విశ్వేశ్వరా! నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది.నన్ను కాపాడు స్వామీ!నన్ను కరుణించు జగత్ రక్షకా!అని వేడుకుంటున్నాడు.

Monday 2 September 2024

రూపం మహత్తే బహువక్త్ర నేత్రం

రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహు బాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితా స్తథాఽహం॥23-11 విశ్వరూప సందర్శన యోగము మనం నలుగురు పిల్లలని కని,పెంచి,పెద్ద చెయ్యాలంటే,నానా అగచాట్లు పడతాము.మన రెండు చేతులా సంపాదించినా చాలదు.మొగుడూ పెళ్ళాలు ఇద్దరూ కష్టపడినా చాలదు.అందుకని ఒక్కరు ముద్దు,ఇద్దరు చాలు,ఆ పై ఇక వద్దనే వద్దు అని భీష్మించుకుంటాము.కానీ భగవంతుడు అలా అనుకోలేడు కదా!ఈ సృష్టి మొత్తం అతనే పుట్టించి,పెంచి,పోషించి,మళ్ళీ లయం చెయ్యాలి కదా!మరి అతనికి ఎన్ని చేతులు,కాళ్ళు,నోళ్ళు వుండాలి?ఎంత బలంగా వుండాలి?ఎంత నిష్టగా,నిరంతరం పాటు పడుతూ వుండాలి? అర్జునుడికి విశ్వరూపంలో అదే కనిపిస్తుంది.విశ్వ రూపానికి అనేక ముఖాలు వున్నాయట.అనేక నేత్రాలు,చేతులు,తొడలు,పాదాలు,కోరలు,ఉదరాలు వున్నాయి.మొత్తానికి అంతా చాలా భయానకంగా వుంది చూసేదానికి.ఇదంతా చూడటానికి సమస్త లోకాలు భయం తో వణికి పోతున్నాయి.వాటన్నిటితోటి అర్జునుడు కూడా భయభ్రాంతుడు అవుతున్నాడు.

Sunday 1 September 2024

అనాది మధ్యాంత మనంతవీర్య

అనాది మధ్యాంత మనంతవీర్య మనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతమ్॥19-11 విశ్వరూప సందర్శన యోగము అర్జునుడు ఇంకా ఇంకా చూస్తున్నాడు.చూస్తూనే వున్నాడు.ప్రతిదీ కొత్త కొత్తగా వుంది.అత్యద్భుతంగా వుంది.అదంతా చెప్పేదానికి ఆయనకు మాటలు రావటంలేదు,చాలటం లేదు.అయినా అన్నీ చెప్పేదానికి,నెమరు వేసుకుంటున్నాడు. భగవంతుడి విశ్వరూపం ఆదిమధ్యాంతరహితంగా వుంది.అంటే దానికి మొదలు,మధ్య,అంతం కనిపించడంలేదు,అసలు లేదు.అపరిమితమయిన శక్తి కలిగి వుంది.అది అనంత బాహువులతో కూడి వుంది. సూర్యుడు,చంద్రుడే దానికి కళ్ళుగా మిరిమిట్లు గొలుపుతున్నాయి.దాని ముఖం ప్రజ్వలిస్తున్న అగ్నిలా ప్రకాశిస్తున్నది.తన తేజస్సుతో సమస్త విశ్వాన్నీ తపింపచేస్తున్నది.సూది మొన మోపేందుకు కూడా వీలు లేనంతగా,చోటు లేనంతగా దిక్కులన్నింటా నిండి వుంది.ముల్లోకాలను చుట్టుముట్టి వుంది.ఆ మహోగ్రరూపాన్ని చూసి ముల్లోకాలు భయంతో వణుకుతున్నాయి.కానీ నేను అర్థం చేసుకుంటున్నాను.

పశ్యామి దేవాంస్తవ దేవ దేహే

పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూతవిశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్॥15-11 విశ్వరూప సందర్శన యోగము కృష్ణుడు తన విశ్వరూపం చూపించగానే మొదట అర్జునుడు అవాక్కైనాడు.నోట మాట రాలేదు.గొంతు గద్గదమైపోయింది.శరీరం పైనరోమాలు నిక్కబొడుచుకువ్నాయి.శరీరం పులకించింది.ఆశ్చర్యం,ఆనందం ముప్పిరిగొన్నాయి.మౌనంగా రెండు చేతులు జోడించి,మనస్పూర్తిగా నమస్కారం చేసుకున్నాడు.ఇంత అదృష్టం ఎవరికి దక్కుతుంది? కొంచెం సేపటికి తనకు తానే తేరుకుని ఇలా అంటున్నాడు.హే భగవాన్!నీ ఈ రూపం దివ్యమైనది.అతి మానుషంగా వుంది.దీనికి ఆది అంతం చెప్పనలవి కాకుండా వుంది.నీ విశ్వరూపంలో నాకు చాలా చాలా కనిపిస్తున్నాయి.ఇక్కడ నాకు సమస్త దేవ గణాలు కనిపిస్తున్నాయి.భూతగణాలు కనిపిస్తున్నాయి.పద్మంలో కూర్చుని వున్న చతుర్ముఖుడైన,సృష్టికర్త బ్రహ్మ కనిపిస్తున్నాడు.మహర్షులు కనిపిస్తున్నారు.పన్నగులు కనిపిస్తున్నారు.

Thursday 29 August 2024

అనేక వక్త్ర నయనం

అనేక వక్త్రనయన మనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్॥10-11 అనుకోకుండా మనకు మంచి జరిగితే అందరూ ఏమంటారు?నక్క తోక తొక్కాడు రా వీడు అని అంటారు కదా!ఇక్కడ సంజయుడిది కూడా అలాంటి అదృష్టమే!మహా మహులు,హేమాహేమీలు,గురువులు,యోగులు ఎంత మంది వున్నా,అర్జునుడితో పాటు ఆయనకు కూడా భగవంతుడి విశ్వ రూపం చూసే అదృష్టం దక్కింది. పిల్లి పిల్లి తన్నుకుంటే మధ్యలో కోతి లాభ పడిందట!అలాగే పాండవులు,కౌరవులు తన్నుకుంటే,సంజయుడు లాభ పడ్డాడు.ఎందుకంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు.ఆయన మామూలు గుడ్డి కాదు.బిడ్డల పైన అతి ప్రేమతో మంచి చెడ్డ విచక్షణ కోల్పోయిన అంథత్వం. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు.ఆ విశ్వ రూపం అనేక ముఖాలతో వుందట.అనేక నేత్రాలతో వుందట.అద్భుతాకారాలతో,దివ్యాభరణాలతో విరాజిల్లుతున్నదట!దివ్యమైన ఆయుధాలు,వస్త్రాలు,పూలమాలలు,సుగంధాలు,లేపనాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుందట!

న తు మాం శక్యసే దృష్టుమ్

న తు మాం శక్యసే దృష్టు మనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్॥8-11 విశ్వరూప సందర్శన యోగము మనం మాములుగా కనిపించేవి చూస్తాము.మరీ చిన్న చిన్న చీమలు,చీకటీగలు చూడాలంటే కళ్ళు చికిలించి మరీ చూస్తాము.కళ్ళకు కనిపించని సూక్ష్మ ప్రాణులని చూడాలంటే మైక్రోస్కోప్ వాడుతాము.దూరంవి చూడాలంటే బైనాక్యులర్స్ వాడుతాము.చీమ మనమొత్తం ఆకారాలను ఒకేసారిగా చూడలేదు కదా! మరి బ్రహ్మాండం అంతా నిండి,వ్యాపించి వుండే ఆపరబ్రహ్మను మనము మామూలు కళ్ళతో చూడడం ఎలా సాథ్యం?మనం చాలా సార్లు గుడిలో దేవుడి ముందర నిలుచుకుని కళ్ళు మూసుకుని దణ్ణం పెట్టుకుంటాము.ఆ విగ్రహాన్ని ఒక్క క్షణం కంటే ఎక్కువ చూడము.ఎందుకు? మనం మన మనో నేత్రం తో చూడాలని ఉబలాట పడతాము.కళ్ళతో చూస్తే తనివి తీరదు.జ్ఞాన నేత్రంతో చూసి ఆయనకు దగ్గర అవాలని అనుకుంటాము. ఇక్కడ కృష్ణుడు అర్జునుడితో అదే అంటున్నాడు.నువ్వు నా విశ్వరూపాన్ని మామూలు చక్షువులతో చూడలేవు.కాబట్టి నీకు నేను దివ్య దృష్టిని ఇస్తాను.దాని సహాయంతో నా పరిపూర్ణ రూపాన్ని చూడగలుగుతావు.అంటే మనసుతో చూడూ,జ్ఞాన నేత్రం తో చూడు అని ఆయన అర్థం.ఆ జ్ఞానాన్ని ఆయన అర్జునుడికి ఇచ్చాడు అని అర్థం.

Wednesday 28 August 2024

మన్యసే యది తచ్ఛక్యం

మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టు మితి ప్రభో యోగేశ్వర!తతోమే త్వం దర్శయాత్మాన మవ్యయమ్॥4-11 విశ్వరూప సందర్శన యోగము అర్జునుడు,కృష్ణుడు అంత దాకా మిత్రులు,బావా-బావమరుదులు.కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య బంథం ఇంకా చిక్క బడింది.బలంగా తయారైంది.గురుశిష్యుల బంథం,భగవంతుడు భక్తుడి మథ్య బంథం అయింది.ఎంత ఎదిగినా ఒదిగి వుండాలి అంటారు కదా!అది మనం అర్జునుడిలో చూడవచ్చు.ఆ భగవంతుడే నా మిత్రుడు,నా బావ అని విర్రవీగటం లేదు.కృష్ణుడి ముందు తను ఒక గడ్డి పరక అని అర్థం చేసుకున్నాడు.అందుకే కృష్ణుడిని యాచిస్తున్నాడు. హే ప్రభూ!యోగేశ్వరా!నాకు నీ దివ్య రూపం చూడాలని వుంది.అది చూసే యోగం,భాగ్యం,అర్హత నాకు వున్నాయని నీవు మనస్పూర్తిగా నమ్మితే,దయచేసి చూపించు.నా జన్మ ధన్యం చేసుకుంటాను అని అంటున్నాడు. మాములుగా మనకు గొప్ప వాళ్ళతో పరిచయం వుంటే విర్ర వీగుతాం.అసలు వాళ్ళ కంటే మనమే హటాటోపం చూపిస్తాము.ఇంతెందుకు?రాజకీయ నాయకులు సభలలో మన తట్టు చూసి చెయ్యి వూపినా వాళ్ళకు మనం అత్యంత సన్నిహితులం అని చెప్పుకుంటాము.ఎందుకంటే అడిగే వాళ్ళుండరు కదా!మనం ఏది చెపితే అది నమ్మే గొర్రెలు వుంటారు కదా!కాబట్టి మనం అతి తగ్గించుకుని,మితంగా,పరిమితంగా ప్రవర్తిస్తే బాగుంటుంది. ఎంతలో వుండాలో అంతలో వుండటం నేర్చుకోవాలి.

