Wednesday, 11 February 2026

మాత్రా స్పర్శాస్తు కౌంతేయ

మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః। ఆగమాపాయినోఽనిత్యాః తాం స్తితిక్షస్వ భారత॥14॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడి ఓపికకి నిజంగా జోహార్లు!మాములుగా మన ప్రక్క వాడి కంటే మనము కొంచెము ఎక్కవ అనే భావము రాగానే మనకు కళ్ళు నెత్తికి ఎక్కుతాయి.ఎక్కువ తెలివి అనేది నిజమయినా,నిజం కాకపోయినా!అలాంటిది భగవంతుడు అయి కూడా అంత ఓపికగా,సులభంగా అర్థం అయ్యేలాగా చెబుతున్నాడు అంటే మనమంతా ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలి అని కొంచెం ఆలోచించాలి. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!మనము చలి అయినా,వేడి అయినా ఎట్లా తెలుసుకుంటాము?మన ఇంద్రియాల వలనే కదా!సుఖ దుఃఖాలు కూడా అంతే.ఇంద్రియాల వలనే కలుగుతాయి.ఆకాశంలో కదిలే మేఘాలలాగానే.ఈ క్షణం కనిపిస్తాయి.ప్రక్క క్షణం మాయమవుతూ ఉంటాయి.అవి అక్కడే పాతుకు పెట్టుకుని కూర్చోవు కదా!అవి శాశ్వతం కాదు.చంచలం.వస్తుంటాయి,పోతుంటాయి. ఇట్లా మనము ప్రతి చిన్న విషయానికి భావోద్వేగాలకు లోనయితే ఎలాగా?నీవే చెప్పు.

Monday, 9 February 2026

దేహినోఽస్మిన్ యథాదేహే

దేహినోఽస్మిన్ యథాదేహే కౌమారం యౌవనం జరా। తథా దేహాంతర ప్రాప్తిః ధీర స్తత్ర న ముహ్యతి॥13॥2॥ శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు ముందర అర్జునుడిని స్వాంతపరుస్తున్నాడు.చిన్నగా,అనునయంగా,ప్రేమగా చెబుతున్నాడు. అర్జునా!నేను ఎందుకు అందరమూ అన్ని కాలాలోనూ ఉంటాము అని చెబుతున్నానో గ్రహించేదానికి ప్రయత్నం చెయ్యి.మనకు ఈ శరీరం ఉంది కదా!దానివలన సహజంగా ఈ దేహానికి బాల్యం,యవ్వనము,ముసలితనము కలుగుతాయి కదా!అది నువ్వుకూడా ఒప్పుకుంటావు కదా!ఇలాగే మరో దేహాన్ని పొందడం కూడా ఇంతే సహజం.బుద్దిమంతులు సులువుగా ఈ విషయాన్ని గుర్తిస్తారు.కలవరపడరు.మోహితులు అస్సలేకారు.స్థితప్రజ్ఞత కనబరుస్తారు.నువ్వుకూడా అర్థం చేసుకుని,సమన్వయం చూపించు.

