Wednesday, 2 July 2025

అధిష్ఠానం తథా కర్తా

అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్। వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమమ్॥14॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇంకా వివరంగా చెబుతున్నాడు.అర్జునా!మనస్సు,వాక్కు,శరీరాలతో మనిషి చేసే సమస్తము అయిన ఉచ్ఛ నీచ కర్మలకూ ఈ అయిదే కారణము.మనము గొప్ప పనులు చేసినా కారణం అవే.అలాగే నీచ,నికృష్టమయిన పనులు చేసినా ఆ అయిదే కారణము.ఆ అయిదు ఏందో మళ్ళీ చెబుతాను నీ కోసం,విను.అవి శరీరము,అహంకారము,పంచేంద్రియాలు,ప్రక్రియాపరము అయిన వివిధ కార్యాలు,పరమాత్మ.

Monday, 30 June 2025

పంచైతాని మహాబాహో

పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే। సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్॥13॥ అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్। వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమమ్॥14॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్షసన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!సాంఖ్య శాస్త్రము ఏమి చెబుతుందో కూడా తెలిసుకుందాము మనము.అన్ని కర్మలకూ కారణం ఏందో ఈ శాస్త్రం మనకు విశదీకరిస్తుంది.శరీరం,అహంకారం,పంచేంద్రియాలు,ప్రక్రియాపరమైన వివిధ కార్యాలు,పరమాత్మ....అనబడే ఈ అయిదే,సమస్త కర్మలకూ కారణాలు అని సాంఖ్య శాస్త్రము చెబుతుంది.

Sunday, 29 June 2025

అనిష్ట మిష్టం మిశ్రం చ

అనిష్ట మిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్। భవ త్యత్యాగీనాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్॥12॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్షసన్న్యాస యోగము శ్రీకృష్ఞుడు అర్జునుడికి కర్మఫలాల గురించి వివరిస్తున్నాడు.అర్జునా!మనము ఇప్పుడు రకరకాల కర్మల గురించి,త్యాగాల గురించి చెప్పుకున్నాము కదా!ఇక కర్మ ఫలాల గురించి మాట్లాడుకుందాము.ఇష్టానిష్ట మిశ్రమములు అని కర్మ ఫలాలు మూడు రకాలు ఉన్నాయి.కామన గల వారికి ఆ ఫలాలు,ఫలితాలు పరలోకంలో అందుతాయి.అదే మనము కర్మ ఫలత్యాగుల గురించి మాట్లాడుకుందాము.కర్మ ఫలత్యాగులకు యెప్పుడూ ఆ ఫలితాలు తగులవు.అంటే అంటవు.తామరాకు మీద నీటి బొట్టు చందాన ఉంటుంది.

Saturday, 28 June 2025

న హి దేహభృతా శక్యం

న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్య శేషతః। యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీ త్యభిదీయతే॥11॥ శ్రీమద్భగవద్గీత.।।అష్టాదశాధ్యాయము మోక్షసన్న్యాస యోగము శ్రీకృష్ణుడు భగవంతుడు.ఆయనకు మానవుల బలాలు,బలహీనతలు అన్నీ క్షుణ్ణంగా చెలుసు.ఆయన అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!దేహధారులకు కర్మలను అన్నిటినీ విడవటం అసాథ్యం.అది కూడని పని అని నాకూ తెలుసు.అందువల్ల నేను ఏమి చెబుతానో విని అర్థం చేసుకో.కర్మలను వదలడం పూర్తిగా మానవమాత్రులకు కుదరదు కాబట్టి,కనీసం కర్మఫలాన్ని వదులుకోగలగాలి.అలా కర్మఫలాన్ని వదలగలిగిన వాడే త్యాగి అని నా భావము.

Friday, 27 June 2025

న ద్వేష్ట్య కుశలం కర్మ

న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే। త్యాగీ సత్త్వ సమావిష్టో మేధావీ ఛిన్న సంశయః॥10॥ శ్రీ మద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీ కృష్ణుడు అర్జునుడికి సాత్త్విక త్యాగము గురించి విడమరచి చెబుతున్నాడు.ఎందుకంటే మంచి విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పాలి,అర్థం అయ్యేలా,మనసుకు హత్తుకునేలా చెప్పాలి.మనము కూడా ఆచరిద్దాము అనే తృష్ణ ఎదుటివారిలో కలిగేలా చెప్పాలి. అర్జునా!సత్త్వ గుణ ప్రధానంగా ప్రతి ఒక్కరూ వర్థమానులు కావాలి.అలా కావాలంటే మొదట ఆసక్తిని,ఫలాన్ని విడిచి కర్మలు చేయటానికి శ్రీకారం చుట్టాలి.ఇలా ప్రతి నిత్యం చేస్తూ,ఆత్మ జ్ఞానం పొందాలి.ఈ యజ్ఞంలో ఎలాంటి అనుమానాలకూ,సందేహాలకూ తావు ఇవ్వకూడదు.అలాంటి సందేహరహితుడు,ఆత్మజ్ఞాని దుఃఖాలను ఇచ్చే కర్మలను ద్వేషించడు.అంతేనా?అలాగే సుఖాలను ఇచ్చే కర్మలనూ ఆమోదించడు,ఇష్టపడడు.నిర్వికారంగా తన ధర్మాన్ని తాను పాటిస్తూ ముందుకు పోతాడు.

Thursday, 26 June 2025

కార్యమిత్యేవ యత్కర్మ

కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేఽర్జున। సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగ స్సాత్త్వికో మతః॥9॥ శ్రీమద్భగవద్గీత..అష్టాదశాధ్యాయము మోక్షసన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి త్యాగం అనేది సరిగ్గా ఎలా చేయాలో వివరిస్తున్నాడు.అర్జునా!ఇప్పుడే నీకు తామస,రాజస యోగాల గురించి చెప్పాను కదా!అలాగే వాటి వల్ల ఫలితం కూడా శూన్యం అని చెప్పాను కదా!ఇప్పుడు నీకు నేను సాత్త్విక త్యాగం గురించి చెబుతాను.ప్రతి ఒక్కరూ అది పాటిస్తే మంచిది.మానవుడు అనే ప్రతి జీవి శాస్త్రాలు చెప్పిన కర్మలను చేయాలి.అది తప్పించుకపనేదానికి కుదరదు.కానీ ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది.మనము ఆ కర్మలయందు ఆసక్తి లేకుండా చేయగలగాలి.అంటే నిర్వికారంగా అన్నమాట.మనము చేసే కర్మలవలన మనకు సంక్రమించే ఫలితం పైన ఎలాంటి ఆశలు పెంచుకోకూడదు.అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చేయగలగటం నేర్చుకోవాలి.ఇలా ఆసక్తినీ,కర్మఫలాన్నీ విడవగలిగి,సత్కర్మలు చేయగలగాలి.అలాంటి త్యాగాన్నే సాత్త్విక త్యాగము అంటారు.

Wednesday, 25 June 2025

దుఃఖమిత్యేవ యత్కర్మ

దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్త్యజేత్। స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్॥8॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్షసన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!మూర్ఖత్వంతో చేసే త్యాగం తామస త్యాగం అని చెప్పాను కదా.ఇప్పుడు ఇంకో రకం త్యాగం గురించి చెబుతాను,విను.ఇక్కడ వీళ్ళు ఎక్కడ శరీరం అలుస్తుందో అని కలత చెందుతుంటారు.అందుకని శరీరకష్టానికి భయపడి వారు చేయాల్సిన కర్మలను చేయడం మానివేస్తారు.అంటే త్యాగం ముసుగులో పని దొంగలు అన్నమాట!దీనినే రాజస త్యాగము అంటారు.ఇలాంటి త్యాగాల వలన ఫలితం శూన్యము.కాబట్టి ఎవరమూ మన మన విధులను,చేయాల్సిన కర్మలను మానకూడదు.

Tuesday, 24 June 2025

నియతస్య తు సన్న్యాసః

నియతస్య తు సన్న్యాసః కర్మణో నోపపద్యతే। మోహాత్తస్య పరిత్యాగ స్తామసఽ పరికీర్తితః॥7॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్షసన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏది మంచో,ఏది కాదో ఓపికగా,నిదానంగా,అర్థం అయ్యేలా వివరిస్తున్నాడు.అర్జునా!ఎప్పుడూ ప్రతి ఒక్కరికీ విద్యుక్త కర్మలు,ధర్మాలు కొన్ని నిర్దేశితంగా ఉంటాయి.మానవుడు వాటినన్నిటినీ శ్రద్ధగా ఆచరించాలి.త్యాగం అన్నారని ఆ విద్యుక్త కర్మలను ఎప్పుడూ విడనాడకూడదు.అలాంటి త్యాగము ఎప్పటికీ న్యాయం,ధర్మము కాదు.ఎలాంటి శాస్త్రీయమయిన విశ్లేషణ,అవగాహన లేకుండా,పర్యవసానాలు ఆలోచించకుండా చేసే త్యాగము మూర్ఖత్వము అవుతుంది.దానినే తామస పరిత్యాగము అంటారు.

Monday, 23 June 2025

ఏతాన్యపి తు కర్మాణి

ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ। కర్తవ్యా నీతి మే పార్థ నిశ్చితం మత ముత్తమమ్॥6॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!మానవుడు యజ్ఞము,దానము,తపము విడవకుండా చెయ్యాలని చెప్పాను కదా!అవి కూడా ఎలా చెయ్యాలో చెబుతాను విను.మనము చేసే ఏ కర్మలలోనూ ప్రతిఫలము ఆశించకూడదు.ఆశ,బంథము,మమకారము,లోభము,లాలస లేకుండా చేయగలగాలి.అంటే ఆ యజ్ఞాది కర్మలు అన్నిటినీ కూడా కర్తృత్వమమకారము,ఫలాపేక్షలు విడిచిపెట్టి చెయ్యాలి.అలానే చేయాలనేది నా నిశ్చితమయిన అభిప్రాయము.

Sunday, 22 June 2025

యజ్ఞదానతపః కర్మ

యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్। యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్॥5॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము చిన్నప్పుడు బడిలో మన ఉపాధ్యాయులు మనకు ఎలా నేర్పిస్తారు?ఒకటికి పది సార్లు చెప్పిస్తారు.ఇంకో ఇరవై సార్లు పలక మీద దిద్దిస్తారు.వంద సార్లు చదివి ఒప్ప చెప్పమంటారు.మా గురువు అయితే అర్థరాత్రి గాఢనిద్రలో ఉన్నా,లేపి అడిగితే ఒక్క తప్పుకూడా లేకుండా,గడగడా చెప్పగలగాలి.అలా కంఠస్తం చెయ్యాలి అనేవారు. ఈ విషయం మనందరికంటే ఆది గురువుకే ఇంకా బాగా తెలుస్తుంది కదా!అందుకనే ఆయన మంచి విషయాలను మరీ మరీ,ఒకటికి పది సార్లు చెబుతున్నాడు అర్జునుడికి.ఎందుకంటే మంచి విషయాలు పదే వినాలి,చదవాలి,వ్రాయాలి,అర్థం చేసుకోవాలి,మననం చేసుకోవాలి,ఆచరణలో పెట్టాలి.అంటే మన జీవిత విధానంలోకి అన్వయించుకోవాలి.ఎందుకంటే మనలో ఎంత మంది ఏక సంతగ్రాహులుఉంటారు?ఉన్నా మంచి విషయాలను అర్థం చేసుకుని,మననం చేసుకుంటూ,వారి జీవితాలలో అన్వయించుకుంటారు?కాబట్టి సాథన అవసరము. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి మరలా మరలా చెబుతున్నాడు.అర్జునా!కౌంతేయా!నేను చెప్పే యాగము,దానము,తపస్సు అనే మూడు కర్మలను జీవితంలో ఎప్పుడూ విడనాడ కూడదు.అవి మన జీవిత విథానంలో మమేకం అయిపోవాలి.ఎందుకంటావా?ఎందుకంటే అవి మనసును కల్మష రహితంగా తయారు చేస్తాయి.చిత్తశుద్థిని కలిగిస్తాయి.ప్రశాంతతను పొందేలా చేస్తాయి.

Saturday, 21 June 2025

నిశ్చయం శరణు మే తత్ర

నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ। త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధ స్సంపకీర్తితః॥4॥ శ్రీకృష్ణుడికి అర్జునుడు అంటే అమితమైన అభిమానము,సద్భావము.అందుకే అర్జునుడిని భరతసత్తమ,పురుషవ్యాఘ్రము అని పిలుస్తున్నాడు.అంటే కృష్ణుడి దృష్టిలో అర్జునుడు ఎంతో ఉత్తముడు,వీరుడు,శూరుడు,ధైర్యము కలవాడు.అందుకే అతనిని పురుషులలో పులి,ఉత్తముడు అని మెచ్చుకోలుగా పిలుచుకుంటున్నాడు. శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఓ పురుషవ్యాఘ్రమా!ఇప్పుడే మనము యజ్ఞ,దాన తపస్సులను ఎప్పుడూ మానవుడు విడనాడ కూడదని అనుకున్నాము కదా.అందులో త్యాగం గురించి చెప్పాలంటే,దానిలో మూడు రకాలు ఉంటాయి.

Friday, 20 June 2025

త్యాజ్యం దోషవది త్యేకే

త్యాజ్యం దోషవది త్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః। యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే॥3॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!నీకు తెలుసు కదా!కర్మలు అన్నీ మనలని కట్టి పడవేసే బంధనాలు అని.కాబట్టి వాటిని వదిలి వేయడమే మంచిది,ఉత్తమమయిన మార్గము అని కొందరు అంటారు.ఇంకొందరు ఇలా కూడా చెబుతారు.యజ్ఞము,దానము,తపస్సు అనేవి జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించవలసిన నియమాలు,కార్యాలు.కావున వాటిని ససేమిరా ఎప్పుడూ విడువకూడదు అని మరింకొందరు చెబుతారు.