Tuesday 27 August 2024

ద్యూతం ఛలయతామస్మి

ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినా మహం జయోఽస్మి వ్యవసాయోఽస్మి సత్త్వం సత్త్వవతామహం॥ తన గురించి ఇంకా ఇలా చెపుతున్నాడు కృష్ణుడు.పంచకాలు,అంటే చెడ్డ పనులలో జూదంని నేను.తేజోవంతులలోని తేజాన్ని నేను.విజయం పొందే వాళ్ళలోని విజయాన్ని నేను.కృషి చేసే వాళ్ళ ప్రయత్నబలాన్ని నేను.సాత్త్వికులలోని సత్త్వగుణాన్ని నేను. అంటే మంచి చెయ్యాలన్నా,చెడు చెయ్యాలన్నా దాని వెనుక వుండే ప్రేరణ అతనే.చెడు లో కూడా వున్నాను,మంచిలో కూడా వున్నాను అంటే ఆయన దృష్టిలో రెండూ సమానమే.అందుకనే మంచి అనగానే నెత్తిన పెట్టుకోడు,చెడు అనగానే తుద ముట్టించడు.నిదానంగా గమనిస్తాడు.మనకు తగిన సమయం ఇస్తాడు మారేదానికి చెడు మార్గం నుంచి మంచిగా మారేదానికి,మంచి తనాన్ని కొస వరకు నిలబెట్టుకునేదానికి.ఆయన పెట్టే ఈ పరీక్ష లో మనం నెగ్గేదానికి ప్రయత్నించాలి.ఏదైనా వూరికేరాదు కదా!అమృతం కోసం దేవతలే ఎంత కష్ట పడ్డారు?సాగర మథనం చేసారు కదా!అప్పుడు కూడా మొదట్లోనే వచ్చేయలేదు కదా!ఒకటొకటి వచ్చి,హాలాహలం కూడా వచ్చింది కదా!దానితో నిరాశ పడకుండా,ఇంకా చిలికారు కాబట్టి ఆఖరున అమృతం వచ్చింది. మనం కూడా అంతే.ఆరంభ సూరత్వం కాకుండా,కష్టాలు వచ్చినా,నష్టాలు వచ్చినా,అలుపెరగకుండా దైవ చింతన,భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుని,మన కర్మలని మనం నిష్కల్మషంగా,నిర్వికారంగా చేసుకుంటూ ముందుకు పోవాలి.

Monday 26 August 2024

అక్షరాణా మకారోఽస్మి

అక్షరాణా మకారోఽస్మి ద్వంద్వస్సామాసికస్య చ అహమేవాక్షయః కాలోధాతాఽహం విశ్వతోముఖః॥33-10 విభూతి యోగము మనం చాలా సార్లు కళ్ళద్దాలు కళ్ళకే పెట్టుకుంటాము.కానీ వాటికోసం ఇల్లంతా వెతుకుతాము.ఇంట్లో అందరి పైన విసుక్కుంటాము.అందరినీ వెతకమంటాము.వాళ్ళు కిసుక్కున నవ్వి,నీ కళ్ళకే వున్నాయి చూసుకో అంటారు.సిగ్గు పడి పోతాము.ఇంత అస్తాఇస్తం ఏంది మనకు అని ఆశ్చర్యపోతాము. భగవంతుడిని మనము కనుక్కోవటం కూడా అలాంటిదే.ఏంది?భగవంతుడు ఎక్కడ వున్నాడు?ఎక్కడా కనిపించడు,మళ్ళీ నమ్మాలి అంటాడు.వినపడడు,కనపడడు,అసలు వున్నాడో లేదో తెలియదు,కానీ గాఢంగా నమ్మాలి అంటారు,ఎలా? మనం మన చుట్టూరా వెతుకుతాము.దేవుడు సర్వాంతర్యామి కదా!కాబట్టి నిదానం గా మనలో కూడా చూసుకోవాలి కదా.అంతర్ముఖంగా,అంతర్మథనం చేసుకోవాలి కదా!పరమాత్మ అందరిలో వుంటాడు అంటే మనలో కూడా వున్నట్టే కదా!అంత చిన్న తర్కం మనం ఎందుకు మర్చి పోతాము?మనలో కూడా భగవత్ అంశ వుందంటే,మనలని మనం ఎంత పవిత్రంగా చూసుకోవాలి,కాపాడుకోవాలి! భగవంతుడు ప్రాణి కోటిలోనే కాదు,ఇంకా ఈ రకాలుగా కూడా వున్వాడు.అక్షరాలలో అ కారంగా వున్నాడు.సమాసాలలో ద్వంద్వ సమాసం లా వువ్నాడు.వాశనం లేని కాలం అతను.సర్వ కర్మలకు ఫలప్రదాత అతను.సృష్టికి మొదలు,మధ్య,కొస అతనే!వారీ వీరి వాదాలు,వాదనలు,ప్రశ్నలు,సమాథానాలు...అన్నీ ఆ పెద్దాయనే!

Friday 23 August 2024

ఆయుధానా మహం వజ్రం

ఆయుధానా మహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్ప స్సర్పాణామస్మి వాసుకిః॥28-10 విభూతి యోగము భగవంతుడు అన్నింటా వుంటాడు,అన్నిట్లో వుంటాడు అంటే మనం నమ్మము కదా!కానీ ఆయనే చెపుతున్నాడు.ప్రాణం వున్న వాటిల్లోనే కాదు,ప్రాణం లేని వాటిల్లో,ఒకప్పుడు ప్రాణం వుండి ఇప్పుడు లేని వాటిల్లో కూడా వుంటాడు.అంతేనా! మన భావాలలో,మన భావ ప్రకటనలలో,మన చర్యలలో,మన గుణగణాలలో,మన భావోద్వేగాలలో,మన సంతానోత్పత్తిలో...ఇలా అన్నింటా వుంటాడు ఆ మహామహుడు. ఆయుధాలలో వజ్రాయుధం అతను.గోవులలో కామధేనువు అతను.ప్రజలలో సంతానోత్పత్తి కారకులలో మన్మధుడు అతను.అంటే ఆ ప్రేరణకు బీజం వేసేది అతను.సర్పాలలో వాసుకి అతను.ఈ చరాచర జగత్తులో అన్నింటా అతనే వున్నాడు.అతనే పోషిస్తున్నాడు.అతనే పాలిస్తున్నాడు.అతనే లాలిస్తున్నాడు.

ఆదిత్యానామహం విష్ణుః

ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవి రంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ॥21-10 విభూతి యోగము కృష్ణుడు చెప్పుకొస్తున్నాడు తను ఏ ఏ రూపాలలో వుంటాడో.ఆదిత్యులలో విష్ణువుగా వున్నాడు.వెలుగును పంచే జ్యోతిర్మయ వస్తువులలో సూర్యుడు అతనే.మరుద్గణాలలో మరీచి అతనే.నక్షత్రాలలో చంద్రుడు అతనే.ఇవేనా?కాదు,కాదు.ఇంకా వేదాలలో సామవేదం అతనే.దేవతలలో ఇంద్రుడు అతనే.పంచేంద్రియాలలో మనసు అతనే.సమస్త ప్రాణి కోటిలోని చైతన్య స్రవంతి అతనే.అతను ఏ ఏ విభూతులలో ప్రకటిత మవుతాడో మానవ మాత్రులం లెక్క కట్ట లేము,చెప్పలేము.సర్వ వ్యాపకుడు,సర్వేశ్వరుడు అనేది అందుకే కదా!

Thursday 22 August 2024

అహమాత్మా గుడాకేశ

అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ॥20-10 విభూతి యోగము కృష్ణుడు అర్జునుడికి సమాథానం ఇస్తున్నాడు.నీ అనుమానాలు అన్నీ తీరుస్తాను.అన్ని ప్రాణుల అంతరంగాలలో వుండే ఆత్మ ఎవరనుకున్నావు?నేనే!ప్రాణులను పుట్టించేది,పెంచేది,తుదకు గిట్టించేది నేనే.సృష్టి,స్థితి,లయకారకుడిని నేనే.అ నుంచి అః వరకు నేనే.నేను లేని ప్రాణి ఈ జగత్తులో లేదు.అంతా నాలోనే వుంది.నేను అంతటా వున్నాను.

పరం బ్రహ్మ పరం ధామ

పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్య మాదిదేవ మజం విభుమ్॥12-10 విభూతి యోగము మనమే ఒకరికి బిడ్డ,ఇంకొకరికి తోడబుట్టిన వాళ్ళం,మరొకరికి స్నేహితులం,మరింకొకరికి జీవిత భాగస్వాములం,మన బిడ్లలకు తల్లి/తండ్రి అవుతాము.మరి జగద్వ్యాపకుడు,సర్వేశ్వరుడు అయిన పరబ్రహ్మకు ఇంకెన్ని నామాలు,బంథాలు,అనుబంథాలు వుంటాయి? అర్జునుడు అదే అడుగుతున్నాడు. కృష్ణా!అందరు ఋషులు,నారదుడు,అసిత దేవలులు(మనువులు),వ్యాసుడు,మిగిలిన వాళ్ళందరూ నువ్వే పరమాత్మవు అని అంటున్నారు.అంతేనా!ఇంకా నువ్వు పరంథాముడవనీ,ఆదిదేవుడవనీ,శాశ్వతుడివనీ,దివ్యుడవనీ,జన్మ లేనివాడవనీ,సర్వవ్యాపివనీ,సర్వేశ్వరుడవనీ....ఇంకా చాలా,చాలా అంటున్నారు.నువ్వు కూడా అదే అంటున్నావు. నువ్వు ఏఏ రూపాలలో భౌతికంగా వున్నావో నాకు చెప్పు అని అర్జునుడు అడుగుతున్నాడు.

Saturday 17 August 2024

తేషాం సతతయుక్తానాం

తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం యేన మా ముపయాంతి తే॥10-10 విభూతి యోగము భగవంతుడిని మనం నిశ్చలమయిన మనసు తో నిత్యం సేవించాలి.అలాంటి వారికే అతన్ని పొందగలిగే జ్ఞానాన్ని భగవంతుడు ఇస్తాడు.ఎందుకంటే అపాత్ర దానం చేయకూడదు కదా! వారికి మంచి చేస్తాడు.వాళ్ళ పైన తన కరుణా దృష్టిని ప్రసరిస్తాడు.అతను వాళ్ళ మస్తిష్కంలో వుండి జ్ఞాన మార్గంలో నడిచేలా చేస్తాడు.అజ్ఞానమనే చీకటిని పారదోలుతాడు.

Friday 16 August 2024

బుద్ధిర్ జ్ఞానమ సమ్మోహః

బుద్ధిర్ జ్ఞానమ సమ్మోహః క్షమా సత్యం దమశ్శమః సుఖం దుఃఖం భవోఽభావో భయం చాభయ మేవ చ॥ 4-10 విభూతి యోగము శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అంటాము కదా.అది అక్షరాలా నిజం.మనలో వుండే బుద్ధి,జ్ఞానం,మోహరాహిత్యం,ఓర్పు,సత్యం,శమదమాది ఇంద్రియ నిగ్రహం,ఆనందం,ఆవేదన,పుట్టడం,పుట్టక పోవడం,భయం,నిర్భయత,అహింస,సమదృష్టి,దానగుణం,తపస్సు,కీర్తి,అపకీర్తి....ఇలా మనలో వుండే ప్రతి భావానికి,మనం చేసే ప్రతి పని వెనక ప్రేరణ,మర్మం,అర్థం,పరమార్థం,అన్నీ ఆయనే.మనం నిమిత్తమాత్రులం,అంతే.

మన్మనాభవ మద్భక్తో

మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామేవైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః॥34-9 రాజవిద్యా రాజగుహ్య యోగము భగవంతుడు ఇలా చేయమని చెబుతున్నాడు.మనం మన మనసులను ఆయన యందే నిలపాలి.అతని భక్తులం కావాలి.అతనినే సేవించాలి.అతనినే నమ్మాలి.అతనికే నమస్కరించాలి.అతని యందే దృష్టి నిలపాలి. అంటే నిష్ట,నిబద్ధత,నిర్మలత్వం,నిర్మోహంతో నిరాకారుడు,నిశ్చలుడు అయిన ఆ పరబ్రహ్మను నమ్ముకుంటే,కొలిస్తే,తప్పక మనకు దక్కుతాడు.