Sunday, 8 February 2026

న త్వేవాహం జాతు నాసం

న త్వేవాహం జాతునాసం న త్వం నేమే జనాధిపాః। న చైవ న భవిష్యామ స్సర్వే వయ మతః పరమ్॥11॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... చిన్న పిల్లోడికి ఏమైనా అర్ధం కాకపోతే వేరేవాళ్ళు విసుక్కోవచ్చు.కానీ అమ్మ ఏం చేస్తుంది?పిల్లవాడిని భయపెట్టకుండా,మంచిగా,చిన్నగా,సులభంగా అర్థం అయ్యేలాగా,వాడి బుర్రకు తగినట్లు మంచిగా ప్రేమగా చెబుతుంది కదా!కృష్ణుడు కూడా ఇక్కడ అర్జునుడిని భయపెట్టడం లేదు.ఇంకా సందిగ్ధంలోకి నెట్టడం లేదు.ప్రశాంత చిత్తంతో,ఓపికగా,అర్ధం అయ్యేలా చెబుతున్నాడు. అర్జునా!సఖా!నీవు ఏదో గందరగోళంలో గాబరా పడుతున్నావు.నీవు అనుకునేది ఏమీ లేదు.అంతా చాలా సునాయసంగా అర్ధం అయ్యేదే!నా మాట నమ్ముతావా? నేను,నువ్వు,నీవు చెప్పే ఈ మహారాజులు అందరూ గతంలో లేకుండా లేము.అట్లాగా అని భవిష్యత్తులో ఉండకుండా పోము.ఇప్పుడు ఉన్నాము అనే విషయం లో నీకు ఎలాంటి అనుమానం లేదు కదా! అంటే ఇది అంతా కాలచక్రం.పుడుతుంటాము,గిట్టుతుంటాము.ఎప్పుడూ ఇలానే కాలం సాగిపోతుంది.

Monday, 2 February 2026

అశోచ్యా నన్వశోచస్త్వం

శ్రీ భగవానువాచ... అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే। గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః॥11॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... శ్రీకృష్ణుడు నవ్వు ఆపుకోలేకపోయాడు.ఇంక బలవంతంగా ఆపుకుని అర్జునుడి తట్టు మళ్ళి మాట్లాడాడు. అర్జునా!ఏందో అనర్గళంగా భాషణలు ఇచ్తేస్తున్నావు.జీవితం అంతా ఔపోసన పట్టిన జ్ఞానిలాగా మాట్లాడేస్తున్నావు. నిజం చెప్పేదా?అది ఎప్పుడూ కటువుగా ఉంటుంది.మానవుడు దేని కోసం దుఃఖించకూడదో,దాని కోసం దుఃఖిస్తూ ఉన్నావు.అంతేనా?మళ్ళీ ఇదేమీ చాలనట్లు పెద్ద ఆరిందలాగా సూక్తుల,ముక్తాయింపులు చెబుతున్నావు. నీకు అసలు ఈ విషయం తెలుసా?నిజంగా పండితులు అయినవాళ్ళు సజీవుల గురించి ఆలోచించరు.పైగా గత జీవుల గురించి దిగులు పడరు.అసలు నువ్వు ఏ ఏ విషయాలకు అయితే దిగులు పడి,దుఃఖ పడుతున్నావో వాటిగురించి లేశ మాత్రం కూడా సమయం వృథా చేయరు.దుఃఖం అనే దానిని దరిదాపులకుకూడా రానివ్వరు.

Sunday, 1 February 2026

తమూవాచ హృషీకేశః

తమూవాచ హృషీకేశః ప్రహసన్నివ భారత। సేనయో రుభయో ర్మధ్యే విషీదంత మిదం వచః॥10॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు ఈ విథంగా వివరిస్తున్నాడు.ఓ ధృతరాష్ట్ర మహారాజా!అర్జునుడు చాలా దీనంగా కనిపిస్తున్నాడు.రెండు సైన్యాల మధ్య అతను విషణ్ణ వదనంతో చాలా వ్యాకులంగా,నిశ్చేష్టుడు అయి రధం పైన పడిఉన్నాడు.చూసేవారికి అంతా చాలా హృదయవిదారకంగా ఉంది అతని స్థితి,పరిస్థితి.కానీ అతని బాల్య మిత్రుడు శ్రీకృష్ణుడుకు మటుకు పట్టలేనంత నవ్వుగా ఉంది.పగలబడి పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు.నవ్వుతూనే ఇలా అన్నాడు.