Thursday, 19 June 2025

కామ్యానాం కర్మణాం న్యాసం

శ్రీ భగవానువాచ.... కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః। సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః॥2॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము గురువుకు ఎప్పుడూ శిష్యులకు మంచి మంచి విషయాలు చెప్పాలనిపిస్తుంది.అందునా,ఆ శిష్యులు ఇంకా ఇంకా తెలుసుకోవాలనే తపన కనబరచినప్పుడు చాలా ఆత్మానందం పొందుతారు.మరింత ఉత్సాహంతో ఇంకా చాలా చాలా కొత్త విషయాలు చెప్పిస్తారు.ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడి పరిస్థితి కూడా అలానే ఉంది.అర్జునుడు త్యాగము,సన్న్యాసము గురించి ఇంకా వివరించమనగానే శ్రీకృష్ణుడు చాలా ఆనందించాడు.రెట్టింపు అయిన ఉత్సాహంతో చెప్పడం ప్రారంభించాడు. అర్జునా!మొదట వీటి రెండింటి గురించి పండితులు ఏమని అనుకుంటారో చెబుతాను విను.కామ్య కర్మలను మాని వేయడమే సన్న్యాసము అనుకుంటారు.కర్మ ఫలాలను విడిచి పెట్టడమే త్యాగమని నమ్ముతారు,చెబుతారు.

Wednesday, 18 June 2025

సన్న్యాసస్య మహాబాహో

అర్జున ఉవాచ... సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్। త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశినిషూదన॥1॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్షసన్న్యాస యోగము అర్జునుడు శ్రీకృష్ణుడు ఇంత సేపూ చెప్పినదంతా వినమ్రంగా,శ్రద్ధాసక్తులతో విన్నాడు.ఇప్పుడు తనకు వచ్చిన అనుమానాలను బయటపెడుతున్నాడు.హే కృష్ణా!అసలు సవ్న్యాసము అంటే ఏమిటి?త్యాగము అంటే ఏమిటి!వీటన్నిటి వివిధ రకాలు,స్వరూపాలు ఏమిటి?ఇవంతా ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలని నా మనసు కుతూహల పడుతుంది.కావున నాకు వీటన్నిటి గురించి వివరంగా విశదీకరించు అని కోరుతున్నాడు.

Tuesday, 17 June 2025

అశ్రద్ధయా హుతం దత్తం

అశ్రద్ధయా హుతం దత్తం తప స్తప్తం కృతం చ యత్। అసది త్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ॥28॥ ఇతి శ్రీ మద్భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశాధ్యాయః!!!!! శ్రీమద్భగపద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇక అసత్ గురించి చెప్పి ఈ అధ్యాయము ముగిస్తున్నాడు.ఓ అర్జునా!హే పార్ధా!మనము ఏ పని చేసినా ఆ పని పైన ఇష్టము,నమ్మకము,శ్రద్ధ,నిష్ట,నియమాలు ఉండితీరాలి.కానీ అలా కాకుండా,లెక్కలేనితనంగా,అయిష్టంగా,అసంపూర్తిగా,అసంతృప్తిగా,అవగాహన లేకుండా,అశ్రద్ధగా,అతిశయంతో చేసే ఏ కార్యానికీ సత్ఫలితం దక్కదు.ఇలా శ్రద్ధారహితంగా చేసే హోమం,దానం,తపస్సు,మరియు ఇతర కర్మలు అన్నీ అసత్ గానే చెప్పబడతాయి.వాటి వలన ఎవరికీ ఎలాంటి ఉపయోగము ఉండదు.అలాంటి కర్మల వలన ఇహ పరలోకాలలో ఎక్కడా కూడా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.అంటే అలా చేసినా ఒకటే,చేయకపోయినా ఒకటే.పెద్ద తేడా ఏమీ ఉండదు.

Monday, 16 June 2025

సద్భావే సాధుభావే చ

సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే। ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే॥26॥ యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే। కర్మచైవ తదర్థీయం స దిత్యే వాభిదీయతే॥27॥ శ్రీమద్భగవద్గీత..సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓం,తత్ పదాలు,శబ్దాల విశిష్టత వివరించాడు.ఇప్పుడు ఇక సత్ అనే శబ్దం గురించి వివరిస్తున్నాడు.ఓ అర్జునా!పార్థా!నీకు ఓం మరియు తత్ ల విశిష్టత బాగా అర్థం అయింది కదా!అలాగే సత్ అనే శబ్దం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. సత్ అనే శబ్దం మాములుగా అస్తిత్వము,శ్రేష్టము అనే అర్థాలలో వాడబడుతుంది.సత్ అంటే నిజము,నిత్యము,సత్యము కూడా అనుకోవచ్చు. ఇకపోతే యాగాలలో,దానాలు చేసేటప్పుడు,తపస్సులలో ముఖ్య ఉద్దేశ్యము ఆ పరబ్రహ్మను చేరుకోవాలనే కదా!అలాంటి నిశ్చలమయిన,నిష్ఠ పరమాత్మను గూర్చి చేసే యాగాలు,దానాలు,తపస్సులు,సమస్త కర్మలు కూడా సత్ అని చెప్పబడుతున్నాయి.

Sunday, 15 June 2025

తది త్యనభిసంధాయ

త ది త్యనభిసంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః। దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః॥25॥ శ్రీమద్భగవద్గీత...।సప్త దశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.ఇప్పుడు ఓంకారం ఎలా,ఎందుకు,ఎప్పుడు వాడుతారో చెప్పాను కదా!ఇప్పుడు ఇంక తత్ గురించి చెప్పుకుందాము.తత్ అంటే అది అని అర్థము.మోక్షకామములను తత్ అని శబ్దోచ్ఛారణ పూర్వకంగా పిలుస్తారు యోగులు,సన్యాసులు మరియు తాపసులు.ఎలాంటి ప్రయోజనాలు కోరకుండా చేసే యజ్ఞాలు,దానాలు,తపోకర్మలు అన్నీ తత్ అనే శబ్దోచ్ఛారణ పరస్పరంగా చేయబడుతున్నాయి.వాడబడుతున్నాయి.

Saturday, 14 June 2025

తస్మాదో మిత్యుదాహృత్య

తస్మాదో మిత్యుదాహృత్య యజ్ఞదానతపః క్రియాః। ప్రవర్తంతే విధానోక్తా స్సతతం బ్రహ్మవాదినామ్॥24॥ శ్రీమద్భగవద్గీత...సప్త దశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓంకారం యొక్క విశిష్టతను వివరిస్తున్నాడు.అర్జునా!నీకు నేను ఓం తత్ సత్ గురించి,వాటి విశిష్టత గురించి ఇప్పుడే చెప్పాను కదా!వీటన్నిటిలోకి ఓం శబ్దం యొక్క ప్రాముఖ్యం చాలా ఉంది.దీనికీ కారణం ఉంది.ఈ సృష్టి మొత్తం ఓంకార నాదంతో మొదలు అయింది.కావున దీనికి చాలా విలువ,విశేషత ఉన్నాయి.దానిని మన పూర్వీకులు అందరూ నిశితంగా గుర్తించారు.కాబట్టే బ్రహ్మజ్ఞుల యాగాలు,దానాలు,తపస్సులు,ఇతర అనుష్టాన కర్మలు అన్నీ ఓంకార పూర్వకంగానే అనుష్ఠింపబడతాయి.

Thursday, 12 June 2025

ఓం తత్సదితి నిర్దేశో

ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ స్త్రివిధ స్మృతః। బ్రాహ్మణాస్తేన వేదశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా॥23॥ శ్రీమద్భగవద్గీత...సప్తగశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఓం,తత్,సత్ అనే మూడు సంకేత పదాలు బ్రహ్మజ్ఞతకు సాధనాలుగా నిర్దేశించ బడినాయి.ఆ నిర్దేశాల వలనే వేదాలు,యజ్ఞాలు,బ్రాహ్మణులు కల్పించ బడటం జరిగింది. ఓం అనేది బీజాక్షరం.ఓంకారం తోటే ఈ సృష్టి మొత్తం ఉద్భవించింది.కాబట్టి ఆ ఉచ్ఛారణ,ఆ అక్షరమూ మనకు చాలా పవిత్రమయినది.ఓం తత్సత్ అంటే సర్వోచ్ఛమయిన వాస్తవికత.అదే నిజం.ఏది వాస్తవికమయినదో అదే నిజం,అదే సంపూర్ణం.భగవంతుడే నిత్యమూ,సత్యమూ కాబట్టి ఆతని స్పృహలో ఉండాలి ప్రతి ఒక్కరూ.

Wednesday, 11 June 2025

ఆదేశకాలే యద్దాన

అదేశకాలే యద్దాన మపాత్రేభ్యశ్చ దీయతే। అసత్కృత మనజ్ఞాతం తత్తామస ముదాహృతమ్॥22॥ శ్రీమద్భగవద్గీత..।సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు ఇప్పుడిపుడే సాత్త్విక,రాజస దానాల గురించి ప్రస్తావించాడు.ఇక మిగిలినది తామస దానము.దాని గురించి కూడా అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!నీకు సాత్త్విక,రాజస దానాలు ఎలా ఉంటాయో అవగాహనకు వచ్చింది కదా.ఇప్పుడు ఇక తామస దానం గురించి చెబుతాను,విను.ఇక్కడ దానం చేసేవారిలో లెక్క లేనితనం,ఆ ప్రక్రియ పట్ల నిర్లక్ష్యభావం అడుగడుగునా మనకు గోచరిస్తుంటుంది.దేశకాల పాత్రల గురించి అవగాహన లేమి ఉంటుంది.దానంతీసుకునే వారి పైన చులకన భావం,అగౌరవము ఉంటాయి.దేశకాల పాత్రల గురించి మంచిగా తెలుసుకుని,దానికి తగిన రీతిలో దానం చెయ్యాలనే స్పృహ ఉండనే ఉండదు.దానం చెయ్యాలా?చేసాము!అని చేతులు దులుపుకొని పోయే మనస్తత్త్వం ప్రస్ఫుటమవుతుంటుంది.ఇన్ని అవలక్షణాలతో చేసే దానాన్నే తామస దానం అంటారు.

యత్తు ప్రత్యుపకారార్థం

యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః। దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతమ్॥21॥ శ్రీమద్భగవద్గీత..।సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్కీకృష్ణుడు ఇప్పుడే సాత్త్విక దానంగురించి చెప్పాడు.ఇప్పుడు ఇక రాజసదానం ఎలా వుంటుందో వివరిస్తున్నాడు.అర్జునా!నీకు సాత్త్వికదానం గురించి చెప్పాను కదా.ఇప్పుడు రాజస దానం గురించి వివరిస్తాను.ఇక్కడ అన్నీ చేస్తారు.కానీ ఆ నిష్కపటం,నిర్మలత్వం,నిర్మోహం ఉండవు.ప్రతిఫలం కోరుకుంటారు అడుగడుగునా.మనం వాళ్ళకు ఇంత చేస్తే,ప్రత్యుపకారంగా వారి నుంచి మనము ఎంత ఆశించవచ్చు అని బేరీజు వేసుకుంటారు.దానం స్వీకరించే వాళ్ళ దగ్గరే కాకుండా,సంఘం నుంచీ కూడా.పేరు ప్రఖ్యాతులు,గౌరవ మర్యాదలు కోసం తహ తహలాడుతారు.ఇలా చేయటం వలన వాళ్ళకు కష్టమయినా వెనుకాడకుండా,ముందుకు పోతారు.దానం తీసుకున్న వాళ్ళు వారికి అణిగి మణిగి ఉండాలనుకుంటారు.వీళ్ళ గుణగణాలు,దాతృత్వం గురించి ఊరూరా కథలు కథలుగా చెప్పుకోవాలి అని కోరుకుంటారు.దీనినే రాజస దానం అని అంటారు.

Tuesday, 10 June 2025

దాతవ్యమితి యద్దానం

దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే। దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతమ్॥20॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి యజ్ఞము,తపస్సుల గురించి వివరించాడు.ఇప్పుడు దానాలలో రకాల గురించి చెబుతున్నాడు.ఓ అర్జునా!పుణ్యస్థలాలలో దానం చేయటము అనే ప్రక్రియ కర్తవ్యము అనుకోవాలి ప్రతి ఒక్కరూ.దానం చేయమన్నారు కదా అని ఏదో ఒకటి ఇచ్చేసి,చేతులు దులిపేసుకో కూడదు.మనము చేసే దానము దేశకాల పాత్రలకు అనుగుణంగా,అనుసరించి ఉండాలి.అంటే వివరంగా చెబుతాను విను.ఆ ప్రాంతంలో వారికి ఏది అవసరమో కనుక్కొని ఇవ్వగలగాలి.అంటే మనము చేసేది వారికి ఉపయోగ పడాలి.అలాగే కాలానికి సరిపోయేటట్లుగా.అంటే చలికాలంలో దుప్పటి ఇస్తే పనికి వస్తుంది.ఎండా కాలంలో నీరు,నీడ,గాలి అవసరము.కాబట్టి చలివేంద్రాలు,ఎండ నుంచి కాపాడుకునేదానికి,ఉక్క నుంచి ఉపశమనానికి ఉపకరణాలు సమకూర్చడం లాంటివి.అలానే అవసరంచూసి,అవసరము అయినవారికి చేయాలి.అపాత్ర దానం చేయకూడదు.అలా సహాయ సహకారాలు అందిచడంలో మనము ఎలాంటి ప్రతిఫలం ఆశించకూడదు.మనకు ఉపయోగము పొందేవారి నుంచి ఎలాంటి ఉపయోగము,లాభము ఉండకూడదు.ఇలా చేసే దానాలను సాత్త్వికమయిన దానం అంటారు.

Monday, 9 June 2025

మూఢగ్రాహేణాత్మనో

మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః। పరస్యోత్సాదనార్థం వా తత్తామస ముదాహృతమ్॥19॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు ఇంత సేపూ సాత్త్విక తపస్సు గురించి,రాజస తపస్సు గురించి చెప్పాడు.ఇప్పుడు ఇక తామస తపస్సు గురించి అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!సాత్త్విక,రాజస తపస్సులు ఎలా ఉంటాయో అర్థం అయింది కదా.ఇప్పుడు ఇంక తామస పరమయిన తపస్సు గురించి వివరిస్తాను.ఇది ఎంత సేపూ ఎలా ఎదుటివారికి ఏ ఏ రీతులలో హాని చేయగలము అనే దురుద్దేశంతోనే ఉంటుంది.ఈ క్రమములో వారిని వారే హింసించుకునేదానికి కూడా వెనుకాడరు.సమయాసమయాలు,ఇంగితము,విచక్షణ ఏమీ ఆలోచించరు.ఎంత సేపూ మూర్ఖపు పట్టుదలలకు పోయి వారిని వారే నాశనం చేసుకోవటం కాకుండా ఎదుటి వారినీ,అయినవారిని కూడా ఇబ్బందికి గురి చేస్తూ బాధ పెడుతుంటారు.ఇలాంటి మూర్ఖపు పట్టుదలలకు పోయి చేసే తపస్సునే తామసిక మయిన తపస్సు అంటారు.అర్జునా!ఈ మార్గంలో ఎప్పుడూ పయనించకు.