Thursday 15 August 2024

పత్రం పుష్పం ఫలం తోయం

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః॥28-9 రాజవిద్యా రాజగుహ్య యోగము మన అమ్మలు బిడ్డలనుంచి ఏమి కోరుకుంటారు? ఒక చిక్కటి చిరు నవ్వు.అంతేగా!నోరంతా అమాయకంగా తెరిచి,ఎంగిలి పూస్తూ పెట్టే చిట్టి ముద్దులు.బుడి బుడి నడకలు,బుల్లి బుల్లి మాటలు! వాళ్ళకు హిమాలయాలు ఎక్కినంత ఆనందం ఇస్తాయి. భగవంతుడు కూడా అంతే!మనల్ని కొండలు పిండి చేయమని చెప్పడు.సముద్రంలోని నీరు నంతా ఔపోసన పట్టమనడు. మనం మన శక్తి కొద్ది ఆకు ఇచ్చినా సంతోషపడతాడు.పువ్వు ఇస్తే మహదానందపడతాడు.పండు ఇస్తే ఇక ఆ ఆనందానికి హద్దులు వుండవు.నీళ్ళిచ్చినా తృప్తి పడతాడు.నిజంగా భగవంతుడు అల్ప సంతోషి.మన భక్తి,మన శ్రద్థ,మన నమ్మకం చూస్తే మురిసి పోతాడు.మన జీవితాలను బాగు పరుస్తాడు.మనం మంచి మార్గం లో నడిచేలా చేస్తాడు.

అనన్యాశ్చింతయంతో మాం

అనన్యాశ్చింతయంతోమాం యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్॥22-9 రాజవిద్యా రాజగుహ్య యోగము బిడ్డలు ఎప్పుడూ తల్లిదండ్రులను అంటి పెట్టుకోని వుంటారు.వాళ్ళ ప్రేమాభిమానాలు,సహాయసహకారాలు లేకుండా స్వంతంగా బతకలేరు.కాబట్టి అన్ని వేళలలో అమ్మనాన్నలను నమ్ముకుంటారు.అలా అని కూడా తెలియని అమాయకత్వం లోవుంటారు. అలాగే సమస్త మానవాళికి తల్లి తండ్రి ఆ భగవంతుడే కదా!కాబట్టి మనమందరమూ అతనినే నమ్ముకుందాము.అతని ధ్యానం లో వుందాము.అతని సేవలోనే తరిస్తాము.మానవ సేవే మాధవసేవ కాబట్టి అందరికీ మంచి చేద్దాము.మన మంచి చెడ్డ ఆయనే చూసుకుంటాడు.బిడ్డలు అమ్మ పక్కలో ఎంత నిశ్చింతగా పడుకుంటారు!మనమూ ఆయనను నమ్ముకుంటే అంతే నిశ్చింతగా వుండవచ్చు.

Tuesday 13 August 2024

పితాఽహమస్య జగతో

పితాఽహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ॥17-9 రాజవిద్యా రాజగుహ్య యోగము ఈ విశ్వాని కంతటికీ భగవంతుడే తల్లీ,తండ్రీ,ధాతా,త్రాతా.కర్మఫలదుడూ అతనే.తెలుసుకోదగినవాడూ అతనే.పవిత్రుడూ అతనే,ప్రణవస్వరూపుడూ అతనే.ఋగ్వేదమూ,సామవేదమూ,యజుర్వేదమూ,అధర్వణవేదమూ....అన్నీ అతనే. ఈ సృష్టిని సమతుల్యంగా వుంచేవాడు.మనం కోరిన కోర్కెలు తీర్చేవాడు.మనం జీవితంలో ఎవరిగురించి అయినా తెలుసుకోవాలి అంటే,మొట్ట మొదట తెలుసుకోవాలసింది ఇతని గురించే.ఇతని కంటే పవిత్రుడు ఎవరూ లేరు.సృష్టికి మూలం ఇతడే.నాలుగు వేదాలనీ ఔపోసన పట్టింది ఇతనే.ఈబ్రహ్మాండానికి నాయకుడు ఇతనే.

మయా తత మిదం సర్వం

మయా తత మిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః॥4-9 రాజవిద్యా రాజగుహ్య యోగము భగవంతుడు నిరాకారుడు.కానీ ఈ సృష్ఠి అంతా వ్యాపించి వున్నాడు.ఈ చరాచర జగత్తు మొత్తము అతని యందే వుంది.కానీ వాటిలో అతను వుండడు.అతనే ఈ సమస్త సృష్టిని పెంచి పోషిస్తూ వుంటాడు.కానీ ఈ ప్రాణికోటి అతనిని అంటిపెట్టుకుని వుండదు.అన్ని చోట్ల వ్యాపించే వాయువు ఆకాశంలోనే వుంటుంది.అలాగే జీవకోటి మొత్తం భగవంతుడిలోనే లీనమై వుంటుంది. భగవంతుడంతటి వాడే,అన్నీ తన గుప్పెటలో వున్నా,తటస్ధంగా వున్నాడు.అంటీ,ముట్టనట్టు వున్నాడు.ఈతత్త్వాన్నే తామరాకు మీద నీటి బొట్టు చందం అంటాము.తామరాకు నీళ్ళలోనే వుంటుంది.కానీ నీటి బిందువులు దాని పైన పడ్డా తడవదు.మనము కూడా అలాగే ప్రాపంచిక విషయాలలో వున్నా ఆసక్తి పరమాత్మ పైనే నిలపాలి.

Monday 12 August 2024

కవిం పురాణ మనుశాసితార

కవిం పురాణ మనుశాసితార మణోరణీయాంస మనుస్మరేద్యః సర్వస్య ధాతార మచింత్యరూప మాదిత్యవర్ణం తమసః పరస్తాత్॥9-8 అక్షర పరబ్రహ్మ యోగము భగవంతుడు ఇందుగల డందులేడని సందేహము వలదు అని చదువుకున్నాము కదా! అతను సర్వ్యాంతర్యామి,సర్వ వ్యాపకుడు.ఈ శ్లోకంలో కూడా అదే చెపుతున్నారు.ఆపరమాత్మ కవి,పురాణపురుషుడు,జగన్నియామకుడు,పరమాణువు కంటే చిన్న రూపం కలవాడు,అఖిల సృష్ఠికి ఆథారభూతుడు,విజ్ఞానగని,అజ్ఞానేతరుడు మరియు పరమాత్మ. మన అంత్య కాలంలో ఈమహామహుని భక్తిభావంతో పూజిస్తే ముక్తి పొందేదానికి అర్హులం అవుతాము.

Sunday 11 August 2024

అధిభూతం క్షరో భావః

అధిభూతం క్షరోభావః పురుషశ్చాధి దైవతం అధియజ్ఞోఽహమేవాత్ర దేహే దేహభృతాం వర॥4-8 అక్షర పరబ్రహ్మ యోగము భగవంతుడు ఇంకా ఇలా చెబుతున్నాడు.నాశనమయే పదార్ధాన్ని అధిభూతం అంటారు.దాంట్లో ఉత్కృష్టుడిని నేను.అధిదైవం అంటే మనం పూజించే అందరు దేవతలలోకి ఆజ్యుడు నేనే.ఈ ప్రకృతిలోని సమస్త భూతకోటిలో అంతర్లీనంగా వుండే ,అన్ని యజ్ఞాలకు మూలపురుషుడిని నేనే. అంటే కర్త,కర్మ,క్రియ అన్నీ నేనే.మీరందరూ నా అంశలే.ఈ సృష్టి,స్ధితి,లయలకు మూలకారణం నేనే. ప్రతిదీ నాతో మొదలు అయి,నాతో ముగుస్తుంది.కాబట్టి నన్ను అర్ధం చేసుకుంటే చాలు.ముక్తి లభిస్తుంది.

అక్షరం బ్రహ్మ పరమం

అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః॥3-8 అక్షర పరబ్రహ్మ యోగము కృష్ణుడు సవివరంగా అర్జునిడికి అనుమానాలు తీరుస్తున్నాడు.బ్రహ్మము అంటే నాశనము లేనిది.అన్నిటికంటే చాలా గొప్పది.అంటే సర్వోత్కృష్టమైనది.ప్రకృతి పరంగా,ప్రకృతి కి సంబంధమయిన స్వభావాలు,గుణగణాలే అధ్యాత్మంఅంటే.భూతోత్పత్తికి అయిన ఘటనమే కర్మం అంటే.

Saturday 10 August 2024

కిం తద్బ్రహ్న కి మధ్యయాత్మం

కిం తద్బ్రహ్మ కి మధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్త మధిదైవం కిముచ్యతే॥1-8 అక్షర పరబ్రహ్మ యోగము కృష్ణుడు చెప్పేది అర్జునుడికి ఒక్క ముక్క అర్థం కావటం లేదు.అసలే అయోమయం లోవున్నాడు.ఈయన ఏమో పెద్ద పెద్ద మాటలు చెపుతున్నాడు.అందుకే అడుగుతున్నాడు.బ్రహ్మము అంటే ఏంది?అధ్యాత్మమంటే ఏమిటి?కర్మ అంటున్నావు.అధిభూతం అంటున్నావు.అధిదైవం అంటున్నావు.నాకంతా అగమ్యగోచరంగా ఉంది.నిదానంగా వివరించు అనిఅడుగుతున్నాడు. మనము కూడా అంతే కదా.రెండో ఎక్కం నేర్చుకునే వాళ్ళకు పదిహేడో ఎక్కం ఏం అర్ధంఅవుతుంది?.బిక్క మొహం వేస్తాము కదా!

Friday 9 August 2024

జరా మరణ మోక్షాయ

జరా మరణ మోక్షాయ మా మాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్న మధ్యాత్మం కర్మచాఖిలం॥29-7 విజ్ఞాన యోగము మనిషిని ఎక్కువ భయపెట్టేది ఏంది?మరణం,ముసలితనం.ఆ భయం నుంచి బయటపడాలి అంటే ఏమి చెయ్యాలి మనం?సుఖదుఃఖాలను సమంగా తీసుకోగలగాలి.తామరాకు మీద నీటి బొట్టు చందంగా అన్ని కర్మలు చేస్తున్నా వాటి ఫలితాల పైన ఎలాంటి మోహం లేకుండా వుండగలగాలి.అధిభూతము,అధిదైవము,అధియజ్ఞములకు మూలము అయిన ఆపరమేశ్వరుని ఆశ్రయించి సేవించాలి.అప్పుడు మరణం శరీరానికే కానీ,ఆత్మకు కాదు అని తేటతెల్లమవుతుంది.అప్పుడే మనం కర్మ తత్త్వాన్నీ,పరబ్రహ్మను తెలుసుకోగలుగుతాము.

చతుర్విధా భజంతే మాం

చతుర్విధా భజంతే మాం జనా స్సుకృతినోఽర్జున ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ॥16-7 విజ్ఞాన యోగము నాలుగు రకాల మనుష్యులు భగవంతుడిని తెలుసుకోవాలని తాపత్రయ పడతారు.నమ్ముతారు.అతనిని సేవిస్తూ తరిస్తారు.వాళ్ళెవరో ఇప్పుడు తెలుసుకుందాము.కష్టాలలో ఉండేవాళ్ళు,ఏ దిక్కూ లేని వాళ్ళు దేవుడిని నమ్మి,సేవిస్తారు.దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు అంటాము కదా మనము.జ్ఞాన పరంగా ఆసక్తి,అన్వేషణ చేసే వర్గం.వీళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి శోధిస్తూ,సాధిస్తూ ఉంటారు.ఇంకా,ఇంకా తెలుసుకోవాలి అనే తపనతో రగిలి పోతుంటారు.వీళ్ళు భగవంతుడి గురించి తెలుసుకుని,సేవిస్తూ ఉంటారు.మూడో రకం మనుష్యులు ఎవరంటే సంపదలు కోరుకునే వాళ్ళు.వీళ్ళు జ్ఞాన సంపద కంటే,భౌతిక సంపదల కోసం ప్రాకులాడే వాళ్ళు.నాలుగో రకం,జ్ఞానులు. వీళ్ళు అన్నీ కూలంకషంగా తెలుసుకుని,పరిశోధించి,ఆ తరువాత మనసా వాచా నమ్మి భగవంతుడిని సేవలో ధన్యం అవుతారు.భగవంతుడికి కూడా వీళ్ళు అంటేనే ఎక్కువ ఇష్టం.

