Thursday, 11 September 2025
సర్వ గుహ్యతమం భూయః
సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః।
ఇష్టోఽసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్॥64॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
భగవంతుడు ఎంతో భక్తసులభుడు.లేకపోతే ఆయన భక్తుడిని నన్ను నమ్ముకో,నీకు మంచి చేస్తాను అని బతిమాలడటం ఏంటి?
ఇక్కడ శ్రీకృష్ణుడు సరిగ్గా భక్తుడు అయిన అర్జునుడిని బుజ్జగించి,చెపుతున్నాడు.హే అర్జునా!నీవు నాకు నాకు చాలా కావలసిన వాడివి.నా వాడివి.నాకు ఆప్తుడివి.నీకు మంచి చేయటం నా ధర్మము. నీ శ్రేయస్సు కోరుకోవడం నా కర్తవ్యం.కాబట్టి నీ మంచి కోసం,శ్రేయస్సు కోసం మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను,విను.అన్ని ఉపదేశాలలోకీ ఉత్కృష్టమయిన,గోప్యమయిన నా మాటలు,ఉపదేశాలు మరలా విను.అర్థం చేసుకో!అన్వయించుకో!
Tuesday, 26 August 2025
ఇతి తే జ్ఞానమఖ్యాతం
ఇతి తే జ్ఞానమఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా।
విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు॥63॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు ఇంత సేపూ అలుపు,అలసట లేకుండా అర్జునుడికి బోధిస్తున్నాడు కదా!ఇంక ముక్తాయింపు చెబుతున్నాడు.ఓ అర్జునా!హే కౌంతేయా!అతి రహస్యమైన,పరమ పవిత్రమైన జ్ఞానాన్ని అంతా నీకు సవివరంగా చెప్పాను.నేను చెప్పినదానినంతా ఒకసారి సింహావలోకనం చేసుకో!బాగా ఆలోచించు.నీ మనసుకు ఏది మంచిది అనిపిస్తుందో,ఏది సరైన పని అని అనిపిస్తుందో,అదే చెయ్యి.నేను ఇంక నిన్ను ప్రభావితం చేయను.నీ విచక్షణను ఉపయోగించి కార్యాచరణం లోకి దిగు.నీకు నచ్చింది పాటించు.
Monday, 25 August 2025
త్వమేవ శరణం గచ్ఛ
త్వమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత।
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్॥62॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి అసలు కిటుకు చెబుతున్నాడు.ఓ అర్జునా!హే భరతశ్రేష్టా!నేను చెప్పిన వాటికి అన్నిటికీ జవాబు,ఉపాయం ఒక్కటే ఉంది.అదే ఆ పరమాత్మను మనసా,వాచా, కర్మణా శరణు కోరటం.అతను అత్యంత దయాళువు.అతని దయ,కనికరం,ప్రేమ,వాత్సల్యం నీకు దక్కాయి అనుకో!నీవు ఖచ్చితంగా శాంతినీ,మనశ్శాంతినీ,మోక్షాన్నీ పొందగలుగుతావు.
Sunday, 24 August 2025
ఈశ్వర స్సర్వభూతానాం
ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి।
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా॥61॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.ఓ అర్జునా!దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ లేడు? ఇలాంటి అనుమానాలు నీకు అస్సలు వద్దు.ఈశ్వరుడు సర్వాంతర్యామి.తన మాయ చేత సర్వభూతాలనూ కీలు బొమ్మల్లా ఆడిస్తాడు.ఆయన అన్ని ప్రాణుల హృదయాంతరాళలో సదా నివసిస్తూ ఉంటాడు.మామూలు మనుష్యులు మాయామోహంతో అంతర్ముఖంగా ఉండే ఆయనను గుర్తించలేరు.అలా కనుక్కోవాలంటే సాథన కావాలి.
Saturday, 23 August 2025
స్వభావజేన కౌంతేయ
స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్స్వేన కర్మణా।
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశోఽపి తత్॥60॥శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడికి ఉండే ఓపిక,ఓదార్పు,సగటు మానవుడి మానసిక స్థితి పైన అవగాహన ఇంకెవరికీ ఉండవు.అది రణరంగం!ఆదమరిస్తే ప్రాణాలే పోతాయి.అట్లాంటి చోట అర్జునుడిని కూర్చోబెట్టుకుని,బుర్రలోకి బాగా ఎక్కాలని మంచి విషయాలు పదే పదే,ఎంతో ఓపికగా చెబుతున్నాడు.
ఓ అర్జునా!హే కౌంతేయా!మానవుడి పుట్టుక నుండి గిట్టే వరకూ ఏదో ఒక మాయామోహంలో కూరుకుని ఉంటాడు.అది సహజమే!కానీ నేను నీకు పదేపదే చెబుతున్నాను, విను.ప్రకృతి పరంగా జనితమైన ఏమాయో,భ్రాంతో నీవు యుద్ధం చేయవద్దని నిన్ను ప్రేరేపించ వచ్చు,ప్రలోభపెట్టవచ్చుగాక!కానీ తుదకు నీ సహజమైన క్షాత్ర్య ధర్మానికి నీవు కట్టుబడతావు.నీ ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడి యుద్ధానికి కార్యోన్ముఖుడివి అవుతావు.ఇందులో ఎలాంటి సందేహం లేదు.ప్రస్తుతం నీ మనసులో ఉండే అలజడి,అనుమానం అన్నీ దూది పింజాలులాగా పక్కకి పోతాయి.నీవు స్వచ్ఛమయిన చంద్రుడిలా ప్రకాశిస్తావు.నీవు తప్పకుండా ఈ యుద్ధాన్ని చేసి తీరుతావు.నాకు నీపై ఆ నమ్మకం ఉంది.
Friday, 22 August 2025
యదహంకార మాశ్రిత్య
యదహంకార మాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే।
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి॥59॥శ్రీమద్భగనద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి హితవు చెబుతున్నాడు.అర్జునా!నేను నీకు ఇదే చెబుతున్నాను.దురహంకారంతో,అజ్ఞానంతో యుద్ధం మానేయాలనే ఆలోచనే నీ మస్తిష్కం లోకి రావివ్వ వద్దు.అట్లా నువ్వు అనుకున్నా,అది ఒఠ్ఠి వృథా ప్రయాస అవుతుంది.నువ్వు జన్మతః క్షత్రియుడవు.నీ క్షాత్ర ధర్మమే నిన్ను యుద్ధానికి పురిగొల్పుతుంది.నిన్ను ఆ రకంగా యుద్ధానికి వినియోగించుకుంటుంది.ఇది తధ్యము.
మచ్చిత్త స్సర్వదుర్గాణి మత్ప్రసాదా
మచ్చిత్త స్సర్వదుర్గాణిమత్ప్రసాదా త్తరిష్యసి।
అథ చేత్త్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి॥58॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇంకా ఓపికగా చెబుతున్నాడు.ఓ అర్జునా!నిన్ను భయపెట్టేదానికి గానీ,బెదించేదానికి గానీ నేను ఇవేవీ చెప్పటం లేదు.విత్య సత్యాలు కాబట్టే చెబుతున్నాను.కాబట్టి మనసు పెట్టివిని,అర్థం చేసుకో!మామూలుగా ఈ మానవ మాత్రులు భవ సాగరం దాటాలంటే ససేమిరా కాని పని.కాబట్టి నా శరణు కోరుకో!నేను కరుణిస్తేనే, దాటశక్యం కాని సంసార దుఃఖాలన్నింటినీ సులువుగా దాటగలవు.కాదు నాకు అఖ్ఖరలేదు నీ ఆపన్నహస్తం అని గర్వానికీ,అహంభావానికీ పోతే నాశనం అవుతావు.దానిని ఎవరూ ఆపలేరు.
చేతసా సర్వకర్మాణ్యపి
చేతసా సర్వకర్మాణ్యపి మయి సన్న్యస్య మత్పరః।
బుద్ధియోగ ముపాశ్రిత్య మచ్చిత్తస్సతతం భవ॥57॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా అంటున్నాడు. అర్జునా!నీవు ఏమి చెయ్యాలో చెబుతాను విను.ముందరగా సర్వ కర్మలు నాకే సమర్పించు.సమబుద్ధిని ప్రసాదించే యోగాన్ని అవలంబించు.నేనే పరమగతిని అనే విషయం బాగా ఆకళింపుచేసుకో.నీ మనసును,అంతఃకరణాన్నీ నాయందు లగ్నం చేయడంలో సఫలీకృతుడవు కావాలి.అప్పుడే నీవు మోక్ష ప్రాప్తికి అర్హుడవు అవుతావు.
Thursday, 21 August 2025
సర్వకర్మాణ్యపి సదా
సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః।
మత్ప్రసాదా దవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్॥56॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా సులభంగా అర్థం అయ్యేలా చెబుతున్నాడు.ఓ అర్జునా!అన్ని కర్మలను ఆచరిస్తున్నా,నన్నే నమ్ముకున్న కర్మయోగి,అవినాశనమైన పరమపదాన్నే పొందుతాడు.ఎందుకంటే అతను నన్నే నమ్ముకుంటాడు.కర్మఫలాన్ని సదా నాకే సమర్పిస్తాడు.తామరాకు మీద నీటిబొట్టులాగా అతనికి ఏ కల్మషమూ అంటదు.భారం అంతా నా మీదే ఉంచి,తను సర్వదా ప్రశాంత చిత్తంతో ఉంటాడు.
Wednesday, 20 August 2025
భక్త్యా మామభిజానాతి
భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః।
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్॥55॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!నీకు ఇంత దూరం,ఇంత విపులంగా ఎందుకు చెబుతున్నానో తెలుసా?నా భక్తిని పొందగలగటం ఆషామాషీ వ్యవహారంకాదు!జ్ఞానయోగ ఫలమయిన నా భక్తిని పొందినవాడు నా స్వరూప స్వభావాలను పూర్తిగా ఆకళింపు చేసుకుంటాడు.చివరకు ఆ భక్తి తత్త్వంలోనే మునుగి,తేలుతూ నాలో ఐక్యం అవుతాడు.మానవ జన్మకు అంతకంటే ఉత్కృష్టమయినది ఇంకేమి ఉంటుంది?పరమాత్మతో మమేకం కావటం అంటే మాటలా!!!!
Tuesday, 19 August 2025
వివిక్తసేవీ లఘ్వాసీ
వివిక్తసేవీ లఘ్వాసీ యతవాక్కాయమానసః।
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః॥52॥అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్।
విముచ్య నిర్మమశ్శాంతో బ్రహ్మభూయాయ కల్పతే॥53॥
బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి।
సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్॥54॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓపికగా చెబుతున్నాడు.అర్జునా!నీ కోసం మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను.సావథానంగా విని,బుర్రలోకి ఎక్కిచ్చుకో!బ్రహ్మభావానికి అర్హత ఏమేమి అని చెప్పాను?మాయా మోహం లేకుండా,నిశ్చల జ్ఞానంతో మనసును నిగ్రహించాలని చెప్పాను కదా!అలాగే శబ్దాది విషయలను వదలి,రాగద్వేష రహితంగా,విరాగిగా,యేకాంతంగా,అల్పాహారిగా,మనోవాక్కాయ కర్మలను నియమబద్థం చెయ్యాలని చెప్పాను కదా!అహంకారము,దురభిమానము,దంభం,కామక్రోధాలు,మమకారాలకు దూరంగా,అతీతంగా ఉండాలని నొక్కి వక్కాణించాను కదా!
అర్జునా!ఇదంతా ఇన్ని సార్లు ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో!బ్రహ్మ భావాన్ని ఒకసారి పొందితే,అంతఃకరణం శుద్ధి అవుతుంది.కాబట్టి మనిషి ఇంకేమీ కోరడు.దేనికీ దుఃఖ పడడు.సమస్త ప్రాణులయందూ సమ దృష్టి కలిగి ఉంటాడు.చివరకు జ్ఞానయోగ ఫలంగా నా భక్తిని,ముక్తిని పొందుతాడు.
Monday, 18 August 2025
బుద్ధ్యా విశుద్ధయా యుక్తో
బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాఽఽత్మానం నియమ్య చ।
శబ్దాదీన్ విషయాం స్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ॥51॥
వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయ మానసః।
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః॥53॥
అహంకారం బలం దర్పం కామం క్రోథం పరిగ్రహమ్।
విముచ్య నిర్మమశ్శాంతో బ్రహ్మభూయాయ కల్పతే॥54॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!పరమాత్మను పొందాలి అంటే ఏమి చెయ్యాలో చెబుతాను అన్నాను కదా!మనసు లగ్నం చేసి విను.మాయామోహాలకు అతీతంగా ఉండాలి.నిశ్చలమయిన జ్ఞానంతో మనసును నిగ్రహించాలి.అంటే మన చెప్పుచేతల్లో పెట్టుకోవాలి.ప్రపంచం అంతా శబ్దకాలుష్యంతో నిండి ఉంటుంది.ఇలా అనేక రకాల కాలుష్యాలకు దూరంగా ఉండాలి.ఎందుకంటే అవి మన మనసును చలింపచేస్తాయి.రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి.తామరాకు మీద ఉండే నీటిబొట్టులాగా,ఎల్లప్పుడూ విరాగిలాగా ఉండాలి.మనసు ఏకాగ్రత సాధించాలి అంటే ఏకాంతవాసం అవసరము.మితాహారం తీసుకోవాలి.జిహ్వచాపల్యానికి పోయి కనపడ్డదంతా నోట్లో వేసుకోకూడదు.అంటే మనం చేసేపనుల పైన మనకు నుయంత్రణ ఉండాలి.మనోవాక్కాయ కర్మలను నియమ నిబద్ధలతో ఆచరించాలి.ధ్యానయోగులం కావాలి.మనకు అహం ఎక్కువ ఉంటుంది.నాకేమి తక్కువ?అందరి కంటే నేనే గొప్ప అనే భావం బయటకు చెప్పకపోయినా,లోలోపల ఉంటుంది చాలా మటుకు.ఆ అహంకారాన్ని,ఆ అజ్ఞానాన్ని ముందు వదిలి పెట్టాలి.అలాగే అభిమానము,దంభము,దర్పము,కామక్రోధాలను వదలి పెట్టాలి.మనము బయట,లోపల ఒకే రకంగా ఉండగలగాలి.అంటే మనం బయటకు ఎలా కనిపిస్తామో,మన అంతఃకరణంలోనూ అలాగే ఉండాలి.మమకారాలకు దూరంగా ఉండాలి.ఎందుకంటే అదే చాలాసార్లు అనర్థానికి హేతువు అవుతుంది.ఇలా త్రికరణ శుద్ధిగా,శాంత చిత్తంతో ఉన్నవాడే,ఉన్న నాడే బ్రహ్మభావానికి మనషి అర్హుడు అవుతాడు.
Sunday, 17 August 2025
సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ
సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తధాఽఽప్నోతి నిబోధ మే।
సమాసేనైవ కౌంతేయ!నిష్ఠా జ్ఞానస్య యాపరా॥50॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నడు.హే కౌంతేయ!హే అర్జునా!నేను నైష్కర్మ్య సిద్ధి అనగానే నీకు అర్థం కాలేదు అని నాకు అర్ధం అయింది.కామక్రోథ మద లోభాలకు అతీతంగా మనము ఆచరించ వలసిన పనులు మనము చేయటమే నిష్కామ కర్మ అని అంటారు.అలా కర్మానుష్టానం చేయటం వలన సిద్ధిని పొందగలతాము.ఇలా జ్ఞాన సిద్ధిని పొందిన వాడు యే విధంగా పరమాత్మను పొందుతాడో నీకు సవివరంగా చెబుతాను.
Saturday, 16 August 2025
అసక్త బుద్ధి స్సర్వత్ర
అసక్త బుద్ధి స్సర్వత్ర జితాత్మావిగతస్పృహః।
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి॥49॥
శ్రీమద్భగవద్గీత.।।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు ఓపికగా అర్జునుడికివివరిస్తున్నాడు.అర్జునా!సిద్ధిని ఎలా పొందాలో చెబుతాను.ఎవరు పొందగలరో కూడా చెబుతాను.మొదట విషయాసక్తి ఉండకూడదు.అంటే దత్తి,యావ..అవసరానికి మించి...ఆసక్తి ఉండకూడదు.అంతఃకరణం స్వచ్ఛంగా ఉంచుకోగలగాలి.అంటే ద్వంద్వాలు ఉండకూడదు.అటా,ఇటా,ఎటో...అంటూ మనసు సందిగ్థంలో ఊగిసలాడకూడదు.తనకంటూ కోరికలు లేకుండా,సమాజం,సంఘహితంకోసం పాటుపడాలి.స్పృహారహితంగా ఉండాలి.అంటే తపన,లాలస,కాంక్ష లేకుండా ఉండాలి.అన్నిటికంటే ముఖ్యంగా జ్ఞానమార్గంలో నడవాలి.అప్పుడేమనము నైష్కర్మ్యసిద్ధిని పొందగలతాము.మనం పనులు చేస్తున్నా,నిర్వికారంగా,మోహాపేక్ష లేకుండా చెయ్యాలి.మోహావేశం లేకుండా,ఫలాపేక్ష లేకుండా చేసినప్పుడే సిద్ధిని పొందగలతాము.
Friday, 15 August 2025
సహజం కర్మ కౌంతేయ
సహజం కర్మ కౌంతేయ సదోషమపి స త్యజేత్।
సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్ని రివావృతాః॥48॥
శ్రీమద్భగవద్గీత.।।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.దోషాలతో కూడుకున్నా మన స్వధర్మాన్ని మనం వదిలి పెట్టకూడదు అని చెప్పాడు కదా.అర్జునుడు అర్ధం కానట్లు బిక్క మొహం వేసాడేమో!
హే అర్జునా!హే కౌంతేయా!నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను.సహజకర్మలు,స్వధర్మాలు దోషాలతో ఉన్నా మనము ఎప్పుడూ విడిచి పెట్టకూడదు.ఎందుకు అని అడుగుతావా?చెబుతాను,విను.నిప్పు రాజెయ్యాలంటే,మొదలు మొదలు పొగ వస్తుంది కదా!అగ్ని నిలకడగా వ్యాపించేదాకా ఆ పొగ ఉంటుంది కదా!కట్టెలు పచ్చివి అయినా,సరిగ్గా రాజుకోక పోయినా పొగ ఉంటుంది కదా!అగ్ని పొగతో ఉన్నట్లుగానే సర్వధర్మాలూ ఏదో ఒక దోషంతో ఆవరింపబడి ఉంటాయి.కాబట్టి ఎంత సేపూ తప్పొప్పులు,దోషాలు వెతకకుండా,స్ధూలంగా జరిగే మంచికి ప్రాముఖ్యం ఇవ్వాలి.
Thursday, 14 August 2025
శ్రేయాన్ స్వధర్మో విగుణః
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్టితాత్।
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్॥47॥
శ్రీమద్భగవద్గీత..అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
మన వాళ్ళు మాములుగా అంటుంటారు కదా!కుక్క పని కుక్క,గాడిద పని గాడిద చెయ్యాలని!శ్రీకృష్ణుడు అర్జునుడి ముఖంగా మనందరికి కూడా చెబుతున్నాడు.అర్జునా!పార్థా!ఉత్తమ విథులతో చేసే పరధర్మానుష్ఠానం కంటే దోషభూయిష్టమయినా కూడా స్వధర్మాన్ని ఆచరించమే శ్రేయస్కరము,ఉత్తమము.చాలా సార్లు మనము రెంటికీ చెడ్డ రేవడి లాగా తయరు అవుతాము.అక్కడా ఇమడలేము,ఇక్కడా ఉండలేము.మనకు అన్వయించే ధర్మాన్ని నమ్ముకోవడమే ఎప్పటికైనా మంచిది.
Wednesday, 13 August 2025
యతః ప్రవృత్తిర్భూతానాం
యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్।
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధింవిందతి మానవః॥46॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సావధానంగా వివరిస్తున్నాడు.అర్జునా!ఇంత సేపూ నేను స్వాభావిక కర్మల ఆచరణ గురించి చెప్పాను కదా!దాని వల్ల లాభం కూడా చెబుతాను విను.ఈ లోకంలో అన్ని ప్రాణులను ఎవరు పుట్టిస్తారు?వాళ్ళ ఎదుగుదల,కర్మలను,లయాన్ని ఎవరు నిర్దేశిస్తారు?ఎవరు ఈ ముల్లోకాలనూ నిండి ఉన్నాడు?ఆ పరమాత్మయే కదా!
మానవుడు తనకు విధింపబడిన కర్మల ద్వారా ఆ పరమాత్మను ఆరాధన చెయ్యాలి.అలా చేస్తే ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధిని పొందుతారు.అలాగే కైవల్యాన్నీ పొందుతారు.
Tuesday, 12 August 2025
స్వే స్వే కర్మణ్యభిరతః
స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః।
స్వకర్మనిరత స్సిద్ధిం యథా విందతి తచ్ఛృణు॥45॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!నేను ఇప్పుడు నీకు మూడు రకాల కర్మల గురించి చెప్పాను కదా!దాని వల్ల ఏమి అర్థం అవుతుంది?అంటే మనము మన మన స్వభావ సిద్థమైన కర్మల పట్ల శ్రద్ధాసక్తులు కనబరచాలి.వాటికి అనుగుణంగా,ప్రతిఫలాపేక్షను వదలి ప్రవర్తించాలి.అలా ప్రవర్తించే ప్రతి మానవుడూ జ్ఞానమును సమకూర్చుకుంటాడు.అలాగే సిద్ధి,బుద్ధి పొందుతాడు.ఇందులో లేశమాత్రము అయినా అనుమానము లేదు.మోక్షానికీ,కైవల్యానికీ ఇదే మార్గము.