Sunday, 8 June 2025

సత్కారమానపూజార్థం

సత్కారమానపూజార్థం తపో దంభేన చైవ యత్। క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధృవమ్॥18॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయవిభాగయోగము కృష్ణుడు అర్జునుడికి మొదట సాత్త్వికమయిన తపస్సు గురించి చెప్పాడు కదా.ఇప్పుడు రాజస తపస్సు గురించి వివరిస్తున్నాడు.అర్జునా!ఇక మనము రాజస తపస్సు గురించి మాట్లాడు కుందాము.వీరు ఎప్పుడూ పరుల నుండి గుర్తింపు ఆశిస్తుంటారు.దాని కారణంగా గౌరవం ఎక్కడెక్కడ దొరుకుతుందా అని అన్వేషిస్తూ ఉంటారు.మనలను ఎదుటివారు సత్కరించాలంటే ఏమి చేయాలి అని ఆలోచిస్తుంటారు.వారి ఆలోచనలకు తగినట్లుగానే వారి కార్యాచరణ ఉంటుంది.అదే!పరులనుండి గౌరవ సత్కారాలు ఆశిస్తూ,డంబంతో చేసే తపస్సునే రాజస తపస్సు అంటారు.మనము ఎలా చేస్తామో,దాని ఫలితాలు కూడా అలానే ఉంటాయి కదా!కాబట్టి వీరు చేసే పనులకు సంబంధించి ఫలితం కూడా అల్పంగా,అంతంత మాత్రంగానే ఉంటుంది.

Saturday, 7 June 2025

శ్రద్ధయా పరయా తప్తం

శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః। అఫలాకాంక్షిభిర్యుక్తై స్సాత్త్వికం పరిచక్షతే॥17॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి క్లుప్తంగా సాత్త్విక తపస్సు గురించి చెబుతున్నాడు.అర్జునా!మనం చేసే ప్రతిపనిలోనూ ప్రతిఫలం ఆశించకూడదు.మనసును నిర్మలంగా,నిశ్చలంగా ఎల్లప్పుడూ ఉంచుకోగలగాలి.చేసే ప్రతి పనిని శ్రద్ధాసక్తులతో చేయాలి.ఈ మూడు కార్యాలను నియమ నిష్ఠలతో ఆచరించడమే మూడు రకాల సాత్త్విక తపస్సు అంటారు.సాత్త్వికమంటే ఇంతకంటే వేరే ఇంకేమీ లేదు.

Friday, 6 June 2025

మనః ప్రసాదస్సౌమ్యత్వం

మనః ప్రసాదస్సౌమ్యత్వం మౌన మాత్మవినిగ్రహః। భావసంశుద్ధి రిత్యేత త్తపో మానసముచ్యతే॥16॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంతకు ముందు శరీరం తో చేసే తపస్సు,మాటలు అదే వాక్కుతో చేసే తపస్సు గురించి చెప్పాడు కదా!ఇప్పుడు మనసుతో చేసే తపస్సు గురించి చెబుతున్నాడు. అర్జునా!ఇప్పుడు నేను నీకు మనసుతో చేసే తపస్సు గురించి చెబుతాను.శ్రద్ధగా విను.మన మనసు నిశ్చలంగా ఉండాలి.మాటలలో,చేతలలో లాగే భావరూపకంగానూ మృదుత్వం ఉండాలి.మౌనం ముఖ్యంగా ఉండాలి.ఎందుకంటే మౌనంగా ఉన్నప్పుడే మనము మనలని విశ్లేషించుకునే సమయం,సందర్భం దొరుకుతుంది.చెడు ఆలోచనలనుంచి బయటపడాలి.అప్పుడే కదా మన అంతఃకరణ శుద్ధిగా ఉంటుంది. నిశ్చలమయిన మనస్సు,మృదుత్వం,మౌనము,శుద్ధమయిన అంతఃకరణము కలిగి ఉండటానినే మనసుతో చేసే తపస్సు అంటారు.

Wednesday, 4 June 2025

అనుద్వేగకరం వాక్యం

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్। స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే॥15॥ శ్రీమద్భగవద్గీత..సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు ఇప్పుడు ఇంక వాక్కులతో చేసే తపస్సు గురించి అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఇంత సేపూ మనము ఏమి మాట్లాడుకున్నాము?ఆహారపు అలవాట్లు,శరీరంతో చేసే తపస్సు,యజ్ఞాలలో రకాల గురించి చెప్పుకున్నాము కదా!ఇప్పుడు ఇంక వాక్కులతో చేసే తపస్సు ఎలా ఉంటుందో చెబుతాను,విను.మన మాట తీరు ఎదుటివారు బాధ పడేలాగా ఉండకూడదు.సత్యమే ఎల్ల వేళలా మాట్లాడాలి.అవీ ఎలా ఉండాలంటే,వినసొంపుగా,ప్రియంగా,మనసుకు హత్తుకునేలా ఉండాలి.వేదభ్యాసం చేయాలి.వీటినే వాక్కులతో చేసే తపస్సు అంటారు.

Tuesday, 3 June 2025

దేవ ద్విజ గురు ప్రాజ్ఞ

దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవమ్। బ్రహ్మ చర్య మహింసా చ శారీరం తప ఉచ్యతే॥14॥ శ్రీమద్భగవద్గీత....సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి తపస్సు ఏ ఏ రకాలుగా ఆచరించ వచ్చో వివరంగా చెబుతున్నాడు.అర్జునా!ఇంత సేపు మనము వివిధ రకాలు అయిన యజ్ఞాల గురించి మాట్లాడు కున్నాము కదా!ఇప్పుడు తపస్సులలో రకాల గురించి నీకు వివరంగా చెబుతాను.మనసు పెట్టి శ్రద్ధగా ఆలకించు.ఇప్పుడు నీకు నేను శరీరంతో చేసే తపము గురించి చెబుతాను.మనము దేవతలను,బ్రాహ్మణులను,గురువులను,పెద్దలను పూజించాలి.శుచి,శుభ్రత పాటించాలి.మన జీవన శైలిలో సరళత్వం గోచరించాలి.విశృంఖలత్వం లేకుండా బ్రహ్మచర్యం పాటించాలి.ఇతర ప్రాణుల పైన హింస విడనాడి అహింసా మార్గంలో పయనించాలి. ఇక ముఖ్యంగా ఆర్జవము పాటించాలి.అంటే మనసులో కల్మషం లేకుండా ఉండాలి.మనసులో ఒకటి,బయటకు ఇంకొకటిగా ఉండకూడదు.నిజాన్ని నిర్భయంగా,నిస్సందేహంగా చెప్పగలగాలి.రాముడికి లాగా ఒకటే మాట,ఒకటే బాణం లాగా ఉండాలి.ద్వంద్వాతీతంగా ఉండాలి.అంటే అటు ఇటుగా కాకుండా,ఒకటే మంచి దారిలో నడవాలి. ఇలా ఉండగలగటాన్ని శరీరంతో చేసే తపస్సు అంటారు.

Monday, 2 June 2025

విధిహీనమసృష్టాన్నం

విధిహీనమసృష్టాన్నం మన్త్రహీనమదక్షిణమ్। శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే॥13॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి తామస యజ్ఞం గురించి చెబుతున్నాడు.అర్జునా!ఇప్పుడు మనము తామస యజ్ఞం గురించి మాట్లాడుకుందాము.తామసులు ప్రతిపనిని మౌళికంగా శ్రద్ధా,నిష్టా,నియమాలు లేకుండా చేపడతారు.శాస్త్రాన్ని అనుసరించి చేయరు.కాబట్టి ఏ కోశానా శాస్త్రవిధి కానరాదు.యజ్ఞం కాగానే అన్నదానం చేయటం సర్వత్రా శుభదాయకం.కానీ వీరు ఆ జోలికి పోరు.మంత్రం యొక్క పవిత్రత గుర్తించి ఆచరించరు.యజ్ఞ యాగాదులు చేసిన పిదప వచ్చిన వారికి దక్షిణ తాంబూలాలు ఇవ్వటం ఆచరణ యోగ్యం.కానీ వీరు దానిని ససేమిరా ఆచరించరు. అంటే పద్ధతి ప్రకారం ఏదీ చేపట్టరు.చేసే ప్రతి పనినీ అహంకార పూరితంగా,అజ్ఞానంతో,లెక్కలేనితనంతో చేస్తారు.

Saturday, 31 May 2025

అభియంధాయ తు ఫలం

అభిసంధాయ తు ఫలం దమ్భార్థమపి చైవ యత్। ఇజ్యతే భరతశ్రేష్ట తం యజ్ఞం విద్ధి రాజసమ్॥12॥ శ్రీమద్భగవద్గీత....సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి రాజస యజ్ఞం గురించి వివరిస్తున్నాడు.హే అర్జునా!భరతులలో శ్రేష్టుడా!నా ఈ మాటలు విని అర్థం చేసుకో!మాములుగా మనం ఏ పనీ ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి.గొప్పలకు పోయి సమాజం లో,తనవారిలో గుర్తింపుకోసం చేయకూడదు అని చెప్పాను కదా!కానీ ఫలాపేక్షతో కానీ,డాంబికానికి గానీ యజ్ఞం చేసే వర్గం ఉంటుంది.అలా చేయబడే యజ్ఞాన్ని రాజస యజ్ఞంగా భావించు,గ్రహించు.

Friday, 30 May 2025

అఫలాకాంక్షి భిర్యజ్ఞో

అఫలా కాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే। యష్టవ్య మేవేతి మన స్సమాధాయ స సాత్త్వికః॥11॥ శ్రీమద్భగవద్గీత..సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక యజ్ఞం గురించి చెబుతున్నాడు.అర్జునా!కౌంతేయా!ఇప్పుడు నీకు నేను సాత్త్విక పరమయిన యజ్ఞం గురించి చెబుతాను.మనసు పెట్టి విని అర్థం చేసుకో.ఏది అయినా మనం మనసు పెట్టి,శాస్త్రాన్ని అనుసరించి చెయ్యాలి.అందునా యజ్ఞం అంటే నిష్ట నియమాలుకూడా అవసరము.సమాహిత చిత్తంతో చేయాలి.అంటే మనము చేసే ఏ పని కూడా మన ఒక్కరికే కాదు అందరికీ మంచి చేకూరేలా ఉండాలి.ఎంత సేపూ ఇది చేస్తే నాకేంటి?అనే భావన లేకుండా ప్రతి ఫలం ఆశించకుండా చేయాలి.ఇలా ఫలాపేక్ష లేకుండా చేసే యజ్ఞాన్నే సాత్త్విక యజ్ఞం అంటారు.

Thursday, 29 May 2025

యాతయామం గతరసం

యాతయామం గతరసం పూతిపర్యుషితం చ యత్। ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్॥10॥ శ్రామద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి తామసుల యొక్క ఆహారపు అలవాట్లు గురించి చెబుతున్నాడు.అర్జునా!ఇప్పుడు ఇంక తామసులు ఇష్టంగా ఏమేమి తింటారో మాట్లాడుకుందాము.వాళ్ళకు జాము క్రితం వండినది నచ్చుతుంది.అది శక్తి ఇచ్చేది కాకపోయినా,సారహీనమయినా సరే!చెడిపోయి,దుర్వాసన వస్తూ,పాచిపోయిన ఆహారం నచ్చుతుంది.ముందరరోజు వండినది,వేరేవాళ్ళు తినగా మిగిలినది,అపవిత్రమయినది,అశుద్ధమయినదీ అయిన ఆహారం తామసులకు ప్రీతిని ఇస్తుంది.సహజంగా నిన్న,మొన్న వండిన ఆహార పదార్థాలకు ఇలాంటి గుణాలు ఉంటాయి.

Wednesday, 28 May 2025

కట్వామ్ల లవణాత్యుష్ణ

కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణరూక్ష విదాహినః। ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః॥9॥ శ్రీమద్భగవద్గీత..।।సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి రాజసులకు ఏది ప్రీతికరమో చెబుతున్నాడు.వాటి పర్యవసానం కూడా చెబుతున్నాడు.అర్జునా!ఇప్పుడు ఇంక రాజసులు ఎలాంటి ఆహారం ఇష్ట పడతారో చెబుతాను.వాళ్ళు చేదు,పులుపు,ఉప్పులు,కారాలు ఎక్కువగా ఇష్టపడతారు.ఇంకా అతివేడి,అతి కారం,ఎండి పోయినవి,దాహంకలిగించే ఆహారమంటే మక్కువ చూపిస్తారు.వీటిని వాళ్ళు ఇష్టంగా తింటారు.ఈ ఆహారపు అలవాట్ల వలన కార్యక్రమేణ పరిణామావస్థలో దుఃఖాన్నీ,వ్యాకులతను మూటకట్టుకుంటారు.ఇవి చాలా మటుకు రోగకారకాలు.కాబట్టి రోగాల బారిన పడుతుంటారు.

Tuesday, 27 May 2025

ఆయు స్సత్త్వ బలారోగ్య

ఆయు స్సత్త్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః। రస్యా స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారా స్సాత్త్వికా ప్రియాః॥8॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్వికమయిన ఆహారపు అలవాట్లగురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ కౌంతేయా!నీకు నేను ఇప్పుడు సాత్త్విక పరమయిన ఆహారపు అలవాట్లు గురించి చెపుతాను.వాటిని ఆకళింపు చేసుకో.సాత్త్విక మయిన ఆహారం మన ఆయువుని వృద్ధి చేస్తుంది.అంతే కాదు సుమా!మనలో ఉత్సాహాన్ని నింపుతుంది.బలాన్ని పెంచుతుంది.ఆరోగ్యాన్ని సర్వ వేళలా కాపాడుతుంఒది.సుఖాన్ని,ప్రీతిని పెంపొందిస్తుంది.ఆ ఆహారం రుచికరంగా ఉంటుంది.చమురు కలిగి ఉంటుంది.పుష్టిని కలిగిస్తుంది.అలాంటి ఆహారమే సాత్త్వికమయిన ఆహారము.

