Saturday, 13 December 2025
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః।
ప్రవృత్తే శస్త్ర సంపాతే ధను రుద్యమ్య పాండవః॥29॥1॥
శ్రీమద్భగవద్గీత..।అర్జున విషాద యోగము...
సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు.ఓ రాజా!పాండవులు పూరించిన శంఖనాదాలు భూమి ఆకాశాలు ప్రకంపించేలా చేసాయి.అప్పుడు అర్జునుడు కౌరవులను చూసాడు.అర్జునుడి ధ్వజము పైన హనుమంతుడు విరాజిల్లుతూ ఉన్నాడు.హనుమంతుడు అపారమయిన శక్తికి ,ధైర్యానికి,భయ విచ్ఛేదనకు ప్రతీక కదా!అర్జునుడు తన శస్త్రాలనూ,ధనుస్సునూ ధరించాడు.శ్రీకృష్ణుని తట్టు మళ్ళి ఇలా అన్నాడు.
స ఘోషో ధార్తరాష్ట్రాణాం
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్।
నభశ్చ పృథివీం చైవ తుములో ప్యనునాదయన్॥19॥1॥
శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము....
సంజయుడు వర్ణిస్తున్నాడు.ఆ వర్ణనకు ధృతరాష్ట్రుడికి చెమటలు పడుతున్నాయి.
రాజా!చెప్పాను కదా పాండవులు,వారి తరఫు యోథులు అందరూ తమ తమ శంఖాలను దిక్కులు పిక్కటిల్లేలా పూరించారు అని.ఆ ఘోష,ఆ శబ్దం కౌరవులను,వారి సేనల గుండెలను చీలుస్తున్నట్లు ఉంది.కౌరవ పక్షం వారందరూ లోలోపల భీతి చెందారు.ఆ శబ్దం భూమ్యాకాశాలను నిండిపోయింది.అంతేనా!ప్రతిధ్వనించింది కూడా!
యుద్ధంలో శత్రువుని భయపెట్టడం ఒక ప్రక్రియ.దానిలో పాండవులు ఉత్తీర్ణులు అయ్యారు.పదాతిదళాలను భయపెడితే సగం యుద్ధం గెలిచినట్లే!వాళ్ళ మనోధైర్యానికి బీటలు వారితే ఇంక మనకు తిరుగు ఉండదు.
Thursday, 11 December 2025
ద్రుపదో ద్రౌపదేయాశ్చ
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే।
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్॥18॥1॥
శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము...
సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు.ద్రుపదుడు,ద్రౌపది కొడుకులు అయిన అయిదుగురు ఉపపాండవులు,మిగిలిన చాలా మంది రాజులు ఉన్నారు యుద్ధ భూమిలో.యోధాగ్రేసరుడు అయిన సుభద్ర కొడుకు అభిమన్యుడు, పైన చెప్పిన రాజులు,వీరులు అందరూ తమ తమ శంఖాలను మళ్ళీ మళ్ళీ చాల సార్లు పూరించారు.యుద్ధం ఏ క్షణం అయినా మొదలు కావచ్చు.కాబట్టీ యుద్ధ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరూ తమను తమను తాము ఉత్తేజ పరుచుకుంటూ,తమ వారిని అందరినీ ఊపూ,ఉత్సాహంతో ముందుకు ఉరికేలా ప్రేరేపించుకుంటూ ఉన్నారు.
Tuesday, 9 December 2025
కాశ్యశ్చ పరమేష్వాస
కాశ్యశ్చ పరమేష్వాస శ్శిఖండీ చ మహారథః।
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకి శ్చాపరాజితః॥17॥1॥
శ్రీమద్భగవద్గీత....అర్జున విషాద యోగము
పాండవ పక్షాన పాండవులు ఒక్కరే కాదు,ఇంకా చాలా మంది మహారథులు ఉన్నారు.వారిలో మేటి విలుకాడు అయిన కాశీరాజు ఉన్నాడు.మహారధి అయిన శిఖండి ఉన్నాడు.ఓడి పోవడము అనే పదానికి కూడా అర్థం తెలియని మహావీరులు ధృష్టద్యుమ్నుడు,విరాటరాజు మిసు సాత్యకి ఉన్నారు.వీరందరూ మిగిలిన వీరులతో కలసి తమ శంఖాలను పూరించారు.
Monday, 8 December 2025
అనంత విజయం రాజా
అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠరః।
నకులః సహదేవశ్చ సుఘోష మణి పుష్పకౌ॥16॥1॥
శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము..
సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు.అతను పక్షపాతం లేకుండా ఇరు సైన్యాల గురించి,అక్కడ జరిగే కథా,కమామిషు గురించి సవివరంగా తెలియ చేసేదానికే కదా నియమించబడింది.
పాండవుల పక్షాన రాజు,కుంతీ పుత్రుడు అయిన యుధిష్ఠరుడు దివ్యమయిన తన అనంత విజయము అనే శంఖాన్ని పూరించాడు.వెను వెంటనే నకులుడు సుఘోషము అనే శంఖాన్ని,సహదేవుడు మణిపుష్పకము అనే శంఖాన్ని పూరించారు మంగళప్రదంగా,
Sunday, 7 December 2025
పాంచజన్యం హృషీకేశో
పాంచజన్యం హృషీ కేశో దేవదత్తం ధనంజయః।
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః॥15॥1॥
శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము...
శ్రీకృష్ణార్జునులు తమ తమ దివ్య శంఖాలను పూరించారు.ఆ శంఖాలకు కూడా పేర్లు ఉన్నాయి.అవి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు.శ్రీకృష్ణుడు తన పాంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు. అలాగే అర్జునుడు తన దేవదత్తమనే శంఖాన్ని పూరించాడు.భీముడికి వృకోదరుడు అనే ఇంకో పేరు కూడా ఉంది.వృకోదరుడు అంటే తోడేలు లాంటి పొట్టగలవాడు అని అర్థం.తోడేలుకు ఆకలి ఎక్కువ.ఎంత తిన్నా క్షణంలో అరుగుతుంది.పొట్టకూడా పల్చగా ఉంటుంది.ఇది మంచి శక్తిని సూచిస్తుంది.
భీముడు తనది అయిన పౌండ్రం అనే శంఖాన్ని భయంకరమైన శబ్దం వచ్చేలా పూరించాడు.ఆ ఘోషకు నలుదిక్కులూ వణకాల్సిందే,ఖచ్చితంగా!
Friday, 5 December 2025
తతః శ్శ్వేతైర్హయైర్యుక్తే
తతః శ్శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ।
మాథవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః॥14॥1॥
శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము...
కౌరవులు తమ తమ శంఖాలను పూరించిన తరవాత పాండవ పక్షంలో మొదలు అయింది.శ్రీకృష్ణార్జునులు తెల్లటి అశ్వాలను పూన్చిన రథం మీద ఉన్నారు.ఆ బావా బావమరుదులు ఇద్దరూ ఒకే సారి తమ దివ్యమయిన శంఖాలను పూరించారు.ఒళ్ళు పులకరించే దృశ్యం కదా!ఎవరికైనా వాళ్ళిదరినీ జంటగా అలా చూడటం,చూడగలగటం!
తతః శ్శంఖాశ్చ భేరశ్చ
తతః శ్శంఖాశ్చ భేరశ్చ పణవానక గోముఖాః।
సహసై వా భ్యహన్యంత స శబ్ద స్తుములోఽభవత్॥13॥1॥
శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము...
భీష్ముడు దుర్యోధనుడిని సంతోష పెట్టేదానికే కాదు,తమ సైన్యాన్ని ఉత్తేజ పరిచేదానికి కూడా సింహనాదం చేసి,తన శంఖాన్ని పూరించాడు.
ఎప్పుడూ ఒక సమూహంలో నాయకుడు ఏ భావాన్ని ప్రకటిస్తాడో,అతనిని అనుసరించేవాళ్ళు అందరూ అదే భావప్రకటనలోకి వెళ్ళిపోతారు.ఎవరికివారు ఆలోచించుకోరు,ఆలోచించలేరు,ఆలోచించనివ్వరు,అంత సమయం,సందర్భం,స్వేచ్ఛ కూడా ఇవ్వరు,ఉండదు.అందుకనే గొర్రెదాటు అంటారు.మన ముందు వాళ్ళు చేస్తున్నారని మనము స్పందిస్తాము.మనలని చూసి మన చుట్టు పక్కల వాళ్ళు ఇంకో పది మంది మనలాగే చేస్తారు,ప్రభావితులు అవుతారు.ఇలాగే గొలుసు ప్రభావంలాగా సాగిపోతుంది.
ఇక్కడ కూడా అది వినిన కౌరవ వీరులందరూ తమ తమ శంఖాలను పూరించారు.భేరీ,పణవానక,గోముఖాదులను మ్రోగించారు.ఆ శబ్దం,ఆ హోరుతో నాలుగు దిక్కులూ నిండిపోయాయి.ఇలా ఒకరినొకరుగా అందరూ ఉత్తేజం నింపుకున్నారు.
Wednesday, 3 December 2025
తస్య సంజనయన్ హర్షం
తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః।
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్॥12॥1॥
శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము
పొగడ్తలకు లొంగని వాళ్ళు,పొంగని వాళ్ళు ఈ భూప్రపంచంలో ఎవరూ ఉండరు.దానికి ఎవరం అతీతులం కాదు.
దుర్యోధనుడు భీష్ముడు మన నాయకుడు,అందరం కలసి ఆయనను రక్షించుకోవాలి అనగానే మనసు హాయిగా అయింది.ఎప్పుడైనా ఇచ్చుకోమ్మా వాయనం అంటే పుచ్చుకోమ్మా వాయనం అంటారు కదా!
అట్లాగే దుర్యోధనుడు తనను సంతోషపెట్టాడు కాబట్టి తను కూడా దుర్యోధనుడికి సంతోషం కలుగచేయాలనుకున్నాడు.అందుకని సింహనాదం చేసాడు.నలు దిక్కులు పిక్కటిల్లేలాగా భీష్ముడు తన శంఖాన్ని పూరించాడు.
Tuesday, 2 December 2025
అయనేషు చ సర్వేషు
అయనేషు చ సర్వేషు యథాభాగ మవస్థితాః।
భీష్మ మేవాభి రక్షంతు భవంత స్సర్వ ఏవ హి॥11॥1॥
శ్రీమద్భగవద్గీత....అర్జున విషాద యోగము...
దుర్యోధనుడు ముక్తాయింపుగా తమ వైపు వారు అందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు.ఇప్పుడు అందరికీ విషయం అర్థం అయింది కదా!మనవైపు వీరులు ఎక్కువ మంది ఉన్నారు.మనవైపు ఎక్కువ అక్షోహిణుల సైన్యం ఉంది.కాబట్టి మనకే గెలుపు అవకాశాలు ఎక్కువ.అలా అని ప్రత్యర్థి బలాలు మనము తక్కువ అంచనా వేయకూడదు.
కాబట్టి మన పక్షాన ఉన్న మీరందరూ కూడా మీ మీ నిర్ణీత స్థానాలలో అప్రమత్తంగా ఉండండి.అసలు మీకు కేటాయించబడిన ప్రదేశాలను విడవకుండా జాగరూకతతో ఉండండి.మనకందరికీ నాయకుడు వృద్ధ పితామహుడు భీష్ముడు.అతనికి అన్ని వైపుల నుంచి రక్షణ కవచంలా ఉండి కాపాడటం మీ ధర్మం!
అపర్యాప్తం తదస్మాకం
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం।
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్॥10॥1॥
శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము..
దుర్యోధనుడు ధైర్యంగా చెబుతున్నాడు.గురుపుంగవా!మన సైన్యం భీష్ముడుచే రక్షింపబడుతూ ఉంది.మన సైన్యం అపరిమితంగా ఉంది.పాండవ సైన్యం భీముడి సంరక్షణలో ఉంది.వారిది పరిమితమైన సైన్యము.
నిజమే!కౌరవుల దగ్గర పదకొండు అక్షౌహిణుల సైన్యం ఉంది.పాండవుల తట్టు ఏడు అక్షౌహిణుల సైన్యం ఉంది.
Monday, 1 December 2025
అన్యేచ బహవశ్శూరాః
అన్యే చ బహవ శ్శూరాః మదర్థే త్యక్త జీవితాః।
నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః॥9॥1॥
శ్రీమద్భగవద్గీత..అర్జున విషాద యోగము...
దుర్యోధనుడు తన తరఫున యుద్ధానికి సన్నధులు అయిన వీరుల గురించి ఇంకా ఇలా చెబుతున్నాడు.మహనీయులైన ద్రోణాచార్యా!నేను ఉటంకించిన వారు ఒక్క వీరులే కాదు.నా కోసరము తమ తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టగల సమర్థులు.అందరూ అస్త్ర శస్త్ర విద్యలలో నిష్ణాతులు.వీరే కాకుండా ఇంకా చాలా మంది శూరులు యుద్ధ విద్యా విశారదులు మన తరఫున మన వైపు ఉన్నారు.
Sunday, 30 November 2025
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః।
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవ చ॥8॥1॥
శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము...
దుర్యోధనుడికి తమ తట్టు ఎంత మంది వీరులు ఉన్నారో చెప్పేదానికి ఛాతి ఇంకాస్త పెద్దదయింది.ఒకళ్ళా?ఇద్దరా?ఒకళ్ళను మించిన వాళ్ళు ఇంకొకళ్ళు.మీసాలు మెలివేసి,తన భుజాలు తనే తట్టుకునే విషయం!
ఇలా చెబుతున్నాడు.ఓ బ్రాహ్మణోత్తమా!ద్రోణాచార్యా!మన తట్టు ఉండే హేమా హేమీల గురించి చెబుతాను,వినండి.అందరి కంటే మొదటి స్థానంలో మీరు ఉన్నారు.ఇంకా భీష్మ పితామహుడు,కర్ణుడు,కృపాచార్యుడు,అశ్వత్థామ,వికర్ణుడు,సౌమదత్తి మరియు జయద్రథుడు ఉన్నారు.వీళ్ళేకాదు ఇంకా చాలా మంది లెక్కకు మిక్కిలి ఉన్నారు.
Saturday, 29 November 2025
అస్మాకం తు విశిష్టాయే
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ।
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే॥7॥1॥
శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము...
దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని ఉద్దేశించి అంటున్నాడు.
హే గురువర్యా!మీరు బ్రాహ్మణోత్తములు!ఇంత సేపూ నేను మీకు పాండవ సైన్యంలోని వీరుల గురించి చెప్పాను కదా!ఇప్పుడు ఇంక మన సైన్యంలోని మహావీరుల గురించి చెబుతాను వినండి.
ఇక్కడే అర్థం అయిపోయింది కదా,మనకు.పాండవ సైన్యంలోని గొప్ప గొప్ప యోథుల గురించి ముక్తాయింపుగా,పొడి పొడి మాటలతో ముగించేసాడు.అదే తన వాళ్ళు,తన తరఫు వాళ్ళ గురించి చెప్పడంలో ఊపూ ఉత్సాహం తొంగి చూస్తున్నది.మహావీరుల గురించి చెబుతాను అని గర్వం తొణికిసలాడే గొంతుతో చెబుతున్నాడు.
యుధామన్యుశ్చ విక్రాంత
యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్।
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః॥6॥1॥
శ్రీ మద్ భగవద్గీత...అర్జున విషాద యోగము...
దుర్యోధనుడు ఇంకా మిగిలిన వీరుల గురించి చెబుతున్నాడు.నేను ఇప్పుడు తెప్పిన వీరులే కాదు.ఇంకా చాలా మంది మహారథులు పాండవుల తట్టు ఉన్నారు.వారిలో యుధామన్యుడు,ఉత్తమౌజుడు,అభిమన్యుడు,ద్రౌపదీ తనయులైన ఉపపాండవులు మహారథులే!
ధృష్టకేతు శ్చేకితానః
ధృష్టకేతు శ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్।
పురుజి త్కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః॥5॥1॥
శ్రీమద్భగవద్గీత..అర్జున విషాద యోగము
దుర్యోధనుడు ఇంకా చెబుతున్నాడు.గురుదేవా!ఇందాక చెప్పిన వాళ్ళే కాదు.ఇంకా వీరులు అయిన ధృష్టకేతు,చేకితానుడు,కాశీరాజు,పురుజిత్,కుంతిభోజుడు,శైబ్యాదులు కూడా పాండవ పక్షాన అటు ఉన్నారు.
Friday, 28 November 2025
అత్రశూరా మహేష్వాసా
అత్ర శూరా మహేష్వాసా భీమార్జున సమాయుధి।
యుయుధానో విరాటశ్చ దృపదశ్చ మహారథః॥4॥1॥
భగవద్గీత...అర్జున విషాద యోగము...ప్రథమ అధ్యాయము
సంజయుడు ద్రోణాచార్యుడికి దుర్యోధనుడు ఏమి చెబుతున్నాడో అనేది ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు. పాండవ సైన్యంలోని వీరులను దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి చూపిస్తున్నాడు.ఆచార్యా!ఆ పాండవ సైన్యాన్ని తిలకించండి.గమనిస్తున్నారు కదా!ఆ సైన్యంలో భీముడు,అర్జునుడితో సరితూగ గల యోథులు చాలా మంది ఉన్నారు.యుయుధానుడు అంటే సాత్యకి,విరాటుడు,ద్రుపదుడు మున్నగువారు ఉన్నారు.
మహారథి అంటే ఏకకాలంలో పన్నెండు మంది అతిరథులతో లేక 7,20,000లయోథులతో యుద్ధం చేయగలవాడు.
Friday, 21 November 2025
పశ్యైతాం పాండుపుత్రాణాం
పశ్యైతాం పాండు పుత్రాణాం ఆచార్య మహతీం చమూమ్।
వ్యూఢాం దృపద పుత్రేణ తవ శిష్యేణ ధీమతా॥3॥1॥
సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధభూమిలో జరిగేది కళ్ళకు కట్టినట్లుగా చెబుతున్నాడు.
దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో ఇలా అంటున్నాడు.ఆచార్యా!దృపద నందనుడు అయిన ధృష్టద్యుమ్నుడు తెలుసు కదా!అదే మీ శిష్యుడు భలే బుద్ధిశాలి!అతను వ్యూహాకారంగా తీర్చిన పాండవ సైన్యాన్ని పరికించండి.
Wednesday, 19 November 2025
దృష్ట్వా తు పాండవానీకం
సంజయ ఉవాచ....
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా।
ఆచార్య ముపసంగమ్య రాజా వచన మబ్రవీత్॥2॥1॥
సంజయుడు ధృతరాష్ట్రుడి ఆదుర్దా అర్థం చేసుకునినాడు.ప్రశాంతంగా చెబుతున్నాడు.ఓ ధృతరాష్ట్ర మహారాజా!ఇరు వైపులా రెండు సేనలు తమ తమ బలాలూ,బలగాలతో సంసిద్ధంగా ఉన్నాయి.ఇంకొంచెం సేపట్లో యుద్ధం మొదలవుతుంది అనగానే నీ కొడుకు అయిన దుర్యోధనుడు ఒకసారి పాండవుల సైన్య వ్యూహాన్ని చూసాడు.తమ ఆచార్యులు అయిన ద్రోణుడిని సమీపించి ఇలా అన్నాడు.
ప్రధమ అధ్యాయము -అర్జున విషాద యోగము…ధర్మక్షేత్రే కురుక్షేత్రే
ధృతరాష్ట్ర ఉవాచ...
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః।
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ॥1॥
కురు క్షేత్ర యుద్ధంకి అన్ని సన్నాహాలూ అయిపోయాయి.పోరు సలిపేదానికి ఇరు వర్గాలూ రణభూమి చేరుకున్నాయి.ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడు కదా!కనిపించదు.రణరంగానికి వెళ్ళి యుద్ధం చేయలేడు.కానీ ఏమవుతుందో అనే ఆదుర్దా,గెలవాలనే ఆకాంక్ష మనిషిని నిలువనీయవు కదా!యుద్ధభూమిలో జరిగేవి జరిగినట్లు,కళ్ళకు కట్టినట్లు చెప్పగలిగేదానికోసరం ,సంజయుడికి దివ్యదృష్టి కలిగించడం జరిగింది.దాని ఆసరాతో సంజయుడు మందిరంలో ధృతరాష్ట్రుడి పక్కనే కూర్చుని,యుద్ధం ఎలా జరుగుతుందో చెప్పేదానికి ఉపక్రమించాడు.
ఈ లోపలే ధృతరాష్ట్రుడికి తొందర!తన కొడుకులు దాయాదులతో తేల్చుకునేదానికి పోరు బాట పట్టారు కదా!అందుకే అడుగుతున్నాడు.
సంజయా!ధర్మ భూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేసేదానికి సమకూడుకున్నారు కదా అందరూ!నా తరఫున నా బిడ్జలు,దుర్యోధనాదులు,ఆవలి తట్టున పాండవులు యేమి చేశారు?
Tuesday, 18 November 2025
భగవద్గీత పారాయణ మొదలు
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్।
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే॥1॥
ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్।
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవేనమః॥2॥
ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్య శ్రవణ కీర్తనమ్।
వాసుదేవమ్ జగద్యోనిం నౌమి నారాయణం హరిమ్॥3॥
ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే।
నమో వైబ్రహ్మ నిథయే వాసిష్ఠాయ నమో నమః॥4॥
ఓం నారాయణం నమస్కృత్వ నరం చైవ నరోత్తమమ్।
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్॥5॥
Sunday, 16 November 2025
మాహాత్మ్య మేతద్ గీతాయా
మాహాత్మ్య మేతద్గీతా యా మయా ప్రోక్తం సనాతనమ్।
గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్॥23॥
గీతా మాహాత్మ్యం సంపూర్ణమ్!
మనందరి భగవంతుడు మరలా నొక్కి చెబుతున్నాడు.భగవద్గీత అతి పురాతనము అయినది.నాచే వచింపబడింది.ఈ మాహాత్మ్యము భగవద్గీత పఠనానంతరం పారాయణం చేయాలి.అలా చేసే మానవుడు దీని యందు చెప్పబడిన ఫలితాలు అన్నీ తప్పకుండా పొందుతాడు.ఇది నా మాట!
భగవద్ గీతా మాహాత్మ్యము సంపూర్ణము!
Friday, 14 November 2025
ఏతాన్మాహాత్మ్య సంయుక్తం
ఏతాన్మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః।
సతత్ఫలమవాప్నోతి దుర్లభాం గతి మాప్నుయాత్॥22॥
భగవంతుడు మళ్ళీ మళ్ళీ నొక్కి చెబుతున్నాడు.ఎవరైతే గీతా శాస్త్రముతో పాటుగా గీతా మహత్మ్యము కూడా చదువుతారో వారు ధన్యులు.వారు పైన ఉదహరించిన రీతిగా గొప్ప గొప్ప ఫలితాలు పొందుతారు.అంతే కాకుండా మోక్షప్రాప్తికూడా సాథిస్తారు
గీతాయాః పఠనం కృత్వా
గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్।
వృథా పాఠో భవేత్తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః॥21॥
భగవంతుడు అయిన నారాయణుడు భూదేవికి చెబుతున్నాడు.ఓ భూదేవి!ప్రతి ఒక్కరూ భగవద్గీతను పారాయణం చేయాలి.దానితో పాటే ఈ మహాత్మ్యంకూడా చదవాలి.లేకపోతే ఆ పారాయణ వ్యర్థమవుతుంది.దాని ఫలము,ఫలితమూ ఆయాసమే కానీ ఫలదాయకము కాదు.
Wednesday, 12 November 2025
గీతామాశ్రిత్య బహవో
గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః।
నిర్దూత కల్మషాలోకే గీతాయాతాః పరం పదమ్॥20॥
భగవంతుడు భూదేవికి ఇలా చెబుతున్నాడు.ఓ భూదేవీ!నీకు ఈ విషయం తెలుసా!జనకుడు,ఇంకా చాలా మంది మహనీయులు గీతను ఆశ్రయించారు.ఒక రకంగా చెప్పాలంటే ఈ భగవద్గీతా శాస్త్రాన్ని ఆశ్రయించడం మూలానే వారు తమ పాపాలను ప్రక్షాళనం చేసుకోగలిగారు.పరమ పవిత్రమయిన పరమ పదాన్ని సునాయాసంగా పొందగలిగారు.
Tuesday, 11 November 2025
గీతార్థం ధ్యాయతే నిత్యం
గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః।
జీవన్ముక్తస్య విజ్ఞేయో దేహాంతే పరమం పదమ్॥19॥
మనుష్యులు పొద్దున లేచి ఏదో ఒక పనిలో నిమగ్నమవుతారు.ఈ పనులు చేసేవాళ్ళు గీతాపఠనానికి అర్హులు,ఇంకోరు కాదు అని ఏమీ లేదు.ఎటువంటి కర్మాచరణులు అయినా సరే ప్రతిదినమూ సార్ధకంగా గీతాపారాయణ చేయవచ్చు.అలా చేసే వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు.జ్ఞానవంతులు అవుతారు.చివరకు పరమపదాన్ని చేరుకుంటారు.