Monday, 11 August 2025
కృషి గోరక్ష వాణిజ్యం
కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్।
పరిచార్యాత్మకం కర్మశూద్రస్యాపిస్వభావజమ్॥44॥
శ్రీమద్భగవద్గీత.।।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!మనము బ్రాహ్మణ,క్షత్రియ కర్మల గురించి చెప్పుకున్నాము కదా!ఇప్పుడు వైశ్యులు,శూద్రుల కర్మల గురించి తెలుసుకుందాము.వ్యవసాయము,గోవుల రక్షణ,వ్యాపారము వైశ్యులకు స్వభావ కర్మలు.అలాగే సేవావృత్తి,సేవాతత్త్వం శూద్రులకు స్వభావ కర్మలు.
Sunday, 10 August 2025
శౌర్యం తేజో ధృతి ర్దాక్ష్యం
శౌర్యం తేజో ధృతి ర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్।
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్॥43॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి క్షత్రియ కర్మల గురించి వివరిస్తున్నాడు.అర్జునా!మనము బ్రాహ్మణకర్మల గురించి మాట్లాడుకున్నాము కదా!ఇప్పుడు క్షత్రియ కర్మల గురించి తెలుసుకుందాము.శౌర్యము అనగా శూరత్వము,పరాక్రమము,ధైర్యము అని అర్ధము.ఇది క్షత్రియులకు పుష్కలంగా ఉండవలసిన గుణము.అలాగే తేజస్సు,ధైర్యము అవసరము చాలా ఉంది.ఇకపోతే పిరికితనము అనేది కనుచూపు మేరల్లో ఉండకూడదు.యుద్ధంలో వెన్ను చూపి,పలాయనం చిత్తగించే గీర,అదే ఆలోచనా సరళి,అస్సలు దరిచేరనీయకూడదు.ధర్మపూర్వకము అయిన దానం చేసే గుణము ఉండాలి.ప్రభువు అనగా రాజు,పాలించేవాడు,స్వపరిపాలిన అందించేవాడికి ఉండే అన్ని శక్తులు,సద్గుణాలు ఉండాలి.ఇవన్నీ స్వభావతః క్షత్రియ కర్మలు.
Saturday, 9 August 2025
శమో దమ స్తప శ్శౌచం
శమో దమ స్తప శ్శౌచం క్షాంతి రార్జవమేవ చ।
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్॥42॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివిధ వర్ణాలకు సంబంధించిన కర్మల గురించి వివరించేదానికి ఉపక్రమించాడు.అర్జునా!స్వభావ సిద్ధమయిన గుణాలననుసరించి వివిధ వర్ణాలుగా విభజన జరిగింది అని చెప్పాను కదా!ఇప్పుడు వారికి నిర్దేశించిన కర్మలను చెబుతాను,విను.ఇంద్రియ (పంచేంద్రియాలు,మనసు)నిగ్రహణ,తపస్సు,శౌచం,క్షమ,ఋజు వర్తనం,శాస్త్ర జ్ఞానం,అనుభవ జ్ఞానం,ఆస్తిక్యత ....ఇలాంటి మంచి గుణాలు,సంపత్తులు స్వభావతః బ్రాహ్మణ కర్మలు.మన మనసు,మాట,కర్మలు అన్నీ ఒకే తాటి పైన ఉండడమే ఋజు వర్తనము అంటే.మనలో దేవుని ఉనికి పైన విశ్వాసము,ఇహ పర లోకాల గురించిన అవగాహనలను ఆస్తిక్యము అని అంటారు.శౌచము అనేది అందరికీ చాలా ముఖ్యమయినది.ఎందుకంటే ధర్మదేవతకు ఉన్న నాలుగు పాదాలలో శౌచము ఒకటి అని ధర్మరాజు చెప్పాడు.శౌచం అంటే శుచి,శుభ్రత అని అర్ధము.మన పరిసరాలు ఒక్కటే కాదు,మన శరీరాన్ని,మనసును,మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
Friday, 8 August 2025
బ్రాహ్మణ క్షత్రియవిశాం
బ్రాహ్మణ క్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప।
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః॥41॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఒక్కొక్కరికి స్వభావ సిద్థంగా కొన్ని కొన్ని గుణాలు అలవరతాయి.ఆ గుణాలను అనుసరించి వారికి కర్మలను వేరు వేరుగా విభాజించడం జరిగింది.సంఘంలో వారిని బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్రులుగా విభజించడం జరిగింది.
Thursday, 7 August 2025
న తదస్తి పృథివ్యాం వా
న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః।
సత్త్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిస్స్వా త్రిభిర్గుణైః॥40॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాథ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ప్రతి విషయానికీ నేను సాత్త్విక,రాజస,తమోగుణాలు,భావాలు,సుఖాలు అంటూ చెబుతున్నాను.అంటే ఈ భూమి పైన పుట్టిన ప్రతిజీవీ ఈ మూడింటిలోని ఏదో ఒక చట్రంలో ఇమిడి ఉంటుంది.ఎందుకంటే ఇవన్నీ ప్రకృతి వల్ల పుట్టిన గుణాలు.ఇవేవీ కాకుండా,వీటికి అతీతంగా ఏదీ కూడా ఎక్కడా మనకు కానరాదు.ఈ పరిస్థితి ఒక్క భూలోకంలోనే కాదు,స్వర్గలోకంలో,దేవతలలో కూడా కనిపిస్తుంది.
Tuesday, 5 August 2025
యదగ్రే చానుబంధే చ
యదగ్రే చానుబంధే చ సుఖం మోహన మాత్మనః।
నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామస ముదాహృతమ్॥39॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక,రాజస సుఖాల గురుంచి వివరించాడు.ఇంక తామస సుఖం మిగిలి ఉంది.ఇలా చెబుతున్నాడు.అర్జునా!నీకు సాత్త్విక,రాజస సుఖాలు బాగా అర్థం అయ్యాయి కదా!ఇంక తామస సుఖం గురించి చెప్పుకుందాము.ఇక్కడ మొదలు,ఆఖరు... అంతా మోహజనకంగా ఉంటుంది.నిద్ర,అలసత్త్వము,ప్రమాదాలతో కూడుకుని ఉంటుంది.ఎక్కడా ప్రశాంత చిత్తంతో,ఆలోచించి చేయడం అనే ప్రణాలిక,మనసు,తెలివి ఉండవు.ఇలా అడ్డూ,ఆపూ లేకుండా,విచక్షణా రహితంగా పొందే సుఖాన్నే తామస సుఖం అని అంటారు.ఇది ఆఖరుకు దుఃఖభాజనము అవుతుంది.
విషయేంద్రియ సంయోగాత్
విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రేఽమృతోపమం।
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్॥38॥
శ్రీమద్భగవద్గీత..అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక సుఖం గురించి చెప్పాడు.ఇప్పుడు రాజస సుఖం గురించి చెబుతున్నాడు.అర్జునా!మొదట్లో కష్టతరంగా ఉండి,నిరంతర సాధనతో అనంతమయిన ఆనందాన్ని ఇచ్చేది సాత్త్విక సుఖం అని చెప్పాను కదా!ఇప్పుడు రాజస సుఖం గురించి మాట్లాడుకుందాము.రాజస సుఖం అనేది ప్రధానంగా ఇంద్రియ సంయోగం వలన పుడుతుంది.మొదట అంతా రంజుగా,అమృత తుల్యంగా ఉంటుంది.కానీ,పోనుపోను విషతుల్యంగా మారుతుంది.కాబట్టి తస్మాత్ జాగ్రత్త!
Monday, 4 August 2025
సుఖం త్విదానీం త్రివిధం
సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ।
అభ్యాసా ద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్ఛతి॥36॥
యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమం।
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజమ్॥37॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓపికగా మూడు రకాలు అయిన ధృతుల గురించి వివరించాడు.ఇప్పుడు ఇంక మూడు రకాల సుఖాలను గురించి వివరించేదానికి సమాయత్తం అయ్యాడు.
హే భరత శ్రేష్టా!హే అర్జునా!నీకు ధృతి అంటే ఏమిటి?దానిలో రకాలు బాగా అర్థముఅయ్యాయి కదా!మనము ఇప్పుడు సుఖాలు,వాటిల్లో రకాలు గురించి చర్చించుకుందాము.నీకు ఎక్కడ అయినా అనుమానం వస్తే సంశయ నివృత్తి చేసుకో!
సుఖాలు స్థూలంగా మూడు రకాలు.వాటిల్లో మొదట నీకు సాత్త్విక సుఖం గురించి వివరిస్తాను.ఇది మొదట్లో విషతుల్యంగా ఉంటుంది.దుఃఖ భాజకంగా కూడా ఉంటుంది.ఇంత కష్టం,ఇంత నష్టం అవసరమా ?అని కూడా అనిపిస్తుంది.కానీ అభ్యాసం చేసేకొద్దీ సులభతరమవుతుంది.తినగ తినగ వేప తియ్యనగును అంటారు కదా!అలాగ!మనము మొదట్లో కష్టము,బాధాజనకము,దుఃఖ కారకము అనుకునేవి...చిన్న చిన్నగా అభ్యాసం చేసే కొద్దీ సులభతరం అవుతూ వస్తాయి.ఒకటొకటిగా ఇబ్బందులు తొలగి పోతుంటాయి.చివరకు వచ్చేటప్పటికి ఎనలేని ఆనందాన్నీ,ఆత్మ తృప్తినీ ఇస్తాయి.ఆ అమృతమయము అయిన బుద్ధితో జన్మించేదే సాత్త్విక సుఖము.
Saturday, 2 August 2025
యయా స్వప్నం భయం శోకం
యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ।
న విముంచతి దుర్మేధా ధృతి స్సా పార్థ!తామసీ॥35॥
శ్రీమద్భగవద్గీత..అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక ధృతి,రాజస ధృతి గురించి చెప్పాడు.ఇంక మిగిలింది తామస ధృతి కదా!దాని గురించి చెప్పడం మొదలు పెట్టాడు.హే పార్థా!హే అర్జునా!నేను నీకు చెప్పిన సాత్త్విక,రాజస ధృతులు బాగా అర్థం అయ్యాయి కదా!ఇంక ఇప్పుడు తామస ధృతి గురించి చర్చించు కుందాము.ఇక్కడ ముఖ్యంగా మూర్ఖపు పట్టుదలలు కానవస్తుంటాయి.ఒక విషయాన్ని సవ్యంగా ఆకళింపు చేసుకునే సమన్వయం అసలే ఉండదు.స్వప్నం,భయం,శోకం,విషాదం,గర్వం...ఇలా ఒకటి కాదు,సవా లక్ష కారణాలకు చలిస్తూ,ప్రభావితమవుతుంటారు.సానుకూల స్పందన కరవౌతుంటుంది.ఇన్ని అపసవ్యాలు ఉన్నా కూడా,తమ తమ మూర్ఖపు పట్టుదలలను వదిలి పెట్టరు.ఇలాంటి దాన్నే తామస ధృతి అంటారు.
Friday, 1 August 2025
యయాతు ధర్మకామార్థాన్
యయాతు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేఽర్జున।
ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి స్సా పార్థ!రాజసీ॥34॥
శ్రీమద్భగవద్గీత....అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.హే పార్థా!హే అర్జునా!మనము ఇప్పుడు మనో ఇంద్రియ నిగ్రహణ సాత్త్విక ధృతి అని మాట్లాడుకున్నాము కదా!అలాగే రాజస ధృతి గురించి నీలో అవగాహన పెంచుతాను,విను.ఇక్కడ అంతా పంతాలు,పట్టింపులు ఎక్కువగా,ప్రధాన పాత్ర వహిస్తాయి.ఈ పని చేస్తే లాభం ఎంత?ప్రతిఫలం మొత్తం నాకే దక్కుతుందా?లేక ఇతరులతో పంచుకోవాలా?అంతా చేస్తే నాకేంటి?అనే భావజాలం ఎక్కువ కనిపిస్తుంది.ధర్మార్ధకామాల యందు అధికంగా పట్టుదల ఉంటుంది.దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుంది?ధర్మం చేస్తే నాకేమి గిట్టుబాటు అవుతుంది?అంటే చేసే ప్రతి పనిలో లాభనష్టాల బేరీజు వేసుకుంటూ,ముందుకు పోతుంటారు.ఇలా అహంభావంతో,పట్టుదలలతో ఆలోచించడమే రాజస ధృతి.
Thursday, 31 July 2025
ధృత్యా యయాధారయతే
ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియాః।
యోగేనా వ్యభిచారిణ్యా ధృతి స్సా పార్థ!సాత్త్వికీ॥33॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివిధ రకాల బుద్ధుల గురించి చెప్పాడు.అలాగే రకరకాల ధృతుల గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాడు.ధృతి అంటే మన మాటల్లో ఓపిక అని అర్థము.ఓర్పు,సంకల్పబలము,నిగ్రహము,ధైర్యము,స్థిరత్వము...ఇలా చాలా అర్థాలు ఉన్నాయి.మొత్తానికి ధృతి అనేది మన మనోసంకల్పము,మనోబలమును,మనోధైర్యాన్ని సూచిస్తుంది.కృష్ణుడు అర్జునుడితో చెపుతున్నాడు.హే పార్థా!హే అర్జునా!సాత్త్విక ధృతి గురించి చెపుతాను,విను ..విని ఆకళింపు చేసుకో!మనసు,ప్రాణము,ఇంద్రియాలు ఉన్నాయి కదా!వాటన్నిటికీ వాటివాటి వృత్తులు,ప్రవృత్తులు ఉంటాయి కదా!వాటన్నిటినీ సరి అయిన మార్గములో నిగ్రహించ గలగాలి.మన లక్ష్యసాధనలో ఏదీ పక్కదారి పట్టకుండా,చెదిరిపోకుండా,నియంత్రణ చేయగలిగే పట్టుదలను సాత్త్విక ధృతి అని అంటారు.
Wednesday, 30 July 2025
అధర్మం ధర్మమితి యా
అధర్మం ధర్మమితి యా మన్యతే తమసాఽఽవృతా।
సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి స్సా పార్థ!తామసీ॥32॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ఞుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.హే పార్థా!హే అర్జునా!ఇప్పుడిప్పుడే మనము సాత్త్విక,రాజస బుద్ధుల గురించి మాట్లాడుకున్నాము కదా!ఇప్పుడు నీకు ఇంక తామస బుద్ధి యొక్క పూర్వాపరాలు వివరిస్తాను.ఈ తామస బుద్ధి అనేది ఉందే,అది అంతా అస్తవ్యస్తంగా,గందరగోళంగా ఉంటుంది.అందుకే మామూలుగా వక్రబుద్ధి అని కూడా అంటుంటాము.దేనినీ సవ్యంగా,న్యాయపరంగా,మంచిగా ఆలోచించదు.అధర్మాన్ని ధర్మపథంలాగా అన్వయించుకుంటుంది.ఏ విషయము అయినా సీదా సాదాగా తీసుకోదు.వక్రంగా,అపసవ్యంగా ఆలోచిస్తుంది,గ్రహిస్తుంది.ఇలాంటి విపరీతమయిన భావజాలం కలిగి ఉండేదే తామస బుద్ధి అంటే!
Sunday, 27 July 2025
యయా ధర్మమధర్మం
యయా ధర్మమధర్మం చ కార్యం చా కార్యమేవ చ।
అయథావ త్ప్రజానాతి బుద్ధిస్సా పార్థ!రాజసీ॥31॥
శ్రీమద్భగవద్గీత..అష్టదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు ఇప్పుడిప్పుడే అర్జునుడికి సాత్వికబుద్ధి గురించి వివరించాడు.ఇప్పుడు ఇంక రాజస బుద్ధి గురించి చెప్పటం మొదలుపెట్టాడు.హే పార్థా!హే అర్జునా!సాత్విక బుద్ది అంటే ఎలా ఉంటుందో అర్థం అయింది కదా!రాజస బుద్ధి ఎలా ఉంటుందో చెబుతాను విను.ధర్మము-అధర్మము,కార్యము-అకార్యము..ఇలా ద్వంద్వాలు ఉన్నాయి కదా!వీటి అసలు అయిన జ్ఞానాన్నీ, అర్థాన్ని గుర్తించటంలో పప్పులో కాలు వేస్తారు.అంటే తప్పుగా అర్థం చేసుకుంటారు అన్నమాట!తపొప్పుల విశ్లేషణలో చతికిలా పడతారు.ఇలాంటి బుద్ధిని రాజస బుద్ధి అని అంటారు.
Thursday, 24 July 2025
ప్రవృత్తిం చ నివృత్తిం చ
ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే।
బంధం మోక్షం చ యావేత్తి బుద్ధి స్సా పార్ధ!సాత్త్వికీ॥30॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి తీరికగా,ఓపికగా వివరిస్తున్నాడు.అర్జునుడికి ఇప్పుడు తను రణరంగం మధ్యలో ఉన్నాననే స్పృహ లేనే లేదు.ఎందుకంటే కృష్ణుడు చెప్పే విషయాల పైన అంత లీనమైపోయి వింటున్నాడు.లోకంలో ఉండే సమయం అంతా వాళ్ళిద్దరే పంచుకున్నట్లుగా ఉంది!అర్జునా!నీకు ఇప్పుడు నేను సాత్విక బుద్ధి గురించి వివరిస్తాను.ధర్మము-అధర్మము,ప్రవృత్తి-నివృత్తి,కర్తవ్యము-అకర్తవ్యము,భయము-అభయము,బంధనము-మోక్షము...ఈ ద్వంద్వాలను అన్నిటినీ సుస్పష్టంగా తెలుసుకునే జ్ఞానం కలిగి ఉండటమే సాత్త్విక బుద్ధి.
Wednesday, 23 July 2025
బుద్ధేర్భేదం ధృతేశ్చైవ
బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణత స్త్రివిధం శృణు।
ప్రోచ్యమాన మశేషేణ పృథక్త్వేన ధనంజయ॥29॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తల గురించి చెప్పాడు.ఇప్పుడు ఇంక రకరకాల బుద్ధుల గురించి వివరించబోతున్నాడు.హే అర్జునా!హే ధనంజయా!నీకు కర్తల గురించి ఇప్పుడే చెప్పాను కదా!ఇంక రకరకాల బుద్ధుల గురించి కూడా విశదీకరిస్తాను.మంచిగా,మనసు పెట్టి విను.మనుష్యుల బుద్ధి అందరికీ ఒకేలాగా ఉండదు.గుణ భేదాల కారణంగా మూడు రకాలుగా విభజించ బడింది.అలాగే ధృతి కూడా!ధృతి అంటే చెబుతాను,విను.ధృతి అంటే స్థైర్యం అని అర్థం.ఒక లక్ష్యాన్ని ఛేదించేదానికి కావలసిన స్ధైర్యం,ధైర్యం,ఓర్పు,ధృఢత్వం...వీటన్నిటినీ కలిపి ధృతి అని అంటారు.
Tuesday, 22 July 2025
అయుక్తః ప్రాకృతః స్తబ్ధః
అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోఽలసః।
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే॥28॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!నీకు ఇప్పుడు సాత్త్విక,రాజస కర్తల గురించి చెప్పాను కదా!ఇంక మనము తామస కర్తల గురించి చెప్పుకుందాము.వీళ్ళకు ధైర్యము ఉండదు.ఆత్మస్ధైర్యము అసలే ఉండదు.మూర్ఖపు పట్టుదలలు,అభిమానాలు సదా ఆవహించి ఉంటాయి.మోసాలకు పాల్పడే గుణం పుష్కలంగా ఉంటుంది.ఎంత సేపూ దిగేడుస్తూ ఉంటారు ఎదుటి వారి ఆనందం చూసి,తమ ఓటమి తలచుకుంటూ.సమయపాలన అసలు పాటించరు.వృధాగా కాలయాపన చేసేదానికి ముందు వరసలో ఉంటారు.ఏ పనినీ ఇష్టంగా,మనసు పెట్టి చేయరు.ఇలా పని చేసేవాడిని తామస కర్త అని అంటారు.
Monday, 21 July 2025
రాగీ కర్మఫలప్రేప్సుః
రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకోఽశుచిః।
హర్ష శోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః॥27॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో చెబుతున్నాడు.అర్జునా!మనం ఫలాపేక్ష మాని,స్థిర చిత్తంతో కర్మలను ఆచరించేవాడు సాత్త్విక కర్త అని మాట్లాడుకున్నాము కదా!అలానే రాజస కర్త ఎలా ఉంటాడో చెబుతాను విను.ఇక్కడ తను చేసే ప్రతి పని యొక్క ఫలితం,అదే లాభనష్టాలు తనకే దక్కాలి అనే మానసిక స్థితిలో ఉంటాడు.అణువణువునా అహంకారము,అభిమానము,లోభగుణము తొణికిస లాడుతుంటాయి.తను అనుకున్న పని తను అనుకున్నట్లే జరగాలి అనే తపనలో హింసాపరుడు అవుతాడు.తన పని త్వర త్వరగా జరిగి పోవాలి అనే ఆదుర్దాలో శుచిని పాటించడు.అశుచిగా చేస్తుంటాడు.సుఖం వస్తే ఎగిరి గంతులేసి ఊరంతా సంబరాలు చేయడం,దుఃఖం వస్తే ముసుగేసుకుని,మూలన కూర్చొని దిగేడవడము చేస్తుంటాడు.అంటే ఫలితాలకు అలా విపరీతంగా చలిస్తూ ఉంటాడు.రెండిటినీ ఒకే రకంగా తీసుకోగలిగే స్ధిరచిత్తం, సమన్వయ శక్తి ఉండదు.ఇలాంటి నేపధ్యంలో కర్మలు ఆచరించే వారిని రాజస కర్త అని అంటారు.