Monday, 26 May 2025

కర్శయన్త శ్శరీరస్థం

కర్శయన్త శ్శరీరస్థం భూతగ్రామ మచేతసః। మాం చై వాన్తశ్శరీరస్థం తాన్విద్ధ్యాసురనిశ్చయాన్॥6॥ ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః। యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు॥7॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము శ్రీకృష్ఞుడు అర్జునుడికి మనకు ఉండవలసిన ఆహారపు అలవాట్లను కూడా చెబుతున్నాడు.దీనితో అర్థం అవుతుంది కదా శ్రీకృష్ణుడు ఎంత నిదానంగా,ఓపికగా,అర్థం అయ్యేలా,అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్లుగా చెబుతున్నాడో!ఆసుర స్వభావం కలవారు వారితో బాటే నన్ను కూడా క్షోభ పెడతారు అని చెప్పాను కదా!వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో చెబుతాను.అలాగే వారి తపస్సు,దానం చేసే ప్రక్రియలు కూడా ఎలా ఉంటాయో చెబుతాను.ఎందుకంటే ఇవన్నీ కూడా తమ తమ గుణాలను అనుసరించే ఉంటాయి.వాటిని కూడా విను. అన్నం ఉడికిందా లేదా అనేదానికి ఒక మెతుకు పట్టుకుని చూస్తే సరిపోతుంది కదా!అలానే ఒక మనిషి స్వభావం వారి ప్రతి కదలికలో,హావభావాలలో ఎదుటివారికి తెలిసిపోతుంది.ఒక నవ్వు,ఒక చూపు,ఒక పలుకు చాలు.

Sunday, 25 May 2025

అశాస్త్రీయ విహితం ఘోరం

అశాస్త్ర విహితం ఘోరం తప్యన్తే యే తపో జనాః। దమ్భాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః॥5॥ కర్శయన్త శ్శరీరస్థం భూతగ్రామ మచేతసః। మాం చై వాన్తశ్శరీరస్థం తాన్విద్ధ్యాసురనిశ్చయాన్॥6॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓపికగా వివరిస్తున్నాడు.అర్జునా!శాస్త్రం మనలని కొన్ని చేయమంటుంది .ఇంకొన్నిటికి దూరంగా ఉండమంటుంది.పదే పదే వద్దని వారిస్తుంటుంది.వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకొని,మనకు అన్వయించుకోవాలి.శాస్త్ర నిషిద్ధాలు అయిన తపస్సులను,దారుణమయినటువంటి కర్మలను చేయకూడదు.అలాంటి దుష్కర్మలు చేసేవారు దంభాహంకార కామరాగాలతో కూడిన వారు అవుతారు.వాళ్ళు వాళ్ళ శరీరాలను,ఇంద్రియాలను కష్టపెడతారు.అది అంతటితో ఆగిపోదు.చివరకు వారి వారి శరీరాలలో ఉండే నన్నుకూడా క్షేభ పెడతారు.ఇలా చేసే వారందరూ అసుర స్వభావం కలవారే.ఆ విషయాన్ని గ్రహించు.

Saturday, 24 May 2025

యజన్తే సాత్త్వికా దేవా

యజన్తే సాత్త్వికా దేవా న్యక్షరక్షాంసి రాజసాః। ప్రేతా న్భూత గణాం శ్చాన్యే యజన్తే తామసా జనాః॥4॥ శ్రీమద్భగవద్గీత..।సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము సర్వ ప్రాణికోటికీ భగవంతుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువు మానవాకారంలో శ్రీకృష్ణుడుగా జన్మించి,సహవాసి అయిన అర్జునుడితో యుద్ధభూమిలో నిలబడి ఇలా అంటున్నాడు.అర్జునా!నేను నీకు ఇప్పుడే మూడు రకాలు అయిన శ్రద్ధలగురించి ప్రస్తావించాను కదా!అవే సాత్త్విక,రాజస,తామస శ్రద్ధలు.అలా ఎందుకు ఆ ఆ శ్రద్దలు అలా ఉత్పన్నమవుతాయో చెబుతాను,విను.సహజంగా సాత్త్వికులు దేవతలను పూజిస్తారు.కాబట్టి వారికి సాత్త్వికమయిన శ్రద్ధలు అలవరుతాయి.అదే రాజసులు యక్షరాక్షసాదులని పూజిస్తారు.కావున వారికి రాజస పరమయిన శ్రద్ధలు ఏర్పడతాయి.చివరికి తామసుల గురించి చెప్పుకుందాము.వీరు భూతప్రేతాలను పూజించేదానికి మక్కువ చూపిస్తారు.అలాగే వాటిని పూజిస్తుంటారు.తదనుగుణంగా వారికి తామస శ్రద్ధలు ఉత్పన్నమవుతాయి.

Friday, 23 May 2025

సత్త్వానురూపా సర్వస్య

సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత। శ్రద్ధామయోఽయం పురుషో యో య చ్ఛ్రద్ధ స ఏవ సః॥3॥ శ్రీమద్భగవద్గీత..।సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!ఓ భారతా!సర్వప్రాణికోటికి అంతఃకరణమనేది ఒకటి ఉంటుంది కదా!వారి వారి అంతఃకరణాన్ని అనుసరించి శ్రద్ధ అనేది పుడుతుంది.శ్రద్ధ లేనివాడు అసలు ప్రాణులలో లేనేలేడు.ఒకడిలో శ్రద్ధ అనేది ఏరూపంలో,ఏమాత్రంగా ఎలా ఉంటుందో,వాడూ అలాంటి వాడే అవుతాడు.శ్రద్ధ అంటే ఒక విషయం పైన మనకు ఉండే నమ్మకం,నిష్ట,నియమాలు.మనకు దేని పైన అయినా నమ్మకం ఉంటేనే కదా దానిని ఆచరిస్తాము.కాపాడుకుంటాము.చెడిపోకుండా చూసుకుంటాము.చెడగొట్టకుండా ఉంటాము.ఈ కార్యాలనే నిష్ట,నియమాలు అంటాము.

Thursday, 22 May 2025

త్రివిధా భవతి శ్రద్ధా

శ్రీ భగవానువాచ... త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా। సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు॥2॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి వచ్చిన అనుమానాలన్నిటినీ ఓపికగా విన్నాడు.ఇంక సందేహ నివృత్తి చేసేదానికి నడుము బిగించాడు.అర్జునా!ఈ ఆత్మలు మనష్యులు చిరుగిన బట్టలు మార్చినట్లుగా శరీరాలను మారుస్తాయి అని చెప్పాను కదా!కాబట్టి ఎవరికి వారికి వారి వారి పూర్వజన్మల వాసనలు ఉంటాయి.ఆ పూర్వజన్మల వాసనలను అనుసరించి ప్రాణులకు సహజంగానే సాత్త్విక,రాజస,తామస గుణాలు,లేక వాటి పట్ల శ్రద్ధ,మక్కువ ఏర్పడతాయి.వాటిని అన్నిటి గురించి చెబుతాను,విను.

Wednesday, 21 May 2025

యే శాస్త్ర విధి ముత్సృజ్య

అర్జున ఉవాచ... యే శాస్త్ర విధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః। తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వ మాహో రజస్తమః॥1॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము కృష్ణుడు చెప్పిందంతా అర్జునుడు మనసు లగ్నం చేసి విన్నాడు.మంచి విద్యార్ధులకే అనుమానాలు వస్తాయి.ఎందుకంటే వాళ్ళలో గురువు చెప్పేదంతా ఆకళింపు చేసుకోవాలనే తపన ఉంటుంది.ఆ క్రమంలోనే అనుమానాల దొంతరలు బయటపడతాయి.వీటన్నిటికీ గురువు అనేవాడు ఓపికగా సందేహ నివృత్తి చేయాలి.అప్పుడే ఆగురుశిష్యుల బంధం బలపడుతుంది.శిష్యుడు మంచిగా ఎదిగేదానికి దోహద పడుతుంది. ఇక్కడ కూడా అలాగే అర్జునుడు తనకు వచ్చిన అనుమానాలు,సందేహాలను అన్నిటినీ కృష్ణుడి ముందు ఉంచుతున్నాడు. కృష్ణా!హే యాదవా!శాస్త్ర విధులను అందరూ సరిగ్గా నిర్వర్తించలేరు కదా!ఒక్కొక్కసారి అతిక్రమించాల్సి వస్తుంది కదా!అతిక్రమిస్తారు కూడా.అలా శాస్త్ర విధిని అతిక్రమించినప్పటికీ కూడా శ్రద్ధతో పూజలు చేసేవారు ఏ కోవలోకి వస్తారు?వారు సాత్త్వికులా,రాజసులా లేక తామసులా?వారి ఆచరణ ఎలాంటిది?

Tuesday, 20 May 2025

తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే

తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ। జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి॥24॥ శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగ యోగోనామ షోడశోఽధ్యాయః!!!! శ్రీమద్భగవద్గీత...షోడశోధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్దునుడికి ఇలా సలహా ఇస్తున్నాడు.అర్జునా!నీకు దైవాంశలో పుట్టిన వారి గుణగణాలు,ఆసురీ అంశతో పుట్టిన వారి గుణగణాలు విఫులంగా విశదీకరించాను కదా!యుక్తాయుక్త విచక్షణకు ప్రతి ఒక్కరికీ వేదశాస్త్రాలే ప్రామాణికాలు.కాబట్టి అందరూ వాటిలో చెప్పబడిన ధర్మాలనే గ్రహించాలి.ఆ ధర్మాలకు అనుగుణంగా మన కర్మలను పాటించాలి.వాటిని ఎప్పుడూ అతిక్రమించకూడదు.ఇది నా హితవు. ఇట్లు ఉపనిషత్తు,బ్రహ్మవిద్య,యోగశాస్త్రముగా పేరొందిన శ్రీ కృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగ యోగము అనే పదహారవ అధ్యాయము సమాప్తము అయినది!!!!

Monday, 19 May 2025

య శ్శాస్త్రవిధి ముత్సృజ్య

య శ్శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః। న స సిద్ధి మవాప్నోతి న సుఖం న పరాం గతిమ్॥23॥ శ్రీమద్భగవద్గీత..।షోడశోధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి ఖరాఖండిగా ఈ విషయం చెబుతున్నాడు.అర్జునా!వేదశాస్త్రాలు అనేవి సర్వ మానవ కోటికి ప్రామాణికాలు.అవి చెప్పిన మాటలోనే,బాటలోనే ప్రతి ఒక్కరూ నడుచుకోవటం సర్వమానవాళికి ఉత్తమం.వాటిని అతిక్రమించే హక్కు ఎవరికీ లేదు.అంతా మా ఇష్టం.మాకు నచ్చినదే చేస్తాము,నచ్చినట్లే ఉంటాము అనుకునే స్వేచ్ఛాచార పరాయణులు కొందరు ఉంటారు.వాళ్ళకు అథోగతి అనివార్యం.వాళ్ళ దుష్కర్మలకు శాంతి దక్కే మార్గమేలేదు.ఇంక మోక్షం ఊసు ఎత్తే అర్హత ఎక్కడనుంచి వస్తుంది?కాబట్టి మంచి మార్గంలో నడవటం అలవాటు చేసుకుందాము.

Sunday, 18 May 2025

ఏతైర్వి ముక్తః కౌంతేయ

ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రి భిర్నరః। ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాంగతిః॥22॥ శ్రీమద్భగవద్గీత...షోడశోధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడితో ఇలా విశదీకరిస్తున్నాడు.పరీక్షలో ప్రతి తప్పుకు _మార్కులు ఉన్నాయి అంటే తప్పులు రాయకుండా ఉంటేనే కదా కనీసం సున్నా వచ్చేది.ఆ తరువాత సరిగా వ్రాసిన జవాబులకు +లో మార్కులు వచ్చేది.అలాగే ఇక్కడ కూడా.కౌంతేయా!మానవుడు ముందు నరకానికి రాచమార్గాలు అయిన కామాన్ని,క్రోథాన్ని,లోభాన్ని విడనాడాలి.వేరే గత్యంతరము లేదు.అవి విసర్జిస్తేకానీ మనసు తపస్సు,యోగము వైపుకు మనసు మరలదు.తపస్సు,యోగములను అకుంఠిత దీక్షతో పాటిస్తేకానీ ఆత్మజ్ఞానం కలుగదు.ఆత్మజ్ఞానం కలిగితేకానీ మోక్షం పొందలేడు.కాబట్టి వీటిని అన్నిటినీ ఒకదాని తరువాత ఇంకొకటి చేపట్టి మన మార్గం సుగమం చేసుకోవాలి,మోక్షం పొందాలి.

Saturday, 17 May 2025

త్రివిధం నరకస్యేదం

త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః। కామః క్రోధ స్తథా లోభ స్తస్మాదేత త్త్రయం త్యజేత్॥21॥ శ్రీమద్భగవద్గీత...షోడశోధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి హితం చెబుతున్నాడు.అర్జునా!ఆసురీ స్వభావం కలవారి గుణగణాలు,వారి పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పాను కదా!కౌంతేయా!కామము,క్రోథము,లోభము అనేవి మూడూ నరకద్వారాలు.మనము చెడు మార్గంలో వేసే ప్రతి అడుగు మనలను ఆనరకానికి చేరువ చేస్తుంటుంది.మనము తప్పు చేసిన ప్రతి సారీ ఇంకొక సారి ఇలా జరగదు లే అని మనలను మనం మభ్య పెట్టుకుంటుంటాము.కానీ అదే చిలికి చిలికి గాలి వాన అవుతుంది.కాబట్టి మనము ఏదారిలో నడవాలి,ఏదారిలో ఉన్నాము అనే స్పృహతో ఉండాలి.ఎందుకంటే ఈ కామక్రోథ మదలోభాలు ఆత్మజ్ఞాన నాశనకారకాలు.మాములుగానే మనము మాయలో కప్పబడి ఉంటాము.దానికి తోడు ఇవన్నీ కలిసి వచ్చాయంటే మనలను సర్వనాశనం నుంచి ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు.కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని దుర్గుణాలను విడిచి పెట్టాలి.

Friday, 16 May 2025

ఆసురీం యోనిమాపన్నా

ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని। మా మప్రాప్త్యెవ కౌంతేయ తతో యాన్త్యధమాం గతిమ్॥20॥ శ్రీమద్భగవద్గీత...షోడశోధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.ఓ అర్జునా!కౌంతేయా!ఇందాక నేను చెప్పినటువంటి మూర్ఖులను ఈ జన్మలోనే కాదు,ఏజన్మలోను బాగుపరచలేము.ఎందుకంటే అలాంటి మూర్ఖులు ప్రతి జన్మలోనూ ఆసుర శరీరాలనే పొందుతారు.అకృత్యాలనే చేస్తుంటారు.ఎప్పటికీ నన్ను చేరుకోలేరు.అంతకంతకూ ఇంకా దిగజారిపోతూ నీచమయిన యోనులలో పడిపోతుంటారు.అంటే హీనమయిన జన్మలను పొందుతుంటారు.