Thursday 8 August 2024

న మాం దుష్కృతినో మూఢాః

న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయ యాఽపహృతజ్ఞానాః ఆసురం భావ మాశ్రితాః॥15-7 విజ్ఞాన యోగము ఈ విశ్వం అంతా సత్త్వ,రజస్తమో గుణాల చేత నిండా మునిగివుంది.కాబట్టి ఎవరూ భగవంతుడిని తెలుసుకోలేక పోతున్నారు.రాక్షస భావాలు కలిగిన వాళ్ళు,కుయుక్తి కలిగిన మేథావులు,మూర్ఖులు,బుద్ధి,జ్ఞానం లేని వాళ్ళు,నీచమయిన ప్రవృత్తి కలిగిన వాళ్ళు...వీరెవరూ తల క్రిందులుగా తపస్సు చేసినా ముక్తిని పొందలేరు.అసలు వాళ్ళు ప్రయత్నించరు కూడా.

అపరేయ మితాస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్

అపరేయ మితాస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవ భూతాం మహాబాహో య యేదమ్ ధార్యతే జగత్//5-7 విజ్ఞాన యోగము భగవంతుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అపరా అనే ఈ ప్రకృతి హేయమయినది.అంటే తక్కువ,నీచము అని అర్థం వస్తుంది.ఎందుకంటే ఇది మాయా మొహాలతో నిండి వుంది.ఇక్కడ కోరికలకు అంతం ఉండదు.కోపాలకు అంతం ఉండదు.జీవరూపమయిన ఈ విశ్వాన్ని అంతా భరించేది భగవంతుడి పరా ప్రకృతి.ఈ ప్రకృతి చాలా ఉత్కృష్టమయినది.చాలా గొప్పది.మానవుడు ముందర ఈ విషయాన్ని తెలుసుకోవాలి.మనలని భరించేవాడు ఆ పరమాత్ముడు ఒకడు ఉన్నాడు.అతడే మనకు తల్లి,తండ్రి,గురువు,దైవము.అతన్ని నమ్ముకుంటే,అతన్ని ఆశ్రయిస్తే,అతన్ని ధ్యానిస్తే ముక్తికి సోపానం వేసిన వాళ్ళము అవుతాము.

మనుష్యాణాం సహస్రేషు

మనుష్యాణాం సహస్రేషు కశ్చి ద్యతతి సిద్ధయే యతతా మపి సిద్ధానాం కశ్చిన్మామ్ వేత్తి తత్త్వతః॥3-7 విజ్ఞాన యోగము ఒక పోటీ జరుగుతుంది అనుకుందాము.పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మొదట రారు కదా!వెనక పడేదానికి సవా లక్ష కారణాలు వుంటాయి.సత్తా వున్నా ఆ క్షణం బుర్ర,శరీరం పని చెయ్యవు.కొంత మందికి పరిస్థితులు కలసిరావు. అలాగే మోక్షం కోసం ప్రయత్నించే వాళ్ళలో కూడా అందరూ కూడా సాథించలేరు.వెయ్యి మందిలో ఒక్కరే మోక్షం కోసరము ప్రయత్నిస్తున్నాడు.అటువంటి వేయి మంది యతులలో ఏదో ఒకరే భగవంతుడిని తెలుసుకోగలుగుతున్నారు.కాబట్టి మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి.

Tuesday 6 August 2024

చంచలం హి మనః కృష్ణ

చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్థృఢమ్ తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్॥34-6 ఆత్మ సంయమ యోగము మనకు అందరికీ వచ్చే అనుమానమే అర్జునిడికీ వచ్చింది.కృష్ణుడిని అడుగుతున్నాడు.కృష్ణా!ఈ జీవ కోటితో వుండే ఈ ప్రపంచంలో గాలిని మనం నియంత్రించలేము కదా!అలాగే నిత్యం చలించేది,అతి బలవత్తరనైనదీ అయిన మన మనస్సుని నియంత్రిచడం సాథ్యం కాని పని కదా! మరి అలాంటప్పుడు నువ్వు చెప్పేవన్నీ ఎలా వీలు అవుతాయి? దానికి కృష్ణుడు ఇలా సమాథానం చెబుతున్నాడు.నిజమే.కానీ మనిషి తలచుకుంటే సాథించలేనిది ఏమీ వుండదు కదా!ఇవన్నీ అభ్యాసం తోటి సాధించవచ్చు.ఇంద్రియాలను అదుపులో వుంచుకుంటూ,వైాగ్యం అభ్యసిస్తే మనసు పైన పట్టు తెచ్చుకోవచ్చు.

సర్వ భూతస్థ మాత్మానం

సర్వ భూతస్థ మాత్మానం సర్వ భూతాని చాత్మని ఈక్షతే యోగ యుక్తాత్మా సర్వత్ర సమదర్శనః॥29-6 ఆత్మ సంయమ యోగము యోగయుక్తుడైన వాడు అన్ని ప్రాణులను సమంగా చూడటం నేక్చుకుంటాడు.ప్రతి ప్రాణిలోను తనను,తనలో అన్ని ప్రాణులను చూసుకుంటాడు.అన్ని ప్రాణులలో భగవంతుడినీ,భగవంతుడిలోనే అన్ని ప్రాణులనూ చూస్తాడు.అంటే ప్రకృతి లో మమేకమై పోతాడు.తను వేరే అనుకోడు.సమస్త ప్రాణికోటిలో తను ఒకడు తప్ప,ఇంకే ఇతర ప్రత్యేకతలు తనకు లేవని తెలుసుకుంటాడు.

నాత్యశ్న తస్తు యోగోఽస్తి

నాత్యశ్న తస్తు యోగోఽస్తి నా చై కాంత మనశ్నతః నా చాతి స్వప్న శీలస్య జాగ్రతో నైవ చార్జున//16-6 ఆత్మ సంయమ యోగము మనకు ఇంకా చాలా మెళకువలు చెప్పారు.ఏ విషయం లోనూ అతి పనికి రాదు.అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు అంటారు కదా తరచూ.మనం వాళ్ళ మాటలు పెడ చెవిన పెట్టకూడదు.ఉదాహరణకు తిండి గురించి మాట్లాడుకుందాము.కొంత మంది ఆబగా ఎంత పడితే అంత,ఏది పడితే అది తింటూనే ఉంటారు.అడ్డు ఆపు వుండనే ఉండవు.ఇంకో వర్గం ఉంటుంది.వీళ్ళు అవసరానికి కూడా తినరు.ఎప్పుడూ కడుపు మాడ్చుకుంటూ ఉంటారు.శలభాల లాగా ఉంటారు ఎండుకొనిపోయి.రెండూ మంచిది కాదు.మితాహారమే ముద్దు.అలాగే కుంభకర్ణుడి సోదర సోదరీమణులు ఉంటారు.వాళ్ళు నిద్ర లేచేటప్పటికి మనకు భోజనాల సమయం అయిపోయి ఉంటుంది.తొందరగా లేయమంటే మాకు తెలుసులే,ఏమీ పని లేదు కాబట్టే పండుకుంటున్నాము అంటారు.అర్థ రాత్రి ,అపరాత్రి దాక పండుకోరు.ఒక నియమము,నిబద్ధత ఉండవు.ఇంకొకళ్ళు నిద్ర భద్ర లేకుండా జాగారాలు చేస్తుంటారు.సమయానికి నిద్ర పోవటం కూడా శరీరానికి కావాలి.దేని లోను అతి లేకుండా మన శరీరానికి అన్నీ మంచిగా అలవాటు చెయ్యాలి.మనం చేసేపనులు కూడా ఆలోచించుకుని,మంచి అవగాహనతో పూర్తి చెయ్యాలి.మరీ నత్త నడకన చేయకూడదు,అలాగని తొందర తొందరగా చేశామంటే చేశాము అని పూర్తి చేయకూడదు.ఇలా ప్రతి విషయం లోనూ నియంత్రణ,అవగాహన ఉన్న వాళ్ళకే యోగం సిద్ధిస్తుంది.ఈ యోగం అనేది అన్ని రకాల దుఃఖాలకు మందు లాగ పని చేస్తుంది.అంటే కష్టాలనుంచి కాపాడుతుంది.

Monday 5 August 2024

ప్రశాంతాత్మా విగతభీః

ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః॥14-6 ఆత్మ సంయమ యోగము యోగాభ్యాసం ఎలా చెయ్యాలి?ఎవరికైనా తెలుసా?కృష్ణుడు చెబుతున్నాడు.నేర్చుకుందాము.మొట్ట మొదటగా మనసుని ప్రశాంతంగా పెట్టుకోవాలి.భయాందోళనకు గురి కాగూడదు.ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు.బ్రహ్మచారి అంటే ఏక భుక్తం,భూశయనం చెయ్యాలి అని.ఇలా ఎందుకు అన్నారో గమనిద్దాము.ముప్పూటలా తింటుంటే ఏమవుతుంది?గురక పెట్టి నిద్ర వస్తుంది.భుక్తాయాసం వస్తుంది.కూర్చుంటే లేవలేము,పడుకుంటే లేచి కూర్చోలేము.అదే రోజుకి ఒక్క పూట తింటే,కడుపు కర కర లాడుతుంటుంది,చలాకీ గా ఉంటాము.పట్టు పరుపుల పైన పడుకుంటే ఏమవుతుంది?సుఖపడాలి అనిపిస్తుంది.ఏమేమో కోరికలు చుట్టుముడతాయి.మనపై మనకు నియంత్రణ తప్పుతుంది.నేలపైన పండుకుంటే చలి,వేడి తగులుతుంటుంది ఒంటికి.ఒంటి కింద నేల గట్టిగా తగులుతుంటుంది.ఒళ్ళు నిజంగా కష్టపడితే గానీ నిద్ర రాదు.కాబట్టి మనం బ్రహ్మచర్యం పాటించాలి.మనసుని,ఇంద్రియాలను కట్టడి చేసి,భగవంతుడి మీద దృష్టి నిలిపి యోగాభ్యాసం చేస్తే అది ఫలిస్తుంది.ఊరికినే ముక్కు మూసుకుని,కళ్ళు మూసుకుని నేను యోగాభ్యాసం చేస్తున్నాను అని జబ్బలు చరుచుకోకూడదు.మొదట ఇంద్రియ నిగ్రహణ కావాలి.

జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా

జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనః॥8-6 ఆత్మ సంయమ యోగము యోగి అంటే ఎవడు?ఈ లోకం లో వుండే ప్రతిదాన్నీ సమానంగా చూసేవాడు.అంటే మనుష్యులా,జంతువులా,చెట్లు పుట్టలా అనే కాదు.ఈ గాలి,ఈ నీరు,ఆ కొండలు,కోనలు,వాగులు,వంకలూ అన్నీను.ఈ సృష్టి లో ప్రతిదీ అద్భుతమే.ప్రాణం ఉన్నజీవులు అయినా,ప్రాణం లేని వస్తు వాహనాలు అయినా,పంచభూతాలు అయినా అన్నీ ఒకటే.అన్నిటినీ మనం సమానంగా చూడటం నేర్చుకోవాలి,మన వాళ్ళకు అర్థం అయ్యేలా నేర్పాలి.అలా చూడగలిగినప్పుడే మనలో కోపం తాపం పోతాయి.సహనం పెరుగుతుంది.అవగాహన పెరుగుతుంది.ఎందుకంటే మన అనుకుంటే మనం ఒక రకంగా ఆలోచిస్తాము,పరాయి అనుకుంటే ఇంకో రకంగా ఆలోచిస్తాము.అర్థం చేసుకోవడం లో చాలా తేడా ఉంటుంది. అందుకనే శత్రువులు అయినా,మిత్రులు అయినా,తటస్థంగా ఉండే వాళ్ళు అయినా,నిరాసక్తంగా ఉండేవాళ్ళు అయినా,మంచి మనసు ఉండేవాళ్ళు అయినా,కోపిష్టులు అయినా,బంధువులు అయినా,పరాయి వాళ్ళు అయినా,సాధువులు అయినా,దుర్మార్గులు అయినా...అందరినీ ఒకే రకంగా సమ దృష్టితో చూడాలి.ఇది సాధించాలి అంటే మనకు నిగ్రహం ఉండాలి.అది అభ్యాసం తో వస్తుంది.అంతఃకరణ శుద్ధి తో వస్తుంది.ఈ రోజు అనుకున్నాము అంటే రేపు పొద్దుటికే రాదు.నిరంతర కృషి ఉండాలి.ఇలా సమ బుద్థి కల వాళ్లను యోగిశ్రేష్ఠులు అంటారు.ఈ రోజు నుంచి మొదలెడదామా,ఆ మంచి మార్గం లో పయనించేదానికి?