Sunday, 9 November 2025
గీతార్థ శ్రవణాసక్తో
గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయుతోపివా।
వైకుంఠం సమ వాప్నోతి విష్ణునా సహమోదతే॥18॥
విష్ణువు చెబుతున్నాడు.భూదేవీ!జీవితంలో ఎన్ని పాపాలు చేసినా సరే!భగవద్గీతను అర్థ యుక్తంగా వినేదానికి,చదివేదానికి శ్రద్థ,జిజ్ఞాస చూపిస్తే చాలు.వాడు ఖచ్చితంగా వైకుంఠాన్ని పొందుతాడు.అక్కడ విష్ణువు అనుభవించేవన్నీ తనూ అనుభవిస్తాడు.
అంటే దీని అర్థం చెబుతాను.భగవద్గీతా పఠనం సర్వపాప ప్రక్షాళనం చేస్తుంది.భగవద్గీతను నమ్ముకుంటే సరాసరి మోక్షానికి దారి కనుక్కున్నట్లే!
Saturday, 8 November 2025
గీతాభ్యాసం పునః కృత్వా
గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమామ్।
గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్॥17॥
భగవంతుడు అయిన శ్రీహరి ఇంకా ఇలా చెబుతున్నాడు.భగవద్గీత పారాయణము చేస్తూ మరణించిన వారు మరలా మనుష్య జన్మనే పొందుతారు అని చెప్పాను కదా!వారు మళ్ళీ మళ్ళీ జన్మలలో కూడా గీతాధ్యయనం కొనసాగిస్తారు.చివరకు మోక్షం ప్రాప్తం అవుతుంది.గీతను స్మరిస్తూ మరణించినవారు ఖచ్చితంగా సద్గతి పొందుతారు.
Friday, 7 November 2025
చంద్రలోక మవాప్నోతి
చంద్రలోక మవాప్నోతి వర్షాణా మయుతం ధృవమ్।
గీతాపాఠ సమాయుక్తో మృతోమానుషతాం వ్రజేత్॥16॥
భగవంతుడు భూదేవితో అంటున్నాడు.భూదేవీ!నీకు ఇంకా ఈ విషయం తెలుసా!అసలు నేను ఈ భగవద్గీత వల్లనే స్థిరుడుగా ఉన్నాను.భగవద్గీతలోనే,దాని సారంలోనే నేను నివసిస్తున్నాను.దీని మూలంగానే,దాని ఆధారంగానే,దీని పద్థతి ప్రకారంగానే నేను ముల్లోకాలనూ పాలిస్తున్నాను.
కాబట్టి గీతాధ్యయనం చేస్తూ మరణించినవారు మరలా ఉత్తమమయిన మానవ జన్మనే పొందుతారు.ముందర చెప్పినట్లు గీతలో కొసరంత రోజూ చదువుకుంటున్నా చంద్రలోకంలో పదివేల సంవత్సరాలు ఉంటారు.
Thursday, 6 November 2025
గీతాయాః శ్లోక దశకం
గీతాయాః శ్లోక దశకం సప్త పంచ చతుష్టయమ్।
దౌత్రీనేకం తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః॥15॥
భగవంతుడు ఎంత దయామయుడు!ప్రార్థించే మనసు ముఖ్యం అని ఎరిగినవాడు.అందుకే ఇలా చెబుతున్నాడు.ఓ భూదేవీ!రోజుకు పది శ్లోకాలు చదివినా చాలు.అలాగే యేడు గానీ,ఐదు గానీ రెండుగానీ,తుదకు ఒక్కటికానీ,అదీ వీలు కాకపోతే కనీసం సగము శ్లోకము,భగవద్గీత లోనిది,ప్రతి దినమూ భక్తితో చదివితే చాలు.
అలా చదివే వాళ్ళు పదివేల సంవత్సరాలు చంద్రలోకంలో ఉంటారు.
అధ్యాయ శ్లోక పాదం వా
అధ్యాయ శ్లోక పాదం వా నిత్యం యః పఠతే నరః।
సయాతి నరతాం యావన్మనుకాలం వసుంథరే॥14॥
భూదేవీ!ఇంకా ఇది కూడా చెబుతాను విను.అధ్యాయంలోని నాలుగో వంతు చదివినా రోజూ,మంచే జరుగుతుంది.ప్రతి నిత్యమూ భగవద్గీతలోని ఒక అధ్యాయములోని నాలుగవ వంతు పఠించినా,పారాయణము చేసినా ఒక మన్వంతరము మొత్తమూ మానవ జన్మనే పొందుతారు.సృష్టిలో మానవ జన్మ ఉత్తమమయినది అని అంటారు కదా!
Tuesday, 4 November 2025
ఏకాధ్యాయంతు యోనిత్యం
ఏకాధ్యాయంతు యోనిత్యం పఠతే భక్తి సంయుతః।
రుద్రలోక మవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరమ్॥13॥
భగవంతుడి అభిప్రాయము ఏందంటే మనము ఒక పని చేసేటప్పుడు ఉండాల్సిన నియమనిష్ఠలు,భక్తిభావము,సత్సంకల్పము సరిగ్గా,సజావుగా ఉండాలి అని.
అందుకే చెబుతున్నాడు.ఓ భూదేవీ!రోజుకు ఒక అధ్యాయము అయినా మనస్పూర్తిగా,ధ్యాసగా పఠించినా ఫలితము దక్కుతుంది.రోజూ ఒక్క అధ్యమైనా పఠించి,పారాయణ చేసేవాళ్ళు రుద్రలోకాన్ని పొందుతారు.ప్రమద గణాలతో చేరి,స్థిర నివాసము ఏర్పరుచుకుంటారు.
Monday, 3 November 2025
యోష్టాఽదశ జపేన్నిత్యం
యోష్టాఽదశ జపేన్నిత్యం నరో విశ్చల మానసః।
జ్ఞానసిద్ధిం చ స లభతే తతో యాతి పరంపదమ్॥10॥
భగవంతుడు భూదేవితో అంటున్నాడు.ఓ భూదేవీ!ఎవరు అయితే ప్రతిరోజూ గీతా పారాయణము చేస్తారో,వారు ఇహంలో బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతారు.అంతేకాకుండా అంత్యంలో మోక్షాన్ని పొందుతారు.ఇందులో ఢోకా లేదు.
త్రిభాగం పఠమానస్తు
త్రిభాగం పఠమానస్తు గంగాస్నాన ఫలం లభేత్।
షడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్॥12॥
భగవంతుడు అయిన శ్రీహరి భూదేవికి ఇంకా ఇలా చెబుతున్నాడు.ఓ భూదేవీ!భగవద్గీతలోని ఆరు అధ్యాయాలు,అదే మూడవ వంతు పారాయణము చేస్తే గంగలో స్నానము చేసిన ఫలము దక్కుతుంది.గంగ మనకు పుణ్యనది కదా!అలా కాకుండా మూడు అధ్యాయాలు,అదే ఆరవ భాగం పారాయణ చేస్తే సోమయాగ ఫలం లభిస్తుంది.
Sunday, 2 November 2025
పాఠేఽసమర్థ స్సంపూర్ణే
పాఠేఽసమర్థ స్సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్।
తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః॥11॥
భగవంతుడికి మానవుల అశక్తత బాగా తెలుసు.అందుకే చెబుతున్నాడు.ఓ భూదేవీ!మానవులు గీతాపారాయణము సంపూర్ణంగా చేయలేకపోతున్నాము,ఎలా?అని దిగులు పడనక్కరలేదు.
పూర్తిగా గీతా పారాయణ చేసే శక్తి,సమయం,ఇతరత్రా కారణాలు లేకపోయినా,సగము పారాయణ చేసినా ఫలితము దక్కుతుంది.సగము పారాయణ చేసుకున్న వారికి గోదాన పుణ్యము లభిస్తుంది.
హిందూ సంప్రదాయంలో గోవుకు చాలా మహత్మ్యము ఉంది.అలాంటి గోవును దానము చేసిన ఫలము అంటే సామాన్యము కాదు.
Saturday, 1 November 2025
చిదానందేన కృష్ణేన
చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోఽర్జునమ్।
వేదత్రయీ పరానందా తత్త్వార్థ జ్ఞానమంజసా॥9॥
భగవద్గీత అనేది ఆషామాషీగా తీసుకునే గ్రంథరాజము కాదు.ఇందులో మూడు వేదాల సారము ఇమిడి ఉంది.సత్ చిత్ ఆనందము,మోక్షానికి మార్గము చూపేది,దీని సారము.మనిషికి కావలసిన,అవసరమయిన తత్త్వాలగురించి వివరంగా చెప్పబడి ఉంది.
ఇలా మనసును ప్రక్షాళన చేసే అన్ని విషయాలు క్రోడీకరించబడిన ఈ గీత స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడి నోట అర్జునుడికి ఉపదేశించబడింది.కాబట్టి సర్వ మానవాళికి ఇది శిరోథార్యము.
Thursday, 30 October 2025
గీతా మే పరమావిద్యా
గీతా మే పరమావిద్యా బ్రహ్మరూపా న సంశయః।
అర్థమాత్రా క్షరా నిత్యా స్వనిర్వాచ్య పదాత్మికా॥8॥
శ్రీకృష్ణ పరమాత్ముడు అయిన భగవంతుడు అంటున్నాడు.ఓ భూదేవీ!భగవద్గీత పరమపదాన్ని బోధించే విద్యను మానవాళికి సమకూర్చుతుంది.ఇదే పరబ్రహ్మ స్వరూపము.ఇదే అర్థమాత్ర.గీతా సారము నాశనము లేనిది.శాశ్వతమయినది.స్వయంగా ప్రకాశించేది.స్వబోధం అయినది.స్వకీయం అయినది.భగవద్గీత అంటే నిర్దిష్టంగా ఇది అని ఎవ్వరూ ప్రకటించలేరు.ఎందుకంటే ఇది విశ్వ వ్యాపకము.ఇది స్పృశించని గుణం,భావము,భావన,విషయ సంగ్రహణ అంటూ ఏమీ మిగిలి లేవు.ఇది ఉత్తమోత్తమ మయిన గ్రంథ రాజము.
అర్థమాత్ర అనేది ఓం కార రూపంలోని సూక్ష్మ భాగము.ఇది బిందువు,నాదముల కలయికతో అ,ఉ,మ తర్వాత నాలుగో భాగంగా గుర్తించ బడింది.
Wednesday, 29 October 2025
గీతాశ్రయోఽహం తిష్ఠామి
గీతాశ్రయోఽహం తిష్టామి గీతా మే చోత్తమం గృహమ్।
గీతా జ్ఞాన ముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహమ్॥7॥
భగవంతుడు చెబుతున్నాడు.ఓ భూదేవీ!ఈ భగవద్గీత వలననే నేను స్థిరుడుగా ఉన్నాను.దానిలోనే నివసిస్తున్నాను.దాని ప్రకారంగానే నేను ముల్లోకాలనూ పాలిస్తున్నాను.
యత్ర గీతా విచారశ్చ
యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతమ్।
తత్రాహం నిశ్చితం పృథ్వి నివసామి సదైవహి॥6॥
శ్రీ మహా విష్ణువు భూదేవికి దిలాసా ఇస్తున్నాడు.ఓ భూదేవీ!ఎక్కడ ఈ భగవద్గీతా పారాయణము చేయబడుతుందో,చేయించబడుతుందో,చెవులకు శ్రావ్యంగా వినబడుతుందో,అది భూతల స్వర్గము అనుకో!ఎందుకంటావా?ఎందుకంటే,అక్కడ సర్వ దేవతలూ,సర్వ తీర్థాలే కాదు....నేను కూడా అక్కడే ఉండి తీరతాను!
Tuesday, 28 October 2025
సర్వే దేవాశ్చ ఋషయో
సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చయే।
గోపాలా గోపికా వాఽపి నారదో ద్థవ పార్షదాః।
సహాయా జాయతే శీఘ్రం,యత్ర గీతా ప్రవర్తతే॥5॥
నారాయణుడు భూమాతతో చెబుతున్నాడు.భగవద్గీత ప్రాశస్త్యము చెప్పనలవి కానిది.ఎందుకంటే ముప్పై మూడుకోట్ల దేవతలు,మునులు,యోగులు,పన్నగులు,గోపాలకులు,గోపికలు,నారదుడు,ఉధ్ధవుడు,వైకుంఠద్వారపాలకులు...ఇలా ఒకరేంది?అందరూ అన్ని వేళలా గీతా పారాయణము చేసేవారికి సహాయ సహకారాలు అందించేదానికి సన్నిద్ధంగా ఉంటారు.
గీతాయాః పుస్తకం
గీతాయాః పుస్తకం యత్ర,యత్ర పాఠః ప్రవర్తతే।
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్రవై॥4॥
భగవద్గీత సన్మార్గానికి నిఘంటువు.ఈ పవిత్ర గ్రంథం ఎక్కడెక్కడ ఉంటుందో,ఎక్కడక్కడ దాని పారాయణం జరగుతుంటుందో అది ఒక పుణ్యక్షేత్రము అవుతుంది.అక్కడ ప్రయాగ మున్నగు నిఖిల తీర్థాలూ ఉంటాయి.అందులో అనుమానమే లేదు.
Monday, 27 October 2025
మహా పాపాది పాపాని
మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్।
క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీ దళ మంభసా॥3॥
తామరాకు మీద నీటి బొట్టు అనే నానుడి ఉంది కదా!నీరు తామరాకు పైన ఉన్నా తడి తామరాకుకు అంటదు.పాదరసంలాగా జారి పోతుంటుంది.ఇక్కడ విష్ణుమూర్తి కూడా ఇదే చెబుతున్నాడు.గీతా పారాయణం చేసేవాళ్ళను ఎటువంటి మహాపాపాలూ అంటవు.అంటలేవు!
Sunday, 26 October 2025
ప్రారబ్థం భుజ్యమానోఽపి
విష్ణురువాచ....
ప్రారబ్థం భుజ్యమానోఽపి,గీతాభ్యాసర తస్సదా।
సముక్తస్ససుఖీ లోకే కర్మణా నోపలిప్యతే॥2॥
విష్ణువు భూదేవితో చెబుతున్నాడు.ఓ భూదేవీ!మనిషి జన్మ ఎత్తిన ప్రతివాడూ ప్రారబ్థాన్ని అనుభవించాలి.అది అందరికీ తెలిసిందే!కానీ భగవద్గీతను పారాయణ చేసేవాడికి ఎలాంటి కర్మలు అంటవు.అతడు జీవన్ముక్తుడు అవుతాడు.నిరంతరమూ సుఖంగా ఉంటాడు.
శ్రీమద్భగవద్గీతా మాహాత్మ్యము…భగవాన్ పరమేశాన
ధరో ఉవాచ...
భగవన్ పరమేశాన భక్తి రవ్యభిచారిణీ।
ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో॥॥1॥
భగవద్గీత యొక్క మహత్యము అంతా ఇంతా కాదు.అది ఇక్కడ ప్రస్ఫుటమవుతుంది.
ధరా అంటే భూమి.భూమి భగవంతుడిని అడుగుతున్నది
ఓ భగవంతుడా!మనుష్యులు ప్రారబ్ధ కర్మలలో మునిగి తేలుతున్నారు.తత్ కారణంగా పాపభారాన్ని మోస్తూ పాపులు అవుతున్నారు.వారందరూ చలించని భక్తి, చెరగని ముక్తి లభించాలంటే ఏమి చేయాలి?
Saturday, 25 October 2025
మంగళ శ్లోకాలు
వాగార్ధ వివసంపృక్తౌ నాగార్థ ప్రతిపాదితౌ।
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ॥
జయత్వతి బలోరామో లక్ష్మణశ్చ మహాబలః।
రాజా జయతు సుగ్రీవో రాఘవే ణాభి పాలితః॥
ఆపదా మపహర్తారం- దాతారం సర్వ సంపదామ్।
లోకాభిరామం శ్రీరామం -భూయో భూయో నమామ్యహమ్॥
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే।
చక్రవర్తి తనూజాయ సార్వభూమాయ మంగళమ్॥
శ్రీవాగ్దేవీం మహాకాళీం -మహాలక్ష్మీం సరస్వతీమ్।
త్రిశక్తి రూపిణీ మంబాం -దుర్గాం చండీం నమామ్యహమ్॥
యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా।
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే॥
నారాయణం నమస్కృత్వ నరంచైవ నరోత్తమమ్।
దేవీ సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్॥
శ్రీ గీతా ధ్యానము
పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయమ్।
వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహా భారతమ్॥
అద్వైతామృతవర్షిణీం భగవతీ మష్టాదశాధ్యాయినీమ్।
అమ్బత్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్॥
గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితమ్।
వేదవ్యాస వివర్జితం శ్రుతిశిరోబీజం ప్రబోధాంకురమ్॥
నానాశాస్త్ర రహస్య శాఖ మరతిక్షాంతి ప్రవాలాంకితమ్।
కృష్ణాంఘ్రిద్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినామ్॥
సంసార సాగరం ఘోరం తర్తుమిచ్ఛతి యో నరః।
గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సః॥
సర్వోపనిషదో గావో దోగ్థా గోపాల నందనః।
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్థం గీతామృతం మహత్॥
ఇలా ధ్యానం చేసుకోవాలి.మనసును కుదురుగా ఉంచుకోవాలి.రోజుకు ఒక అధ్యాయము లెక్కన చదివినా మంచిదే!పారాయణ అనంతరము గీతా మహాత్మ్యము లోని మొదటి మూడు శ్లోకాలు చదువుకోవాలి.
Friday, 24 October 2025
శ్రీ కృష్ణ ధ్యానము
ఓం ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైక పాణయే।
జ్ఞాన ముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమః॥
వసుదేవసుతం దేవం కంస చాణూర మర్దనమ్।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్॥
భీష్మ ద్రోణ తటా జయద్రథ జలా గాంధార నీలోత్పలా।
శల్య గ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా॥
అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధనా వర్తినీ।
సోత్తీర్ణా ఖలు పాణ్డవై రణనదీ కైవర్తకః కేశవః॥
మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిమ్।
యత్కృపా తమహం వందే పరమానంద మాధవమ్॥
యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వన్తి దివ్యైః స్తవైః।
వేదైస్సాంగ పదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః॥
ధ్యానా వస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో।
యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః॥
శ్రీ వ్యాస ధ్యానము
...............
నమోఽస్తుతే వ్యాస విశాలబుద్ధే ఫుల్లార విందాయ త పత్రనేత్ర।
యేన స్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః॥
Wednesday, 22 October 2025
శ్రీ భగవద్గీతా పారాయణ క్రమము
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే॥
ఓం అఖండ మండలాకారం వ్యాప్తంయేన చరాచరమ్।
తత్పదం దర్శితంయేన తస్మై శ్రీ గురవే నమః॥
ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్య శ్రవణ కీర్తనమ్।
వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిమ్॥
ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్॥
ఓం వ్యాసం వశిష్ట నప్తారం శక్తేః పౌత్ర మకల్మషమ్।
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్॥
మనసును ఏకాగ్రము చేసి మనకు మనము అర్జునుడు లాగా ఊహించుకోవాలి.ఆ భగవంతుడే స్వయముగా మనకు భగవద్గీత ఉపదేశిస్తున్నట్లుగా భావించాలి.
వినియోగాదిః
..........
ఓం అస్య శ్రీ మద్భగవద్గీతా శాస్త్ర మహామన్త్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః
శ్రీ కృష్ణ పరమాత్మా దేవతా,
అశోచానన్వ శోచస్త్వమితి బీజమ్॥
సర్వధర్మా న్పరిత్యజ్య మామేకం శరణం వ్రజేతి శక్తిః।
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ ఇతి కీలకమ్।
మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరీష్యః ఇతి కవచమ్।
కిరీటినం గదినం చక్రహస్తమ్ ఇతి అస్త్రమ్।
అనాది మధ్యాంత మనంతవీర్యం ఇతి ధ్యానమ్।
జ్ఞాన యజ్ఞేన భగవదారాధనార్దే।
శ్రీకృష్ణ పరమాత్మ ప్రీత్యర్థే జపే వినియోగః॥
కరన్యాసము
........
నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః....ఇత్యంగుష్ఠాభ్యాం నమః
(రెండు చేతులు బొటన వ్రేళ్ళను రెండు చూపుడు వ్రేళ్ళతో తాకవలెను.)
నచైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః...ఇతి తర్జనీభ్యాం నమః
(చూపుడు వ్రేళ్ళను బొటన వ్రేళ్ళతో తాకవలెను.)
అచ్చేద్యోయమదాహ్యోఽయమక్లేద్యోఽశోష్య ఏవచ...ఇతి మధ్యమాభ్యాం నమః
(నడిమి వ్రేళ్ళను బొటన వ్రేళ్ళతో తాకవలెను.)
నిత్యః సర్వగతః స్థాణురచలోఽయం సనాతనః....ఇత్యనామికాభ్యాం నమః।
(ఉంగరపు వ్రేళ్ళను బొటన వ్రేళ్ళతో తాకవలెను.)
పశ్య మే పార్థ రూపాణి శతశోఽథ సహస్రసః...ఇతి కనిష్ఠికాభ్యాం నమః।
(చిటికెన వ్రేళ్ళను బొటన వ్రేళ్ళతో తాకవలెను.)
నానా విధాని దివ్యాని నానావర్ణకృతీని చ...ఇతి కరతల పృష్ఠాభ్యాం నమః।
(రెండు అరచేతుల వెనకవైపులను క్రమముగా స్పృశించ వలెను.)
అంగన్యాసము
............
నైనం ఛిందంతి శస్త్రాణి-నైనం దహతి పావకః....ఇతి హృదయాయ నమః।
(కుడి చేతితో హృదయమును స్పృశించుకోవలెను.)
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః... ఇతి శిరసే స్వాహా।
(కుడి తేతితో హృదయము స్పృశించుకోవలెను.)
అచ్ఛేద్యోఽయ మదాహేయోఽయ మక్లేద్యోఽశోష్య ఏవ చ...।ఇతి శిఖాయై వషట్।
(శిఖను తాకవలెను.)
నిత్య స్సర్వగతః స్థాణురచలోఽయం సనాతనః...ఇతి కవచాయ హుం।
(కుడి చేత ఎడమ భుజమును,ఎడమ చేత కుడి భుజమును తాకవలెను.)
పశ్య మే పార్థ రూపాణి శతశోఽథ సహస్రశః....ఇతి నేత్ర త్రయాయ వౌషట్।
(కుడి చేత నేత్రములను తాకవలెను.)
నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతీని చ...ఇత్యస్త్రాయ ఫట్।
(కుడి చేయి తలచుట్టూ త్రిప్పుకుని నడి వ్రేలుతో ఎడమ చేత చప్పట్లు కొట్టవలెను.)
పిమ్మట ధ్యానము చేయవలెను.
మహా భారత ధ్యానము
.................
పారాశర్య వచః సరోజ మమలం గీతార్థ గంధోత్కటమ్।
నానాఖ్యానక కేసరం హరికథా సంబోధనా బోధితమ్॥
లోకే సజ్జన షట్పదైరహరహః పేపాయమానం ముదా।
భూయాద్భారత పంకజం కలిమల ప్రథ్వంసినః శ్రేయసే॥
Tuesday, 21 October 2025
శ్రీ భగవద్గీతా పూజా విధాన క్రమము
భగవద్గీతను భక్తి విశ్వాసముతో పూజించుకొననవచ్చును.అవినాశనము,అద్భుతమయిన కర్మకర్తృత్వము,విభూతి,అధికారము,సర్వజ్ఞత,అఖండ శక్తి...ఈ ఆరింటినీ భగము అని అంటారు.ఈ ఆరు గుణాలూ కలిగిన వారిని భగవంతుడు అని అంటారు లేక భగవతీ అని అంటారు.మనము శ్రీకృష్ణుడిని భగవంతుడుగా నమ్మాము.అతని చేత చెప్పబడినది కాబట్టి భగవద్గీత అనే నామం సార్థకమయినది.అంతేకాదు.అది భగవద్వాణి కాబట్టి గీతను భగవతీ అని,అద్వైతామృతవర్షిణి అని,అంబ అని,భవద్వేషిణి అని అందరూ నమ్మి కీర్తిస్తారు.
కాబట్టి భగవద్గీతను పూజించడమంటే భగవదారాథన చేసినట్లే!మార్గశిర శుద్ధ ఏకాదశి గీతాదయంతి.ఆ రోజు పూజించికోవచ్చు.మంచి పని చేసేదానికి ప్రతిరోజూ మంచిరోజే కాబట్టి ఎప్పుడైనా పూజించుకోవచ్చు.
మామూలుగా ఆచమనం,ప్రాణాయామం,ఘంటారావం,సంకల్పం చెప్పుకోవాలి.ముందుగా గణపతి పూజ చేసుకోవాలి.కృష్ణ అష్టోత్తర శతనామావళి,గీతా అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి.