Thursday, 15 May 2025

తానహం ద్విషతః కృూరా

తానహం ద్విషతః కృూరా న్సంసారేషు నరాధమాన్। క్షిపామ్యజస్ర మశుభా నాసురీష్వేవ యోనిషు॥19॥ శ్రీమద్భగవద్గీత... షోడశోధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి ఆసురీ స్వభావం యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావం గలవారు ఎప్పుడూ విర్రవీగుతూ ఉంటారు కదా!ఆఖరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతాను,విను.ఆది మధ్యాంత రహుడిని అయిన నన్ను తుస్కారంగా,లెఖ్ఖ లేని తనంగా నాయందు ద్వేషంగా,కృూరంగా ప్రవర్తించే ఆసురీ స్వభావంకలవారికి మళ్ళీ మళ్ళీ నీచమయిన ఆసురీ జన్మలనే కలుగ జేస్తాను.ఎందుకంటే వాళ్ళు చేసే పాపాలకు,ఘోరాలకూ అంతమనేది ఉండదు.

Wednesday, 14 May 2025

ఆత్మ సంభావితాః స్తబ్ధా

ఆత్మ సంభావితాః స్తబ్ధా ధనమాన మదాన్వితాః। యజంతే నామయజ్ఞైస్తే దమ్భేనా విధిపూర్వకమ్॥17॥ అహంకారం బలం దర్పం కామం క్రోథం చ సంశ్రితాః। మామాత్మ పరదేహేషు ప్రద్విషన్తోఽభ్యసూయకాః॥18॥ శ్రీమద్భగవద్గీత..।షోడశోధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా! ఈ ఆసురీ స్వభావం గలవారికి ఆత్మస్తుతి,అతిశయం,ఐశ్వర్యమత్తతా ఎక్కువగా ఉంటుంది.దాని కారణంగా తరచూ శాస్త్రాన్ని ఉల్లంఘిస్తుంటారు.అంటే అతిక్రమిస్తుంటారు అన్నమాట.కానీ పేరుకోసం,గొప్పలకోసంప్రాకులాడుతుంటారు.కాబట్టి డాంబికంగా యాగాలు,యజ్ఞాలు చేస్తుంటారు.వీళ్ళకు లేని దుర్గుణాలు అంటూ ఏమీ ఉండవు.కామం,క్రోధం,అహంకారం,బలం,దర్పం ఇత్యాదులు వీరి చెంతనే సదా ఉంటాయి.అసూయాపరులు అయి ఉంటారు.వాళ్ళలో ఉండేదీ నేనే!మిగిలిన వారిలో ఉండేది నేనే!ఇంత సుస్థిరుడుగా ఉన్న నన్ను గుర్తించరు.నన్ను తిరస్కరిస్తారు.ఇదే వారి అజ్ఞానానికి,అహంకారానికీ పరాకాష్ఠ.

ఇదమద్య మయా లబ్ధం

ఇదమద్య మయా లబ్ధ మిదం ప్రాప్స్యే మనోరథమ్। ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్॥13॥ అసౌ మయా హతశ్శత్రు ర్హనిష్యే చాపరానపి। ఈశ్వరోహమహం భోగీ సిద్ధోఽహం బలవాన్సుఖీ॥14॥ ఆఢ్యోఽభి జనవా నస్మి కోఽన్యోఽస్తి సదృశో మయా। యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః॥15॥ అనేక చిత్త విభ్రాంతా మోహజాల సమావృతాః। ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేఽశుచౌ॥16॥ శ్రీమద్భగవద్గీత..।షోడశోధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావం కలవారికి అభిజాత్యం ఎక్కువ ఉంటుంది.ఎంత సేపూ ఏదో ఒక యావలో ఉంటారు.వారి ఆలోచనలు ఎలా ఉంటాయో చెబుతాను,చూడు.ఇది నాకు లభించింది.దీనితో ఈ కోరిక తీర్చుకుంటాను.నాకు ఇంత ఉంది.ఇంకా ఈ మాత్రం వస్తుంది.ఇంక ఎంత వస్తే బాగుంటుంది.ఈ శత్రువును చంపాను.కలుగుల్లో ఉన్న శత్రువులనందరినీ చంపేస్తాను.శత్రుశేషం లేకుండా పోతుంది.నేను సర్వాధికారిని.నేనే గొప్ప.నా కంటే తోపు ఇంకెవరూ లేరు.నేనే అందరికంటే బలవంతుడిని.అనుకుంటే ప్రతి ఒక్కరినీ తుక్కు తుక్కు చేయగలను.పోనీలే అని వదిలేస్తున్నాను.నా అంత సుఖ పురుషుడు ఇంకోడు లేడు.అందరి కంటే నేనే ధనవంతుడిని.స్వర్గసుఖాలు,సర్వభోగాలు అనుభవిస్తున్నాను.నన్ను ఎదిరించే మగాడు లేడు,ఇక పుట్టబోడు.నాకు ఏ విషయం లోనూ సమ ఉజ్జీ లేడు.యాగాలు చేస్తాను.దానాలు చేస్తాను.నా పేరు,నా గొప్పదనం ప్రపంచం అంతా చెప్పుకుంటుంది.ఆనందం అంతా నా సొత్తే! ఇలా ఎంత సేపూ నేను,నా అనే దుగ్థలో మునిగి తేలుతూ ఉంటారు.అనేక వికారాలతో కూడిన వికలిత మనస్కులు అవుతారు.ఎంత సేపూ కామోప భోగాలలో ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు.ఆఖరున నరకానికి చేరుతారు.

Tuesday, 13 May 2025

చింతా మపరిమేయాం చ

చింతామపరిమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితాః। కామోపభోగపరమా ఏతావ దితి నిశ్చితాఽ॥11॥ ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః। ఈహంతే కామభోగార్ధ మన్యాయే నార్ధసంచయాన్॥12॥ శ్రీమద్భగవద్గీత...షోడశాధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి వివరంగా చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావం గలవారి గురించి ఇంకా చెబుతాను,విను.వీళ్ళు ఎప్పుడూ కామం,క్రోథంలను విడిచి పెట్టరు.అవి కూడా వీరిని విడిచి పెట్టవు.వాటి కబంథ హస్తాలలో వీళ్ళు చిక్కుకుని వుంటారు.ప్రాపంచిక మయిన విషయాలే జీవిత పరమావథిగా,పురుషార్థంగా భావిస్తారు.వాటిని అనుభవించడం జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు.దాని కోసం నిత్యం అక్రమ మార్గాలలో ధనం సంపాదించే పనిలో పడతారు.జీవితాంతం నిత్యమూ ఆశాపాశాల ఊబిలో చిక్కుకుని,బయట పడలేక గిల గిల లాడుతుంటారు.వారికి కామక్రోధాలు అనే సుడిగుండాల నుంచి బయట పడే మార్గమే ఉండదు .వాళ్ళుకూడా బయటపడాలని కోరుకోరు.

Sunday, 11 May 2025

కామ మాశ్రిత్య దుష్పూరం

కామ మాశ్రిత్య దుష్పూరం దమ్భమాన మదాన్వితాః। మోహాత్గృహీత్వాఽసద్గ్రహాన్ ప్రవర్తంతేఽశుచివ్రతాః॥10॥శ్రీమద్భగవద్గీత... షోడశాధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా అంటున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావం గల వారి గురించి ఇంకా చెబుతాను, విను.వీళ్ళు ఎప్పుడూ కామాన్ని ఆశ్రయిస్తారు.దాని కారణంగా దంభం,దురభిమానము ఎక్కువగా వుంటుంది.అంటే గర్వం,మదం,భేషజం ఎక్కువగా ఉంటాయి.మదపూరితులై ఉంటారు.ఎప్పుడూ మూర్ఖపు పట్టుదలలతో అల్లాడుతూ ఉంటారు. వారు చేసే పనులు సహేతుకమా,కాదా అని ఒక్క క్షణం కూడా ఆలోచించరు.ఇలా మూర్ఖపు పట్టుదలలకు పోయి అపవిత్రతా దీక్షితులు అవుతుంటారు.తప్పు పనులు చేస్తుంటారు.ఆ తప్పుడు మార్గంలోనే వెళుతుంటారు.

Saturday, 10 May 2025

ఏతాం దృష్టి మవష్టభ్య

ఏతాం దృష్టి మవష్టభ్య నష్టాత్మానోఽల్పబుద్ధయః। ప్రభవ న్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః॥9॥ శ్రీమద్భగవద్గీత..।షోడశాధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడితో ఆసురీ స్వభావం గురించి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావం కల వారు ఉన్నారే!వారంతా అల్ప బుద్ధి కలిగిన వాళ్ళు.వాళ్ళ వలన ప్రపంచానికి పైసా లాభం లేదు.వాళ్ళ ఉనికి నిష్ప్రయోజకం,అంతే.వారి పనులు వలన లోకానికి ఇసుమంత అయినా లాభం ఉండదు.అంతేనా?వాళ్ళు చేసే తప్పులు,ఘాతుకాల వలన ప్రపంచానికి హాని జరుగుతుంది.అన్నీ మానవాళికి నష్టం కలిగే పనులు చేయటంలో సిద్థహస్తులు.

Wednesday, 7 May 2025

అసత్య మప్రతిష్ఠం తే

అసత్య మప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్। అపరస్పరసంభూతం కి మన్య త్కామహైతుకమ్॥8॥ శ్రీమద్భగవద్గీత..షోడశాధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి ఈ ఆసురీ స్వభావంకల వారి గురించి చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావంకల వారు ఈ ప్రపంచం అంతా మిధ్య అంటారు.అంతేనా?ఈ జగత్తు అంతా అస్థిరం అని కూడా అంటారు.దేవుడు,దైవం అనే వాళ్ళు ఎవరూ లేరని బల్ల గుద్ది మరీ చెబుతారు.సృష్టికి మూల కారణం స్త్రీ పురుష సంయోగం తప్ప ఇంకొకటి కాదు,లేదు అని నొక్కి వక్కాణిస్తారు.కామం తప్ప ఇక వేరే ఏ కారణాలు లేవని గట్టిగా నమ్ముతారు.

Tuesday, 6 May 2025

ప్రవృత్తిం చ నివృత్తిం చ

ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః। న శౌచం నాపి చాఽచారో న సత్యం తేషు విద్యతే॥7॥ శ్రీమద్భగవద్గీత...షోడశాధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ముందర నీవు ఈ విషయం తెలుసుకోవాలి.ఆసురీ స్వభావం గలవారికి కర్మాకర్మ విచక్షణ ఉండదు.అంటే తప్పు ఒప్పుల తేడా వుండదు.ఏది అనిపిస్తే అది చేసే దూకుడు స్వభావం ఉంటుంది.ఒక్క క్షణం ఆగి మనం చేసే పని వలన ఎవరికైనా ఇబ్బంది,హాని జరుగుతుందాలేదా అని ఆలోచించరు.చివరికి వాళ్ళకే చెడు జరిగినా ఖాతరు చెయ్యరు.శుచిత్వం,సత్యం,సదాచారం అనేవి దివిటీ పెట్టి వెతికినా కానరావు.అంటే అచ్చోసిన ఆంబోతుల్లాగా అన్నమాట!

Monday, 5 May 2025

దౌ భూతసర్గౌ లోకేఽస్మి

దౌ భూతసర్గౌ లోకేఽస్మిన్ దైవ ఆసుర ఏవ చ। దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు॥6॥ శ్రీమద్భగవద్గీత...షోడశాధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!లోకంలోని ప్రాణులంతా రెండు రకాలు.ఒకటో రకం దైవ స్వభావంతో ఉంటారు.రెండో రకం ఆసుర స్వభావంతో ఉంటారు.నేను నీకు దైవీ స్వభావంగురించి వివరంగా అర్థం అయేలా చెప్పాను.అలాగే ఆసుర స్వభావంగురించి కూడా చెబుతాను.

Sunday, 4 May 2025

దైవీ సంపద్విమోక్షాయ

దైవీ సంపద్విమోక్షాయ నిబంధా యాసురీ మతా। మా శుచ స్సంపదం దైవీ మభిజాతోఽసి పాండవ॥5॥ శ్రీమద్భగవద్గీత...షోడశాధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.ఓ పాండవ మధ్యమా!ఓ అర్జునా!మనలో ఉండే దైవీ సంపద మనకు మోక్షం దక్కేలా చేస్తుంది.అదే ఆసురీ సంపత్తి సంసార బంధానిని కలిగిస్తాయి.అర్జునా!నువ్వు ఏమీ భయపడే పనిలేదు.ఎందుకంటే నువ్వు దైవీ సంపత్తిని జన్మించావు.మనము ఏ ఏ యోనుల నుంచి పుడతామో దానిని బట్టే మన జీవితము ఏ పంధాలో నడుస్తుంది అనేది మౌళికంగా అర్థమవుతుంది.

Friday, 2 May 2025

దంభో దర్పోఽభిమానశ్చ

దంభో దర్పోఽభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ। అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద మాసురీమ్॥4॥ శ్రీమద్భగవద్గీత... షోడశాధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి రాక్షస గుణాలు ఎలా ఉంటాయో చెబుతున్నాడు.అర్జునా!రాక్షస గుణాల గురించి చెబుతాను.ఆసురీ సంపత్తి వల్ల పుట్టినవారు గర్వంతో విర్రవీగుతుంటారు.పొగరుమోతుదనం పుష్కలంగా ఉంటుంది.దురభిమానం పరాకాష్టలో ఉంటుంది.ఇంక క్రోధం,కోపం,తాపం అపరిమితంగా ఉంటాయి.పరుష స్వభావం సహజ సిద్థంగా ఉంటుంది.ఇన్ని దుర్గుణాలకు హేతుమూలమయిన అవివేకంకు కొదవు ఉండదు.ఇన్ని దుర్గుణాలు,ఒకదానిని మించి ఇంకొకటి ఉన్నాయంటే వారు ఖచ్చితంగా రాక్షస ప్రవృత్తి కలిగిన వారు అని అర్థం.