ఉద్థరే దాత్మనాఽఽత్మానం

ఉద్థరే దాత్మనాఽఽత్మానం నాత్మాన మవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపురాత్మనః॥5-6 ఆత్మ సంయమ యోగము మనల్ని ఎవరో ఉద్ధరిస్తారు అనుకోవటం పొరపాటు.ఎప్పుడూ మనలను మనమే ఉద్ధరించుకోవాలి.ఎందుకంటే మనలో మనకే ఆ సంకల్పం లేకపోతే ఎవరు ఎన్ని విధాల మనకు చేయూత నివ్వాలన్నా మనము గ్రహించము.అంటే మన మట్టి బుర్ర లోకి ఎక్కదు.మనకే తెలియాలి,ఎక్కడో మనం పప్పులో కాలేస్తున్నాము అనే విషయము.ఈ ఊబిలో నుంచి ఎట్లా బయట పడాలి అనే ఆరాటం రావాలి.ఆ మొదటి చైతన్యం మనలో పుట్టుకొస్తే,వంద మంది మనకు సహాయం చేసేవాళ్లు దొరుకుతారు.మనం ఎప్పుడూ అథోగతి పాలు కాకూడదు.అడుసు తొక్కనేల, కాలు కడగనేల అని పెద్దలు అంటారు కదా.అందుకని తప్పు మార్గం లోకి అసలు వెళ్ళ కూడదు.వెళ్ళి ,వెనక్కి రావాలంటే ఒక్కోసారి జీవిత కాలం కూడా సరిపోదు.కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకాలి.ఆత్మకు ఆత్మయే మిత్రువు,ఆత్మయే శత్రువు కూడా.ఆ విషయం తెలుసుకుని,జాగ్రత్తగా నడుచుకోవాలి.ఎందుకంటే నిగ్రహం ఉండేవాళ్ళకు ఆత్మ బంధువు లాగా ఉంటుంది.అదే నిగ్రహం లేని వాళ్ళకు శత్రువుగా మారుతుంది.

Saturday 3 August 2024

అనాశ్రితః కర్మ ఫలం

అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్న్యాసీ చ యోగీ చ నా నిరగ్నిర్న చా క్రియః//1-6 ఆత్మ సంయమ యోగము మనం చేసే ప్రతి పని పైన మోహం మానుకోవాలి.ఈ పని చేయడం మన విధి,కాబట్టి చేస్తున్నాము,అంతే అనుకోవాలి.ప్రతిఫలం పైన ఆశతో చేయకూడదు.అలాంటి వాళ్ళనే యోగులు అంటారు.చాలా మంది సన్న్యసించడం అంటే అన్నీ మానేయడం అనుకుంటారు.కానీ అది కానే కాదు.మనం పనులు మానేసినంత మాత్రాన సన్యాసులం కాము.అది ఒట్టి భ్రమ.మనసులో అది చెయ్యాలి,ఇది చెయ్యాలి,ఏదో సాధించాలి,ఇంకేదో తుదముట్టించాలి,ఇలాంటి ఆలోచనలనుంచి బయట పడటమే యోగము.ఈ క్రమం లో మన విధులను పరిపూర్ణంగా నిర్వర్తించడం ఎలాంటి పరిస్థితుల్లోనూ మానుకోకూడదు.

స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం

స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం శ్చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణా పానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణౌ॥27-5 కర్మ సన్న్యాస యోగము కోప తాపాలను నియంత్రించుకోవటానికి ధ్యానము,యోగము చాలా ఉపయోగపడతాయి.అది ఎలా చెయ్యాలో,అభ్యశించాలో కూడా ఇక్కడ మనకు చెప్పారు.రోజువారీ ప్రాపంచిక విషయాలను కొద్ది సేపు పక్కన పెట్టాలి.దృష్టిని,అంటే మన చూపును భ్రూమధ్యమం,అంటేరెండు కళ్ళు,అనగా భృకుటి మధ్యలో కేంద్రీకరించాలి.మనం మన నాసిక,అంటే ముక్కుతో గాలి పీలుస్తాము కదా.ఆ ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలను ఎక్కువ తక్కువ లేకుండా సమంగా ఉండేలా చూసుకోవాలి.అంటే గాలి పీల్చడం,అదే రకంగా గాలిని వదలడం ఒకే రకంగా వుండేలా చూసుకోవాలి.మనసు,బుద్ధిని మన నియంత్రణ లోకి తెచ్చుకోవాలి.పనిలో పనిగాకోపం,తాపం,భయం,కోరికలు,అసహనం,అసంతృప్తిలాంటి వాటిని విడిచి పెట్టేదానికి మన వంతు కృషి మనం చెయ్యాలి.మనసుని,బుద్ధిని నియంత్రించడానికి డానికి ఈ ధ్యానం,యోగం చాలా చాలా పనికి వస్తాయి.

స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం

స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం

Friday 2 August 2024

కామక్రోధ వియుక్తానాం

కామ క్రోధ వియుక్తానాం యతీనాం యత చేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనామ్//26-5 కర్మసన్న్యాస యోగము కామం అంటే అంతులేని కోరికల పుట్టలు.క్రోధంఅంటే నిగ్రహించుకోలేని కోపతాపాలు.వీటి రెండింటినీ మనం ఎంత త్వరగా విదిలించుకుంటే ఒంటికి,మనసుకు అంత మంచిది.అలా మనం చేయగలిగితే మనకు ఆత్మజ్ఞానం చేకూరినట్లే.యోగులము,సన్యాసులము అయినట్లే మానసికంగా.అప్పుడు సర్వావస్థ,సర్వకాలాల యందు,మన చుట్టూరా బ్రహ్మానందమే పొందగలుగుతాము.

విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని

విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాస్సమదర్శినః//18-5 కర్మసన్న్యాస యోగము మనము ఈ సృష్టిని అంతా ఒకే రకంగా చూడటం నేర్చుకోవాలి.ఇక్కడ ఏదీ ఎక్కువ కాదు,ఏదీ తక్కువ కాదు.అంతా మన దృష్టి లోపమే.ప్రాణం ఉన్నవి అయినా,లేనివి అయినా ఒకటే.విద్య,వినయము గల వాళ్ళు,చదువురాని,చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు,గోవు,కుక్క,ఏనుగు,చెట్టు,పుట్ట,వాగులు,వంకలు,కొండలు,కోనలు,అన్నిటినీ సమంగా చూడటం నేర్చుకోవాలి.ఇలా సర్వ ప్రాణికోటిని సమంగా చూడగలిగే వాడినే పండితుడు అంటారు.

జ్ఞేయస్స నిత్య సన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి

జ్ఞేయస్స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ప్రముచ్యతే//3-5 కర్మసన్న్యాస యోగము నిజమైన సన్న్యాసి ఎవరు అనుకుంటున్నారు?కోపం,తాపం లేని వాడు.అసూయ,అసంతృప్తి లేని వాడు.అహంకారం,అదే అంతా నేనే,నేనే గొప్ప మిగిలిన వారందరికంటే అనే భావము మన పతనానికి తొలి మెట్టు.ఈ మెట్టు ఎక్కామంటే ,జారుడు మెట్లపైన కాలు పెట్టినట్లే.పాచి పట్టిన మెట్టు పైన కాలు పెడితే ఏమౌతుంది?మధ్యలో ఆగాలన్నా ఆగలేము.జారుడు బండ పైనుంచి జారినట్లు ఏకంగా నేలపైన కుదేలు అవుతాము.ఈ అహంకారము కూడా మన వినాశనానికి నాందీప్రస్థావన అవుతుంది.హామ్లెట్ లో టు బి ఆర్ నాట్ టు బి థట్ ఈస్ ది క్వశ్చన్ అనే ప్రముఖమయిన వాక్యం ఉంటుంది.మనం ప్రతి క్షణం అలా డోలాయమానం లో ఉండకూడదు.మనకు ఏమి కావాలి,మనం ఏమి చేస్తున్నాము,మనం ఎలా చెయ్యాలి అనే నిర్దిష్టమయిన ప్రణాళిక ఉండాలి.గాలివాటం లాగా ఏ క్షణానికి ఎలా అనిపిస్తే అలా చేయకూడదు.మనకు అంటూ ఒక గమ్యం ఉండాలి.దానిని ఎలా చేరుకోవాలి అనే ప్రణాళిక ఉండాలి.ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తి చేయగలిగే నైపుణ్యం,నిబద్ధత ఉండాలి. కాబట్టి రాగధ్వేషాలు ,ద్వంద్వభావన లేని వాళ్ళు మాత్రమే ఈ కర్మ బంధాల నుంచి సులువుగా బయట పడతారు.

Thursday 1 August 2024

అజ్ఞశ్చా శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి

అజ్ఞశ్చా శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోఽస్తి న పరో న సుఖం సంశయాత్మనః//40-4 జ్ఞానయోగము మనము కర్మేంద్రియాలను జయించి శ్రద్ధ,సహనాలతో సాధన చేస్తే జ్ఞానాన్ని పొందుతాము.అదే శ్రద్ధ,జ్ఞానం లేని వాడి పరిస్థితి ఏంది?నిత్యం అపనమ్మకం,సందేహాలతో మగ్గి పోయేవాడి దుస్థితి ఏంది?జీవితంలో ఏదీ నమ్మని వాడి గతి అగమ్యగోచరమే.ఇలాంటి మనస్తత్వం వున్నవాళ్ళు ఖచ్చితంగా చెడిపోతారు.ఇహానికీపరానికీ...రెంటికీ చెడ్డ రేవడి అవుతారు.అలాంటివాళ్ళ వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు.తమని తాము ఉద్ధరించుకోలేని వాళ్ళు ఎదుటివాళ్ళను ఏమీ ఉద్ధరిస్తారు?ఈ సమాజానికి ఏ రకంగా ఉపయోగపడతారు?కాబట్టి మనమందరమూ ఈ గాడిలో పడకుండా,మెలకువగా మనలని మనము ఉద్ధరించుకోవాలి.మంచి దారిలో నడవాలి.

బ్రహ్మార్పణం బ్రహ్మహవిహ్

బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా//24-4. జ్ఞానయోగము ఈ లోకం లో ప్రతిదీ బ్రహ్మమయం.అంటే ప్రకృతి కి సంబంధించిందే.మనం దానిని మనసా వాచా కర్మణా నమ్మాలి.ఎందుకంటే మనం యజ్ఞాలలో యజ్ఞగుండం లో నెయ్యి వేసేదానికి వాడే గరిటెలలో బ్రహ్మం ఉంటుంది.హోమానికి వాడే వస్తువులు,ద్రవ్యాలు బ్రహ్మ.మనం వెలిగించే అగ్ని బ్రహ్మ.యజ్ఞం లో ఆహుతి ఇచ్చేవాడు బ్రహ్మ.ఆహుతి స్వీకరించేవాడు బ్రహ్మ.అంటే ఈ జగత్తు అంతా బ్రహ్మమయం.అంతా నేనే అనుకునే అహం నుంచి బయటపడాలి.మనం నిమిత్త మాత్రులము అనే స్పృహలో ఉండాలి.అలా అనుకునేవాడు ఆ బ్రహ్మాన్ని పొందుతాడు.అంటే కైంకర్యం అవుతాడుబ్రహ్మత్వం లో.