Friday, 18 July 2025
ముక్తసంగోఽనహంవాదీ
ముక్తసంగోఽనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః।
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తాసాత్త్విక ఉచ్యతే॥26॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు వివిధ రకాల జ్ఞానాలు,కర్మల గురించి చెప్పాడు.ఇప్పుడు అర్జునుడికి కర్తల గురించి చెబుతున్నాడు.అర్దునా!మనం మూడు రకాల జ్ఞానములు,కర్మల గురించి ప్రస్తావించుకున్నాము కదా!ఇప్పుడు నీకు కర్తల గురించి కూడా చెబుతాను.మనసు పెట్టి విను.కర్త అంటే పని చేసేవాడు అని అర్థం కదా.సాత్త్విక కర్త ఎలా ఉండాలో,ఎలా ఉంటాడో చెబుతాను.మొట్ట మొదటగా అతను ఫలాపేక్షను వదిలి పెట్టాలి.అహంకారము ఇసుమంత కూడా ఉండకూడదు.తను చేసే కర్మల యొక్క ఫలితంలోని మంచి చెడ్డలకు తొణకకుండా,బెణకకుండా ఉండాలి.అంటే పర్యవసానము మనకు అనుకూలమా,ప్రతికూలమా అనే మీమాంస వదిలి పెట్టాలి.అంటే ఎలాంటి వికారాలకూ లోను కాకుండా,మనకు నిర్దేశించిన కార్యాలను మనసా,వాచా నిర్వర్తించాలి.ఆ కార్య నిర్వహణలో ఎలాంటి అనుకోని కష్ట నష్టాలు వచ్చినా,ఎదుర్కునే మానసిక స్థిరత్వం అలవరచుకోవాలి.చెయ్యాల్సి వచ్చిందే రామచంద్రా!అని విసుక్కుంటూ చేయకూడదు.మన కర్తవ్యాన్ని రెట్టింపు ఉత్సాహంతో చేపట్టాలి.దాని పర్యవసానం మనకు అనుకూలంగా ఉంటుందా,ప్రతికూలంగా ఉంటుందా అనే విషయంగా తర్జన భర్జనలను వదిలేసి,ఫలితం ఏమైనా ఊపు,ఉత్సాహంగా,నమ్మకంతో కార్య నిర్వహణ చేయాలి.అలాంటి వాడిని సాత్త్విక కర్త అని అంటారు.
Thursday, 17 July 2025
అనుబంధం క్షయం హింసా
అనుబంధం క్షయం హింసా మనపేక్ష్య చ పౌరుషమ్।
మోహా దారభ్యతే కర్మ యత్త త్తామస ముచ్యతే॥25॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక,రాజస కర్మలగురించి చెప్పాడు.ఇప్పుడు ఇంక తామస కర్మ గురించి వివరిస్తున్నాడు.అర్జునా!సాత్త్విక కర్మలు అంటే ఫలాపేక్ష,రాగద్వేషాలకు అతీతంగా చేసేవి,రాజస కర్మలు అంటే కర్మఫలాసక్తి,అహంకారాలతో చేసేవి అని చెప్పాను కదా!ఇప్పుడు ఇంక తామస కర్మల గురించి మాట్లాడుకుందాము.ఇక్కడ వ్యవహారం అంతా గొడ్డొచ్చి చేలో పడినట్లు ఉంటుంది.ఒక పని చేసే ముందు మంచి చెడ్డా ఆలోచించరు.కష్ట నిష్టూరాలను పరిగణలోకి తీసుకోరు.కామ రాగ మోహాలకు లోనై,మానసిక పరిపక్వత లేకుండా,మూర్ఖంగా కర్మలను ఆచరిస్తారు.ఇలాంటి వాటినే తామస కర్మలు అని అంటారు.
Tuesday, 15 July 2025
యత్తు కామేప్సునా కర్మ
యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః।
క్రియతే బహులాయాసం తద్రాజస ముదాహృతమ్॥24॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక కర్మల గురుంచి ఇప్పుడే చెప్పాడు.ఇంక ఇప్పుడు రాజస కర్మల గురించి ప్రస్తావిస్తున్నాడు.అర్జునా!సాత్త్విక కర్మలు అనేవి ఫలాపేక్ష రహితంగా చెయ్యాలని అర్థం అయింది కదా!ఇప్పుడు మనము రాజస కర్మల పూర్వాపరాలు మాట్లాడుకుందాము.ఇక్కడ వీరు చేసే ప్రతి పని దాని వలన వచ్చే లాభం గురించి బేరీజు వేసుకుని చేస్తారు.లాభం లేకపోతే పూచిక పుల్ల కూడా తీసి ప్రక్కన పెట్టరు.అహంకారానికి,గర్వానికి పోయి చేస్తారు.ఆ పనులు వారికి ఎంత కష్టమయినా గొప్పల కోసం చేస్తారు.అంటే అందరూ ఆహా!ఓహో! అని తమ గురించి అనుకోవాలనే తపన నరనరాన కనిపిస్తూ ఉంటుంది.ఇలా కర్మ ఫలాసక్తితో,అహంకార అభిమానాలతో చేసే మిక్కిలి కష్ట సాధ్యమయిన పనులను రాజస కర్మలు అని అంటారు.
Monday, 14 July 2025
నియతం సంగరహితం
నియతం సంగరహిత మరాగద్వేషతః కృతమ్।
అఫలప్రేప్సునా కర్మ యత్త త్సాత్త్విక ముచ్యతే॥23॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి మూడు రకాల ధర్మాల గురించి వివరించాడు.అర్జునా!ఇప్పుడు అర్థము అయిందా,మొదటగా ఫలాపేక్షను వదలగలగాలి మానవుడు అని. ఫలాపేక్షను వదిలి పెట్టి,అభిమానము,రాగము,ద్వేషము అనే భావాలకు దూరంగా,అతీతంగా ఉండాలి.ఎందుకంటే ఆ మనోస్థితిలో ఉండి చేసే విధిహిత కర్మలే సాత్త్విక మయిన కర్మలు.అంటే మన మానసిక ధృఢత్వాన్ని అంచెలంచెలుగా పెంచుకోవాలి.ఎందుకంటే స్థితప్రజ్ఞత అనేది అనుకోగానే రాదు.దానికోసం మనము సాథన చేయాలి.
Sunday, 13 July 2025
యత్తు కృత్స్నవదేకస్మి
యత్తుకృత్స్నవదేకస్మి న్కార్యే సక్తమహైతుకమ్।
అతత్త్వార్థవదల్పం చ త త్తామస ముదాహృతమ్॥22॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక జ్ఞానం,రాజస జ్ఞానం గురించి చెప్పాడు.ఇంక తామస జ్ఞానం గురించి చెబుతున్నాడు.అర్జునా!ఇప్పుడే నీకు సాత్త్విక,రాజస జ్ఞానాలగురించి చెప్పాను కదా!తామస జ్ఞానంఅనేది ఏ రీతిలో ఉంటుందో కూడా తెలుసుకో!ఈ కోవకు చెందిన వారు ఏది చూసినా,అదే అంతా సర్వస్వం అనుకుంటారు.ఒక దేహాన్ని చూసినా,ఒక వస్తువును చూసినా దాని చుట్టూరా భ్రమిస్తుంటారు.ఈ రకంగా తలచే తత్త్వ విరుద్ధము అయిన జ్ఞానాన్నే తామస జ్ఞానము అని అంటారు.అంటే ఒక రకంగా చెప్పాలంటే బావిలో కప్పలాగా అన్నమాట.వారి ప్రపంచము చాలా చిన్నది.ఒక మనిషిని కానీ,ఒక వస్తువును చూస్తే,దాని చుట్టూరానే వాళ్ళ ఆలోచనలు,కర్మలు,క్రియలు తిరుగుతుంటాయి.వాటినిదాటి విశాల విశ్వం,విశ్వంభరుడు గురించి తెలుసుకునే సమయం,జిజ్ఞాస,ఆలోచన వాళ్ళకు ఉండవు,అంటవు.
Saturday, 12 July 2025
పృథక్త్వేన తు యద్ జ్ఞానం
పృథక్త్వేన తు యద్ జ్ఞానం నానాభావాన్పృథగ్విధాన్।
వేత్తి సర్వేషు భూతేషు తద్ జ్ఞానం విద్ధి రాజసమ్॥21॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇప్పుడే చెప్పాడు కదా అన్ని భూతాలలో ఉండే ఆత్మ ఒకటే అని గ్రహించ గలిగే జ్ఞానము సాత్త్విక జ్ఞానము అని.ఇప్పుడు ఇంక రాజస జ్ఞానము గురించి చెబుతున్నాడు.అర్జునా!రాజస జ్ఞానము అంటే ఏందో చెబుతాను విను.ఇక్కడ విడివిడిగా కనిపించే భూతాలు చాలా లెక్కకు మిక్కిలి ఉంటాయి కదా!వాటన్నిటిలోనూ ఆత్మలు కూడా వేరు వేరుగా ఉంటాయని అనుకోవడమే రాజస జ్ఞానము అని అంటారు.
Friday, 11 July 2025
సర్వభూతేషు యేనైకం
సర్వభూతేషు యేనైకం భావ మవ్యయ మీక్షతే।
అవిభక్తం విభక్తేషు తద్ జ్ఞానం విద్ధి సాత్త్వికమ్॥20॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్దునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఇప్పుడే చెప్పుకున్నాము కదా జ్ఞానము,కర్మ,కర్త మూడేసి రకాలుగా ఉంటాయి అని.ఇప్పుడు మనము సాత్త్విక మయిన జ్ఞానము గురించి మాట్లాడుకుందాము.భూతాలు అన్నీ ఒకే రకంగా ఉండవు కదా!అన్నీ వేరు వేరుగా కనిపిస్తుంటాయి కదా?కానీ నీకు ఈ విషయం తెలుసా?అన్నిటిల్లోనూ నాశనం లేనిది,మార్పు లేనిది ఒకటి ఉంటుంది.అదే ఆత్మ!ఆ ఆత్మను గ్రహించ గలగటము అనేది చాలా పెద్ద ప్రక్రియ.ఈ వేరు వేరుగా కనపడే అన్ని భూతాలలోనూ అవినాశము,మార్పు లేక ఒక్కటిగా ఉండే ఆత్మను గ్రహించే జ్ఞానమే సాత్త్విక జ్ఞానము.
Thursday, 10 July 2025
జ్ఞానం కర్మ చ కర్తా చ
జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః।
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథాచ్ఛృణు తాన్యపి॥19॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
గురువుకు ఎంత ఓపిక ఉండాలి,ఎంత విషయ పరిజ్ఞానము ఉండాలి,దానిని శిష్యుని పరిణితికి తగినట్లుగా ఎలా విశదీకరించాలి అనేది మనకు శ్రీకృష్ణుడిని చూస్తే అర్థం అవుతుంది.అతను అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!జ్ఞానము,కర్మ,కర్త అనేవి సాంఖ్యా శాస్త్రము ప్రకారము మూడేసి విధాలుగా ఉన్నాయి.వాటిని కూడా నీకోసం వివరంగా విశదీకరిస్తాను.మనసు పెట్టి అర్థం చేసుకునేదానికి ప్రయత్నించు.
Wednesday, 9 July 2025
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా।
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మ సంగ్రహః॥18॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మలు,వాటి ప్రోత్సాహకాలు గురించి వివరిస్తున్నాడు.అర్జునా!రకరకాలు అయిన కర్మలను ప్రోత్సాహ పరచే కారణాలు మూడు ఉన్నాయి.అవి జ్ఞానము,జ్ఞేయము మరియు పరిజ్ఞాత.అలాగే కర్మ సంగ్రహము కూడా మూడు విధాలు ఉన్నాయి.అవి కర్త,కర్మ మరియు సాధనము.
జ్ఞానము అంటే విషయ పరిజ్ఞానము,విచక్షణ,పాండిత్యము.జ్ఞేయము అంటే తెలుసుకోవలసిన విషయము అని అర్థము.పరిజ్ఞాత అంటే అన్నీ తెలిసిన వ్యక్తి అని అర్థము.
Monday, 7 July 2025
యస్య నాహం కృతో భావో
యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే।
హత్వాపి స ఇమాం ల్లోకాన్న హంతి న నిబధ్యతే॥17॥శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి అంతా మంచిగా అర్థం కావాలని తాపత్రయ పడుతున్నాడు.అందుకే ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!మనిషికి కర్తృత్వం పట్ల మమకారం ఉండకూడదు.అహం అనేది అసలే ఉండకూడదు.అంటే అంతా నేనే చేస్తున్నాను,అంతా నాదే,అంతా నా చెప్పు చేతల్లో ఉంది అనే భావన,అహంకారము.ఎందుకంటే ఇవంతా మన అజ్ఞానానికి కొండ గుర్తులు.
కాబట్టి కర్తృత్వం పట్ల అహం లేని వాడూ,నేనే చేస్తున్నా అని అనుకునే అజ్ఞానం లేని వాడు చాలాగొప్ప.అతను ఈ లోకంలో అందరినీ తుద ముట్టించినా,ఆ పాపం అతనికి అంటదు.ఎందుకంటే అతని చర్యల్లో ప్రతిఫలాపేక్ష ఉండదు.స్వలాభం ఉండదు.అతను లోక కల్యాణం కోసమే చేస్తాడు కాబట్టి.
Friday, 4 July 2025
తత్రైవం సతి కర్తారం
తత్రైవం సతి కర్తార మాత్మానం కేవలం తు యః।
పశ్య త్యకృతబుద్ధిత్వా న్న స పశ్యతి దుర్మతిః॥16॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!కొన్ని పచ్చి నిజాలు ఉంటాయి.మనము వాటిని ఒప్పుకున్నా,ఒప్పుకోకపోయినా నిత్యము,సత్యము అయిన వాటిలో మార్పులు,చేర్పులు ఉండవు.మనము చేసే సమస్త కర్మలకూ ఆ అయిదే కారణము అనేది సత్యము,నిత్యము.కానీ బుద్ధి పరిపక్వత లేని వాడు అలా ఆలోచించడు,నమ్మడు.అన్నిటికీ కారణభూతుడు తానే అనే భ్రమలో,అహంకారంతో ఊగిసలాడుతుంటాడు.అపరిపక్వంగా ఆలోచించేవాడే అలా ఉంటే దుష్టబుద్ధి గలవారు,చెడుభావాలు కలవారు ఇంక ఎంతలా ఆలోచిస్తారో మన ఊహకే అందదు.
కాబట్టి మానవుడు అహంకారము,కామము,క్రోధము వదలక పోతే సన్నార్గములోకి రాలేడు అనేది ముమ్మాటికీ నిజము.
Thursday, 3 July 2025
శరీరవాజ్ఞ్మనోభి ర్యక్కర్మ
శరీరవాజ్ఞ్మనోభి ర్యత్కర్మ ప్రారభతే నరః।
న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః॥15॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి బాగా అర్థం కావాలని ఇంకా విపులంగా చెబుతున్నాడు.ఓ అర్జునా!నిజానికి నేను పైన చెప్పినట్లు శరీరం,అహంకారం,ఇంద్రియాలు,ప్రక్రియా పరమైన వివిధ కార్యాలు,పరమాత్మ ...ఈ అయిదే కర్తృత్వాన్ని నిర్వహిస్తున్నాయి.మనస్సు,వాక్కు,శరీరాలతో మనము చేసే ప్రతి ఒక్క గొప్పపనికి,నీచము అయిన పనికి ఈ అయిదే కారణాలు అని మర్చిపోవద్దు.కానీ అందరికీ ఈ విషయం అర్థం కావాలంటే బుద్ధి పరిపక్వత చెంది ఉండాలి కదా!అది అందరికీ ఉండదు కదా!బుద్ధి పరిపక్వత చెందనివాడూ,చెడుభావాల సుడిగుండంలో ఇరుక్కుపోయినవాడూ ఈ సాంఖ్య శాస్త్రాన్ని ససేమిరా నమ్మడు.అన్నిటికీ కర్త,కర్మ,క్రియ తానే అని భావిస్తూ,అజ్ఞానంలో మునిగి తేలుతుంటాడు.ఆ మాయలో మనిషి ఉన్నంతకాలం,అహంకారం అణువణువునా తొణికిసలాడుతుంటుంది.అతడు ఇక అంతా నేనే,నన్ను మించినవాడు లేడు ఈ ముల్లోకాలలో లేనే లేడు అనే మిడి మిడి జ్ఞానంతోనే సంచరిస్తూ ఉంటాడు.
Wednesday, 2 July 2025
అధిష్ఠానం తథా కర్తా
అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్।
వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమమ్॥14॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇంకా వివరంగా చెబుతున్నాడు.అర్జునా!మనస్సు,వాక్కు,శరీరాలతో మనిషి చేసే సమస్తము అయిన ఉచ్ఛ నీచ కర్మలకూ ఈ అయిదే కారణము.మనము గొప్ప పనులు చేసినా కారణం అవే.అలాగే నీచ,నికృష్టమయిన పనులు చేసినా ఆ అయిదే కారణము.ఆ అయిదు ఏందో మళ్ళీ చెబుతాను నీ కోసం,విను.అవి శరీరము,అహంకారము,పంచేంద్రియాలు,ప్రక్రియాపరము అయిన వివిధ కార్యాలు,పరమాత్మ.
Monday, 30 June 2025
పంచైతాని మహాబాహో
పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే।
సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్॥13॥
అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్।
వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమమ్॥14॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!సాంఖ్య శాస్త్రము ఏమి చెబుతుందో కూడా తెలిసుకుందాము మనము.అన్ని కర్మలకూ కారణం ఏందో ఈ శాస్త్రం మనకు విశదీకరిస్తుంది.శరీరం,అహంకారం,పంచేంద్రియాలు,ప్రక్రియాపరమైన వివిధ కార్యాలు,పరమాత్మ....అనబడే ఈ అయిదే,సమస్త కర్మలకూ కారణాలు అని సాంఖ్య శాస్త్రము చెబుతుంది.
Sunday, 29 June 2025
అనిష్ట మిష్టం మిశ్రం చ
అనిష్ట మిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్।
భవ త్యత్యాగీనాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్॥12॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ఞుడు అర్జునుడికి కర్మఫలాల గురించి వివరిస్తున్నాడు.అర్జునా!మనము ఇప్పుడు రకరకాల కర్మల గురించి,త్యాగాల గురించి చెప్పుకున్నాము కదా!ఇక కర్మ ఫలాల గురించి మాట్లాడుకుందాము.ఇష్టానిష్ట మిశ్రమములు అని కర్మ ఫలాలు మూడు రకాలు ఉన్నాయి.కామన గల వారికి ఆ ఫలాలు,ఫలితాలు పరలోకంలో అందుతాయి.అదే మనము కర్మ ఫలత్యాగుల గురించి మాట్లాడుకుందాము.కర్మ ఫలత్యాగులకు యెప్పుడూ ఆ ఫలితాలు తగులవు.అంటే అంటవు.తామరాకు మీద నీటి బొట్టు చందాన ఉంటుంది.
Saturday, 28 June 2025
న హి దేహభృతా శక్యం
న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్య శేషతః।
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీ త్యభిదీయతే॥11॥
శ్రీమద్భగవద్గీత.।।అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు భగవంతుడు.ఆయనకు మానవుల బలాలు,బలహీనతలు అన్నీ క్షుణ్ణంగా చెలుసు.ఆయన అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!దేహధారులకు కర్మలను అన్నిటినీ విడవటం అసాథ్యం.అది కూడని పని అని నాకూ తెలుసు.అందువల్ల నేను ఏమి చెబుతానో విని అర్థం చేసుకో.కర్మలను వదలడం పూర్తిగా మానవమాత్రులకు కుదరదు కాబట్టి,కనీసం కర్మఫలాన్ని వదులుకోగలగాలి.అలా కర్మఫలాన్ని వదలగలిగిన వాడే త్యాగి అని నా భావము.
Friday, 27 June 2025
న ద్వేష్ట్య కుశలం కర్మ
న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే।
త్యాగీ సత్త్వ సమావిష్టో మేధావీ ఛిన్న సంశయః॥10॥
శ్రీ మద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీ కృష్ణుడు అర్జునుడికి సాత్త్విక త్యాగము గురించి విడమరచి చెబుతున్నాడు.ఎందుకంటే మంచి విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పాలి,అర్థం అయ్యేలా,మనసుకు హత్తుకునేలా చెప్పాలి.మనము కూడా ఆచరిద్దాము అనే తృష్ణ ఎదుటివారిలో కలిగేలా చెప్పాలి.
అర్జునా!సత్త్వ గుణ ప్రధానంగా ప్రతి ఒక్కరూ వర్థమానులు కావాలి.అలా కావాలంటే మొదట ఆసక్తిని,ఫలాన్ని విడిచి కర్మలు చేయటానికి శ్రీకారం చుట్టాలి.ఇలా ప్రతి నిత్యం చేస్తూ,ఆత్మ జ్ఞానం పొందాలి.ఈ యజ్ఞంలో ఎలాంటి అనుమానాలకూ,సందేహాలకూ తావు ఇవ్వకూడదు.అలాంటి సందేహరహితుడు,ఆత్మజ్ఞాని దుఃఖాలను ఇచ్చే కర్మలను ద్వేషించడు.అంతేనా?అలాగే సుఖాలను ఇచ్చే కర్మలనూ ఆమోదించడు,ఇష్టపడడు.నిర్వికారంగా తన ధర్మాన్ని తాను పాటిస్తూ ముందుకు పోతాడు.
Thursday, 26 June 2025
కార్యమిత్యేవ యత్కర్మ
కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేఽర్జున।
సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగ స్సాత్త్వికో మతః॥9॥
శ్రీమద్భగవద్గీత..అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి త్యాగం అనేది సరిగ్గా ఎలా చేయాలో వివరిస్తున్నాడు.అర్జునా!ఇప్పుడే నీకు తామస,రాజస యోగాల గురించి చెప్పాను కదా!అలాగే వాటి వల్ల ఫలితం కూడా శూన్యం అని చెప్పాను కదా!ఇప్పుడు నీకు నేను సాత్త్విక త్యాగం గురించి చెబుతాను.ప్రతి ఒక్కరూ అది పాటిస్తే మంచిది.మానవుడు అనే ప్రతి జీవి శాస్త్రాలు చెప్పిన కర్మలను చేయాలి.అది తప్పించుకపనేదానికి కుదరదు.కానీ ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది.మనము ఆ కర్మలయందు ఆసక్తి లేకుండా చేయగలగాలి.అంటే నిర్వికారంగా అన్నమాట.మనము చేసే కర్మలవలన మనకు సంక్రమించే ఫలితం పైన ఎలాంటి ఆశలు పెంచుకోకూడదు.అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చేయగలగటం నేర్చుకోవాలి.ఇలా ఆసక్తినీ,కర్మఫలాన్నీ విడవగలిగి,సత్కర్మలు చేయగలగాలి.అలాంటి త్యాగాన్నే సాత్త్విక త్యాగము అంటారు.