Saturday, 31 January 2026

ఏవ ముక్త్వా హృషీకేశం

సంజయ ఉవాచ... ఏవ ముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః। న యోత్స్య ఇది గోవింద ముక్త్వా తూష్ణీం బభూవ హ॥9॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చారు కదా సంగ్రామం వివరాలు అన్నిటినీ ధృతరాష్ట్రుడికి చెప్పేందుకు గానూ. సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు.ఓ రాజా!అర్జునుడు పై విధంగా కృష్ణునితో తన మనోదౌర్బల్యాన్ని విశదపరిచాడు.ఆఖరుకు కృష్ణా నేను ఈ యుద్ధం చేయను,చేయలేను,చేయబోను అని ఖరాఖండిగా చెప్పేసాడు.శక్తి విహీనుడై అర్జునుడు రథంలో చతికిల పడ్డాడు.

Thursday, 29 January 2026

న హి ప్రపశ్యామి

న హి ప్రపశ్యామి మమాప నుద్యా ద్యచ్ఛోక ముచ్ఛోషణ మింద్రియాణాం। అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యమ్॥8॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... అర్జునుడు తన మిత్రుడు అయిన శ్రీకృష్ణుడికి తన మనస్సు ఉండే పరిస్థితి వివరిస్తున్నాడు.కృష్ణా!నేను దుఃఖంలో కూరుకుని పోయి ఉన్నాను.ఈ లోకంలోని ఏ విషయం కూడా నన్ను ఈ ద్వంద్వం నుంచి విముక్తి కల్పించే రకంగా కనిపించడం లేదు.నాకు ఈలోకంపైన ఏకచ్ఛత్రాధిపత్యం దక్కినా తుచ్ఛం అనిపిస్తుంది.స్వర్గాధిపత్యం దక్కినా తృణప్రాయం అనిపిస్తుంది.ఈ దుఃఖం నన్ను పీల్చి పిప్పి చేసేస్తున్నది.ఎండగట్టేస్తున్నది.ఊపిరి ఆనటం లేదు.గొంతు పిడచ కట్టుకుపోతుంది.కిం కర్తవ్యం కృష్ణా!!!????

Wednesday, 28 January 2026

కార్పణ్య దోషోప హత స్వభావః

కార్పణ్య దోషోప హత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః। యచ్ఛ్రేయ స్స్యా న్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్॥7॥2॥ శ్రీమద్భగవద్గీత....సాంఖ్య యోగము... అర్జునుడు ఝంఝాటకం నుంచి బయట పడాలనుకుంటున్నాడు.అందుకని కృష్ణుడిని ఒక రకంగా అర్థిస్తున్నాడు.కృష్ణా!నేను ఈ పనికి మాలిన రాజ్యలోభం,బంధులోభాలతో సతమతమవుతున్నాను.నా మనసుకు దారీ తెన్నూ..।ఏమీ గోచరించడం లేదు.ధర్మనిర్ణయం చేసుకోలేకుండా,అవస్థ పడుతున్నాను.నిన్ను అడుగుతున్నాను.నేను నీకు శిష్యుడిని.నన్ను గట్టుకు చేర్చే బాధ్యత నీదే!నా హితంకోరేవాడివి నీవు.నాకు ఏది మంచిదో నువ్వే తేల్చు.నాకు ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుపోతున్నాను అని భయమేస్తుంది.నాకు నీ ఆపన్న హస్తంకావాలి.దాని సహాయంతో నేను గట్టుకు సురక్షితంగా చేరాలి.నాకు చేయి అందించే వాళ్ళు నువ్వు తప్ప ఇంకెవ్వరూ కానరావటం లేదు.ఉన్నా నాకు అఖ్ఖర లేదు.నువ్వే కావాలి.

Tuesday, 27 January 2026

న చైతద్విద్మః

న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వాజయేమ యదివానో జయేయుః। యానేవ హత్వా న జిజీవిషామ స్తేవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః॥6॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... అర్జునుడు కృష్ణుడికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.కృష్ణా!ఒకటి ఆలోచించు.పోరు సల్పినపుడు విజయం ఎవరిని వరిస్తుందో తెలియదు.యుద్ధం చేసినా మనమే గెలుస్తామనే ధీమా లేదు.అంతోసి దానికి వారిని ఎందుకు చంపాలి?ఎవరిని చంపడం వలన మనకు జీవించాలనే ఇచ్ఛే అడుగంటి పోతుందో ....అటువంటి ధార్తరాష్ట్రులే కదా మన ఎదుట శత్రు పక్షాన ఉన్నది!ఇంక ఏమని అడుగు ముందుకు వేస్తాము?