యదృచ్ఛా లాభ సంతుష్టో

యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమ సిద్ధావ సిద్థౌచ కృత్వాపి నా నిబధ్యతే//22-4 జ్ఞాన యోగము మనిషికి తృప్తి అనేది ఉండాలి.జీవితాంతం ఏదో కావాలి,ఇంకేదో కావాలి అంటూ పరుగులు తీస్తూ ఉండకూడదు ఎండమావుల వెనక.మనకు దక్కిన దానితో తృప్తి చెందడం నేర్చుకోవాలి.ఎంత సేపూ వాళ్ళకు అది వుందే,మనకు లేదే?మనం ఎదుటి వాళ్ళ కంటే ఒక మెట్టు ఎక్కువుగా లేము అని ఎప్పుడూదిగులు పడకూడదు.మన పరిస్థితి ఏంది,మన సత్తా ఏంది అనే అవగాహనతో మన ప్రయత్న లోపం లేకుండా ముందుకు పోవాలి.ఎంత సేపూ అనుమానిస్తూ వుండకూడదు.మనల్ని మనం అనుమానించడం మానుకోవాలి,ఎదుటి వాళ్ళను అనుమానించడం మొదలుపెట్టకూడదు.మన పైన మనకు నమ్మకం ఉండాలి.ఎదుటివాళ్ళ పైన భరోసా ఉండాలి.కోపతాపాలకు ఆస్కారం ఇవ్వకూడదు.ఎందుకంటే మనం కోపతాపాలకు బానిస అయ్యాము అంటే ఇవి మన జీవితాలతో చెడుగుడు ఆడుకుంటాయి.దేనికీ పనికి రాకుండా చేస్తాయి.ఫలాపేక్ష లేకుండా మన కర్తవ్యాన్ని అనుకరిస్తూ,అనుసరిస్తూ ముందుకు పోతుండాలి.ఆ పని జరిగినా,జరగకపోయినా కలత చెందకూడదు.రెండిటినీ సమంగా తీసుకోవాలి.మనం ఎప్పుడైనా తెలుసుకోవాల్సింది ఏందంటే మన వైపు నుంచి ఎలాంటి ప్రయత్నలోపము ఉండకూడదు,అంతే.మన మనస్సు ఏ చట్రం లోనూ ఇరుక్కోకూడదు.తామరాకు పైన నీటి బిందువు లాగా మనం నిర్వికారంగా,అన్నిటినీ సమానంగా తీసుకోవాలి.అప్పుడు మనం ఎలాంటి భవబంధాలలో ఇరుక్కోకుండా వుంటాము. కాబట్టి ఇలా ఉండే దానికి ప్రయతించాలి మనమందరము.

Wednesday 31 July 2024

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే//8-4 జ్ఞాన యోగము బలహీనులు,మంచివాళ్ళు,అనాధలు ఎప్పుడూ ఏకాకులు కాదు.దైవం,అంటే ప్రకృతి వాళ్ళకు ఎప్పుడూ బాసటగా నిలుస్తుంది.ఈ విషయం అర్థం కాలేదు అంటే మనం మూర్ఖులమని తేట తెల్లమవుతుంది.దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు అని అనుకుంటాము కదా కష్టాలలో ఉన్నప్పుడు,ఎవరి చేయూత దొరకనప్పుడు.దేవుడు అంటే ప్రకృతి.అది నిరంతరం,అనంతరం,శాశ్వతం అయినది.అది మన వెంటే ఉంటుంది,మనలని సర్వకాల సర్వావస్థలయందు కాపాడుతూ ఉంటుంది. కృషుడు ఇక్కడ అదే అంటున్నాడు.మంచి వాళ్లను రక్షించేదానికి,దుష్టులను తుదముట్టించడానికి,ధర్మాన్ని నిలపెట్టడానికి,ప్రతి యుగం లోనూ ఏదో ఒక రూపంలో అవతరిస్తూ వుంటాను.

యదా యదా హి ధర్మస్య

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన మధర్మస్య తదాఽఽత్మానం సృజామ్యహం//7-4 జ్ఞాన యోగము ప్రకృతి ఎప్పుడూ తనను తాను రక్షించుకుంటుంది.మనం దాని సమతుల్యతకు భగ్నం కలిగిస్తే ,అది దాని మూడో కన్ను తెరిచి విధ్వంసం సృష్టిస్తుంది.విలయ తాండవం చేస్తుంది.అప్పుడు మనం ఎంత లబో దిబో మన్నా లాభం లేదు.పరిగెత్తడానికి ఏ చోటు మిగిలి వుండదు,తల దాచుకునే దానికి ఏ కప్పూ ఉండదు.ధర్మం నశిస్తే నాశనం ఖాయం.అధర్మం,అరాచకం పెరిగితే లెక్క సరిచూసుకుంటుంది ఈ ప్రకృతి.ఇక్కడ కృష్ణుడు ప్రకృతికి పరాకాష్ఠ గా చెప్పుకుంటున్నాడు.అన్యాయం ఎక్కడ జరిగినా తట్టుకోను,ఒప్పుకోను,తాట తీస్తాను అంటున్నాడు.

కామ ఏష క్రోథ ఏష

కామ ఏష క్రోథ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్ద్యేన మిహ వైరిణం//37-3 కర్మ యోగము మనిషిని అథఃపాతాళానికి తొక్కేసేది మనలో ఉండే రజోగుణమే.రజోగుణము అంటే కోరికలు మనసుని,మనిషిని చుట్టుముట్టటమే.రజోగుణం నుంచి కోరికలు,కామము పుడతాయి.కోరికలు,కామము తీరకపోతే మనలో అసహనం పెరుగుతుంది.అసహనం నుంచి కోపం పుట్టుకువస్తుంది.ఈ కోరికలకూ,కామానికి అదుపు,ఆజ్ఞ ఉండవు.ఆది,అంతం ఉండదు.ఎప్పుడూ మనిషిని అవి ప్రకోపిస్తూ ఉంటాయి.మనిషికి ఎప్పటికీ ఇంక చాలు,ఇంత చాలు అనే తృప్తి,సంతోషం ఉండదు.ఇంకా కావాలి,ఇంకా అనుభవించాలి,ఇంకా సుఖపడాలి అనే దుగ్థ ప్రతి క్షణం పెరుగుతూ ఉంటుంది.ఈ కోపాలు,తాపాలే మనుష్యుల చేత నికృష్ఠపు పనులు చేయిస్తూ వుంటాయి.మనిషి మేధస్సు ని పక్క దోవ పట్టిస్తూ ఉంటాయి.అన్ని పాపాలకు మూల కారణం ఈ రజోగుణమే. మనం ఎంత తెలివితేటలు గల వాళ్లమైనా,మనలో ఎంత జ్ఞానం నిబిడీకృతం అయివున్నా ఈ ఒక్క బలహీనత మనలని ఎందుకూ పనికి రాకుండా చేస్తుంది.పొగ చేత నిప్పు,మురికి చేత అద్దం,మావి చేత పిండం కప్పబడి ఉంటాయి కదా.అలాగే మనలో ఉండే జ్ఞానాన్ని ఈ కామం కప్పేస్తుంది.కాబట్టి మనం కోపతాపాలను వశం చేసుకోవాలి.అవి మితిమీరకుండా సహనం,సంయమనం పాటించాలి.

Tuesday 30 July 2024

శ్రేయాన్ స్వధర్మో విగుణః

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః//35-3 కర్మయోగము తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరము అని అంటారు కదా పెద్దలు.ఇక్కడ కూడా అదే ప్రస్తావిస్తున్నారు.మనకు సంబంధం లేని పనిని మనం ఎంత నైపుణ్యంతో చేసినా లాభం లేదు.ముందర మనలను మనం ఉద్ధరించుకోవాలి.విమానం లో ఎక్కినప్పుడు కూడా వాళ్ళు ఏమి చెబుతారు? ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే,ముందర ఎవరికి వాళ్ళు క్షేమం చూసుకోండి.తరువాత పక్క వాళ్ళకు సహాయం చేయండి అని చెప్తారు.జీవితంలో ఎప్పుడూ కూడా స్వధర్మం చాలా ముఖ్యం.కొన్ని తప్పు ఒప్పులు ఉన్నా,నైపుణ్యం లేకుండా చేసినా,ఎప్పటికీ మన బాగోగులు,మంచి చెడ్డ మనమే చూసుకోవటం ఉత్తమము.మన ధర్మాన్ని ఆచరిస్తూ అశువులు బాసినా మంచిదే.ఇంకొకళ్ల విషయాలలో అనవసరంగా తల దూర్చి,తన్నులు తినడం వృథా.ఎవరి ఇంట్లో అయినా గొడవలు పడుతుంటే,మనం మధ్యలో దూరి సూక్తిముక్తావళి చెబితే ఏమీ అంటారు?మొదట నీ బతుకు నువ్వు చూసుకో అంటారు.మన మంచి కోసం చెబుతున్నారు అని సానుకూలంగా తీసుకోరు.కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన పనులు మనమే చేసుకోవటం ఉత్తమము.

కర్మేంద్రియాణి సంయమ్య

కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే//6-3 కర్మయోగము మనలో చాలా మంది ఈ కోవకు చెంది ఉంటారు.పైకి చాలా మంచిగా కనిపిస్తారు.ఇంత మంచి తట్టుకోలేము అనిపిస్తుంది.కానీ లోపల చెడు ఆలోచనలతో ఉంటారు.ఇక్కడ ఇలాంటి వాళ్ళ ప్రస్తావన ఉంది.ఎవరైతే కర్మేంద్రియాలను నిగ్రహిస్తూ కూడా,ఆ ఇంద్రియ విషయాల గురించే ఆలోచిస్తారో,వాళ్లను డాంబికులు అంటారు.అంటే వాళ్ళు పైకి ఒక రకంగా,లోపల అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటారు.వాళ్ల ఆలోచనలకూ,చేసే పనులకూ పొంతన ఉండదు.ఇలాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి.ఎప్పుడు వాళ్ల అసలు బుద్ధి బయట పెడతారో తెలియదు.ఒక రకంగా వీళ్ళు బయట ప్రపంచాన్ని మోసం చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు మనకు ఆదర్శమ్ కాదు.ఎవరైతే మనసు చేత ఇంద్రియాలను లోబరుచుకొని,ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తారో,వాళ్ళే మహానుభావులు,ఉత్తములు.ఇలాంటివారిని మనం ఆదర్శం గా తీసుకోవాలి.

ఏషా బ్రాహ్మీస్థితిః పార్థ

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనామ్ ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంత కాలేపి బ్రహ్మనిర్వాణ మృచ్ఛతి//72-2 సాంఖ్యయోగము మనము మామూలుగా మనుష్యులను గమనిస్తుంటాము.ఎవరికైతే కోరికలు తక్కువ ఉంటాయో వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.మనం వాళ్లని అల్ప సంతోషులు అంటాము.చిన్నదానికే సంతోషంగా ఉంటారు.పెద్ద పెద్ద కోరికలు ఉండవు వాళ్లకు.అహంకారము,కోరికలు ఎక్కువ అయ్యే కొద్దీ మనలో అసహనం,అసంతృప్తి పెరుగుతూ ఉంటాయి.అవి లేకపోతే ప్రశాంతంగా ఉండగలుగుతాము.ఇంకో విషయం ఏందంటే తన మన అని కాకుండా అందరినీ ఒకేలా చూడగలగడం.మన అనుకునే కొద్దీ మన వాళ్ళకు అంతా మంచి జరగాలి,వేరే వాళ్ళు ఏమైపోయినా పరవాలేదు అనిపిస్తుంది.అప్పుడు ప్రాణి కోటి పైన సమభావం ఎక్కడ ఉంటుంది?కాబట్టి కోరికలు,అహంకారము వదిలిపెట్టగలగాలి.మమకారాన్ని త్యజించాలి.అలా ఉండగలిగినప్పుడే మనం శాంతిని పొందగలము.శాంతి అంటే అమ్మాయి అనుకునేరు.మనశ్శాంతి గురించి నేను మాట్లాడేది.దీనినే బ్రాహ్మీస్ధితి అంటారు.ఈ బ్రాహ్మస్థితి పొందిన వాళ్లు మోహము అనే జలతారు మాయలో పడరు.ఈ జ్ఞానాన్ని ఎవరు మరణకాలం లోపల సాధిస్తారో వాళ్లు బ్రహ్మనిర్వాణపధాన్ని దక్కించుకుంటారు. బ్రహ్మ నిర్వాణ పధం అంటే ఏమో అని భయపడే పనిలేదు.అంత్య కాలం లో మనం అది పొందలేదు,మనకు ఇది దక్కలేదు,ఇంకా బాగుంటే బాగుండేది,ఇంకేదో సాధించి వుంటే బాగుండేది అనే అసంతృప్తులు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోగలగటం.ఎవరూ శాశ్వతం కాదు. మనతోటే ప్రపంచం ఆగిపోవటం లేదు.అది నిరంతరం సాగిపోతుంటుంది.మనం ఈ భూమి పైకి వచ్చాము.మంచి మనసుతో,ప్రతిఫలాపేక్ష లేకుండా మన విధులను నిర్వర్తించాము.మన కాలం అయిపోయింది.ప్రశాంతంగా వెళ్ళిపోదాము.ఈ భావన ఉంటే చాలు.