Thursday, 1 May 2025

అభయం సత్త్వసంశుద్థిః

శ్రీభగవానువాచ... అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యనస్థితిః। దానందమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్॥1॥ అహింసా సత్య మక్రోధ స్త్యాగశ్శాంతి రపైశునమ్। దయా భూతే ష్వలోలుప్త్వం మార్దవం హ్రీ రచాపలమ్॥2॥ తేజః క్షమా ధృతి శ్శౌచ మద్రోహో నాతిమానితా। భవంతి సంపదం దైవీ మభిజాతస్య భారత॥3॥ శ్రీమద్భగవద్గీత.. షోడశాధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!ఇప్పుడు నీకు నేను ఏ ఏ గుణాలు వుండే వారిని దైవాంశ జాతులు అంటారో చెబుతాను,విను.భయం అనేది లేకుండా వుండాలి.పవిత్రమయిన అంతః కరణం ఉండాలి.ఆధ్యాతిక మయిన జ్ఞాన నిష్ట వుండాలి.దాన గుణం వుండాలి. ఆత్మనిగ్రహం ఉండాలి.యజ్ఞాచరణం వుండాలి.వేదాధ్యయనం,తపస్సు,సారళ్యం ఉండాలి.అహింస,సత్యం,కోపంలేకుండా వుండటం కావాలి.త్యాగం,శాంతి కావాలి.ఇతరుల తప్పులను ఎంచే ధోరణి లేకుండా వుండటం ముఖ్యం.మృదుత్వం,భూతదయ,నిర్లోభం ఉండాలి.అసూయ లేకుండా వుండాలి.గౌరవముల పట్ల ధ్యాస,ఆశ లేకుండా వుండాలి.పైన చెప్పిన గుణాలు అన్నీ వున్న వాళ్ళే దైవాంశ జాతులు అని తెలుసుకో.

Thursday, 10 April 2025

ఇతి గుహ్యతమం శాస్త్రం

ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ। ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్స్యాత్ కృతకృత్యశ్చ భారత॥20॥ శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తియోగో నామ పంచదశాధ్యాయః శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!అతిరహస్యమయిన ఈ శాస్త్రాన్ని నీ కోసమే చెప్పాను.ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవాడు,గ్రహించిన వాడు జ్ఞాని అవుతాడు.వాడి జన్మ ధన్యం అవుతుంది.వాడు కృతార్థుడు అవుతాడు.ఇందులో సందేహం లేదు.

యో మామేవ మసమ్మూఢో.

యో మామేవ మసమ్మూఢో జానాతి పురుషోత్తమం। స సర్వ విద్భజతి మాం సర్వభవేన భారత॥19॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము శ్పీకృష్ణుడు అర్జునుడికి వివరం చెబుతున్నాడు.అర్జునా!ఓ భరతశ్రేష్టా!ఇక్కడ గందరగోళం ఏమీలేదు.ఎలాంటి అనుమానాలు,సంశయాలు,శంకలు,గిలులు లేకుండా నన్నే పరమాత్మగా గుర్తించాలి.అర్థం చేసుకోవాలి. ఆకళింపు చేసుకోవాలి.ఎందుకంటే నన్ను పూర్తిగా తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడు అవుతాడు.అతడు అన్ని విధాలా నా శరణులోకి వస్తాడు.నన్నే సేవిస్తాడు.ముక్తి పథంలో పయనిస్తాడు.

Wednesday, 9 April 2025

యస్మాత్ క్షరమతీతోఽహం

యస్మాత్ క్షరమతీతోఽహం అక్షరాదపి చోత్తమః। అతోఽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః॥18॥ శ్రీమద్భగవద్గీత..పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి తన గురించి చెబుతున్నాడు.అర్జునా!నేను నీకు ఇప్పుడు క్షరులు,అక్షరుల గురించి చెప్పాను కదా!నేను వీళ్ళందరి కంటే అతీతుడను.అలా అతీతుడను కాబట్టే లోకంలోను,వేదాలలోనూ నన్ను పరమాత్మ అని,పురుషోత్తముడు అని కీర్తిస్తుంటారు.

Tuesday, 8 April 2025

ఉత్తమః పురుషస్త్వన్యః

ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః। యో లోకత్రయమావిశ్యబిభర్త్యవ్యయ ఈశ్వరః॥17॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఇప్పుడే నేను క్షరులు,అక్షరులు గురించి చెప్పాను కదా!ఈ ఇద్దరికంటే ఉత్తముడు పరమాత్మ.ఎందుకంటే అతడే ఈ మూడు లోకాలనూ వ్యాపించి ఉన్నాడు.ఈ యావత్ సృష్టిని పోషిస్తున్నాడు.అతడు అక్షయుడు.అతడు నాశరహితుడు.అతడే సర్వాంతర్యామి.

Monday, 7 April 2025

ద్వావిమౌ పురుషౌ లోకే

ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ। క్షర స్సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే॥16॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!లోకంలో రెండు రకాల వాళ్ళు ఉంటారు.ఒకరు క్షరులు,ఇంకొకరు అక్షరులు.ప్రాపంచిక మయిన భూతాలన్నిటినీ క్షరులు అంటారు.కూటస్తుడు అయిన నిర్వికల్పుడు మాత్రమే అక్షరుడు.

Sunday, 6 April 2025

సర్వస్య చాహం హృది సన్నివిష్టో

సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞాన మపోహనం చ। వేదైశ్య సర్వై రహమేవ వేద్యో వేదాంత కృద్వేదవిదేవ చాహమ్॥15॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి సకలం చెబుతున్నాడు.అర్జునా!ఇంతెందుకు?అసలు విషయం చెబుతున్నాను,విను.అందరిలో నేనే అంతర్గతంగా,అంతరాత్మగా ఉన్నాను.జ్ఞాపకం,జ్ఞానం,మరపు,అవివేకం ఇలా అన్నీ నా వల్లనే కలుగుతున్నాయి.సర్వం నేనే అయి ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నాను.నేనే వేదవేద్యుడను.నేనే వేదాంత కర్తను.నేనే వేదవేత్తను.విశ్వంలో ప్రతిది నాలోనే పుట్టాలి,నా వల్లే ఎదగాలి,నాలోనే లయ, లీనం కావాలి.

అహం వైశ్వానరో భూత్వా

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః। ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం॥14॥ శ్రీమద్భగవద్గీత..పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!నేను ఈ యావత్ సృష్టిలోని సర్వ జీవుల శరీరాలలో జఠరాగ్ని రూపంలో ఉంటాను.జీవులు తినే నాలుగు రకాల ఆహారాలను ప్రాణాపాన వాయువులతో కూడి నేనే పక్వంచేస్తున్నాను. అంటే ఆ పరమాత్మ మనం తీసుకునే ఆహారం కూడా సరిగ్గా అరిగి మనకు శక్తి చేకూరేలా చేస్తున్నాడు.ఇవంతా మనం అడిగేతేనో,బతిమాలాడితేనో చేయటం లేదు.తనకు తానుగా చేస్తున్నాడు.మన మంచి చెడ్డ చూసుకుంటున్నాడు.అలాంటిది అతని శరణు కోరితే ఇంకెంత మేలు చేస్తాడో ఊహించారా?

Saturday, 5 April 2025

గామావిశ్య చ భూతాని

గామావిశ్య చ భూతాని ధారాయామ్యహమోజసా। పుష్ణామి చౌషధీ స్సర్వాః సోమో భూత్వా రసాత్మకః॥13॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుొషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!నేను నా శక్తి చేత భూమి యందు ప్రవేశించి సర్వ భూతాలను ధరిస్తున్నాను.నేనే రస స్వరూపుడు అయిన చంద్రుడు అయి అన్ని సస్యాలను పోషిస్తున్నాను.అంటే అన్నీ ఫలదాయకము అయ్యేలా కృషి చేస్తున్నాను.సులభంగా చెప్పాలి అంటే సమస్త ప్రాణి కోటి వృద్థి,అభివృద్థిలో నా ప్రమేయం అడుగడుగునా ఉంది.

Friday, 4 April 2025

యదాదిత్య గతం తేజో

యదాదిత్య గతం తేజో జగద్భాసయతేఽఖిలం। యచ్ఛంద్రమసి యచ్ఛాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్॥12॥శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఇంతెందుకు?అన్నిటికీ కర్త,కర్మ,క్రియలను నేనే అని అర్థం చేసుకో.ఈ సర్వ జగత్తునూ తేజోమయం చేసే వెలుగును ఇచ్చేది సూర్యుడు,చంద్రుడు అని నీకు తెలుసు కదా.నీకు ఇంకో ముఖ్యమయిన విషయం చెబుతాను.ఆ సూర్య చంద్రుల తేజస్సు నాదే.నేనే వాటికి ఆ తేజస్సును పంచాను.

యతంతో యోగినశ్చైనం

యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మ న్యవస్థితం। యతంతోఽప్య కృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః॥11॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!మనం ఏ పని చేసినా చిత్త శుద్థితో చేయాలి.యాంత్రికంగా చేశాము అంటే చేశాము అనే రకంగా ఉండకూడదు.సత్ఫలితం దక్కాలంటే చిల్లర వేషాలు వేయకూడదు.వంద శాతం మన మనసు,బుద్ధిని పెట్టాలి.జ్ఞాన సిద్థులు మాత్రమే ఎందుకు తెలుసుకోగలుగుతారు అంటే వారికి ఆత్మానుభూతిని పొందే అభ్యాసం ఉంటుంది కాబట్టి.అదే చిత్తశుద్థి లేని వారు ఎంత అభ్యాసం చేసినా ఫలితం శూన్యం.వారికి సృష్టి విలాసం కానరాదు.

Wednesday, 2 April 2025

ఉత్ర్కామంతం స్థితం వాపి

ఉత్ర్కామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం। విమూఢా నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః॥10॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి నిజాలు కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నాడు.అర్జునా!నేను నీకు ఇప్పుడు చెప్పాను కదా!జీవుడు దేహాన్ని త్యజిస్తాడని.మళ్ళీ గుణప్రభావం వల్ల మరో దేహాన్ని పొందుతాడని.ఆ దేహంలో కొన్నాళ్ళు అనుభవిస్తాడు,మనం మాములుగా బట్టలు మార్చుకున్నట్లు.ఇలాంటి విషయాలు మూర్ఖులు అయినవాళ్ళు అర్థం చేసుకోలేరు.ఎందుకంటే వాళ్ళకు అంత పరిపక్వత వుండదు.ఎంత సేపూ భౌతికమయిన వాంఛలగురించే ఆలోచిస్తారు కావున.ఇలా ఆధ్యాత్మక పరమయిన విషయాలను జ్ఞానసిద్ధులు మాత్రమే తెలుసుకుని,అర్థం చేసుకోగలుగుతారు.

Tuesday, 1 April 2025

శ్రోత్రం చక్షుః స్పర్శనం చ

శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ। అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే॥9॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలాగ అంటున్నాడు.అర్జునా!జీవుడు అంటే ఆత్మ అని అర్థం అవుతుందా?చెవులు,కళ్ళు,చర్మం,నాలుక,ముక్కు పంచేంద్రియాలు.మనసు వీటి పైన ఆధారపడి వుంటుంది.జీవుడు పంచేంద్రియాలను ఆశ్రయించిన మనసును సహాయంగా తీసుకుని శబ్దరూప రస స్పర్శ గంధాది విషయాలను అనుభవిస్తున్నాడు.

Monday, 31 March 2025

శరీరం యదవాప్నోతి

శరీరం యదవాప్నోతి యచ్తాప్యుత్ర్కా మతీశ్వరః। గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయత్॥8॥ శ్రీమగ్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఎంత సుందరంగా వివరిస్తున్నాడో చూడు.అర్జునా!జీవుడికి దేహం వుంటుంది కదా.మనము చాలా జన్మలు ఎత్తాల్సి వుంటుంది కదా.అలా జన్మలు మారేటప్పుడు శరీరాలు మార్చాల్సి వస్తుంది.మనంపాత,చినిగిన బట్టలు విప్పి కొత్తవి,మంచివి వేసుకున్నట్లు.ఒక పూదోట మీదుగా గాలి వీస్తే,ఆ పూల సువాసనను కూడా కొంచెం పట్టుకు పోతుంది,పోతూ పోతూ.అచ్చం అలాగే ఇక్కడ కూడా.జీవుడు క్రొత్త శరీరం లోకి వెళ్ళేటప్పుడు,వెనుకటి శరీరం నుంచి భావపరంపరను తీసుకుని పోతున్నాడు.

Saturday, 29 March 2025

మమైవాంశో జీవలోకే

మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః। మనః షష్ఠాణీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి॥7॥ శ్రీమద్భగవద్గీత....పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు. అర్జునా!నేను ఆదిమధ్యాంతరహితుడిని కదా.పురాతనమయిన నా అంశయే మనుష్యలోకంలో జీవుడిగా పరిణమించింది.ఆ జీవుడే ఈ చరాచరజగత్తు,ప్రకృతిలోని వికారాలు అయిన జ్ఞానేంద్రియ పంచకాన్ని,మనస్సును కూడా ఆకర్షిస్తున్నాడు.అంటే నేను విశ్వమంతా వ్యాపించ్ వున్నాను.నన్ను దాటుకుని ఎవరూ ,ఎక్కడికీ పోలేరు.కానీ మాయామోహంలో చిక్కుకుని వుంటారు చాలా మటుకు.

Friday, 28 March 2025

న తద్భాసయతే సూర్యో

న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః। యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ॥6॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి పూస గుచ్చినట్లు వివరంగా చెబుతున్నాడు.గురువు పిల్లవాడికి చెప్పేటప్పుడు సంధులు,సమాసాలతో,కఠినమయిన పదజాలంతో చెప్పకూడదు.చిన్న చిన్న పదాలతో,వాడికి అర్థం అయ్యేలాగా,భయపడకుండా నేర్చుకునేలా,వాడికి నేర్చుకునేదానికి ఉత్సాహం నింపేలాగా చెప్పాలి.ఇక్కడ కృష్ణుడు కూడా అలానే చేస్తున్నాడు. అర్జునా!పరమపదం అంటే చెబుతాను,విను.మనం సూర్యుడు,చంద్రుడు ప్రపంచానికి వెలుగు నిస్తాయి అనుకుంటాము కదా!అవి పరమపదాన్ని ప్రకాశింపలేవు.అంటే కోటానుకోట్ల సూర్యులు,చంద్రులు కూడా దాని ప్రకాశం ముందర ఆగలేవు,తూగలేవు.ఆ మోక్షం,ఆ పరమపదం పొందితే మరల వెనుకకు రానవసరం లేదు. మనం భూమి మీద పుట్టామంటే మరల మరల జన్మలు వుంటాయి.అవి ఇప్పటి మన జన్మ కంటే ఉచ్ఛమయినవా,నీచమయినవా అనేది మన కర్మలను బట్టి వుంటుంది.కానీ ఆ భగవంతునిలో కైవల్యం పొందితే ఈ జన్మల జోలికి పోనక్కరలేదు.అలాంటి స్వయం ప్రకాశమానమయినది భగవంతుని పరమపదం.