వక్త్రాణి పంచజానీహి పంచాధ్యాయాననుక్రమాత్।
దశాధ్యాయాః భుజాశ్చైక ముదరంద్వే పదాంబుజే॥
ఏవమష్టాదశాధ్యాయీ వాంగ్మయీ మూర్తిరీశ్వరీ।
జానీహి జ్ఞానమాత్రేణ మహాపాతకనాశినీ॥
ఓం గీతాయై నమః ధ్యానం సమర్పయామి
సర్వతీర్థ మయై నమః ఆవాహయామి
అక్షరాయై నమః ఆసనం సమర్పయామి
మల నిర్మోచిన్యై నమః పాద్యం సమర్పయామి
సత్యాయై నమః అర్ఘ్యం సమర్పయామి
విష్ణోర్వక్త్రా ద్వినిసృతాయై నమః ఆచమనం సమర్పయామి
వంద్యాయై నమః పంచామృత స్నానం సమర్పయామి తదుపరి శుద్ధోదక స్నానం సమర్పయామి
విశ్వ మంగళ కారిణ్యై నమః వస్త్ర యుగ్మం సమర్పయామి సర్వ శాస్త్రమయై నమః యజ్ఞోపవీతం తదుపరి ఆభరణాని
సమర్పయామి
సర్వైశ్వర్య ప్రదాయిన్యై నమః శ్రీ గంధం సమర్పయామి భారతామృత సర్వస్యాయై నమః పుష్పాక్షతాన్ సమర్పయామి.
।।।।।।।।।।।।।।॥॥॥।।।।।
ఓం ఇతి శ్రీ భగవద్గీతా అష్టోత్తర శతనామావళి పుష్పాంజలి పూజాం కరిష్యామి
ఓం అష్టాదశాధ్యాయిన్యై నమః నానావిథ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి
ఓం భవ ద్వేషిణ్యై నమః ధూపమాఘ్రాపయామి
ఓం సర్వోపనిషత్సార రూపిణ్యై నమః దీపం దర్శయామి
ఓం అద్వైతామృత వర్షిణ్యై నమః నైవేద్యం సమర్పయామి
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి,ఉత్తరాపోశనం సమర్పయామి
ఓం వ్యాసేన గ్రథితాయై నమః తాంబూలం సమర్పయామి
ఓం భారత పంకజ స్వరూపాయై నమః కర్పూర నీరాజనం సమర్పయామి
ఓం భయ శోకాది వివర్జితాయై నమః మంత్ర పుష్పం సమర్పయామి
ఓం లోక త్రయోప కారిణ్యై నమః ప్రదక్షిణం సమర్పయామి
ఓం సర్వజ్ఞాన మయ్యై నమః సర్వోపచార పూజాం కరిష్యామి
అనయా మయాకృత ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవతీ శ్రీ గీతా దేవతా సుప్రీతా భవతు,సుప్రసన్నా భవతు,వరదా భవతు.
ఇతి శ్రీ మద్భగవద్గీతా పూజా స్సమాప్తా.....
అష్టాదశ అధ్యాయము…ఫలము
భగవద్గీత లోని పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్న్యాస యోగము.దీని పారాయణ ఫలము వలన సర్వపుణ్యాలు దక్కుతాయి.అలానే సిద్ధిప్రదము అవుతుంది.
పూర్వము విష్ణుదూతలు ఒక పురుషుడిని ఇంద్రలోకానికి తీసుకుని వచ్చారు.రావటం రావటం అతనిని ఇంద్ర సింహాసనము పైన కూర్చోబెట్టారు.అంతటితో ఆగలేదు.కొన్నాళ్ళు ఇతడే ఇంద్రాధిపత్యము కొనసాగిస్తాడు అని శాసించారు.
ఇంద్రుడికి వెన్నులో జ్వరము వచ్చింది,ఈ పరిణామానికి.నేరుగా వైకుంఠం పోయాడు.నారాయణా!మాథవా!ఏంది ఈ విడ్డూరము?నా సింహాసనము ఎక్కే అర్హత సామాన్య మానవుడు ఎలా సాథించాడు?దానితో ఆగకుండా కొన్నాళ్ళు ఇంద్ర పదవి దక్కేటంత పుణ్యము ఏమి చేసాడు?అని అడిగాడు.
దానికి శ్రీమహా విష్ణువు తన చెరగని చిరునవ్వుతో ఇలా సమాథానం చెప్పాడు.ఇంద్రా!ఆ మానవుడు భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయము లోని అయిదు శ్లోకాలు నిత్యమూ జపించేవాడు.దాని ఫలమూ,ఫలితమే ఈ ఇంద్ర పదవి.
శ్లోకము
......
జపత్యష్టాదశాధ్యాయే గీతానాం శ్లోక పంచకమ్।
యత్పుణ్యేన చ సంప్రాప్తం తవ సామ్రాజ్యముత్తమమ్॥
విష్ణువు మాటలకు అందరికీ తలలు గిర్రున తిరిగాయి.అది మొదలు ముక్కోటి దేవతలూ నిత్యమూ భగవద్గీతలోనిపద్దెనిమిదవ అధ్యాయము పారాయణ చేయటం మొదలు పెట్టారు,వారి వారి పదవులు నిలబెట్టుకునేదానికి.
Monday, 20 October 2025
సప్తదశ అధ్యాయము…ఫలము
భగవద్గీత లోని పదహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము.ఈ అధ్యాయము పారాయణ వలన సర్వ వ్యాధి నివారణ కలుగుతుంది.
శ్లోకము
.......
గీతాసప్తదశాధ్యాయ జాపకం ద్విజమానయ।
తేనాయం మామకోరోగశ్శామ్యత్యత్ర న సంశయః॥
దీనికి సంబంధించిన కథ తెలుసుకుందాము.పూర్వము ఒక రాజు ఉండేవాడు.ఆయనగారి ఏనుగు ఒకసారి జబ్బున పడింది.ఎంత మంది వైద్యులకు చూపించినా స్వస్థత చేకూరలేదు.ఇక వీళ్ళ పైన వదిలేస్తే లాభం లేదని ఆ ఏనుగుకు కూడా అర్థమయిపోయింది.ఆ ఏనుగు హీనస్వరముతో రాజుకు చెప్పింది.హే రాజా!భగవద్గీత యొక్క పదహేడవ అధ్యాయము చేసే వానిని పిలిపించండి.అతని చేత నా ముంగిట ఆ అధ్యాయము పారాయణ చేయించండి.అప్పుడు నా వ్యాధి నయమవుతుంది.
రాజుకు ఆ సలహా బాగా నచ్చింది.సరే అని అలాగే బ్రాహ్మణులచేత భగవద్గీతలోని పదహేడవ అధ్యాయము పారాయణ చేయించాడు.ఏనుగుకు జబ్బు నయమయింది.
Sunday, 19 October 2025
షోడశ అధ్యాయము…ఫలము
భగవద్గీతలోని పదహారవ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము.ఈ అధ్యాయము పారాయణ ఫలము వలన ధైర్య సాహసాలు,జంతు వశీకరణము ప్రాప్తిస్తాయి.
ఒకప్పుడు ఒకరాజు దగ్గర ఒక ఏనుగు ఉండేది.అది ఒకసారి కట్లు తెంచుకుని,అదుపు తప్పి గందర గోళంచేయసాగింది.దానిని ఎవరూ ఆపలేక పోయారు.అలాంటి సమయంలో ఒక సాథారణ పౌరుడు వచ్చి దానిని నిమిరాడు.అది మంత్రము వేసినట్లు చప్పబడిపోయింది.శాంతంగా తయారయింది.మంచిగా అదుపు ఆజ్ఞల్లోకి వచ్చింది.అందరూ ఆశ్చర్య చకితులు అయ్యారు.ఇదంతా చిటికెలో ఎలా సాథ్యమయింది నీకు అని అడిగారు.ఆ శక్తి ఏంది?నీకు ఎలా వచ్చింది?మేమంతా తెలుసుకునే దానికి ఉబలాట పడుతున్నాము అని అన్నారు.
అంతట అతను చెరగని చిరునవ్వుతో ఇలా అన్నాడు.
శ్లోకము
........
గీతాయాః షోడశాధ్యాయ శ్లోకాన్కతిపయానహమ్।
జపామి ప్రత్యహం భూపతేనైతా స్సర్వసిద్ధయః॥
అయ్యా!నేను నిత్యమూ భగవద్గీత లోని పదహారవ అధ్యాయము పారాయణ చేస్తాను.ఆ పారాయణ వల్ల కలిగే పుణ్య ఫలమే ఇదంతా!
Saturday, 18 October 2025
పంచదశ అధ్యాయము…ఫలము
భగవద్గీత లోని పదహైదవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము.
శ్లోకము
........
అథ పంచదశాధ్యాయ శ్లోకార్థం లిఖితం క్వచిత్।
తతోవాచయతః శ్రుత్వానిరగాత్తుర గోదివమ్॥
దీనికి సంబంధించిన కథ విందాము.పూర్వము ఒకరాజు ఉండేవాడు.అతను ఒకరోజు వేటకు వెళ్ళాడు.వేటాడి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు.గాలికి ఎగిరి ఒక తాళపత్రము అతని దగ్గరలో పడింది.ఆ తాళ పత్ర గ్రంథములో ఉన్నది పైకి చదివాడు.అది రాజు గారి గుర్రము వినింది.వెను వెంటనే దివ్య రూపము సంతరించుకుని,ఆకాశ మార్గములో ఎగసి పోయింది.
రాజు కి అశ్చర్యము వేసింది.దగ్గరలో ఒక ఆశ్రమము కనిపించింది.అక్కడకు వెళ్ళి ఋషులకు జరిగిన విషయము చెప్పాడు.వాళ్ళు తాళపత్రము తమదే అని చెప్పారు.అందులో భగవద్గీతలోని పదహైదవ అధ్యాయములోని సగము శ్లోకము ఒకటి లిఖించబడి ఉంది అని చెప్పారు.ఆ సగము శ్లోకము విన్నందుకు దక్కిన పుణ్యము వలన ఆ గుర్రమునకు పరమ పథం లభించింది అని చెప్పారు.
అప్పుడు ఆ రాజు ఋషుల దగ్గర భగవద్గీత యొక్క పదహైదవ అధ్యాయము పారాయణానుష్ఠానాదులు తెలుసుకున్నాడు.అప్పటి నుండి నిత్యపారాయణ చేసుకుంటూ తానుకూడా తరించాడు.
Friday, 17 October 2025
చతుర్దశ అధ్యాయము…ఫలము
భగవద్గీతలోని పదునాల్గవ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము.ఈ అధ్యాయము పారాయణ చేస్తే ఆత్మస్మృతి,శత్రుజయము కలుగుతాయి.
పూర్వము ఒకరాజు ఉండేవాడు.అతను ఒకరోజు వేటకు బయలుదేరాడు.అడవిలో వేటకుక్క కుందేలును తరుమసాగింది.అవి రెండూ ఒకదాని వెంట ఇంకొకటి పరుగులు తీస్తూ ఒక ఆశ్రమము దగ్గర ఉన్న బురద ప్రదేశము దగ్గరకు వచ్చాయి.అక్కడకు చేరగానే వైరం మానేసి,చెట్టా పట్టాలేసుకును మంచి మిత్రులు లాగా ఆటలాడుకోసాగాయి.ఇదంతా రాజుకు చాలా ఆశ్చర్యమనిపించింది.
ఆ ఆశ్రమములో వత్సుడు అనే ముని ఉన్నాడు.రాజు అతనిని వేటకుక్క,కుందేలు యొక్క విచిత్రమయిన ప్రవర్తనకు కారణము అడిగాడు.దానికి చిరునవ్వుతో ఆ వత్సుడు ఇలా సమాథానం ఇచ్చాడు.
శ్లోకము...
చతుర్దశంతు అధ్యాయం జపామి ప్రత్యహం నృప।
మదీయ చరణాం భోజ ప్రక్షాళణ జలే లుఠన్॥
శ్లోకము....
శశస్త్రి దివమాపన్న శ్శునకాస్యహభూపతే।
ఓ రాజా!నేను దినం దినం,ప్రతిదినం భగవద్గీతలోని పదునాల్గవ అధ్యాయము పారాయణ చేస్తాను.నేను ప్రతిదినం కాళ్ళుకడుగుకునే ప్రదేశము ఆ బురద ఉండే స్థలము.కాబట్టి కుక్క,కుందేలు అక్కడకు రాగానే వాటి వాటి జాతివైరము మరచిపోయాయి.అలానే వాటికి ఆత్మ స్మృతి కలిగింది.అందుకే అవి అంత ఆలాజాలంగా మసలుతున్నాయి.ఇదంతా ఆ పదునాల్గవ అధ్యాయ పారాయణ ఫలము,ఫలితము.
Thursday, 16 October 2025
త్రయోదశ అధ్యాయము…ఫలము
భగవద్గీతలోని పదమూడవ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము.
శ్లోకము....
గీతా త్రయోదశాధ్యాయ ముద్గిరన్తమనారతమ్।
తతస్తచ్ఛ్రవణాదేవ ముక్తా శ్వపచవిగ్రహాత్॥
పూర్వము ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది.ఆమె ఎప్పుడూ తప్పుదోవలో నడుస్తూ,దురాచారిణిగా వ్వవహరించేది.దాని పర్యవసానంగా,మరుజన్మ లో ఛండాల స్త్రీగా పుట్టింది.అప్పట్లో జృంభకా దేవాలయము ఉండేది.అదేవాలయంలో వాసుదేవుడు అనే అతను నిత్యమూ భగవద్గీతలోని పదమూడవ అధ్యాయము పారాయణ చేస్తుండేవాడు.ఈ ఛండాలి నిత్యమూ అతనినోట ఆ అధ్యాయము వింటూ ఉండేది.దాని ప్రభావము వలన ఆ జన్మలోనే సద్గతి పొందగలిగింది.
Wednesday, 15 October 2025
ద్వాదశ అధ్యాయము…ఫలము
భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయము భక్తి యోగము.దీని పారాయణ ఫలము రహోజ్ఞానము మరియు దివ్య శక్తులు.
పూర్వము ఒక రాజు ఉండేవాడు.అతని కుమారుడు లక్ష్మీ దేవి ఆదేశానుసారం ఒక వ్యక్తిని ఆశ్రయించాడు.అతని పేరు సిద్థ సమాథి.అతనిని రాకుమారుడు ఒక ఉపకారము కోరాడు.అయ్యా!నా తండ్రి ఒకమారు అశ్వమేథయాగము తల పెట్టాడు.యాగము మథ్యలో అశ్వము తప్పిపోయింది.ఎక్కడ వెతికినా కనిపించలేదు.కాలక్రమేణా మా తండ్రి కూడా మరణించాడు.స్వామీ!గుర్రము దొరకక పోతే అశ్వమేథ యాగము పూర్తికాదు.అది సుసంపన్నము కాకపోతే మా తండ్రికి సద్గతులు ప్రాప్తించవు.కాబట్టి ఆ గుర్రము విషయము కనుక్కుని చెప్పేది.నాకు దక్కేలా చేసేది.
అప్పుడు అతను తన శక్తి చేత దేవతలను పిలిపించాడు.ఆ అశ్వమును ఇంద్రుడు అపహరించి,దాచి ఉంచాడు.కాబట్టి ఆ దేవతలను ఆ అశ్వము తీసుకు రమ్మని పురమాయించాడు.వారి చేత ఆ రాజకుమారుడికి ఆ అశ్వాన్ని ఇప్పించాడు.
రాజ కుమారుడికి భలే ఆశ్చర్యము వేసింది.ఇంత దివ్యశక్తి మీకు ఎలా చేకూరింది అని అడిగాడు.దానికి సిద్థసమాథి ఇలా జవాబిచ్చాడు.
శ్లోకము......
గీతానాం ద్వాదశాధ్యాయం జపామ్యహతన్ద్రితః।
తేన శక్తిరియం రాజన్ మయాప్రాప్తాస్తి జీవితమ్॥
ఓ రాజా!నేను భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయాన్ని అనునిత్యమూ పారాయణ చేస్తుంటాను.దాని ప్రభావము వలననే నాకు ఈ శక్తి సమకూరింది.
Tuesday, 14 October 2025
ఏకాదశ అధ్యాయము….ఫలము
భగవద్గీతలోని పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము.ఈ అధ్యాయము పారాయణము చేస్తే రాక్షస పీడా నివారణము కలుగుతుంది.
శ్లోకము....
నిష్కర్మతయా ప్రాపుస్తే పరమం పదమ్।
ఏకాదశస్య సామర్ధ్యా దధ్యాయస్య భవిష్యతి॥
పూర్వము ఒక ఊరిలో ఒక రాక్షసుడు ఉండేవాడు.వాడి దురాగతాలకు అంతూ పొంతు ఉండేదే కాదు.ఊరి ప్రజలు విసుగెత్తి పోయారు.గ్రామాధికారులు ఆ రాక్షసుడితో ఒక ఒప్పందానికి వచ్చారు.వీధులలో పడుకునేవారిని భక్షించవచ్చు.కానీ ఇండ్లలోకి వచ్చి హింసించి చంపకూడదు.ఈ విషయము తెలియని వారు ఆరుబయట పడుకుని ఆ రాక్షసుడికి బలి అవుతూ ఉండేవారు.ఒకరోజు సునందనుడు అనేవాడు ఆ ఊరి మీదుగా తీర్థయాత్రలకని పోతుండినాడు.ఆ రాత్రికి అక్కడే ఆగి విశ్రాంతి తీసుకుని,తెల్లవారు ఝామున బయలుదేరాలి అనుకున్నాడు.ఆ రాత్రి కూడా రాక్షసుడు వచ్చాడు.సునందనుడిని తప్ప మిగిలిన అందరినీ చంపి,తినిపోయాడు.
పొద్దున్నే ఆ ఊరిలో వాళ్ళు,హాయిగా అరుగు పైన పడుకుని నిద్ర పోతున్న సునందనుడిని చూసారు.చాలా ఆశ్చర్యపోయారు.అతనిని మంచిగా సాగనంపారు.ఆ గ్రామ పెద్దలు రాక్షసుడి దగ్గరకు వెళ్ళారు.ఇలా అడిగారు.రాత్రి నువ్వు వచ్చావు.మన ఒప్పందం ప్రకారము ఆరుబయట నిద్ర పోయేవాళ్ళని చంపి తిన్నావు.సునందనుడిని మాత్రము ఎందుకు వదలి పెట్టావు?
దానికి ఆ రాక్షసుడు ఇలా జవాబు చెప్పాడు.వాడెవడో ఎప్పుడూ భగవద్గీతలోని పదకొండవ అధ్యాయము చదువుతూ ఉంటాడట!వాడి దరిదాపుల్లోకి వెళ్ళగలిగే దానికి కూడా నా శక్తి సామర్ధ్యాలు చాలలేదు.నా శక్తి యుక్తులు వాడి దగ్గర పని చేయలేదు.
ప్రజలకు ఇంక కిటుకు అర్ధమయింది,వాళ్ళను వాళ్ళు కాపాడుకునేదానికి.ఆ గ్రామంలో అందరూ క్రమం తప్పకుండా రోజూ భగవద్గీతలోని పదకొండవ అధ్యాయము పారాయణము చేయటం మొదలుపెట్టారు.ఇంక రాక్షసుడు చేసేది ఏమీ లేక తట్టా బుట్టా సర్దుకుని,అక్కడినుంచి పలాయనము చిత్తగించాడు.
Monday, 13 October 2025
భాగవత రచన
సూతుడు చెప్పిన విషయాలు అన్నీ శౌనకాది మునులు అందరూ శ్రద్థగా విన్నారు.వారందరూ ముక్త కంఠంతో అడిగారు.నారదుడి మాటలు విన్న తరువాత వ్యాస మహర్షి ఏమి చేశాడు అని.
సూతుడు వారికి ఇలా సమాథానం ఇచ్చాడు.పరమ పవిత్ర మయిన సరస్వతీ నది ఉంది కదా!దానికి పడమటి దిక్కున ప్రశాంత వాతావరణంలో,బదరీ వృక్ష సముదాయముతో కూడిన వనము ఉంది.ఆ వనంలో శమ్యాప్రాసమనే ఆశ్రమము ఉన్నది.అది చాలా ప్రసిద్ధమయినది.వ్యాసుడు ఆ ఆశ్రమము ఎంచుకున్నాడు.భక్తి ప్రపత్తులు కలిగిన మనసుతో,మనసును ఈశ్వరుని ఆధీనంలో ఉంచాడు.తనకు తెలియకుండానే నిర్మల మనస్కుడు అయ్యాడు. ఇంక సమస్త ధర్మాలకూ,భక్తిప్రపత్తులకు నిలయము అయిన భాగవత రచనకు ఉపక్రమించాడు.దానిని దీక్షతో రచించాడు.తన ఈ రచనను తన కుమారుడు అయిన శుకమహర్షి చేత చదివించాడు.
ఆ మాటలకు శౌనకుడు అడిగాడు.శుకుడు నిర్వాణ తత్పరుడు.అతడు సమస్త విషయములయందు ఉపేక్ష కలిగిన వాడు.అతడు భాగవతము ఎందుకు నేర్చుకున్నాడు?సూతుడు ఈ ప్రశ్నకు ఇలా సమాథానం చెప్పాడు.మహర్షీ!నిరపేక్షులు అయిన మునులు కూడా విష్ణువును కీర్తిస్తూ ఉంటారు.ఎందుకంటే ఏమి చెపుతాము?విష్ణుదేవుని మహిమ అంటే ఆషామాషీ కాదు.అదీ కాకుండా శుకమహర్షికి శ్రీహరి గుణాల వర్ణన యందు ఆసక్తి,అనురక్తి ఉన్నాయి.కాబట్టి భాగవతాన్ని చదివాడు.ఇంకో విషయము కూడా చెబుతాను.వేదాల కంటే కూడా భాగవతమే ముక్తి మార్గాన్ని సులువుగా నేర్పిస్తుంది.
వీటన్నిటికీ తోడు పరీక్షిత్తు మహారాజు శుక మహర్షిని ముక్తి మార్గము బోథింపమని ప్రార్ధించాడు.ఒక రాజర్షి నిస్సిగ్గుగా అలా బతిమలాడేటప్పటికి,మనసు కరగి భాగవతము చెప్పాడు.
దశమ అధ్యాయము….ఫలము
భగవద్గీతలోని పదవ అధ్యాయము విభూతి యోగము.ఈ అధ్యాయము పారాయణ చేస్తే అనంత మయిన భగవంతుడి కృపా కటాక్షాలు దక్కుతాయి.ఆ దేవదేవుడి సహాయ సహకారాలు లభ్యమవుతాయి.
దశమాధ్యాయ మాహాత్మ్యాత్తత్వజ్ఞానం సుదుర్లభమ్।
లబ్ధమే తేన మునినా జీవన్ముక్తిరియం తథా॥
పూర్వ కాలంలో ఒకప్పుడు బ్రహ్మ దేవుని వాహన జాతికి చెందిన హంస ఒకటి ఉండేది.ఒకసారి ఒక పద్మలత ద్వారా భగవద్గీత యొక్క పదవ అధ్యాయము వినింది.ఇంక ఎప్పుడూ దాని గురించే ఆలోచించేది.మరు జన్మలో అది ఒక బ్రాహ్మణుడి లాగా పుట్టింది.పూర్వ జన్మ జ్ఞానము కలిగి ఉండింది.దాని ప్రభావము చేత ఎప్పుడూ భగవద్గీతలోని పదవ అధ్యాయము స్మరించుకుంటూ ఉండేవాడు.దాని ప్రభావము వలన శివుడు ఎప్పుడూ అతని వెన్నంటే ఉండేవాడు.
ఈ విషయం వాళ్ళూ వీళ్ళూ చెప్పడం కాదు.స్వయానా శివుడే భృంగీశ్వరుడితో చెప్పాడు.
నవమ అధ్యాయము…ఫలము
భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్య యోగము.ఈ అధ్యాయము పారాయణ చేస్తే ప్రతిగ్రహణ పాప నాశనము దక్కుతుంది.
పూర్వము ఒకరాజు ఉన్నాడు.అతను ఒకసారి ఒక విప్రుడికి కాలపురుషుడి దానము చేసాడు.ఆ విగ్రహము నుంచి చండాల దంపతులు ఆవిర్భవించారు.వారు ఆ బ్రాహ్మణుడిని బాధించడం మొదలు పెట్టారు.తక్షణమే విష్ణు పార్షదులు అక్కడికి వచ్చారు.వచ్చీరాగానే ఆ చండాల దంపతులను తరిమి కొట్టి,బ్రాహ్మణుడిని కాపాడారు.రాజు దీనినంతా గమనించాడు.స్వామీ!ఏమి ఈ మాయ! అని బ్రాహ్మణోత్తముడిని అడిగాడు.
అప్పుడు అతను నవ్వుతూ ఇలా అన్నాడు.