Monday 29 July 2024

అపూర్యమాణ మచలప్రతిష్ఠం

అపూర్యమాణ మచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే స శాంతి మాప్నోతి న కామ కామీ//70-2 సాంఖ్యయోగము సముద్రము గంభీరంగా వుంటుంది.తన లోకి ఎన్ని నీళ్ళు వచ్చినా భయపడదు.కలత చెందదు.చెలియలికట్ట దాటదు.అన్నిటినీ తనలోనే దాచుకుంటుంది,ఇముడ్చుకుంటుంది.అంత పెద్దసముద్రమే తన పరిధి దాటకుండా జాగ్రత్త పడుతుంది.మరి అల్పులమయిన మనం కొంచెం అయినా దానిని చూసి నేర్చుకోవాలి కదా.మన పరిమితులు ఏందో తెలుసుకుని బ్రతకాలి కదా.సముద్రం లాగానే స్ధితప్రజ్ఞుడు తనలోకి ఎన్ని కోరికలు వచ్చి చేరుతున్నా కలత చెందడు.భయపడడు.చపలచిత్తుడు కాకుండా స్థిరంగా ఉంటాడు.అంటే చలించదు,నిశ్చలంగా వుంటాడు.భోగాలకు అలవాటు పడకుండా జాగ్రత్త పడుతాడు. అంటే మనిషి ఎప్పుడూ తన పరిమితి,పరిధి దాటకుండా ఉండాలి.అతి ఎప్పుడూ మానాలి.అది అసలు మంచిది కాదు.మన పరిస్థితి ఏంది,మన తాహతు ఏంది,మనము ఎక్కడ వున్నాము,ఎవరితో ఉన్నాము,ఎలా ఉన్నాము...అన్నీ ఆలోచించుకోవాలి ఒక అడుగు వేసేముందు.మనం చేసే పని మనకు చెడు చేయకూడదు,ఎడిటి వాళ్ళకు చెడు చేయకూడదు,పర్యావర్ణానికి హాని కలగకుండా చూసుకోవాలి.

క్రోధాద్భావతి సమ్మోహః

క్రోధాద్భావతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధి నాశాత్ప్రణశ్యతి// 63-2 సాంఖ్యయోగము మనిషికి ఉండే అవలక్షణాలన్నిటి లోకి కోపం అనేది చాలా పెద్ద అవలక్షణం.అన్ని పాపాలకి అదే మూల కారణం.మనిషి మృగం అయ్యేది దాని వల్లే.విచక్షణ కోల్పేయేది దాని వల్లే.సర్వనాశనం అయ్యేది దాని వల్లే.ఇన్ని అనర్ధాలకు కారణం అయిన దానిని మనం దూరం పెట్టలేదా?కనీసం ప్రయత్నం చేయలేమా?ప్రయత్నం లో సఫలం కాలేమా? కోపం వల్ల వివేకం కోల్పోతాము.అవివేకులం అవుతాము.అంటే మంచి చెడుల విశ్లేషణ చేయలేము.వావి వరసలు మర్చిపోతాము.పెద్ద చిన్న అనే అవగాహన కోల్పోతాము.అవివేకం వలన బుద్ధి పని చేయదు.ఇంతకు ముందు జరిగిన విషయాలు,మంచి చెడులు మర్చిపోతాము.నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటాము.దీని పర్యావసానంగా బుద్ధి తప్పు దోవ పడుతుంది.మనం చేసేపని పైన మనకు పట్టు వుండదు.నిగ్రహం కోల్పోతాము.ఒక స్థాయిలో మనం ఆగాలన్నా ఆగలేము.అన్యాయం జరిగిపోతుంది.అరిష్టం జరిగిపోతుంది.చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏమి లాభం?మనం చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం ఉండదు.జీవితాంతం కూర్చుని ఏడ్చినా పరిష్కారం ఉండదు.అదే నష్టం మన వల్ల వేరే వాళ్లకు జరిగితే ,ఆ పాపం ఎన్ని జన్మలెత్తినా పోదు.మన వాళ్లందరికీ అంటుకుంటుంది.సర్వ నాశనం అయిపోతాము.కాబట్టి కోపాన్ని నిగ్రహించుకునేదానికి సర్వ శక్తులూ వినియోగించుకోవాలి.

కర్మణ్యే వాధికారస్తే

కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి//47-2---సాంఖ్యయోగము మనకందరికీ యావ ఎక్కువ.ఏదైనా పని చేస్తే మనకేంది లాభం?ఓకవేళ లాభం వుంది అంటే ఎంత లాభం?ఎంతో కొంత వుంది అంటే ఇంకొంచెం పెరిగే ఆస్కారం వుందా?అసలు మొత్తం లాభం నాకే రావాలి.దాంట్లో ఇంకెవరికీ భాగం ఉండకూడదు అని అనుకుంటాము.కానీ ఇక్కడేమో కర్మలు చేయటమే మన పని.దాని పైన మనకు ఎలాంటి అధికారం లేదు.దాని వల్ల కలిగే లాభాలకు ఆశ పడొద్దు.అసలు ఆ లాభాలు మనకు వద్దనే వద్దు అంటున్నారు.ఇది సాధ్యమా?కానీ గీత మనలని సాధ్యం చేసుకోమంటుంది.లేకపోతే పుట్టినప్పటినుంచి పోయే దాకా ప్రతిదీ వ్యాపారం అయిపోతుంది.బంధాలు అనుబంధాలు ఉండవు.ప్రేమలు,అభిమానాలు ఉండవు.మనసుకి ప్రశాంతత వుండదు.ఎంత సేపు ఏదో ఒకటి సాధించాలని పరుగెత్తుతూనే వుంటాము.జీవితానికి ఒక అర్థం పరమార్ధం ఉండదు.జీవితం లో ప్రశాంతత ఉండాలంటే ప్రతిఫలాపేక్ష లేకుండా మన పనులు మనం చేసుకుంటూ పోతుండాలి.పనులు చేస్తుంటే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి.లాభమయినా నష్టమయినా ఒకే రకంగా తీసుకోగలగాలి.మనము చేసేపని మంచిదయితే మంచి ఫలితాలు ఉంటాయి.చెడు పనులు అయితే చెడు ఫలితాలు ఉంటాయి.గర్వానికి పోకూడదు. మనం నిమిత్త మాత్రులము అనే విషయము సర్వ కాల సర్వావస్థల యందు గుర్తు పెట్టుకోవాలి. కృష్ణుడు ఏమి చెప్తున్నాడంటే,ఫలితం పైన హక్కు లేదని అసలు పనులు చేయడం ఆపొద్దు.నీ విధులు నీవు సక్రమంగా నిర్వర్తించు.లాభాపేక్షతో పనులు చేయవద్దు.

Saturday 27 July 2024

జాతస్య హి ధ్రువో

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే న త్వం సోచితు మర్హసి//27-2 కృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.పుట్టినది గిట్టక మానదు.మరణించినది మళ్లీ పుట్టక మానదు.ఇది నిరంతరం జరిగే ప్రక్రియ.దీనిని ఎవరూ ఆపలేరు.ఇలా తప్పించ శక్యం గాని ఈ చావు పుట్టుకల గురించి మనము తలలు బాదుకోవాల్సిన పనిలేదు.ఈ విషయాన్ని గురించి దిగులు పడటం మానేయాలి.ఈ విషయాన్ని మన బుర్రల్లోకి ఎక్కించుకోవాలి.

నైనం ఛిన్దంతి శస్త్రాణి

నైనం ఛిన్దంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః//23-2 ఈ ఆత్మ భలే తమాషాగా వుంటుంది.చావు పుట్టుకలు లేవు.అంతేనా?ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీని దగ్గర.దీన్ని మనం చింపి పారేయలేము.కాలుస్తామా అంటే ఉహూ కాల్చలేము.సరే,కనీసం నీళ్లలో నానబెడతామా అంటే అలా కూడా నానదు.చించలేము,కాల్చలేము,తడపలేము,కనీసం ఎండ పెడదామా అంటే అట్లా కూడా ఎండను అంటుంది.ఇంకెట్లా దీనితోటి మనము వేగేది?మనము ఏమి అడిగినా,ఏమి చేసినా దాని సమాధానం ఒక్కటే.నేను నిత్యము,నేను సత్యము.ఇంకేమి చేస్తాము ఒప్పుకోక!

వాసాంసి జీర్ణాని యధా విహాయ

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ//22-2 ఈ శ్లోకం సాంఖ్య యోగము లోనిది.కృష్ణుడు అర్జునుడికి శరీరానికి ఆత్మకు వుండే వ్యత్యాసం చెబుతున్నాడు.దేహాలు నశిస్తాయి కానీ ఆత్మ నశించదు.అది నిత్యమయినది.దానికి చావు పుట్టుకలు లేవు.ఈ ఆత్మ ఎవరినీ చంపదు,ఎవరి చేత చంపబడదు.దీనికి పెరుగుదల తరుగుదల ఉండవు.మనం బట్టలు వేసుకుంటాము.అవి చిరిగిపోయి,మాసిపోతే మన మన తాహతుని బట్టి వాటిని వదిలేస్తాము.కొత్త బట్టలు వేసుకుని మురిసిపోతాము.ఆత్మ కూడా శరీరము క్షీణించగానే,నిరుపయోగము అవగానే ఆ శరీరాన్ని మొహమాటం లేకుండా వదిలేస్తుంది.కొత్త దేహం లోకి ప్రవేశిస్తుంది.దానికి పాత శరీరం పైన కానీ.కొత్త శరీరం పైన కానీ మోహము వుండదు.