Monday, 26 January 2026

గురూ న హత్వా హి

గురూ న హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్య మపీహలోకే। హత్వార్థ కామాంస్తు గురూ నిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్దాన్।।5॥2॥ శ్రీమద్భగవద్గీత..।।సాంఖ్య యోగము... అర్జునుడు తన భావాలనూ,బాథలను కృష్ణుని ముందు ఏకరువు పెడుతున్నాడు.సఖా!కృష్ణా!నేను ఏమి చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థం అవుతుంది కదా!మహానుభావులూ,వృద్ధులు అయిన భీష్ముడు,ద్రోణుడు,ఇతరులనందరినీ చంపడం ఎంత పాపం కదా!వారి తప్పులు ఎన్ని ఉన్నా కూడా!దానికంటే బిక్షమెత్తుకుంటూ నాలుగు ఇండ్లు తిరిగి కడుపు నింపుకోవడం ఎంతో ఉత్తమం కదా! అయినాకూడా అర్థకామములకోసరం గురువులను చంపడం,ఆ రక్తపుకూడు తినటం..।రామ!రామ!ఎంత ఘాతుకం! అలా సంపాదించే భోగభాగ్యాలను నేను ఎలా జీర్ణించుకోగలను?ఎలా సుఖపడుతూ అనుభవించగలను?నువ్వే చెప్పు కృష్ణా?అది సాధ్యమా?అసలు అవసరమా?

Sunday, 25 January 2026

కథం భీష్మ మహం సంఖ్యే

అర్జున ఉవాచ... కథం భీష్మ మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన। ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన॥4॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... అర్జునుడు ఇలా అనుకున్నాడు.నేను భలే చెప్పాను.నా స్నేహితుడు నాతో ఏకీభవిస్తాడు.మేమిద్దరం కలిసి మిగిలిన అందరినీ మా దృక్పథంలోకి తీసుకురావచ్చు. కానీ శ్రీకృష్ణుడు విన్నాడు,కానీ ఒప్పుకోలేదు.శ్రీకృష్ణుడు అతనితో నీఆలోచనా విధానం అంతా తప్పు అనేసరికి అయోమయంలో పడ్డాడు.కానీ ఎక్కడో చిన్న ఆశ!తన దారికి కృష్ణుడు వస్తాడని! అందుకనే ఇంకా ప్రాకులాడుతున్నాడు. కృష్ణా!అది ఎట్లా కుదురుతుంది?ఎలా సాధ్యం అవుతుంది?భీష్ముడు ఎవరు?అందరికీ పితామహుడు!ఆచార్యులు అందరూ నా చిన్నప్పటి నుంచీ గురువులు కదా!వారి పైకి నేను బాణాలు ఎలా సంధించగలను?వారందరూ పూజనీయులు కదా!