గీతాయానవమాధ్యాయం జపామి ప్రత్యహం నృప।
నిస్తీర్ణాశ్చా పదస్తేన కుప్రతి గ్రహ సంభవాః॥
గీతాయానవమాధ్యాయ మంత్రమాలా మయాస్మృతా।
తన్మాహాత్మ్య మిదం సర్వం త్వమవేహి మహీపతే॥
అంటే ఇలా చెప్పాడు.ఓ రాజా!నేను రోజూ క్రమం తప్పకుండా భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయము పారాయణ చేస్తాను.దాని మహాత్మ్యం నీకు కూడా అర్ధం అయింది కదా!నేను తీసుకునే ఇలాంటి దానాల వలన కలిగే పాపం ఆ పుణ్యం వలన సమసిపోతుంది.
Sunday, 12 October 2025
అష్టమ అధ్యాయము…ఫలము
భగవద్గీతలోని అష్టమ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము.దీని పారాయణ ఫలము సర్వ విధ దుర్గతి నాశనము.
శ్లోకము
......
జపన్ గీతాష్టమాధ్యాయ శ్లోకార్థం నియతేంద్రియః।
సంతుష్ఠ వా నహందేవి తదీయ తపసా భృశమ్॥
పూర్వము భావశర్మ అని ఒకడు ఉన్నాడు.వాడు పరమ భ్రష్టాచారుడు.అందుకని వాడు తరువాత జన్మలో తాటి మాను అయి పుట్టాడు.అచ్చం వీడి లాగే ఇంకో జంట ఉన్నారు.వారు కుమతి-కుశీవలుడు.వీళ్ళు చేయని పాప కర్మలు అంటూ ఏమీ మిగలలేదు.అంతటి దుష్కర్ములు.వాళ్ళు మరు జన్మలో బ్రహ్మ రాక్షసులుగా పుట్టారు.ఒక రోజు వాళ్ళు ఇద్దరూ తాడి చెట్టు కింద కూర్చుని సేద తీరుతున్నారు.వాళ్ళకు ఆ జన్మ అంటే విసుగు వచ్చింది.అప్పుడు భార్య భర్తని అడిగింది.ఏమయ్యా!ఎప్పటికీ మన బతుకులు ఇంక ఇంతేనా?మనకు ఈ బ్రహ్మ రాక్షసత్వము ఎప్పుడు పోతుంది?
దానికి అతను చిన్నగా నవ్వుతూ ఇలా అన్నాడు.ఓయీ!ఇదంతా అంత సులభం కాదు.మనము కర్మ వీడి,ఆధ్యాత్మ బుద్ధితో నడచుకోవాలి.బ్రహ్మము గురించి తెలుసుకోవాలి.అప్పుడు మనకు ఈ దుర్దశ వీడుతుంది.మనము అనుకునేటట్లే ఆమెకు తన భర్త చెప్పిన దాంట్లో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు.సహజమే కదా ఆ జన్మకు.మళ్ళీ ఇలా అడిగింది.కిం తత్ బ్రహ్మ?కిమధ్యాత్మం?కిం కర్మ పురుషోత్తమ?
బ్రహ్మ ఏంది?అధ్యాత్మం ఏంది?ఏం పనులు గురించి మాట్లాడు తున్నావు?ఆమె ఈ మాటలు మామూలుగానే అడిగింది తన భర్తను.కానీ అవి భగవద్గీతలోని ఎనిమిదవ అథ్యాయములోని మొదటి శ్లోకములోని అర్జునుడు శ్రీకృష్ణుని ఉద్దేశించి పలికిన పలుకులు.ఆ శ్లోకము లోని మొదటి పాదము ఉచ్ఛరించినట్లు అయింది.అది పలకగానే వారి బ్రహ్మరాక్షసత్వము పోయి మామూలుగా అయ్యారు.వారు తాటి చెట్టు క్రింద కూర్చుని ఉన్న కారణంగా తాటి చెట్టుకు కూడా ముక్తి లభించింది.ఇలా ముగ్గురికీ ఉత్తమ గతి ప్రాప్తించింది.
ఆ మొదటి శ్లోకము....
అర్జున ఉవాచ....
కిం తద్బ్రహ్మ కి మధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ।
అధిభూతం చ కిం ప్రోక్త మధిదైవం కిముచ్యతే॥8-1
Saturday, 11 October 2025
సప్తమ అధ్యాయము….ఫలము
భగవద్గీతలోని ఏడవ అధ్యాయము విజ్ఞాన యోగము.దీని పారాయణము వలన సమస్త జీవజాత సంసార తరణము సంప్రాప్తిస్తుంది.
పూర్వము శంకు కర్ణుడు అని ఒకడు ఉండేవాడు.అతను ఒకరోజు పని మీద ప్రక్క ఊరికి వెళ్ళాడు.ఎంతకీ తిరిగి రాడే!అతని కొడుకులకు తండ్రి గురించి ఆదుర్దా అయిపోయింది.వాళ్ళు ఒక సిద్ధుడి దగ్గరకు వెళ్ళారు.తమ తండ్రి జాడ చెప్పమని బతిమలాడారు.ఆ సిద్ధుడు తన దివ్యదృష్టితో అంతా కనుక్కున్నాడు.ఇలా చెప్పనారంభించాడు.నాయనా!మీ తండ్రి మరణించి చాలా రోజులు అయింది.అతను బతికి ఉన్నప్పుడు చాలా సంపాదించాడు.సంపాదించినది మొత్తం ఒక చోట భద్రపరిచాడు.ప్రాణం పోయినా,డబ్బు మీద మమకారం,మోహము వదులుకోలేక పోయాడు.అందుకని తరువాత జన్మలో పాముగా పుట్టాడు.పాముగా ఇప్పుడు ఆ నిథికి కాపలా కాస్తున్నాడు.మీకు చూపిస్తా రండి అని చెప్పి వాళ్ళను అక్కడకు తీసుకెళ్ళాడు.వాళ్ళు ఆ దృశ్యం చూసి చాలా బాథ పడ్డారు.మా తండ్రికి ఏంది ఈ నికృష్టపు జన్మ అని.మా తండ్రిని ఈ దీనమయిన,హేయమయిన దుస్థితి నుంచి ఉద్ధరించే మార్గము ఉంటే చెప్పమని వేడుకున్నారు.
అప్పుడు ఆ సిద్ధుడు ఇలా చెప్పాడు.
శ్లోకము....
గీతానాం సప్తమాధ్యాయ మంతరేణ సుధామయమ్।
జన్తోర్జరామృత్యు దుఃఖ నిరాకరణ కారణమ్॥
శ్లోకము...
సప్తమాధ్యాయ జపతో ముక్తిభాజోఽభవంస్తతః।
దేవమిష్ట తమం జ్ఞాత్వా నిర్వాహణార్పిత బుద్ధయః॥
పురాణాలలో ఇలా చెప్పబడి ఉంది.కాబట్టి అనుష్ఠాన పూర్వకంగా మీరు గీతలోని ఏడవ అధ్యాయము పారాయణ చేయండి.ఆ ఫలమును మీ తండ్రికి ధారపోయండి.
ఈ మాటలు విన్న వారు ఆ సిద్ధుడికి నమస్కరించి ఇండ్లకు వెళ్ళారు.పద్ధతిగా సిద్ధుడు చెప్పినట్లు చేసారు.వాళ్ళ తండ్రికి పరమపదము ప్రాప్తించేదానికి దోహద పడ్డారు.
Friday, 10 October 2025
షష్టాధ్యాయము…ఫలము
భగవద్గీతలోని ఆరవ అధ్యాయము ఆత్మ సంయమ యోగము.పేరుకు తగినట్లే ఈ అధ్యాయము పారాయణ చేస్తే దివ్య తేజఃప్రాప్తి సిద్ధిస్తుంది.
పూర్వము జనశ్రుతుడు అనే రాజు ఉండేవాడు.అతడు మంచి ధర్మాత్ముడు.ఒకరోజు ఆరాజు డాబా పైన పండుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు.ఆ సమయంలో ఆకాశంలో ఒక హంసల గుంపు అటు మీదగా పోతూ ఉండింది.ఆగుంపులో ఒక హంస దుందుడుకుగా ప్రవర్తించింది.అది గమనించిన ముసలి హంస ఇలా మందలించింది.ఓ కుర్ర హంసా!ఏంది నీ వ్యవహారం?మనము ధర్మాత్ముడు అయిన రాజు దరిదాపుల్లో వెళుతున్నాము.అంత దుడుకుతనం పనికిరాదు.మట్టూ మర్యాద కొంచెం నేర్చుకో!
ఈ హంస మాటలకు కుర్ర హంస నసుగుతూ,గునుస్తూ ఈ మాటలు అనింది.ఓ యబ్బో!ఈ రాజు ఏమైనా రైక్వుడా?ఆయనకంటే ఎక్కవ తేజోవంతుడాయే!ఇంక ఒంగి ఒంగి నమస్కారాలు పెట్టాలి మనమందరమూ!ఇలా ఎగతాళి,అవహేళన,అపహాస్యం చేసింది.
రాజు ఆ మాటలన్నీ విన్నాడు.ఒకింత ఆశ్చర్యము కూడా వేసింది.చారులను పిలిపించాడు.రైక్వుడు అనే వాడిని కనుక్కుని తీసుకు రమ్మన్నాడు.చారులు అన్ని చోట్లా వెతికారు.ఉత్త చేతులకో తిరిగి వచ్చారు.వారు రాజుకు ఇలా విన్నవించుకున్నారు.హే రాజా!మేము బాగా వెతికాము.ఆ పేరుతో ఎవరూ మాకు దొరకలేదు.కానీ కాశీ దేశం లోని శ్రీ మాణిక్యేశ్వరాలయము దగ్గర ఒక మహాతేజస్సు ఉండే అతను కనిపించాడు.అతని పేరు రైక్వుడు అని వాళ్ళూ వీళ్ళూ అంటే విన్నాము.అతనిని వెంట పెట్టుకుని వచ్చే ధైర్యము చేయలేక పోయాము.
రాజు ఈ మాటలు వినగానే మందీ మార్బలముతో,కానుకలు పట్టుకుని ఆ తేజస్వి దగ్గరకు బయలుదేరాడు.అతనిని దర్శించుకున్నాడు.అంతట ఇలా విన్నవించుకున్నాడు.ఓ మహానుభావా!నీవు దేనినీ ప్రాశించవూ,మరి ఇంక దేనినీ ఆశించవూ!నీవు ఇంత తేజోవంతుడివి ఎలా అయ్యావు?ఆ కథా కమామిషు నాకు వివపరించేది.
దానికి చిరునవ్వుతో రైక్వుడు ఇలా సమాథానం ఇచ్చాడు.రాజా!నీవు అంటున్న ఆ తేజస్సో,ఓజస్సో,నాకు ఏమీ తెలియదు.అవి ఎట్లా వచ్చాయో,ఎందుకు వచ్చాయో అస్సలు తెలియదు.నాలో ఏమైనా విశిష్టంగా కనిపించింది అంటే నేను అనుకునే కారణం బహుశ ఇది అయి ఉండవచ్చు.నేను నిత్యమూ భగవద్గీతలోని ఆరవ అధ్యాయమ క్రమం తప్పకుండా పారాయణము చేస్తాను.అంతే!ఇదంతా బహుశ దాని మహాత్మ్యమే ఉండి ఉంటుంది.అతను ఇలా అన్నాడు.
శ్లోకము....
గీతానాం షష్ఠమధ్యాం జపామిప్రత్యహం నృపయమ్।
తేనైవ తేజోరాశి ర్మేసురాణామపి దుస్సహః॥
Thursday, 9 October 2025
పంచమ అధ్యాయము…ఫలము
భగవద్గీతలోని ఐదవ అధ్యాయము కర్మ సన్యాస యోగము.దీని ఫలితము అమోఘము.జ్ఞానశూన్యులు అయిన పశుపక్ష్యాదులు కూడా తరిస్తాయి.
ఆ కథ ఏందో విందాము.పూర్వము అరుణ,పింగళుడు అని భార్యా భర్తలు ఉండేవారు.ఎప్పుడూ అడ్డూ ఆపూ లేకుండా గొడవలు,తగవులూ పడుతూ కాపురము చేస్తూ ఉండేవారు.ఆ తరువాత జన్మలో వారు చిలుక,గ్రద్దలాగా పుట్టారు.పూర్వ జన్మ విరోధము కారణంగా,వారికి తెలియకుండానే మళ్ళీ ఈ జన్మలోకూడా ఎప్పుడూ ఘర్షణ పడుతుండే వాళ్ళు.ఒకసారి ఇలా కొట్టుకుంటూ ఒక నర కపాలంలో పడి మరణించాయి.ప్రాణాలు పోగానే విష్ణుపాలకులు వచ్చి వారిని వైకుంఠం తీసుకుని పోయేదానికి ప్రయత్నించారు.అప్పుడు ఆ చిలుక,గ్రద్ద వాళ్ళను ఇలా అడిగారు.స్వామీ!పొద్దున లేస్తే తన్నుకోవటమూ,కొట్టుకోవటము తప్ప ఇంకోటి చెయ్యలేదు మేము.ఎంత సేపూ పాపపు ఆలోచనలు,పాపపు పనులులోనే జీవితాలు గడచిపోయాయి.అలాంటి మాకు ఈ వైభోగము ఏంది?ఈ అదృష్టం ఎందుకు?
అప్పుడు ఆ వైష్ణవులు చిరునవ్వుతో ఇలా సమాథానం ఇచ్చారు.అమాయకులు మీరు.పాప పుణ్యాలు అనేవి మీ దేహాలకే కానీ,మీ ఆత్మలకు లేదు.అదీ కాకుండా,మీ శరీరాలు ఒక నరుడు పుర్రెలో పడ్డాయి కదా!ఆ పుర్రె ఎవరిది అనుకుంటున్నారు?అతను నిత్యమూ భగవద్గీతలోని పంచమ అధ్యాయము పారాయణము చేసిన పుణ్యాత్ముడు.అతను సంపాదించిన పుణ్యములో ఒక ఇసుక రేణువు అంత పుణ్యము మీకు దక్కింది అతని పుర్రెలో పడిన కారణంగా.అందుకే మీకు ఈ వైకుంఠవాసభోగము.ఇలా చెప్పి వారిని ఆకాశమార్గంలో వైకుంఠానికి తీసుకెళ్ళారు.
చతుర్థ అధ్యాయము…ఫలము
భగవద్గీతలోని చతుర్ధ అధ్యాయము జ్ఞాన యోగము.ఈ అధ్యాయము పారాయణ చేస్తే చెడు ఆలోచనలు మనలను చుట్టు ముట్టడం ఆగిపోతుంది.ఏమైనా శాపాలు పూర్వజన్మలోనో,ఈ జన్మలోనో తగిలి ఉంటే వాటికి విరుగుడు అయి శాప విమోచనము కలుగుతుంది.
శ్లోకము....
నిత్యమాత్మరతస్తుర్యం జపత్యధ్యాయమాదరాత్।
తదభ్యాసాదదుష్టాత్మా నద్వంద్వైరభిభూయతే॥
పూర్వము సత్యతపుడని ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు.ఇంద్రుడు అతని తపస్సును చెరపాలని అనుకున్నాడు.అనుకున్నదే తడవుగా తన దగ్గర ఉండే అప్సరసలను పంపించాడు ఆ ఋషి దగ్గరకు.పాపం ఆ అప్సరసలు ఇంద్రుడి ఆజ్ఞ మేరకు వెళ్ళి ఋషికి తపోభంగం కలిగించారు.ఇంకేముంది?సత్యతపుడు కోపంగా వాళ్ళను అక్కడే రేగి చెట్లుగా పడి ఉండండి అని శపించాడు.ముని ఇచ్చిన కారణంగా ఆ అప్సరసలు అక్కడే బదరీవృక్షాలుగా మారి,నిలబడి పోయారు.
కొన్నాళ్ళకు ఆ జమిలి,రేగుచెట్ల నీడకోసం భరతుడు అనేవాడు వచ్చాడు.అతను ప్రశాంతంగా ఉంది అనుకుని భగవద్గీత నాలుగో అధ్యాయము,అదే జ్ఞాన యోగము పారాయణము చేసుకున్నాడు.ఆ మహిమ కారణంగా అప్సరసలు తమ పూర్వ స్థితికి వచ్చారు.వారికి శాపవిముక్తి కలిగింది.వాళ్ళు భరతుడికి ధన్యవాదాలు చెప్పారు.గీతా మహిమను కొనియాడారు.అలా వారు తిరిగి దేవలోకం బయలుదేరారు.
Wednesday, 8 October 2025
తృతీయ అధ్యాయము..ఫలము
తత్రాధ్యాయం సగీతాయాస్తృతీయం సంజజాపహ॥
భగవద్గీతలోని తృతీయ అధ్యాయము కర్మ యోగము.ఈ అధ్యాయము పారాయణ చేస్తే పాపనాశనముఅవుతుంది.దానితో బాటు ప్రేతత్వ విముక్తి కూడా కలుగుతుంది.
పూర్వము జడుడు అనేవాడు ఒకడు ఉన్నాడు.వాడి కులాచారము అస్సలంటే అసలు పాటించేవాడు కాదు.దురాచారాలకు పాలపడుతుండేవాడు.ఇలాగే అడ్డూ ఆపూ లేకుండా తిరుగుతూ ఉండేవాడు.డబ్బులకు కక్కుర్తి పడిన దొంగలు కొందరు అతనిని దోచుకుని,ఒక చెట్టు క్రింద హతమార్చారు.జడుడు పాపాల పుట్టగా ఉన్నాడు కదా బతికినన్ని రోజులు!అందుకని ప్రేతాత్మ అయి ఆ చెట్టుపైనే ఉంటూ వచ్చాడు.కొంతకాలము తరువాత అతని కొడుకు కాశీకి బయలుదేరాడు.మార్గమధ్యంలో అలసిపోయి,ఆ చెట్టిక్రిందనే సేదతీరాడు.యధాలాపంగా భగవద్గీత తెరచి మూడవ అధ్యాయము పఠించాడు.అలా పారాయణము పూర్తికాగానే జడుడికి ప్రేతరూపము పోయింది.దివ్యరూపముతో విమానము ఎక్కి స్వర్గానికి పయనమయ్యాడు.అలా పోతూ పోతూ తన కొడుకుని ఉద్దేశించి ఇలా అన్నాడు.నాయనా!కుమారా!నీవు భగవద్గీత మూడవ అధ్యాయము చదవటం వలన నా ప్రేతత్వము పోయి,దివ్యరూపము చేకూరింది.స్వర్గానికి కూడా పోతున్నాను.ఇది చాలా శక్తివంతమయిన అధ్యాయము.కాబట్టి నీవు క్రమం తప్పకుండా అనునిత్యం పారాయణ చెయ్యి.నీ జీవితము ధన్యమవుతుంది.జడుడు ఇలా తన కొడుకును ఆశీర్వదించి,స్వర్గానికి పయనమయినాడు.
Tuesday, 7 October 2025
ద్వితీయ అధ్యాయము…ఫలము
శ్లోకము..
శిక్షిత స్తేన పూతాత్మా పఠన్నధ్యాత్మ మాదరాత్।
ద్వితీయమాససాదోచ్చైః నిరవద్యం పరంపదమ్॥
ద్వితీయ అధ్యాయము అంటే సాంఖ్య యోగము.దీని పారాయణ ఫలం ఆత్మజ్ఞానము.
పూర్వము దేవశర్మ అని సదాచార సంపన్నుడు ఉన్నాడు.అతనికి ఆత్మజ్ఞానము సమకూర్చుకోవాలి అనే తపన ఉండేది.అతను ఒక సాథువును ఆశ్రయించాడు.ఆ సాధువు దేవశర్మను మిత్రవంతుడు అనే మేకలను కాచుకునే మేకల కాపరి వద్దకు పంపాడు.దేవశర్మ సరే అని ఆ మేకలకాపరి దగ్గరకు వెళ్ళి విషయము చెప్పాడు.అప్పుడు మిత్రవంతుడు ఇలా చెప్పసాగాడు.అయ్యా!ఒకరోజు అలవాటుగా మేకలను కాచుకుంటూ ఉన్నాను.ఇంతలో ఒక పులి అక్కడకు వచ్చింది.దానికి భయపడి కాపరులము తలా ఒక దిక్కుకు పరుగులు తీసాము.మేకలు కూడా చెల్లా చెదురుగా పరిగెత్తాయి.కానీ దిక్కుతోచని కొన్ని మేకలు అక్కడక్కడే పరుగులు తీస్తూ ఆ పులికి చిక్కాయి.ఆశ్చర్యం!ఆ పులి ఆ మేకలను చంపి తినలేదు.మేకలు కూడా దానితో సఖ్యంగా వ్యవహరించాయి.నాకు చాలా ఆశ్చర్యమేసింది.అది ప్రకృతి విరుద్థంకదా!ఎంత ఆలోచించినా బుర్రకు ఏమీ అర్థం కాలేదు.ఇక లాభం లేదనుకుని అక్కడే ఉన్న వృద్థ మర్కటాన్ని అడిగాను.అప్పుడు ఆ ముసలి కోతి ఇలా జవాబు ఇచ్చింది.ఓ మిత్రవంతుడా!విను.పూర్వము యోగీంద్రుడు ఒకడు ఉన్నాడు.అతను శిలా ఫలకాల పైన గీత రెండవ అధ్యాయము చెక్కించాడు.అ ఫలకాలను సుకర్మ అనే అతనికి ఇచ్చాడు.సుకర్మ ఇక్కడే,ఈ ప్రదేశం లోనే ఆ రెండవ అధ్యాయాన్ని పారాయణము చేసేవాడు.అలా అతను ఆత్మజ్ఞానాన్ని పొందాడు.అంతటి గొప్ప సిద్థ పురుషుడు నడయాడిన స్థలంలో పులిమేకలు కలసి మెలసి ఉండటంలో ఆశ్చర్యము ఏముంది?
మిత్రవంతుడు ఇంకా ఇలా చెప్పుకొచ్చాడు.ఆ వానరము సూచనలు సలహాలు విని నేను కూడా నిత్యం ఈ శిలా ఫలకాల పైన ఉండే ద్వితీయ అధ్యాయాన్ని పారాయణ చేస్తున్నాను.ఈ మాటలకు దేవశర్మ కూడా ఆనంద భరితుడు అయ్యాడు.అతను కూడా అక్కడే ఉంటూ రెండవ అధ్యాయము పారాయణము చేసుకునేవాడు.కాలక్రమేణ అతను ఆత్మజ్ఞానాన్ని పొందాడు.
Monday, 6 October 2025
ప్రధమ అధ్యాయము …ఫలము
పద్మ పురాణంలో అంతర్గతంగా భగవద్గీత పారాయణం చేస్తే చేకూరే ఫలము,ఫలితము గురించి ప్రస్తావన ఉంది.
ప్రధమ అధ్యాయము పారాయణం చేస్తే పూర్వ జన్మ స్మృతులు,పాపనాశనము,తదుపరి మంచి జన్మ దక్కుతాయి.
శ్లోకము....
తస్మాదధ్యాయమాద్యం యఃపఠేత్ శ్రుణుతే స్మరేత్।
అభ్యసేత్తస్యనభవేత్ భవాంభోధిర్దురుత్తరః॥
పూర్వము సుశర్మ అని ఒకడు ఉండేవాడు.వాడు చెయ్యని భ్రష్టు పని అంటూ ఏదీ ఈ భూమి మీద మిగల లేదు.మరణించిన తరువాత మళ్ళీ ఎద్దుగా పుట్టాడు.ఒకానొక రోజు ఆ ఎద్దు పర్వత ప్రాంతాలలో బరువులు మోస్తూ,నేలకూలింది.భయంకరమయిన మరణ యాతన అనుభవిస్తూ ఉండింది.ఆ దారిలో వస్తూ పోతూ ఉండే వాళ్ళందరూ దాని కష్టం చూసి కళ్ళనీళ్ళ పర్యంతం అవుతున్నారు.కానీ నిస్సహాయంగా ఉన్నారు.వాళ్ళలో ఒక వేశ్య ఉండింది.దాని బాధ చూసి,చలించిపోయింది.మనస్పూర్తిగా దేవుడికి ఇలా దణ్ణం పెట్టుకుంది.హే భగవంతుడా!నా జన్మలో నేను ఏదైనా పుణ్యం చేసి ఉంటే ఆ ఫలం అంతా ఈ ఎద్దుకు సంక్రమించేలా చేయి.దానికి సద్గతి కలిగేలా చూడు స్వామీ!
ఆమె ద్వారా చేకూరిన పుణ్యం వలన ఆ ఎద్దు మరు జన్మలో బ్రహ్మజ్ఞానిగా పుట్టాడు.పూర్వ జన్మ స్మృతి వలన ఆ వేశ్య ఇంటికి పోయాడు.నీ వలన నాకు ఇంత ఉత్కృష్టమయిన జన్మ దక్కింది.నీవు నాకు ధారబోసిన పుణ్యం ఏంది అని ఆమెను అడిగాడు. ఆమె నాకు తెలియదు అనింది.