Wednesday, 25 June 2025
దుఃఖమిత్యేవ యత్కర్మ
దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్త్యజేత్।
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్॥8॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!మూర్ఖత్వంతో చేసే త్యాగం తామస త్యాగం అని చెప్పాను కదా.ఇప్పుడు ఇంకో రకం త్యాగం గురించి చెబుతాను,విను.ఇక్కడ వీళ్ళు ఎక్కడ శరీరం అలుస్తుందో అని కలత చెందుతుంటారు.అందుకని శరీరకష్టానికి భయపడి వారు చేయాల్సిన కర్మలను చేయడం మానివేస్తారు.అంటే త్యాగం ముసుగులో పని దొంగలు అన్నమాట!దీనినే రాజస త్యాగము అంటారు.ఇలాంటి త్యాగాల వలన ఫలితం శూన్యము.కాబట్టి ఎవరమూ మన మన విధులను,చేయాల్సిన కర్మలను మానకూడదు.
Tuesday, 24 June 2025
నియతస్య తు సన్న్యాసః
నియతస్య తు సన్న్యాసః కర్మణో నోపపద్యతే।
మోహాత్తస్య పరిత్యాగ స్తామసఽ పరికీర్తితః॥7॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏది మంచో,ఏది కాదో ఓపికగా,నిదానంగా,అర్థం అయ్యేలా వివరిస్తున్నాడు.అర్జునా!ఎప్పుడూ ప్రతి ఒక్కరికీ విద్యుక్త కర్మలు,ధర్మాలు కొన్ని నిర్దేశితంగా ఉంటాయి.మానవుడు వాటినన్నిటినీ శ్రద్ధగా ఆచరించాలి.త్యాగం అన్నారని ఆ విద్యుక్త కర్మలను ఎప్పుడూ విడనాడకూడదు.అలాంటి త్యాగము ఎప్పటికీ న్యాయం,ధర్మము కాదు.ఎలాంటి శాస్త్రీయమయిన విశ్లేషణ,అవగాహన లేకుండా,పర్యవసానాలు ఆలోచించకుండా చేసే త్యాగము మూర్ఖత్వము అవుతుంది.దానినే తామస పరిత్యాగము అంటారు.
Monday, 23 June 2025
ఏతాన్యపి తు కర్మాణి
ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ।
కర్తవ్యా నీతి మే పార్థ నిశ్చితం మత ముత్తమమ్॥6॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!మానవుడు యజ్ఞము,దానము,తపము విడవకుండా చెయ్యాలని చెప్పాను కదా!అవి కూడా ఎలా చెయ్యాలో చెబుతాను విను.మనము చేసే ఏ కర్మలలోనూ ప్రతిఫలము ఆశించకూడదు.ఆశ,బంథము,మమకారము,లోభము,లాలస లేకుండా చేయగలగాలి.అంటే ఆ యజ్ఞాది కర్మలు అన్నిటినీ కూడా కర్తృత్వమమకారము,ఫలాపేక్షలు విడిచిపెట్టి చెయ్యాలి.అలానే చేయాలనేది నా నిశ్చితమయిన అభిప్రాయము.
Sunday, 22 June 2025
యజ్ఞదానతపః కర్మ
యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్।
యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్॥5॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
చిన్నప్పుడు బడిలో మన ఉపాధ్యాయులు మనకు ఎలా నేర్పిస్తారు?ఒకటికి పది సార్లు చెప్పిస్తారు.ఇంకో ఇరవై సార్లు పలక మీద దిద్దిస్తారు.వంద సార్లు చదివి ఒప్ప చెప్పమంటారు.మా గురువు అయితే అర్థరాత్రి గాఢనిద్రలో ఉన్నా,లేపి అడిగితే ఒక్క తప్పుకూడా లేకుండా,గడగడా చెప్పగలగాలి.అలా కంఠస్తం చెయ్యాలి అనేవారు.
ఈ విషయం మనందరికంటే ఆది గురువుకే ఇంకా బాగా తెలుస్తుంది కదా!అందుకనే ఆయన మంచి విషయాలను మరీ మరీ,ఒకటికి పది సార్లు చెబుతున్నాడు అర్జునుడికి.ఎందుకంటే మంచి విషయాలు పదే వినాలి,చదవాలి,వ్రాయాలి,అర్థం చేసుకోవాలి,మననం చేసుకోవాలి,ఆచరణలో పెట్టాలి.అంటే మన జీవిత విధానంలోకి అన్వయించుకోవాలి.ఎందుకంటే మనలో ఎంత మంది ఏక సంతగ్రాహులుఉంటారు?ఉన్నా మంచి విషయాలను అర్థం చేసుకుని,మననం చేసుకుంటూ,వారి జీవితాలలో అన్వయించుకుంటారు?కాబట్టి సాథన అవసరము.
అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి మరలా మరలా చెబుతున్నాడు.అర్జునా!కౌంతేయా!నేను చెప్పే యాగము,దానము,తపస్సు అనే మూడు కర్మలను జీవితంలో ఎప్పుడూ విడనాడ కూడదు.అవి మన జీవిత విథానంలో మమేకం అయిపోవాలి.ఎందుకంటావా?ఎందుకంటే అవి మనసును కల్మష రహితంగా తయారు చేస్తాయి.చిత్తశుద్థిని కలిగిస్తాయి.ప్రశాంతతను పొందేలా చేస్తాయి.
Saturday, 21 June 2025
నిశ్చయం శరణు మే తత్ర
నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ।
త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధ స్సంపకీర్తితః॥4॥
శ్రీకృష్ణుడికి అర్జునుడు అంటే అమితమైన అభిమానము,సద్భావము.అందుకే అర్జునుడిని భరతసత్తమ,పురుషవ్యాఘ్రము అని పిలుస్తున్నాడు.అంటే కృష్ణుడి దృష్టిలో అర్జునుడు ఎంతో ఉత్తముడు,వీరుడు,శూరుడు,ధైర్యము కలవాడు.అందుకే అతనిని పురుషులలో పులి,ఉత్తముడు అని మెచ్చుకోలుగా పిలుచుకుంటున్నాడు.
శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఓ పురుషవ్యాఘ్రమా!ఇప్పుడే మనము యజ్ఞ,దాన తపస్సులను ఎప్పుడూ మానవుడు విడనాడ కూడదని అనుకున్నాము కదా.అందులో త్యాగం గురించి చెప్పాలంటే,దానిలో మూడు రకాలు ఉంటాయి.
Friday, 20 June 2025
త్యాజ్యం దోషవది త్యేకే
త్యాజ్యం దోషవది త్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః।
యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే॥3॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!నీకు తెలుసు కదా!కర్మలు అన్నీ మనలని కట్టి పడవేసే బంధనాలు అని.కాబట్టి వాటిని వదిలి వేయడమే మంచిది,ఉత్తమమయిన మార్గము అని కొందరు అంటారు.ఇంకొందరు ఇలా కూడా చెబుతారు.యజ్ఞము,దానము,తపస్సు అనేవి జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించవలసిన నియమాలు,కార్యాలు.కావున వాటిని ససేమిరా ఎప్పుడూ విడువకూడదు అని మరింకొందరు చెబుతారు.
Thursday, 19 June 2025
కామ్యానాం కర్మణాం న్యాసం
శ్రీ భగవానువాచ....
కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః।
సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః॥2॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
గురువుకు ఎప్పుడూ శిష్యులకు మంచి మంచి విషయాలు చెప్పాలనిపిస్తుంది.అందునా,ఆ శిష్యులు ఇంకా ఇంకా తెలుసుకోవాలనే తపన కనబరచినప్పుడు చాలా ఆత్మానందం పొందుతారు.మరింత ఉత్సాహంతో ఇంకా చాలా చాలా కొత్త విషయాలు చెప్పిస్తారు.ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడి పరిస్థితి కూడా అలానే ఉంది.అర్జునుడు త్యాగము,సన్న్యాసము గురించి ఇంకా వివరించమనగానే శ్రీకృష్ణుడు చాలా ఆనందించాడు.రెట్టింపు అయిన ఉత్సాహంతో చెప్పడం ప్రారంభించాడు.
అర్జునా!మొదట వీటి రెండింటి గురించి పండితులు ఏమని అనుకుంటారో చెబుతాను విను.కామ్య కర్మలను మాని వేయడమే సన్న్యాసము అనుకుంటారు.కర్మ ఫలాలను విడిచి పెట్టడమే త్యాగమని నమ్ముతారు,చెబుతారు.
Wednesday, 18 June 2025
సన్న్యాసస్య మహాబాహో
అర్జున ఉవాచ...
సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్।
త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశినిషూదన॥1॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
అర్జునుడు శ్రీకృష్ణుడు ఇంత సేపూ చెప్పినదంతా వినమ్రంగా,శ్రద్ధాసక్తులతో విన్నాడు.ఇప్పుడు తనకు వచ్చిన అనుమానాలను బయటపెడుతున్నాడు.హే కృష్ణా!అసలు సవ్న్యాసము అంటే ఏమిటి?త్యాగము అంటే ఏమిటి!వీటన్నిటి వివిధ రకాలు,స్వరూపాలు ఏమిటి?ఇవంతా ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలని నా మనసు కుతూహల పడుతుంది.కావున నాకు వీటన్నిటి గురించి వివరంగా విశదీకరించు అని కోరుతున్నాడు.
Tuesday, 17 June 2025
అశ్రద్ధయా హుతం దత్తం
అశ్రద్ధయా హుతం దత్తం తప స్తప్తం కృతం చ యత్।
అసది త్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ॥28॥
ఇతి శ్రీ మద్భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశాధ్యాయః!!!!!
శ్రీమద్భగపద్గీత...సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇక అసత్ గురించి చెప్పి ఈ అధ్యాయము ముగిస్తున్నాడు.ఓ అర్జునా!హే పార్ధా!మనము ఏ పని చేసినా ఆ పని పైన ఇష్టము,నమ్మకము,శ్రద్ధ,నిష్ట,నియమాలు ఉండితీరాలి.కానీ అలా కాకుండా,లెక్కలేనితనంగా,అయిష్టంగా,అసంపూర్తిగా,అసంతృప్తిగా,అవగాహన లేకుండా,అశ్రద్ధగా,అతిశయంతో చేసే ఏ కార్యానికీ సత్ఫలితం దక్కదు.ఇలా శ్రద్ధారహితంగా చేసే హోమం,దానం,తపస్సు,మరియు ఇతర కర్మలు అన్నీ అసత్ గానే చెప్పబడతాయి.వాటి వలన ఎవరికీ ఎలాంటి ఉపయోగము ఉండదు.అలాంటి కర్మల వలన ఇహ పరలోకాలలో ఎక్కడా కూడా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.అంటే అలా చేసినా ఒకటే,చేయకపోయినా ఒకటే.పెద్ద తేడా ఏమీ ఉండదు.
Monday, 16 June 2025
సద్భావే సాధుభావే చ
సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే।
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే॥26॥
యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే।
కర్మచైవ తదర్థీయం స దిత్యే వాభిదీయతే॥27॥
శ్రీమద్భగవద్గీత..సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓం,తత్ పదాలు,శబ్దాల విశిష్టత వివరించాడు.ఇప్పుడు ఇక సత్ అనే శబ్దం గురించి వివరిస్తున్నాడు.ఓ అర్జునా!పార్థా!నీకు ఓం మరియు తత్ ల విశిష్టత బాగా అర్థం అయింది కదా!అలాగే సత్ అనే శబ్దం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము.
సత్ అనే శబ్దం మాములుగా అస్తిత్వము,శ్రేష్టము అనే అర్థాలలో వాడబడుతుంది.సత్ అంటే నిజము,నిత్యము,సత్యము కూడా అనుకోవచ్చు.
ఇకపోతే యాగాలలో,దానాలు చేసేటప్పుడు,తపస్సులలో ముఖ్య ఉద్దేశ్యము ఆ పరబ్రహ్మను చేరుకోవాలనే కదా!అలాంటి నిశ్చలమయిన,నిష్ఠ పరమాత్మను గూర్చి చేసే యాగాలు,దానాలు,తపస్సులు,సమస్త కర్మలు కూడా సత్ అని చెప్పబడుతున్నాయి.
Sunday, 15 June 2025
తది త్యనభిసంధాయ
త ది త్యనభిసంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః।
దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః॥25॥
శ్రీమద్భగవద్గీత...।సప్త దశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.ఇప్పుడు ఓంకారం ఎలా,ఎందుకు,ఎప్పుడు వాడుతారో చెప్పాను కదా!ఇప్పుడు ఇంక తత్ గురించి చెప్పుకుందాము.తత్ అంటే అది అని అర్థము.మోక్షకామములను తత్ అని శబ్దోచ్ఛారణ పూర్వకంగా పిలుస్తారు యోగులు,సన్యాసులు మరియు తాపసులు.ఎలాంటి ప్రయోజనాలు కోరకుండా చేసే యజ్ఞాలు,దానాలు,తపోకర్మలు అన్నీ తత్ అనే శబ్దోచ్ఛారణ పరస్పరంగా చేయబడుతున్నాయి.వాడబడుతున్నాయి.
Saturday, 14 June 2025
తస్మాదో మిత్యుదాహృత్య
తస్మాదో మిత్యుదాహృత్య యజ్ఞదానతపః క్రియాః।
ప్రవర్తంతే విధానోక్తా స్సతతం బ్రహ్మవాదినామ్॥24॥
శ్రీమద్భగవద్గీత...సప్త దశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓంకారం యొక్క విశిష్టతను వివరిస్తున్నాడు.అర్జునా!నీకు నేను ఓం తత్ సత్ గురించి,వాటి విశిష్టత గురించి ఇప్పుడే చెప్పాను కదా!వీటన్నిటిలోకి ఓం శబ్దం యొక్క ప్రాముఖ్యం చాలా ఉంది.దీనికీ కారణం ఉంది.ఈ సృష్టి మొత్తం ఓంకార నాదంతో మొదలు అయింది.కావున దీనికి చాలా విలువ,విశేషత ఉన్నాయి.దానిని మన పూర్వీకులు అందరూ నిశితంగా గుర్తించారు.కాబట్టే బ్రహ్మజ్ఞుల యాగాలు,దానాలు,తపస్సులు,ఇతర అనుష్టాన కర్మలు అన్నీ ఓంకార పూర్వకంగానే అనుష్ఠింపబడతాయి.
Thursday, 12 June 2025
ఓం తత్సదితి నిర్దేశో
ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ స్త్రివిధ స్మృతః।
బ్రాహ్మణాస్తేన వేదశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా॥23॥
శ్రీమద్భగవద్గీత...సప్తగశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఓం,తత్,సత్ అనే మూడు సంకేత పదాలు బ్రహ్మజ్ఞతకు సాధనాలుగా నిర్దేశించ బడినాయి.ఆ నిర్దేశాల వలనే వేదాలు,యజ్ఞాలు,బ్రాహ్మణులు కల్పించ బడటం జరిగింది.
ఓం అనేది బీజాక్షరం.ఓంకారం తోటే ఈ సృష్టి మొత్తం ఉద్భవించింది.కాబట్టి ఆ ఉచ్ఛారణ,ఆ అక్షరమూ మనకు చాలా పవిత్రమయినది.ఓం తత్సత్ అంటే సర్వోచ్ఛమయిన వాస్తవికత.అదే నిజం.ఏది వాస్తవికమయినదో అదే నిజం,అదే సంపూర్ణం.భగవంతుడే నిత్యమూ,సత్యమూ కాబట్టి ఆతని స్పృహలో ఉండాలి ప్రతి ఒక్కరూ.
Wednesday, 11 June 2025
ఆదేశకాలే యద్దాన
అదేశకాలే యద్దాన మపాత్రేభ్యశ్చ దీయతే।
అసత్కృత మనజ్ఞాతం తత్తామస ముదాహృతమ్॥22॥
శ్రీమద్భగవద్గీత..।సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు ఇప్పుడిపుడే సాత్త్విక,రాజస దానాల గురించి ప్రస్తావించాడు.ఇక మిగిలినది తామస దానము.దాని గురించి కూడా అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!నీకు సాత్త్విక,రాజస దానాలు ఎలా ఉంటాయో అవగాహనకు వచ్చింది కదా.ఇప్పుడు ఇక తామస దానం గురించి చెబుతాను,విను.ఇక్కడ దానం చేసేవారిలో లెక్క లేనితనం,ఆ ప్రక్రియ పట్ల నిర్లక్ష్యభావం అడుగడుగునా మనకు గోచరిస్తుంటుంది.దేశకాల పాత్రల గురించి అవగాహన లేమి ఉంటుంది.దానంతీసుకునే వారి పైన చులకన భావం,అగౌరవము ఉంటాయి.దేశకాల పాత్రల గురించి మంచిగా తెలుసుకుని,దానికి తగిన రీతిలో దానం చెయ్యాలనే స్పృహ ఉండనే ఉండదు.దానం చెయ్యాలా?చేసాము!అని చేతులు దులుపుకొని పోయే మనస్తత్త్వం ప్రస్ఫుటమవుతుంటుంది.ఇన్ని అవలక్షణాలతో చేసే దానాన్నే తామస దానం అంటారు.
యత్తు ప్రత్యుపకారార్థం
యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః।
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతమ్॥21॥
శ్రీమద్భగవద్గీత..।సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్కీకృష్ణుడు ఇప్పుడే సాత్త్విక దానంగురించి చెప్పాడు.ఇప్పుడు ఇక రాజసదానం ఎలా వుంటుందో వివరిస్తున్నాడు.అర్జునా!నీకు సాత్త్వికదానం గురించి చెప్పాను కదా.ఇప్పుడు రాజస దానం గురించి వివరిస్తాను.ఇక్కడ అన్నీ చేస్తారు.కానీ ఆ నిష్కపటం,నిర్మలత్వం,నిర్మోహం ఉండవు.ప్రతిఫలం కోరుకుంటారు అడుగడుగునా.మనం వాళ్ళకు ఇంత చేస్తే,ప్రత్యుపకారంగా వారి నుంచి మనము ఎంత ఆశించవచ్చు అని బేరీజు వేసుకుంటారు.దానం స్వీకరించే వాళ్ళ దగ్గరే కాకుండా,సంఘం నుంచీ కూడా.పేరు ప్రఖ్యాతులు,గౌరవ మర్యాదలు కోసం తహ తహలాడుతారు.ఇలా చేయటం వలన వాళ్ళకు కష్టమయినా వెనుకాడకుండా,ముందుకు పోతారు.దానం తీసుకున్న వాళ్ళు వారికి అణిగి మణిగి ఉండాలనుకుంటారు.వీళ్ళ గుణగణాలు,దాతృత్వం గురించి ఊరూరా కథలు కథలుగా చెప్పుకోవాలి అని కోరుకుంటారు.దీనినే రాజస దానం అని అంటారు.
Tuesday, 10 June 2025
దాతవ్యమితి యద్దానం
దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే।
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతమ్॥20॥
శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి యజ్ఞము,తపస్సుల గురించి వివరించాడు.ఇప్పుడు దానాలలో రకాల గురించి చెబుతున్నాడు.ఓ అర్జునా!పుణ్యస్థలాలలో దానం చేయటము అనే ప్రక్రియ కర్తవ్యము అనుకోవాలి ప్రతి ఒక్కరూ.దానం చేయమన్నారు కదా అని ఏదో ఒకటి ఇచ్చేసి,చేతులు దులిపేసుకో కూడదు.మనము చేసే దానము దేశకాల పాత్రలకు అనుగుణంగా,అనుసరించి ఉండాలి.అంటే వివరంగా చెబుతాను విను.ఆ ప్రాంతంలో వారికి ఏది అవసరమో కనుక్కొని ఇవ్వగలగాలి.అంటే మనము చేసేది వారికి ఉపయోగ పడాలి.అలాగే కాలానికి సరిపోయేటట్లుగా.అంటే చలికాలంలో దుప్పటి ఇస్తే పనికి వస్తుంది.ఎండా కాలంలో నీరు,నీడ,గాలి అవసరము.కాబట్టి చలివేంద్రాలు,ఎండ నుంచి కాపాడుకునేదానికి,ఉక్క నుంచి ఉపశమనానికి ఉపకరణాలు సమకూర్చడం లాంటివి.అలానే అవసరంచూసి,అవసరము అయినవారికి చేయాలి.అపాత్ర దానం చేయకూడదు.అలా సహాయ సహకారాలు అందిచడంలో మనము ఎలాంటి ప్రతిఫలం ఆశించకూడదు.మనకు ఉపయోగము పొందేవారి నుంచి ఎలాంటి ఉపయోగము,లాభము ఉండకూడదు.ఇలా చేసే దానాలను సాత్త్వికమయిన దానం అంటారు.
Monday, 9 June 2025
మూఢగ్రాహేణాత్మనో
మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః।
పరస్యోత్సాదనార్థం వా తత్తామస ముదాహృతమ్॥19॥
శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు ఇంత సేపూ సాత్త్విక తపస్సు గురించి,రాజస తపస్సు గురించి చెప్పాడు.ఇప్పుడు ఇక తామస తపస్సు గురించి అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!సాత్త్విక,రాజస తపస్సులు ఎలా ఉంటాయో అర్థం అయింది కదా.ఇప్పుడు ఇంక తామస పరమయిన తపస్సు గురించి వివరిస్తాను.ఇది ఎంత సేపూ ఎలా ఎదుటివారికి ఏ ఏ రీతులలో హాని చేయగలము అనే దురుద్దేశంతోనే ఉంటుంది.ఈ క్రమములో వారిని వారే హింసించుకునేదానికి కూడా వెనుకాడరు.సమయాసమయాలు,ఇంగితము,విచక్షణ ఏమీ ఆలోచించరు.ఎంత సేపూ మూర్ఖపు పట్టుదలలకు పోయి వారిని వారే నాశనం చేసుకోవటం కాకుండా ఎదుటి వారినీ,అయినవారిని కూడా ఇబ్బందికి గురి చేస్తూ బాధ పెడుతుంటారు.ఇలాంటి మూర్ఖపు పట్టుదలలకు పోయి చేసే తపస్సునే తామసిక మయిన తపస్సు అంటారు.అర్జునా!ఈ మార్గంలో ఎప్పుడూ పయనించకు.