Saturday, 24 January 2026

క్లైబ్యం మాస్మగమః పార్థ

క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వ య్యుపపద్యతే। క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప॥3॥2॥ శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము... మాములుగా మనం ఏమి చేస్తాము?మనవాళ్ళు ఎవరైనా డోలాయమానంలో ఉంటే?మనకు మనమే కొంచెం పెద్దరికం తీసుకుంటాము.మనకు తెలిసినంతలో,మన విచక్షణా పరిథికి లోబడి మంచి చెడు చెబుతాము.సరైన నిర్ణయం తీసుకోమంటాము.ప్రక్కదారిలో,తప్పుదారిలో నడవద్దుఅని హితవు చెబుతాము. అట్లాంటిది శ్రీకృష్ణుడికి తెలియని దిశా నిర్దేశమా?అతనికి తెలియని సమన్వయమా? అర్జునుడికి హితవు చెప్పనారంభించాడు. అర్జునా!ఎందుకు ఇంత గందరగోళం పడుతున్నావు?ఏదేదో ఊహించుకుని,ఇంకేదో తర్కం నీకు నువ్వు చెప్పుకుంటూ సమయం వృధా చేయకు. ఇలా నీవు పౌరుషాన్ని కోల్పోవడం నీకు అసలు తగని పని.ఎందుకు మానసికంగా డీలా పడిపోతావు?క్షుద్రమయిన హృదయ దౌర్బల్యాన్ని వదలి పెట్టు.అది నీకు తగదు.ససేమిరా నీకు వన్నె తీసుకురాదు.మనకంటూ ఒక బుద్ది,బుర్ర అనేవి ఉన్నాయి కదా!వాటిని వాడి తెలివి తెచ్చుకో!ముందర లెయ్యి!అలసత్త్వం మానుకో!

Thursday, 22 January 2026

కుతస్త్వా కశ్మల మిదం

శ్రీ భగవానువాచ... కుతస్త్వా కశ్మస మిదం విషమే సముపస్థితమ్। అనార్యజుష్ట మస్వర్గ్య మకీర్తికరమర్జున॥2॥2॥ శ్రీకృష్ణుడికి బాగా అర్థం అయిపోయింది.అర్జునుడు అపరాథనాభావం అనే సుడిగుండంలో సుళ్ళు తిరుగుతున్నాడనీ!అతనిని ఆ సుడిగుండంలోనుంచి లాగి బయటపడవేయడం అంత సులువైన విషయం కాదని.కానీ దేనికైనా ముందర మనం శ్రీకారం చుట్టాలి కదా! అందుకని అర్జునుడితో శ్రీకృష్ణుడు ఇలా ఉపక్రమించాడు. అర్జునా!నీవు ఏమి మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతున్నదా?మనం ఎలాంటి విపత్కర పరిస్థితిలో ఉన్నాము?ఇది ఎంతటి విషమ సమయం?ఇప్పుడు మనం మాటలలోకాకుండా చేతలలో సమాథానం చెప్పాల్సిన పరిస్థితి.నువ్వేమో మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చున్నావు. నీ భావజాలము ఆర్యుల లక్షణము కాదు.కీర్తిప్రతిష్టలు తెచ్చేది అంతకంటేకాదు.కనీసం మన చర్యలవలన నరకానికి పోకుండా స్వర్గం మెట్లు ఎక్కుదామా అంటే అస్సలే వీలు కాదు.అనార్యలక్షణము,అపకీర్తికరము,అస్వర్గ్యము అనే అన్ని రకాల జాడ్యాలు కలిసిన ఈ దుఃఖం ఇప్పుడు నిన్ను ఎందుకు ఆవరించింది?

Sunday, 18 January 2026

సాంఖ్య యోగము…తం తథా కృపయా విష్ట

సంజయ ఉవాచ... తం తథా కృపయా విష్ట మశ్రుపూర్ణాకులేక్షణమ్। విషీదంత మిదం వాక్య మువాచ మధుసూదనః॥1॥2॥ సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు.రాజా!శ్రీకృష్ణుడు అర్జునుడు బాధ పడటం అంతా ఓపికగా విన్నాడు.అతని ముఖంలో,మస్తిష్కంలో మార్పులను గమనించాడు. అర్జునుడు అందరూ అయ్యో పాపం!అనేలా ఉన్నాడు.అర్జునుడి హృదయం అంతా జాలి నిండి పోయి ఉంది.కళ్ళనిండా నీరు సుడులు తిరుగుతున్నాయి.హృదయవిదారకంగా రోదిస్తున్నాడు.అలాంటి స్థితిలో ఉన్న అర్జునుడిని ఉద్దేశించి శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు.