ఆమె దగ్గర ఒక పెంపుడు చిలక ఉంది.అది బ్రహ్మ జ్ఞానిని చూసి ఇలా చెప్పడం మొదలు పెట్టింది.అయ్యా!మొదట్లో నేను ఒక ముని ఆశ్రమములో తిరుగుతూ ఉండేదానిని.ఆ ఋషి క్రమము తప్పకుండా రోజూ భగవద్గీత మొదటి అధ్యాయము పారాయణము చేసేవాడు.అది విని విని నాకు కూడా వచ్చేసింది.ఇంతలో విథి నన్ను ఈమె దగ్గరికి తీసుకుని వచ్చింది.నా అలవాటుకొద్దీ నేను రోజూ భగవద్గీత పారాయణము చేసుకునేదాన్ని.నా మీద ఉండే అలవిమాలిన ప్రేమవలన ఈమె శ్రద్థగా రోజూ వినేది.దాని వలన వచ్చిన పుణ్యమే ఆమె నీకు థారపోసింది.
బ్రహ్మజ్ఞాని ఆ చిలుక మాటలకు అవాక్కయ్యాడు.తనలో తాను ఇలా అనుకున్నాడు.ఔరా!భగవద్గీతలోని ప్రధమ అథ్యాయము వింటేనే ఇంత పుణ్యం దక్కేటట్లయితే,పూర్తి భగవద్గీతా పారాయణం అనునిత్యం చేస్తే ఇంకెంత పుణ్యం దక్కుతుంది!!!???ఆమెకూడా ఈ విషయం తెలుసుకొని తబ్బిబ్బయింది.ఆ ఇద్దరూ అప్పటినుంచి అనునిత్యమూ ప్రథమ అథ్యాయము,అర్జున విషాద యోగము పఠిస్తూ,పారాయణ చేస్తూ ఉన్నారు.జన్మాంతరమున కైవల్యం పొందారు.
Saturday, 4 October 2025
సప్త శ్లోకీ గీత
ఓమిత్యే కాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్।
యః ప్రయాతి త్యజన్దేహం సయాతి పరమాం గతిమ్॥8-13
స్థానే హృషీకేశ తనప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్య తేచ।
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః॥11-36
సర్వతః పాణి పాదం తత్సర్వతోఽక్షి శిరోముఖమ్।
సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి॥13-14
కవిం పురాణ మనుశాసితారమణోరణీయాంస మనుస్మ రేద్యః।
సర్వస్య ధాతార మతిన్త్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్॥8-9
ఊర్ధ్వమూల మధశ్శాఖ మశ్వత్థం ప్రాహురవ్యయమ్।
ఛంధాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్॥15-1
సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ।
వేదైశ్త సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేదవిదేవ చాహమ్॥15-15
మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు।
మామేవైష్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణః॥9-34
హే అర్జునా!ఇంద్రియ నిగ్రహంతో బ్రహ్మపరమైన ఓం అనే మహా మంత్రాన్ని ధ్యానించాలి.సదా నన్నే స్మరిస్తూ ఉండాలి.అలాంటి అవస్థలో దేహత్యాగం చేసేవాడు పరమ పదాన్ని సునాయాసంగా పొందుతాడు.8-13
అర్జునుడు భగవంతుని విశ్వరూపం చూసి ఇలా అంటున్నాడు.హే కృష్ణా!హే హృషీకేశా!నీ గుణగణాల కీర్తనలతో ప్రపంచం అంతా ఆనందిస్తుంది.రాక్షసులు ఏమో భయంతో వణికి పోతున్నారు.ఎటు పోవాలో తెలియక నలుదిక్కులకూ పరుగులు తీస్తున్నారు.మునులు,సిద్థులు అవథులు దాటిన ఆనందంతో నీకు నమస్సుమాంజలులు అర్పిస్తున్నారు.11-36
అత్యుత్తమమయిన జ్ఞానమే పరబ్రహ్మము.ఎటు చూసినా కాళ్ళు,చేతులు ,ముఖాలు,చెవులూ కలిగి అది ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది.13-14
భగవంతుడు అనేవాడు కవి,పురాణపురుషుడు.అతను ఈ జగత్తును అంతా నియమించిన వాడు.అణువు కంటే సూక్ష్మం అయినవాడు.అయినా సర్వ జగత్తునూ పాలించేవాడు.ఈసృష్టి మొత్తం అతని పైనే ఆథారపడి ఉంది.వేయి సూర్యులకంటే ఎక్కవ వెలుగునిచ్చేవాడు.అజ్ఞానపు అంథకారాన్ని తొలగించేవాడు.ఆపరమాత్మను మనము ఆరాధించాలి.అప్పుడు ఖచ్చితంగా ఆ పరమాత్మనే పొందగలుగుతాము.8-9
శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!ఒక అశ్వత్థ వృక్షము ఉంది.దానికి వ్రేళ్ళు పైకి ఉంటాయి.కొమ్మలేమో క్రిందికి ఉంచాయి.వేదాను వాకాలను ఆకులుగా కలిగి ఉంటుంది.దానికి నాశనము అనేది లేదు.ఆ వృక్షము గురించి తెలుసుకున్నవాడే వేదవిదుడు.15-1
శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటున్నాడు.అర్జునా!అందరిలో నేనే ఉన్నాను.ఎలా అనుకున్నావు?వారి అంతరాత్మలాగా నిబిడీకృతమై ఉంటాను.మనషిలో కనిపించే జ్ఞాపకం,జ్ఞానము,మరపు...ఇలా ప్రతి ఒక్క గుణము నా వల్లనే కలుగుతున్నాయి.నేను ఎవరనుకున్నావు?నేనే వేదవేద్యుడను.నేనే వేదాంత కర్తను.వేదవేత్తను కూడా నేనే.సమగ్రంగా చెప్పాలంటే కర్త,కర్మ,క్రియలు నేనే.నన్ను మించి ఇంకేమీ లేదు.15-15
శ్రీకృష్ణుడు ముక్తాయింపుగా ఈ సూచన,సలహా ఇస్తున్నాడు.అర్జునా!నీకు ఒక చిన్న చిట్కా చెబుతాను.నువ్వు నాయందే మనసు నిలిచేటట్లు చేసుకో.నా భక్తుడివి అయ్యేదానికి నడుము బిగించునన్నే సేవించి తరించు.నన్నే నమ్ముకో!నాకే నమస్కారము చెయ్యి.నాయందే నీ దృష్టి నిలిచేలా చేసుకో!అంటే ఒక రకంగా నాతోటి మమేకం అవ్వాలి అని చెబుతున్నాడు.ఇలా చేస్తేనే నన్ను పొందగలవు.పరమపదమూ పొందగలవు.
Thursday, 2 October 2025
గీతతో నా స్నేహం
నేను చిన్నప్పుడు మా బాబు(నాన్న)రోజూ స్నానంచేసి వచ్చి దేవుడి ముందర భగవద్గీత చదవడం చూసేదాన్ని.నేను మొట్ట మొదటి సారి నా తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు దానిని పట్టుకుని ఒక్క శ్లోకం కూడుకుంటూ చదివాను ఒక్కొక్క పదం.తరువాత చిన్నగా అలవాటు అయి ఇప్పుడు రోజూ గీత మొత్తం చదివే స్థితికి వచ్చాను.నాకు గీత ఏమనిపిస్తుందో చెబుతాను.
తప్పు ఎవరు చేసినా తప్పే.ఒప్పు ఎవరు చేసినా ఒప్పే.మన బిడ్డ చేసాడని తప్పు ఒప్పు కాదు.ఇష్టం లేని వారు చేస్తే ఒప్పు తప్పుకాదు.ధర్మానికి తన మన అని ఉండదు.దాని దారిలోకి మనము రావాలి కానీ మన దారిలోకి అది రాదు.భగవద్గీత మొత్తమూ మనుష్య సంబంధాలు...అదే తల్లిదండ్రులు,భార్యాబిడ్డలు,తోడబుట్టినవాళ్ళు,బంధుజనం గురించి చెప్పదు.మానవుడు సమస్త ప్రాణికోటితో ఎలా నడచుకోవాలో చెబుతుంది.సంయమనం పాటించమంటుంది.పిరికితనం,భయం వద్దంటుంది.తప్పు చేస్తే భయపడాలి.కాబట్టి ఆ తట్టే వెళ్ళ వద్దు అంటుంది.ఫలాపేక్ష లేకుండా సమాజహితం కోసం పాటుపడమంటుంది.కామక్రోధలోభమదమాత్సర్యాలకు దూరంగా ఉండమంటుంది.
గొప్పవాళ్ళ మాటల్లో గీత
గొప్ప గొప్ప వాళ్ళు గీతను తమ జీవితాలలో భాగం చేసుకున్నారు.గీతను తమ జీవితగమనంలో అడుగడుగునా అన్వయించుకుంటూ ముందుకు సాగారు.జీవిత సమరంలో సఫలీకృతులు అయ్యారు.
మహాత్మా గాంధీ ఇలా చెప్పుకొచ్చాడు.ఎన్ని ఒడుదుడుకులు జీవితంలో ఎదురైనా ఒక్కసారి భగవద్గీత చదివితే చాలు.ముఖం పైకి చిరునవ్వు మనకు తెలియకుండానే వస్తుంది.అనేకానేక కష్టాల నుండి,సమస్యల నుంచీ,సందేహాల నుంచీ ఈ భగవద్గీతే నన్ను కాపాడి,ఉద్ధరించింది.
వినోబా భావే అయితే ఇలా అంటారు.పుట్టిన బిడ్డకు తల్లి పాలు ఎంత ముఖ్యం?అవి బిడ్డ ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి.అట్లాంటి తల్లి చనుబాలకంటే కూడా భగవద్గీత మనిషి ఎదుగుదలకు సహాయకారి.సంపూర్ణమయిన ఎదుగుదల...బుద్ధికీ,మనోవికాసానికీ,సంయమనము పాటించేదానికి ఉపయోగ పడుతుంది.
మదన్ మోహన్ మాళవ్యగారు అయితే ఇది అసలు మత గ్రంధము కానే కాదు.విశ్వమానవాళికి పనికి వచ్చే ధర్మభాండాగారము.ఇప్పటిదాకా ప్రపంచవాజ్మయంలో ఇంతకంటే గొప్పగ్రంధం ఇంకొకటి పుట్టలేదు అని అన్నారు.
మథుసూదన సరస్వతి అయితే ఇంకా బాగా విశ్లేషణ చేసారు.గీ అనగా త్యాగము.త అనగా తత్త్వము.అంటే భగవద్గీత మనకు త్యాగివై తత్త్వజ్ఞుడివి కావాలని బోధిస్తుంది.మనకు త్యాగము...కర్మఫలత్యాగము,తత్త్వము...ఆత్మస్పృహ..ఆత్మజ్ఞానము,పరిపక్వత వేర్పిస్తుంది.
లోకమాన్య తిలక్ ఈ మహా గ్రంధం గురించి ఈ విధంగా నొక్కి వక్కాణించారు.మనిషిగా జన్మ నెత్తినవాడు ఏమి చెయ్యాలి,ఏమేమి చేయకూడదో తాత్విక దృష్టితో విశ్లేషణ చేస్తూ,బోధించే గ్రంథము.కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితకాలంలో తప్పనిసరిగా చదవాల్సిన గ్రంధము.
స్వామి వివేకానంద శ్రీకృష్ణుడి పలుకులు,భగవద్గీత ద్వారా,మనకు ఏమి చెప్పాడో విందాము.పిరికి తనం నరకంకన్నా హీనమయినది,హేయమయినది.జీవితం రణరంగం లాంటిది.ధైర్యంగా సాగాలి ముందుకు.
గీత అనేది ఏరి,కూర్చిన పుష్ప గుచ్ఛం లాంటిది.చక్కగా,సుందరంగా,సమన్వయంగా అల్లిన పూలమాల లాంటిది.ఈ గీత అత్యంత నైపుణ్యంతో కూర్చిన ధర్మసూక్ష్మాల సముచ్చయము.జీవితంలో ఉన్నత శిఖరాలు అథిరోహించాలి అనే తపన ఉండే ప్రతివాడూ తప్పకుండా గీతోపదేశాన్ని అధ్యయనము చేయాలి.ఇంతకంటే మంచి సాధనము ఇంకొకటి లేదు.
గీతా గంగా చ గాయత్రీ
గీతా గంగా చ గాయత్రీ గోవిందేతి హృదిస్థితే।
చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే॥
గీత యొక్క గొప్పదనం మహాభారత గ్రంథంలో కూడా ఉటంకించారు.గీత,గంగ,గాయత్రీ,గోవింద అనే ఈ నామాలు మనకు పరమ పవిత్రమయినవి.భగవద్గీత మహాత్మ్యము మనము చెప్పుకున్నాము కదా!అన్ని నదీ జలాలలోకి గంగ పవిత్రమయినది.నేరుగా శివుడి జటాజూటం నుంచి భూమిపైకి ఉరకలేస్తూ సాగే జీవనది.గాయత్రీ మంత్రము ఎంత పవిత్రమయిన మంత్రమో అందరికీ తెలుసు.అలాగే గోవింద నామము.ప్రముఖంగా ఈ కలియుగంలో గోవింద గోవింద అనే నామము యొక్క ప్రాశస్త్యము మనందరికీ తెలుసు.గ కారముతో మొదలు అయే ఈ నాలుగు నామాలను విడవకుండా సతతమూ తలుస్తూ ఉండాలి.అలాంటి వారికి పునర్జన్మ అనేది ఉండదు అని ప్రగాఢ నమ్మకము.పునర్జన్మ లేదంటే పరమపదము మనకు దక్కినట్లే కదా!
Wednesday, 1 October 2025
భగవద్గీతా కించి దధీతా
భగవద్గీతా కించి దధీతా
గంగాజలలవ కణికాపీతా।
సకృదపి యేనమురారి సమర్చా
తస్య కరోతి యమోపినచర్చా॥
నువ్వు నేనూ కాదు,జగద్గురు శంకరాచార్యులవారు కూడా తను రచించిన భజగోవిందమ్ లో భగవద్గీత యొక్క గొప్పదనం చెప్పారు.ఆయన ఇదే చెప్పారు.మనము జీవితంలో ఒక్కసారైనా ఆ శ్రీకృష్ణుడిని,ఆ మురారిని ధ్యానం చేసుకోవాలి.ఒక్క చుక్క అయినా పవిత్రమయిన గంగాజలాన్ని తాగాలి.ఒక్కసారి అయినా కళ్ళ కద్దుకుని భగవద్గీతలోని ఒక్క శ్లోకమయినా శ్రద్ధగా చదవాలి.పైన చెప్పిన ఈ పనులు క్షణకాలమయినా మనస్పూర్తిగా చేస్తే మనము పుణ్యాత్ములకోవలోకి చేరిపోతాము.అప్పుడు యముడు కూడా మన దరిదాపుల్లోకి తచ్చాడేదానికి భయపడతాడు.
Tuesday, 30 September 2025
సంసార సాగరం ఘోరం
సంసార సాగరం ఘోరం తర్తుమిచ్ఛతి యోనరః।
గీతాభ్యాసం సమాసాద్య పారంయాతి సుఖేన సః॥
మనిషికి జీవితంలో ఏదో ఒకటి సాథించాలని ఉంటుంది సహజంగా.సంసారంని ఈదలేని మహాసాగరము అంటుంటారు.కాబట్టి అది సునాయాసంగా దాటగలగటం ఒక యజ్ఞం లాంటిది.అది సాథించడం జీవిత ధ్యేయంగా పెట్టుకుంటారు చాలా మంది.అది సులువుగా సాథించేదానికి ఒక చిన్న చిట్కా ఉంది.అదే గీతాభ్యాసము!
వైష్ణవీయ తంత్రసారము దీనినే సమర్థిస్తుంది.ఏ మానవుడు దుర్భరమయిన ఈ సంసైర సాగరాన్ని తరించ దలచాడో...వాడు గీతాభ్యాసము అనే పడవ ఎక్కితే చాలు.ఆ పడవే మనలను ఒడిదుడుకులు లేకుండా,సాఫీగా ప్రశాంతంగా ఈ భవసాగరం దాటగలిగేలా చేస్తుంది.
Monday, 29 September 2025
ఆపదం నరకం ఘోరం
ఆపదం నరకం ఘోరం గీతాధ్యాయీ న పశ్యతి।
నిత్యం ధారయతే యస్తుస మోక్ష మధిగచ్ఛతి॥
స్కాందపురాణంలో ఇలా చెప్పబడింది.భగవద్గీతను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేస్తే మంచిది.ఎందుకో వివరణ ఇచ్చారు ఇక్కడ.భగవద్గీతను అధ్యయనం చేసేవారు ఇహలోకంలో కష్టాలు పడరు.అంతేనా?కాదు.పరలోకంలో కూడా నరకంబారిన పడరు.నిత్యమూ పారాయణ చేసేవారు నేరుగా మోక్షాన్ని పొందుతారు.ఇందులో అనుమానమే లేదు.
Sunday, 28 September 2025
మల నిర్మోచనం పుంసాం
మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే।
సకృద్గీతాంభసి స్నానం సంసార మల నాశనమ్॥
మనము రోజూ స్నానంచేస్తాము.ఎందుకు?ఒంటికి అంటుకున్న దుమ్మూ,ధూళీ వదలగొట్టుకునేదానికే కదా!అదే మనసుకు పట్టిన దోషాలూ,ఘోషలూ,పాపపంకిలాలూ పోవాలంటే మనం ఇంకెంత శుభ్రంచేసుకోవాలి?వాటన్నిటికీ చెప్పిన చిన్న చిట్కానే ఈ భగవద్గీత.అదే ఈ శ్లోకంలో చెప్పబడింది.మంచి నీళ్ళతో స్నానం రోజూ చేస్తే ఒంటికి పట్టిన మురికి పోతుంది.గీతాభ్యాసము,గీతా పారాయణము అనే స్నానము మనము రోజూ చేస్తే మనసుకు పట్టిన చీడ,పీడ వదలిపోతాయి.అన్ని రకాల మాలిన్యాలకు స్వస్థి చెప్పవచ్చు.
Saturday, 27 September 2025
గీతాయాశ్చన జానాతి
గీతాయాశ్చన జానాతి పఠనం నైవ పాఠనం।
స ఏవ మానుషే లోకే మోఘకర్మకరో భవేత్॥
భగవద్గీత అనేది అన్ని వేదాల సారము.అది భగవంతుడు దయతో మానవాళికి ఇచ్చిన కానుక.అది దేవుడి గదిలో ఒక మూల పడి ఉండకూడదు.ప్రతి నిత్యం దానిని చదువుతూ ఉండాలి.దానిలోని సారాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటూ ముందుకు పోవాలి.
అందుకే చెబుతున్నారు.గీతను చదవని వాడు,బోధించని వాడు,దానిని అర్థం చేసుకోనివాడు ఈ లోకంలో వ్యర్థుడు.
గీతాయాః పుస్తకం
గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే।
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్రవై॥
ఈ భగవద్గీత అనేది మనకు దక్కడం మన పూర్వ జన్మ సుకృతం.ఈ మహద్ గ్రంథం ఎక్కడ ఉంటుందో అక్కడే అన్ని పుణ్య తీర్థాలూ,గయా ప్రయాగాదులూ ఉన్నట్లు లెక్క.ఎక్కడ ఈ శ్రీకృష్ణార్జునుల సంవాదం చదవబడుతుందో,అక్కడ ముక్కోటి దేవతలూ,మునులూ,యోగులూ,పన్నగులూ,నారదుడూ,ఉద్ధవుడూ,మిగిలిన మహానుభావులూ...అందరూ ఉన్నట్లు లెక్క.వాళ్ళందరూ ఉన్నారు అంటే మనలను ఆశీర్వదించే దానికే కదా!పుణ్య క్షేత్రాలు,పవిత్ర నదీ జలాలు ఉన్నాయి అంటే మనము పుణ్య స్నానాలు చేసినట్లే కదా!అంత పుణ్యం దక్కుతుంది మనకు.ఎక్కడ కృష్ణార్జునులు ఉంటే అక్కడ జయము,లక్ష్మీ,ఐశ్వర్యము ఉంటాయి అని చెప్పాడు కదా సంజయుడు.వారికి ప్రతీకగా ఉండే భగవద్గీత ఎక్కడ కొలవబడుతుందో,చదవబడుతుందో,ఆకళింపు చేసుకోబడుతుందో,వినబడుతుందో,పఠింపబడుతుందో అక్కడ ఖచ్చితంగా జయము,లక్ష్మి,ఐశ్వర్యము తాండవిస్తాయి.
Friday, 26 September 2025
యత్ర యోగేశ్వరః కృష్ణో
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః।
తత్ర శ్రీర్విజయో భూతిః ధృవా నీతిర్మతిర్మమ॥78॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
కురుక్షేత్ర సంగ్రామం యొక్క ముగింపు ఏందో,ఎట్లా ఉంటుందో అనేది యుద్ధం మొదలు కాకుండానే సంజయుడికి కళ్ళకు కట్టినట్లు తెలిసి పోయింది.ధృతరాష్ట్రుడు శారీరకంగానే కాదు మానసికంగా కూడా గ్రుడ్డి వాడు కాబట్టి చివరాఖరుదాక కూడా తెలుసుకోలేక పోయాడు.సంజయుడు తన మనసుకు తట్టిన విషయం మొహమాటంలేకుండా,రాజు అని భయపడకుండా చెబుతున్నాడు.
ఓ ధృతరాష్ట్ర మహారాజా!నేను చెబుతున్నాను,విను.శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు.అర్జునుడు ధనుర్థారి.వీళ్ళిద్దరూ కలసి ఎక్కడ ఉంటే అక్కడ అన్నీ శుభాలే జరుగుతాయి.అక్కడ లక్ష్మీ దేవి స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది.అక్కడ ఎప్పుడూ గెలుపే! ఓటమి దరిదాపులకు కూడా వచ్చేదానికి వణికి చస్తుంది.అక్కడ ఐశ్వర్యము పిలవకున్నా తనే నడచి వచ్చి నట్టింట కూర్చుంటుంది.రాజా!నేను ఈ మాటలు ఆషామాషీగా అనటం లేదు.ఇది నా దృఢమయిన అభిప్రాయము.ఇది ముమ్మాటికీ నిజం!నిజం!నిజం!!!
శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్న్యాస యోగో నామ అష్టాదశోధ్యాయః!!!!!
Thursday, 25 September 2025
తచ్చ సంస్మృత్య సంస్మృత్య
తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతమ్ హరేః।
విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః॥77॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
సంజయుడు ధృతరాష్ట్రుడికి తన ఆనందం,తన అదృష్టం గురించి పదే పదే,మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాడు.ఎన్ని సార్లు చెప్పినా తనివి తీరటం లేదు.ఆ క్షణాలు మళ్ళీ మళ్ళీ ఆస్వాదిస్తున్నాడు.గుర్తు వస్తేనే మనసు అంతా పులకరించి పోతుంది.తన అదృష్టానికి తనే దిష్టి పెట్టుకుంటున్నాడు.ఓ ధృతరాష్ట్ర మహారాజా!శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు కదా!నా కళ్ళు మిరుమిట్లు గొలిపాయి.నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.ఇది కలయా,నిజమా లేక వైష్ణవ మాయా!నాకేమీ అర్థం కావడం లేదు.ఆ అద్భుతమయిన విశ్వరూపం పదే పదే నాకు కనిపిస్తుంది.నా ఆనందానికి అడ్డూ ఆపు లేవు.నా మనసు పరవశత్వంతో పుంతలు తొక్కుతూ ఉంది.నా అంత ధన్య జీవి ఈ లోకంలో ఇంకెవరూ లేరు.
Wednesday, 24 September 2025
రాజన్! సంస్మృత్య సంస్మృత్య
రాజన్! సంస్మృత్య సంస్మృత్య సంవాద మిమ మద్భుతమ్।
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః॥76॥
శ్రీమద్భగవద్గీత...అష్టదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
మాములుగా అద్భుతాన్ని కనినా,వినినా,అనుభవించినా జీవితం ధన్యమవుతుంది.ఇన్ని యుగాలుగా భగవద్గీతను చదివినా,వినినా ఒళ్ళు పులకరించి పోతుంది తాదాత్మ్యంతో ప్రతి ఒక్కరికీ.అలాంటిది నేరుగా శ్రీకృష్ణుడు అర్జునుడు సంవాదము విని తరించిన సంజయుడి మానసిక పరిస్థితి ఇంక ఎలా ఉండాలి?
అదే చెబుతున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి.ఓ రాజా!శ్రీకృష్ణార్జునుల సంవాదం మాటి మాటికీ గుర్తు వస్తున్నది.అసలు మర్చిపోలేక పోతున్నాను.నా మనసు అంతా ఉప్పొంగి పోతుంది.ఈ ఆనందం పట్టనలవి కాకుండా ఉంది.
Tuesday, 23 September 2025
వ్యాస ప్రసాదా చ్ఛృతవాన్
వ్యాస ప్రసాదా చ్ఛృతవాన్ ఏతద్గుహ్యమహం పరమ్।
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతస్స్వయమ్॥75॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాథ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
సంజయుడికి ఏమీ అర్థం కావటం లేదు.అతని ఆనందానికి అవథులు లేవు.అసలు జీవితంలో ఇంత అద్భుతమయిన ఘట్టం తనకు ఎదురవుతుంది అని.అదే అంటున్నాడు.ఓ ధృతరాష్ట్ర మహారాజా!శ్రీ వ్యాస భగవానుడి దయ వలన యోగేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు సొంతంగా,స్వమపఖంగా అర్జునుడికి చెప్పిన యోగశాస్త్రము అయిన గీతోఽపదేశాన్ని ప్రత్యక్షంగా విని,తరించే భాగ్యం నాకు కలిగింది.నాకు ఇంక జీవితంలో ఇంకేమీ వద్దు.ఈ అదృష్టం చాలు.