Sunday, 8 June 2025
సత్కారమానపూజార్థం
సత్కారమానపూజార్థం తపో దంభేన చైవ యత్।
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధృవమ్॥18॥
శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయవిభాగయోగము
కృష్ణుడు అర్జునుడికి మొదట సాత్త్వికమయిన తపస్సు గురించి చెప్పాడు కదా.ఇప్పుడు రాజస తపస్సు గురించి వివరిస్తున్నాడు.అర్జునా!ఇక మనము రాజస తపస్సు గురించి మాట్లాడు కుందాము.వీరు ఎప్పుడూ పరుల నుండి గుర్తింపు ఆశిస్తుంటారు.దాని కారణంగా గౌరవం ఎక్కడెక్కడ దొరుకుతుందా అని అన్వేషిస్తూ ఉంటారు.మనలను ఎదుటివారు సత్కరించాలంటే ఏమి చేయాలి అని ఆలోచిస్తుంటారు.వారి ఆలోచనలకు తగినట్లుగానే వారి కార్యాచరణ ఉంటుంది.అదే!పరులనుండి గౌరవ సత్కారాలు ఆశిస్తూ,డంబంతో చేసే తపస్సునే రాజస తపస్సు అంటారు.మనము ఎలా చేస్తామో,దాని ఫలితాలు కూడా అలానే ఉంటాయి కదా!కాబట్టి వీరు చేసే పనులకు సంబంధించి ఫలితం కూడా అల్పంగా,అంతంత మాత్రంగానే ఉంటుంది.
Saturday, 7 June 2025
శ్రద్ధయా పరయా తప్తం
శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః।
అఫలాకాంక్షిభిర్యుక్తై స్సాత్త్వికం పరిచక్షతే॥17॥
శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి క్లుప్తంగా సాత్త్విక తపస్సు గురించి చెబుతున్నాడు.అర్జునా!మనం చేసే ప్రతిపనిలోనూ ప్రతిఫలం ఆశించకూడదు.మనసును నిర్మలంగా,నిశ్చలంగా ఎల్లప్పుడూ ఉంచుకోగలగాలి.చేసే ప్రతి పనిని శ్రద్ధాసక్తులతో చేయాలి.ఈ మూడు కార్యాలను నియమ నిష్ఠలతో ఆచరించడమే మూడు రకాల సాత్త్విక తపస్సు అంటారు.సాత్త్వికమంటే ఇంతకంటే వేరే ఇంకేమీ లేదు.
Friday, 6 June 2025
మనః ప్రసాదస్సౌమ్యత్వం
మనః ప్రసాదస్సౌమ్యత్వం మౌన మాత్మవినిగ్రహః।
భావసంశుద్ధి రిత్యేత త్తపో మానసముచ్యతే॥16॥
శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంతకు ముందు శరీరం తో చేసే తపస్సు,మాటలు అదే వాక్కుతో చేసే తపస్సు గురించి చెప్పాడు కదా!ఇప్పుడు మనసుతో చేసే తపస్సు గురించి చెబుతున్నాడు.
అర్జునా!ఇప్పుడు నేను నీకు మనసుతో చేసే తపస్సు గురించి చెబుతాను.శ్రద్ధగా విను.మన మనసు నిశ్చలంగా ఉండాలి.మాటలలో,చేతలలో లాగే భావరూపకంగానూ మృదుత్వం ఉండాలి.మౌనం ముఖ్యంగా ఉండాలి.ఎందుకంటే మౌనంగా ఉన్నప్పుడే మనము మనలని విశ్లేషించుకునే సమయం,సందర్భం దొరుకుతుంది.చెడు ఆలోచనలనుంచి బయటపడాలి.అప్పుడే కదా మన అంతఃకరణ శుద్ధిగా ఉంటుంది.
నిశ్చలమయిన మనస్సు,మృదుత్వం,మౌనము,శుద్ధమయిన అంతఃకరణము కలిగి ఉండటానినే మనసుతో చేసే తపస్సు అంటారు.
Wednesday, 4 June 2025
అనుద్వేగకరం వాక్యం
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్।
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే॥15॥
శ్రీమద్భగవద్గీత..సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు ఇప్పుడు ఇంక వాక్కులతో చేసే తపస్సు గురించి అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఇంత సేపూ మనము ఏమి మాట్లాడుకున్నాము?ఆహారపు అలవాట్లు,శరీరంతో చేసే తపస్సు,యజ్ఞాలలో రకాల గురించి చెప్పుకున్నాము కదా!ఇప్పుడు ఇంక వాక్కులతో చేసే తపస్సు ఎలా ఉంటుందో చెబుతాను,విను.మన మాట తీరు ఎదుటివారు బాధ పడేలాగా ఉండకూడదు.సత్యమే ఎల్ల వేళలా మాట్లాడాలి.అవీ ఎలా ఉండాలంటే,వినసొంపుగా,ప్రియంగా,మనసుకు హత్తుకునేలా ఉండాలి.వేదభ్యాసం చేయాలి.వీటినే వాక్కులతో చేసే తపస్సు అంటారు.
Tuesday, 3 June 2025
దేవ ద్విజ గురు ప్రాజ్ఞ
దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవమ్।
బ్రహ్మ చర్య మహింసా చ శారీరం తప ఉచ్యతే॥14॥
శ్రీమద్భగవద్గీత....సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి తపస్సు ఏ ఏ రకాలుగా ఆచరించ వచ్చో వివరంగా చెబుతున్నాడు.అర్జునా!ఇంత సేపు మనము వివిధ రకాలు అయిన యజ్ఞాల గురించి మాట్లాడు కున్నాము కదా!ఇప్పుడు తపస్సులలో రకాల గురించి నీకు వివరంగా చెబుతాను.మనసు పెట్టి శ్రద్ధగా ఆలకించు.ఇప్పుడు నీకు నేను శరీరంతో చేసే తపము గురించి చెబుతాను.మనము దేవతలను,బ్రాహ్మణులను,గురువులను,పెద్దలను పూజించాలి.శుచి,శుభ్రత పాటించాలి.మన జీవన శైలిలో సరళత్వం గోచరించాలి.విశృంఖలత్వం లేకుండా బ్రహ్మచర్యం పాటించాలి.ఇతర ప్రాణుల పైన హింస విడనాడి అహింసా మార్గంలో పయనించాలి.
ఇక ముఖ్యంగా ఆర్జవము పాటించాలి.అంటే మనసులో కల్మషం లేకుండా ఉండాలి.మనసులో ఒకటి,బయటకు ఇంకొకటిగా ఉండకూడదు.నిజాన్ని నిర్భయంగా,నిస్సందేహంగా చెప్పగలగాలి.రాముడికి లాగా ఒకటే మాట,ఒకటే బాణం లాగా ఉండాలి.ద్వంద్వాతీతంగా ఉండాలి.అంటే అటు ఇటుగా కాకుండా,ఒకటే మంచి దారిలో నడవాలి.
ఇలా ఉండగలగటాన్ని శరీరంతో చేసే తపస్సు అంటారు.
Monday, 2 June 2025
విధిహీనమసృష్టాన్నం
విధిహీనమసృష్టాన్నం మన్త్రహీనమదక్షిణమ్।
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే॥13॥
శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి తామస యజ్ఞం గురించి చెబుతున్నాడు.అర్జునా!ఇప్పుడు మనము తామస యజ్ఞం గురించి మాట్లాడుకుందాము.తామసులు ప్రతిపనిని మౌళికంగా శ్రద్ధా,నిష్టా,నియమాలు లేకుండా చేపడతారు.శాస్త్రాన్ని అనుసరించి చేయరు.కాబట్టి ఏ కోశానా శాస్త్రవిధి కానరాదు.యజ్ఞం కాగానే అన్నదానం చేయటం సర్వత్రా శుభదాయకం.కానీ వీరు ఆ జోలికి పోరు.మంత్రం యొక్క పవిత్రత గుర్తించి ఆచరించరు.యజ్ఞ యాగాదులు చేసిన పిదప వచ్చిన వారికి దక్షిణ తాంబూలాలు ఇవ్వటం ఆచరణ యోగ్యం.కానీ వీరు దానిని ససేమిరా ఆచరించరు.
అంటే పద్ధతి ప్రకారం ఏదీ చేపట్టరు.చేసే ప్రతి పనినీ అహంకార పూరితంగా,అజ్ఞానంతో,లెక్కలేనితనంతో చేస్తారు.
Saturday, 31 May 2025
అభియంధాయ తు ఫలం
అభిసంధాయ తు ఫలం దమ్భార్థమపి చైవ యత్।
ఇజ్యతే భరతశ్రేష్ట తం యజ్ఞం విద్ధి రాజసమ్॥12॥
శ్రీమద్భగవద్గీత....సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి రాజస యజ్ఞం గురించి వివరిస్తున్నాడు.హే అర్జునా!భరతులలో శ్రేష్టుడా!నా ఈ మాటలు విని అర్థం చేసుకో!మాములుగా మనం ఏ పనీ ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి.గొప్పలకు పోయి సమాజం లో,తనవారిలో గుర్తింపుకోసం చేయకూడదు అని చెప్పాను కదా!కానీ ఫలాపేక్షతో కానీ,డాంబికానికి గానీ యజ్ఞం చేసే వర్గం ఉంటుంది.అలా చేయబడే యజ్ఞాన్ని రాజస యజ్ఞంగా భావించు,గ్రహించు.
Friday, 30 May 2025
అఫలాకాంక్షి భిర్యజ్ఞో
అఫలా కాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే।
యష్టవ్య మేవేతి మన స్సమాధాయ స సాత్త్వికః॥11॥
శ్రీమద్భగవద్గీత..సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక యజ్ఞం గురించి చెబుతున్నాడు.అర్జునా!కౌంతేయా!ఇప్పుడు నీకు నేను సాత్త్విక పరమయిన యజ్ఞం గురించి చెబుతాను.మనసు పెట్టి విని అర్థం చేసుకో.ఏది అయినా మనం మనసు పెట్టి,శాస్త్రాన్ని అనుసరించి చెయ్యాలి.అందునా యజ్ఞం అంటే నిష్ట నియమాలుకూడా అవసరము.సమాహిత చిత్తంతో చేయాలి.అంటే మనము చేసే ఏ పని కూడా మన ఒక్కరికే కాదు అందరికీ మంచి చేకూరేలా ఉండాలి.ఎంత సేపూ ఇది చేస్తే నాకేంటి?అనే భావన లేకుండా ప్రతి ఫలం ఆశించకుండా చేయాలి.ఇలా ఫలాపేక్ష లేకుండా చేసే యజ్ఞాన్నే సాత్త్విక యజ్ఞం అంటారు.
Thursday, 29 May 2025
యాతయామం గతరసం
యాతయామం గతరసం పూతిపర్యుషితం చ యత్।
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్॥10॥
శ్రామద్భగవద్గీత...సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి తామసుల యొక్క ఆహారపు అలవాట్లు గురించి చెబుతున్నాడు.అర్జునా!ఇప్పుడు ఇంక తామసులు ఇష్టంగా ఏమేమి తింటారో మాట్లాడుకుందాము.వాళ్ళకు జాము క్రితం వండినది నచ్చుతుంది.అది శక్తి ఇచ్చేది కాకపోయినా,సారహీనమయినా సరే!చెడిపోయి,దుర్వాసన వస్తూ,పాచిపోయిన ఆహారం నచ్చుతుంది.ముందరరోజు వండినది,వేరేవాళ్ళు తినగా మిగిలినది,అపవిత్రమయినది,అశుద్ధమయినదీ అయిన ఆహారం తామసులకు ప్రీతిని ఇస్తుంది.సహజంగా నిన్న,మొన్న వండిన ఆహార పదార్థాలకు ఇలాంటి గుణాలు ఉంటాయి.
Wednesday, 28 May 2025
కట్వామ్ల లవణాత్యుష్ణ
కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణరూక్ష విదాహినః।
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః॥9॥
శ్రీమద్భగవద్గీత..।।సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి రాజసులకు ఏది ప్రీతికరమో చెబుతున్నాడు.వాటి పర్యవసానం కూడా చెబుతున్నాడు.అర్జునా!ఇప్పుడు ఇంక రాజసులు ఎలాంటి ఆహారం ఇష్ట పడతారో చెబుతాను.వాళ్ళు చేదు,పులుపు,ఉప్పులు,కారాలు ఎక్కువగా ఇష్టపడతారు.ఇంకా అతివేడి,అతి కారం,ఎండి పోయినవి,దాహంకలిగించే ఆహారమంటే మక్కువ చూపిస్తారు.వీటిని వాళ్ళు ఇష్టంగా తింటారు.ఈ ఆహారపు అలవాట్ల వలన కార్యక్రమేణ పరిణామావస్థలో దుఃఖాన్నీ,వ్యాకులతను మూటకట్టుకుంటారు.ఇవి చాలా మటుకు రోగకారకాలు.కాబట్టి రోగాల బారిన పడుతుంటారు.
Tuesday, 27 May 2025
ఆయు స్సత్త్వ బలారోగ్య
ఆయు స్సత్త్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః।
రస్యా స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారా స్సాత్త్వికా ప్రియాః॥8॥
శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్వికమయిన ఆహారపు అలవాట్లగురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ కౌంతేయా!నీకు నేను ఇప్పుడు సాత్త్విక పరమయిన ఆహారపు అలవాట్లు గురించి చెపుతాను.వాటిని ఆకళింపు చేసుకో.సాత్త్విక మయిన ఆహారం మన ఆయువుని వృద్ధి చేస్తుంది.అంతే కాదు సుమా!మనలో ఉత్సాహాన్ని నింపుతుంది.బలాన్ని పెంచుతుంది.ఆరోగ్యాన్ని సర్వ వేళలా కాపాడుతుంఒది.సుఖాన్ని,ప్రీతిని పెంపొందిస్తుంది.ఆ ఆహారం రుచికరంగా ఉంటుంది.చమురు కలిగి ఉంటుంది.పుష్టిని కలిగిస్తుంది.అలాంటి ఆహారమే సాత్త్వికమయిన ఆహారము.
Monday, 26 May 2025
కర్శయన్త శ్శరీరస్థం
కర్శయన్త శ్శరీరస్థం భూతగ్రామ మచేతసః।
మాం చై వాన్తశ్శరీరస్థం తాన్విద్ధ్యాసురనిశ్చయాన్॥6॥
ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః।
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు॥7॥
శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగయోగము
శ్రీకృష్ఞుడు అర్జునుడికి మనకు ఉండవలసిన ఆహారపు అలవాట్లను కూడా చెబుతున్నాడు.దీనితో అర్థం అవుతుంది కదా శ్రీకృష్ణుడు ఎంత నిదానంగా,ఓపికగా,అర్థం అయ్యేలా,అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్లుగా చెబుతున్నాడో!ఆసుర స్వభావం కలవారు వారితో బాటే నన్ను కూడా క్షోభ పెడతారు అని చెప్పాను కదా!వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో చెబుతాను.అలాగే వారి తపస్సు,దానం చేసే ప్రక్రియలు కూడా ఎలా ఉంటాయో చెబుతాను.ఎందుకంటే ఇవన్నీ కూడా తమ తమ గుణాలను అనుసరించే ఉంటాయి.వాటిని కూడా విను.
అన్నం ఉడికిందా లేదా అనేదానికి ఒక మెతుకు పట్టుకుని చూస్తే సరిపోతుంది కదా!అలానే ఒక మనిషి స్వభావం వారి ప్రతి కదలికలో,హావభావాలలో ఎదుటివారికి తెలిసిపోతుంది.ఒక నవ్వు,ఒక చూపు,ఒక పలుకు చాలు.
Sunday, 25 May 2025
అశాస్త్రీయ విహితం ఘోరం
అశాస్త్ర విహితం ఘోరం తప్యన్తే యే తపో జనాః।
దమ్భాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః॥5॥
కర్శయన్త శ్శరీరస్థం భూతగ్రామ మచేతసః।
మాం చై వాన్తశ్శరీరస్థం తాన్విద్ధ్యాసురనిశ్చయాన్॥6॥
శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగయోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓపికగా వివరిస్తున్నాడు.అర్జునా!శాస్త్రం మనలని కొన్ని చేయమంటుంది .ఇంకొన్నిటికి దూరంగా ఉండమంటుంది.పదే పదే వద్దని వారిస్తుంటుంది.వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకొని,మనకు అన్వయించుకోవాలి.శాస్త్ర నిషిద్ధాలు అయిన తపస్సులను,దారుణమయినటువంటి కర్మలను చేయకూడదు.అలాంటి దుష్కర్మలు చేసేవారు దంభాహంకార కామరాగాలతో కూడిన వారు అవుతారు.వాళ్ళు వాళ్ళ శరీరాలను,ఇంద్రియాలను కష్టపెడతారు.అది అంతటితో ఆగిపోదు.చివరకు వారి వారి శరీరాలలో ఉండే నన్నుకూడా క్షేభ పెడతారు.ఇలా చేసే వారందరూ అసుర స్వభావం కలవారే.ఆ విషయాన్ని గ్రహించు.
Saturday, 24 May 2025
యజన్తే సాత్త్వికా దేవా
యజన్తే సాత్త్వికా దేవా న్యక్షరక్షాంసి రాజసాః।
ప్రేతా న్భూత గణాం శ్చాన్యే యజన్తే తామసా జనాః॥4॥
శ్రీమద్భగవద్గీత..।సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
సర్వ ప్రాణికోటికీ భగవంతుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువు మానవాకారంలో శ్రీకృష్ణుడుగా జన్మించి,సహవాసి అయిన అర్జునుడితో యుద్ధభూమిలో నిలబడి ఇలా అంటున్నాడు.అర్జునా!నేను నీకు ఇప్పుడే మూడు రకాలు అయిన శ్రద్ధలగురించి ప్రస్తావించాను కదా!అవే సాత్త్విక,రాజస,తామస శ్రద్ధలు.అలా ఎందుకు ఆ ఆ శ్రద్దలు అలా ఉత్పన్నమవుతాయో చెబుతాను,విను.సహజంగా సాత్త్వికులు దేవతలను పూజిస్తారు.కాబట్టి వారికి సాత్త్వికమయిన శ్రద్ధలు అలవరుతాయి.అదే రాజసులు యక్షరాక్షసాదులని పూజిస్తారు.కావున వారికి రాజస పరమయిన శ్రద్ధలు ఏర్పడతాయి.చివరికి తామసుల గురించి చెప్పుకుందాము.వీరు భూతప్రేతాలను పూజించేదానికి మక్కువ చూపిస్తారు.అలాగే వాటిని పూజిస్తుంటారు.తదనుగుణంగా వారికి తామస శ్రద్ధలు ఉత్పన్నమవుతాయి.
Friday, 23 May 2025
సత్త్వానురూపా సర్వస్య
సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత।
శ్రద్ధామయోఽయం పురుషో యో య చ్ఛ్రద్ధ స ఏవ సః॥3॥
శ్రీమద్భగవద్గీత..।సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!ఓ భారతా!సర్వప్రాణికోటికి అంతఃకరణమనేది ఒకటి ఉంటుంది కదా!వారి వారి అంతఃకరణాన్ని అనుసరించి శ్రద్ధ అనేది పుడుతుంది.శ్రద్ధ లేనివాడు అసలు ప్రాణులలో లేనేలేడు.ఒకడిలో శ్రద్ధ అనేది ఏరూపంలో,ఏమాత్రంగా ఎలా ఉంటుందో,వాడూ అలాంటి వాడే అవుతాడు.శ్రద్ధ అంటే ఒక విషయం పైన మనకు ఉండే నమ్మకం,నిష్ట,నియమాలు.మనకు దేని పైన అయినా నమ్మకం ఉంటేనే కదా దానిని ఆచరిస్తాము.కాపాడుకుంటాము.చెడిపోకుండా చూసుకుంటాము.చెడగొట్టకుండా ఉంటాము.ఈ కార్యాలనే నిష్ట,నియమాలు అంటాము.
Thursday, 22 May 2025
త్రివిధా భవతి శ్రద్ధా
శ్రీ భగవానువాచ...
త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా।
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు॥2॥
శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి వచ్చిన అనుమానాలన్నిటినీ ఓపికగా విన్నాడు.ఇంక సందేహ నివృత్తి చేసేదానికి నడుము బిగించాడు.అర్జునా!ఈ ఆత్మలు మనష్యులు చిరుగిన బట్టలు మార్చినట్లుగా శరీరాలను మారుస్తాయి అని చెప్పాను కదా!కాబట్టి ఎవరికి వారికి వారి వారి పూర్వజన్మల వాసనలు ఉంటాయి.ఆ పూర్వజన్మల వాసనలను అనుసరించి ప్రాణులకు సహజంగానే సాత్త్విక,రాజస,తామస గుణాలు,లేక వాటి పట్ల శ్రద్ధ,మక్కువ ఏర్పడతాయి.వాటిని అన్నిటి గురించి చెబుతాను,విను.
Wednesday, 21 May 2025
యే శాస్త్ర విధి ముత్సృజ్య
అర్జున ఉవాచ...
యే శాస్త్ర విధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః।
తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వ మాహో రజస్తమః॥1॥
శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
కృష్ణుడు చెప్పిందంతా అర్జునుడు మనసు లగ్నం చేసి విన్నాడు.మంచి విద్యార్ధులకే అనుమానాలు వస్తాయి.ఎందుకంటే వాళ్ళలో గురువు చెప్పేదంతా ఆకళింపు చేసుకోవాలనే తపన ఉంటుంది.ఆ క్రమంలోనే అనుమానాల దొంతరలు బయటపడతాయి.వీటన్నిటికీ గురువు అనేవాడు ఓపికగా సందేహ నివృత్తి చేయాలి.అప్పుడే ఆగురుశిష్యుల బంధం బలపడుతుంది.శిష్యుడు మంచిగా ఎదిగేదానికి దోహద పడుతుంది.