Saturday, 17 January 2026

ఏవ ముక్త్వార్జున స్సంఖ్యే

సంజయ ఉవాచ.... ఏవ ముక్త్వార్జున స్సంఖ్యే రథోపస్థ ఉపావిశత్। విసృజ్య సశరం చాపం శోక సంవిగ్న మానసః॥47॥1॥ ఇతి శ్రీమద్భగవద్గీతా వసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోఽధ్యాయః.... సంజయుడు ధృతరాష్రుడికి చూసినది చూసినట్లు చెబుతున్నాడు. ధృతరాష్ట్రా!అర్జునుడు తన మీమాంసను ఇలా మాటల రూపంలో బయట పెట్టాడు.శోకగ్రస్తుడు అయినాడు.కలత బారిన మనసుతో తన అస్త్రశస్త్రాలను ప్రక్కన పడేసాడు.శక్తిలేని వాడై రథం మీద అలాగే చతికిల పడ్డాడు. ఇట్లు బ్రహ్మవిద్య,ఉపనిషత్తు,యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమయిన భగవద్గీతలో అర్జున విషాద యోగమను మొదటి అధ్యాయము సమాప్తము.

Friday, 9 January 2026

యది మా మప్రతీకార

యది మా మప్రతీకార మశస్త్రం శస్త్రపాణయః। ధార్త రాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్॥46॥1॥ శ్రీమద్భగవద్గీత..।అర్జున విషాద యోగము... అర్జునుడు బహు గట్టి నిర్ణయము తీసుకున్నాడు.పెద్దల సలహాలు,అన్నదమ్ముళ్ళ సలహాలు అవసరం లేదనుకున్నాడు.తన బావ,తన ఆప్తమిత్రుడు,తన శ్రేయోభిలాషి ఒప్పుకుంటే చాలనుకున్నాడు.అందుకే శ్రీకృష్ణుడి ఆమోదం కోసరం తహతహలాడుతున్నాడు.ఒకరకంగా చెప్పాలంటే బ్రతిమలాడుతున్నాడు. కృష్ణా!నేను చెప్పేది నీకు అర్థం అవుతుంది కదా!నేను ఎలాంటి ప్రతీకారమూ తీసుకోను.శస్త్ర సన్యాసం చేస్తాను.ఆ ధార్తరాష్ట్రులు నా పైకి మూకుమ్మడిగా వచ్చినా నేను చలించను.వారంతా శస్త్ర ధారులై నన్ను హింసించడానికి వచ్చినా కిమ్మనకుండా ఉంటాను.నాకు మంచి జరుగుతుందనే అనుకుంటాను.ఆ పాపపు పనులు వాళ్ళు చేస్తే చెయ్యనీ!నేనుగా ఆ పాపపంకిలంలోకి అడుగుపెట్టను,అటుగా చూడను.నువ్వేమంటావు?నేను సరిగ్గానే ఆలోచిస్తున్నాను కదా!

Wednesday, 7 January 2026

అహోబత మహత్పాపం

అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్। యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజన ముద్యతాః॥45॥1॥ శ్రీమద్భగవద్గీత..।అర్జున విషాద యోగము... అర్జునుడి దుఃఖానికి అంతం లేకుండా పోతుంది.తిరిగి తిరిగి తనను తానే నిందించుకుంటున్నాడు.దీనమైన గొంతుకతో కృష్ణుడితో ఇలా అంటున్నాడు.హే కృష్ణా!హే సఖా!మనము ఎంత హ్రస్వ దృష్టి కలవాళ్ళమో కదా!ఏదీ నిశితంగా,విస్త్రుతంగా ఆలోచించము కదా!అనుకుంటేనే ఒళ్ళంతా వణుకు పుడుతుంది.ఎంత పాపానికి ఒడి కట్టబోయాము?అదీ తుచ్ఛమయిన ఐహిక సుఖాలకోసరము.కులాచార భ్రష్టత్వానికి నాంది పలకబోయాము.ఎంత పాపం?ఎంత ఘోరం?అసలు ఇలాంటి పాపాలకు నిష్కృతి ఉంటుందా?ఎన్ని జన్మలెత్తినా ఈ పాపాలనుంచి విముక్తి ఉండదు. రాజ్యకాంక్షతో అయిన వాళ్ళని అందరినీ మట్టుబెట్టాలనుకున్నాము.హవ్వ!ఎంత పాపానికి ఒడి గట్టబోయాము?