Sunday, 21 September 2025
ఇత్యహం వాసుదేవస్య
సంజయ ఉవాచ....
ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః।
సంవాద మిమ మశ్రౌషం అద్భుతం రోమహర్షణమ్॥74॥
శ్రీమద్భగవద్గీత...।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యస యోగము
శ్రీకృష్ణుడు చెప్పిన నీతి మాటలు విని అర్జునుడు ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు.అలాంటిది దేవుని కృప వలన ఆ సంభాషణ వినగలిగిన సంజయుడి మానసిక పరిస్థితి ఇంకెలా ఉంటుంది?అతని ఆనందం చెప్పనలవి కాదు.తమాయించుకుని ధృతరాష్ట్రునితో ఇలా అంటున్నాడు.ధృతరాష్ట్ర మహారాజా!మహాత్ములు,పుణ్యపురుషులు అయిన శ్రీకృష్ణార్జునులు చేసుకున్న ఆ పరమ పవిత్రమయిన,అత్యద్భుతమయిన సంవాదాన్ని నేను కూడా స్వయంగా వినగలిగాను.నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.నా శరీరం పులకించింది.నా జీవితం ధన్యమయింది.
Saturday, 20 September 2025
నష్టం మోహః స్మృతిర్లబ్ధా
అర్జున ఉవాచ....
నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాఽచ్యుత।
స్థితోఽస్మి గతసందేహః కరిష్యే వచనం తవ॥73॥
శ్రీమద్భగవద్గీత....అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్సాస యోగము
అర్జునుడు శ్రీకృష్ణుడు ఇంత సేపూ చెప్పింది కళ్ళు ఆర్పకుండా,మనసునంతా లగ్నం చేసి,ఏకాగ్ర చిత్తంతో విన్నాడు.కృష్ణుడు నీకు ఏమి అర్థం అయింది?ఎంత మటుకు అర్థం అయింది అని అడగటంతో ఈ లోకం లోకి వచ్చాడు.అర్జునుడు ఇలా చెబుతున్నాడు.కృష్ణా!మాథవా!మథుసూదనా!నీవు ఎంతో ఓపికగా,ప్రేమగా,అనురాగంతో నాకు తెలియని విషయాలు,సరిగా అర్థం చేసుకోలేని విషయాలు చాలా చెప్పావు.నీ కృపాకటాక్షంవల్ల నా అజ్ఞానం సమసిపోయింది.ఇంక నాకు ఎటువంటి అనుమానాలు,శంకలూ లేవు.ఆత్మస్మృతి కలిగింది.అంటే ఆత్మజ్ఞానం కలిగింది.నాకు ఇకమీదట కర్త,కర్మ,క్రియ అన్నీ నీవే.నేను నీ నీడను మాత్రమే.నీవు ఏమి చెబితే,ఎలా చెబితే,ఎప్పుడు అని చెబితే,ఎక్కడ అని చెబితే అలాగే తు చ తప్పకుండా చేస్తాను.నేను నీ ఆజ్ఞ కోసరము శిరసు వంచి సిద్ధంగా,సమాయత్తం అయి ఉన్నాను.
Friday, 19 September 2025
కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ
కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైక్తాగ్రేణ చేతసా।
కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్ట స్తే ధనంజయ॥72॥
శ్రీమద్భగవద్గీత...అష్టదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
మమూలుగా పాఠం చెప్పడం అయిపోగానే గురువులు పిల్లలతో ఏమి అంటారు?నేను చెప్పింది ఎంత అర్థం అయింది?బాగా అర్థం చేసుకున్నారా?మీకు ఏమైనా ఇంకా అనుమానాలు ఉన్నాయా?ఉంటే చేతులు ఎత్తండి.ఒక్కొక్కళ్ళ అనుమానాలు తీరుస్తాను.
అచ్చం అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడిని అడుగుతున్నాడు.హే పార్థా!ఓ ధనంజయా!ఇంత సేపూ నేను చెప్పింది ఏంది? నిజంగా మనసు పెట్టి విన్నావా?ఏమనిపిస్తుంది నీకు? నీ అజ్ఞానం ఏమైనా తగ్గుమొఖం పట్టిందా?దాని వలన సంక్రమించే మోహం నశించిందా?న మనసుకు ఏమనిపిస్తుంది?నకు సవివరంగా సమాధానం ఇవ్వు.
Thursday, 18 September 2025
శ్రద్ధావాననసూయశ్చ
శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః।
సోఽపి ముక్తశ్శుభాన్ లోకాన్ ప్రాప్నుయా త్పుణ్యకర్మణామ్॥71॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా వివరంగా చెబుతున్నాడు.అర్జునా!ఈ గీతను,గీతాసారాన్నీ శ్రద్ధగా,భక్తిగా,ఆసక్తిగా చదవాలి.వినాలి.అలా చేసినవారు గొప్ప గొప్ప పుణ్యాలు చేసిన వారికి ఏ మాత్రం తీసిపోరు.అంటే అసూయ లేకుండా,శ్రద్ధాసక్తులతో ఎవరైతే వింటారో,వారు పుణ్యాత్ములు పొందే పుణ్యలోకాలను సునాయాసంగా,సులభంగా,అవలీలగా పొందగలుగుతారు.ఇందులో ఎలాంటి సందేహము లేదు.
Wednesday, 17 September 2025
అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం
అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః।
జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టః స్యామితి మే మతిః॥70॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!మనమిద్దరమూ ఇప్పుడు మాట్లాడుకున్నాము కదా!ఈ గీత జ్ఞాన,వేదాంత సారము.కాబట్టి ఎవడు అయితే ఈ గీతా పారాయణం చేస్తాడో,వాడు నాకు అత్యంత ఇష్టుడు,ఆప్తుడు.ఒక రకంగా వాడు నన్ను జ్ఞానమనే యజ్ఞంతో ఆరాధిస్తున్నాడు అని మురిసి పోతాను,సంతసిస్తాను.తన జ్ఞానాన్ని నాకు సమర్పించి ముక్తుడు అవుతున్నాడు ఆ మానవుడు.
Tuesday, 16 September 2025
న చ తస్మాన్మనుష్యేషు
న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమః।
భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి॥69॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!నీకు చెప్పాను కదా,ఇప్పుడు నేను నీకు చెప్పిన గీతా బోధ అత్యంత రహస్యమయినది,పవిత్రమయినది,ప్రభావితమయినది అని.దీనిని జనబాహుళ్యము లోకి ఎవరు తీసుకెళతారో వారే నాకు అత్యంత ప్రియులు.ఈ గీతాశాస్త్ర ప్రచారకుడు నాకు అత్యంత ప్రముఖుడు.అతని తరువాతే ఏ భక్తుడు అయినా,ప్రియమయినవాడైనా ఈ లోకంలో నాకు.
Monday, 15 September 2025
య ఇమం పరమం గుహ్యం
య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి।
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్య త్యసంశయః॥68॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాల్సింది అంతా చెప్పాడు.ఇప్పుడు ముక్తాయింపు చెబుతున్నాడు.అర్జునా!నేను నీకు ఇప్పుడు అతి రహస్యమయిన,అత్యంత పవిత్రమయిన గీతా శాస్త్రాన్ని బోధించాను.ఈ పరమ పవిత్రమయిన శాస్త్రాన్ని నాభక్తులు అందరికీ చేర వేయాలి.ఎవరైతే ఈ కార్యాచరణలో సఫలీకృతులు అవుతారో,వారు ఖచ్చితంగా నాకు దగ్గర అవుతారు.పరమాత్మలో లీనం అవుతారు.ఇందులో అనుమానానికీ,సంశయానికీ తావే లేదు.
Sunday, 14 September 2025
ఇదం తే నాతపస్కాయ
ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన।
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోఽభ్యసూయతి॥67॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో అపాత్రదానం చేయకూడదు అని చెబుతున్నాడు.ఇంత వరకూ చాలా నిగూఢమైన విషయాలు,జ్ఞానం అర్జునుడికి చెప్పాడు కదా!ఇప్పుడు అవి ఎవరికి చెప్పకూడదో చెబుతున్నాడు.నిజమే కదా!పిచ్చోడి చేతికి మంత్ర దండం ఇస్తే ఏమి చేస్తాడు?దురుపయోగంచేస్తాడు.దానిని అపహాస్యం చేస్తాడు.దాని విలువ తగ్గిస్తాడు.నవ్వులపాలు చేస్తాడు.నవ్వుల పాలు అవుతాడు.ముఖ్యంగా అందరికీ హానీ,అన్యాయం చేస్తాడు.అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి మెళకువలు చెబుతున్నాడు.హే అర్జునా!నేను నీకు ఇప్పుడు చేసిన హితబోధను అపహాస్యం చేయవద్దు.జపము,తపము చేయని వారికి చెప్పవద్దు.నా భక్తుడు కాని వాడికి చెప్పవద్దు.సేవాధర్మం పాటించని వాడికి చెప్పవద్దు.నన్ను అర్థం చేసుకోకుండా అసూయతో చూసేవాడికి,అపహాస్యం చేసేవాడికి,తప్పుగా అర్థం చేసుకునేవాడికి ఈ శాస్త్రాన్ని ససేమిరా బోధించవద్దు.ఎందుకంటావా?నీ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.వృథా అవుతుంది.
Saturday, 13 September 2025
సర్వధర్మాన్ పరిత్యజ్య
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ।
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః॥66॥
శ్రీమద్భగవద్గీత....అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి చిలకకు చెప్పినట్లు చెబుతున్నాడు.ఓ అర్జునా!ఓ ధనంజయా!నీవు అసలు ఏమీ ఆలోచించే పనిలేదు.కళ్ళు మూసుకుని నన్ను నమ్ముకో!ఈ భవసాగరాన్ని దాటిస్తాను.అన్ని ధర్మాలనూ పక్కకు పెట్టేయి.ఈ భూమండలంలో నేను తప్పిస్తే నీ హితవు కోరేవారు నా అంత ఇంకొకరు లేరు.కాబట్టి నన్నొక్కణ్ణే శరణు కోరు.నేను నిన్ను పూర్వ,ప్రస్తుత,భవిష్యత్ పాపాలనుంచి కాపాడుతాను.సర్వకాల సర్వావస్థలయందు నిన్ను రక్షిస్తాను.నీకు మోక్ష ప్రాప్తి కలిగిస్తాను.
Friday, 12 September 2025
మన్మనాభవ మద్భక్తో
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు।
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోఽసి మే॥65॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుఢు అర్జునుడికి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు.మామూలుగా గురువులు ఒకసారి చెప్పి శిష్యులను పదే పదే చదివి,అర్థం చేసుకుని,గుర్తు పెట్టుకోమంటారు.కానీ ఇక్కడ భగవంతుడు గురువుగా మారి,శిష్యుడు అయిన అర్జునుడికి పదే పదే హితోఽపదేశం చేస్తున్నాడు.అర్జునుడు ఎంత అదృష్టవంతుడో కదా!
హే అర్జునా!ఓ పార్థా!నా యందే నిశ్చలమయిన మనసుతో ఉండు.ద్వంద్వాలకు లోను కావద్దు.నన్నే అటలమయిన భక్తితో సేవించు.నన్నే పూజించి,తరించు.నాకే నమస్కరించు.నాకు ఇష్టమయినవాడివి కనుక నీకు ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను.గుర్తు పెట్టుకో!నన్ను నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోడు.నువ్వు ఖచ్చితంగా నన్నే పొందుతావు.అంటే మోక్షం పొందుతావు అనే కదా!ఇందులో ఎలాంటి సందేహం లేదు.
Thursday, 11 September 2025
సర్వ గుహ్యతమం భూయః
సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః।
ఇష్టోఽసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్॥64॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
భగవంతుడు ఎంతో భక్తసులభుడు.లేకపోతే ఆయన భక్తుడిని నన్ను నమ్ముకో,నీకు మంచి చేస్తాను అని బతిమాలడటం ఏంటి?
ఇక్కడ శ్రీకృష్ణుడు సరిగ్గా భక్తుడు అయిన అర్జునుడిని బుజ్జగించి,చెపుతున్నాడు.హే అర్జునా!నీవు నాకు నాకు చాలా కావలసిన వాడివి.నా వాడివి.నాకు ఆప్తుడివి.నీకు మంచి చేయటం నా ధర్మము. నీ శ్రేయస్సు కోరుకోవడం నా కర్తవ్యం.కాబట్టి నీ మంచి కోసం,శ్రేయస్సు కోసం మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను,విను.అన్ని ఉపదేశాలలోకీ ఉత్కృష్టమయిన,గోప్యమయిన నా మాటలు,ఉపదేశాలు మరలా విను.అర్థం చేసుకో!అన్వయించుకో!
Tuesday, 26 August 2025
ఇతి తే జ్ఞానమఖ్యాతం
ఇతి తే జ్ఞానమఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా।
విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు॥63॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు ఇంత సేపూ అలుపు,అలసట లేకుండా అర్జునుడికి బోధిస్తున్నాడు కదా!ఇంక ముక్తాయింపు చెబుతున్నాడు.ఓ అర్జునా!హే కౌంతేయా!అతి రహస్యమైన,పరమ పవిత్రమైన జ్ఞానాన్ని అంతా నీకు సవివరంగా చెప్పాను.నేను చెప్పినదానినంతా ఒకసారి సింహావలోకనం చేసుకో!బాగా ఆలోచించు.నీ మనసుకు ఏది మంచిది అనిపిస్తుందో,ఏది సరైన పని అని అనిపిస్తుందో,అదే చెయ్యి.నేను ఇంక నిన్ను ప్రభావితం చేయను.నీ విచక్షణను ఉపయోగించి కార్యాచరణం లోకి దిగు.నీకు నచ్చింది పాటించు.
Monday, 25 August 2025
త్వమేవ శరణం గచ్ఛ
త్వమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత।
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్॥62॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి అసలు కిటుకు చెబుతున్నాడు.ఓ అర్జునా!హే భరతశ్రేష్టా!నేను చెప్పిన వాటికి అన్నిటికీ జవాబు,ఉపాయం ఒక్కటే ఉంది.అదే ఆ పరమాత్మను మనసా,వాచా, కర్మణా శరణు కోరటం.అతను అత్యంత దయాళువు.అతని దయ,కనికరం,ప్రేమ,వాత్సల్యం నీకు దక్కాయి అనుకో!నీవు ఖచ్చితంగా శాంతినీ,మనశ్శాంతినీ,మోక్షాన్నీ పొందగలుగుతావు.
Sunday, 24 August 2025
ఈశ్వర స్సర్వభూతానాం
ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి।
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా॥61॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.ఓ అర్జునా!దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ లేడు? ఇలాంటి అనుమానాలు నీకు అస్సలు వద్దు.ఈశ్వరుడు సర్వాంతర్యామి.తన మాయ చేత సర్వభూతాలనూ కీలు బొమ్మల్లా ఆడిస్తాడు.ఆయన అన్ని ప్రాణుల హృదయాంతరాళలో సదా నివసిస్తూ ఉంటాడు.మామూలు మనుష్యులు మాయామోహంతో అంతర్ముఖంగా ఉండే ఆయనను గుర్తించలేరు.అలా కనుక్కోవాలంటే సాథన కావాలి.
Saturday, 23 August 2025
స్వభావజేన కౌంతేయ
స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్స్వేన కర్మణా।
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశోఽపి తత్॥60॥శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడికి ఉండే ఓపిక,ఓదార్పు,సగటు మానవుడి మానసిక స్థితి పైన అవగాహన ఇంకెవరికీ ఉండవు.అది రణరంగం!ఆదమరిస్తే ప్రాణాలే పోతాయి.అట్లాంటి చోట అర్జునుడిని కూర్చోబెట్టుకుని,బుర్రలోకి బాగా ఎక్కాలని మంచి విషయాలు పదే పదే,ఎంతో ఓపికగా చెబుతున్నాడు.
ఓ అర్జునా!హే కౌంతేయా!మానవుడి పుట్టుక నుండి గిట్టే వరకూ ఏదో ఒక మాయామోహంలో కూరుకుని ఉంటాడు.అది సహజమే!కానీ నేను నీకు పదేపదే చెబుతున్నాను, విను.ప్రకృతి పరంగా జనితమైన ఏమాయో,భ్రాంతో నీవు యుద్ధం చేయవద్దని నిన్ను ప్రేరేపించ వచ్చు,ప్రలోభపెట్టవచ్చుగాక!కానీ తుదకు నీ సహజమైన క్షాత్ర్య ధర్మానికి నీవు కట్టుబడతావు.నీ ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడి యుద్ధానికి కార్యోన్ముఖుడివి అవుతావు.ఇందులో ఎలాంటి సందేహం లేదు.ప్రస్తుతం నీ మనసులో ఉండే అలజడి,అనుమానం అన్నీ దూది పింజాలులాగా పక్కకి పోతాయి.నీవు స్వచ్ఛమయిన చంద్రుడిలా ప్రకాశిస్తావు.నీవు తప్పకుండా ఈ యుద్ధాన్ని చేసి తీరుతావు.నాకు నీపై ఆ నమ్మకం ఉంది.
Friday, 22 August 2025
యదహంకార మాశ్రిత్య
యదహంకార మాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే।
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి॥59॥శ్రీమద్భగనద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి హితవు చెబుతున్నాడు.అర్జునా!నేను నీకు ఇదే చెబుతున్నాను.దురహంకారంతో,అజ్ఞానంతో యుద్ధం మానేయాలనే ఆలోచనే నీ మస్తిష్కం లోకి రావివ్వ వద్దు.అట్లా నువ్వు అనుకున్నా,అది ఒఠ్ఠి వృథా ప్రయాస అవుతుంది.నువ్వు జన్మతః క్షత్రియుడవు.నీ క్షాత్ర ధర్మమే నిన్ను యుద్ధానికి పురిగొల్పుతుంది.నిన్ను ఆ రకంగా యుద్ధానికి వినియోగించుకుంటుంది.ఇది తధ్యము.
మచ్చిత్త స్సర్వదుర్గాణి మత్ప్రసాదా
మచ్చిత్త స్సర్వదుర్గాణిమత్ప్రసాదా త్తరిష్యసి।
అథ చేత్త్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి॥58॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇంకా ఓపికగా చెబుతున్నాడు.ఓ అర్జునా!నిన్ను భయపెట్టేదానికి గానీ,బెదించేదానికి గానీ నేను ఇవేవీ చెప్పటం లేదు.విత్య సత్యాలు కాబట్టే చెబుతున్నాను.కాబట్టి మనసు పెట్టివిని,అర్థం చేసుకో!మామూలుగా ఈ మానవ మాత్రులు భవ సాగరం దాటాలంటే ససేమిరా కాని పని.కాబట్టి నా శరణు కోరుకో!నేను కరుణిస్తేనే, దాటశక్యం కాని సంసార దుఃఖాలన్నింటినీ సులువుగా దాటగలవు.కాదు నాకు అఖ్ఖరలేదు నీ ఆపన్నహస్తం అని గర్వానికీ,అహంభావానికీ పోతే నాశనం అవుతావు.దానిని ఎవరూ ఆపలేరు.
చేతసా సర్వకర్మాణ్యపి
చేతసా సర్వకర్మాణ్యపి మయి సన్న్యస్య మత్పరః।
బుద్ధియోగ ముపాశ్రిత్య మచ్చిత్తస్సతతం భవ॥57॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా అంటున్నాడు. అర్జునా!నీవు ఏమి చెయ్యాలో చెబుతాను విను.ముందరగా సర్వ కర్మలు నాకే సమర్పించు.సమబుద్ధిని ప్రసాదించే యోగాన్ని అవలంబించు.నేనే పరమగతిని అనే విషయం బాగా ఆకళింపుచేసుకో.నీ మనసును,అంతఃకరణాన్నీ నాయందు లగ్నం చేయడంలో సఫలీకృతుడవు కావాలి.అప్పుడే నీవు మోక్ష ప్రాప్తికి అర్హుడవు అవుతావు.
Thursday, 21 August 2025
సర్వకర్మాణ్యపి సదా
సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః।
మత్ప్రసాదా దవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్॥56॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా సులభంగా అర్థం అయ్యేలా చెబుతున్నాడు.ఓ అర్జునా!అన్ని కర్మలను ఆచరిస్తున్నా,నన్నే నమ్ముకున్న కర్మయోగి,అవినాశనమైన పరమపదాన్నే పొందుతాడు.ఎందుకంటే అతను నన్నే నమ్ముకుంటాడు.కర్మఫలాన్ని సదా నాకే సమర్పిస్తాడు.తామరాకు మీద నీటిబొట్టులాగా అతనికి ఏ కల్మషమూ అంటదు.భారం అంతా నా మీదే ఉంచి,తను సర్వదా ప్రశాంత చిత్తంతో ఉంటాడు.
Wednesday, 20 August 2025
భక్త్యా మామభిజానాతి
భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః।
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్॥55॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!నీకు ఇంత దూరం,ఇంత విపులంగా ఎందుకు చెబుతున్నానో తెలుసా?నా భక్తిని పొందగలగటం ఆషామాషీ వ్యవహారంకాదు!జ్ఞానయోగ ఫలమయిన నా భక్తిని పొందినవాడు నా స్వరూప స్వభావాలను పూర్తిగా ఆకళింపు చేసుకుంటాడు.చివరకు ఆ భక్తి తత్త్వంలోనే మునుగి,తేలుతూ నాలో ఐక్యం అవుతాడు.మానవ జన్మకు అంతకంటే ఉత్కృష్టమయినది ఇంకేమి ఉంటుంది?పరమాత్మతో మమేకం కావటం అంటే మాటలా!!!!
Tuesday, 19 August 2025
వివిక్తసేవీ లఘ్వాసీ
వివిక్తసేవీ లఘ్వాసీ యతవాక్కాయమానసః।
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః॥52॥అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్।
విముచ్య నిర్మమశ్శాంతో బ్రహ్మభూయాయ కల్పతే॥53॥
బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి।
సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్॥54॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓపికగా చెబుతున్నాడు.అర్జునా!నీ కోసం మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను.సావథానంగా విని,బుర్రలోకి ఎక్కిచ్చుకో!బ్రహ్మభావానికి అర్హత ఏమేమి అని చెప్పాను?మాయా మోహం లేకుండా,నిశ్చల జ్ఞానంతో మనసును నిగ్రహించాలని చెప్పాను కదా!అలాగే శబ్దాది విషయలను వదలి,రాగద్వేష రహితంగా,విరాగిగా,యేకాంతంగా,అల్పాహారిగా,మనోవాక్కాయ కర్మలను నియమబద్థం చెయ్యాలని చెప్పాను కదా!అహంకారము,దురభిమానము,దంభం,కామక్రోధాలు,మమకారాలకు దూరంగా,అతీతంగా ఉండాలని నొక్కి వక్కాణించాను కదా!
అర్జునా!ఇదంతా ఇన్ని సార్లు ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో!బ్రహ్మ భావాన్ని ఒకసారి పొందితే,అంతఃకరణం శుద్ధి అవుతుంది.కాబట్టి మనిషి ఇంకేమీ కోరడు.దేనికీ దుఃఖ పడడు.సమస్త ప్రాణులయందూ సమ దృష్టి కలిగి ఉంటాడు.చివరకు జ్ఞానయోగ ఫలంగా నా భక్తిని,ముక్తిని పొందుతాడు.