Thursday, 27 March 2025

నిర్మానమోహా జితసంగదోషాః

నిర్మానమోహా జితసంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్యైర్విముక్తా స్సుఖదుఃఖసంజ్ఞైః గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్॥5॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి విడమరచి చెబుతున్నాడు.అర్జునా!నేను చెప్పే ముక్తి ఎలా సంపాదించాలో వివరిస్తాను.దురహంకారము,దుస్సంగము,దురూహలను దరిచేరనివ్వకూడదు.అంటే గర్వము పనికిరాదు.దుష్టులతో సాంగత్యము వద్దనే వద్దు.దురాలోచనల జోలికి అసలు వెళ్ళవద్దు.కోరికలను దరిచేర నివ్వకు.లాభం,నష్టం,కోపం,తాపం,సుఖం,దుఃఖం....ఇలాంటి ద్వంద్వాలను విసర్జించాలి.అప్పుడు మాత్రమే జ్ఞానులు బ్రహ్మజ్ఞాన నిష్టతో మోక్షం పొందగలుగుతారు.

Wednesday, 26 March 2025

తతః పదం తత్పరిమార్గతవ్యం

తతః పదం తత్పరిమార్గతవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ॥4॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము కృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!మనుష్యులు వైరాగ్యంతోటి సంసారమనే వృక్షాన్ని ఛేదించాలి అని చెప్పాను కదా!మనం సాధన చెయ్యాలి.ఎలా చెయ్యాలంటే దేనిని పొందితే దీనిలోకి రామో...అలా చెయ్యాలి.అంటే కైవల్యం,పరమపధం పొందితే ఇలాంటి ఇహలోకం లోకి రానవసరం లేదు కదా!ఆ మోక్షం,ముక్తి పొందితే,అనాది అయిన ఈ చరాచర ప్రపంచం ఎవరు సృష్టించారో,ఎవరివలన సాగుతుందో,ఎవరివలన యావత్ సృష్టి అంతం అవుతుందో,ఆ పరమాత్మ సన్నిథిలో శరణు పొందవచ్చు.ఈ భావంతో సాధన చెయ్యాలి.

Tuesday, 18 March 2025

న రూప మస్యేహ తథోపలభ్యతే

న రూప మస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ ధృఢేన ఛిత్వా॥3॥ శ్రీమద్భగవద్గీత ...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము శ్రీకృష్ణుడు అర్జునుడితో సాధ్యాఽసాధ్యాల గురించి చెబుతున్నాడు.అర్జునా!మామూలుగా ఈ సంసారంలో వుండే ప్రాణులు అశ్వత్థవృక్షం యొక్క స్వరూపం తెలుసుకోలేరు.ఎందుకంటే ఈ వృక్షం ఆది,మధ్య,అంతాలు లేకుండా వుంటుంది.దీని వ్రేళ్ళు ఎక్కడికక్కడ బాగా నాటుకోని వుంటాయి.ఈ సంసార వృక్షాన్ని వైరాగ్యం తోటే మానవుడు ఛేదించగలడు.వేరే ఉపాయం,దారి లేదు.

Monday, 17 March 2025

అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః

అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాలాః। అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే॥2॥ శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఈ అశ్వత్థ వృక్షము అని చెప్పాను కదా.దాని కొమ్మలు సత్త్వగుణము,రజోగుణము మరియు తమోగుణముల వల్ల విస్తరించి వుంటుంది.ఇంద్రియార్థాలు చిగురులులాగ కలిగి వుంటుంది.ఈ కొమ్మలు క్రిందికీ,మీదికీ వ్యాపించి,విస్తరించి వుంటాయి.కానీ మనుష్యలోకంలో దీనికి క్రిందికి పోయే వ్రేళ్ళుకూడావుంటాయి.ఎందుకంటే ఇక్కడ అవి కూడా సకానకర్మలచే బద్ధములై వుంటాయి కాబట్టి.

Thursday, 13 March 2025

ఊర్ధ్వమూల మధశ్శాఖం

శ్రీమద్భగవద్గీత....పంచదశాధ్యాయము... పురుషోత్తమ ప్రాప్తి యోగము శ్రీభగవానువాచ... ఊర్ధ్వమూల మధశ్శాఖం అశ్వత్థం ప్రాహు రవ్యయం। ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్॥1॥ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!అశ్వత్థ వృక్షము ఒకటి వుంది అని చెప్పబడుతుంది.అది మామూలు చెట్టులాగ కాదు.దానికి వ్రేళ్ళు పైకి ఉంటాయి.కొమ్మలు ఏమో కిందికి ఉంటాయి.వేదాలలోని వాక్యాలే దానికి ఆకులు.దానికి నాశనం అనేది లేనే లేదు.ఆ వృక్షం గురించి తెలుసుకున్నవాడే వేదవిదుడు అని అర్థం చేసుకో.

Monday, 10 March 2025

బ్రహ్మణో హి ప్రతిష్ఠాఽహం

బ్రహ్మణోహి ప్రతిష్ఠాఽహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ॥27॥ శ్రీమద్భగవద్గీతాఽసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగోనామ చతుర్దశోఽధ్యాయః కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!ఈ సృష్టిలో ప్రతిదాని వెనుక,ముందర,పక్కన,లోపల,బయట...అంతా నేనే నిండి ఉన్నాను.నా ప్రమేయం లేకుండా చిన్న పరమాణువు కూడా అటుఇటు కదలలేదు.పరబ్రహ్మకు,అవినాశనమయిన మోక్షానికీ,ధర్మానికీ,సత్ చిత్ ఆనంద రూపైక నిరాకార బ్రహ్మానికీ అన్నింటికీ నేనే మూలాధారుడిగా వున్నాను.సులభంగా చెప్పాలంటే అన్నిటికీ కర్త,కర్మ,క్రియ నేనే.ఇవన్నీ అవినాశనము అని ఎందుకు చెబుతున్నానో విను.ముక్తి,ధర్మం,సచ్చిదానందం,నిరాకారమయిన బ్రహ్మం....ఇవన్నీ శాశ్వతమయినవి.వీటికి పుట్టుక,చావులేవు.చావులేదు అంటే నాశనం కావు అనే కదా అర్థం.నిరాకారము అన్నప్పుడు రూపం ఎక్కడనుంచి వస్తుంది?అంటే వాటి వునికి మనం గ్రహించగలము మనసుతో.కానీ తాకలేము,చూడలేము,వినలేము,రుచి కనుగొనలేము.కాబట్టి ఆదిమధ్యాంత రహితుడు నేనని అర్థం చేసుకో.

Thursday, 6 March 2025

మాం చ యోఽవ్యభిచారేణ

మాం చ యోఽవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే స గుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే॥26॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి త్రిగుణాలను అతిక్రమించేదానికి సులభమయిన మార్గం చెబుతున్నాడు.అర్జునా!నీకు అర్థం కావటంలేదు కదా?ఇంత కష్టమయిన ప్రక్రియ ఎలా మానవుడికి సాథ్యం అవుతుంది అని.నేనొక చిన్న చిట్కా చెప్తాను.గ్రహించు. నిత్యమూ నన్నే నిశ్చలమయిన భక్తితో సేవిస్తేచాలు.ఆ మానవుడికి త్రిగుణాలను ధిక్కరించే స్థితప్రజ్ఞత చేకూరుతుంది.అతను త్రిగుణాలను అతిక్రమించి బ్రహ్మత్వానికి అర్హుడవుతాడు.

Tuesday, 4 March 2025

ప్రకాశం చ ప్రవృత్తిం చ

శ్రీభగవానువాచ.... ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి॥22॥ ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యోఽవతిష్టతి నేంగతే॥23॥ సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మ కాంచనః తుల్య ప్రియాప్రియో ధీరః తుల్యనిందాత్మ సంస్తుతిః॥24॥ మానావమానయో స్తుల్యః తుల్యో మిత్రారి పక్షయోః సర్వారంభ పరిత్యాగీ గుణాతీత స్స ఉచ్యతే॥25॥ శ్రీమద్భగవద్గీత..।చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగయోగము ఎప్పుడూ అర్థం చేసుకోవాలి అనే తపన వుండే వాళ్ళకే అనుమానాలు వస్తాయి.అర్జునుడు తన అనుమానాలు బయచ పెట్టగానే కృష్ణుడు సంతోషించాడు.విడమరచి చెప్పడం మొదలు పెట్టాడు.హే అర్జునా!గుణాతీతుడు ఎవడు,ఎలా ఉంటాడో చెబుతాను,విను. ఈ మూడు గుణాలు ఉన్నాయి కదా!వాటికి సంబంథించిన,వ్యక్తరూపాలు అయిన ప్రకాశం,ప్రవృత్తి,మోహాలు సంప్రాప్తమయినా ద్వేషించకుండా ఉండాలి.అవి దక్కకపోయినా,వాటికోసం వెంపర్లాడకుండా వుండగలగాలి.నిర్వికారంగా,సాక్షిమాత్రుడుగా వుండాలి.గుణధర్మపరమయిన కర్మలకు తన కర్తృత్వాన్ని జోడించకుండా ఉండాలి.వాటివాటి స్వస్వభావతను గ్రహించి సుఖదుఃఖాలను రెండింటినీ సమభావంతో చూడాలి.తనకుతానే సుప్రతిష్టుడు అయి మట్టి,రాయి,బంగారాలను సమభావంతో చూడగలగాలి.ప్రియమైనా,అప్రియమైనా ఒకే రకంగా స్వీకరించాలి.ధీరుడుగా ఉంటూ నిందలు అయినా,మెచ్చుకోలుఅయినా,బ్రహ్మరథం పట్టినా,అవమానించినా,శత్రువులు అయినా,మిత్రులు అయినా సమభావంతో స్వీకరించాలి.సర్వకాల సర్వావస్థలయందు సమబుద్ధితో వుండి,నిస్సంకల్పుడుగా ఉండాలి.ఇలా వుండగలిగిన వాళ్ళను గుణాతీతుడు అంటారు.

Sunday, 2 March 2025

కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్

అర్జున ఉవాచ... కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణా నతివర్తతే॥21॥ శ్రీమద్భగవద్గీత... చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము అర్జునుడికి తల తిరిగిపోతుంది.అన్నీ అర్థం కాని అనుమానాలే.అందుకని మొహమాటానికి పోకుండా కృష్ణుడిని అడుగుతున్నాడు.కృష్ణా!నువ్వేమో త్రిగుణాలు అన్నావు.మళ్ళా వాటిని అతిక్రమిస్తే పరమపథం అంటున్నావు.ఈ సత్త్వరజస్తమో గుణాలను ఎవరు అతిక్రమించగలరు?వాళ్ళు ఎలా ఉంటారు? వారి గుణగణాలు,లక్షణాలు ఎలా ఉంటాయి?వారి ఆచారవ్యవహారాలు ఏ రీతిలో ఉంటాయి?అసలు మానవుడు ఈ మూడుగుణాల పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడగలతాడు?నాకు ఈ ప్రశ్నలకన్నిటికీ సవివరంగా సమాథానం చెప్పాలి అని వేడుకున్నాడు అర్జునుడు.

Friday, 28 February 2025

గుణానేతా నతీత్య త్రీన్

గుణానేతా నతీత్య త్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైః విముక్తోఽమృత మశ్నుతే॥20॥ శ్రీమద్భగవద్గీత..।చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి ముక్తికి మార్గం చెబుతున్నాడు.అర్జునా!దేహి అనగా బద్ధజీవుడు ఈ త్రిగుణాలను తన ఆధీనం లోకి తీసుకురాగలగాలి.వీటి పాశాలనుంచి విముక్తుడు కాగలగాలి.వీటిని సునాయాశంగా దాటగలగాలి.అతిక్రమించగలగాలి.అలాంటి జీవి జన్మ మృత్యు జరాది దుఃఖాలనుంచి బయట పడగలుగుతాడు.ముక్తికి బాటలు వేయగలుగుతాడు.ఆ పైన బ్రహ్మానందాన్ని పొందగలుగుతాడు.ఇందులో సందేహము లేదు.నన్ను నమ్ము.

Thursday, 27 February 2025

నాన్యం గుణేభ్యః కర్తారం

నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టాఽనుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోఽధిగచ్ఛతి॥19॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి పరమ సత్యం బోధిస్తున్నాడు.అర్జునా!సర్వ సృష్టికోటిని కర్మలకు ప్రేరేపించేది ఈ త్రిగుణాలే.ఆ విషయం ముందర మనము అర్థం చేసుకోవాలి. కానీ పరమాత్మ మటుకు ఈ గుణత్రయానికి అతీతుడు అనే విషయం కూడా తెలుసుకోవాలి.ఈ విషయాలన్నిటినీ ఆకళింపు చేసుకున్న వాడే నన్ను అర్థం చేసుకునిన వాడు.వాడే నాకు దగ్గర అవుతాడు.

Wednesday, 26 February 2025

ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థాః

ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణ వృత్తిస్థాః అధో గచ్ఛంతి తామసాః॥18॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగయోగము కృష్ణుడు అర్జునుడికి ఏ గుణాలు పాటిస్తే,ఏ ఫలితాలు దక్కుతాయో చెబుతున్నాడు.అర్జునా!నీకు ఈ మూడుగుణాలగురించి చెప్పానుకదా.వాటి పర్యనసానంఎలా వుంటుందో,ఏమిటో చెబుతాను.సత్త్వగుణం ఆచరించే సాత్త్వికులకు ఉత్తమమయిన ఊర్ధ్వలోకాలు సంప్రాప్తిస్తాయి.రజోగుణం పాటించే రాజులకు మానవలోకం దక్కుతుంది.అంటే మళ్ళీ మళ్ళీ మానవజన్మమే దక్కుతుంది.మోక్షం దక్కదు.తమోగుణానికి బానిసలు అయిన తామసులకప నీచమయిన అధోగతులు కలుగుతాయి.అనగా మానవ జన్మకంటేకూడా తక్కువ అయిన పశు,పక్ష్యాదుల జన్మ దక్కుతుంది.