Tuesday, 6 January 2026

ఉత్సన్న కులధర్మాణాం

ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన। నరకే నియతం వాసో భవతీ త్యనుశుశ్రుమ॥44॥1॥ శ్రీమద్భగవద్గీత..అర్జున విషాద యోగము... అర్జునుడు ఒక ముగింపుకు వచ్చేశాడు.అది తన చెలికాడు అయిన కృష్ణుడితో చెబుతున్నాడు.ఇక ఏమని మాట్లాడుదాము,ఎంతని మాట్లాడుదాము కృష్ణా!నాకు ఖరాఖండిగా ఇదే తడుతుంది.కులాచార భృష్టులకు నరకమే శాశ్వత నివాసం.బావా!ఇది నా సొంత తెలివితో చెప్పడం లేదు.పెద్దలు పలుమార్లు అంటుంటే విన్నాను.ఇప్పుడు రూఢిగా నమ్ముతున్నాను.

Monday, 5 January 2026

దోషై రేత్తైః కులఘ్నానాం

దోషై రేతైః కులఘ్నానాం వర్ణసంకర కారకైః। ఉత్సాద్యన్తే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః॥43॥1॥ శ్రీమద్భగవద్గీత....అర్జున విషాద యోగము... అర్జునుడు ఇంకా ఇలా వాపోతున్నాడు.కృష్ణా!నేను ఏమి చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థం అవుతుంది కదా!వర్ణ సంకరానికి పాల్పడేవారు,వారొక్కరే చెడిపోవటం లేదు.వారితోటివారి కులం మొత్తాన్నీ అథఃపాతాళానికి తీసుకెళుతారు.ఎలాగంటావా,కృష్ణా? ఎవరైనా సుడిగుండంలో చిక్కుకున్నారు అనుకో,సహాయం అర్థిస్తారు.మనము ఎగురుకుంటూ పోతాము సహాయం చేసేదానికి.కానీ ఆ సుడిగుండంలోకి మనము కూడా పీల్చివేయబడతాము కదా! ఇక్కడ కూడా అలానే జరుగుతుంది.ఈ వర్ణ సంకరానికి పాల్పడే కర్తలు ఉంటారు కదా!వారు చేసే పాపకార్యాల వలన అనాదిగా వచ్చే కుల,జాతి ధర్మాలకు పాతర వేయబడుతుంది.ఆ ధర్మాలు అన్నీ కూకటి వ్రేళ్ళతో సహా పెకిలించవేయబడతయి.ఇదే అన్నిటికంటే వినాశకారి.

Sunday, 4 January 2026

సంకరో నరకాయైవ

సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ। పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియాః॥42॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... అర్జునుడికి దుఃఖం,విచారమూ క్షణ క్షణానికీ ఎక్కువ అవుతున్నాయి.ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుని పోతున్నాడు.శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు.కృష్ణా!వర్ణసంకరం వలన ఎవరికి లాభం చెప్పు?అటు కర్తకూ,ఇటు కులానికీ...రెంటికీ నరకమే కదా దక్కేది.వీళ్ళు చేసే పాపపు పనుల వలన పితృదేవతలు కూడా క్షోభిస్తారు.ఎందుకంటే వారికి పిండోదకాలు పెట్టేవాళ్ళూ,తర్పణాలు వదిలేవారూ ఎవరూ మిగిలి ఉండరు కదా!చివరికి ఉండేవాళ్ళు,పుట్టబోయే వాళ్ళు,ఆఖరికీ ఎప్పుడో పోయిన పితృదేవతలు,వారి ఆత్మలు...అందరూ అధోగతులపాలవుతారు. ఇంత ఘోష,ఇంత పాపం చేయటం మనకు అవసరమా?