Monday, 18 August 2025
బుద్ధ్యా విశుద్ధయా యుక్తో
బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాఽఽత్మానం నియమ్య చ।
శబ్దాదీన్ విషయాం స్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ॥51॥
వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయ మానసః।
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః॥53॥
అహంకారం బలం దర్పం కామం క్రోథం పరిగ్రహమ్।
విముచ్య నిర్మమశ్శాంతో బ్రహ్మభూయాయ కల్పతే॥54॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!పరమాత్మను పొందాలి అంటే ఏమి చెయ్యాలో చెబుతాను అన్నాను కదా!మనసు లగ్నం చేసి విను.మాయామోహాలకు అతీతంగా ఉండాలి.నిశ్చలమయిన జ్ఞానంతో మనసును నిగ్రహించాలి.అంటే మన చెప్పుచేతల్లో పెట్టుకోవాలి.ప్రపంచం అంతా శబ్దకాలుష్యంతో నిండి ఉంటుంది.ఇలా అనేక రకాల కాలుష్యాలకు దూరంగా ఉండాలి.ఎందుకంటే అవి మన మనసును చలింపచేస్తాయి.రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి.తామరాకు మీద ఉండే నీటిబొట్టులాగా,ఎల్లప్పుడూ విరాగిలాగా ఉండాలి.మనసు ఏకాగ్రత సాధించాలి అంటే ఏకాంతవాసం అవసరము.మితాహారం తీసుకోవాలి.జిహ్వచాపల్యానికి పోయి కనపడ్డదంతా నోట్లో వేసుకోకూడదు.అంటే మనం చేసేపనుల పైన మనకు నుయంత్రణ ఉండాలి.మనోవాక్కాయ కర్మలను నియమ నిబద్ధలతో ఆచరించాలి.ధ్యానయోగులం కావాలి.మనకు అహం ఎక్కువ ఉంటుంది.నాకేమి తక్కువ?అందరి కంటే నేనే గొప్ప అనే భావం బయటకు చెప్పకపోయినా,లోలోపల ఉంటుంది చాలా మటుకు.ఆ అహంకారాన్ని,ఆ అజ్ఞానాన్ని ముందు వదిలి పెట్టాలి.అలాగే అభిమానము,దంభము,దర్పము,కామక్రోధాలను వదలి పెట్టాలి.మనము బయట,లోపల ఒకే రకంగా ఉండగలగాలి.అంటే మనం బయటకు ఎలా కనిపిస్తామో,మన అంతఃకరణంలోనూ అలాగే ఉండాలి.మమకారాలకు దూరంగా ఉండాలి.ఎందుకంటే అదే చాలాసార్లు అనర్థానికి హేతువు అవుతుంది.ఇలా త్రికరణ శుద్ధిగా,శాంత చిత్తంతో ఉన్నవాడే,ఉన్న నాడే బ్రహ్మభావానికి మనషి అర్హుడు అవుతాడు.
Sunday, 17 August 2025
సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ
సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తధాఽఽప్నోతి నిబోధ మే।
సమాసేనైవ కౌంతేయ!నిష్ఠా జ్ఞానస్య యాపరా॥50॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నడు.హే కౌంతేయ!హే అర్జునా!నేను నైష్కర్మ్య సిద్ధి అనగానే నీకు అర్థం కాలేదు అని నాకు అర్ధం అయింది.కామక్రోథ మద లోభాలకు అతీతంగా మనము ఆచరించ వలసిన పనులు మనము చేయటమే నిష్కామ కర్మ అని అంటారు.అలా కర్మానుష్టానం చేయటం వలన సిద్ధిని పొందగలతాము.ఇలా జ్ఞాన సిద్ధిని పొందిన వాడు యే విధంగా పరమాత్మను పొందుతాడో నీకు సవివరంగా చెబుతాను.
Saturday, 16 August 2025
అసక్త బుద్ధి స్సర్వత్ర
అసక్త బుద్ధి స్సర్వత్ర జితాత్మావిగతస్పృహః।
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి॥49॥
శ్రీమద్భగవద్గీత.।।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు ఓపికగా అర్జునుడికివివరిస్తున్నాడు.అర్జునా!సిద్ధిని ఎలా పొందాలో చెబుతాను.ఎవరు పొందగలరో కూడా చెబుతాను.మొదట విషయాసక్తి ఉండకూడదు.అంటే దత్తి,యావ..అవసరానికి మించి...ఆసక్తి ఉండకూడదు.అంతఃకరణం స్వచ్ఛంగా ఉంచుకోగలగాలి.అంటే ద్వంద్వాలు ఉండకూడదు.అటా,ఇటా,ఎటో...అంటూ మనసు సందిగ్థంలో ఊగిసలాడకూడదు.తనకంటూ కోరికలు లేకుండా,సమాజం,సంఘహితంకోసం పాటుపడాలి.స్పృహారహితంగా ఉండాలి.అంటే తపన,లాలస,కాంక్ష లేకుండా ఉండాలి.అన్నిటికంటే ముఖ్యంగా జ్ఞానమార్గంలో నడవాలి.అప్పుడేమనము నైష్కర్మ్యసిద్ధిని పొందగలతాము.మనం పనులు చేస్తున్నా,నిర్వికారంగా,మోహాపేక్ష లేకుండా చెయ్యాలి.మోహావేశం లేకుండా,ఫలాపేక్ష లేకుండా చేసినప్పుడే సిద్ధిని పొందగలతాము.
Friday, 15 August 2025
సహజం కర్మ కౌంతేయ
సహజం కర్మ కౌంతేయ సదోషమపి స త్యజేత్।
సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్ని రివావృతాః॥48॥
శ్రీమద్భగవద్గీత.।।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.దోషాలతో కూడుకున్నా మన స్వధర్మాన్ని మనం వదిలి పెట్టకూడదు అని చెప్పాడు కదా.అర్జునుడు అర్ధం కానట్లు బిక్క మొహం వేసాడేమో!
హే అర్జునా!హే కౌంతేయా!నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను.సహజకర్మలు,స్వధర్మాలు దోషాలతో ఉన్నా మనము ఎప్పుడూ విడిచి పెట్టకూడదు.ఎందుకు అని అడుగుతావా?చెబుతాను,విను.నిప్పు రాజెయ్యాలంటే,మొదలు మొదలు పొగ వస్తుంది కదా!అగ్ని నిలకడగా వ్యాపించేదాకా ఆ పొగ ఉంటుంది కదా!కట్టెలు పచ్చివి అయినా,సరిగ్గా రాజుకోక పోయినా పొగ ఉంటుంది కదా!అగ్ని పొగతో ఉన్నట్లుగానే సర్వధర్మాలూ ఏదో ఒక దోషంతో ఆవరింపబడి ఉంటాయి.కాబట్టి ఎంత సేపూ తప్పొప్పులు,దోషాలు వెతకకుండా,స్ధూలంగా జరిగే మంచికి ప్రాముఖ్యం ఇవ్వాలి.
Thursday, 14 August 2025
శ్రేయాన్ స్వధర్మో విగుణః
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్టితాత్।
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్॥47॥
శ్రీమద్భగవద్గీత..అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
మన వాళ్ళు మాములుగా అంటుంటారు కదా!కుక్క పని కుక్క,గాడిద పని గాడిద చెయ్యాలని!శ్రీకృష్ణుడు అర్జునుడి ముఖంగా మనందరికి కూడా చెబుతున్నాడు.అర్జునా!పార్థా!ఉత్తమ విథులతో చేసే పరధర్మానుష్ఠానం కంటే దోషభూయిష్టమయినా కూడా స్వధర్మాన్ని ఆచరించమే శ్రేయస్కరము,ఉత్తమము.చాలా సార్లు మనము రెంటికీ చెడ్డ రేవడి లాగా తయరు అవుతాము.అక్కడా ఇమడలేము,ఇక్కడా ఉండలేము.మనకు అన్వయించే ధర్మాన్ని నమ్ముకోవడమే ఎప్పటికైనా మంచిది.
Wednesday, 13 August 2025
యతః ప్రవృత్తిర్భూతానాం
యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్।
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధింవిందతి మానవః॥46॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సావధానంగా వివరిస్తున్నాడు.అర్జునా!ఇంత సేపూ నేను స్వాభావిక కర్మల ఆచరణ గురించి చెప్పాను కదా!దాని వల్ల లాభం కూడా చెబుతాను విను.ఈ లోకంలో అన్ని ప్రాణులను ఎవరు పుట్టిస్తారు?వాళ్ళ ఎదుగుదల,కర్మలను,లయాన్ని ఎవరు నిర్దేశిస్తారు?ఎవరు ఈ ముల్లోకాలనూ నిండి ఉన్నాడు?ఆ పరమాత్మయే కదా!
మానవుడు తనకు విధింపబడిన కర్మల ద్వారా ఆ పరమాత్మను ఆరాధన చెయ్యాలి.అలా చేస్తే ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధిని పొందుతారు.అలాగే కైవల్యాన్నీ పొందుతారు.
Tuesday, 12 August 2025
స్వే స్వే కర్మణ్యభిరతః
స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః।
స్వకర్మనిరత స్సిద్ధిం యథా విందతి తచ్ఛృణు॥45॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!నేను ఇప్పుడు నీకు మూడు రకాల కర్మల గురించి చెప్పాను కదా!దాని వల్ల ఏమి అర్థం అవుతుంది?అంటే మనము మన మన స్వభావ సిద్థమైన కర్మల పట్ల శ్రద్ధాసక్తులు కనబరచాలి.వాటికి అనుగుణంగా,ప్రతిఫలాపేక్షను వదలి ప్రవర్తించాలి.అలా ప్రవర్తించే ప్రతి మానవుడూ జ్ఞానమును సమకూర్చుకుంటాడు.అలాగే సిద్ధి,బుద్ధి పొందుతాడు.ఇందులో లేశమాత్రము అయినా అనుమానము లేదు.మోక్షానికీ,కైవల్యానికీ ఇదే మార్గము.
Monday, 11 August 2025
కృషి గోరక్ష వాణిజ్యం
కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్।
పరిచార్యాత్మకం కర్మశూద్రస్యాపిస్వభావజమ్॥44॥
శ్రీమద్భగవద్గీత.।।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!మనము బ్రాహ్మణ,క్షత్రియ కర్మల గురించి చెప్పుకున్నాము కదా!ఇప్పుడు వైశ్యులు,శూద్రుల కర్మల గురించి తెలుసుకుందాము.వ్యవసాయము,గోవుల రక్షణ,వ్యాపారము వైశ్యులకు స్వభావ కర్మలు.అలాగే సేవావృత్తి,సేవాతత్త్వం శూద్రులకు స్వభావ కర్మలు.
Sunday, 10 August 2025
శౌర్యం తేజో ధృతి ర్దాక్ష్యం
శౌర్యం తేజో ధృతి ర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్।
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్॥43॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి క్షత్రియ కర్మల గురించి వివరిస్తున్నాడు.అర్జునా!మనము బ్రాహ్మణకర్మల గురించి మాట్లాడుకున్నాము కదా!ఇప్పుడు క్షత్రియ కర్మల గురించి తెలుసుకుందాము.శౌర్యము అనగా శూరత్వము,పరాక్రమము,ధైర్యము అని అర్ధము.ఇది క్షత్రియులకు పుష్కలంగా ఉండవలసిన గుణము.అలాగే తేజస్సు,ధైర్యము అవసరము చాలా ఉంది.ఇకపోతే పిరికితనము అనేది కనుచూపు మేరల్లో ఉండకూడదు.యుద్ధంలో వెన్ను చూపి,పలాయనం చిత్తగించే గీర,అదే ఆలోచనా సరళి,అస్సలు దరిచేరనీయకూడదు.ధర్మపూర్వకము అయిన దానం చేసే గుణము ఉండాలి.ప్రభువు అనగా రాజు,పాలించేవాడు,స్వపరిపాలిన అందించేవాడికి ఉండే అన్ని శక్తులు,సద్గుణాలు ఉండాలి.ఇవన్నీ స్వభావతః క్షత్రియ కర్మలు.
Saturday, 9 August 2025
శమో దమ స్తప శ్శౌచం
శమో దమ స్తప శ్శౌచం క్షాంతి రార్జవమేవ చ।
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్॥42॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివిధ వర్ణాలకు సంబంధించిన కర్మల గురించి వివరించేదానికి ఉపక్రమించాడు.అర్జునా!స్వభావ సిద్ధమయిన గుణాలననుసరించి వివిధ వర్ణాలుగా విభజన జరిగింది అని చెప్పాను కదా!ఇప్పుడు వారికి నిర్దేశించిన కర్మలను చెబుతాను,విను.ఇంద్రియ (పంచేంద్రియాలు,మనసు)నిగ్రహణ,తపస్సు,శౌచం,క్షమ,ఋజు వర్తనం,శాస్త్ర జ్ఞానం,అనుభవ జ్ఞానం,ఆస్తిక్యత ....ఇలాంటి మంచి గుణాలు,సంపత్తులు స్వభావతః బ్రాహ్మణ కర్మలు.మన మనసు,మాట,కర్మలు అన్నీ ఒకే తాటి పైన ఉండడమే ఋజు వర్తనము అంటే.మనలో దేవుని ఉనికి పైన విశ్వాసము,ఇహ పర లోకాల గురించిన అవగాహనలను ఆస్తిక్యము అని అంటారు.శౌచము అనేది అందరికీ చాలా ముఖ్యమయినది.ఎందుకంటే ధర్మదేవతకు ఉన్న నాలుగు పాదాలలో శౌచము ఒకటి అని ధర్మరాజు చెప్పాడు.శౌచం అంటే శుచి,శుభ్రత అని అర్ధము.మన పరిసరాలు ఒక్కటే కాదు,మన శరీరాన్ని,మనసును,మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
Friday, 8 August 2025
బ్రాహ్మణ క్షత్రియవిశాం
బ్రాహ్మణ క్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప।
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః॥41॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఒక్కొక్కరికి స్వభావ సిద్థంగా కొన్ని కొన్ని గుణాలు అలవరతాయి.ఆ గుణాలను అనుసరించి వారికి కర్మలను వేరు వేరుగా విభాజించడం జరిగింది.సంఘంలో వారిని బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్రులుగా విభజించడం జరిగింది.
Thursday, 7 August 2025
న తదస్తి పృథివ్యాం వా
న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః।
సత్త్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిస్స్వా త్రిభిర్గుణైః॥40॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాథ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ప్రతి విషయానికీ నేను సాత్త్విక,రాజస,తమోగుణాలు,భావాలు,సుఖాలు అంటూ చెబుతున్నాను.అంటే ఈ భూమి పైన పుట్టిన ప్రతిజీవీ ఈ మూడింటిలోని ఏదో ఒక చట్రంలో ఇమిడి ఉంటుంది.ఎందుకంటే ఇవన్నీ ప్రకృతి వల్ల పుట్టిన గుణాలు.ఇవేవీ కాకుండా,వీటికి అతీతంగా ఏదీ కూడా ఎక్కడా మనకు కానరాదు.ఈ పరిస్థితి ఒక్క భూలోకంలోనే కాదు,స్వర్గలోకంలో,దేవతలలో కూడా కనిపిస్తుంది.
Tuesday, 5 August 2025
యదగ్రే చానుబంధే చ
యదగ్రే చానుబంధే చ సుఖం మోహన మాత్మనః।
నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామస ముదాహృతమ్॥39॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక,రాజస సుఖాల గురుంచి వివరించాడు.ఇంక తామస సుఖం మిగిలి ఉంది.ఇలా చెబుతున్నాడు.అర్జునా!నీకు సాత్త్విక,రాజస సుఖాలు బాగా అర్థం అయ్యాయి కదా!ఇంక తామస సుఖం గురించి చెప్పుకుందాము.ఇక్కడ మొదలు,ఆఖరు... అంతా మోహజనకంగా ఉంటుంది.నిద్ర,అలసత్త్వము,ప్రమాదాలతో కూడుకుని ఉంటుంది.ఎక్కడా ప్రశాంత చిత్తంతో,ఆలోచించి చేయడం అనే ప్రణాలిక,మనసు,తెలివి ఉండవు.ఇలా అడ్డూ,ఆపూ లేకుండా,విచక్షణా రహితంగా పొందే సుఖాన్నే తామస సుఖం అని అంటారు.ఇది ఆఖరుకు దుఃఖభాజనము అవుతుంది.
విషయేంద్రియ సంయోగాత్
విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రేఽమృతోపమం।
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్॥38॥
శ్రీమద్భగవద్గీత..అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక సుఖం గురించి చెప్పాడు.ఇప్పుడు రాజస సుఖం గురించి చెబుతున్నాడు.అర్జునా!మొదట్లో కష్టతరంగా ఉండి,నిరంతర సాధనతో అనంతమయిన ఆనందాన్ని ఇచ్చేది సాత్త్విక సుఖం అని చెప్పాను కదా!ఇప్పుడు రాజస సుఖం గురించి మాట్లాడుకుందాము.రాజస సుఖం అనేది ప్రధానంగా ఇంద్రియ సంయోగం వలన పుడుతుంది.మొదట అంతా రంజుగా,అమృత తుల్యంగా ఉంటుంది.కానీ,పోనుపోను విషతుల్యంగా మారుతుంది.కాబట్టి తస్మాత్ జాగ్రత్త!
Monday, 4 August 2025
సుఖం త్విదానీం త్రివిధం
సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ।
అభ్యాసా ద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్ఛతి॥36॥
యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమం।
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజమ్॥37॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓపికగా మూడు రకాలు అయిన ధృతుల గురించి వివరించాడు.ఇప్పుడు ఇంక మూడు రకాల సుఖాలను గురించి వివరించేదానికి సమాయత్తం అయ్యాడు.
హే భరత శ్రేష్టా!హే అర్జునా!నీకు ధృతి అంటే ఏమిటి?దానిలో రకాలు బాగా అర్థముఅయ్యాయి కదా!మనము ఇప్పుడు సుఖాలు,వాటిల్లో రకాలు గురించి చర్చించుకుందాము.నీకు ఎక్కడ అయినా అనుమానం వస్తే సంశయ నివృత్తి చేసుకో!
సుఖాలు స్థూలంగా మూడు రకాలు.వాటిల్లో మొదట నీకు సాత్త్విక సుఖం గురించి వివరిస్తాను.ఇది మొదట్లో విషతుల్యంగా ఉంటుంది.దుఃఖ భాజకంగా కూడా ఉంటుంది.ఇంత కష్టం,ఇంత నష్టం అవసరమా ?అని కూడా అనిపిస్తుంది.కానీ అభ్యాసం చేసేకొద్దీ సులభతరమవుతుంది.తినగ తినగ వేప తియ్యనగును అంటారు కదా!అలాగ!మనము మొదట్లో కష్టము,బాధాజనకము,దుఃఖ కారకము అనుకునేవి...చిన్న చిన్నగా అభ్యాసం చేసే కొద్దీ సులభతరం అవుతూ వస్తాయి.ఒకటొకటిగా ఇబ్బందులు తొలగి పోతుంటాయి.చివరకు వచ్చేటప్పటికి ఎనలేని ఆనందాన్నీ,ఆత్మ తృప్తినీ ఇస్తాయి.ఆ అమృతమయము అయిన బుద్ధితో జన్మించేదే సాత్త్విక సుఖము.
Saturday, 2 August 2025
యయా స్వప్నం భయం శోకం
యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ।
న విముంచతి దుర్మేధా ధృతి స్సా పార్థ!తామసీ॥35॥
శ్రీమద్భగవద్గీత..అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక ధృతి,రాజస ధృతి గురించి చెప్పాడు.ఇంక మిగిలింది తామస ధృతి కదా!దాని గురించి చెప్పడం మొదలు పెట్టాడు.హే పార్థా!హే అర్జునా!నేను నీకు చెప్పిన సాత్త్విక,రాజస ధృతులు బాగా అర్థం అయ్యాయి కదా!ఇంక ఇప్పుడు తామస ధృతి గురించి చర్చించు కుందాము.ఇక్కడ ముఖ్యంగా మూర్ఖపు పట్టుదలలు కానవస్తుంటాయి.ఒక విషయాన్ని సవ్యంగా ఆకళింపు చేసుకునే సమన్వయం అసలే ఉండదు.స్వప్నం,భయం,శోకం,విషాదం,గర్వం...ఇలా ఒకటి కాదు,సవా లక్ష కారణాలకు చలిస్తూ,ప్రభావితమవుతుంటారు.సానుకూల స్పందన కరవౌతుంటుంది.ఇన్ని అపసవ్యాలు ఉన్నా కూడా,తమ తమ మూర్ఖపు పట్టుదలలను వదిలి పెట్టరు.ఇలాంటి దాన్నే తామస ధృతి అంటారు.
Friday, 1 August 2025
యయాతు ధర్మకామార్థాన్
యయాతు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేఽర్జున।
ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి స్సా పార్థ!రాజసీ॥34॥
శ్రీమద్భగవద్గీత....అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.హే పార్థా!హే అర్జునా!మనము ఇప్పుడు మనో ఇంద్రియ నిగ్రహణ సాత్త్విక ధృతి అని మాట్లాడుకున్నాము కదా!అలాగే రాజస ధృతి గురించి నీలో అవగాహన పెంచుతాను,విను.ఇక్కడ అంతా పంతాలు,పట్టింపులు ఎక్కువగా,ప్రధాన పాత్ర వహిస్తాయి.ఈ పని చేస్తే లాభం ఎంత?ప్రతిఫలం మొత్తం నాకే దక్కుతుందా?లేక ఇతరులతో పంచుకోవాలా?అంతా చేస్తే నాకేంటి?అనే భావజాలం ఎక్కువ కనిపిస్తుంది.ధర్మార్ధకామాల యందు అధికంగా పట్టుదల ఉంటుంది.దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుంది?ధర్మం చేస్తే నాకేమి గిట్టుబాటు అవుతుంది?అంటే చేసే ప్రతి పనిలో లాభనష్టాల బేరీజు వేసుకుంటూ,ముందుకు పోతుంటారు.ఇలా అహంభావంతో,పట్టుదలలతో ఆలోచించడమే రాజస ధృతి.
Thursday, 31 July 2025
ధృత్యా యయాధారయతే
ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియాః।
యోగేనా వ్యభిచారిణ్యా ధృతి స్సా పార్థ!సాత్త్వికీ॥33॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివిధ రకాల బుద్ధుల గురించి చెప్పాడు.అలాగే రకరకాల ధృతుల గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాడు.ధృతి అంటే మన మాటల్లో ఓపిక అని అర్థము.ఓర్పు,సంకల్పబలము,నిగ్రహము,ధైర్యము,స్థిరత్వము...ఇలా చాలా అర్థాలు ఉన్నాయి.మొత్తానికి ధృతి అనేది మన మనోసంకల్పము,మనోబలమును,మనోధైర్యాన్ని సూచిస్తుంది.కృష్ణుడు అర్జునుడితో చెపుతున్నాడు.హే పార్థా!హే అర్జునా!సాత్త్విక ధృతి గురించి చెపుతాను,విను ..విని ఆకళింపు చేసుకో!మనసు,ప్రాణము,ఇంద్రియాలు ఉన్నాయి కదా!వాటన్నిటికీ వాటివాటి వృత్తులు,ప్రవృత్తులు ఉంటాయి కదా!వాటన్నిటినీ సరి అయిన మార్గములో నిగ్రహించ గలగాలి.మన లక్ష్యసాధనలో ఏదీ పక్కదారి పట్టకుండా,చెదిరిపోకుండా,నియంత్రణ చేయగలిగే పట్టుదలను సాత్త్విక ధృతి అని అంటారు.
Wednesday, 30 July 2025
అధర్మం ధర్మమితి యా
అధర్మం ధర్మమితి యా మన్యతే తమసాఽఽవృతా।
సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి స్సా పార్థ!తామసీ॥32॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ఞుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.హే పార్థా!హే అర్జునా!ఇప్పుడిప్పుడే మనము సాత్త్విక,రాజస బుద్ధుల గురించి మాట్లాడుకున్నాము కదా!ఇప్పుడు నీకు ఇంక తామస బుద్ధి యొక్క పూర్వాపరాలు వివరిస్తాను.ఈ తామస బుద్ధి అనేది ఉందే,అది అంతా అస్తవ్యస్తంగా,గందరగోళంగా ఉంటుంది.అందుకే మామూలుగా వక్రబుద్ధి అని కూడా అంటుంటాము.దేనినీ సవ్యంగా,న్యాయపరంగా,మంచిగా ఆలోచించదు.అధర్మాన్ని ధర్మపథంలాగా అన్వయించుకుంటుంది.ఏ విషయము అయినా సీదా సాదాగా తీసుకోదు.వక్రంగా,అపసవ్యంగా ఆలోచిస్తుంది,గ్రహిస్తుంది.ఇలాంటి విపరీతమయిన భావజాలం కలిగి ఉండేదే తామస బుద్ధి అంటే!
Sunday, 27 July 2025
యయా ధర్మమధర్మం
యయా ధర్మమధర్మం చ కార్యం చా కార్యమేవ చ।
అయథావ త్ప్రజానాతి బుద్ధిస్సా పార్థ!రాజసీ॥31॥
శ్రీమద్భగవద్గీత..అష్టదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు ఇప్పుడిప్పుడే అర్జునుడికి సాత్వికబుద్ధి గురించి వివరించాడు.ఇప్పుడు ఇంక రాజస బుద్ధి గురించి చెప్పటం మొదలుపెట్టాడు.హే పార్థా!హే అర్జునా!సాత్విక బుద్ది అంటే ఎలా ఉంటుందో అర్థం అయింది కదా!రాజస బుద్ధి ఎలా ఉంటుందో చెబుతాను విను.ధర్మము-అధర్మము,కార్యము-అకార్యము..ఇలా ద్వంద్వాలు ఉన్నాయి కదా!వీటి అసలు అయిన జ్ఞానాన్నీ, అర్థాన్ని గుర్తించటంలో పప్పులో కాలు వేస్తారు.అంటే తప్పుగా అర్థం చేసుకుంటారు అన్నమాట!తపొప్పుల విశ్లేషణలో చతికిలా పడతారు.ఇలాంటి బుద్ధిని రాజస బుద్ధి అని అంటారు.