ఇక్కడ కూడా అలాగే అర్జునుడు తనకు వచ్చిన అనుమానాలు,సందేహాలను అన్నిటినీ కృష్ణుడి ముందు ఉంచుతున్నాడు.
కృష్ణా!హే యాదవా!శాస్త్ర విధులను అందరూ సరిగ్గా నిర్వర్తించలేరు కదా!ఒక్కొక్కసారి అతిక్రమించాల్సి వస్తుంది కదా!అతిక్రమిస్తారు కూడా.అలా శాస్త్ర విధిని అతిక్రమించినప్పటికీ కూడా శ్రద్ధతో పూజలు చేసేవారు ఏ కోవలోకి వస్తారు?వారు సాత్త్వికులా,రాజసులా లేక తామసులా?వారి ఆచరణ ఎలాంటిది?
Tuesday, 20 May 2025
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ।
జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి॥24॥
శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగ యోగోనామ షోడశోఽధ్యాయః!!!!
శ్రీమద్భగవద్గీత...షోడశోధ్యాయము
దైవాసుర సంపద్విభాగ యోగము
కృష్ణుడు అర్దునుడికి ఇలా సలహా ఇస్తున్నాడు.అర్జునా!నీకు దైవాంశలో పుట్టిన వారి గుణగణాలు,ఆసురీ అంశతో పుట్టిన వారి గుణగణాలు విఫులంగా విశదీకరించాను కదా!యుక్తాయుక్త విచక్షణకు ప్రతి ఒక్కరికీ వేదశాస్త్రాలే ప్రామాణికాలు.కాబట్టి అందరూ వాటిలో చెప్పబడిన ధర్మాలనే గ్రహించాలి.ఆ ధర్మాలకు అనుగుణంగా మన కర్మలను పాటించాలి.వాటిని ఎప్పుడూ అతిక్రమించకూడదు.ఇది నా హితవు.
ఇట్లు ఉపనిషత్తు,బ్రహ్మవిద్య,యోగశాస్త్రముగా పేరొందిన శ్రీ కృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగ యోగము అనే పదహారవ అధ్యాయము సమాప్తము అయినది!!!!
Monday, 19 May 2025
య శ్శాస్త్రవిధి ముత్సృజ్య
య శ్శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః।
న స సిద్ధి మవాప్నోతి న సుఖం న పరాం గతిమ్॥23॥
శ్రీమద్భగవద్గీత..।షోడశోధ్యాయము
దైవాసుర సంపద్విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి ఖరాఖండిగా ఈ విషయం చెబుతున్నాడు.అర్జునా!వేదశాస్త్రాలు అనేవి సర్వ మానవ కోటికి ప్రామాణికాలు.అవి చెప్పిన మాటలోనే,బాటలోనే ప్రతి ఒక్కరూ నడుచుకోవటం సర్వమానవాళికి ఉత్తమం.వాటిని అతిక్రమించే హక్కు ఎవరికీ లేదు.అంతా మా ఇష్టం.మాకు నచ్చినదే చేస్తాము,నచ్చినట్లే ఉంటాము అనుకునే స్వేచ్ఛాచార పరాయణులు కొందరు ఉంటారు.వాళ్ళకు అథోగతి అనివార్యం.వాళ్ళ దుష్కర్మలకు శాంతి దక్కే మార్గమేలేదు.ఇంక మోక్షం ఊసు ఎత్తే అర్హత ఎక్కడనుంచి వస్తుంది?కాబట్టి మంచి మార్గంలో నడవటం అలవాటు చేసుకుందాము.
Sunday, 18 May 2025
ఏతైర్వి ముక్తః కౌంతేయ
ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రి భిర్నరః।
ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాంగతిః॥22॥
శ్రీమద్భగవద్గీత...షోడశోధ్యాయము
దైవాసుర సంపద్విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడితో ఇలా విశదీకరిస్తున్నాడు.పరీక్షలో ప్రతి తప్పుకు _మార్కులు ఉన్నాయి అంటే తప్పులు రాయకుండా ఉంటేనే కదా కనీసం సున్నా వచ్చేది.ఆ తరువాత సరిగా వ్రాసిన జవాబులకు +లో మార్కులు వచ్చేది.అలాగే ఇక్కడ కూడా.కౌంతేయా!మానవుడు ముందు నరకానికి రాచమార్గాలు అయిన కామాన్ని,క్రోథాన్ని,లోభాన్ని విడనాడాలి.వేరే గత్యంతరము లేదు.అవి విసర్జిస్తేకానీ మనసు తపస్సు,యోగము వైపుకు మనసు మరలదు.తపస్సు,యోగములను అకుంఠిత దీక్షతో పాటిస్తేకానీ ఆత్మజ్ఞానం కలుగదు.ఆత్మజ్ఞానం కలిగితేకానీ మోక్షం పొందలేడు.కాబట్టి వీటిని అన్నిటినీ ఒకదాని తరువాత ఇంకొకటి చేపట్టి మన మార్గం సుగమం చేసుకోవాలి,మోక్షం పొందాలి.
Saturday, 17 May 2025
త్రివిధం నరకస్యేదం
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః।
కామః క్రోధ స్తథా లోభ స్తస్మాదేత త్త్రయం త్యజేత్॥21॥
శ్రీమద్భగవద్గీత...షోడశోధ్యాయము
దైవాసుర సంపద్విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి హితం చెబుతున్నాడు.అర్జునా!ఆసురీ స్వభావం కలవారి గుణగణాలు,వారి పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పాను కదా!కౌంతేయా!కామము,క్రోథము,లోభము అనేవి మూడూ నరకద్వారాలు.మనము చెడు మార్గంలో వేసే ప్రతి అడుగు మనలను ఆనరకానికి చేరువ చేస్తుంటుంది.మనము తప్పు చేసిన ప్రతి సారీ ఇంకొక సారి ఇలా జరగదు లే అని మనలను మనం మభ్య పెట్టుకుంటుంటాము.కానీ అదే చిలికి చిలికి గాలి వాన అవుతుంది.కాబట్టి మనము ఏదారిలో నడవాలి,ఏదారిలో ఉన్నాము అనే స్పృహతో ఉండాలి.ఎందుకంటే ఈ కామక్రోథ మదలోభాలు ఆత్మజ్ఞాన నాశనకారకాలు.మాములుగానే మనము మాయలో కప్పబడి ఉంటాము.దానికి తోడు ఇవన్నీ కలిసి వచ్చాయంటే మనలను సర్వనాశనం నుంచి ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు.కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని దుర్గుణాలను విడిచి పెట్టాలి.
Friday, 16 May 2025
ఆసురీం యోనిమాపన్నా
ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని।
మా మప్రాప్త్యెవ కౌంతేయ తతో యాన్త్యధమాం గతిమ్॥20॥
శ్రీమద్భగవద్గీత...షోడశోధ్యాయము
దైవాసుర సంపద్విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.ఓ అర్జునా!కౌంతేయా!ఇందాక నేను చెప్పినటువంటి మూర్ఖులను ఈ జన్మలోనే కాదు,ఏజన్మలోను బాగుపరచలేము.ఎందుకంటే అలాంటి మూర్ఖులు ప్రతి జన్మలోనూ ఆసుర శరీరాలనే పొందుతారు.అకృత్యాలనే చేస్తుంటారు.ఎప్పటికీ నన్ను చేరుకోలేరు.అంతకంతకూ ఇంకా దిగజారిపోతూ నీచమయిన యోనులలో పడిపోతుంటారు.అంటే హీనమయిన జన్మలను పొందుతుంటారు.
Thursday, 15 May 2025
తానహం ద్విషతః కృూరా
తానహం ద్విషతః కృూరా న్సంసారేషు నరాధమాన్।
క్షిపామ్యజస్ర మశుభా నాసురీష్వేవ యోనిషు॥19॥
శ్రీమద్భగవద్గీత... షోడశోధ్యాయము
దైవాసుర సంపద్విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి ఆసురీ స్వభావం యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావం గలవారు ఎప్పుడూ విర్రవీగుతూ ఉంటారు కదా!ఆఖరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతాను,విను.ఆది మధ్యాంత రహుడిని అయిన నన్ను తుస్కారంగా,లెఖ్ఖ లేని తనంగా నాయందు ద్వేషంగా,కృూరంగా ప్రవర్తించే ఆసురీ స్వభావంకలవారికి మళ్ళీ మళ్ళీ నీచమయిన ఆసురీ జన్మలనే కలుగ జేస్తాను.ఎందుకంటే వాళ్ళు చేసే పాపాలకు,ఘోరాలకూ అంతమనేది ఉండదు.
Wednesday, 14 May 2025
ఆత్మ సంభావితాః స్తబ్ధా
ఆత్మ సంభావితాః స్తబ్ధా ధనమాన మదాన్వితాః।
యజంతే నామయజ్ఞైస్తే దమ్భేనా విధిపూర్వకమ్॥17॥
అహంకారం బలం దర్పం కామం క్రోథం చ సంశ్రితాః।
మామాత్మ పరదేహేషు ప్రద్విషన్తోఽభ్యసూయకాః॥18॥
శ్రీమద్భగవద్గీత..।షోడశోధ్యాయము
దైవాసుర సంపద్విభాగయోగము
కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా! ఈ ఆసురీ స్వభావం గలవారికి ఆత్మస్తుతి,అతిశయం,ఐశ్వర్యమత్తతా ఎక్కువగా ఉంటుంది.దాని కారణంగా తరచూ శాస్త్రాన్ని ఉల్లంఘిస్తుంటారు.అంటే అతిక్రమిస్తుంటారు అన్నమాట.కానీ పేరుకోసం,గొప్పలకోసంప్రాకులాడుతుంటారు.కాబట్టి డాంబికంగా యాగాలు,యజ్ఞాలు చేస్తుంటారు.వీళ్ళకు లేని దుర్గుణాలు అంటూ ఏమీ ఉండవు.కామం,క్రోధం,అహంకారం,బలం,దర్పం ఇత్యాదులు వీరి చెంతనే సదా ఉంటాయి.అసూయాపరులు అయి ఉంటారు.వాళ్ళలో ఉండేదీ నేనే!మిగిలిన వారిలో ఉండేది నేనే!ఇంత సుస్థిరుడుగా ఉన్న నన్ను గుర్తించరు.నన్ను తిరస్కరిస్తారు.ఇదే వారి అజ్ఞానానికి,అహంకారానికీ పరాకాష్ఠ.
ఇదమద్య మయా లబ్ధం
ఇదమద్య మయా లబ్ధ మిదం ప్రాప్స్యే మనోరథమ్।
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్॥13॥
అసౌ మయా హతశ్శత్రు ర్హనిష్యే చాపరానపి।
ఈశ్వరోహమహం భోగీ సిద్ధోఽహం బలవాన్సుఖీ॥14॥
ఆఢ్యోఽభి జనవా నస్మి కోఽన్యోఽస్తి సదృశో మయా।
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః॥15॥
అనేక చిత్త విభ్రాంతా మోహజాల సమావృతాః।
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేఽశుచౌ॥16॥
శ్రీమద్భగవద్గీత..।షోడశోధ్యాయము
దైవాసుర సంపద్విభాగయోగము
కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావం కలవారికి అభిజాత్యం ఎక్కువ ఉంటుంది.ఎంత సేపూ ఏదో ఒక యావలో ఉంటారు.వారి ఆలోచనలు ఎలా ఉంటాయో చెబుతాను,చూడు.ఇది నాకు లభించింది.దీనితో ఈ కోరిక తీర్చుకుంటాను.నాకు ఇంత ఉంది.ఇంకా ఈ మాత్రం వస్తుంది.ఇంక ఎంత వస్తే బాగుంటుంది.ఈ శత్రువును చంపాను.కలుగుల్లో ఉన్న శత్రువులనందరినీ చంపేస్తాను.శత్రుశేషం లేకుండా పోతుంది.నేను సర్వాధికారిని.నేనే గొప్ప.నా కంటే తోపు ఇంకెవరూ లేరు.నేనే అందరికంటే బలవంతుడిని.అనుకుంటే ప్రతి ఒక్కరినీ తుక్కు తుక్కు చేయగలను.పోనీలే అని వదిలేస్తున్నాను.నా అంత సుఖ పురుషుడు ఇంకోడు లేడు.అందరి కంటే నేనే ధనవంతుడిని.స్వర్గసుఖాలు,సర్వభోగాలు అనుభవిస్తున్నాను.నన్ను ఎదిరించే మగాడు లేడు,ఇక పుట్టబోడు.నాకు ఏ విషయం లోనూ సమ ఉజ్జీ లేడు.యాగాలు చేస్తాను.దానాలు చేస్తాను.నా పేరు,నా గొప్పదనం ప్రపంచం అంతా చెప్పుకుంటుంది.ఆనందం అంతా నా సొత్తే!
ఇలా ఎంత సేపూ నేను,నా అనే దుగ్థలో మునిగి తేలుతూ ఉంటారు.అనేక వికారాలతో కూడిన వికలిత మనస్కులు అవుతారు.ఎంత సేపూ కామోప భోగాలలో ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు.ఆఖరున నరకానికి చేరుతారు.
Tuesday, 13 May 2025
చింతా మపరిమేయాం చ
చింతామపరిమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితాః।
కామోపభోగపరమా ఏతావ దితి నిశ్చితాఽ॥11॥
ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః।
ఈహంతే కామభోగార్ధ మన్యాయే నార్ధసంచయాన్॥12॥
శ్రీమద్భగవద్గీత...షోడశాధ్యాయము
దైవాసుర సంపద్విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి వివరంగా చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావం గలవారి గురించి ఇంకా చెబుతాను,విను.వీళ్ళు ఎప్పుడూ కామం,క్రోథంలను విడిచి పెట్టరు.అవి కూడా వీరిని విడిచి పెట్టవు.వాటి కబంథ హస్తాలలో వీళ్ళు చిక్కుకుని వుంటారు.ప్రాపంచిక మయిన విషయాలే జీవిత పరమావథిగా,పురుషార్థంగా భావిస్తారు.వాటిని అనుభవించడం జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు.దాని కోసం నిత్యం అక్రమ మార్గాలలో ధనం సంపాదించే పనిలో పడతారు.జీవితాంతం నిత్యమూ ఆశాపాశాల ఊబిలో చిక్కుకుని,బయట పడలేక గిల గిల లాడుతుంటారు.వారికి కామక్రోధాలు అనే సుడిగుండాల నుంచి బయట పడే మార్గమే ఉండదు .వాళ్ళుకూడా బయటపడాలని కోరుకోరు.
Sunday, 11 May 2025
కామ మాశ్రిత్య దుష్పూరం
కామ మాశ్రిత్య దుష్పూరం దమ్భమాన మదాన్వితాః।
మోహాత్గృహీత్వాఽసద్గ్రహాన్ ప్రవర్తంతేఽశుచివ్రతాః॥10॥శ్రీమద్భగవద్గీత... షోడశాధ్యాయము
దైవాసుర సంపద్విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా అంటున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావం గల వారి గురించి ఇంకా చెబుతాను, విను.వీళ్ళు ఎప్పుడూ కామాన్ని ఆశ్రయిస్తారు.దాని కారణంగా దంభం,దురభిమానము ఎక్కువగా వుంటుంది.అంటే గర్వం,మదం,భేషజం ఎక్కువగా ఉంటాయి.మదపూరితులై ఉంటారు.ఎప్పుడూ మూర్ఖపు పట్టుదలలతో అల్లాడుతూ ఉంటారు. వారు చేసే పనులు సహేతుకమా,కాదా అని ఒక్క క్షణం కూడా ఆలోచించరు.ఇలా మూర్ఖపు పట్టుదలలకు పోయి అపవిత్రతా దీక్షితులు అవుతుంటారు.తప్పు పనులు చేస్తుంటారు.ఆ తప్పుడు మార్గంలోనే వెళుతుంటారు.
Saturday, 10 May 2025
ఏతాం దృష్టి మవష్టభ్య
ఏతాం దృష్టి మవష్టభ్య నష్టాత్మానోఽల్పబుద్ధయః।
ప్రభవ న్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః॥9॥
శ్రీమద్భగవద్గీత..।షోడశాధ్యాయము
దైవాసుర సంపద్విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడితో ఆసురీ స్వభావం గురించి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావం కల వారు ఉన్నారే!వారంతా అల్ప బుద్ధి కలిగిన వాళ్ళు.వాళ్ళ వలన ప్రపంచానికి పైసా లాభం లేదు.వాళ్ళ ఉనికి నిష్ప్రయోజకం,అంతే.వారి పనులు వలన లోకానికి ఇసుమంత అయినా లాభం ఉండదు.అంతేనా?వాళ్ళు చేసే తప్పులు,ఘాతుకాల వలన ప్రపంచానికి హాని జరుగుతుంది.అన్నీ మానవాళికి నష్టం కలిగే పనులు చేయటంలో సిద్థహస్తులు.
Wednesday, 7 May 2025
అసత్య మప్రతిష్ఠం తే
అసత్య మప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్।
అపరస్పరసంభూతం కి మన్య త్కామహైతుకమ్॥8॥
శ్రీమద్భగవద్గీత..షోడశాధ్యాయము
దైవాసుర సంపద్విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి ఈ ఆసురీ స్వభావంకల వారి గురించి చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావంకల వారు ఈ ప్రపంచం అంతా మిధ్య అంటారు.అంతేనా?ఈ జగత్తు అంతా అస్థిరం అని కూడా అంటారు.దేవుడు,దైవం అనే వాళ్ళు ఎవరూ లేరని బల్ల గుద్ది మరీ చెబుతారు.సృష్టికి మూల కారణం స్త్రీ పురుష సంయోగం తప్ప ఇంకొకటి కాదు,లేదు అని నొక్కి వక్కాణిస్తారు.కామం తప్ప ఇక వేరే ఏ కారణాలు లేవని గట్టిగా నమ్ముతారు.
Tuesday, 6 May 2025
ప్రవృత్తిం చ నివృత్తిం చ
ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః।
న శౌచం నాపి చాఽచారో న సత్యం తేషు విద్యతే॥7॥
శ్రీమద్భగవద్గీత...షోడశాధ్యాయము
దైవాసుర సంపద్విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ముందర నీవు ఈ విషయం తెలుసుకోవాలి.ఆసురీ స్వభావం గలవారికి కర్మాకర్మ విచక్షణ ఉండదు.అంటే తప్పు ఒప్పుల తేడా వుండదు.ఏది అనిపిస్తే అది చేసే దూకుడు స్వభావం ఉంటుంది.ఒక్క క్షణం ఆగి మనం చేసే పని వలన ఎవరికైనా ఇబ్బంది,హాని జరుగుతుందాలేదా అని ఆలోచించరు.చివరికి వాళ్ళకే చెడు జరిగినా ఖాతరు చెయ్యరు.శుచిత్వం,సత్యం,సదాచారం అనేవి దివిటీ పెట్టి వెతికినా కానరావు.అంటే అచ్చోసిన ఆంబోతుల్లాగా అన్నమాట!
Monday, 5 May 2025
దౌ భూతసర్గౌ లోకేఽస్మి
దౌ భూతసర్గౌ లోకేఽస్మిన్ దైవ ఆసుర ఏవ చ।
దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు॥6॥
శ్రీమద్భగవద్గీత...షోడశాధ్యాయము
దైవాసుర సంపద్విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!లోకంలోని ప్రాణులంతా రెండు రకాలు.ఒకటో రకం దైవ స్వభావంతో ఉంటారు.రెండో రకం ఆసుర స్వభావంతో ఉంటారు.నేను నీకు దైవీ స్వభావంగురించి వివరంగా అర్థం అయేలా చెప్పాను.అలాగే ఆసుర స్వభావంగురించి కూడా చెబుతాను.
Sunday, 4 May 2025
దైవీ సంపద్విమోక్షాయ
దైవీ సంపద్విమోక్షాయ నిబంధా యాసురీ మతా।
మా శుచ స్సంపదం దైవీ మభిజాతోఽసి పాండవ॥5॥
శ్రీమద్భగవద్గీత...షోడశాధ్యాయము
దైవాసుర సంపద్విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.ఓ పాండవ మధ్యమా!ఓ అర్జునా!మనలో ఉండే దైవీ సంపద మనకు మోక్షం దక్కేలా చేస్తుంది.అదే ఆసురీ సంపత్తి సంసార బంధానిని కలిగిస్తాయి.అర్జునా!నువ్వు ఏమీ భయపడే పనిలేదు.ఎందుకంటే నువ్వు దైవీ సంపత్తిని జన్మించావు.మనము ఏ ఏ యోనుల నుంచి పుడతామో దానిని బట్టే మన జీవితము ఏ పంధాలో నడుస్తుంది అనేది మౌళికంగా అర్థమవుతుంది.
Friday, 2 May 2025
దంభో దర్పోఽభిమానశ్చ
దంభో దర్పోఽభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ।
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద మాసురీమ్॥4॥
శ్రీమద్భగవద్గీత... షోడశాధ్యాయము
దైవాసుర సంపద్విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి రాక్షస గుణాలు ఎలా ఉంటాయో చెబుతున్నాడు.అర్జునా!రాక్షస గుణాల గురించి చెబుతాను.ఆసురీ సంపత్తి వల్ల పుట్టినవారు గర్వంతో విర్రవీగుతుంటారు.పొగరుమోతుదనం పుష్కలంగా ఉంటుంది.దురభిమానం పరాకాష్టలో ఉంటుంది.ఇంక క్రోధం,కోపం,తాపం అపరిమితంగా ఉంటాయి.పరుష స్వభావం సహజ సిద్థంగా ఉంటుంది.ఇన్ని దుర్గుణాలకు హేతుమూలమయిన అవివేకంకు కొదవు ఉండదు.ఇన్ని దుర్గుణాలు,ఒకదానిని మించి ఇంకొకటి ఉన్నాయంటే వారు ఖచ్చితంగా రాక్షస ప్రవృత్తి కలిగిన వారు అని అర్థం.