Tuesday, 25 February 2025

సత్త్వా త్సంజాయతే జ్ఞానం

సత్త్వా త్సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతోఽజ్ఞానమేవ చ॥17॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము ఏ విషయం అయినా ఒకటికి నాలుగు సార్లు మననం చేసుకుంటే కానీ బుర్రకు ఎక్కదు.ఈ విషయం కృష్ణుడికి చాలా బాగా తెలుసు.అందుకే మళ్ళీ మళ్ళీ అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!సత్త్వగుణం వలన మనిషిలో జ్ఞానం పెరుగుతుంది.అదే రజోగుణము వల్లన అయితే లోభం పెరుగుతుంది.తమోగుణం వలన మనలో అజ్ఞానానికి అంతమే ఉండదు.భ్రాంతి,ప్రమాదాలు ఏర్పడతాయి.కాబట్టి మనము నిశితంగా ఆలోచించి,మంచి మార్గంలో ముందుకు పోవాలి.

Monday, 24 February 2025

కర్మణ సుకృతస్యాహుః

కర్మణ సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలమ్॥16॥ శ్రీమద్భగవద్గీత....చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడిని మంచి మార్గంలో నడవమని చెబుతున్నాడు.అర్జునా! సత్త్వగుణము ఎంచుకొని ఆ మార్గంలో నడిచేదానికి ప్రయత్నించు.ఎందుకంటే,ఆ మంచి కర్మలవలన మనకు ఎలాంటి మాలిన్యం అంటని సౌఖ్యం దక్కుతుంది.అదే రాజసగుణం వలన దుఃఖం దక్కుతుంది.ఎందుకంటే మనము ప్రాపంచిక విషయ లాలసకు లోనవుతాము కదా!తామసగుణానికి సంబంధించిన కర్మలవల్ల అజ్ఞానము,అవివేకము,అలసత్త్వములకు మనము నివాస గృహం అవుతాము.

Sunday, 23 February 2025

రజసి ప్రళయం గత్వా

రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీన స్తమసి మూఢయోనిషు జాయతే॥5॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.రజోగుణము వృద్ధిలో ఉన్నప్పుడు మరణిస్తే ఏమి జరుగుతుందో చెప్తాను విను.అలాంటి మనిషికి కర్మలయందు ఆసక్తి వుంటుంది కనుక,మరలా మానవజన్మనే పొందుతాడు.ఇప్పుడు తమోగుణము గురించి మాట్లాడుకుందాము.తమోగుణము అంటే అజ్ఞానానికి,అలసత్త్వానికి పెట్టింది పేరు.కాబట్టి తమోగుణము వృద్ధిలో ఉన్నప్పుడు మరణం సంభవిస్తే,ఆ ప్రాణికి పశువు,పక్షిల జన్మమే దక్కుతుంది.కాబట్టి మన ఆలోచనలు,నడవడిక,ఆత్మజ్ఞానము మనకు తరువాత దక్కబోయే జన్మలను కూడా నిర్దేశిస్తాయి.కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోని మసలుకుంటే,అన్ని వేళలా ఉత్తమము.

Friday, 21 February 2025

యదా సత్త్వే ప్రవృద్ధే తు

యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే॥14॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడితో చెబుతున్నాడు.మంచి మార్గములో నడిచే వాళ్ళకు ఎప్పుడూ మంచే జరుగుతుంది.అన్ని గుణాలలోకి సత్త్వగుణము మంచిది అని నీకు నేను చెప్పాను కదా!ఆ గుణము వృద్ధిలో వున్నప్పుడు మరణం సంభవిస్తే,మనము ఉత్తమలోకాలకు పోతాము.మాములుగా బ్రహ్మ జ్ఞానులకు ఉత్తమలోక ప్రాప్తి దక్కుతుంటుంది.కాబట్టి ప్రతి ఒక్కరూ సత్త్వగుణము అలవరుచుకుంటే మంచిది.

Tuesday, 18 February 2025

అప్రకాశోఽప్రవృత్తిశ్చ

అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందనా॥13॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు కురు వంశంలో పుట్టిన, కులతిలకము అయిన అర్జునుడిని ఇలా సంబోధిస్తున్నాడు.హే కురునందనా!ఇప్పుడు ఇంక తమోగుణము గురించి మాట్లాడు కుందాము.మనలో ఈ తమోగుణము పైన లాలస పెరిగి,మోతాదు మించింది అనుకో,అప్పుడు ఈ ఈ వికారాలు మనలో మొదలు అవుతాయి.జీవితంలో ప్రకాశం,ఆశ ఉండవు.మన పనులు మనం చేసుకోవాలనే ఆకాంక్ష,ఉత్తేజం అసలే ఉండవు.అసలు సిసలు పని దొంగలం అవుతాము.ఏ పనీ చేయ బుద్ధి కాదు.సోమరితనం పుష్కలంగా వృద్ధి చెందుతుంది.ముందు వెనక ఆలోచించకుండా అపాయాలకు,ప్రమాదాలకు లోను అవుతాము.మూర్ఖత్వం ఇబ్బడి ముబ్బిడిగా పెరుగుతుంది.కాబట్టి వీటిని దరి చేరనివ్వకూడదు.

Sunday, 16 February 2025

లోభః ప్రవృత్తి రారంభః

లోభః ప్రవృత్తి రారంభః కర్మణా మశమః స్పృహా రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ॥12॥ శ్రీమద్భగవద్గీత....చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్దునుడితో చెబుతున్నాడు.ఇప్పుడు నేను నీకు రజోగుణము గురించి చెబుతాను,విను.రజోగుణమనేది మనలో వృద్ధి అయింది అనుకో,మొదట బయటపడేది లోభత్వం.మనకు లోభగుణం,అదే పిసినారితనం అలవాటు అవుతుంది.అశాంతి మొదలు అవుతుంది.గుబులుగుబులుగా వుంటుంది.ఏ మంచి విషయం పైనా గురి కుదరదు.ఆశలు కళ్ళెంలేని గుఱ్ఱాలలాగా,మనల్ని పరుగులు పెట్టిస్తాయి.పనికిరాని పనులు,చెడు పనులు చేసేదానికి మనసు ఉవ్విళ్ళూరుతూ వుంటుంది.

Thursday, 13 February 2025

సర్వద్వారేషు దేహేఽస్మిన్

సర్వద్వారేషు దేహేఽస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్త్వమిత్యుత॥11॥ శ్రీమద్భగవద్గీత....చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి చిన్న కిటుకు చెపుతున్నాడు.అర్జునా!ఈ మూడు గుణాలు మనతో చెడుగుడు ఎలా ఆడుకుంటాయో చెప్పాను కదా.కానీ మనం వాటి పైన పెత్తనం సంపాదించేదానికి మొగ్గు చూపాలి.అప్పుడు మనకు మన ఇంద్రియాల పైన పట్టు దొరుకుతుంది.సరి అయిన మార్గంలో పయనిస్తాము.అందుకే చెబుతున్నాను విను.మనం మంచి మార్గం ఎన్నుకుంటే,సర్వేంద్రియ ద్వారాలు జ్ఞానరూపమయిన కాంతితో ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.అప్పుడు మనలో సత్త్వగుణము వృద్ధి అయిందని ధైర్యంగా ఉండవచ్చు.

Tuesday, 11 February 2025

రజస్తమశ్చాభిభూయ

రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత రజస్సత్త్వం తమశ్చైవ తమస్సత్త్వం రజస్తథా॥10॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడితో అసలు కిటుకుచెబుతున్నాడు.అర్జునా!ఈ మూడు గుణాలగురించి చెప్పాను.వీటి మధ్య ఇంకొక వ్వవహారము కూడా వుంది.చెబుతా విను.మన మనసుల పైన ఒక సారి రజోగుణము,తమోగుణాలను కాదని సత్త్వగుణము గెలుస్తుంది.ఇంకో సారి సత్త్వగుణము,తమోగుణాలను అణగ ద్రొక్కి రజోగుణము పై చేయి దక్కించుకుంటుంది.మరి ఇంకొక సారి సత్త్వ గుణము,రజోగుణాలని మూలకు నెట్టి,తమోగుణము మన నెత్తి మీద తైతక్కలాడుతుంది.ఇలా ఈ మూడు గుణాలు మనతో కబడ్డీ ఆడుకుంటుంటాయి.మనము ఆ గుణాలచేతిలో కీలుబొమ్మలము నిజానికి.

Sunday, 9 February 2025

సత్త్వం సఖే సంజయతి

సత్త్వం సఖే సంజయతి రజః కర్మణి భారత! జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత॥9॥ శ్రీమద్భగవద్గీత....చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు ఇంతదాకా తను చెప్పిన దానికి సారాంశం చెబుతున్నాడు.ఓ భరతశ్రేష్టా!అర్జునా!సత్త్వగుణం అనేది జీవుడిని సుఖబద్థుడిగా చేస్తుంది.రజోగుణం కర్మమార్గంలో ప్రయాణించేలా చేస్తుంది.తమోగుణం అనేది జ్ఞానాన్ని దూరం చేసి,అజ్ఞాన మార్గం వైపుకు మొగ్గేలా చేస్తుంది.దీని పర్యవసానంగా మానవుడు ప్రమాదాలకు లోనవుతాడు.ఎందుకంటే అతను తప్పులు మీద తప్పులు చేసుకుంటూ పోతాడు.ఎక్కడా ఆగి ఆత్మశోథన చేసుకోడు.

Saturday, 8 February 2025

తమస్త్వజ్ఞానజం విద్ధి

తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం। ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత॥8॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి మూడోగుణం గురించి చెబుతున్నాడు.భరతశ్రేష్టా!అర్జునా!ఇప్పుడు నీకు మూడోగుణం గురించి విపులంగా చెప్తాను.మూడోగుణం తమోగుణం.ఈ తామసగుణం ముఖ్యంగా అజ్ఞానం నుంచి పుట్టుకొస్తుంది.తామసగుణమనేది నీచమయిన గుణము.ఇది జీవులను మాయలో పడేస్తుంది.ఒకరకమయిన భ్రాంతి,అయోమయంలో పడేస్తాయి మనలను.దీని వల్ల సోమరితనం పెరుగుతుంది.పగలు,రాత్రి తేడా లేకుండా నిద్ర ఆవహిస్తుంది.సరి అయిన అవగాహన లేక తప్పులు మీద తప్పులు చేసుకుంటూ పోతాము.ఆ పొరబాట్లు కుప్పలు తెప్పలు అయి,ఆ గందరగోళం నుంచి బయటపడే ప్రసక్తే వుండదు.కాబట్టి అజ్నానం నుంచి బయటపడాలంటే మానవుడు ముందర బద్ధకం,అతినిద్ర వదిలించుకోవాలి.ప్రతిది నాకు తెలియదు,అవసరం లేదు అనుకోకుండా నిజనిర్థారణ చేసుకోవాలి.

Friday, 7 February 2025

రజో రాగాత్మకం విద్ధి

రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవః। తన్ని బధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్॥7॥ శ్రీమద్భగవద్గీత.....చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడికి త్రిగుణాల గురించి వివరంగా చెబుతున్నాడు.అర్జునా!రజోగుణం అనేది రాగమయము అయినది.అది కామము,మోహము,కాంక్ష,కోరిక,ఇష్టము....ఇలా తదితర భావాల ఆవేశం,సంపర్కముల వలన పుడుతుంది.ఈ గుణానికి లోబడిన జీవుడు ఇంక ఆ జంఝాటకం నుంచి బయట పడలేడు.సాలెగూడులో చిక్కుకున్న ఈగలాగ అక్కడక్కడే గింగిరాలు కొడుతుంటాడు.ఇంక వాడు అది చేకూరే మార్గాలనే అన్వేషిస్తూ,ఆ ఆ కర్మలచే బద్ధుడవుతాడు.వాడికి ఇంక వేరే ప్రపంచం కానరాదు.అవసరం లేదు.

Thursday, 6 February 2025

తత్ర సత్త్వం నిర్మలత్వాత్

తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం। సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ॥6॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశాధ్యాయము గుణత్రయ విభాగ యోగము కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!నేను మూడు గుణాల గురించి నీకు చెప్పాను కదా.వాటన్నిటిలోకి సత్త్వగుణం అనేది పరిశుద్ధమయినది.అది మానవుడికి జ్ఞాన ప్రకాశాన్ని ,ఆత్మ ప్రబోథాన్ని కలిగిస్తుంది.అంతేనా?కాదు.అది మనలవి పాపాలనుండి దూరం చేస్తుంది.ఆ దిశగా మనం ప్రలోభపడకుండా చేస్తుంది.ఈ గుణం మెండుగా కలిగి వున్నవారు సౌఖ్యం,జ్ఞానం అనే వాటికి కట్టుబడి వుంటారు.ఇక్కడ సౌఖ్యం అంటే ప్రాపంచిక సుఖాలు కాదు.ఆత్మ పరంగా మనం పొందే ఆనందం,తృప్తి.

Wednesday, 5 February 2025

సత్త్వం రజస్తమ ఇతి

సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః। నిబధ్నంతి మహాబాహో దేహే దేహిన మవ్యయమ్॥5॥ కృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఈ భౌతికమయిన ప్రకృతి వుంది కదా.ఇది సత్త్వగుణము,రజోగుణము మరియు తమోగుణములతో కూడి వుంటుంది.జీవి స్వతహాగా నిర్వికారుడే.కానీ ఒకసారి ప్రకృతితో అతనికి సంపర్కం కలిగిందంటే,ఆ త్రిగుణాలచేత బద్ధుడు అవుతాడు.ఇదంతా మాయ అనే వల విసిరినట్లే జీవి మీదకు.

Monday, 3 February 2025

సర్వయోనిషు కౌంతేయ

సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః। తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా॥4॥ కృష్ణుడు అర్జునుడుతో ఇలా అంటున్నాడు.అనేక గర్భాల నుండి జన్మించిన శరీరాలన్నిటికీ తల్లి ప్రకృతి.ఈ విషయం మర్చిపోవద్దు.అన్నింటా బీజప్రదాతను నేనే.కాబట్టి ఆ పుట్టిన సమస్త ప్రాణి కోటికి నేనే తండ్రిని.