Thursday, 24 July 2025
ప్రవృత్తిం చ నివృత్తిం చ
ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే।
బంధం మోక్షం చ యావేత్తి బుద్ధి స్సా పార్ధ!సాత్త్వికీ॥30॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి తీరికగా,ఓపికగా వివరిస్తున్నాడు.అర్జునుడికి ఇప్పుడు తను రణరంగం మధ్యలో ఉన్నాననే స్పృహ లేనే లేదు.ఎందుకంటే కృష్ణుడు చెప్పే విషయాల పైన అంత లీనమైపోయి వింటున్నాడు.లోకంలో ఉండే సమయం అంతా వాళ్ళిద్దరే పంచుకున్నట్లుగా ఉంది!అర్జునా!నీకు ఇప్పుడు నేను సాత్విక బుద్ధి గురించి వివరిస్తాను.ధర్మము-అధర్మము,ప్రవృత్తి-నివృత్తి,కర్తవ్యము-అకర్తవ్యము,భయము-అభయము,బంధనము-మోక్షము...ఈ ద్వంద్వాలను అన్నిటినీ సుస్పష్టంగా తెలుసుకునే జ్ఞానం కలిగి ఉండటమే సాత్త్విక బుద్ధి.
Wednesday, 23 July 2025
బుద్ధేర్భేదం ధృతేశ్చైవ
బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణత స్త్రివిధం శృణు।
ప్రోచ్యమాన మశేషేణ పృథక్త్వేన ధనంజయ॥29॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తల గురించి చెప్పాడు.ఇప్పుడు ఇంక రకరకాల బుద్ధుల గురించి వివరించబోతున్నాడు.హే అర్జునా!హే ధనంజయా!నీకు కర్తల గురించి ఇప్పుడే చెప్పాను కదా!ఇంక రకరకాల బుద్ధుల గురించి కూడా విశదీకరిస్తాను.మంచిగా,మనసు పెట్టి విను.మనుష్యుల బుద్ధి అందరికీ ఒకేలాగా ఉండదు.గుణ భేదాల కారణంగా మూడు రకాలుగా విభజించ బడింది.అలాగే ధృతి కూడా!ధృతి అంటే చెబుతాను,విను.ధృతి అంటే స్థైర్యం అని అర్థం.ఒక లక్ష్యాన్ని ఛేదించేదానికి కావలసిన స్ధైర్యం,ధైర్యం,ఓర్పు,ధృఢత్వం...వీటన్నిటినీ కలిపి ధృతి అని అంటారు.
Tuesday, 22 July 2025
అయుక్తః ప్రాకృతః స్తబ్ధః
అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోఽలసః।
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే॥28॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!నీకు ఇప్పుడు సాత్త్విక,రాజస కర్తల గురించి చెప్పాను కదా!ఇంక మనము తామస కర్తల గురించి చెప్పుకుందాము.వీళ్ళకు ధైర్యము ఉండదు.ఆత్మస్ధైర్యము అసలే ఉండదు.మూర్ఖపు పట్టుదలలు,అభిమానాలు సదా ఆవహించి ఉంటాయి.మోసాలకు పాల్పడే గుణం పుష్కలంగా ఉంటుంది.ఎంత సేపూ దిగేడుస్తూ ఉంటారు ఎదుటి వారి ఆనందం చూసి,తమ ఓటమి తలచుకుంటూ.సమయపాలన అసలు పాటించరు.వృధాగా కాలయాపన చేసేదానికి ముందు వరసలో ఉంటారు.ఏ పనినీ ఇష్టంగా,మనసు పెట్టి చేయరు.ఇలా పని చేసేవాడిని తామస కర్త అని అంటారు.
Monday, 21 July 2025
రాగీ కర్మఫలప్రేప్సుః
రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకోఽశుచిః।
హర్ష శోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః॥27॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో చెబుతున్నాడు.అర్జునా!మనం ఫలాపేక్ష మాని,స్థిర చిత్తంతో కర్మలను ఆచరించేవాడు సాత్త్విక కర్త అని మాట్లాడుకున్నాము కదా!అలానే రాజస కర్త ఎలా ఉంటాడో చెబుతాను విను.ఇక్కడ తను చేసే ప్రతి పని యొక్క ఫలితం,అదే లాభనష్టాలు తనకే దక్కాలి అనే మానసిక స్థితిలో ఉంటాడు.అణువణువునా అహంకారము,అభిమానము,లోభగుణము తొణికిస లాడుతుంటాయి.తను అనుకున్న పని తను అనుకున్నట్లే జరగాలి అనే తపనలో హింసాపరుడు అవుతాడు.తన పని త్వర త్వరగా జరిగి పోవాలి అనే ఆదుర్దాలో శుచిని పాటించడు.అశుచిగా చేస్తుంటాడు.సుఖం వస్తే ఎగిరి గంతులేసి ఊరంతా సంబరాలు చేయడం,దుఃఖం వస్తే ముసుగేసుకుని,మూలన కూర్చొని దిగేడవడము చేస్తుంటాడు.అంటే ఫలితాలకు అలా విపరీతంగా చలిస్తూ ఉంటాడు.రెండిటినీ ఒకే రకంగా తీసుకోగలిగే స్ధిరచిత్తం, సమన్వయ శక్తి ఉండదు.ఇలాంటి నేపధ్యంలో కర్మలు ఆచరించే వారిని రాజస కర్త అని అంటారు.
Friday, 18 July 2025
ముక్తసంగోఽనహంవాదీ
ముక్తసంగోఽనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః।
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తాసాత్త్విక ఉచ్యతే॥26॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు వివిధ రకాల జ్ఞానాలు,కర్మల గురించి చెప్పాడు.ఇప్పుడు అర్జునుడికి కర్తల గురించి చెబుతున్నాడు.అర్దునా!మనం మూడు రకాల జ్ఞానములు,కర్మల గురించి ప్రస్తావించుకున్నాము కదా!ఇప్పుడు నీకు కర్తల గురించి కూడా చెబుతాను.మనసు పెట్టి విను.కర్త అంటే పని చేసేవాడు అని అర్థం కదా.సాత్త్విక కర్త ఎలా ఉండాలో,ఎలా ఉంటాడో చెబుతాను.మొట్ట మొదటగా అతను ఫలాపేక్షను వదిలి పెట్టాలి.అహంకారము ఇసుమంత కూడా ఉండకూడదు.తను చేసే కర్మల యొక్క ఫలితంలోని మంచి చెడ్డలకు తొణకకుండా,బెణకకుండా ఉండాలి.అంటే పర్యవసానము మనకు అనుకూలమా,ప్రతికూలమా అనే మీమాంస వదిలి పెట్టాలి.అంటే ఎలాంటి వికారాలకూ లోను కాకుండా,మనకు నిర్దేశించిన కార్యాలను మనసా,వాచా నిర్వర్తించాలి.ఆ కార్య నిర్వహణలో ఎలాంటి అనుకోని కష్ట నష్టాలు వచ్చినా,ఎదుర్కునే మానసిక స్థిరత్వం అలవరచుకోవాలి.చెయ్యాల్సి వచ్చిందే రామచంద్రా!అని విసుక్కుంటూ చేయకూడదు.మన కర్తవ్యాన్ని రెట్టింపు ఉత్సాహంతో చేపట్టాలి.దాని పర్యవసానం మనకు అనుకూలంగా ఉంటుందా,ప్రతికూలంగా ఉంటుందా అనే విషయంగా తర్జన భర్జనలను వదిలేసి,ఫలితం ఏమైనా ఊపు,ఉత్సాహంగా,నమ్మకంతో కార్య నిర్వహణ చేయాలి.అలాంటి వాడిని సాత్త్విక కర్త అని అంటారు.
Thursday, 17 July 2025
అనుబంధం క్షయం హింసా
అనుబంధం క్షయం హింసా మనపేక్ష్య చ పౌరుషమ్।
మోహా దారభ్యతే కర్మ యత్త త్తామస ముచ్యతే॥25॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక,రాజస కర్మలగురించి చెప్పాడు.ఇప్పుడు ఇంక తామస కర్మ గురించి వివరిస్తున్నాడు.అర్జునా!సాత్త్విక కర్మలు అంటే ఫలాపేక్ష,రాగద్వేషాలకు అతీతంగా చేసేవి,రాజస కర్మలు అంటే కర్మఫలాసక్తి,అహంకారాలతో చేసేవి అని చెప్పాను కదా!ఇప్పుడు ఇంక తామస కర్మల గురించి మాట్లాడుకుందాము.ఇక్కడ వ్యవహారం అంతా గొడ్డొచ్చి చేలో పడినట్లు ఉంటుంది.ఒక పని చేసే ముందు మంచి చెడ్డా ఆలోచించరు.కష్ట నిష్టూరాలను పరిగణలోకి తీసుకోరు.కామ రాగ మోహాలకు లోనై,మానసిక పరిపక్వత లేకుండా,మూర్ఖంగా కర్మలను ఆచరిస్తారు.ఇలాంటి వాటినే తామస కర్మలు అని అంటారు.
Tuesday, 15 July 2025
యత్తు కామేప్సునా కర్మ
యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః।
క్రియతే బహులాయాసం తద్రాజస ముదాహృతమ్॥24॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక కర్మల గురుంచి ఇప్పుడే చెప్పాడు.ఇంక ఇప్పుడు రాజస కర్మల గురించి ప్రస్తావిస్తున్నాడు.అర్జునా!సాత్త్విక కర్మలు అనేవి ఫలాపేక్ష రహితంగా చెయ్యాలని అర్థం అయింది కదా!ఇప్పుడు మనము రాజస కర్మల పూర్వాపరాలు మాట్లాడుకుందాము.ఇక్కడ వీరు చేసే ప్రతి పని దాని వలన వచ్చే లాభం గురించి బేరీజు వేసుకుని చేస్తారు.లాభం లేకపోతే పూచిక పుల్ల కూడా తీసి ప్రక్కన పెట్టరు.అహంకారానికి,గర్వానికి పోయి చేస్తారు.ఆ పనులు వారికి ఎంత కష్టమయినా గొప్పల కోసం చేస్తారు.అంటే అందరూ ఆహా!ఓహో! అని తమ గురించి అనుకోవాలనే తపన నరనరాన కనిపిస్తూ ఉంటుంది.ఇలా కర్మ ఫలాసక్తితో,అహంకార అభిమానాలతో చేసే మిక్కిలి కష్ట సాధ్యమయిన పనులను రాజస కర్మలు అని అంటారు.
Monday, 14 July 2025
నియతం సంగరహితం
నియతం సంగరహిత మరాగద్వేషతః కృతమ్।
అఫలప్రేప్సునా కర్మ యత్త త్సాత్త్విక ముచ్యతే॥23॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి మూడు రకాల ధర్మాల గురించి వివరించాడు.అర్జునా!ఇప్పుడు అర్థము అయిందా,మొదటగా ఫలాపేక్షను వదలగలగాలి మానవుడు అని. ఫలాపేక్షను వదిలి పెట్టి,అభిమానము,రాగము,ద్వేషము అనే భావాలకు దూరంగా,అతీతంగా ఉండాలి.ఎందుకంటే ఆ మనోస్థితిలో ఉండి చేసే విధిహిత కర్మలే సాత్త్విక మయిన కర్మలు.అంటే మన మానసిక ధృఢత్వాన్ని అంచెలంచెలుగా పెంచుకోవాలి.ఎందుకంటే స్థితప్రజ్ఞత అనేది అనుకోగానే రాదు.దానికోసం మనము సాథన చేయాలి.
Sunday, 13 July 2025
యత్తు కృత్స్నవదేకస్మి
యత్తుకృత్స్నవదేకస్మి న్కార్యే సక్తమహైతుకమ్।
అతత్త్వార్థవదల్పం చ త త్తామస ముదాహృతమ్॥22॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక జ్ఞానం,రాజస జ్ఞానం గురించి చెప్పాడు.ఇంక తామస జ్ఞానం గురించి చెబుతున్నాడు.అర్జునా!ఇప్పుడే నీకు సాత్త్విక,రాజస జ్ఞానాలగురించి చెప్పాను కదా!తామస జ్ఞానంఅనేది ఏ రీతిలో ఉంటుందో కూడా తెలుసుకో!ఈ కోవకు చెందిన వారు ఏది చూసినా,అదే అంతా సర్వస్వం అనుకుంటారు.ఒక దేహాన్ని చూసినా,ఒక వస్తువును చూసినా దాని చుట్టూరా భ్రమిస్తుంటారు.ఈ రకంగా తలచే తత్త్వ విరుద్ధము అయిన జ్ఞానాన్నే తామస జ్ఞానము అని అంటారు.అంటే ఒక రకంగా చెప్పాలంటే బావిలో కప్పలాగా అన్నమాట.వారి ప్రపంచము చాలా చిన్నది.ఒక మనిషిని కానీ,ఒక వస్తువును చూస్తే,దాని చుట్టూరానే వాళ్ళ ఆలోచనలు,కర్మలు,క్రియలు తిరుగుతుంటాయి.వాటినిదాటి విశాల విశ్వం,విశ్వంభరుడు గురించి తెలుసుకునే సమయం,జిజ్ఞాస,ఆలోచన వాళ్ళకు ఉండవు,అంటవు.
Saturday, 12 July 2025
పృథక్త్వేన తు యద్ జ్ఞానం
పృథక్త్వేన తు యద్ జ్ఞానం నానాభావాన్పృథగ్విధాన్।
వేత్తి సర్వేషు భూతేషు తద్ జ్ఞానం విద్ధి రాజసమ్॥21॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇప్పుడే చెప్పాడు కదా అన్ని భూతాలలో ఉండే ఆత్మ ఒకటే అని గ్రహించ గలిగే జ్ఞానము సాత్త్విక జ్ఞానము అని.ఇప్పుడు ఇంక రాజస జ్ఞానము గురించి చెబుతున్నాడు.అర్జునా!రాజస జ్ఞానము అంటే ఏందో చెబుతాను విను.ఇక్కడ విడివిడిగా కనిపించే భూతాలు చాలా లెక్కకు మిక్కిలి ఉంటాయి కదా!వాటన్నిటిలోనూ ఆత్మలు కూడా వేరు వేరుగా ఉంటాయని అనుకోవడమే రాజస జ్ఞానము అని అంటారు.
Friday, 11 July 2025
సర్వభూతేషు యేనైకం
సర్వభూతేషు యేనైకం భావ మవ్యయ మీక్షతే।
అవిభక్తం విభక్తేషు తద్ జ్ఞానం విద్ధి సాత్త్వికమ్॥20॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్దునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఇప్పుడే చెప్పుకున్నాము కదా జ్ఞానము,కర్మ,కర్త మూడేసి రకాలుగా ఉంటాయి అని.ఇప్పుడు మనము సాత్త్విక మయిన జ్ఞానము గురించి మాట్లాడుకుందాము.భూతాలు అన్నీ ఒకే రకంగా ఉండవు కదా!అన్నీ వేరు వేరుగా కనిపిస్తుంటాయి కదా?కానీ నీకు ఈ విషయం తెలుసా?అన్నిటిల్లోనూ నాశనం లేనిది,మార్పు లేనిది ఒకటి ఉంటుంది.అదే ఆత్మ!ఆ ఆత్మను గ్రహించ గలగటము అనేది చాలా పెద్ద ప్రక్రియ.ఈ వేరు వేరుగా కనపడే అన్ని భూతాలలోనూ అవినాశము,మార్పు లేక ఒక్కటిగా ఉండే ఆత్మను గ్రహించే జ్ఞానమే సాత్త్విక జ్ఞానము.
Thursday, 10 July 2025
జ్ఞానం కర్మ చ కర్తా చ
జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః।
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథాచ్ఛృణు తాన్యపి॥19॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
గురువుకు ఎంత ఓపిక ఉండాలి,ఎంత విషయ పరిజ్ఞానము ఉండాలి,దానిని శిష్యుని పరిణితికి తగినట్లుగా ఎలా విశదీకరించాలి అనేది మనకు శ్రీకృష్ణుడిని చూస్తే అర్థం అవుతుంది.అతను అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!జ్ఞానము,కర్మ,కర్త అనేవి సాంఖ్యా శాస్త్రము ప్రకారము మూడేసి విధాలుగా ఉన్నాయి.వాటిని కూడా నీకోసం వివరంగా విశదీకరిస్తాను.మనసు పెట్టి అర్థం చేసుకునేదానికి ప్రయత్నించు.
Wednesday, 9 July 2025
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా।
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మ సంగ్రహః॥18॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మలు,వాటి ప్రోత్సాహకాలు గురించి వివరిస్తున్నాడు.అర్జునా!రకరకాలు అయిన కర్మలను ప్రోత్సాహ పరచే కారణాలు మూడు ఉన్నాయి.అవి జ్ఞానము,జ్ఞేయము మరియు పరిజ్ఞాత.అలాగే కర్మ సంగ్రహము కూడా మూడు విధాలు ఉన్నాయి.అవి కర్త,కర్మ మరియు సాధనము.
జ్ఞానము అంటే విషయ పరిజ్ఞానము,విచక్షణ,పాండిత్యము.జ్ఞేయము అంటే తెలుసుకోవలసిన విషయము అని అర్థము.పరిజ్ఞాత అంటే అన్నీ తెలిసిన వ్యక్తి అని అర్థము.
Monday, 7 July 2025
యస్య నాహం కృతో భావో
యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే।
హత్వాపి స ఇమాం ల్లోకాన్న హంతి న నిబధ్యతే॥17॥శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి అంతా మంచిగా అర్థం కావాలని తాపత్రయ పడుతున్నాడు.అందుకే ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!మనిషికి కర్తృత్వం పట్ల మమకారం ఉండకూడదు.అహం అనేది అసలే ఉండకూడదు.అంటే అంతా నేనే చేస్తున్నాను,అంతా నాదే,అంతా నా చెప్పు చేతల్లో ఉంది అనే భావన,అహంకారము.ఎందుకంటే ఇవంతా మన అజ్ఞానానికి కొండ గుర్తులు.
కాబట్టి కర్తృత్వం పట్ల అహం లేని వాడూ,నేనే చేస్తున్నా అని అనుకునే అజ్ఞానం లేని వాడు చాలాగొప్ప.అతను ఈ లోకంలో అందరినీ తుద ముట్టించినా,ఆ పాపం అతనికి అంటదు.ఎందుకంటే అతని చర్యల్లో ప్రతిఫలాపేక్ష ఉండదు.స్వలాభం ఉండదు.అతను లోక కల్యాణం కోసమే చేస్తాడు కాబట్టి.
Friday, 4 July 2025
తత్రైవం సతి కర్తారం
తత్రైవం సతి కర్తార మాత్మానం కేవలం తు యః।
పశ్య త్యకృతబుద్ధిత్వా న్న స పశ్యతి దుర్మతిః॥16॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!కొన్ని పచ్చి నిజాలు ఉంటాయి.మనము వాటిని ఒప్పుకున్నా,ఒప్పుకోకపోయినా నిత్యము,సత్యము అయిన వాటిలో మార్పులు,చేర్పులు ఉండవు.మనము చేసే సమస్త కర్మలకూ ఆ అయిదే కారణము అనేది సత్యము,నిత్యము.కానీ బుద్ధి పరిపక్వత లేని వాడు అలా ఆలోచించడు,నమ్మడు.అన్నిటికీ కారణభూతుడు తానే అనే భ్రమలో,అహంకారంతో ఊగిసలాడుతుంటాడు.అపరిపక్వంగా ఆలోచించేవాడే అలా ఉంటే దుష్టబుద్ధి గలవారు,చెడుభావాలు కలవారు ఇంక ఎంతలా ఆలోచిస్తారో మన ఊహకే అందదు.
కాబట్టి మానవుడు అహంకారము,కామము,క్రోధము వదలక పోతే సన్నార్గములోకి రాలేడు అనేది ముమ్మాటికీ నిజము.
Thursday, 3 July 2025
శరీరవాజ్ఞ్మనోభి ర్యక్కర్మ
శరీరవాజ్ఞ్మనోభి ర్యత్కర్మ ప్రారభతే నరః।
న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః॥15॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి బాగా అర్థం కావాలని ఇంకా విపులంగా చెబుతున్నాడు.ఓ అర్జునా!నిజానికి నేను పైన చెప్పినట్లు శరీరం,అహంకారం,ఇంద్రియాలు,ప్రక్రియా పరమైన వివిధ కార్యాలు,పరమాత్మ ...ఈ అయిదే కర్తృత్వాన్ని నిర్వహిస్తున్నాయి.మనస్సు,వాక్కు,శరీరాలతో మనము చేసే ప్రతి ఒక్క గొప్పపనికి,నీచము అయిన పనికి ఈ అయిదే కారణాలు అని మర్చిపోవద్దు.కానీ అందరికీ ఈ విషయం అర్థం కావాలంటే బుద్ధి పరిపక్వత చెంది ఉండాలి కదా!అది అందరికీ ఉండదు కదా!బుద్ధి పరిపక్వత చెందనివాడూ,చెడుభావాల సుడిగుండంలో ఇరుక్కుపోయినవాడూ ఈ సాంఖ్య శాస్త్రాన్ని ససేమిరా నమ్మడు.అన్నిటికీ కర్త,కర్మ,క్రియ తానే అని భావిస్తూ,అజ్ఞానంలో మునిగి తేలుతుంటాడు.ఆ మాయలో మనిషి ఉన్నంతకాలం,అహంకారం అణువణువునా తొణికిసలాడుతుంటుంది.అతడు ఇక అంతా నేనే,నన్ను మించినవాడు లేడు ఈ ముల్లోకాలలో లేనే లేడు అనే మిడి మిడి జ్ఞానంతోనే సంచరిస్తూ ఉంటాడు.
Wednesday, 2 July 2025
అధిష్ఠానం తథా కర్తా
అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్।
వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమమ్॥14॥
శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇంకా వివరంగా చెబుతున్నాడు.అర్జునా!మనస్సు,వాక్కు,శరీరాలతో మనిషి చేసే సమస్తము అయిన ఉచ్ఛ నీచ కర్మలకూ ఈ అయిదే కారణము.మనము గొప్ప పనులు చేసినా కారణం అవే.అలాగే నీచ,నికృష్టమయిన పనులు చేసినా ఆ అయిదే కారణము.ఆ అయిదు ఏందో మళ్ళీ చెబుతాను నీ కోసం,విను.అవి శరీరము,అహంకారము,పంచేంద్రియాలు,ప్రక్రియాపరము అయిన వివిధ కార్యాలు,పరమాత్మ.
Monday, 30 June 2025
పంచైతాని మహాబాహో
పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే।
సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్॥13॥
అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్।
వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమమ్॥14॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!సాంఖ్య శాస్త్రము ఏమి చెబుతుందో కూడా తెలిసుకుందాము మనము.అన్ని కర్మలకూ కారణం ఏందో ఈ శాస్త్రం మనకు విశదీకరిస్తుంది.శరీరం,అహంకారం,పంచేంద్రియాలు,ప్రక్రియాపరమైన వివిధ కార్యాలు,పరమాత్మ....అనబడే ఈ అయిదే,సమస్త కర్మలకూ కారణాలు అని సాంఖ్య శాస్త్రము చెబుతుంది.
Sunday, 29 June 2025
అనిష్ట మిష్టం మిశ్రం చ
అనిష్ట మిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్।
భవ త్యత్యాగీనాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్॥12॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ఞుడు అర్జునుడికి కర్మఫలాల గురించి వివరిస్తున్నాడు.అర్జునా!మనము ఇప్పుడు రకరకాల కర్మల గురించి,త్యాగాల గురించి చెప్పుకున్నాము కదా!ఇక కర్మ ఫలాల గురించి మాట్లాడుకుందాము.ఇష్టానిష్ట మిశ్రమములు అని కర్మ ఫలాలు మూడు రకాలు ఉన్నాయి.కామన గల వారికి ఆ ఫలాలు,ఫలితాలు పరలోకంలో అందుతాయి.అదే మనము కర్మ ఫలత్యాగుల గురించి మాట్లాడుకుందాము.కర్మ ఫలత్యాగులకు యెప్పుడూ ఆ ఫలితాలు తగులవు.అంటే అంటవు.తామరాకు మీద నీటి బొట్టు చందాన ఉంటుంది.
Saturday, 28 June 2025
న హి దేహభృతా శక్యం
న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్య శేషతః।
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీ త్యభిదీయతే॥11॥
శ్రీమద్భగవద్గీత.।।అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు భగవంతుడు.ఆయనకు మానవుల బలాలు,బలహీనతలు అన్నీ క్షుణ్ణంగా చెలుసు.ఆయన అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!దేహధారులకు కర్మలను అన్నిటినీ విడవటం అసాథ్యం.అది కూడని పని అని నాకూ తెలుసు.అందువల్ల నేను ఏమి చెబుతానో విని అర్థం చేసుకో.కర్మలను వదలడం పూర్తిగా మానవమాత్రులకు కుదరదు కాబట్టి,కనీసం కర్మఫలాన్ని వదులుకోగలగాలి.అలా కర్మఫలాన్ని వదలగలిగిన వాడే త్యాగి అని నా భావము.
Subscribe to:
Comments (Atom)