Thursday, 1 May 2025
అభయం సత్త్వసంశుద్థిః
శ్రీభగవానువాచ...
అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యనస్థితిః।
దానందమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్॥1॥
అహింసా సత్య మక్రోధ స్త్యాగశ్శాంతి రపైశునమ్।
దయా భూతే ష్వలోలుప్త్వం మార్దవం హ్రీ రచాపలమ్॥2॥
తేజః క్షమా ధృతి శ్శౌచ మద్రోహో నాతిమానితా।
భవంతి సంపదం దైవీ మభిజాతస్య భారత॥3॥
శ్రీమద్భగవద్గీత.. షోడశాధ్యాయము
దైవాసుర సంపద్విభాగ యోగము
భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!ఇప్పుడు నీకు నేను ఏ ఏ గుణాలు వుండే వారిని దైవాంశ జాతులు అంటారో చెబుతాను,విను.భయం అనేది లేకుండా వుండాలి.పవిత్రమయిన అంతః కరణం ఉండాలి.ఆధ్యాతిక మయిన జ్ఞాన నిష్ట వుండాలి.దాన గుణం వుండాలి. ఆత్మనిగ్రహం ఉండాలి.యజ్ఞాచరణం వుండాలి.వేదాధ్యయనం,తపస్సు,సారళ్యం ఉండాలి.అహింస,సత్యం,కోపంలేకుండా వుండటం కావాలి.త్యాగం,శాంతి కావాలి.ఇతరుల తప్పులను ఎంచే ధోరణి లేకుండా వుండటం ముఖ్యం.మృదుత్వం,భూతదయ,నిర్లోభం ఉండాలి.అసూయ లేకుండా వుండాలి.గౌరవముల పట్ల ధ్యాస,ఆశ లేకుండా వుండాలి.పైన చెప్పిన గుణాలు అన్నీ వున్న వాళ్ళే దైవాంశ జాతులు అని తెలుసుకో.
Thursday, 10 April 2025
ఇతి గుహ్యతమం శాస్త్రం
ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ।
ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్స్యాత్ కృతకృత్యశ్చ భారత॥20॥
శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తియోగో నామ పంచదశాధ్యాయః
శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!అతిరహస్యమయిన ఈ శాస్త్రాన్ని నీ కోసమే చెప్పాను.ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవాడు,గ్రహించిన వాడు జ్ఞాని అవుతాడు.వాడి జన్మ ధన్యం అవుతుంది.వాడు కృతార్థుడు అవుతాడు.ఇందులో సందేహం లేదు.
యో మామేవ మసమ్మూఢో.
యో మామేవ మసమ్మూఢో జానాతి పురుషోత్తమం।
స సర్వ విద్భజతి మాం సర్వభవేన భారత॥19॥
శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
శ్పీకృష్ణుడు అర్జునుడికి వివరం చెబుతున్నాడు.అర్జునా!ఓ భరతశ్రేష్టా!ఇక్కడ గందరగోళం ఏమీలేదు.ఎలాంటి అనుమానాలు,సంశయాలు,శంకలు,గిలులు లేకుండా నన్నే పరమాత్మగా గుర్తించాలి.అర్థం చేసుకోవాలి. ఆకళింపు చేసుకోవాలి.ఎందుకంటే నన్ను పూర్తిగా తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడు అవుతాడు.అతడు అన్ని విధాలా నా శరణులోకి వస్తాడు.నన్నే సేవిస్తాడు.ముక్తి పథంలో పయనిస్తాడు.
Wednesday, 9 April 2025
యస్మాత్ క్షరమతీతోఽహం
యస్మాత్ క్షరమతీతోఽహం అక్షరాదపి చోత్తమః।
అతోఽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః॥18॥
శ్రీమద్భగవద్గీత..పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి తన గురించి చెబుతున్నాడు.అర్జునా!నేను నీకు ఇప్పుడు క్షరులు,అక్షరుల గురించి చెప్పాను కదా!నేను వీళ్ళందరి కంటే అతీతుడను.అలా అతీతుడను కాబట్టే లోకంలోను,వేదాలలోనూ నన్ను పరమాత్మ అని,పురుషోత్తముడు అని కీర్తిస్తుంటారు.
Tuesday, 8 April 2025
ఉత్తమః పురుషస్త్వన్యః
ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః।
యో లోకత్రయమావిశ్యబిభర్త్యవ్యయ ఈశ్వరః॥17॥
శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఇప్పుడే నేను క్షరులు,అక్షరులు గురించి చెప్పాను కదా!ఈ ఇద్దరికంటే ఉత్తముడు పరమాత్మ.ఎందుకంటే అతడే ఈ మూడు లోకాలనూ వ్యాపించి ఉన్నాడు.ఈ యావత్ సృష్టిని పోషిస్తున్నాడు.అతడు అక్షయుడు.అతడు నాశరహితుడు.అతడే సర్వాంతర్యామి.
Monday, 7 April 2025
ద్వావిమౌ పురుషౌ లోకే
ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ।
క్షర స్సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే॥16॥
శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!లోకంలో రెండు రకాల వాళ్ళు ఉంటారు.ఒకరు క్షరులు,ఇంకొకరు అక్షరులు.ప్రాపంచిక మయిన భూతాలన్నిటినీ క్షరులు అంటారు.కూటస్తుడు అయిన నిర్వికల్పుడు మాత్రమే అక్షరుడు.
Sunday, 6 April 2025
సర్వస్య చాహం హృది సన్నివిష్టో
సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞాన మపోహనం చ।
వేదైశ్య సర్వై రహమేవ వేద్యో వేదాంత కృద్వేదవిదేవ చాహమ్॥15॥
శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి సకలం చెబుతున్నాడు.అర్జునా!ఇంతెందుకు?అసలు విషయం చెబుతున్నాను,విను.అందరిలో నేనే అంతర్గతంగా,అంతరాత్మగా ఉన్నాను.జ్ఞాపకం,జ్ఞానం,మరపు,అవివేకం ఇలా అన్నీ నా వల్లనే కలుగుతున్నాయి.సర్వం నేనే అయి ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నాను.నేనే వేదవేద్యుడను.నేనే వేదాంత కర్తను.నేనే వేదవేత్తను.విశ్వంలో ప్రతిది నాలోనే పుట్టాలి,నా వల్లే ఎదగాలి,నాలోనే లయ, లీనం కావాలి.
అహం వైశ్వానరో భూత్వా
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః।
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం॥14॥
శ్రీమద్భగవద్గీత..పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!నేను ఈ యావత్ సృష్టిలోని సర్వ జీవుల శరీరాలలో జఠరాగ్ని రూపంలో ఉంటాను.జీవులు తినే నాలుగు రకాల ఆహారాలను ప్రాణాపాన వాయువులతో కూడి నేనే పక్వంచేస్తున్నాను.
అంటే ఆ పరమాత్మ మనం తీసుకునే ఆహారం కూడా సరిగ్గా అరిగి మనకు శక్తి చేకూరేలా చేస్తున్నాడు.ఇవంతా మనం అడిగేతేనో,బతిమాలాడితేనో చేయటం లేదు.తనకు తానుగా చేస్తున్నాడు.మన మంచి చెడ్డ చూసుకుంటున్నాడు.అలాంటిది అతని శరణు కోరితే ఇంకెంత మేలు చేస్తాడో ఊహించారా?
Saturday, 5 April 2025
గామావిశ్య చ భూతాని
గామావిశ్య చ భూతాని ధారాయామ్యహమోజసా।
పుష్ణామి చౌషధీ స్సర్వాః సోమో భూత్వా రసాత్మకః॥13॥
శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుొషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!నేను నా శక్తి చేత భూమి యందు ప్రవేశించి సర్వ భూతాలను ధరిస్తున్నాను.నేనే రస స్వరూపుడు అయిన చంద్రుడు అయి అన్ని సస్యాలను పోషిస్తున్నాను.అంటే అన్నీ ఫలదాయకము అయ్యేలా కృషి చేస్తున్నాను.సులభంగా చెప్పాలి అంటే సమస్త ప్రాణి కోటి వృద్థి,అభివృద్థిలో నా ప్రమేయం అడుగడుగునా ఉంది.
Friday, 4 April 2025
యదాదిత్య గతం తేజో
యదాదిత్య గతం తేజో జగద్భాసయతేఽఖిలం।
యచ్ఛంద్రమసి యచ్ఛాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్॥12॥శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఇంతెందుకు?అన్నిటికీ కర్త,కర్మ,క్రియలను నేనే అని అర్థం చేసుకో.ఈ సర్వ జగత్తునూ తేజోమయం చేసే వెలుగును ఇచ్చేది సూర్యుడు,చంద్రుడు అని నీకు తెలుసు కదా.నీకు ఇంకో ముఖ్యమయిన విషయం చెబుతాను.ఆ సూర్య చంద్రుల తేజస్సు నాదే.నేనే వాటికి ఆ తేజస్సును పంచాను.
యతంతో యోగినశ్చైనం
యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మ న్యవస్థితం।
యతంతోఽప్య కృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః॥11॥
శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!మనం ఏ పని చేసినా చిత్త శుద్థితో చేయాలి.యాంత్రికంగా చేశాము అంటే చేశాము అనే రకంగా ఉండకూడదు.సత్ఫలితం దక్కాలంటే చిల్లర వేషాలు వేయకూడదు.వంద శాతం మన మనసు,బుద్ధిని పెట్టాలి.జ్ఞాన సిద్థులు మాత్రమే ఎందుకు తెలుసుకోగలుగుతారు అంటే వారికి ఆత్మానుభూతిని పొందే అభ్యాసం ఉంటుంది కాబట్టి.అదే చిత్తశుద్థి లేని వారు ఎంత అభ్యాసం చేసినా ఫలితం శూన్యం.వారికి సృష్టి విలాసం కానరాదు.
Wednesday, 2 April 2025
ఉత్ర్కామంతం స్థితం వాపి
ఉత్ర్కామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం।
విమూఢా నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః॥10॥
శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి నిజాలు కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నాడు.అర్జునా!నేను నీకు ఇప్పుడు చెప్పాను కదా!జీవుడు దేహాన్ని త్యజిస్తాడని.మళ్ళీ గుణప్రభావం వల్ల మరో దేహాన్ని పొందుతాడని.ఆ దేహంలో కొన్నాళ్ళు అనుభవిస్తాడు,మనం మాములుగా బట్టలు మార్చుకున్నట్లు.ఇలాంటి విషయాలు మూర్ఖులు అయినవాళ్ళు అర్థం చేసుకోలేరు.ఎందుకంటే వాళ్ళకు అంత పరిపక్వత వుండదు.ఎంత సేపూ భౌతికమయిన వాంఛలగురించే ఆలోచిస్తారు కావున.ఇలా ఆధ్యాత్మక పరమయిన విషయాలను జ్ఞానసిద్ధులు మాత్రమే తెలుసుకుని,అర్థం చేసుకోగలుగుతారు.
Tuesday, 1 April 2025
శ్రోత్రం చక్షుః స్పర్శనం చ
శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ।
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే॥9॥
శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలాగ అంటున్నాడు.అర్జునా!జీవుడు అంటే ఆత్మ అని అర్థం అవుతుందా?చెవులు,కళ్ళు,చర్మం,నాలుక,ముక్కు పంచేంద్రియాలు.మనసు వీటి పైన ఆధారపడి వుంటుంది.జీవుడు పంచేంద్రియాలను ఆశ్రయించిన మనసును సహాయంగా తీసుకుని శబ్దరూప రస స్పర్శ గంధాది విషయాలను అనుభవిస్తున్నాడు.
Monday, 31 March 2025
శరీరం యదవాప్నోతి
శరీరం యదవాప్నోతి యచ్తాప్యుత్ర్కా మతీశ్వరః।
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయత్॥8॥
శ్రీమగ్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఎంత సుందరంగా వివరిస్తున్నాడో చూడు.అర్జునా!జీవుడికి దేహం వుంటుంది కదా.మనము చాలా జన్మలు ఎత్తాల్సి వుంటుంది కదా.అలా జన్మలు మారేటప్పుడు శరీరాలు మార్చాల్సి వస్తుంది.మనంపాత,చినిగిన బట్టలు విప్పి కొత్తవి,మంచివి వేసుకున్నట్లు.ఒక పూదోట మీదుగా గాలి వీస్తే,ఆ పూల సువాసనను కూడా కొంచెం పట్టుకు పోతుంది,పోతూ పోతూ.అచ్చం అలాగే ఇక్కడ కూడా.జీవుడు క్రొత్త శరీరం లోకి వెళ్ళేటప్పుడు,వెనుకటి శరీరం నుంచి భావపరంపరను తీసుకుని పోతున్నాడు.
Saturday, 29 March 2025
మమైవాంశో జీవలోకే
మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః।
మనః షష్ఠాణీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి॥7॥
శ్రీమద్భగవద్గీత....పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు. అర్జునా!నేను ఆదిమధ్యాంతరహితుడిని కదా.పురాతనమయిన నా అంశయే మనుష్యలోకంలో జీవుడిగా పరిణమించింది.ఆ జీవుడే ఈ చరాచరజగత్తు,ప్రకృతిలోని వికారాలు అయిన జ్ఞానేంద్రియ పంచకాన్ని,మనస్సును కూడా ఆకర్షిస్తున్నాడు.అంటే నేను విశ్వమంతా వ్యాపించ్ వున్నాను.నన్ను దాటుకుని ఎవరూ ,ఎక్కడికీ పోలేరు.కానీ మాయామోహంలో చిక్కుకుని వుంటారు చాలా మటుకు.
Friday, 28 March 2025
న తద్భాసయతే సూర్యో
న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః।
యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ॥6॥
శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి పూస గుచ్చినట్లు వివరంగా చెబుతున్నాడు.గురువు పిల్లవాడికి చెప్పేటప్పుడు సంధులు,సమాసాలతో,కఠినమయిన పదజాలంతో చెప్పకూడదు.చిన్న చిన్న పదాలతో,వాడికి అర్థం అయ్యేలాగా,భయపడకుండా నేర్చుకునేలా,వాడికి నేర్చుకునేదానికి ఉత్సాహం నింపేలాగా
చెప్పాలి.ఇక్కడ కృష్ణుడు కూడా అలానే చేస్తున్నాడు.
అర్జునా!పరమపదం అంటే చెబుతాను,విను.మనం సూర్యుడు,చంద్రుడు ప్రపంచానికి వెలుగు నిస్తాయి అనుకుంటాము కదా!అవి పరమపదాన్ని ప్రకాశింపలేవు.అంటే కోటానుకోట్ల సూర్యులు,చంద్రులు కూడా దాని ప్రకాశం ముందర ఆగలేవు,తూగలేవు.ఆ మోక్షం,ఆ పరమపదం పొందితే మరల వెనుకకు రానవసరం లేదు. మనం భూమి మీద పుట్టామంటే మరల మరల జన్మలు వుంటాయి.అవి ఇప్పటి మన జన్మ కంటే ఉచ్ఛమయినవా,నీచమయినవా అనేది మన కర్మలను బట్టి వుంటుంది.కానీ ఆ భగవంతునిలో కైవల్యం పొందితే ఈ జన్మల జోలికి పోనక్కరలేదు.అలాంటి స్వయం ప్రకాశమానమయినది భగవంతుని పరమపదం.
Thursday, 27 March 2025
నిర్మానమోహా జితసంగదోషాః
నిర్మానమోహా జితసంగదోషాః
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః
ద్వంద్యైర్విముక్తా స్సుఖదుఃఖసంజ్ఞైః
గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్॥5॥
శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి విడమరచి చెబుతున్నాడు.అర్జునా!నేను చెప్పే ముక్తి ఎలా సంపాదించాలో వివరిస్తాను.దురహంకారము,దుస్సంగము,దురూహలను దరిచేరనివ్వకూడదు.అంటే గర్వము పనికిరాదు.దుష్టులతో సాంగత్యము వద్దనే వద్దు.దురాలోచనల జోలికి అసలు వెళ్ళవద్దు.కోరికలను దరిచేర నివ్వకు.లాభం,నష్టం,కోపం,తాపం,సుఖం,దుఃఖం....ఇలాంటి ద్వంద్వాలను విసర్జించాలి.అప్పుడు మాత్రమే జ్ఞానులు బ్రహ్మజ్ఞాన నిష్టతో మోక్షం పొందగలుగుతారు.
Wednesday, 26 March 2025
తతః పదం తత్పరిమార్గతవ్యం
తతః పదం తత్పరిమార్గతవ్యం
యస్మిన్ గతా న నివర్తంతి భూయః
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ॥4॥
శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!మనుష్యులు వైరాగ్యంతోటి సంసారమనే వృక్షాన్ని ఛేదించాలి అని చెప్పాను కదా!మనం సాధన చెయ్యాలి.ఎలా చెయ్యాలంటే దేనిని పొందితే దీనిలోకి రామో...అలా చెయ్యాలి.అంటే కైవల్యం,పరమపధం పొందితే ఇలాంటి ఇహలోకం లోకి రానవసరం లేదు కదా!ఆ మోక్షం,ముక్తి పొందితే,అనాది అయిన ఈ చరాచర ప్రపంచం ఎవరు సృష్టించారో,ఎవరివలన సాగుతుందో,ఎవరివలన యావత్ సృష్టి అంతం అవుతుందో,ఆ పరమాత్మ సన్నిథిలో శరణు పొందవచ్చు.ఈ భావంతో సాధన చెయ్యాలి.
Tuesday, 18 March 2025
న రూప మస్యేహ తథోపలభ్యతే
న రూప మస్యేహ తథోపలభ్యతే
నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా
అశ్వత్థమేనం సువిరూఢమూలం
అసంగశస్త్రేణ ధృఢేన ఛిత్వా॥3॥
శ్రీమద్భగవద్గీత ...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో సాధ్యాఽసాధ్యాల గురించి చెబుతున్నాడు.అర్జునా!మామూలుగా ఈ సంసారంలో వుండే ప్రాణులు అశ్వత్థవృక్షం యొక్క స్వరూపం తెలుసుకోలేరు.ఎందుకంటే ఈ వృక్షం ఆది,మధ్య,అంతాలు లేకుండా వుంటుంది.దీని వ్రేళ్ళు ఎక్కడికక్కడ బాగా నాటుకోని వుంటాయి.ఈ సంసార వృక్షాన్ని వైరాగ్యం తోటే మానవుడు ఛేదించగలడు.వేరే ఉపాయం,దారి లేదు.
Monday, 17 March 2025
అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః
అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః
గుణప్రవృద్ధా విషయప్రవాలాః।
అధశ్చ మూలాన్యనుసంతతాని
కర్మానుబంధీని మనుష్యలోకే॥2॥
శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తియోగము
కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఈ అశ్వత్థ వృక్షము అని చెప్పాను కదా.దాని కొమ్మలు సత్త్వగుణము,రజోగుణము మరియు తమోగుణముల వల్ల విస్తరించి వుంటుంది.ఇంద్రియార్థాలు చిగురులులాగ కలిగి వుంటుంది.ఈ కొమ్మలు క్రిందికీ,మీదికీ వ్యాపించి,విస్తరించి వుంటాయి.కానీ మనుష్యలోకంలో దీనికి క్రిందికి పోయే వ్రేళ్ళుకూడావుంటాయి.ఎందుకంటే ఇక్కడ అవి కూడా సకానకర్మలచే బద్ధములై వుంటాయి కాబట్టి.
Thursday, 13 March 2025
ఊర్ధ్వమూల మధశ్శాఖం
శ్రీమద్భగవద్గీత....పంచదశాధ్యాయము...
పురుషోత్తమ ప్రాప్తి యోగము
శ్రీభగవానువాచ...
ఊర్ధ్వమూల మధశ్శాఖం అశ్వత్థం ప్రాహు రవ్యయం।
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్॥1॥
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!అశ్వత్థ వృక్షము ఒకటి వుంది అని చెప్పబడుతుంది.అది మామూలు చెట్టులాగ కాదు.దానికి వ్రేళ్ళు పైకి ఉంటాయి.కొమ్మలు ఏమో కిందికి ఉంటాయి.వేదాలలోని వాక్యాలే దానికి ఆకులు.దానికి నాశనం అనేది లేనే లేదు.ఆ వృక్షం గురించి తెలుసుకున్నవాడే వేదవిదుడు అని అర్థం చేసుకో.
Monday, 10 March 2025
బ్రహ్మణో హి ప్రతిష్ఠాఽహం
బ్రహ్మణోహి ప్రతిష్ఠాఽహం అమృతస్యావ్యయస్య చ
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ॥27॥
శ్రీమద్భగవద్గీతాఽసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగోనామ చతుర్దశోఽధ్యాయః
కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!ఈ సృష్టిలో ప్రతిదాని వెనుక,ముందర,పక్కన,లోపల,బయట...అంతా నేనే నిండి ఉన్నాను.నా ప్రమేయం లేకుండా చిన్న పరమాణువు కూడా అటుఇటు కదలలేదు.పరబ్రహ్మకు,అవినాశనమయిన మోక్షానికీ,ధర్మానికీ,సత్ చిత్ ఆనంద రూపైక నిరాకార బ్రహ్మానికీ అన్నింటికీ నేనే మూలాధారుడిగా వున్నాను.సులభంగా చెప్పాలంటే అన్నిటికీ కర్త,కర్మ,క్రియ నేనే.ఇవన్నీ అవినాశనము అని ఎందుకు చెబుతున్నానో విను.ముక్తి,ధర్మం,సచ్చిదానందం,నిరాకారమయిన బ్రహ్మం....ఇవన్నీ శాశ్వతమయినవి.వీటికి పుట్టుక,చావులేవు.చావులేదు అంటే నాశనం కావు అనే కదా అర్థం.నిరాకారము అన్నప్పుడు రూపం ఎక్కడనుంచి వస్తుంది?అంటే వాటి వునికి మనం గ్రహించగలము మనసుతో.కానీ తాకలేము,చూడలేము,వినలేము,రుచి కనుగొనలేము.కాబట్టి ఆదిమధ్యాంత రహితుడు నేనని అర్థం చేసుకో.