Saturday, 3 January 2026

అధర్మాభి భవాత్ కృష్ణ

అధర్మాభి భవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః। స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః॥41॥1॥ శ్రీమద్భగవద్గీత..।అర్జున విషాద యోగము... మామూలుగా అన్నీ బాగుంటే మనమూ బాగుంటాము.పరిస్థితులు తారుమారు అయితే మనమూ అతలాకుతలము అవుతాము.అప్పుడు జీవనం ఎలా సాగించాలి?ఎలా బ్రతకాలి అనేదే ముఖ్యం అవుతుంది.అప్పుడే మనలో ఉండే అసలు మనిషి,అసలు వ్యక్తిత్వం బయట పడతాయి.చాలా మందికి కష్టాలూ,కడగళ్ళు అంటే భయం.అందుకనే ఎవరైనా కష్టాలలో ఉంటే వారి దరిదాపుల్లోకి కూడా ఎవరూ పోరు.అది అంటు వ్యాధి కాదు.కానీ అందరూ భయపడతారు. మన పని కావటం ముఖ్యం అనుకుంటారు.అనుసరించే మార్గం ఏదైనా పరవాలేదు అనుకుంటారు. అర్జునుడు అదే కృష్ణుడికి చెబుతున్నాడు. హే కృష్ణా!అధర్మం పెరిగితే ఏమవుతుంది?ఎవరూ మంచి బాటలో నడవాలని అనుకోరు.కులస్త్రీలు దుష్టులుగా పరిణమిస్తారు.వారు సక్రమమయిన మార్గంలో నడవక పోతే ఏమవుతుంది?వర్ణ సంకరమేగా!కులం భ్రష్టు పట్టిపోతుంది.ఆచార వ్యవహారలకు పాతర వేస్తారు.

Thursday, 1 January 2026

కులక్షయే ప్రణశ్యంతి

కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా స్సనాతనాః। ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోఽభి భవత్యుత॥49॥1॥ శ్రీమద్భగవద్గీత..।అర్జున విషాద యోగము... అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గర ఇలా వాపోతున్నాడు.కృష్ణా!నీకు కూడా తెలుసు కదా,కులక్షయం వలన కులాచారాలు నాశనమవుతాయి అని.కులాచారాలు భ్రష్టుపడితే కులం మొత్తం పాపపంకిలం అయిపోతుంది కదా!అధర్మం పేట్రేగిపోతుంది కదా!మంచి చెడ్డ అనే విచక్షణ కూకటి వ్రేళ్ళతో పీకివేయబడుతుంది కదా!కులము అనేది నాశనము అవుతుంది,లేక అంతరించి పోతుంది అంటే ఇక ప్రత్యామ్నాయము ఏమి ఉంది? ఈ వినాశనాన్ని ఆపేదెలా?

కథం న జ్ఞేయ మస్మాభిః

కథం న జ్ఞేయ మస్మాభిః పాపా దస్మా న్నివర్తితుమ్। కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన॥39॥1॥ శ్రీమద్భగవద్గీత..అర్జున విషాద యోగము... అర్జునుడు చెబుతున్నాడు.కృష్ణా!ఇప్పుడు ఇంక తెలిసిపోయింది కదా,వాళ్ళ నుంచి ఏ రకమైన మంచీ మనం ఆశించలేమని.కనీసం మనమైనా ఏదో ఒకటి ఆలోచించాలి కదా!ఎందుకంటే కులక్షయం చేయడం వలన వచ్చే పాపం మనకు అవగతమవుతుంది.దానిని అరికట్టేదానికి మనం ఆలోచించాలి.లేదా కనీసం ఆప్రక్రియకు దూరంగా అన్నా ఉండాలి.ఇది మన కనీస ధర్మం కదా!