Thursday 25 July 2024

క్లైబ్యం మాస్మగమః పార్థ

క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వ య్యుపపద్యతే క్షుద్రమ్ హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప// ఈ శ్లోకం భగవద్గీత లోని సాంఖ్యయోగము అనే ద్వితీయ అధ్యాయము లోని మూడవ శ్లోకము.అర్జునుడు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాడు.యుద్ధం. చెయ్యాలా,చెయ్యకూడదా?చేస్తే ఏంటి?చెయ్యకపోతే ఏంటి?అసలు మనసు మొద్దు బారిపోయి వుంది.విచక్షణ చేసుకోలేకపోతున్నాడు.అప్పుడు తన మిత్రుడు అయిన కృష్ణుడితో మొరపెట్టుకున్నాడు దారి చూపమని. మనలో ఎవరైనా స్థాణువులా మొద్దు బారిపోతే మనం ఏమి చేస్తాము?పట్టశక్యం కాని కోపం,దుఃఖం,మూర్ఖత్వంలో వుంటే పెద్ద వాళ్ళు ఏమీ చేస్తారు?వాళ్లను స్పృహలోకి తెప్పించడానికి చెంప పైన చెళ్లున ఒకటి ఇస్తారు.ఇక్కడ కృష్ణుడు కూడా అదే పని చేస్తున్నాడు.అంటే కొట్టాడు అని కాదు.అయ్యో!నాయనా!అలాగా!పోనీలే పాపం!అని ఊరుకోలేదు.ఒక నిజమైన మంచి స్నేహితుడిలాగా అర్జునుడిని ప్రస్తుత పరిస్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.కర్తవ్యవిముఖుడు అయిన అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేసే పనిలో పడ్డాడు.దానికి అవసరమైన సామ దాన దండోపాయాలనుఉపయోగించడానికి వెనుకాడ లేదు. నువ్వు యోధుడివి.ప్రస్తుతం యుద్ధం చేసేదానికి వచ్చావు.రణరంగం లో నిలుచుకుని ఉన్నావు.ఇప్పుడు.మీనమేషాలు లెక్క పెట్టేది ఏంది?ఇప్పుడు పౌరుషం పోగొట్టుకునేది ఏంది?ఇది నీకు తగని పని.ముఖ్యమయిన సమయం లో ఈ మానసిక దుర్బలత నీకు అచ్చిరాదు.మంచిది కాదు.దీనిని ఎవరూ సమర్ధించరు.ఈ పిరికితనాన్ని,సందిగ్ధాన్ని వదిలి పెట్టు.తెలివిగా ఆలోచించు. మనం కూడా కొన్ని కొన్ని సమయాలలో ఒక మంచి పని చేసేదానికి అనవసరంగా భయపడుతుంటాము.ఇది మనకు తగినదా?అసలు మొదలు పెడితే పూర్తి చెయ్యగలమా?మనకు అంత సమర్థత,తాహతు వుందా అని మనకు మనమే భయపడుతుంటాము.కానీ నిజానికి మనం చెయ్యగలం,మనలో ఆ సమర్థత,కార్యదక్షత ఉంటుంది.కానీ ఆ కాన్ఫిడెన్స్,మనపై మనకు నమ్మకం వుండదు. అలాంటప్పుడు మన వాళ్లు ఒక కేటలిస్ట్ లాగా ఒక మంచి మాట చెప్పి,వెన్ను తట్టి మనలను ప్రోత్సహిస్తారు.వాళ్ల ఋణం మనం ఎప్పటికీ మర్చిపోలేము.ఇక్కడ కూడా కృష్ణుడు అర్జునుడి విషయం లో చేస్తున్నది అదే. కాబట్టి మనం కూడా ఎవరైనా ఒక మంచిపని,నలుగురికి పనికి వచ్చేపని చేసేదానికి తటపటాయిస్తూ వుంటే,వాళ్లను భుజం తట్టి ప్రోత్సాహం ఇద్దాము.

Wednesday 24 July 2024

మహాపాపాది పాపాని

మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీదళ మంభసా// మనము తెలిసో తెలియకో చాలా పాపాలు చేస్తాము.ఇగ్నోరన్స్ ఈస్ నో ఎక్స్యూజ్ ఇన్ లా.అంటే మనమెవ్వరమూ తెలియదు అని ఆ భగవంతుడి కళ్లలోనుంచి తప్పు చేసి తప్పించుకోలేము.ఇంక తెలిసి చేసే పాపాల విషయానికి వస్తాము.చాలా మటుకు మనకు ఏమీ కాదు,ఎవరూ చూడటం లేదు,ఇది చాలా చిన్న తప్పు,వేరే వాళ్ళతో పోల్చుకుంటే అసలు మనము చేసేది అసలు తప్పే కాదు,పరిస్ధితుల ప్రభావం వల్ల చేస్తున్నాము కానీ మాకు ఇష్టమయి కాదు....ఇలా మనకు మనమే మభ్యపెట్టుకుంటూ,తప్పులు చేసుకుంటూ పోతాము.ఆ తర్వాత అది అలవాటు అయిపోతుంది.ఇంక తప్పు చేస్తున్నామనే భావన కూడా వుండదు.అది కూడా హ్యూమన్ రైట్స్ లో ఒక భాగం అనుకునే స్థితికి చేరుకుంటాము. అందుకే ఈ పద్యం రాశారు.ఏమని అంటే తామరాకు నీళ్లలో వున్నా,ఆ తడి దానికి అంటదు.అలాగే భగవద్గీత పారాయణం చేసేవారికి ఎటువంటి మహాపాపాలు అంటవు.ఇది మనకు విడ్డూరంగా అనిపిస్తుంది మొదటి సారి విన్నప్పుడు.కానీ దీంట్లో నిజం వుంది.ఎందుకంటే పారాయణం అంటే ఊరికినే బట్టీ పట్టినట్లు చదవటం కాదు.దాంట్లోని ప్రతి పదానికి,శ్లోకానికీ,అధ్యాయానికీ అర్థం పరమార్ధం తెలుసుకుంటూ పోవాలి.అప్పుడు మనలో మనం చేసేది తప్పా,ఒప్పా అనే అంతర్మథనం మొదలవుతుంది.తప్పు అని తెలిసిన తరువాత మనపైన మనకే జుగుప్స కలుగుతుంది. ఆ అపరాధ భావం తొలగాలంటే ఏమి చెయ్యాలి?మనసు నిష్కల్మషంగా,నిర్మలంగా,ప్రశాంతంగా వుండాలంటే ఏమి చెయ్యాలి అనే శోధన మొదలవుతుంది.అంటే మనము పాపప్రక్షాళనకు నడుము బిగిస్తాము.మంచి కార్యాలు చేస్తాము.మంచిగా మాట్లాడుతాము.మంచిగా ఆలోచిస్తాము.ఎదుటివాళ్ల మంచి కోరుతాము.దాంట్లోనే మన సంతోషం వెదుక్కుంటాము.అందరినీ సమానంగా చూడటం మొదలుపెడతాము.ఎవరినీ నొప్పించము.సర్వే జనాహ్ సుఖినో భవంతు అని మనసా వాచా కర్మణా ఆచరిస్తాము. కాబట్టి మనము తెలిసి తెలియక చేసే తప్పులకు పరిష్కారం దొరుకుతుంది.మన జీవన విధానం మారుతుంది.సంఘానికి మంచి చేసే తలపు వస్తుంది.అది కార్యాచరణలో పెట్టే పట్టుదల వస్తుంది. ఇన్ని లాభాలు వున్నాయి కాబట్టే గొప్ప గొప్ప వాళ్లందరూ భగవద్గీతను నమ్ముకొని వున్నారు.

Tuesday 23 July 2024

గీతా కల్పతరుమ్ భజే

గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్థితం శ్రుతిశిరోబీజమ్ ప్రబోధాంకురం నానాశాస్త్ర రహస్యశాఖ మరతిక్షాంతి ప్రవాలాంకితం కృష్ణామ్ఘ్రిద్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదంజ్ఞానినం// భగవద్గీత అనేది ఒక కల్పవృక్షం సహస్ర మానవాళికి.నేను ఆ కల్పతరువును సేవిస్తున్నాను.ఈ కల్పవృక్షాన్ని ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు నాటాడు.వేదవ్యాసుడు ఆ మొక్కనుపెంచిపోషించాడు.ఈ వృక్షానికి బీజం ఉపనిషత్తులు.దాని అంకురం,అంటే మొలకఆత్మప్రబోధము.వివిధ శాస్త్రముల యొక్క రహస్యాలు,మూలాలు దాని శాఖలు.శాఖలు అంటే కొమ్మలు.శాంతి,సహనము,వైరాగ్యము,ప్రేమలు అనే మంచి గుణాలుఈ చెట్టుయొక్క చిగురుటాకులు.మన మనసులలో శ్రీకృష్ణభగవంతుడు పైన వుండే భక్తిశ్రధ్ధలు ఈ చెట్టు నుంచివిరజిల్లే పూలసుగంధాలు.జ్ఞానులు దీనిని మోక్షానికి మార్గము అని గాఢంగా నమ్ముతారు.

చేతో భృంగ!భ్రమసి వృధా భవ

చేతో భృంగ! భ్రమసి వృధా భవ మరు భూమౌ విరసాయమ్ పిబ పిబ గీతా మకరందం మురరిపు ముఖ కమల భవాడ్యమ్// మన మనసు ఒక తుమ్మెదలాంటిది.కవి ఇలా అంటూన్నాడు.మనసు అనబడే ఓ తుమ్మెదా!సంసారమనబడే ఈ మరుభూమిలో ఎందుకువృధాగా తిరుగుతున్నావు?ఇది రసహీనమయినది.ఇక్కడ సంచరించడం వలన మనిషికి ఏ మాత్రం లాభములేదు.పోదామురా.మురహరి అయిన ఆ శ్రీకృష్ణుని ముఖారవిందం నుంచి వెలువడిన భగవద్గీత అనే తేనెను త్రాగుదాము.మన జన్మలనుసార్ధకం చేసుకుందాము.భగవద్గీత అనే ఆ రసామృతం ఎంత తాగినా తనివి తీరదు.కానీ ఒక చుక్క తాగినా మనకు మోక్షం లభిస్తుంది.

Friday 19 July 2024

న కాంక్షే విజయం కృష్ణా

న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ/ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా// ఈ శ్లోకం భగవద్గీతలో ఒకటవఅధ్యాయం,అర్జున విషాదయోగం లో వస్తుంది.అర్జునుడుదిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు.మంచేదో,చెడేదో తెలియని వ్యవహారం.అసలు తను యుద్ధభూమికి ఎందుకొచ్చాడో కూడా అర్థం కాని పరిస్థితి.అప్పుడుకృష్ణుడుతో తన దీనావస్థను మొరపెట్టుకుంటాడు.తను తన మనసులో పడేఆవేదన,అతలాకుతలంగా,గందరగోళంగా రకారకాలుగా మూగే ఆలోచనలు కృష్ణుడికి చెప్పేస్తాడు.ఆ ధోరణిలోనే ఈ మాటలు అంటాడు. కృష్ణా,నేను ఈ యుద్ధం చెయ్యాలనుకోవటం లేదు.చేసినా గెలవాలనుకోవటం లేదు.నాకు ఈ రాజ్యం వద్దు.దానివల్ల సమకూరే సుఖాలు వద్దు.తుచ్ఛమయిన ఈ లాభాలకోసం నేను నా వాళ్ళను చంపుకునే దౌర్భాగ్యస్థితిలో లేను.నాకు చాలా దిగులు,విచారంగా ఉండి.మనసంతా వైరాగ్యం నిండిపోయింది.నాకు అసలు ఇలాంటి జీవితమే వద్దు. నాకు భవిష్యత్తు అంతా అగమ్యగోచరం గా ఉంది.ఈ కష్టాన్నించి నన్ను గట్టెక్కించు అని అర్జునుడు కృష్ణుడిని వేడుకుంటున్నాడు. ఇక్కడ అర్జునుడు కృష్ణుడిలో దేవుడిని చూడలేదు. ఒక నమ్మకమయిన,ప్రియమయిన మిత్రుడినే చూసాడు.మనం కూడా చాలా సందర్భాలలో ఇంట్లో వాళ్ళకంటే,మన అనుకునే మన ఫ్రెండ్స్ కే మన కష్టసుఖాలు,సంతోషాలు,దుఃఖాలు,భయాలు,అనుమానాలు చెప్పుకుంటాము.ఎందుకంటే వాళ్ళు మనలని ఎక్కిరించరు,అర్థం చేసుకుంటారని ఒక గట్టి నమ్మకం.ఆ నమ్మకం తోటే అర్జునుడు కూడా ఇక్కడ తన మనసులో కలిగే భావాలన్నిటినీ ఏకరువు పెట్టాడు.

గీత వల్ల లాభాలు

గీత.....శ్రీకృష్ణ భగవానుని దూత గీత......వ్యాస మునీంద్రుని వ్రాత గీత.....వేదమంత్రముల మ్రోత గీత....అహంకారాదులకు కోత గీత....దివ్యజ్ఞానమునకు దాత గీత....అసురస్వభావమునకు వాత గీత....దైవీసంపదకు నేత గీత...పరమార్థదృష్టికి మాత గీత...రాగధ్వేషములకు మూత గీత....కైవల్యపథమునకు సీత గీత..ప్రణవనాదమునకు గాత గీత...భావసాగరమునకు ఈత గీత...ముముక్షుజనులకు ఊత గీత...ప్రకృతి సామ్రాజ్యమునకు జేత గీత...ధర్మ్యామృతమునకు పోత