Thursday, 6 March 2025
మాం చ యోఽవ్యభిచారేణ
మాం చ యోఽవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే
స గుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే॥26॥
శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి త్రిగుణాలను అతిక్రమించేదానికి సులభమయిన మార్గం చెబుతున్నాడు.అర్జునా!నీకు అర్థం కావటంలేదు కదా?ఇంత కష్టమయిన ప్రక్రియ ఎలా మానవుడికి సాథ్యం అవుతుంది అని.నేనొక చిన్న చిట్కా చెప్తాను.గ్రహించు.
నిత్యమూ నన్నే నిశ్చలమయిన భక్తితో సేవిస్తేచాలు.ఆ మానవుడికి త్రిగుణాలను ధిక్కరించే స్థితప్రజ్ఞత చేకూరుతుంది.అతను త్రిగుణాలను అతిక్రమించి బ్రహ్మత్వానికి అర్హుడవుతాడు.
Tuesday, 4 March 2025
ప్రకాశం చ ప్రవృత్తిం చ
శ్రీభగవానువాచ....
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ
న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి॥22॥
ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే
గుణా వర్తంత ఇత్యేవ యోఽవతిష్టతి నేంగతే॥23॥
సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మ కాంచనః
తుల్య ప్రియాప్రియో ధీరః తుల్యనిందాత్మ సంస్తుతిః॥24॥
మానావమానయో స్తుల్యః తుల్యో మిత్రారి పక్షయోః
సర్వారంభ పరిత్యాగీ గుణాతీత స్స ఉచ్యతే॥25॥
శ్రీమద్భగవద్గీత..।చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగయోగము
ఎప్పుడూ అర్థం చేసుకోవాలి అనే తపన వుండే వాళ్ళకే అనుమానాలు వస్తాయి.అర్జునుడు తన అనుమానాలు బయచ పెట్టగానే కృష్ణుడు సంతోషించాడు.విడమరచి చెప్పడం మొదలు పెట్టాడు.హే అర్జునా!గుణాతీతుడు ఎవడు,ఎలా ఉంటాడో చెబుతాను,విను.
ఈ మూడు గుణాలు ఉన్నాయి కదా!వాటికి సంబంథించిన,వ్యక్తరూపాలు అయిన ప్రకాశం,ప్రవృత్తి,మోహాలు సంప్రాప్తమయినా ద్వేషించకుండా ఉండాలి.అవి దక్కకపోయినా,వాటికోసం వెంపర్లాడకుండా వుండగలగాలి.నిర్వికారంగా,సాక్షిమాత్రుడుగా వుండాలి.గుణధర్మపరమయిన కర్మలకు తన కర్తృత్వాన్ని జోడించకుండా ఉండాలి.వాటివాటి స్వస్వభావతను గ్రహించి సుఖదుఃఖాలను రెండింటినీ సమభావంతో చూడాలి.తనకుతానే సుప్రతిష్టుడు అయి మట్టి,రాయి,బంగారాలను సమభావంతో చూడగలగాలి.ప్రియమైనా,అప్రియమైనా ఒకే రకంగా స్వీకరించాలి.ధీరుడుగా ఉంటూ నిందలు అయినా,మెచ్చుకోలుఅయినా,బ్రహ్మరథం పట్టినా,అవమానించినా,శత్రువులు అయినా,మిత్రులు అయినా సమభావంతో స్వీకరించాలి.సర్వకాల సర్వావస్థలయందు సమబుద్ధితో వుండి,నిస్సంకల్పుడుగా ఉండాలి.ఇలా వుండగలిగిన వాళ్ళను గుణాతీతుడు అంటారు.
Sunday, 2 March 2025
కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్
అర్జున ఉవాచ...
కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో
కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణా నతివర్తతే॥21॥
శ్రీమద్భగవద్గీత... చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
అర్జునుడికి తల తిరిగిపోతుంది.అన్నీ అర్థం కాని అనుమానాలే.అందుకని మొహమాటానికి పోకుండా కృష్ణుడిని అడుగుతున్నాడు.కృష్ణా!నువ్వేమో త్రిగుణాలు అన్నావు.మళ్ళా వాటిని అతిక్రమిస్తే పరమపథం అంటున్నావు.ఈ సత్త్వరజస్తమో గుణాలను ఎవరు అతిక్రమించగలరు?వాళ్ళు ఎలా ఉంటారు? వారి గుణగణాలు,లక్షణాలు ఎలా ఉంటాయి?వారి ఆచారవ్యవహారాలు ఏ రీతిలో ఉంటాయి?అసలు మానవుడు ఈ మూడుగుణాల పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడగలతాడు?నాకు ఈ ప్రశ్నలకన్నిటికీ సవివరంగా సమాథానం చెప్పాలి అని వేడుకున్నాడు అర్జునుడు.
Friday, 28 February 2025
గుణానేతా నతీత్య త్రీన్
గుణానేతా నతీత్య త్రీన్ దేహీ దేహ సముద్భవాన్
జన్మ మృత్యు జరా దుఃఖైః విముక్తోఽమృత మశ్నుతే॥20॥
శ్రీమద్భగవద్గీత..।చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి ముక్తికి మార్గం చెబుతున్నాడు.అర్జునా!దేహి అనగా బద్ధజీవుడు ఈ త్రిగుణాలను తన ఆధీనం లోకి తీసుకురాగలగాలి.వీటి పాశాలనుంచి విముక్తుడు కాగలగాలి.వీటిని సునాయాశంగా దాటగలగాలి.అతిక్రమించగలగాలి.అలాంటి జీవి జన్మ మృత్యు జరాది దుఃఖాలనుంచి బయట పడగలుగుతాడు.ముక్తికి బాటలు వేయగలుగుతాడు.ఆ పైన బ్రహ్మానందాన్ని పొందగలుగుతాడు.ఇందులో సందేహము లేదు.నన్ను నమ్ము.
Thursday, 27 February 2025
నాన్యం గుణేభ్యః కర్తారం
నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టాఽనుపశ్యతి
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోఽధిగచ్ఛతి॥19॥
శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి పరమ సత్యం బోధిస్తున్నాడు.అర్జునా!సర్వ సృష్టికోటిని కర్మలకు ప్రేరేపించేది ఈ త్రిగుణాలే.ఆ విషయం ముందర మనము అర్థం చేసుకోవాలి. కానీ పరమాత్మ మటుకు ఈ గుణత్రయానికి అతీతుడు అనే విషయం కూడా తెలుసుకోవాలి.ఈ విషయాలన్నిటినీ ఆకళింపు చేసుకున్న వాడే నన్ను అర్థం చేసుకునిన వాడు.వాడే నాకు దగ్గర అవుతాడు.
Wednesday, 26 February 2025
ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థాః
ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః
జఘన్యగుణ వృత్తిస్థాః అధో గచ్ఛంతి తామసాః॥18॥
శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగయోగము
కృష్ణుడు అర్జునుడికి ఏ గుణాలు పాటిస్తే,ఏ ఫలితాలు దక్కుతాయో చెబుతున్నాడు.అర్జునా!నీకు ఈ మూడుగుణాలగురించి చెప్పానుకదా.వాటి పర్యనసానంఎలా వుంటుందో,ఏమిటో చెబుతాను.సత్త్వగుణం ఆచరించే సాత్త్వికులకు ఉత్తమమయిన ఊర్ధ్వలోకాలు సంప్రాప్తిస్తాయి.రజోగుణం పాటించే రాజులకు మానవలోకం దక్కుతుంది.అంటే మళ్ళీ మళ్ళీ మానవజన్మమే దక్కుతుంది.మోక్షం దక్కదు.తమోగుణానికి బానిసలు అయిన తామసులకప నీచమయిన అధోగతులు కలుగుతాయి.అనగా మానవ జన్మకంటేకూడా తక్కువ అయిన పశు,పక్ష్యాదుల జన్మ దక్కుతుంది.
Tuesday, 25 February 2025
సత్త్వా త్సంజాయతే జ్ఞానం
సత్త్వా త్సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ
ప్రమాదమోహౌ తమసో భవతోఽజ్ఞానమేవ చ॥17॥
శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
ఏ విషయం అయినా ఒకటికి నాలుగు సార్లు మననం చేసుకుంటే కానీ బుర్రకు ఎక్కదు.ఈ విషయం కృష్ణుడికి చాలా బాగా తెలుసు.అందుకే మళ్ళీ మళ్ళీ అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!సత్త్వగుణం వలన మనిషిలో జ్ఞానం పెరుగుతుంది.అదే రజోగుణము వల్లన అయితే లోభం పెరుగుతుంది.తమోగుణం వలన మనలో అజ్ఞానానికి అంతమే ఉండదు.భ్రాంతి,ప్రమాదాలు ఏర్పడతాయి.కాబట్టి మనము నిశితంగా ఆలోచించి,మంచి మార్గంలో ముందుకు పోవాలి.
Monday, 24 February 2025
కర్మణ సుకృతస్యాహుః
కర్మణ సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలం
రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలమ్॥16॥
శ్రీమద్భగవద్గీత....చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడిని మంచి మార్గంలో నడవమని చెబుతున్నాడు.అర్జునా! సత్త్వగుణము ఎంచుకొని ఆ మార్గంలో నడిచేదానికి ప్రయత్నించు.ఎందుకంటే,ఆ మంచి కర్మలవలన మనకు ఎలాంటి మాలిన్యం అంటని సౌఖ్యం దక్కుతుంది.అదే రాజసగుణం వలన దుఃఖం దక్కుతుంది.ఎందుకంటే మనము ప్రాపంచిక విషయ లాలసకు లోనవుతాము కదా!తామసగుణానికి సంబంధించిన కర్మలవల్ల అజ్ఞానము,అవివేకము,అలసత్త్వములకు మనము నివాస గృహం అవుతాము.
Sunday, 23 February 2025
రజసి ప్రళయం గత్వా
రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే
తథా ప్రలీన స్తమసి మూఢయోనిషు జాయతే॥5॥
శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.రజోగుణము వృద్ధిలో ఉన్నప్పుడు మరణిస్తే ఏమి జరుగుతుందో చెప్తాను విను.అలాంటి మనిషికి కర్మలయందు ఆసక్తి వుంటుంది కనుక,మరలా మానవజన్మనే పొందుతాడు.ఇప్పుడు తమోగుణము గురించి మాట్లాడుకుందాము.తమోగుణము అంటే అజ్ఞానానికి,అలసత్త్వానికి పెట్టింది పేరు.కాబట్టి తమోగుణము వృద్ధిలో ఉన్నప్పుడు మరణం సంభవిస్తే,ఆ ప్రాణికి పశువు,పక్షిల జన్మమే దక్కుతుంది.కాబట్టి మన ఆలోచనలు,నడవడిక,ఆత్మజ్ఞానము మనకు తరువాత దక్కబోయే జన్మలను కూడా నిర్దేశిస్తాయి.కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోని మసలుకుంటే,అన్ని వేళలా ఉత్తమము.
Friday, 21 February 2025
యదా సత్త్వే ప్రవృద్ధే తు
యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్
తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే॥14॥
శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడితో చెబుతున్నాడు.మంచి మార్గములో నడిచే వాళ్ళకు ఎప్పుడూ మంచే జరుగుతుంది.అన్ని గుణాలలోకి సత్త్వగుణము మంచిది అని నీకు నేను చెప్పాను కదా!ఆ గుణము వృద్ధిలో వున్నప్పుడు మరణం సంభవిస్తే,మనము ఉత్తమలోకాలకు పోతాము.మాములుగా బ్రహ్మ జ్ఞానులకు ఉత్తమలోక ప్రాప్తి దక్కుతుంటుంది.కాబట్టి ప్రతి ఒక్కరూ సత్త్వగుణము అలవరుచుకుంటే మంచిది.
Tuesday, 18 February 2025
అప్రకాశోఽప్రవృత్తిశ్చ
అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ
తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందనా॥13॥
శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు కురు వంశంలో పుట్టిన, కులతిలకము అయిన అర్జునుడిని ఇలా సంబోధిస్తున్నాడు.హే కురునందనా!ఇప్పుడు ఇంక తమోగుణము గురించి మాట్లాడు కుందాము.మనలో ఈ తమోగుణము పైన లాలస పెరిగి,మోతాదు మించింది అనుకో,అప్పుడు ఈ ఈ వికారాలు మనలో మొదలు అవుతాయి.జీవితంలో ప్రకాశం,ఆశ ఉండవు.మన పనులు మనం చేసుకోవాలనే ఆకాంక్ష,ఉత్తేజం అసలే ఉండవు.అసలు సిసలు పని దొంగలం అవుతాము.ఏ పనీ చేయ బుద్ధి కాదు.సోమరితనం పుష్కలంగా వృద్ధి చెందుతుంది.ముందు వెనక ఆలోచించకుండా అపాయాలకు,ప్రమాదాలకు లోను అవుతాము.మూర్ఖత్వం ఇబ్బడి ముబ్బిడిగా పెరుగుతుంది.కాబట్టి వీటిని దరి చేరనివ్వకూడదు.
Sunday, 16 February 2025
లోభః ప్రవృత్తి రారంభః
లోభః ప్రవృత్తి రారంభః కర్మణా మశమః స్పృహా
రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ॥12॥
శ్రీమద్భగవద్గీత....చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్దునుడితో చెబుతున్నాడు.ఇప్పుడు నేను నీకు రజోగుణము గురించి చెబుతాను,విను.రజోగుణమనేది మనలో వృద్ధి అయింది అనుకో,మొదట బయటపడేది లోభత్వం.మనకు లోభగుణం,అదే పిసినారితనం అలవాటు అవుతుంది.అశాంతి మొదలు అవుతుంది.గుబులుగుబులుగా వుంటుంది.ఏ మంచి విషయం పైనా గురి కుదరదు.ఆశలు కళ్ళెంలేని గుఱ్ఱాలలాగా,మనల్ని పరుగులు పెట్టిస్తాయి.పనికిరాని పనులు,చెడు పనులు చేసేదానికి మనసు ఉవ్విళ్ళూరుతూ వుంటుంది.
Thursday, 13 February 2025
సర్వద్వారేషు దేహేఽస్మిన్
సర్వద్వారేషు దేహేఽస్మిన్ ప్రకాశ ఉపజాయతే
జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్త్వమిత్యుత॥11॥
శ్రీమద్భగవద్గీత....చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి చిన్న కిటుకు చెపుతున్నాడు.అర్జునా!ఈ మూడు గుణాలు మనతో చెడుగుడు ఎలా ఆడుకుంటాయో చెప్పాను కదా.కానీ మనం వాటి పైన పెత్తనం సంపాదించేదానికి మొగ్గు చూపాలి.అప్పుడు మనకు మన ఇంద్రియాల పైన పట్టు దొరుకుతుంది.సరి అయిన మార్గంలో పయనిస్తాము.అందుకే చెబుతున్నాను విను.మనం మంచి మార్గం ఎన్నుకుంటే,సర్వేంద్రియ ద్వారాలు జ్ఞానరూపమయిన కాంతితో ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.అప్పుడు మనలో సత్త్వగుణము వృద్ధి అయిందని ధైర్యంగా ఉండవచ్చు.
Tuesday, 11 February 2025
రజస్తమశ్చాభిభూయ
రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత
రజస్సత్త్వం తమశ్చైవ తమస్సత్త్వం రజస్తథా॥10॥
శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడితో అసలు కిటుకుచెబుతున్నాడు.అర్జునా!ఈ మూడు గుణాలగురించి చెప్పాను.వీటి మధ్య ఇంకొక వ్వవహారము కూడా వుంది.చెబుతా విను.మన మనసుల పైన ఒక సారి రజోగుణము,తమోగుణాలను కాదని సత్త్వగుణము గెలుస్తుంది.ఇంకో సారి సత్త్వగుణము,తమోగుణాలను అణగ ద్రొక్కి రజోగుణము పై చేయి దక్కించుకుంటుంది.మరి ఇంకొక సారి సత్త్వ గుణము,రజోగుణాలని మూలకు నెట్టి,తమోగుణము మన నెత్తి మీద తైతక్కలాడుతుంది.ఇలా ఈ మూడు గుణాలు మనతో కబడ్డీ ఆడుకుంటుంటాయి.మనము ఆ గుణాలచేతిలో కీలుబొమ్మలము నిజానికి.
Sunday, 9 February 2025
సత్త్వం సఖే సంజయతి
సత్త్వం సఖే సంజయతి రజః కర్మణి భారత!
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత॥9॥
శ్రీమద్భగవద్గీత....చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు ఇంతదాకా తను చెప్పిన దానికి సారాంశం చెబుతున్నాడు.ఓ భరతశ్రేష్టా!అర్జునా!సత్త్వగుణం అనేది జీవుడిని సుఖబద్థుడిగా చేస్తుంది.రజోగుణం కర్మమార్గంలో ప్రయాణించేలా చేస్తుంది.తమోగుణం అనేది జ్ఞానాన్ని దూరం చేసి,అజ్ఞాన మార్గం వైపుకు మొగ్గేలా చేస్తుంది.దీని పర్యవసానంగా మానవుడు ప్రమాదాలకు లోనవుతాడు.ఎందుకంటే అతను తప్పులు మీద తప్పులు చేసుకుంటూ పోతాడు.ఎక్కడా ఆగి ఆత్మశోథన చేసుకోడు.
Saturday, 8 February 2025
తమస్త్వజ్ఞానజం విద్ధి
తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం।
ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత॥8॥
శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి మూడోగుణం గురించి చెబుతున్నాడు.భరతశ్రేష్టా!అర్జునా!ఇప్పుడు నీకు మూడోగుణం గురించి విపులంగా చెప్తాను.మూడోగుణం తమోగుణం.ఈ తామసగుణం ముఖ్యంగా అజ్ఞానం నుంచి పుట్టుకొస్తుంది.తామసగుణమనేది నీచమయిన గుణము.ఇది జీవులను మాయలో పడేస్తుంది.ఒకరకమయిన భ్రాంతి,అయోమయంలో పడేస్తాయి మనలను.దీని వల్ల సోమరితనం పెరుగుతుంది.పగలు,రాత్రి తేడా లేకుండా నిద్ర ఆవహిస్తుంది.సరి అయిన అవగాహన లేక తప్పులు మీద తప్పులు చేసుకుంటూ పోతాము.ఆ పొరబాట్లు కుప్పలు తెప్పలు అయి,ఆ గందరగోళం నుంచి బయటపడే ప్రసక్తే వుండదు.కాబట్టి అజ్నానం నుంచి బయటపడాలంటే మానవుడు ముందర బద్ధకం,అతినిద్ర వదిలించుకోవాలి.ప్రతిది నాకు తెలియదు,అవసరం లేదు అనుకోకుండా నిజనిర్థారణ చేసుకోవాలి.
Friday, 7 February 2025
రజో రాగాత్మకం విద్ధి
రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవః।
తన్ని బధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్॥7॥
శ్రీమద్భగవద్గీత.....చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి త్రిగుణాల గురించి వివరంగా చెబుతున్నాడు.అర్జునా!రజోగుణం అనేది రాగమయము అయినది.అది కామము,మోహము,కాంక్ష,కోరిక,ఇష్టము....ఇలా తదితర భావాల ఆవేశం,సంపర్కముల వలన పుడుతుంది.ఈ గుణానికి లోబడిన జీవుడు ఇంక ఆ జంఝాటకం నుంచి బయట పడలేడు.సాలెగూడులో చిక్కుకున్న ఈగలాగ అక్కడక్కడే గింగిరాలు కొడుతుంటాడు.ఇంక వాడు అది చేకూరే మార్గాలనే అన్వేషిస్తూ,ఆ ఆ కర్మలచే బద్ధుడవుతాడు.వాడికి ఇంక వేరే ప్రపంచం కానరాదు.అవసరం లేదు.
Thursday, 6 February 2025
తత్ర సత్త్వం నిర్మలత్వాత్
తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం।
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ॥6॥
శ్రీమద్భగవద్గీత...చతుర్దశాధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!నేను మూడు గుణాల గురించి నీకు చెప్పాను కదా.వాటన్నిటిలోకి సత్త్వగుణం అనేది పరిశుద్ధమయినది.అది మానవుడికి జ్ఞాన ప్రకాశాన్ని ,ఆత్మ ప్రబోథాన్ని కలిగిస్తుంది.అంతేనా?కాదు.అది మనలవి పాపాలనుండి దూరం చేస్తుంది.ఆ దిశగా మనం ప్రలోభపడకుండా చేస్తుంది.ఈ గుణం మెండుగా కలిగి వున్నవారు సౌఖ్యం,జ్ఞానం అనే వాటికి కట్టుబడి వుంటారు.ఇక్కడ సౌఖ్యం అంటే ప్రాపంచిక సుఖాలు కాదు.ఆత్మ పరంగా మనం పొందే ఆనందం,తృప్తి.
Wednesday, 5 February 2025
సత్త్వం రజస్తమ ఇతి
సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః।
నిబధ్నంతి మహాబాహో దేహే దేహిన మవ్యయమ్॥5॥
కృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఈ భౌతికమయిన ప్రకృతి వుంది కదా.ఇది సత్త్వగుణము,రజోగుణము మరియు తమోగుణములతో కూడి వుంటుంది.జీవి స్వతహాగా నిర్వికారుడే.కానీ ఒకసారి ప్రకృతితో అతనికి సంపర్కం కలిగిందంటే,ఆ త్రిగుణాలచేత బద్ధుడు అవుతాడు.ఇదంతా మాయ అనే వల విసిరినట్లే జీవి మీదకు.
Monday, 3 February 2025
సర్వయోనిషు కౌంతేయ
సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః।
తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా॥4॥
కృష్ణుడు అర్జునుడుతో ఇలా అంటున్నాడు.అనేక గర్భాల నుండి జన్మించిన శరీరాలన్నిటికీ తల్లి ప్రకృతి.ఈ విషయం మర్చిపోవద్దు.అన్నింటా బీజప్రదాతను నేనే.కాబట్టి ఆ పుట్టిన సమస్త ప్రాణి కోటికి నేనే తండ్రిని.
Subscribe to:
Posts (Atom)